లోకేష్ పాదయాత్రలో విధ్వంసానికి కుట్ర.. సజ్జల వ్యూహం ఇదేనా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. మంగళగిరిలో అయితే ఆయన పాదయాత్ర జన సంద్రాన్ని తలపించింది. నియోజకవర్గ ప్రజలంతా లోకేష్ వెంట నడిచారా అన్నట్లుగా ఆయన పాదయాత్ర సాగింది. దీంతో అధికార వైసీపీలో ఖంగారు మొదలైంది. ఆయన పాదయాత్ర విజయవాడలో అడుగుపెట్టడానికి ముందే ప్రభుత్వ సలహాదారు విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ మీదే.. ఇక లోకేష్ పాదయాత్రకు ఎలా అడ్డంకులు సృష్టిస్తారో మీ ఇష్టం అన్నట్లుగా సజ్జల అభ్యర్థుల ప్రకటన ఉంది.  విజయవాడ ఈస్ట్ అభ్యర్థిగా దేవినేని అవినాష్,  సెంట్రల్ అభ్యర్థిగా మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లిని ఖరారు చేశారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. నిన్న మొన్నటి వరకూ ఈ ఇద్దరికీ టిక్కెట్లు అనుమానమే అంటూ పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. లోకేష్ పాదయాత్ర బెజవాడలోకి ప్రవేశించే సమయానికి వైసీపీ వ్యూహం మార్చేసింది. ఎనిమిది తొమ్మిది నెలల తరువాత జరిగే ఎన్నికలలో విజయం కంటే..   లోకేష్ పాదయాత్రకు విజయవాడ లో  అవరోధాలు కల్పించడమే ముఖ్యమని భావించింది. అందుకే అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు ప్రకటించే సంప్రదాయాన్ని కాదని మరీ   సజ్జల చేతే అభ్యర్థులను ప్రకటించేశారు. పార్టీ టికెట్ ఖరారైంది కనుక దేవినేని అవినాష్, మల్లాది, వెల్లంపల్లిలకు లోకేష్ పాదయాత్రలో అవరోధాలు కల్పించడమనే బాధ్యతను అప్పగించినట్లు చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు సజ్జల ప్రకటన శంఖంలో పోసిన చందంగా జగన్ కూడా ఆమోదం తెలపాలంటే.. ఈ ముగ్గురూ లోకేష్ పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా అడ్డుకుని తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవలసి ఉంటుందన్నమాట. ఒక వేళ ఆ విషయంలో వారు విఫలమైతే జగన్ రేపు మీరు అభ్యర్థులు కాదని తన గొంతుతో ప్రకటించే అవకాశాలున్నాయి.. అలాగే ఒక వేళ సక్సెస్ ఫుల్ గా లోకేష్ పాదయాత్రకు వారు ఆటంకాలు కల్పించి, దాడులకు పూనుకున్నా..పార్టీ టికెట్లు వారికే ఖరారౌతాయన్న నమ్మకం లేదని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే టికెట్లు ప్రకటించేందుకు సజ్జలకు ఎటువంటి అధికారమూ లేదు. ఆ ప్రకటనే జగన్ నుంచి రావాల్సి ఉంటుంది. వాడుకుని వదిలేయడమన్నది వైసీపీ డీఎన్ఏ లో ఉందనీ, అందుకే ఇప్పుడు సజ్జల ప్రకటనతో బెజవాడ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థుల ప్రకటన సజ్జలతో చేయించడమే ఇందుకు నిదర్శనమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ అభ్యర్థుల ప్రకటన ద్వారా లోకేష్ పాదయాత్ర సజావుగా సాగకుండా అవరోధాలు కల్పించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.  మరో రెండు రోజుల్లో  లోకేష్ పాదయాత్ర విజయవాడలో ప్రవేశిస్తుంది. అక్కడ మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. సజ్జల హడావుడిగా విజయవాడలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం వెనుక లోకేష్ పాదయాత్రకు అవరోధాలు కల్పించే కుట్ర, వ్యూహం ఉన్నాయని తెలుగుదేశం నాయకులు, శ్రేణులు కూడా అంటున్నాయి. ఇప్పుడు సజ్జల ప్రకటించిన  విజయవాడ వెస్ట్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ తొలి క్యాబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఎంత యథేచ్ఛగా జరిగాయో తెలిసిందే. అన్ని విధాలుగా ఆమాత్యుడిగా విఫలమయ్యారన్న కారణంతోనే ఆయనను జగన్ మంత్రి పదవి నుంచి తప్పించారని అప్పట్లో వైసీపీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక బెజవాడ సెంట్రల్ నియోజవకర్గ అభ్యర్థిగా ఇప్పుడు సజ్జల ప్రకటించిన మల్లాది విష్ణు గత ఎన్నికలలో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తరువాత బెజవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ ను సజ్జల ప్రకటించారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బొప్పన భవకుమార్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ ను రంగంలోకి దించుతున్నట్లు సజ్జల ప్రకటించారు. మొత్తం మీద విజయవాడ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను ఇంత హడావుడిగా ప్రకటించడం వెనుక లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వారికి లైసెన్స్ ఇవ్వాలన్న లక్ష్యమే కారణమని పరిశీలకులు, తెలుగుదేశం శ్రేణులే కాదు.. బెజవాడ వాసులు కూడా అంటున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా విజయవాడలో వైసీపీ శ్రేణులు ఈ ముగ్గురి నాయకత్వంలో విధ్వంసానికి, దాడులకు తెగబడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

వంగవీటి రాధ వివాహం..జనసేన నేత కుమార్తెతో

వంగ‌వీటి రాధా కృష్ణ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగ‌త వంగ‌వీటి  రంగా కుమారుడిగా ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసి వంగవీటి రాధాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాతికేళ్ల పిన్న వయస్సులోనే  (2004 ) ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైయ్యారు.  విజ‌యవాడ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఎదిగారు. ఇంత కరిష్మా గ‌ల రంగకు అభిమానుల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే. వంగవీటి రాధ రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. అటువంగటి నేత  పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ముగింపునకు వచ్చేశాయి. వంగవీటి రాధా పెళ్లికి ముహూర్తం కుదిరింది. నిశ్చితార్ధం ఈ నెల19, వివాహం వచ్చేనెల 6న జరుగుతుంది. ఇంతకీ ఆయన వివాహమాడబోయేది   ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా  నరసాపురం మున్సిపల్మాజీ  ఛైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జి ల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని.  ప్రస్తుతం వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో   ఆయ‌న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సహజంగానే ఆయన వియ్యమొందబోయే కుటుంబ రాజకీయ నేపథ్యం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇంతకీ వంగవీటి రాధ వివాహమాడబోయే పుష్పవల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందా? అంటే ఉంది. ఆమె తల్లి నరసాపురం మాజీ చైర్ పర్సన్. ప్రస్తుతం పుష్పవల్లి కుటుంబం జనసేనలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నది. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ వారి ఇంట్లోనే బస చేశారు. దీంతో కొంత కాలం కిందటి వరకూ ఏపీ రాజకీయాలలో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీని వీడతారంటూ జరిగిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన కుటుంబంలోని అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనుండటంతో వంగవీటి రాధ జగసేన గూటికి చేరే అవకాశాలున్నాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే పరిశీలకులు మాత్రం వంగవీటి రాధ వివాహానికి, ఆయన రాజకీయాలకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు వార్తల నేపథ్యంలో కూడా వంగవీటి రాథ, పుష్పవల్లిల వివాహం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.  

ఈ ఐదు వ్యూహాలు చాలు దేశం నంబర్ వన్.. చంద్రబాబు విజన్ 2047

 వర్తమాన రాజకీయాలలో దార్శనికుడు అనగానే ఎవరికైనా వెంటనే స్ఫురించే పేరు నారాచంద్రబాబు నాయుడు.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది  ఐటీ.. విజన్. మన దేశంలో ఇప్పుడున్న సీనియర్ నేతలలో ముందు చూపు కలిగిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. దేశ విదేశాల కంపెనీల ప్రతినిధుల నుండి అమెరికా అధ్యక్షుల వరకూ ఈ మాట ఎప్పుడో చెప్పారు. అందుకు తగ్గట్లే చంద్రబాబు అనునిత్యం దేశ భవిష్యత్ బాగుండాలనీ, పేదరికం పోవాలని పరితపిస్తుంటారు. అందుకే అందరూ ఈ రోజు గురించి ఆలోచిస్తే చంద్రబాబు రేపటి గురించి ఆలోచిస్తారని రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. రానున్న దశాబ్దంలో మన సమాజాన్ని నడిపించేది ఏంటో ఆయన శోధించి ఆ దిశగా సమాజాన్ని నడిపించాలన్నది ఆయన తపన. గతంలో అలా ఆయన వేసిన బీజమే నేడు హైదరాబాద్ నగరానికి దీటుగా ఎదిగిన సైబరాబాద్. గతంలో ఆ  ఆ దిశగా పనిచేసి తన  దార్శనికత ఏంటో చాటారు. ఇప్పుడు మరోసారి విజన్ డాక్యుమెంట్-2047తో ప్రజల ముందుకొచ్చారు.  చంద్రబాబు మంగళవారం విశాఖ సభలో విజన్ డాక్యుమెంట్-2047ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో భారత్ నెంబర్ 1 అయ్యేందుకు ఏం చేయాలో సూచించారు. ఇందుకోసం చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం 5 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది. ఇండియా 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి భారత్ ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా @ 100 అనే కాన్సెప్ట్‌తో విజన్ డాక్యుమెంట్-2047 తయారైంది. ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు సభ్యులుగా  చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్   గత కొన్నినెలలుగా తీవ్ర కసరత్తులు చేసి ఈ  ఈ విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేసింది.  ఈ విజన్ డాక్యుమెంట్-2047 విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 5 వ్యూహాలను సూచించారు. ఈ ఐదింటిలో 1. సోలార్ ఎనర్జీ, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైబ్రిడ్ మోడల్ డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్ అండ్ డిజిటలైజేషన్, 2. వాటర్ సెక్యూర్ ఇండియా 3. డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్ 4. డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్ 5. ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ. సోలార్, విండ్, హైడల్ మూడింటినీ కలిపి హైబ్రిడ్ మోడల్ తయారుచేసి సరికొత్త పవర్ చేంజర్ తో ముందుకెళ్లాలని.. అప్పుడే అన్ని రంగాలకు విద్యుత్ అందుతుందని చంద్రబాబు చెప్పారు. దీంతో కాలుష్యం కూడా ఉండదని.. డిజిటలైజేషన్ వల్ల విద్యుత్ గ్రిడ్ మేనేజ్ చేసుకోవచ్చని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించిన విధానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  ఇక, మిగతా విషయాలకు వస్తే విజన్ డాక్యుమెంట్ -2047లో రెండో ప్రాధాన్యత నీటికి ఇచ్చారు. ఇటు హైడల్ ఎనర్జీలో నీళ్లే కీలకం.. అటు వ్యవసాయానికి కూడా నీళ్లు కావాలి. అందుకే భారత్ నీటి పరంగా పూర్తి భరోసాతో ఉండాలనే వాటర్ సెక్యూర్ ఇండియా సిద్ధాంతం తీసుకువచ్చినట్లు చెప్పారు. మూడవ అంశం డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయని..ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు. సెల్ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు ఒకటే చెప్పాను... సెల్ ఫోన్ ను అందరూ గుర్తించే రోజు వస్తుంది అని స్పష్టం చేశాను. ఇవాళ సెల్ ఫోన్ తిండిపెట్టడమే కాదు, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది.   ఈ విజన్ 2047లో చివరి రెండు అంశాలు డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్, ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ. 2047 తర్వాత దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గిపోతుంది, పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ జనాభా నిర్వహణ సిద్ధాంతం ఆ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఇప్పటివరకు దేశంలో జనాభా తగ్గించే ఉద్దేశంతో నియంత్రణకు వెళ్లగా.. ఇప్పుడు అధిక జనాభానే అనుకూలత అయ్యే పరిస్థితులు వస్తాయని అందుకు మనం ముందే సిద్ధంగా ఉండాలని సూచించారు. చివరిగా ప్రతి ఒక్కరూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు.. ఈ స్వతంత్ర భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని.. ప్రతి వ్యక్తి తన సేవలను, తన ఉత్పాదనలను ప్రపంచానికి అందించే దిశగా ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు విజన్ డాక్యుమెంటరీ 2047పై ఇప్పటికే ఎందరో నిపుణులు స్పందించి ఈ ఐదు సూత్రాలు చిత్తశుద్ధితో అమలు చేసే భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని పేర్కొంటున్నారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల.. ముహూర్తం ఎప్పుడంటే?

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ విలీనానికి సిద్దమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లే షర్మిల తన పార్టీని విలీనం చేయడంతో పాటు ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా పూర్తి కాగా.. ఇప్పుడు షర్మిల గ్రీన్ సిగ్నల్ తో ఈ విలీనం కథ సుఖాంతం కాబోతుందట.  అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారం లేదా ఈ నెలాఖరున ఈ విలీనం కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గాల సమాచారం. నిజానికి ముందుగా ఆగ‌స్టు 12న దీనికి ముహూర్తం పెట్టుకున్నా.. షర్మిల నిర్ణయం ఆలస్యం కావడంతో ఆ ముహూర్తానికి ఇది అమలు కాలేదు. అయితే, ఇప్పుడు ఈ స్థానంలో మరో ముహూర్తం కోసం చూస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చ‌ర్చ‌లు పూర్తి కాగా, విలీనం వలన ఆమెకి చేకూరే ప్రయోజనాలపై కూడా చర్చలు పూర్తి అయ్యాయట. షర్మిలను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపడంతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన అనంతరం ఇద్దరు పాత కాంగ్రెస్ నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి షర్మిల మైలేజీ పెంచే ప్రణాళిక కూడా ఒకటి కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం రావాల‌నే ఉద్దేశంతో 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ష‌ర్మిల స్థాపించారు. తానే అధ్య‌క్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో ప‌రుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.. ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయ‌కుల చేరిక‌లు, పాద‌యాత్ర‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది. మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పుంజుకోవడంతో షర్మిల సుతారం వెనకబడిపోయారు. ఒకవైపు ఎంత చేసినా మైలేజీ రాకపోవడం, మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె కాస్త నిరాశలో ఉంటూ వచ్చారు. ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఈ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ ప్రక్రియను ఆయనే దగ్గరుండి పూర్తి చేయనున్నారు. కాగా, షర్మిల పార్టీ విలీనం.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటిస్తే ఆమెకి మొదటి శత్రువు అన్న జగనే. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించింది జగన్ వైఎస్ఆర్సీపీనే. టీడీపీ క్యాడర్ టీడీపీకి ఉండగా.. జనసేనకి ఉన్న కొద్దిపాటి సైన్యం అంతా యువతే కనిపిస్తున్నారు. ఇక ఎటొచ్చీ వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు రాజకీయం అంటూ ఏపీలో మొదలు పెడితే మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే. నిన్న మొన్నటి వరకూ ఈ విషయంపై తర్జన భర్జన పడిన షర్మిల.. ఇప్పుడు భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ ప్రోత్సాహంతో అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీలో అడుగుపెట్టనున్న సంగతి కూడా వైసీపీ ముఖ్యనేతలందరికీ తెలుసనీ, ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చలలో షర్మిల రాగానే ప్రధానమైన అంశంగా ఉందని తెలుస్తుంది.

వైసీపీలో పాతవారు కొత్తవారు అందరిదీ పక్క చూపేనా?

 ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలో ఉండాలా.. వీడి వెళ్లాలా.. వెళ్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి? ఇలా ఎన్నో చర్చలు వైసీపీ నేతల మధ్య సాగుతున్నాయి. వైసీపీపై వ్యతిరేకత ప్రజలలో స్ఫష్టంగా కనిపిస్తున్నది. గడప గడపకి కార్యక్రమం పుణ్యమా అని ఎమ్మెల్యేలే ప్రజల వ్యతిరేకతను కళ్ళతో చూశారు. టీడీపీ నేతల కార్యక్రమాలకు ప్రజల స్పందన కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉండడం శ్రేయస్కరం కాదని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఒక అంచనాకి వచ్చేశారు. మరికొందరు అసలు వైసీపీ అధిష్టానమే టికెట్లు ఇవ్వదనే ఆలోచనతో కొత్త దారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీకి వెళ్ళినవారు, ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీతో కలిసిన వారు మరికొందరు కూడా పునరాలోచన చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఇద్దరు ముగ్గురు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. ఇలా మొత్తం మీద ఇప్పుడు వైసీపీలో పాత వారు, కొత్త వారు అందరూ పక్క చూపులు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉత్తరాంధ్ర లో అయితే వైసీపీలో ఇలాంటి నేతలు అరడజను మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ వైసీపీకి గుడ్ బై చెప్పేయగా.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీపీలో ఇమడలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు తెలుగుదేశంలో చేరిపోగా గణేష్ కూడా త్వరలోనే పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నది. గణేష్ టీడీపీకి పాత నాయకుడే, టీడీపీ నుండి గెలిచి వైసీపీలో చేరగా ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి చేరనున్నట్లు కనిపిస్తుంది. ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీకి వెన్ను దన్నుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుండి ముగ్గురు నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు విస్తృతంగా ప్రచారంలో ఉంది.న ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఆ వార్తలకు ఇటు వైసీపీ నుంచి కానీ, అటు బొత్స కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరూ ఖండించలేదు.  దీంతో బొత్స కుటుంబ సభ్యులు పార్టీ మారడం ఖాయమేనని అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  వీరితో పాటు ఉత్తరాంధ్ర నుండి శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ పేర్లు కూడా వైసీపీని వీడుతారన్న వార్తలు వినవస్తున్నాయి.   ఇక కోస్తా జిల్లాలకు వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరం నుండి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరడం దాదాపు ఖరారైంది. లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించే సమయానికి యార్లగడ్డ చేరిక పూర్తి కానుంది. వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వీరు కాకుండా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతి పరుడిగా మారిపోయారు. ఇప్పటికే ఆయన కుమారుడిని వైసీపీలోకి పంపగా.. ఇప్పుడు కరణం బలరాం పునరాలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. మరోవైపు చీరాల నుండి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీ నుండి జారుకోవాలని చూస్తున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుండి బహిష్కృతులయ్యారు. వీరు ముగ్గురూ కూడా ఇప్పటికే  తెలుగుదేశంకు జై కొట్టేశారు. వీరితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికలలో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి. పోర్టులు, పరిశ్రమలు, విమానాశ్రయాలని ఆశపెట్టి ఒక్కటీ పూర్తి చేయలేకపోవడం, అభివృద్ధి అనే మాట వినిపించక ప్రజలు నేతలపై తిరగబడే పరిస్థితి కనిపిస్తుండడంతో అవకాశం ఉన్న వరకు వీలైనంత త్వరగా గుడ్ బై చెప్పేందుకు చాలామంది ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తాడికొండ శ్రీదేవి వ్యాఖ్యలపై వైసీపీ సైలెన్స్.. కారణమేంటి?

అమరావతి ఆవేదన పేరిట.. తాడికొండ నియోజకవర్గం రావెలలో రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. అయితే ఈ సభలో తాడికొండ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. యాంకరింగ్ చేయడం.. ఈ సందర్బంగా ఆమె.. జగన్‌ ప్రభుత్వంపై విసిరిన పంచ్‌లు.. బ్రహ్మండంగా పేలాయి. అంతే కాదు గత ఎన్నికల ప్రచారంలో తాను.. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పానని... ఆ క్రమంలోనే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. కానీ జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల మూడు రాజధానుల ప్రకటన వెలువడిందని.. ఈ నేపథ్యంలో తనను క్షమించాలంటూ ఈ కార్యక్రమ వేదికపై నుంచి అమరావతి రైతులను ఆమె క్షమాపణలు కొరారు. అంతవరకు ఓకే కానీ.. అధికార జగన్ పార్టీ  బహిష్కృత ఎమ్మెల్యే, అదీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూత వేటు దూరం నుంచే ఈ వ్యాఖ్యలు చేసినా.. వైసీపీ అగ్రనేతలు ఎవరూ ప్రెస్ మీట్ పెట్టడం కానీ.. ట్విట్టర్ వేదికగా స్పందించడం కానీ చేయక పోవడంపై పోలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఇక జూలై 28న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ సారథ్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ యాంకర్ ఉదయభాను అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఈ జయహో బీసీ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంతే.. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా వెంటనే రంగంలోకి దిగి.. ట్రోలింగ్ చేయడం ప్రారంభించింది. అలాగే ఫ్యాన్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే  ట్విట్టర్‌ వేదికగా   ఈవెంట్ మేనేజమెంట్‌లో టీడీపీ అధినేతను మించిన వారెవరూ ఉండరు. ప్రతి ప్రోగ్రాంకు ఏదోఒక ‘అట్రాక్షన్’ జతచేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటే. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం చూశాం. ఇక నుంచి సినీ నటుల సందడి మొదలవుతుందని అర్థమవుతోంది అంటే పేర్కొన్నారు. అయితే ఒంగోలు సభలో ఉదయభాను యాంకరింగ్‌కి వెంటనే స్పందించిన విజయసాయి అండ్ కో.. రావెలలో నిర్వహించిన అమరావతి ఆవేదన సభపై  స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే ఓ సందేహం  పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది. అయినా స్పందన జీవ లక్షణం.. ప్రతిస్పందన మనిషి లక్షణం. అలాంటి ప్రతీ స్పందన పుష్కలంగా ఉన్న.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు, కానీ జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు కానీ.. అంటే నాని బ్రదర్స్, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్‌, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ వగైరా వగైరాలు.. సొంత పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై మౌనం వహించడం,  అమెను  పల్లెత్తు మాట అనడానికి సాహసించకపోవడం వెనుక కారణం ఏమిటన్నదానిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   మరోవైపు ఉండవల్లి శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు వేస్తే.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి  కొన్ని నిజాలు వెల్లడించారు. పలు ఆరోపణలు చేశారు. ఆ తరువాత  నాలుగు నెలల అనంతరం మళ్లీ ఇప్పుడు లోకేష్ సభలో యాంకరింగ్ చేసి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తే   తమ పార్టీలోని పలువురు  నేతల బండారం బయటపడే అవకాశాలు ఉన్నాయని.. అదే జరిగితే ఆయా నేతల ఫ్యూజూలు ఎగిరిపోయే పరిస్థితి ఉందనే ఓ ప్రచారం  పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.  అయినా చెట్టుకు పువ్వు పూసినా.. కాయ కాసినా.. ఆ కాసిన కాయ నేల రాలినా..  ట్విట్టర్ వేదికగా ఆగమేఘాల మీద స్పందించే విజయసాయిరెడ్డి సైతం .. తాడికొండ శ్రీదేవి విషయంలో స్పందించకపోవడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో ఆశ్చర్యం   వ్యక్తమవుతోంది.  అయినా ప్రస్తుతం ఎన్నికల సీజన్..  ఏం మాట్లాడినా  ఆచి తూచి మాట్లాడాలి.. అలాగే అడుగులు వేయాలి.. అదే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై ఒంటి కాలిపై లెచే  సోకాల్డ్ ఈ వీరులంతా..  తాడికొండ శ్రీదేవి విషయంలో స్పందిస్తే.. వచ్చే ఎన్నికల్లో దళిత ఓట్లు హుళక్కి అయ్యే అవకాశాలు ఉన్నాయనే  భయంతోనే నోరు మెదపడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇంకోవైపు.. సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో అమరావతి ఆవేదన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఆయన పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి చేత యాంకరింగ్ చేయించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సాహసాన్ని, ఎత్తుగడలను, వ్యూహాలను పలువురు అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

మంగళగిరిలో లోకేష్ కు అపూర్వ ఆదరణ

మంగళగిరిలో లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది. తొలి సారిగా అసెంబ్లీకి ఆయన పోటీ చేసింది మంగళగిరి నుంచే.. తొలి ప్రయత్నంలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి నుంచి ఆయన ఓ అజేయ శక్తిగా ఎదిగారనడానికి యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు జనం నీరాజనాలు పలికిన తీరు కళ్లకు కట్టింది. లోకేష్ ను నియోజకవర్గానికి దూరం చేయడానికి జగన్ సర్కార్, ఆయన పార్టీ చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు.  ఒటమి పెంచిన కసితో, పట్టుదలతో  ఆయన నియోజకవర్గంలో ప్రణాళికాబద్దంగా పని చేసుకుంటూ వచ్చారు. నిత్యం అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఆ ఎఫెక్ట్   పాదయాత్రలో  అడుగడుగునా కనిపించింది. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను బలహీనం చేసేందుకు  అధికార బలంతో నియోజకవర్గ స్థాయినేతల్ని జగన్ రెడ్డి  వైసీపీలో చేర్చుకున్నారు. నిత్యం వేధింపులతో తెలుగుదేశం శ్రేణులను నిర్వీర్యం చేయడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఎంత బలంగా అణచివేయడానికి ప్రయత్నిస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం శ్రేణులు నియోజకవర్గంలో బలం పుంజుకున్నాయి. దానికి తోడు లోకేష్ పని తీరు, పరిపక్వతతో కూడిన రాజకీయాలు ప్రజలలో ఆయన పట్ల అభిమానం పెరిగేలా చేశాయి. దీంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టే సరికి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన వెంట నడిచిందా అన్నట్లుగా జనం పోటెత్తారు.  వీరికితోడు గుంటూరు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వారు కూడా ఉత్సాహంగా లోకేష్ పాదయాత్రలో ఆయనతో అడుగుకలిపి నడిచారు. ఆయన పాదయాత్రకు పోటెత్తిన జనం అసంఖ్యాకం అనడానికి మూడు నాలుగు కిలోమీటర్ల నడకకే ఆరున్నర గంటలకు పైగా సమయం పట్టడాన్ని తెలుస్తున్నది.  పాదయాత్ర ప్రారంభానికి ముందు వరకూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగానే తన కార్యకలాపాలన్నీ సాగించారు. 2019 ఎన్నికలలో ఎక్కడ వైసీపీ పై చేయి సాధించిందో అక్కడే తనపై అభిమానం వెల్లువెత్తేలా వ్యూహాత్మకంగా పని చేశారు. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ సమస్యలను గుర్తించి, అడ్రస్ చేసి వాటి పరిష్కారం కోసం పని చేశారు. అదే సమయంలో గత ఎన్నికలలో  మంగళగిరి నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నిష్క్రియాపరత్వం వల్ల ప్రజలకు దూరం అయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదు. దీంతో ప్రజలలో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దానికి తోడు జగన్ సర్కార్ విధానాల పట్ల సహజంగానే పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు వెరసి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పట్ల అభిమానం, ఆయన తమకు అండగా ఉంటాడన్న విశ్వాసం అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మంగళగిరిలో లోకేష్ జోరు కు.. ఎలా అడ్డుకట్ట వేయాలో ఐ ప్యాక్ టీమ్‌కూ అర్థం కావడం లేదు.   మంచి చేసి.. ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలన్న ధ్యేయంతో లోకేష్ వేసిన అడుగులు ఇప్పడు ఆయనకు జనం బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణలో ప్రియాంక.. మెదక్ నుంచేనా పోటీ

 హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ, ఈ  ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్  అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు  వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు సహజమే అయినా.. వీటి ధాటి, ప్రభావం ఏ ఇతర రాష్ట్రంలో కంటే తెలంగాణలో అధికం. ఈ రాష్ట్రంలో నేతలంతా తాము ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చుకుంటుంటారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి  ప్రియాంక వాద్రా గాంధీకి   అప్పగించింది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలన్నీ ప్రియాంకగాంధీకే అప్పగించారని కూడా పార్టీలో గట్టిగా ప్రచారం అవుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని, పార్టీలో చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు కూడా ఆ అవకాశాలే అధికంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. గతంలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. అది సెంటిమెంట్ పరంగా కూడా కాంగ్రెస్ కు బాగా కలిసివస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ప్రియాంకా గాంధీ చాలా కాలంగా..  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక  దృష్టి పెట్టారు. ఒక దశలో,  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి న సమయంలో ప్రియాంక జోక్యంతోనే వారి మధ్య విభేదాలు, వివాదాలు సర్దుమణిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మునుగోడు ఉప ఎన్నికల సమయంలో, కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు ...ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన మాటల తూటాల నేపధ్యంలో, తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు.  అయితే,  ప్రియాంక  గాంధీ జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా   విదేశాలకు వెళ్ళారని అంటారు. దీనిలో నిజానిజాలేమిటన్నది పక్కన పెడితే.. కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ  కావడం నిజం. ప్రియాంక గాంధీతో భేటీ తరువాతనే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తి అబద్ధాలనీ, తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినేనని విస్పష్టంగా చెప్పారు. అదీ వాస్తవమే.  అందుకే  కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక  గాంధీచూపిన చొరవే కారణమని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.   అలాగే  రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రే కు బాధ్యతలు అప్పగించడంలోనూ ప్రియాంకా గాంధీ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెబుతారు. ఇవన్నీ ఒకెత్తైతే..  ప్రియాంక వాద్రాకు ఎన్నికల బరిలో దిగి  పార్లమెంట్ లో అడుగుపెట్టాలనే కోరిక బలంగా ఉంది.  2019 ఎన్నికల్లోనే ఆమె యూపీలో వారాణాసి నుంచి ప్రధాని మోడీకి ప్రత్యర్థిగా రంగంలోకి దిగేందుకు సై అన్నారు. అయితే అప్పట్లో కారణాలేమైనా ఆమె పోటీ చేయలేదు. ఇందుకు రాహుల్ గాంధీ ఆమె మోడీకి ప్రత్యర్థిగా బరిలోకి దిగడం పట్ల సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీకి ప్రత్యర్థిగా దిగితే ప్రియాంక ఓటమిని ఎదుర్కొనే అవకాశాలే  ఎక్కువ ఉన్నాయని అప్పట్లో రాహుల్ భావించడమే అందుకు కారణమని అంటారు.   ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ  చిత్తుగా ఓడిపోయిన నేపధ్యంలో  ప్రియాంక యూపీ మీద ఆశలు వదులుకున్నారని, అప్పటి నుంచే ఆమె పార్లమెంట్ ఎంట్రీకి తెలంగాణ అయితే సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అందుకే స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా, ఉభయ తారకంగా ప్రియాంకకు తెలంగాణ బాధ్యతలను పార్టీ హైకమాండ్ అప్పగించిందని చెబుతున్నారు. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్  ప్రియాంక పోటీకి దిగి విజయం సాధించేందుకు సరైన వేదిక అని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటున్నారు.   అందుకే ఇటీవల కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ నుంచి నేరుగా ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. త్వరలో మరోసారి కూడా రాష్ట్ర పర్యటనకు రానున్నారు.   మే నెల 9న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని, నేరుగా  హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొని కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.  జూన్ చివరివారం లేదా జులై మొదటివారంలో ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు అప్పట్లో షెడ్యూల్ ఖరారైనా.. అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.  అమె త్వరలో తెలంగాణలో పర్యటించి మెదక్ జిల్లాలో భారీ బహిరంగ లో పాల్గొంటారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఆ సభలోనే ప్రియాంక బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.  

అంబటి బ్రో.. వ్యూహం కనిపించడం లేదా?

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన గతం వైభవమే కానీ ఇప్పుడు ఆయన సినిమాల కంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ రేటుకు అమ్ముడుపోతున్నాయి. అప్పుడప్పుడు పోర్న్ స్టార్స్ ను తీసుకోచ్చి బూతు బొమ్మలు తీసినా ఆయన మొహం చూసేందుకు కూడా ప్రేక్షకులు ఇష్టపడం లేదు.  అయితే ఆయన ఒకప్పటి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు మీడియా చానెళ్లు తరచూ ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంటాయి. ఆ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే చొప్పదండు కబుర్లు వ్యూస్ ను తెచ్చిపెడుతుంటాయంతే. అంతకు మించి సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉనికి కానీ ప్రమేయం కానీ అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో  ఆయనకి ఓ సినీ  బేరం తగిలింది. అదే ‘వ్యూహం’. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీ కోసం రెండు సినిమాలు చేసి పెట్టిన వర్మ ఈసారి కూడా అదే ప్రణాళికలో ‘వ్యూహం’ అనే సినిమా తీసిపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్  రిలీజ్ అయ్యింది. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.  ఆ తరువాత  ఇప్పుడు ఇదే ‘వ్యూహం’ నుండి రెండో  టీజర్ కూడా విడుదల అయ్యింది. ఇందులో కూడా అంతే. జగన్ కు అనుకూలంగానే ఈ టీజర్ కూడా కట్ చేశారు. మొదటి టీజర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం నుండి మొదలు పెడితే.. రెండో టీజర్ లో ప్రజారాజ్యం విలీనం, రాష్ట్ర విభజన అంశాలను చూపించారు. ఇందులో కూడా చంద్రబాబు పాత్రను నెగటివ్ గానే చూపించగా.. సోనియా గాంధీ పాత్రను, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా చూపించారు. రాష్ట్రాన్ని సోనియా గాంధీ చపాతీని రెండు ముక్కలు చేసినట్లు విడదీసినట్లు చూపించగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరి పాత్రలను చూపించారు. ఈ టీజర్ లో సోనియా గాంధీ, రోశయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ బ్లేమ్ చేసి.. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉత్తముడు అన్నట్లు చూపించనున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.  మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్ కి పొలిటికల్  మైలేజ్  కోసమే, మిగతా అందరినీ తప్పుడు వ్యక్తులుగా చూపించేందుకు  ‘వ్యూహం’ తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించడానికి ముందే వర్మ తాడేపల్లి వెళ్లి మరీ సీఎం జగన్ ను కలవగా.. ఈ సినిమా షూటింగ్ కోసమే ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొన్నీమధ్య ఒక రోజు విజయవాడ బ్యారేజీపై ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని గంటలపాటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఏది ఏమైతేనేం సినిమా అయితే జగన్ కోసమే తెరకెక్కిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసిందే. ఇక, ఈ సినిమా విడుదల అవుతుందా? విడుదలైతే ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక పోతే ఈ రెండో టీజర్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తున్నది. వర్మ ఈ స్థాయికి దిగజారి అమ్ముడుపోతాడని ఊహించలేదని ఆయన అభిమానులే కామెంట్లు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలైతే చెప్పాల్సిన పనిలేదు. పే టీమ్ కూలీలూ.. వర్మ రెండూ ఒక్కటేనని విమర్శలతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక  ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో లో మంత్రి అంబటి రాంబాబును పేరడీ చేశారని తెగ గగ్గోలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ అంశాన్ని అంబటి వదలడం లేదు. ప్రజా సమస్యలను కూడా గాలికి వదిలేసిన అంబటి బ్రో సినిమాపై గంటలు తరబడి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడో ఆయన సంక్రాంతి సంబరాల్లో చేసిన డాన్స్ మాదిరి సినిమాలో పృథ్వీ వేసాడని గగ్గోలు పెడుతున్న అంబటికి ఇప్పుడు వ్యూహం సినిమా టీజర్లు కనబడడం లేదా అని నెటిజన్లు  ఏకిపారేస్తున్నారు.  నీదో కాదో తెలియని డాన్సుకు అన్ని రోజులు మాట్లాడిన అంబటికి ఇంత నీచంగా పాత్రలు, కల్పిత కథతో కించపరిచే విధంగా తెరకెక్కిన సినిమాలు కంటికి కనిపించడం లేదా అని  ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఉన్నా మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు మీడియాను పిలిచి వ్యూహం టీజర్ పై మాట్లాడాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.

తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా రెడీ?

చూస్తూ ఉండగానే ఈ ఏడాది కాలంలో రెండు భాగాలు పూర్తయి మరో భాగమే మిగిలి ఉంది. ఆగస్టు కూడా పూర్తవుతుండగా.. ఇక ఏడాదిలో మిగిలింది మరో నాలుగు నెలలే. ఈ నాలుగు నెలలు దాటితే ఏ క్షణమైనా ఏపీలో ఎన్నికల నగారా మోగడం ఖాయం. ఏడాది మారిందంటే ఎన్నికల కౌండ్ డౌన్ మొదలైనట్లే భావించాలి. అందుకే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. ఇప్పటికే వచ్చిన రెండు విడతల ఫలితాల ఆధారంగా కొందరికి క్లాసులు కూడా పీకిన జగన్.. త్వరలో రాబోతున్న తుది ఫలితాల ఆధారంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.    అభ్యర్థుల ఎంపిక  విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం   దూకుడుగా కనిపిస్తున్నది. ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా లభిస్తున్న ప్రజాదరణ.     తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు జనం పెద్ద సంఖ్యలో హాజరౌతుండటం, వారి ప్రసంగాలకు విశేష స్పందన లభిస్తుండటం తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు,  విజయం సాధించే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది. తాజాగా తొలి విడత సర్వే నివేదికలు చంద్రబాబు చేతికి అందాయి. ఆ సర్వే ఫలితాల ఆధారంగా మొదటి విడత జాబితా సిద్ధం అవుతున్నది.  ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వారి పని తీరుపై సర్వేల ఫలితాల ఆధారంగా ఈ జాబితా ఉంటుందంటున్నారు.  ఇక సిట్టింగులలో కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న నేతలకు క్లాస్ పీకనున్న చంద్రబాబు, రెండో జాబితా సమయానికి కూడా మార్పు లేకపోతే టికెట్లు కష్టమేనని వారికి తెగేసి చెప్పనున్నారని అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొత్తం 50 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. అది కూడా దసరా నాటికే ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ముందుగా తొలి జాబితా  ప్రకటించి వైసీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో తెలుగుదేశం   ఉన్నట్లు తెలుస్తున్నది.  అయితే, టీడీపీ అభ్యర్థుల జాబితా అనగానే ముందుగా గుర్తొచ్చేది పొత్తుల పరిస్థితి ఏంటి అన్నదే. అన్నీ కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతానికి అయితే, రెండు వైపుల నుండి పొత్తుల వ్యవహారంపై సస్పెన్సే కొనసాగుతోంది. అయితే ఎన్నికల సమయానికి పొత్తులు పొడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  మరోవైపు పొత్తులు ఖరారు కాకుండానే తాను తప్పక పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తు అంటే కొన్ని స్థానాలను తెలుగుదేశం  వదులుకోవాలి. ఇప్పటికే జనసేన కొన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా.. మరికొన్నింటికిపై ఖర్చీఫ్ వేసి ఉంది. ఈ క్రమంలో ఇవి కాకుండా సేఫ్ సైడ్ ఉన్న స్థానాలను   ప్రకటించి.. ఇటు వైసీపీ, అటు జనసేనలపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని కూడా తెలుగుదేశం పరిశీలిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తొలి జాబితాలో ఉండే పేర్లేవి, పొత్తుల పరిస్థితి ఏమిటి?  అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. చూడాలి మరి తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన తరువాతైనా పొత్తులపై క్లారిటీ వస్తుందేమో.

తిరుపతి కొండపైనా.. కొండ కిందా పెత్తనం ఎవరిదంటే?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో కీలక పదవులు, ఉన్నతాధికారులు, నామినేటెడ్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల సలహాదారులు ఇలా ఎక్కడ చూసినా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారి పేర్లే వినిపిస్తున్నాయి. పలు సందర్భాలలో ఏదైనా ఒక పదవి ఖాళీ కాగానే ఎన్నో పేర్లు వినిపించినా చివరికి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే ఆ పదవి దక్కుతుంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు కొన్ని వందలసార్లు ఆరోపణలు చేయగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు  ఏకిపారేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ తరహా ఆరోపణలు వచ్చినా ఈ నాలుగేళ్ళలో ఇవి మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ఏ మాత్రం పట్టించుకోని జగన్ రెడ్డి సామజిక వర్గానికే పదవులలో పెద్ద పీఠ వేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణే తిరుపతి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల దేవస్థానం నుండి కొండ కింద తిరుపతి పట్టణం, తిరుపతి రూరల్ ఇలా ఎక్కడ చూసినా అంతా రెడ్డి సామాజికవర్గం వారికే పదవులు కట్టబెట్టారు.  సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్ళగా వైవీ సుబ్బారెడ్డే చైర్మన్ కాగా మరో రెండేళ్లు కరుణాకర్ రెడ్డికి అప్పగించారు. అదలా ఉండగానే తాజాగా తిరుపతి నగరాభివృద్థి సంస్థ తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుపతి గ్రామీణ నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే మోహిత్ రెడ్డి. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం రానున్న మూడేళ్ల పాటు తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు మోహిత్ ఇప్పటికే తిరుపతి గ్రామీణ మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అదనంగా తుడా చైర్మన్ పదవిని చేపట్టాడు. అంతేకాదు, చంద్రగిరికి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా కూడా ఆయనే.  వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా మొహిత్ రెడ్డి బరిలోకి దిగడం లాంఛనమే.  మరోవైపు ఈ మధ్యనే మరోసారి టీటీడీకి చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. దీనిని బట్టి చూస్తే.. ఇటు చెవిరెడ్డి, అటు భూమన ఈ రెండు కుటుంబాలలో పదికి పైగా పదవులు ఉన్నాయి. అంతే కాదు, తిరుమల కొండపైన చైర్మన్ తర్వాత కీలక పదవులైన.. ఈవో, జేఈవోలు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. కొండ కిందకి వస్తే తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో వారే ఉన్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులలో ఉన్న   రెడ్డి సామాజికవర్గ నేతల లిస్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో సలహాదారుల నియామకంలో కూడా సీఎం జగన్ ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులన్నీ కట్టబెడుతున్నారని.. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాలలో ఎవరూ సమర్థులైన వారు సీఎం కంటికి కనిపించడం లేదా అని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ పదవుల పందేరంలో రెడ్డి సామాజికవర్గమే సీఎం జగన్ కు కనిపించడం శోచనీయం.

జగన్ కొత్త నినాదం మూడు రాజధానులు మూడు ప్రాంతాల హక్కు!

దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నాం. సింపుల్ గా సూటిగా చెప్పాలంటే ఇదీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019 లో చేసిన ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ముందు బయటపెట్టగా.. ఆ తర్వాత మిగతా వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. అయితే ప్రభుత్వం ఇది ప్రకటించి నాలుగేళ్లు కాబోతుంది. మరి మూడు రాజధానులు ఎక్కడ అంటే చేస్తాం.. చూస్తాం అంటున్నారు. అసలు ఇంతకీ ఇది సాధ్యమేనా అని అడిగితే తప్పకుండా చేస్తాం.. మా నాయకుడిపై మాకు నమ్మకం ఉందని వైసీపీ నేతలు చెప్తారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. మరి నాలుగేళ్ళలో చేయలేనిది.. ఈ 8,9 నెలలలో చేస్తారా?. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికే లేదు. ఎందుకంటే ఈ విషయం  ప్రస్తుతం కోర్టు ఉంది. సో మూడు రాజధానులు అంటూ మాట్లాడేందుకు అవకాశమే లేదు.  ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చేత చాలాసార్లు మొట్టికాయలు తిన్నది. అక్షింతలు వేయించుకున్నది. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం.. సీఆర్డీయే చట్టం ప్రకారం హైకోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం తీర్పు వచ్చే వరకూ మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మాట్లాడినా.. మూడు రాజధానుల ఏర్పాటుకు సాహసించినా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అయితే, ఇందులో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తున్నది. అమరావతిలో పేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టించాలని చూడడం కూడా అలాంటిదే. అందులో మరోసారి హైకోర్టు కలుగజేసుకొని చివాట్లు పెట్టడంతో దానికి కూడా బ్రేక్ పడింది. మరోవైపు విశాఖ రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నది. ఈ విషయాన్ని బయటకి చెప్తే కోర్టు సమస్యలొస్తాయని దొంగతనంగా నిర్మాణాలు చేపడుతున్నది. ఇక, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడకూడదని తెలిసే ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంతకు ముందు సీఎం ఎక్కడ అడుగుపెట్టినా ఈ రాజధానుల అంశంపై ఏదో ఒక ప్రకటన చేయడం.. ప్రజలలో అది చర్చకు రావడం జరిగేది. కానీ, ఈ మధ్య అది తగ్గింది. అయితే, ఉన్నట్లుండి ఇప్పుడు మరోసారి   రాజధానుల అంశంలో సీఎం జగన్ మరో కొత్త నినాదం అందుకున్నారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుగుతుండగా జగన్ మరోసారి మూడు రాజధానుల కుంపటిని రగిలించారు.  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. యధావిధిగా ప్రతి సభలో జగన్ మాట్లాడినట్లే ఇక్కడ కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తడబడుతూనే చదివి వినిపించారు. ఇందులో  ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సైంధ‌వులు అని జగన్ ఎవరిని అన్నారో చెప్పాల్సింది. ఎందుకంటే ఇక్కడ జగన్ మూడు రాజధానులను అడ్డుకుంటుంది చట్టం, అమరావతికి కోట్ల విలువ చేసే భూములను రూపాయి తీసుకోకుండా ఇచ్చిన ఆ ప్రాంత రైతులు. మరి జగన్ వారినే సైంధ‌వులు అన్నారా?   నిజానికి ముందు నుండి మూడు రాజధానులకు బ్రేక్ పడుతున్నది గత ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం.. సీఆర్డీఏ చట్టం వలనే. ఈ చట్టాన్ని కాదని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే ఏపీ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను అమరావతి రైతులకు చెల్లించాలి. అయితే, జగన్ అలా కాకుండా అమరావతి రైతులను మోసం చేస్తూ రాజధానిని తరలించాలని చూస్తున్నారు. అందుకే కోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. కానీ, ప్రజలకు మాత్రం ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే చేస్తున్న సీఎం.. ఇప్పుడు ఇలా మూడు రాజధానులు మూడు ప్రాంతాల హక్కు అంటూ కొత్త నినాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఉగ్రవాదం కాదు.. ప్రజాస్వామ్యమే.. రయీద్ మట్టు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ఉగ్రవాది సోదరుడు జాతీయ జెండా ఎగుర వేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు జావేద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టు జమ్మూ కాశ్మీర్ లోని సోసోర్ లో తన నివాసం వద్ద  మువ్వన్నెల జెండా ఎదురవేసి తన దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. రయీస్ మట్టూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే అవి వైరల్ అవ్వడమే కాకుండా రయీస్ మట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోసోర్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన మట్టూ..  భారత పౌరులుగా తాము ఎంతో గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగా ఉంటామన్నారు. ఆయన ప్రసంగానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. మట్లుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడైన   జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి శకం మొదలైందనీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు దీటుగా పురోగమిస్తోందనీ చెప్పారు. కశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు కూడా ఉగ్రమార్గాన్ని వదిలి వెనక్కు రావాలని కోరారు. దేశ ప్రగతిలో కాశ్మీర్ భాగస్వామ్యం కొనసాగుతుందనీ, రాష్ట్రంలో ఉగ్రవాదం సమసిపోయి సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  2009లో తన సోదరుడు ఉగ్రవాదిగా దారి తప్పాడనీ, అప్పటి నుంచీ అతడిని చూసింది లేదనీ చెప్పిన రయీస్ మట్టు, ఒక వేళ తన సోదరుడు  బతికుంటే తిరిగి ఉగ్రమార్గాన్ని విడిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.  తాము నిజమైన భారతీయులుగా తమ మాతృభూమిలోనే నివసిస్తామని విస్పష్టంగా చెప్పారు. 

పిండైపోతున్న రుషికొండ.. ముప్పు ముంగిట విశాఖ?

అందమైన బీచ్.. సముద్ర అలల చప్పుడుకు తోడు నీటిపై నుండి వీచే చల్లని గాలి. బీచ్ ను ఆనుకొనే ఆకుపచ్చని రంగులో ఆహ్లాదాన్ని విరజిమ్మే రుషికొండ. అటు రుషికొండ.. ఇటు బీచ్ కలిసి ప్రకృతి ప్రేమికులను, కాస్త సేదదీరాలని ఆరాటపడే విశాఖ నగర వాసులను రా రమ్మని పిలుస్తుంటాయి. పర్యాటకుల తాకిడికి తగ్గట్లే ఇక్కడ రెస్టారెంట్లు, రిసార్టులు వెలిశాయి. ఇంకాస్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే విశాఖ నగరానికి మరింత ఆదాయం తెచ్చి పెట్టే బంగారు   అవుతుంది. అయితే, అభివృద్ధి ఏమో కానీ ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు ఏపీ సీఎం జగన్. నాలుగేళ్ల వైసీపీ హయాంలో రుషికొండను పిండి చేశారు. ఇప్పటికే సగం బోడి గుండు చేసిన ఈ కొండను ఇప్పుడు నిర్మాణాల పేరుతో పూర్తిగా తవ్వేస్తున్నారు.  రుషికొండ అంటే రాతితో కూడిన ఎర్రమట్టి దిబ్బ. గత నాలుగేళ్లలో ఈ కొండను అక్రమార్కులు తవ్వేశారు. భారీ పరదాలు కట్టి లోలోపల ఈ మట్టి తవ్వకాలు జరిపించేశారు. సగం కొండ కరిగిపోయే వరకూ ఈ అంశం వెలుగులోకి రాకుండా మేనేజ్ చేశారు. అంతకు ముందు పచ్చగా కనిపించే కొండ సగం ఎర్రగా మారిపోవడంతో ఈ మట్టి తవ్వకాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. ఇక, అంతకు ముందు ఈ కొండలపై చెట్లు చేమలు ఉండడంతో ఎంతటి వర్షాలు పడినా ఈ ఎర్రమట్టి కరిగేది కాదు. కానీ, అక్రమ తవ్వకాలతో ఇప్పుడు వర్షాలకు మట్టి కరిగి కారిపోతున్నది.   వర్షం పడితే చాలు కొండపై నుండి ఎర్రమట్టి వర్షపు నీటితో కలిసి బీచ్ రోడ్డుపై పేరుకుపోతున్నది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ కొండపై నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర సచివాలయమే ఇక్కడ కడుతున్నారని వైసీపీ అధికారికంగా ప్రకటించి మళ్ళీ తూచ్ ఇక్కడ కట్టేది పర్యాటక భవనాలు అంటూ కవర్ చేసుకుంది.  అనధికారికంగా అయినా విశాఖ నుండి పాలన సాగించాలని ఆరాటపడుతున్న సీఎం జగన్ కోసమే రుషికొండను తవ్వేసి భవనాలు కడుతున్నారని అందరికీ స్పష్టంగా అర్ధమౌతోంది. వైసీపీ ప్రభుత్వం చెప్పుకోలేకపోయినా రుషికొండ ఇప్పుడు వైసీపీ నేతల కొండగా మారిపోయింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇక రుషికొండ కాలగర్భంలో కలిసిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. మరి అదే జరిగితే విశాఖ నగరాన్ని కాపాడేదెవరు అన్నదే ఇప్పుడు పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికుల ప్రశ్న. ఇప్పటి వరకూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఈ రుషికొండనే వైజాగ్ నగరాన్ని కాపాడుతూ వచ్చింది. గతంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో రుషికొండ లేకపోతే వైజాగ్ నగరాన్ని మర్చిపోవాల్సి వచ్చేదని అప్పట్లో పర్యావరణ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెప్పారు. సముద్ర ఆక్రోశం నగరాన్ని తాకకుండా రుషికొండ అడ్డుగా నిలిచింది. అప్పటికే ఆ తుఫాన్ సమయంలో పెను గాలులకు విశాఖ చిగురుటాకులా వణికింది. అదే రుషికొండ లేకపోతే ఏం జరిగేదో ఊహిస్తేనే వణుకు పుడుతుంది.   సముద్రంలో ఏర్పడే ఉపద్రవాల నుండి విశాఖ నగరాన్ని కాపాడేందుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందే రుషికొండ. అందుకే ఈ ప్రాంతాన్ని తీర ప్రాంత నిబంధనలు సీఆర్‌జెడ్ ప్రాంత పరిధిలోకి తీసుకొచ్చారు. తీరాన్ని కాపడటానికి, భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే ప్రమాదాల్ని కాపాడుకోవడానికి రుషికొండ లాంటి ప్రకృతి సిద్ధ నిర్మాణాలు ఉండాలని, వాటికి ఇబ్బంది కలగకూడదనే సీఆర్‌జెడ్ నిబంధనలు తెచ్చారు. కానీ, నిబంధనలను తుంగలోతొక్కి ఇప్పుడు మొత్తం నాశనం చేశారు. దీంతో భవిష్యత్తులో విశాఖ నగరాన్ని కాపాడే వారెవరన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వ్యక్తి పంతం భవిష్యత్తులో ఎందరిని బలి తీసుకుంటుందోనని విశాఖ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తన పంతమే నెగ్గాలనుకున్నా నగరంలో ఇన్ని అవకాశాలు ఉండగా వారి చూపు రుషికొండపై పడడం విశాఖ వాసుల దౌర్భాగ్యంగా భావించాలి. తాను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆశపడుతున్న సీఎం జగన్.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి   కొండపై కొలువుదీరాలనుకోవడం ఏ విధంగా చూసినా సమంజసం కాదని అంటున్నారు.  

జగన్ ఒవైసీ భేటీ.. మర్మమేంటి?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి కలవనున్నట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల  పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నది. అది కూడా హైదరాబాద్ నుండి తాడేపల్లి వెళ్లి మరీ   అసదుద్దీన్ సీఎం నివాసంలోనే భేటీ అవుతారంటున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ గా ఇది ఉండబోతుందని కూడా వైసీపీ వర్గాల సమాచారం. సీఎం జగనే స్వయంగా అసదుద్దీన్ ను తాడేపల్లి ఆహ్వానించారనీ, ఈ భేటీ త్వరలోనే ఈ భేటీ జరగనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో అసలు ఈ ఇద్దరు నేతల భేటీ వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. అసలు ఈ నేతల మధ్య గతంలో ఎలాంటి అనుబంధం లేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఎక్కడా వీరికి సంబంధాలు లేవు. జగన్   వైసీపీ  తెలంగాణతో తెగదెంపులు చేసుకోగా.. ఓవైసీ హైదరాబాద్ పునాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ చేసినా ఇప్పటి వరకూ ఏపీలో మాత్రం పోటీ చేయనేలేదు. మరి ఇలాంటి సమయంలో ఈ భేటీ ఏమిటి? ఎందుకు? అన్న ఆసక్తి సర్వత్రా కలుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరూ హైదరాబాద్ లేదా విజయవాడలో ఎక్కడా కలసిన దాఖలాలు అయితే లేవు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు   అసదుద్దీన్ వెళ్లి కలిసి వచ్చారు. అలాగే  గతంలో ఒకసారి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని గెలిపించేందుకు చంచల్‌గూడ జెైల్లో ఉన్న వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవెైసీ కలిశారు. అప్పుడు యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని.. కాంగ్రెస్‌ రాయబారిగా ఒవెైసీ జగన్‌తో మాట్లాడి రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. ఆ సమయంలో జగన్ తల్లి విజయమ్మతో కూడా అసదుద్దీన్   చర్చించారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ఈ రెండు పార్టీల నేతలు కలిసిన దాఖలాలు లేవు.  అయితే, ఇప్పుడు ఒక్కసారి లంచ్ మీటింగ్ లో ఇరువురు నేతలూ కలవనున్నారన్న సమాచారంతో ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైందిప.  ఎంఐఎం ఒక్కో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏపీలో కూడా ఇలాంటి ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కావాలని కోరుతుందా అనే చర్చ ఒకటి జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ఏపీలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ తో ఉన్న ఈ వర్గం ఆ తర్వాత వైసీపీ వైపు మళ్లింది. అదే సమయంలో టీడీపీ 2014లో బీజేపీతో పొత్తుకు వెళ్లడం కూడా ఈ వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు చూసేలా చేసింది. కానీ  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వర్గాన్ని అసలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రత్యేకించి వీరి కోసం నాలుగేళ్ళలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడంతో ఈ వర్గం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.  ఈ నేపథ్యంలో ఓవైసీను ఇక్కడ రంగంలోకి దింపి ప్రచారం చేయించడం.. కావాలంటే ఎంఐఎం పార్టీ కూడా ఏపీలో పోటీ చేసేలా పొత్తుకు దిగి ఎక్కడో చోట కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా పోటీ చేయించి మైనార్టీల ఓట్లను గంపగుత్తగా తన వైపుకు తిప్పుకొనే ప్రణాళిక ఏమైనా జగన్ మదిలో ఉందా అన్న చర్చ కూడా మొదలైంది.  ఈసారి మళ్ళీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న   వైసీపీ అందులో భాగంగానే ఓవైసీ రాకకు ఆహ్వానం పలికిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అసలు ఈ భేటీ వెనక మూల కారణం ఏంటన్నది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2047

విజనరీ నారాచంద్రబాబునాయుడు విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఈ డాక్యుమెంట్ ని మంగళవారం (ఆగస్టు 15) విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు.   గ్లోబల్ లీడర్ గా భారత్ ఆవిర్భవించేందుకు ఐదు వ్యాహాలు  పేరుతో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు నాయుడు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం కొన్ని నెలలుగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్ఫర్మేషన్  (జీఎఫ్ఎస్టీ) బృందం పని చేస్తున్నది. జీఎఫ్ఎస్టీ చైర్మన్ అయిన చంద్రబాబునాయుడు  మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణుల సమక్షం లో  విశాఖలో ఈ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తారు. ఈ డాక్యుమెంట్ 2947 ను మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో విడుదల చేస్తారు.  గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటైనది. ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉన్నారు. దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు ఉన్నారు. విధానాల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జిఎఫ్ఎస్టి వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జిఎఫ్ఎస్‌టి పని చేస్తుంది.   2047లో దేశం స్వాతంత్ర్యం సాధించి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ నాటికి  ఇండియా  ప్రపంచ లోనే నంబర్   1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జిఎఫ్ఎస్టి పనిచేస్తుంది. ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో  జీఎఫ్ఎస్టీ నివేదికలు సిద్దం చేస్తుంది.   77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు... 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు... తనతో కలిసి రావాలని యువతను , మేధావులను  చంద్రబాబు పిలుపునిచ్చారు.   తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం  వద్దకు చేరుకోవాల్సిందిగా  పిలుపునిచ్చారు.  అదే రోజు   సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొంటారు.

వివేకా హత్య.. ఏం జరిగిందో విజయసాయి చెప్పకనే చెప్పేశారా?

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగస్ట్ 10వ తేదీన ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు... రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారు. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నవించుకుంటున్నా! .అంతే.. ఆ ట్వీట్ పై ఆంధ్రప్రదేశ్‌ పోలిటికల్ సర్కిల్‌లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ట్విట్ వెనుక ఉన్న అర్థం.. పరమార్థం ఏమిటన్నది అంతుపట్టడం లేదని ఆ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది.  ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండి కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారని.. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ఈ తాజా ట్విట్  2019 ఎన్నికలకు  ముందు... అప్పటి విపక్ష నేత జగన్ సొంత చిన్నాన్న, మాజీ మంత్రి  పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అప్పటి  ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్.. హైదరాబాద్‌లోనే ఉన్నారు. హత్య జరిగిన తరువాత ఆయన తాపీగా సాయంత్రం పులివెందులకు చేరుకొని..  తన చిన్నాన్నా ఇంత దారుణంగా హత్యకు గురి కావడం,  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై కోడికత్తితో దాడి జరగడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ..  పులివెందుల్లో వివేకా మృతదేహం వద్దే మీడియా ముందు  ప్రకటించారని.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు రావడం.... ఆ ఎన్నికల ఫలితాల్లో ఎవరు, ఏ పార్టీ భారీగా లబ్ది పోందిందో అందరికీ తెలిసిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పట్లో ఆ హత్య, ఆ కోడికత్తి దాడి వల్ల ఎవరికి సానుభూతి పవనాలు వీచాయో తెలిసిందేనని అంటున్నారు. ఇంకోవైపు వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురి అయితే.. వైయస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ మార్చి 15వ తేదీ ఉదయం 6.00 గంటలకే ఇదే విజయసాయిరెడీ మీడియా ముందుకు వచ్చి మరీ  ప్రకటించారని... అయితే ఈ వివేకా హత్య కేసు విచారణ.. సీబీఐ చేతిలోకి వెళ్లిన తర్వాత.. నిందితుల్లో ఒక్కరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రదారులు ఎవరో వారి పేర్లు బయటకు పొక్కినా కూడా.. విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా మాత్రం కనిపించలేదు. వినిపించలేదని.. కానీ అదే విజయసాయిరెడ్డి ఇలా ట్విట్ చేయడం చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.  2019 ఎన్నికల ముందు నాటి ఘటనలు మళ్లీ రాష్ట్రంలో పునరావృతమవుతాయా? అంటే.. ఏమో అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. అలా అయితే ఈ సారి సానుభూతి పొందేందుకు దారుణాలకు పాల్పడే అవకాశాలున్నాయంటూ విజయసాయి చేసిన ట్వీట్ ప్రధాన్యత సంతరించుకుంది.  గతంలో తమకు సానుభూతి పవనాలు వీచేలా చేసిన రెండు సంఘటనలలోనూ ఇప్పటికీ నిందితులు ఎవరన్నది తేలలేదు. వివేకా హత్య కేసు అయితే దర్యాప్తు పూర్తయ్యింద. కోర్టులో విచారణ జరుగుతోంది. దర్యాప్తు సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాడు నారాసుర రక్త చరిత్ర అంటూ ఊరూ వాడా ఏకం చేసిన వారు దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలతో నోరెత్తలేని స్థితిలో పడ్డారు. నాడు ఎవరైతో నారాసుర రక్త చరిత అంటూ ఆరోపణలు గుప్పించారో వారే నేడు సీబీఐ దర్యాప్తులో అనుమానితులుగా, నిందితులుగా తేలారు. ఇక ఇప్పుడు నాలుగున్నరేళ్ల తరువాత విజయసాయి రెడ్డి మళ్లీ ఎన్నికలలో సానుభూతి కోసం దారుణాలు, హత్యలు అంటూ ప్రస్తావించారు. ఆయన చెప్పినట్లుగా అప్పట్లోలా విపక్షాలకు చెందిన నాయకులెవరూ హైదరాబాద్ లో తాపీగా కూర్చుని లేరు. తెలుగుదేశం అధినేత, జనసేనాని ఇరువురకూ కూడా ప్రజల మధ్యలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో విజయసాయి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసినదీ, ఎవరిని టార్గెట్ గా చేశారు అన్న అనుమానాలు  రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. 

పవార్ మహా రాజకీయం.. ఇండియా కూటమికి చిక్కులేనా?

శరద్ పవార్ అంటేనే కాకతు తీరిన రాజకీయ దురంధరుడు. ఆయన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలూ చివరి నిముషం వరకూ ఎవరికీ అర్ధం కావు. తన రాజకీయ చతురత, వ్యూహాలతో 38 సంవత్సరాల పిన్న వయస్సులోనే మహారాష్ట్ర వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ పరమపద సోపానపటంలో నిచ్చెనలే ఎక్కుతూ వచ్చారు.  ఆయనతో ఢీ కొన్న వారే పాముల బారిన పడ్డారు. కాంగ్రెస్ ను ఢీ కొని  నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ స్థాపించి కూడా నిలదొక్కుకుని స్వల్ప కాలం మినహా అధికారంలో కొనసాగారంటే ఆయన రాజకీయ రణరంగపుటెత్తులు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన చుట్టూనే మహా రాజకీయాలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఒక్క మహా రాజకీయాలనేమిటి?   82 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.   999లో ఎన్సీపీని స్థాపిస్తే అప్పటినుంచి 2014 వరకు మహారాష్ట్రలో  ఎన్సీపీయే అధికారం చెలాయించింది.  శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు చూశారు.  2019-22 మధ్య ఎన్సీపీ అక్కడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి. దీన్నిబట్టే పవార్ లకు పవర్ తో ఎంత అనుబంధం ఉందో తెలిసిపోతుంది. అయితే.. నిరుడు మహా వికాస్ అఘాడీ సర్కారు కూలిపోవడంతో అజిత్ పవర్ కోల్పోయారు. దీంతో ఏకంగా బాబాయ్ ను ధిక్కరించి ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చి బీజేపీ సర్కారులో చేరిపోయారు.   ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరో వైపు శరద్ పవార్ ప్రతిపక్ష  ఇండియా కూటమి ఏర్పాట్ల ప్రయత్నాల్లో ఉంటే.. మరోవైపు అజిత్ ఆయనకు వెన్నుపోటు పొడిచినట్లు ఇప్పటి వరకూ అంతా భావించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే..ఇదంతా శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  అసలు ఎన్సీపీ చీలిక తరువాత చీలిక వర్గం ఎమ్మెల్యేలు శరద్ పవార్ ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం.. ఆయన ఆశీర్వదించడం వంటి వరుస సంఘటనలతో అప్పట్లోనే శరద్ పవార్ ఏదో వ్యూహంతోనే  తెర వెనుక నిలబడి ఇదంతా జరిపించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఇప్పటికీ శరద్ పవార్ ఇండియా కూటమిలోనే ఉన్నారని బయటకు కనిపిస్తున్నది. తన శ్రేయోభిలాషులు బీజేపీతో కలిసి వెళ్లాలని సూచిస్తున్నారంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మాటలు ఆయన అజిత్ పవార్ తో భేటీ తరువాత చెప్పారు. పార్టీని నిట్టనిలువుగా చీల్చిన అజిత్ పవార్.. తన బాబాయ్ (శరద్ పవార్)తో తరచూ భేటీ అవుతుండటం చూస్తుంటే.. ఇండియా కూటమిలో ఉంటూ శరద్ పవార్ తెరవెనుక బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.   తనను బీజేపీలో చేరాలని కొంతమంది హితైషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని  అయితా తాను ససేమిరా అన్నారనీ ఉటంకించారు.  అజిత్ తో భేటీ తరువాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. శరద్ పవార్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యూహ రచన చేస్తున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం, అందుకు ప్రతిఫలంగా ఇండియా కూటమిని బలహీన పరిచి కేంద్రంలో మరో సారి బీజేపీ సర్కార్ ఏర్పాటు అయ్యేందుకు ఇతోథికంగా సహకరించడం అన్న ఎత్తుగడతో శరద్ పవార్ సాగుతున్నారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వ్యక్తం అవుతున్నాయి.  ప్రతిపక్షాల మహా కూటమి ''ఇండియా''.. ఇప్పటికే పట్నా, బెంగళూరులో సమావేశమైంది. తదుపరి సమావేశం ఈ నెలాఖరులో మహా రాజధాని ముంబైలో  ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్, శరద్ పవార్ భేటీ,  ఆ తరువాత శరద్ పవార్ బీజేపీ కూటమిలో చేరిక వ్యాఖ్యలు రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.