పాలన పడకేసింది... అరాచకం రాజ్యమేలుతోంది!

ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు చేయడం అనేది రాజకీయాలలో అత్యంత సహజమైన ప్రక్రియ. అయితే  ప్రతిపక్షాలు చేసే ప్రతి ఆరోపణ నిజమైతే ఆ ప్రభుత్వం ఫెయిలయినట్లే లెక్క. అందులో కొన్ని సరిదిద్దుకొనే అవకాశం ఉండేవైతే ప్రభుత్వం సరిచేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక, అసలు చేయరాని తప్పులు, తీవ్ర నేరంగా పరిగణించాల్సినవి కూడా జరిగిపోతుంటే ఇక ఆ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేనట్లే. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం  అలాంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ అభాసుపాలైన జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు.. ఎవరికి కావాల్సినట్లు వారు పరిపాలన సాగిస్తూ అసలు చట్టాలు, అధికారాలు అనేవి ఉన్నాయన్న సోయ లేకుండా అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నాలుగేళ్ళలో జగన్ సర్కార్ పై వచ్చిన ఆరోపణలు, కోర్టుల మొట్టికాయలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఏడాది వస్తున్న ఆరోపణలు మరో ఎత్తు. ఎందుకంటే ఒక్కొకటి బయటపడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత ఘోరంగా విఫలమయ్యారో  స్ఫష్టంగా తేటతెల్లమౌతోంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నఆరోపణ అన్నిటికంటే తీవ్రమైనది.    ముఖ్యమంత్రికే తెలియకుండా ఆయన డిజిటల్ సంతకాన్ని చోరీ చేసి  ఎవరో ప్రభుత్వాన్ని నడిపించేస్తే? చంటి పిల్లాడు మార్కులు తక్కువచ్చాయని తన ప్రోగ్రెస్ కార్డు మీద తండ్రి సంతకం పెట్టేసుకున్నట్లు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకాన్ని సీఎంఓలో పనిచేసే వాళ్లే పెట్టేసుకొని ఫైళ్లను క్లియర్ చేసేసుకుంటున్నారంటే? ఔను.. ఇప్పుడు ఏపీ సీఎంఓలో ఇదే జరిగిందని ప్రభుత్వ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన డిజిటల్ సంతకాన్ని వాడేసుకుని కొందరు వాళ్లకు కావాల్సిన ఫైళ్లను క్లియర్ చేసుకున్నారని దుమారం రేగుతున్నది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సౌలభ్యం కోసం తీసుకొచ్చిందే డిజిటల్ సిగ్నేచర్. అంతా ఆన్ లైన్ అయిన ఈ కాలంలో ఈ ఫైళ్ల కోసం సీఎం నుండి ఒక గ్రామ రెవెన్యూ అధికారి వరకూ అందరికీ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. సదరు అధికారి సంతకం.. ఈ డిజిటల్ సిగ్నేచర్ రెండూ ఒక్కటే. అందుకే దీని కోసం పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. ఇక సీఎం స్థాయిలో భద్రత అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని కోసం సీఎం థంబ్ ఇంప్రెషన్ తప్పకుండా ఉంటుంది. ఒకసారి సీఎం థంబ్ ఇచ్చారంటే డిజిటల్ సిగ్నేచర్   కొద్ది సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఎలా జరిగిందో.. ఏం చేశారో కానీ.. సీఎం జగన్ డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి తమకి కావాల్సిన పెండింగ్ ఫైళ్లను సీఎంఓ అధికారులు కొందరు క్లియర్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  సీఎం డిజిటల్ సిగ్నేచర్ చోరీ చేసిన నిందితులు ఎవరన్నది వెల్లడించడం లేదు కానీ, సీఎంఓలో అందిరికీ ఈ వ్యవహారం, నిందితుడు కూడా తెలుసని ఉద్యోగవర్గాలలో పెద్దగా చర్చ జరుగుతోంది.  ఇంతకీ అసలేం జరిగింది? నిందితులు ఎవరు అన్నది అందరికీ తెలిసినా బయటకి పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. సీఎం డిజిటల్ సిగ్నేచర్  ఉపయోగించి ఆయనకు తెలియకుండా ఫైళ్లు క్లియర్ చేయడం అంటే రాష్ట్రంలో దిగజారిన పరిపాలనకు పరాకాష్టగానే చూడాలి. అందునా వాళ్ళు క్లియర్ చేసిన ఫైళ్లు ఏంటి? దేనికి సంబంధించి ఫైళ్లు క్లియర్ చేసుకున్నారు? దాని వలన రాష్ట్ర ప్రజలపై పడే  ప్రభావం ఎంత అనేది చెప్పేవారు కూడా లేరు. అయితే, ఈ తంతంగం వెనక అటెండర్ ఉన్నాడని, ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.  ఇప్పటికే   సీఎం డిజిటల్ సిగ్నేచర్ చోరీ అంశాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ లేవనెత్తగా.. త్వరలోనే జనసేన దీనిపై భారీ ఎత్తున ఆరోపణలకు దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ప్రభుత్వ పరువు గంగపాలు అయినట్లే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు మూల స్తంభం. అలాంటి సీఎం సిగ్నేచర్ చోరీ అవ్వడం అంటే ఆ మూల స్తంభం.. ఆ వ్యవస్థ కుప్పకూలినట్లే. మరి దీనికి వైసీపీ ఎలాంటి సమాధానం చెప్పుకుంటుందో , ఏచర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేసీఆర్ సంచలన నిర్ణయం?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించాలంటే సిట్టింగ్ లలో అత్యధికులను మార్చక తప్పదా? అలా మార్చకుంటే కేసీఆర్  హ్యాట్రిక్ కల నెరవేరదా? అంటే బీఆర్ఎస్ శ్రేణులే ఔనని అంటున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్టులన్నీ సిట్టింగ్ లపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న నివేదికలే ఇచ్చాయని అంటున్నారు. కనీసంలో కనీసం 50 మంది సిట్టింగ్ లు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనీ ఇంటెలిజెన్స్ నివేదికలతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. కనీసం 50 నియోజకవర్గాలలో సిట్టింగులకు టికెట్ ఇస్తే విజయం కష్టమని నివేదికలు తేల్చేయడంతో కొత్త వారి కోసం అన్వేషణ మొదలైందని చెబుతున్నారు.  సొంత పార్టీలో పోటీకి నేతలు కరవైన నియోజకవర్గాలలో   ఇతర పార్టీల్లో బలమైన నేతలను బీఆర్ఎస్ లోకి ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారనీ అంటున్నారు. అమోఘమైన అభివృద్ధి, అనితర సాధ్యమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా తమ ప్రభుత్వం పట్ల ఇంత ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకోవడమేమిటని తెరాస నేతలు ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికలలో కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ నివేదికలు షాక్ ఇచ్చాయని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104. వీరిలో కనీసం 50 మంది తిరిగి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్నది ఇంటెలిజెన్స్ నివేదికల సారాంశం. దీంతో ఆయా నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థుల కోసం కేసీఆర్ అన్వేషణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడే ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చనున్నట్లు ప్రకటిస్తే మొదటికే మోసం వస్తుందన్న భయం బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోందని అంటున్నారు. ఆ కారణంగానే సిట్టింగులకే సీట్లు అని గతంలో చెప్పిన మాటను తప్పలేక, ఓటమి ఖాయమని నివేదికలు తేల్చేసిన సిట్టింగులను మళ్లీ పార్టీ అభ్యర్థులుగా నిలపేందుకు నిర్ణయం తీసుకోలేక సీఎం కేసీఆర్ సతమతమౌతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ నేపథ్యంలోనే సిట్టింగులను మార్చాల్సిన నియోజకవర్గాల ఇన్ చార్జ్ మంత్రులతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కాగా కొన్ని చోట్ల మంత్రులకే వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా నివేదికలు ఉండటంతో వారిని పక్కన పెట్టి కొత్త ఇన్ చార్జ్ లను నియమించాలన్న యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా టికెట్లు దక్కని సిట్టింగులను సముదాయించే పనిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీష్ రావులకు కేసీఆర్ అప్పగించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాత్రం ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో కంటే ఏడెనిమిది స్థానాలలో విజయం సాధించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 

పోలవరం వాస్తవాలు బయటపెట్టేసిన జగన్!

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. నిధులు కేటాయించకపోవడం, అందుకు తగిన సమర్థులైన వారిని మంత్రులుగా నియమించలేకపోవడం, పారదర్శకత లోపం.. అనుభవమైన నిర్మాణం చేపట్టే ఇంజనీరింగ్ కంపెనీలను ఎంచుకోకపోవడం, రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లలో అపనమ్మకం ఇలా ఎన్నో కలిసి ఏపీలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవడం, ఇప్పటికే జరిగిన పనులు ధ్వంసం అవడం, ఏడాదికి ఏడాది పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు కలిసి ఇప్పుడు ఈ వ్యవహారం అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ పెద్దలు ఈ అంశంలో గుడ్డ కాల్చి మోహన వేసేలా అడ్డగోలు విమర్శలు చేయడం తప్ప లెక్కలతో సహా సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనలో ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ నుండి దీటుగా సమాధానం వచ్చే పరిస్థితి లేదు. కాగా, రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల సంగతెలా ఉన్నా పోలవరం విషయంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒక్క ఏడాది ఇది ఆలస్యం అయినా నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఈ భారమంతా ప్రాజెక్టుపైనే పడుతుంది. ఇది గ్రహించే గత ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం పోలవారం అంటూ వారం వారం సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అందుకు ప్రతిఫలమే పోలవరం నిర్మాణంలో 60 నుండి 70 శాతం పూర్తి చేయగలిగారు. అంతేకాదు, ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యామ్ వంటివి పూర్తి చేశారు. స్పిల్ వే పనులను కూడా మొదలు పెట్టారు. కేంద్రం నుండి ఆశించిన సమయానికి నిధులు రాకపోయినా.. ముందు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి తర్వాత కేంద్రం నుండి వచ్చినపుడు జమ చేసుకుంది. అయితే, గత ఎన్నికలకు ముందు, జగన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత కూడా పోలవరం నిర్మాణంపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేసేవారు. అసలు పోలవరంలో యాభై శాతం కూడా పనులు కాలేదని, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డే ఆరోపించేవారు. అయితే, తెలిసో తెలియకో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఇప్పుడు పోలవరం నిర్మాణంపై కొన్ని నిజాలు బయటపెట్టారు. ఇటీవల వర్షాలకు ముంపునకు గురి అయిన ప్రాంతాలను సీఎం సోమవారం సందర్శించారు. ఇందులో పోలవరం గ్రామం కూడా ఉంది.. అక్కడ మాట్లాడిన జగన్.. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు 2014 అంచనాల ప్రకారమే కట్టడానికి పోలవరం తీసుకున్నారని, ఆ నిధులతో 2023లో ఉన్న ధరలకు పోలవరం ప్రాజెక్ట్ ని కట్టగలమా మీరే చెప్పండని ప్రజలనే ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం చంద్రబాబు అని డైరెక్ట్ గా ఆరోపించిన జగన్.. స్పిల్ వే కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారని, కాఫర్ డ్యామ్ పూర్తి చేయలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం స్పిల్ వే, డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే, గత ప్రభుత్వంలోనే డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పూర్తి కాగా.. స్పిల్ వే పనులు కూడా కొద్ది శాతమే పెండింగ్ ఉన్నాయి. ఈ నాలుగేళ్ళలో ఆ పెండింగ్ పనులు మాత్రమే పూర్తి చేసినట్లు జగనే ఒప్పుకున్నట్లైంది. ఇక అదే సమయంలో గత ప్రభుత్వం ఒప్పుకున్న ధరలకు ఇప్పుడు కట్టగలమా అని ప్రజలనే ప్రశ్నించడం అంటే.. ఇప్పుడు తాము కట్టలేమని సీఎంనే  అంగీకరించారని భావించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలతో నిధులు కావాలంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెచ్చుకోవాలి. కానీ జగన్ కేందంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితిలో లేరన్నది తెలిసిందే. మరి  ప్రజలను మీరే చెప్పండి అని ప్రశ్నిస్తే ప్రజలు ఏం చెప్తారు. ఒకవిధంగా జగన్ మాటలను చూస్తే పోలవరం నిర్మాణం తమ వల్ల కాని పని అని స్వయంగా  ఒప్పుకుని చేతులెత్తేసినట్లే ఉంది.

వైసీపీలో మరో రఘురామకృష్ణం రాజు? లోక్ సభలో లావు ప్రసంగం సంకేతమేంటి?

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో తిరుగుబావుటా ఎగురవేయడానికి రెడీ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందా? తమ రాజకీయ భవిష్యత్ పై భయం వారిని వైసీపీకీ దూరం చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి లోక్ సభలో ఒక రెబల్ ఎంపీ ఉన్నారు. ఆయనకు తోడుగా మరో ఎంపీ తిరుగుబావుటా ఎగుర వేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సోమవారం ( ఆగస్టు 7) వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయులు లోక్ సభలో చేసిన ప్రసంగం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్ సభ వేదికగా ఆయన మాట్లాడిన ప్రతి మాటా జగన్ సర్కార్ ను వేలెత్తి చూపినట్లుగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను పరొక్షంగా విమర్శించిన కారణంతో జగన్ పార్టీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కక్ష కట్టింది. కేసులు పెట్టింది. సీఐడీ పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసినా స్పందించలేదు. అంతే కాదు.. గత కొన్నేళ్లుగా ఆయన కనీసం రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండా చేసింది. సొంత నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగి.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరైనా కూడా రఘురామకృష్ణంరాజు రాలేకపోయారంటేనే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఇట్టే అవగతమౌతుంది. ఇప్పుడు అదే కోవలో   నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ప్రభుత్వ డేటాచోరీ అంశంపై పార్లమెంట్‌లో పరోక్షంగా మాట్లాడి వైసీపీలో కలకలం రేపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చలో పాల్గొని  ప్రభుత్వాలు సేకరించే వ్యక్తిగత వివరాలు సంక్షేమ పథకాల అమలు కోసం  కాకుండా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.   ఇలా దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.   ప్రభుత్వం.. డేటా చౌర్యం, దుర్వినియోగం అనగానే ఎవరికైకా ముందుగా గుర్తుకు వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్  వలంటీర్ల ద్వారా జగన్ సర్కార్ డేటా చౌర్యానికి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలా చోరీ చేసిన డేటాను హైదరాబాద్ నానక్ రామ్ గూడలో భద్రపరిచారనీ విమర్శించారు.  ఆ చోరీ చేసిన డేటాను ఓ ప్రైవేటు కంపెనీకి చేసి..  ఓటర్లను  ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాయి.  వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో డేటా చౌర్యం గురించి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలనే ఏపీ సర్కార్ అన్న మాట ఎత్తకుండా మాట్లాడారు. పేరెత్తి నిజం నిర్భయంగా చెప్పలేకపోయినా.. పరోక్షంగా జగన్ సర్కార్ పై వస్తున్న ఆరోపణలనే ప్రస్తావించి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టేశారు. లోక్ సభలో ఆయన ప్రసంగంపై వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరో ఎంపీ జగన్ కు రెబల్ గా మారారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లావు ప్రసంగం తరువాత జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. చాలా కాలంగా లావు కృష్ణ దేవరాయులు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అలాగే తనకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభించే అవకాశాలు లేవని తన సన్నిహితుల వద్ద పలుమార్లు చెప్పారనీ వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డేటా చౌర్యంపై లోక్ సభ వేదికగా లావు చేసిన ప్రసంగం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఎంపీల విషయం పక్కన పెడితే.. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభించే అవకాశం లేని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలలు కూడా ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధపడుతున్నారనీ, ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీలో అసంతృప్తి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, సొంత పార్టీలోనే జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదనీ, నెల్లూరు, తూర్పుగోదావరి సహా పలు జిల్లాలలో నాయకుల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలే తేటతెల్లం చేస్తున్నాయి. 

ఏపీలో పొత్తుపొడుపుల దాగుడుమూతలు!

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుపొడుపుల దాగుడుమూతలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎటూ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తెలుగుదేశంతో పొత్తుతో రంగంలోకి దిగుతుందని అంతా భావిస్తున్నారు. జనసేనకు ఇప్పటికే మిత్రపక్షమైన బీజేపీ కూడా ఈ రెంటితో కలిసి ఎన్నికల సమరంలో పాల్గొంటుందా? అన్న విషయంలో మాత్రమే సందిగ్ధత ఉందని అంతా ఇంత కాలం భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ముఖ్యంగా హస్తినలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లి వచ్చిన తరువాత రాష్ట్రంలో పొత్తుల విషయంలో ఒకింత సందేహం వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ ఇప్పటికీ జగన్ సర్కార్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతున్నప్పటికీ.. పొత్తు చర్చల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. బీజేపీ వ్యూహాత్మకంగా ఒక వైపు జగన్ సర్కార్ పై పార్టీ అగ్రనాయకత్వం నుంచి రాష్ట్ర నాయకుల వరకూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు అంటూ వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు.  అదే సమయంలో కేంద్రం నుంచి జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అవసరమైన సహకారం అందుతోంది. దీంతో బీజేపీ అటో ఇటో తేల్చుకోలేకపోతున్నదనీ, రాష్ట్ర రాజకీయాల గురించి ఆ పార్టీకి పెద్దగా పట్టింపు లేదనీ, జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికలలో  ఏపీ నుంచి చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాల మద్దతు కోసమే ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరి వైపు నిలవాలి అన్నది తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ పార్టీ ఎటు వైపు ఉన్నా అసెంబ్లీ ఎన్నికలలో అది చూపే ప్రభావం దాదాపు శూన్యమనే అంటున్నారు. ఇక మిగిలినది తెలుగుదేశం, జనసేన పార్టీలు. పొత్తుల విషయంలో ఆ రెండు పార్టీలూ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయంటున్నారు. తెలుగుదేశంపై ఒత్తిడి పెంచేందుకు జనసేన, జనసేనపై ఒత్తిడి పెంచాలని తెలుగుదేశం భావిస్తున్నాయన్ని పరిశీలకుల విశ్లేషణ. జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగితే జరిగేదేమిటన్నది విస్పష్టంగా తెలుసు. తనకున్న సినీ గ్లామర్ ఓటుగా మారుతుందన్న విశ్వాసం లేదని ఆయనే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు కేడర్ కు చెప్పేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను కీలక పాత్ర పోషిస్తానని కూడా విస్పష్టంగా చెప్పారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్న జనసేన అసెంబ్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తెలుగుదేశంలో పొత్తులో భాగంగా ఆ పార్టీ ప్రతిపాదిస్తున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి పొత్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ కొండకచో గత తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అదే సమయంలో మరో వైపు తెలుగుదేశం కూడా పొత్తుల విషయంలో తొందరపాటు లేకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.   జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్  జనసేన పోటీ చేసే సీట్ల ఎన్ని, ఏవి అన్న విషయంలో త్వరలో వెల్లడిస్తామని ప్రకటించి ఒత్తిడిని మరింత పెంచే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం నుంచి మాత్రం నాదెండ్ల ప్రకటనపై  ఎటువంటి స్పందనా రాలేదు. అలాగే జనసేనాని స్వయంతో తెనాలి నుంచి నాదెండ్ల పోటీ చేస్తారని ప్రకటించడం ద్వారా కీలక సీటు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పొత్తుల మీద ప్రభావం చేపుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   మరో వైపు  తెలుగుదేశం అయితే  పొత్తులు ఉంటే మంచిదే.. లేకపోయినా మంచిదో అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. పొత్తల పేరు చెప్పి పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. గత నాలుగేళ్లకు పైగా ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కేసులు, దాడులూ ఎదుర్కొంటూ పోరాడుతున్న తమ పక్షానే ప్రజలు ఉన్నారన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నది.  మొత్తం మీద రానున్న రోజులలో పొత్తుల విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

జెపి రూట్ మారిందా..?

లోకసత్తా జయప్రకాష్ నారాయణ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానంగా దాదాపు అవుననే వినవస్తుంది. దీనికి కారణం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో జగన్, జేపీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడమే. జేపీకి రాజకీయ ఆసక్తి ఉంది. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి మల్కాజిగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆసక్తి ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సిపీ అధినేత జగన్ తో  ఆయన ముసి ముసి నవ్వులు.. ముచ్చట్లు.. కొత్త ఊహాగానాలు దారి తీస్తున్నాయి. లోక్ సత్తాను  ప్రజలను చైతన్యవంతం చేసే సంస్థగా ప్రారంభించి.. ప్రభంజనాన్ని సృష్టించి.. తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు జయప్రకాష్ నారాయణ. 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ రెండు శాతం ఓట్లు సాధించింది. కూకట్ పల్లి  నుంచి పోటీ చేసి పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఆయన ఒక్కరు మాత్రం గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్నుంచీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఇటీవల వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్లమెంట్ కు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. లోక్ సత్తా పార్టీని మళ్లీ పునరుద్ధరించి ఆ పార్టీ తరపునపోటీ చేస్తారా లేకపోతే వేరే ఇతర పార్టీలో చేరుతారా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. నిజానికి లోక్ సత్తను రద్దు చేసినట్లుగా జేపీ ప్రకటిచారు కానీ.. ఆ పార్టీ మాజీ నేతలు విడిగా లోక్ సత్తా పేరుతో పార్టీని కొనసాగిస్తున్నారు. కానీ పెద్దగా కార్యకలాపాల్లేవు. లోక్ సత్తా జేపీ సోషల్ మీడియాతో పాటు మీడియా చర్చల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. ఇటీవల జగన్ ప్రకటించిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు.. ఆ వ్యవస్థను జేపీ సమర్థించారు. ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్కాబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిజానికి ఆప్కాబ్ కు..   జేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆప్కాబ్ చైర్మన్ గా పని చేశారని ఆయనను పిలిచారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రభుత్వ కార్యక్రమాల్లో అది కూడా జగన్ తో    కలిసి స్టేజ్ పంచుకోవడంతో ఆయన వైసీపీలో చేరికపై చర్చ ప్రారంభమయింది. వైసీపీలో చేరడమా లేకపోతే వైసీపీ మద్దతుతో విజయవాడ లేదా గుంటూరు ఎంపీగా పోటీ చేయడమా అనే డైలమాలో ఉన్నారని అంటున్నారు. రెండు, మూడు రోజుల నుంచి జేపీ, వైసీపీ బంధం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నా అటు వైసీపీ కానీ.. ఇటు జయప్రకాష్ నారాయణ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ లాంటి నేత వస్తే.. వైసీపీ వద్దనే అవకాశం లేదు. చేర్చకుంటారు.. ఎంపీ టిక్కెట్ కూడా ఇస్తారని అంటున్నారు. కానీ జేపీ చేరుతారా అన్నదే కీలకం. ఆయన ఓ మేధావిగా సమాజంలో ఇమేజ్ తెచ్చుకున్నారు. తన పార్టీ కాకపోతే ఆయన తన స్థాయికి తగ్గట్లుగా బీజేపీ వంటి జాతీయ పార్టీలో చేరుతారని అంటున్నారు. కానీ వైసీపీలో ఎందుకు చేరుతారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి..  రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఇరువురూ గుంభనంగా ఉంటున్నారంటే.. ఏదో ఒకటి జరిగినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. అదే గనుక జరిగితే.. జేపీ సొంత ఆదర్శ విలువలు.. సిద్ధాంతాలు.. ఆలోచనలు పక్కన పెట్టి.. వైసీపీ గొంతుకను జేపీ వినిపించాల్సి ఉంటుంది. అలా జయప్రకాశ్ నారాయణ చేస్తారా.. ?

అంతా అయ్యాక తీరిగ్గా సీఎం జగన్ ..!

ఈ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన ఈ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. ఏపీలో అన్ని జిల్లాలలో ఈ వర్షాలు, వరదల ప్రభావం లేకపోగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో మాత్రం ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలనువరదలు ముంచెత్తాయి. ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాలలో బిక్కుబిక్కు మంటూ గడిపారు. అధికారులే వారికి తోచిన సాయం అందించగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్న విమర్శలు  భారీగా వినిపించాయి. అందుకే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వరద ప్రాంతాలలో పర్యటించారు. సీఎం జగన్ సోమవారం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం ప్రాంతంలో ఉన్న కూన‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల వర్షాల కార‌ణంగా వ‌ర‌దతో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఇక్కడ జ‌గ‌న్ మాట్లాడుతూ.. బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా ముందుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అధికారులు క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌ర్య‌టిస్తున్నార‌ని.. అక్క‌డే ఉంటున్నార‌ని చెప్పారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. మొత్తం రెండు రోజులు సీఎం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నట్లు రెండు రోజుల క్రితమే సీఎంఓ ప్రకటించింది. అయితే, ప్రజలు ఇబ్బందులలో ఉండగా కనీసం అటు కన్నెత్తి కూడా చూడకుండా, ఇప్పుడు వరదలు తగ్గి అంతా అయిపోయాక సీఎం పర్యటనకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎం అనే సంగతి మర్చిపోయి ఒక ప్రతిపక్ష నేత మాదిరి వరద బాధితుల పరామర్శకు వెళ్లినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో వరదలు, తుఫాన్ల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ప్రజలకు అండగా నిలిచారో గుర్తు చేసుకుంటున్న ప్రజలు.. ఇప్పుడు వరదలు అయ్యాక వెళ్లి పరామర్శించి హామీలు ఇస్తున్న సీఎం జగన్  తీరును విమర్శిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రల ప్రభావం ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై కనిపిస్తున్నదని.. అందుకే సీఎంగా బాధితులకు అండగా ఉండాల్సిన జగన్.. ఇలా సర్వం కోల్పోయాక ఓదార్చి అండగా ఉంటానని హామీలు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, జగన్ ఈ పర్యటన విషయానికి వస్తే సోమ, మంగళవారం రెండు రోజుల పర్యటన అని సీఎంఓ పేర్కొంది. కానీ, ఇది కనీసం ఒక్క రోజు కూడా లేదు. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ పర్యటన మంగళవారం ఉదయం ముగుస్తుంది. మంగళవారం మధ్యాహ్నానికి సీఎం తిరిగి తాడేపల్లి ఇంటికి కూడా చేరుకోనున్నారు. దాదాపుగా సీఎంగా జగన్ పర్యటనలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఉదయం తాడేపల్లిలో బయలుదేరితే మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునేలా ఉంటుంది. లేదా రెండు రోజుల పర్యటన అంటే ఇలా ఒకరోజు మధ్యాహ్నం మొదలై మరుసటి రోజు ఉదయానికి ముగుస్తుంది. ఒక రాత్రి, ఒక పూట జరిగే ఈ పర్యటనను రెండు రోజుల పర్యటన అని చెప్పుకుంటారు.  కాగా, ఈ మూడు జిల్లాల పర్యటనను చూసిన బాధితులకు ముందే విషయం చెప్పి ప్రిపేర్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. బాధితులలో మన పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని వారికి ముందే సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ఓదార్పు పర్యటనలను సాగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. అందుకే అది బయటపడకుండా ఇలా తమ పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. నిజానికి జగన్ గతంలో దీక్షలు, ఓదార్పు యాత్ర, పాదయాత్రలలో కూడా ఇలాగే చేసేవారు. ప్రతిదీ ముందే ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ పెట్టుకొని ముందుకెళ్ళేవారు. ఇప్పుడు సీఎంగా కూడా ఆ పద్ధతి వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

బాబు చంద్ర నిప్పులు..ఇక సమరమే!

నిదానమే ప్రధానం అనే చంద్రబాబు దూకుడు పెంచారు. శాంతం శాంతం అనే  పెద్దాయన పులివెందుల నడిబొడ్డున నిలబడి.. ఏయ్ జగన్ ఇది నా అడ్డా అంటూ గర్జించారు. తన కుటుంబంపై, కార్యకర్తలపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా ఇది సంస్కారం కాదంటూ వైసీపీకి క్లాస్ పీకిన, న్యాయపోరాటం చేద్దాం అంటూ తెలుగుదేశం శ్రేణులను శాంత పరిచిన చంద్రబాబు ఇప్పుడు తెగించాల్సిన సమయం వచ్చింది  తమ్ముళ్లూ అంటూ హుంకరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు.. విలువలు కలిగిన రాజకీయం రావాలని చెబుతూ వచ్చిన చంద్రబాబు, రేపు మాదే అధికారం రాసి పెట్టుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు స్వరం మారింది. గళంలో తీవ్రత పెరిగింది. ఆయన భాషలో మునుపెన్నడూ లేని పదును కనిపిస్తున్నది.  పులివెందుల వెళ్లి మరీ వైసీపీ నేతలకు రీ సౌండ్ వినిపించేలా గద్దించి మాట్లాడారు. రాయలసీమ నడి బొడ్డున సభ పెట్టి వై నాట్ పులివెందుల అంటూ నినదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమలో మొదలైన చంద్రబాబు బిగ్ సౌండ్ ఇప్పుడు ఏపీ మొత్తం వినిపిస్తోంది. చంద్రబాబు దూకుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన నుండే మొదలైంది. పులివెందుల సభలో ఆయన మాట్లాడిన తీరు, పుంగనూరు ఘర్షణలతో ఆయన తెగింపు, నెల్లూరులో ఆయన హెచ్చరికలు.. ఎక్కడ చూసినా గత నాలుగేళ్ళలో  ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే అలిగిననాడు అన్నట్లుగా చంద్రబాబు ఆగ్రహం కనిపిస్తోంది. అది రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నేను మా నాన్న అంత మంచోడిని కాదంటూ నారా లోకేష్ మాట్లాడితే.. ఇప్పుడు ఆ లోకేష్ ను మించి చంద్రబాబు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతూ ప్రాజెక్టులకు మీరేం చేశారో చెప్పండి.. ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తానని బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ యుద్ధం డిక్లేర్ చేశారు. అయితే, చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ప్రజల నుండి వస్తున్న స్పందనే అని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భవం తరువాత ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర సమయంలో కనిపించిన జనచైతన్యం ఇప్పుడు చంద్రబాబు పర్యటనల్లో కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా చంద్రబాబు రోడ్ షోకు ఊహించని స్థాయిలో జనాలు పోటెత్తారు. దీంతో చంద్రబాబులో  కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందంటున్నారు.  అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకొని ఈ ప్రాజెక్టుల సందర్శనకు బ్రేకులు వేయాలని చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు తెగించి పోరాడడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా శాంత ప్రవచనాలు వల్లిస్తూ వారి ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని నియంత్రించడం సరికాదని  చంద్రబాబు భావిస్తున్నారనీ అందుకే ఆయన స్వరంలో మార్పు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రజలలో  తెలుగుదేశం వైపు మొగ్గు  స్పష్టంగా కనిపిస్తుండడంతో చంద్రబాబు తన వయసును మరచి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం చంద్రబాబు ఏలూరు జిల్లాలో ఉన్నారు. చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించారు. పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ఇచ్చారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలించారు.   

వనమాకు సుప్రీంలో ఊరట!

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంలో ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడాన్ని రద్దు చేస్తూ ఆయనపై ఆ ఎన్నికలలో ప్రత్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించింది. కాగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వనమా పిటిషన్ ను విచారణకు స్వీకరించి, 15 రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. 2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే వనమా సమర్పించిన  ఎన్నికల అఫిడవిట్ లో  తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ జలగం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇటీవల వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కాగా కాంగ్రస్ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి విజయం సాధించిన వనమా ఆ తరువాత కొద్ది రోజులకు బీఆర్ఎస్ (అప్పటికి ఇంకా తెరాసయే)లో చేరిపోయారు. దీంతో ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో చేరిపోయి పరస్పరం వ్యతిరేకించుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ కు అప్పటి నుంచీ ఒకింత ఇబ్బందికరంగానే మారింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగులందరికీ టికెట్లు.. అని ఒక సారి.. కాదు కాదు కొందరికే అని మరోసారి ఇలా తెరాస అధినాయకత్వమే అయోమయంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులిద్దరూ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువడగానే స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక విధమైన రిలీఫ్ కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వనమాకు పార్టీ టికెట్ లభిస్తే.. ఆయన విజయానికి ఆయన కుమారుడిపై ఉన్న తీవ్ర ఆరోపణలు అవరోధంగా మారతాయని కొత్తగూడెం బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పుతో వారు ఒక విధంగా రిలీఫ్ చెందారని చెప్పవచ్చు. ఇప్పుడు వనమాకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. 

జగన్ కు మరో ట్రబుల్ సెప్టెంబర్ 1 ముహూర్తం..!

ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం సహజం. అయితే, ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇది రాజకీయ సంకటంగా మారింది. గత నాలుగేళ్ళలో కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం కావడంతో ఇప్పుడు అన్ని వైపుల నుండి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన, కుంటుపడిన అభివృద్ధికి తోడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేరని హామీలు అన్నీ ప్రభుత్వానికి గుదిబండలా మారాయి. ఒకవైపేమో ముంచుకొస్తున్న ఎన్నికలు.. మరోవైపు సూటిగా ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలకు తోడు ఇప్పుడు నెరవేరని హామీల తాలూకు బాధితులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలన్నిటీనీ ప్రజల మధ్య చర్చకు పెట్టారు.  మరోవైపు  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని ప్రజల కళ్ళకు కనిపించేలా చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కక్ష్ పూరిత వైఖరి, అసమర్ధ పాలనను ఎండగడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు మరో ట్రబుల్ మొదలు కానుంది. అదే ఉద్యోగ సంఘాల సీపీఎస్ రద్దు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ స్కీం తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. వారం కాదు నాలుగేళ్లు అయినా ఆ హామీ నెరవేరనేలేదు. సీపీఎస్ బదులు జీపీఎస్ అని మరో పథకాన్ని తీసుకొచ్చి మసి పూసి మారేడు కాయ చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. కానీ, అందుకు ఉద్యోగులు అసలు ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా ఓల్డ్ పెన్షన్ స్కీం మాత్రమే అమలు చేయాలనీ, జగన్ మైకులలో ఊదరగొట్టిన హామీ అమలు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబట్టి ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి గళం విప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.  సెప్టెంబరు ఒకటిన చలో విజయవాడకు పిలుపునిస్తూ ఉద్యోగ సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. సీపీఎస్ రద్దుతో పాటు, సీపీఎస్ ఉద్యోగులపై గతంలో పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చని నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు.. జీపీఎస్ వద్దు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమరానికి సిద్ధమవుతున్నాయి. వైనాట్ ఓపీఎస్ అంటూ రోడ్డెక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలోనూ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎలాగైనా నిరోధించాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఉద్యోగుల ముందు ప్రభుత్వం పప్పులు ఉడకలేదు. గతంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా వేలాది మంది ఉద్యోగులు వివిధ మార్గాల్లో విజయవాడకు చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ నిరసన గళాన్ని మరింత బలంగా వినిపించారు. ప్రభుత్వం అడ్డుకున్నా బెజవాడ రోడ్లు ఉద్యోగులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన చేపట్టిన చలో విజయవాడ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ట్రబుల్ గా మారింది. మరోవైపు ఒక్కసారి ఉద్యోగ సంఘాలు బయటకి వస్తే.. గత ఎన్నికలలో ఇచ్చిన మిగతా హామీల బాధితులు కూడా బయటకి రావడం గ్యారంటీ. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లుల విషయంలో హాస్పటిల్స్, కాలేజీల యాజమాన్యాలు గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైతే.. అది అన్ని వర్గాలలో వ్యక్తమవడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితులను వైసీపీ సర్కార్   ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.

ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? తెరపై కొచ్చిన పాత పంచాయతీ!

తెలంగాణ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? అనే పాత పంచాయతీ మళ్ళీ మరో మారు తెరపై కొచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి జన్మదిన (డిసెంబర్ 9) కానుక ఇచ్చేందుకు. రేపటి న్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ నేతలు చేస్తున్న, ప్రచారానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసేఆర్  అసెంబ్లీ వేదిక నుంచి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వివరించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఏకరవు పెట్టారు. దీంతో మరో మారు, తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసేఆర్ కాంగ్రెస్ పార్టీ పాత పాపాలను ఏకరవు పెట్టారు. తెలంగాణ ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు అన్నది తర్వాత సంగతి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రతి సందర్భంలో తెలంగాణ  ప్రజలను వంచించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?  కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల ఫలితంగా సుమారు ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది. ఎన్నో కష్ట నష్టాలు చవిచూసింది.  భయంకరమైన పరిస్థితులు ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైన బాధలు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని ఇవ్వలేదు. 2014లో అన్నిచోట్లా ఎదుగాలి ఎదుర్కొంటున్న పార్టీని బలోపేతం చేసుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ, భారత తొలి ప్రధాని నెహ్రు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రాలో తెలంగాణ విలీనాన్ని గట్టిగా  వ్యతిరేకించినా నెహ్రూ పట్టుపట్టి తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని, అదే జరగకుంటే, తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చేదే కాదని అన్నారు  సో.. తెలంగాణ ప్రథమ ద్రోహి, కాంగ్రెస్ పార్టీ, భారత తొలి ప్రధాని నెహ్రూ ..అంటూ  కాంగ్రెస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకు పడ్డారు.  అలాగే  మంత్రి కేటీఆర్ తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాదనను తిప్పి కొడుతూ బ్రిటిష్ పాలకులు దేశానికి తామే స్వాతంతం ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ వాదన అట్లా ఉందని ఎద్దేవా చేశారు. నిజానికి  1969, 1971 ఉద్యమాలలో వందల వేల మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీ, 2014లో మరో గత్యంతరం లేకనే తెలంగాణ ఇచ్చిందని అన్నారు. అంతే కాదు 2004 ఎన్నికల ప్రణాళికలో యూపీఎ ఉమ్మడి కార్యక్రమంలో, రాష్ట్ర పతి ప్రసంగంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించి పుష్కర కాలం పైగా సాగదీయడం వల్లనే వందల సంఖ్యలో విద్యార్ధులు,  నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారని  ఇది కాంగ్రెస్ చేసిన పాపం కాదా అని ప్రశ్నించారు.దీంతో మరో మారు తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది.  

గల్లా అరుణ పొలిటికల్ రీ ఎంట్రీ?

మాజీ మంత్రి, సీనియర్ పాలిటి షియన్ గల్లా అరుణకుమారి పాలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీ యాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె, ఇప్పుడు మళ్లీ పాలిటికల్ గా యాక్టివేట్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను నిర్వర్తించిన గల్లా అరుణకుమారి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకు ముందు అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన అరుణకుమారి 2014లో తెలుగుదేశం పార్టీలో కుమారుడు గల్లా జయదేవ్ తో కలిసి చేరారు. గుంటూరు ఎంపీగా తనయుడు గల్లా జయదేవ్ కు టికెట్ ఇప్పించారు. గుంటూరు నుంచి ఎంపీగా గల్లా జయదేవ్ రెండుసార్లు విజయం సాధించారు. 2019  ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం లో కూడా కీలకమైన గుంటూరు నుంచి ఆయన విజయం సాధించి టీడీపీ జెండాను ఎగురవేశారు. అయితే గల్లా అరుణకుమారి మాత్రం 2014 ఓటమి అనంతరం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఏడాది జూన్ లో టీడీపీ పాలిటీబ్యూరో పదవికి కూడా రాజీనామా చేసినప్పటికీ పార్టీకి మద్దతు ప్రకటించారు. తన తనయుడు జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి నిశ్చయించుకున్నట్లు ఆనాడు చంద్రబాబుకు తెలిపారు. దీంతో టీడీపీ అధిష్టానం చంద్రగిరి బాధ్యతలను మరో సీనియర్ నేత పులివర్తి నానికి అప్పగించింది. 2019 ఎన్నికల్లో నానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ వైసీపీ నేత డెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గం పార్టీ బాధ్యుడిగా పులివర్తి నానినే కొనసాగుతున్నారు. అయితే ఆనాటి పరిణామాల నేపథ్యంలో ఒక దశలో అరుణకుమారి తన రాజకీయ శకం ముగిసిందని వ్యాపార బాధ్యతలు నిర్వ ర్తించేందుకు పాలిటిక్స్ కు దూరమవుతున్నట్లుగా ప్రకటన కూడా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ టీడీపీకి మద్దతుగానే ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధిష్టానం టికెట్ టికెట్ కేటాయిస్తే ఆమె చంద్రగిరి నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంతో కీలకమైన గల్లా కుటుంబం నుంచి చంద్ర గిరిలో పోటీచేసినట్లయితే విజయం నల్లేరు మీద నడకేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొందరు చెబుతున్నారు. ఇంకోవైపు గల్లా అరుణకుమారి సన్నిహితుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టా నం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

రాహుల్ తొలి విజయం.. లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించినట్టు లోక్‌సభ సోమవారం (ఆగస్టు 7) నోటిఫికేషన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష అమలుపై ఆగస్టు 4న సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామంతో 137 రోజుల అనంతరం  రాహుల్ ఎంపీగా  కొత్త పార్లమెంట్ భవనంలోకి తొలిసారి  అడుగుపెట్టబోతున్నారు. రాహుల్ గాంధీని తిరిగి ఎంపీగా గుర్తించడంతో ఢిల్లీలోని 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మిఠాయిలు తినిపించి హర్షం వ్యక్తం చేశారు. అసలింతకీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని డిస్ క్వాలిఫై చేసే విషయంలో లోక్ సభ సెక్రటేరియెట్ వాయువేగంతో నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటంటే,  ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన  కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో  రాహుల్ పై అనర్హత వేటు పడింది.  ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేమిటంటే..  దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో  చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా దాఖలైంది.  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలుఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు, 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ నిర్ణయం తీసుకుంది.  సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా అక్కడా చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది. రాహుల్ జైలు శిక్ష, జరిమానాపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. 

వెంకన్నదేవుడిపై ఎందుకింత కక్ష.. టీటీడీ చైర్మన్ గా నాస్తికుడికి మళ్లీ అవకాశమా?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో అయన స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.  నిజానికి గతంలో వైవీ నియామకం విషయంలో చెలరేగిన దుమారం  నేప్యంలో ఈసారి అయినా  హిందూ ధర్మం పట్ల పూర్ణ విశ్వాసం ఉన్న వారికి  టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   టీటీడీ చైర్మన్ పదవి ఆశించిన ముగ్గురిలోంచి భూమనను ఎంపిక చేశారు. భూమన గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. జగన్ రెడ్డి మరో మారు ఆయనకు ఆవకాశం కల్పించారు.  టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సిద్ధ రాఘవరావు పేర్లు కూడా వినిపించాయి. చివరకు దేవుని దయతో భూమనకు పదవి వరించింది. అయితే అదేమీ పాపమో, అదెక్కడి శాపమో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2006 నుంచి 2008 వరకు) టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్నప్పుడే, ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయి. నిజ నిజాలు ఏమో కానీ, ఏడుకొండల పవిత్రతను రెండు కొండలకు కుదించాలనే   సంకల్పం భూమన కరుణాకర రెడ్డిదే అంటారు. అలాగే, మిగిలిన్ ఐదు కొండలపై చర్చిలు నిర్మించాలనే   సంకల్పం విషయంలోనూ భూమన భూమిక ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే భూమన పై టీటీడీ నిధుల దుర్వినియోగం  వంటి ఇతరత్రా ఆరోపణలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి  ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి  బాబాయ్ టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కొండపై యధేచ్చగా సాగుతున్న అన్యమత ప్రచారం, ఆస్తులు విక్రయం, నిధుల కైంకర్యం, తిరుమలను ఆధ్యాత్మిక స్థాయిని దిగజార్చి, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రయత్నాల వంటి అనేక ఆకృత్యాలకు  భూమన కరుణాకర రెడ్డి ఆద్యుడనే అరోపణలున్నాయి. అందుకే ఇప్పడు కూడా ప్రతిపక్షాలతో పాటుగా,  హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు కరుణాకర రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  అన్నిటినీ మించి, భూమనపై అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రధాన ఆరోపణ  ఆయన నాస్తికుడు.    వెంకన్న స్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తి గా ముద్ర వేసుకున్నారని అంటారు.  కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు  భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ అదే తీరుగా అవహేళన చేసిన చరిత్ర భూమనకుందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్ప్సు సోషల్ మీడియాలో  పాత సంగతేలపే గుర్తుకు తెచ్చుకుంటున్నారు.  అలాగే సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణా రావు మొదలు అనేక మంది భూమన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు  భూమన నియామకం వెనక  రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేవా కార్యక్రమల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దారి మళ్ళించి పందేరం చేసిన విధంగా, రేపటి ఎన్నికలలో గెలిచేందుకు టీటీడీ నిధులను సేవ  పేరున పందేరం చేసే కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.మరో వంక   స్వామీ నీ కొద్దీ అన్యమత నాస్తిక చైర్మన్  యాష్ ట్యాగ్ తో భూమన నియామకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భక్తులు తమ మొర స్వామి వారికే వినిపించుకుంటున్నారు. అలాగే శాపనార్ధాలు పెడుతున్నారు.  

టీటీడీ చైర్మన్ భూమన.. జంగా అలక!

కలియుగ  దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఆ ఏడుకొండలపై కొలువైన శ్రీవారంటే  అందరికీ ప్రీతీ పాత్రుడైన దైవంగా పేరుంది. అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆయన దర్శనం కోసం తపిస్తుంటారు. ఈ కలియుగ వైకుంఠంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం  ఏపీ ప్రభుత్వ నియంత్రణలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీటీడీకి పాలక మండలి, ఆ మండలి చైర్మన్ ని ఎన్నుకోవడం కూడా తెలిసిందే. పేరుకే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎన్నుకున్నా.. చైర్మన్ ఎవరు అనేది ఏపీ ప్రభుత్వమే నిర్ణయిస్తూ వస్తున్నది. కాగా, ఇప్పుడు ఈ టీటీడీకి ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు.  గత నాలుగేళ్లుగా ఈ పదవిలో సీఎం జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి కొనసాగుతూ వచ్చారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కాగా.. ఈ నాలుగేళ్లూ ఆయనే చైర్మన్ గా ఉన్నారు. టీటీడీ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం చైర్మన్‌గా వ్యవహరించిన మరో నాయకుడు లేరు. మరో 8 నెలల్లో ఎన్నికలు ఉన్నందున ఈసారి టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని కొంత కాలంగా ఉత్కంఠ కొనసాగింది. చివరి ఏడాది వెనుకబడిన వర్గాల వారికి చైర్మన్ పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించేసుకున్నారనీ, అందుకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును ఖరారు చేసేశారనీ వైసీపీ శ్రేణులే గట్టిగా చెబుతూ వచ్చాయి. కానీ చివరికి మరోసారి కూడా రెడ్డి సామజిక వర్గానికే ఈ పదవిని కట్టబెట్టారు. అనూహ్యంగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. భూమన ఇప్పటికే ఒకసారి టీటీడీ చైర్మన్ పదవిని చేపట్టి ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం భూమనకు ఇది రెండోసారి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు. ఇలా రెండోసారి ఈ పదవిలో కొనసాగిన వారు ఇప్పుడున్న సుబ్బారెడ్డి, రేపు రాబోయే కరుణాకర్ రెడ్డి తప్ప మరెవరూ లేరు. అది కూడా ఇద్దరూ సీఎం జగన్ కు దగ్గరి బంధువులే కావడం విశేషం. గతంలో సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీ కాలం పూర్తయినపుడు కూడా భూమన పేరు వినిపించగా అప్పుడు వైసీపీ అధిష్టానం భూమనకు రెండోసారి ఈ పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ, సుబ్బారెడ్డి రెండుసార్లు అయ్యాక సీఎం జగన్ ఇప్పుడు భూమనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.   ఈ చైర్మన్ పదవి రేసులో  గత కొంత కాలంగా రకరకాల పేర్లు వినిపించాయి. వీరిలో జగన్‌కు సన్నిహితులైన భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు బీసీ కోటాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు వినిపించాయి. వీరిలో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి  తనకు మంత్రి పదవిని ఆశించి భంగపడటంతో టీటీడీ చైర్మన్ పదవిని నిరాకరించి నిరసన తెలిపారని అంటున్నారు. దాంతో జగన్  ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జంగా పేరు ఖరారు చేసేశారని వైసీపీ శ్రేణులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వచ్చారు.  ఇప్పటికే నాలుగేళ్లు రెడ్డి సామజిక వర్గమే ఈ పదవిలో ఉండడంతో ఈసారి బీసీలకు ఛాన్స్ ఇస్తారని, జంగా కృష్ణమూర్తికి ఈ అవకాశం దక్కడం ఖాయమనీ అంతా అనుకున్నారు. కానీ  అనూహ్యంగా టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి  అలకపాన్పు ఎక్కారు.  నిజానికి జంగా వైసీపీ ఆవిర్భావం నుంచీ  నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీసీ యాదవ వర్గానికి చెందిన నేత కావడంతో పార్టీలోని బీసీ నేతలతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేయగా.. అప్పటి నుండే చైర్మన్ గా శ్రీవారి సేవ చేయాలని ఆశపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని కీలక పదవులు సీఎం సొంత సామాజికవర్గానికి ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం, ఇప్పటికే రెండు సార్లు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉండడంతో ఈసారి జంగానే చైర్మన్  అని అందరూ భావించారు. జంగా కూడా అదే అనుకున్నారు.   ఈ మేరకు జంగాకు జగన్ హామీ కూడా ఇచ్చినట్లు చెప్పుకున్నారు.  తీరా చివరికొచ్చేసరికి తనకు రిక్తహస్తం చూపడంతో  జంగా  అలకబూనినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో ఎవరికీ టచ్ లో లేకుండా పోయినట్లు తెలుస్తుంది. ఆయన తన  ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అధిష్ఠానం ఆయన్ను బుజ్జగిస్తుందా.. లేక ఆయనే ఏమైనా షాకులు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.

సుబ్బారెడ్డి నోట రాజధాని విశాఖ మాట.. మళ్లీ మళ్లీ పాత పాట

విశాఖ రాజధాని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు.. అందులో ఒకటి పరిపాలన రాజధానిగా విశాఖ. సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండే పాలన సాగించనున్నారు. ఇలాంటి మాటలు  ఏడాది  కిందటి వరకూ ఏపీ ప్రజలను   ఉలికిపాటుకు గురి చేసేవి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి అవసరం ఉండే పరిపాలన రాజధానిని ఒక మూలన ఉండే విశాఖకు తరలించడం ఏంటన్నది ఎప్పటి నుండో సగటు ప్రజలతో పాటు మేధావుల వాదన. కానీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఏది ఏమైనా పరిపాలన విశాఖ నుండే అంటూ మూర్ఖంగా వాదిస్తూ వచ్చింది. అయితే మూడేళ్లుగా ఇదే మాట వినీ వినీ ప్రజలలో ఇప్పుడు దీనిపై చలనం కూడా ఉండడం లేదు. ప్రకటనలు తప్ప ఇది సాంకేతికంగా జరిగే పని కాదులే అని ఏపీ ప్రజలు డిసైడైపోయి ఆ మాటలను లైట్ తీసుకుంటున్నారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం ఇంకా విశాఖకు రాజధాని అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి వారు సమయం సందర్భం ఉన్నా, లేకుండా ఇప్పటికే ఎన్నోసార్లు ఈ మూడు రాజధానుల ముచ్చట, అందులో విశాఖకు రాజధాని తరలింపుపై ఎన్నో ప్రకటనలు చేశారు. అందులో చాలా మంది ఇప్పుడు ప్రజలకు, మీడియాకు కూడా మొహం చాటేస్తున్నారు. ఇంకా విశాఖ రాజధాని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోయి నవ్వే పరిస్థితి వచ్చిందని ఈ నేతలకు కూడా అర్ధమైపోయింది. కానీ, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు సీఎం జగన్ కు మరో బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం త్వరలోనే విశాఖకు రాజధాని అంటూ కామెడీ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా వైజాగ్-వన్ ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్నారు. లీగల్ ఇష్యూస్ కారణంగా రాజధానిగా విశాఖ ఆలస్యమవుతోందని.. మరో మూడు నెలల్లో రాజధాని విశాఖకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం  వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా, టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. మంగళవారం (ఆగస్టు 8)తో  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరీ గవుడు ముగుస్తుంది. దీంతో ఆయన ఆ రోజు నుంచీ పూర్తిగా ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే మరోసారి విశాఖే  రాజధాని అని.. మరో మూడు నెలల్లో జగన్ విశాఖకు తరలి రానున్నారని.. దసరా తర్వాత విశాఖ నుండే పాలన కొనసాగుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.  అయితే  వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అరిచి గీపెట్టినా రాజధాని విశాఖ తరలింపు అంశం అధికారికంగా జరిగే పనికాదు. ఒక పక్క ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని సుబ్బారెడ్డి అంటూనే విశాఖకు రాజధాని అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధాని చేస్తామని.. అక్కడ భూములను ప్రభుత్వానికి ఇస్తే అభివృద్ధి చేసి ఇస్తామని అక్కడి రైతులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే.. రాజధాని రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఈ పరిహారాన్ని కట్టాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మినా సరిపోదు. ఒకవేళ శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కదా అని వైసీపీ ప్రభుత్వం వాదించినా.. ఏకైక రాజధాని, అదీ అక్కడే ఉండేలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రకరకాలుగా అమరావతి రైతులకు అగ్రిమెంట్ చేసి ఉంది.  ఈ చట్టాల ప్రకారమే ఇప్పుడు వైసీపీ అడుగు ముందుకు వేయలేకపోతుంది. ఈ చట్టాల ఆధారంగానే కోర్టు తీర్పులు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు నిండా ఎనిమిది తొమ్మిది నెలల సమయం కూడా లేదు.  ఈ లోగా అనధికారికంగా విశాఖకు రాజధాని తరలింపు చేయాలని భావించినా.. అక్కడ పరిస్థితులు చక్కదిద్దుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే, ప్రజలు విశాఖకు రాజధాని తరలింపు అంశాన్ని పూర్తిగా మార్చిపోయారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం ఇదిగో ఇలా మళ్ళీ మళ్ళీ ప్రకటనలు చేసి ఇంకా ఇంకా చులకన అవుతున్నారు.

చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం తొలి నాలుగు రోజులు ప్రశాంతంగా సాగినా.. శుక్రవారం నుండి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అన్నమయ్య జిల్లాలో మొదలై చిత్తూరు జిల్లాలో రంగరంగంగా మారగా.. శనివారం శ్రీకాళహస్తిలోనూ అదే టెన్షన్ కొనసాగింది. శనివారం చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు శ్రీకాళహస్తిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అసలే టెన్షన్ వాతావరణం ఉండగా.. మున్సిపల్ సిబ్బంది చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.  ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా.. టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలని.. వారిని అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలతోనే తాము ఈ ఫ్లెక్సీల తొలగింపునకు వచ్చామని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముందే అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ.. తొలగించమని సిబ్బందికి ఆదేశాలివ్వడం ఏంటని పసుపు సైన్యం వాగ్వాదానికి దిగింది. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితోనే మున్సిపల్ కమిషనర్ ఈ ఆదేశాలిచ్చినట్లు కలకలం రేగగా.. ఫ్లెక్సీలను తొలగిస్తే తీవ్ర చర్యలు తప్పని టీడీపీ నేతలు హెచ్చరించడంతో చంద్రబాబు రాకకు ముందే ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక, చంద్రబాబు సభలో మాట్లాడుతూ.. అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజల సమస్యలపై తాను మాట్లాడితే తనపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైసీపీ చూస్తోందని.. ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారుల వల్ల మంచి పోలీసులకు చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులకు ప్రభుత్వం టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదనీ,  టీడీపీ కార్యకర్తల్ని కొట్టమని మాత్రం లాఠీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు. ఇక, అక్కడ నుండి శనివారమే నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు.. సోమశిల ప్రాజెక్టును పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.  సోమశిల, కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారని.. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. శనివారం రాత్రి అక్కడే బస చేసిన చంద్రబాబు.. ఆదివారం ఉదయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. రైతుల సభలో ప్రసంగించారు. ఇక, నాలుగు గంటలకు అక్కడి నుంచి దెందులూరు వెళ్లారు. కాగా, గతేడాది ఆగస్టు 31న గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3వ గేటు పూర్తిగా కొట్టుకుపోగా.. 6, 7 గేట్లు పాక్షికంగా దెబ్బతినగా.. అప్పుడు ప్రాజెక్టులోని రెండు టీఎంసీల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా వర్షాలు ముందే కురిసి ఉంటే రైతులకు నీరందేది కాదు. ఇక ఇప్పటికీ నత్త నడకన సాగుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాది అయినా పూర్తవుతాయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు ఇదే విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి కడిగిపారేశారు. కాగా, చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన, ఆ సందర్భంగా చేస్తున్న విమర్శలు, సంధిస్తున్న ప్రశ్నలతో వైసీపీ నేతలు  ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అసలే ప్రజలలో వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఒక్కసారిగా సమాజానికి జీవనదుల లాంటి ప్రాజెక్టుల విధ్వంసం అంటూ చంద్రబాబు ప్రజలలో చైతన్యం తీసుకువస్తుండడంతో ఇక తమ పనైపోయినట్లేనని అర్ధమైన వైసీపీ   ఏదో ఒక విధంగా చంద్రబాబు పర్యటనను  అడ్డుకోవాలని చూస్తున్నది. అందులో భాగమే పుంగనూరులో వైసీపీ కార్యకర్తల విధ్వంసకర వీరంగం,  శ్రీకాళహస్తిలో మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపడం. అయితే, చంద్రబాబు అన్నటినీ అధిగమించి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను చుట్టేస్తున్నారు. ఈ పర్యటన పూర్తయ్యేలోపు వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల అంశంలో అధఃపాతాళానికి పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.