ఆరున్నర గంటల పాటు సుదీర్ఘ వాదనలు!

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి వెళ్లిన డీఐజీ రఘు రామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. అర్ధరాత్రి చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న భస్సు తలుపులు బలంగా కొట్టి మరీ ఆయనను బయటకు రప్పించారు. చంద్రబాబును అరెస్ట్ చేయనున్నారని తెలుసుకున్న అక్కడే ఉన్న టీడీపీ నేతలు పోలీసులను అడుకునే ప్రయత్నం చేశారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని చంద్రబాబు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెల్లవారు జాము వరకూ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబును కలిసి అరెస్టు చేశారు.  నంద్యాల నుండి విజయవాడకు రోడ్డు మార్గం ద్వారానే చంద్రబాబును తరలించిన పోలీసులు.. ఆదివారం ఉదయం వరకూ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదు. సాయంత్రం 5 గంటలకే ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చినా రాత్రంతా విచారణ పేరుతో వేధించారు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా.. విశ్రాంతి తీసుకొనే వీలు లేకుండా చంద్రబాబును పోలీసులు వేధించారు. అయితే, అరెస్ట్ చేసిన 24 గంటలలోపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాల్సిన నిబంధనతో ఆదివారం ఉదయం ఆయన్ను ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు  సుదీర్ఘంగా సాగాయి.   మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత   విచారణ  ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు . కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలువినిపించగా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అసలు చంద్రబాబు పేరు కూడా ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును చేర్చడంపై కోర్టులో సుదీర్ఘ వాదన జరిగింది. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాల్సి ఉండగా ఏసీబీ ఎందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించగా సెక్షన్ 409 కింద అభియోగాలు మోపి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం విచారణ మొదలైన కేసులో ఏ ఆధారాలు సమర్పించక ముందే అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం, సీఐడీ పేర్కొన్నట్లుగా ఈ కేసులో చంద్రబాబు వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయా అనే అంశాలపై వాదనలు నడిచాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని పేర్కొన్న లూథ్రా.. చంద్రబాబు అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల ఫోన్ కాల్ రికార్డును కోర్టుకు సమర్పించాలన్నారు.  ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా కోర్టు రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ వివరించారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్ రిపోర్ట్ రాస్తారా అని లూథ్రా ప్రశ్నించారు. అలాగే 2021లో ఈ కేసు పెడితే ఇప్పటి వరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదని కోర్టు ఏజీని ప్రశ్నించింది. అలాగే సెక్షన్ 409 కింద అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండాలని.. కనీసం వారం రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని.. కానీ ఇవేమీ లేకుండానే సీఐడీ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో చంద్రబాబును ఇరికిస్తున్నారని లూథ్రా కోర్టుకు తెలిపారు. సెక్షన్ 17ఏ గురించి కోర్టుకు వివరించిన సిద్ధార్థ లూథ్రా.. సెక్షన్ 24, 8 ఆఫ్ పీసీ యాక్ట్ గురించి కూడా వివరించారు. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ మంజూరైందని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాగా దానిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అలాంటి ప్రభుత్వ చర్యలలో తనకు వ్యక్తిగతంగా లాభం ఉందని.. అందులో అసలు చంద్రబాబు పాత్ర ఉందని కానీ రెండేళ్లలో సీఐడీ ఎక్కడా పేర్కొనలేదు. అలాగే ఇప్పుడు అలాంటి ఆధారాలు కూడా లేవన్న దానిపై కోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి.

ఎఫ్ఐఆర్ లో అప్పటికిప్పుడు చేరిన చంద్రబాబు పేరు!

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం(సెప్టెంబర్ 8) అర్ధరాత్రి నుండి హైడ్రామా తర్వాత శనివారం (సెప్టెంబర్ 9)ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటలలోపు న్యాయస్థానం లేదా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలన్న నిబంధన మేరకు ఆదివారం(సెప్టెంబర్ 10) ఉదయం 5 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్దకు తండోపతండాలుగా తెలుగుదేశం అభిమానులు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో న్యాయవాదులు కూడా చేరుకున్నారు. సీఐడీ అరెస్ట్, కేసు పూర్వాపరాలు, అరెస్ట్ చేసిన తీరు, నమోదు చేసిన సెక్షన్లు, చట్టబద్దంగానే అరెస్ట్ చేసారా లేదా ఇలా పలు కోణాలలో కోర్టులో వాదనలు కొనసాగాయి.  అయితే, చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. కొన్ని గంటల పాటు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కాగా, అరెస్ట్ అంశంలో ప్రధానంగా కొన్ని అంశాలు కోర్టుకు ఆగ్రహాన్ని తెప్పించాయి. పీసీ యాక్ట్ ప్రకారం వారం రోజులు ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు శిబిరం వద్దకు వచ్చిన సీఐడీ పోలీసులు అప్పటికప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలాగే 2021లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే అప్పుడు ఇందులో చంద్రబాబు పేరు లేదు. గతంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా ఇప్పుడు తాజాగా ఆయన పేరు చేర్చి హడావిడిగా అరెస్ట్ చేసారు. అలాగే ఇప్పటికిప్పుడు రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరును చేర్చారు. అలాగే సెక్షన్ 17ఏ కింద అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ, సీఐడీ పోలీసులు చంద్రబాబు అరెస్టు కోసం గవర్నర్ అనుమతి కోరలేదు. దీంతో ఇవే ఇప్పుడు సీఐడీ కొంపముంచాయి. చంద్రబాబు అరెస్టుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరగగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ఇప్పటికిప్పుడు చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ, ఏఏజీకి ప్రశ్నలు సంధించారు. గతంలో ఎఫ్ఐఆర్ చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు పేరు ఎందుకు చేర్చారో చెప్పాలని నిలదీశారు. అలాగే సెక్షన్ 409 కింద అరెస్ట్ చేసినట్లు సీఐడీ పేర్కొనగా.. అందుకు ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయా అని న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. లాజికల్ గా జడ్జి అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు, ఏఏజీ సుధాకర్ రెడ్డి ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ ప్రశ్నల తర్వాత పది నిమిషాల పాటు వాదనలకు న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చేంతగా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ముందుగా న్యాయమూర్తి చంద్రబాబు నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో తన వాదనలు తానే వినిపించుకుంటానని చంద్రబాబు కోరగా న్యాయమూర్తి  అంగీకరించారు. దీంతో తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కక్ష్ పూరిత పాలన జరుగుతుందని.. గతంలో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ ఇప్పుడు తన అక్రమ అరెస్టును చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట వినిపించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీబీఐ రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారని, తనపై కేసు నమోదు చేశారని, ఇది చట్ట విరుద్ధమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఆనాటి కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వం 2015 బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని కూడా పొందుపరిచామని, అది అసెంబ్లీ ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలాగే 2021లో నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో తన పేరు, తన పాత్ర గురించి పేర్కొనలేదని చంద్రబాబు వివరించారు. వాదన విన్న న్యాయమూర్తి మీరు కోర్లు హాల్లోనే ఉంటారా అని చంద్రబాబును ప్రశ్నించగా.. వాదనలు పూర్తయ్యేవరకూ కోర్టులోనే ఉంటానని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు వాంగ్మూలం, న్యాయవాదుల ప్రశ్నలకు సీఐడీ అధికారుల వద్ద సమాధానాలే కరువయ్యాయి.

పెళ్లి రోజు ఇంతలో..

స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టాయి. అయితే నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మద్యాహ్నం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.  అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. భాదలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. తన భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. తన భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారని.. ఈ పోరాటంలో ఆయన సాధిస్తారని ఆకాంక్షించారు. చంద్రబాబు పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలకు నారా భువనేశ్వరి విజ్జప్తి చేశారు.    సెప్టెంబర్ 10వ తేదీ నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆదివారం వారు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవాలనుకొన్నారు. కానీ ఇంతలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం.. ఆయన్ని విజయవాడకు పోలీసులు తరలించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం దుర్గమ్మను దర్శించుకొన్నారు. ఆమె వెంట పార్టీ శ్రేణులు ఉన్నాయి.  ఓ వైపు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే తన తండ్రి  చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన విజయవాడకు బయలుదేరారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 200 రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మంగళగిరిలో లోకేశ్‌ను ఆయన తల్లి భువనేశ్వరి కలిశారు. మరోవైపు చంద్రబాబునాయుడు.. బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన నంద్యాలలోనే విశ్రాంతి తీసుకొంటు ఉండగా శనివారం ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబు అరెస్ట్.. ఒక్కటిగా కదిలిన ఏపీ ప్రతిపక్షాలు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందునుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగానే ఏపీ పోలీసులు  అరెస్ట్ చేశారు. నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్నచంద్రబాబును కనీసం రెండు బెటాయిలియన్ల పోలీసుల్ని పంపి అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచి మొదలు పెట్టిన అరెస్ట్ డ్రామాను తెల్లవారే వరకూ కొనసాగించి టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేశారు. అసలు తెల్లవారే వరకూ చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పడానికి పోలీసులు నిరాకరించడం తీవ్ర విమర్శల పాలవుతున్నది. కనీసం జెడ్+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు అరెస్టుపై ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడం.. కేంద్ర హోమ్ శాఖ భద్రత ఉన్న ఆయన అరెస్టుపై కేంద్ర హోమ్ శాఖకు కూడా సమాచారం ఇవ్వకపోవడం మరింత విమర్శల పాలవుతోంది.  చంద్రబాబు అరెస్టు కేవలం కక్షపూరిత రాజకీయంగా మాత్రమే కనిపిస్తుండగా.. ఒక్క రోజు అయినా చంద్రబాబును జైల్లో పెట్టాలన్న సీఎం జగన్ రెడ్డి కోరికను తీర్చుకునేందుకు ఇలా పోలీసు వ్యవస్థను,    అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శని, ఆదివారం కోర్టులకు సెలవు కావడం, మరో వైపు ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటం అన్నీ చూసుకొని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టుకు ఉపక్రమించడం చూస్తే వైసీపీ ప్రభుత్వం ఎంతటి సైకో మెంటాలిటీతో ఉందో అర్ధమవుతున్నదని టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని చంద్రబాబు సవాల్ చేయగా.. ఆయన చేసిన తప్పేంటో, కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏపీ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేసింది. అప్పటికప్పుడు నోటీసులు అందించడం.. మిగిలిన వివరాలను రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేస్తాం.. ఇప్పుడు మాకు సహకరించాలని పోలీసులు వేడుకోవడం చూస్తే.. పోలీస్ వ్యవస్థ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ఊడిగం చేస్తున్నదో స్పష్టమవుతుంది.  అయితే, చంద్రబాబు అరెస్టు ఏపీలో ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా మారింది. చంద్రబాబు అరెస్టును వైసీపీ మినహా దాదాపుగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిచాయి. ప్రతిపక్ష నేతలంతా ఈ అరెస్టును ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టి జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. పాలన పరంగా అనుభవం ఉన్న వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకేలా ఉండాలని పవన్ హితవు పలికారు. అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు అండగా ఉంటూ మద్దతు తెలుపుతున్నామని పవన్ స్పష్టం చేశారు.  చంద్రబాబును అరెస్టు చేసిన తీరును బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పు పట్టారు. ప్రోసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు. చంద్రబాబు అరెస్టును సిపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలీసులు అర్థరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను నిర్బంధించడం దుర్మార్గమని ఆయన అన్నారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై పాల్పడుతున్న వేధింపు చర్యలకు చంద్రబాబు అరెస్టు  పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు తీరు పట్ల సీపీఎం రాష్ట్ర కమిటీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి చంద్రబాబు వసతిపై దాడిచేసి, జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.  రానున్న ఎన్నికల సమయానికి పొత్తులు ఉంటాయా.. విడివిడిగానే ఎన్నికలకు వెళ్తారా అన్నది తెలియదు కానీ చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఎన్నికల సమయానికి ఎవరు ఎలా అనేది పక్కన పెడితే ఇప్పుడైతే అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.   చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని.. అలాంటిది ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి అక్రమ అరెస్టులను తెరతీయడాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అరెస్టు అంశంలో అధికార పార్టీ వైసీపీ ఒక్కటీ ఒకవైపు ఉంటే.. మిగిలిన  పార్టీలన్నీ ఒకవైపున నిలబడ్డాయి. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఏపీ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికలకు ముందు బాబు అరెస్ట్.. కోరి మరీ టీడీపీకి మైలేజ్ ఇస్తున్న జగన్?!

ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరిక కొంతమేర నెరవేరింది. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష పడుతుందా? పడితే ఎన్నేళ్లు పడుతుంది? రిమాండ్ కు తరలిస్తారా? ఎన్నిరోజుల రిమాండ్ విధిస్తారు? బెయిల్ వస్తుందా? ఇలాంటి అనుమానాలన్నీ ముందు ముందు తేలాల్సి ఉండగా.. ప్రస్తుతానికి అయితే కొంతమేర సీఎం జగన్ తన కోరిక నెరవేర్చుకున్నారు. రూ.371 కోట్ల రూపాయలను లేని కంపెనీలను సృష్టించి నిధులు తరలించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది. దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో స్కాంకు పాల్పడినట్టు వైసీపీ తీవ్ర ప్రచారం చేస్తుంది. మరి ఈ అరెస్ట్ రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది? చంద్రబాబును అరెస్ట్ చేసిన హీరోగా జగన్ మైలేజ్ పొందుతాడా? తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు సానుభూతి పొందుతారా అన్న చర్చలు జరిగిపోతున్నాయి. నిజానికి ఏపీలో ఇప్పుడు టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు యమా దూకుడు మీదున్నారు. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే.. చంద్రబాబు బస్సు యాత్రలు, సాగునీటి ప్రోజెక్టుల పరిశీలన అంటూ జగన్ మోహన్ రెడ్డిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ యాత్రలతో టీడీపీ క్యాడర్ ఉత్సహం రెట్టింపు అవుతుంది. ప్రజల నుండి కూడా అనూహ్య స్పందన వస్తుంది. టీడీపీ నేతలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా ప్రజల నుండి ఊహించని రీతిలో స్పందన వస్తుంది. దీంతో వైసీపీ నేతలకు ఇది మింగుడు పడడం లేదు. వైసీపీకి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా టీడీపీ దూకుడుకు బ్రేక్ వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అదే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ రూపంలో ఆచరణలోకి వచ్చిందా అనే అనుమానాలు కలిగిస్తుంది. అయితే, ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి కాస్త ఇబ్బందిగానే మారినా తర్వాత మాత్రం టీడీపీకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయ నిపుణులు సీఐడీ సృష్టించిన హడావుడి అంత సీన్ ఈ కేసులో ఉండదని తేల్చేశారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు హయంలో అవినీతి జరిగిందని ఆధారాలున్నా మహా అయితే 14 రోజుల రిమాండ్ సాధ్యమవుతుందని.. అయితే, కేసు తీవ్రత లేని దృష్ట్యా బెయిల్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదని చెప్తున్నారు. ఈక్రమంలో మహా అయితే శని, ఆదివారాలు చంద్రబాబు కస్టడీలో ఉండనున్నారు. సోమ లేదా మంగళవారం బెయిల్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా టీడీపీ నేతలు అన్ని సంప్రదింపులు జరుగుతుండగా ఏది ఏమైనా ఎక్కువ రోజులు ఈ కేసులో చంద్రబాబును తమ అధీనంలో ఉంచుకోవడం సీఐడీకి కుదరని పనిగానే భావించాలి. ఈ క్రమంలో ఈ అరెస్ట్ వ్యవహారం టీడీపీకి సానుభూతిపరంగా మరింత మైలేజీ తేవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నందుకే తనను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చంద్రబాబు ప్రజలకు చెప్పుకొనేందుకు మంచి స్టఫ్ దొరికినట్లే భావించాలి. తమను ఎదుర్కోలేని జగన్ పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష్య సాధింపు చర్యలకు పాలపడ్డాడని ఆరోపించేందుకు టీడీపీకి ఇది ఆయుధంగా మారనుంది. ప్రశ్నించిన వారిపై ఇలా కేసులు బనాయించి నోళ్లు మూయించాలని చూడడం జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదని.. ఇప్పటికే రాష్ట్రమంతా జగన్ బాధితులు ఉన్నారని ఉదాహరణలతో సహా టీడీపీ గోల్ చేసుకోవడం గ్యారంటీ. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ ఈ అరెస్టుతో తన చేతులతో తానే మరో ఆయుధాన్ని సిద్ధం చేసి టీడీపీ నేతలకు ఇచ్చినట్లే భావించాల్సి వస్తుంది. భావోద్వేగాలకు విలువలనిచ్చే ఏపీ ప్రజలు ఈ అరెస్టు పట్ల కూడా ఎమోషనల్ అయ్యేలా అన్ని దారులు కనిపిస్తున్న తరుణంలో ఇది జగన్ మోహన్ రెడ్డికి మరో సంకటంగా మారనుంది.

జగన్ బరితెగుంపునకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అరెస్ట్!

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 8) అర్ధరాత్రి పెద్ద ఎత్తున మోహరించి  శనివారం (సెప్టెంబర్ 9) ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించి ముందుగా నోటీసులు ఇవ్వకుండా అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన న్యాయవాదులు సీఐడీ అధికారులతో వాదనకు దిగారు. రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాల్ని నివృత్తి చేస్తామని సీఐడీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. మరోవైపు వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు అరెస్టును అడ్డుకోగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు చంద్రబాబు తన కాన్వాయ్ లోనే వచ్చేందుకు అంగీకరించడంతో ఆయన్ను అక్కడ నుండి తరలించారు. కాగా  చంద్రబాబుపై 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) నమోదు చేసినట్టు చంద్రబాబుకు ఏపీ సీఐడీ డిప్యూటీ సూపరింటెండెండ్ ధనుంజయుడి పేరుతో అప్పటికప్పుడు జారీ చేసిన నోటీసులో ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో చంద్రబాబును నాన్ బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టుగా ఆయన మీడియాకు  తర్వాత వివరించారు. అయితే ఈ మొత్తం  ఆరోపణలు, ఈ కేసులు, అర్ధరాత్రి హైడ్రామా, వందలాది కార్యకర్తలున్న ఓరాజకీయ కార్యక్రమం జరిగే చోట వందలమంది పోలీసులతో సీఐడీ రణరంగం సృష్టించడం చూస్తుంటే ఒక్కటి క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. కేసేంటి అన్నది పక్కన పెడితే ఈ వ్యవహారంలో జగన్ కక్షసాధింపు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నది.  16 నెలల పాటు జైల్లో ఉన్న వైఎస్ జగన్ కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో ఉంచాలి. తనను లక్ష కోట్ల అవినీతి పరుడిగా ముద్ర వేసిన చంద్రబాబు కూడా అవినీతి పరుడే అని ప్రచారం చేయాలి. ఇదే జగన్ లక్ష్యం. ఇందుకోసమే వ్యవస్థలను అడ్డగోలుగా వాడేసి తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే  జగన్ జైలుకు కాంగ్రెస్ కదా కారణం చంద్రబాబును ఏం చేశారని చాలా మందికి ఒక అనుమానం ఉంది. జగన్ పదహారు నెలలు జైలు పాలు చేసిన ఘటనలో కాంగ్రెస్ తో పాటు చంద్రబాబు హస్తం కూడా ఉందని వైసీపీ ఆది నుంచి అనుమానిస్తోంది. జగన్ కి కనీసం బెయిల్ కూడా రానీయకుండా అన్ని నెలల పాటు జైలులో ఉంచారన్నది వారి బాధ. చంద్రబాబే వ్యసస్థలను మ్యానేజ్ చేసి బెయిల్ రాకుండా చేశారని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పటి నుండి ఏ చిన్న కేసు దొరికినా దాన్ని చంద్రబాబుకు ఆపాదిస్తున్నది. నిజానికి అమరావతి రాజధాని అతి పెద్ద స్కాం అని, దాని మీద ఎన్నో విచారణలు జరిపించిన జగన్ ప్రభుత్వం  ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లభించక  స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసును అందిపుచ్చుకుంది. లేని కంపెనీలను సృష్టించి ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లించారన్నది ప్రభుత్వ వాదన. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగస్వామ్యం కావాలని ఈడీని కోరారు సీఐడీ అధికారులు. అయితే, ఈడీ ఈ వ్యవహారంలోకి రాలేదు. ఈ కేసు మిస్ చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయడం కుదరదని భావించిన సీఐడీ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అర్ధరాత్రి అరెస్టుకు తెర తీశారు. అయితే   ఈ కేసులో బాబు పాత్ర ఉందని ఆధారాలు పట్టుకోవడం అసంభవమని ఇప్పటికే విశ్లేషకులు తేల్చేశారు. కేవలం కక్షసాధింపు కోసమే  జగన్   ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉందన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ను జగన్ బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

చంద్రబాబు అరెస్ట్.. అసలు కేసేంటి? సీఐడీ అత్యుత్సాహం ఎందుకు?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగిన విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే చివరికి ఏపీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అయితే, ఈ అరెస్టు వెనక లక్ష్యం ఏంటి? ఆసలు ఈ కేసు ఏంటి? సెక్షన్ ఏంటి? కుంభకోణం ఏంటి? అందులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటన్నది కాసేపు పక్కన పెడితే అసలు అరెస్ట్ చేసిన తీరుపైనే తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ముందుగా రాజకీయ పర్యటనలో ఉండే సమయంలో అరెస్టుకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది. అదీ ముందుగా ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం.. అదీ అర్ధరాత్రి హడావిడి చేయడం మరింత అభ్యంతరకరంగా ఉంది. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా, అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు వెళ్లడం తప్పుడు చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై ఏపీలో వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు, ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు రాజకీయ పరిశీలకులు, మేధావులు కూడా చంద్రబాబు అరెస్ట్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అస‌లు జ‌డ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త, 14 ఏళ్ల‌పాటు సీఎంగా పనిచేసి ఉన్న‌త ప్రొఫైల్ ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబును వారాంతంలో కోర్టుకు సెలవు చూసుకొని అరెస్టు చేయడం, అదీ రాజకీయ పర్యటనలో ఉండగా అర్ధరాతి మందీ మార్బలంతో పోలీసులు దండయాత్ర చేయడంతో ఏపీలో అసలు రాజ్యాంగం అనే ఒకటుందా? చట్టం, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? లేక రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా ప్రభుత్వ తొత్తులుగా మారిపోయాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అసలు ఈ కేసు విషయానికి వస్తే ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తామని ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను డిజైన్‌టెక్‌ సంస్థకు బదలాయించగా మిగతా సొమ్మును సీమెన్స్ కంపెనీకి బదలాయించారు. ఈ 370 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది సీఐడీ ఆరోపణ. ఈ కేసులోనే  చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసు చూస్తేనే అర్ధమవుతుంది ఎంత సిల్లీగా ఉందో.. కానీ ఈ కేసును అడ్డం పెట్టుకొనే జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం చూస్తే కుక్క తోక పట్టుకొని నదిని ఈదినట్లే కనిపిస్తుంది. అసలు ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే చంద్రబాబుపై పదుల కొద్దీ కేసులు పెట్టారు. కానీ, న్యాయస్థానాల వద్ద ఒక్కటీ నిలబడలేదు. స్టేలు తెచ్చుకొని చంద్రబాబు మేనేజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ, నిజానికి ఆ కేసులలో విషయం లేకనే న్యాయస్థానాల వద్ద నిలవలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే. కేవలం ఓ నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు జబ్బలు చరుచుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ఇప్పటి వరకూ జగన్ లక్ష్య కోట్ల అవినీతి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తుండగా.. రిటర్న్ చంద్రబాబును కూడా అవినీతి పరుడుగానే బురద జల్లేందుకు, ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఈ కేసు పనికి రానుంది. అంతేతప్ప ఇందులో పసలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.

బెజవాడలో ఉద్రిక్తం.. భారీగా మోహరించిన పోలీసులు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఏపీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేసి.. విజయవాడకు తీసుకు వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో... శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా విజయవాడ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.  అయితే చంద్రబాబును కలిసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబుని కలిసేందుకు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుండగా.... అతడి ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్ట్ అధికారులను పోలీసులు కోరారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.  స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో కుంభకోణం జరిగిందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ స్పందంచారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ ఆరోపించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడమే కాకుండా.. ఆయనకు మద్దతు తెలిపారు. అందులోభాగంగా.. చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రయాణించే విమానానికి అనుమతి ఇవ్వవద్దంటూ గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులను ఏపీ పోలీసులు కోరారు.  ఇక తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలుసుకొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. పాదయాత్రను ఆపి.. విజయవాడకు బయలుదేరారు. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. శనివారం మధ్యాహ్నం. ఇంద్రకీలాద్రిపై కోలువైన దుర్గమ్మ వారిని దర్శించుకొన్నారు.  నంద్యాల నుంచి తీసుకు వస్తున్న చంద్రబాబు నాయుడిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు టీడీపీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు అభిమానులు భారీగా ఏసీబీ కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు అనుకూలంగా.. అధికార జగన్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించనున్నారు. అందుకోసం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి ఆయన విజయవాడ చేరుకున్నారు.

ఆర్థిక అసమానతలకు జి20 సదస్సులో పరిష్కారం!

దేశ రాజధాని ఢిల్లీలో  జీ 20 శిఖరాగ్ర సదస్సు మొదలైంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 9. 10) జరిగే ఈ శిఖరాగ్ర సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు, భారత ప్రభుత్వం సకల ఏర్పాట్లూ చేసింది.  వివిధ దేశాల దేశాధి నేతలు, మరెందరో ప్రపంచ ప్రముఖులు,హాజరవుతున్న ఈ సదస్సు ద్వారా భారత దేశ శక్తి, సామర్ధ్యాలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయ విలువలను ప్రపంచం ముందు ఉంచేందుకు  భారత ప్రభుత్వం సమున్నత స్థాయిలో సన్నాహాలు చేసింది.  దేశ రాజధాని నగరం దిల్లీ కనీ వినీ ఎరుగని రీతిలో అంగ రంగ వైభవంగా ముస్తాబైంది. ఇండియా అనుకుని భారత దేశంలో అడుగు పెట్టిన విదేశీ  ప్రముఖులు సైతం విస్తుపోయేలా రాజధాని నగరం అందంగా అలంకరించుకుంది. ఓ వంక కట్టు దిట్టమైన భద్రతా ఏర్పట్లు,మరో వంక అతిథులను రంజింప చేసే విధంగా స్వాగత సత్కారాలు. కనువిందు చేస్తున్న భారతీయ కళా రూపాల ప్రదర్శనలు. హస్త కళల వైభవ ప్రదర్శనలు.. ఇలా  ఢిల్లీ నగరంలో ఎటు చూసినా  పండగ కళ కనువిందు చేస్తోంది.  కొత్త ఢిల్లీ  ప్రపంచానికి  కొత్త  భారత్ ను పరిచయం చేస్తోందా అన్న విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు ఉన్నాయి.  మరో వైపు మొదటి సారిగా భారత దేశానికి  జీ 20 అధ్యక్ష బాధ్యతలు దక్కడం, మరో మరుపు రాని మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని అంటున్నారు.   నిజమే భారత దేశానికి జీ 20 అధ్యక్ష బాధ్యతలు దక్కడం, యాధృచ్ఛికమే కావచ్చు. వరస క్రమలో వచ్చిందే అయినా, ఇన్నేళ్ళలో మొదటి సారిగా భారత దేశానికి  జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే గౌరవం దక్కడం ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్   అంతటి వారు ఈ గౌరవం భారత్ కు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన  జీవిత కాలంలో భారత దేశానికీ  జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే గౌరవం దక్కడం, నిజంగా .. చాలా చాలా సంతోషంగా వుంది. జీ 20 దేశాధి నేతలకు భారత దేశం ఆతిధ్యం ఇవ్వడం   చూస్తున్నాను  అంటూ మన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఆవిధంగా ఆయన ఈ సదస్సు ప్రాముఖ్యత ఏమిటో చెప్పకనే చెప్పారు. అలాగే, భారత దేశ పరిపాలనా విధానంలో, అభివృద్ధిలో విదేశాంగ విధానం అత్యంత కీలకమని చెప్పడం ద్వారా మన్మోహన్ సింగ్ 20 శిఖరాగ్రసదస్సు ప్రాముఖ్యతను   వివరించారు. ఆ సదస్సును భారత్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసి మన్మోహన్ తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. అదలా ఉంటే అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారతీయ సంతతికి చెందిన ఇంగ్లాండ్   ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాల అధినేతలు  ఈ రెండు రోజుల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మరోవంక రెండు రోజుల చర్చలు, సంప్రదిపుల అనంతరం ఢిల్లీ డిక్లరేషన్ పేరున వెలువడే, జీ 20, 18 వశిఖరాగ్ర సమావేశం  ప్రకట కోసం ప్రపంచం మొత్తం, ఎదురు చూస్తోంది. నిజానికి, అంగరంగ వైభవంగా జరిగిన ఏర్పాట్లు, మన దేశం పై ప్రపంచ దేశాలు కురిపిస్తున్న ప్రశంసల జల్లుల విషయాన్ని పక్కన పెడితే  రెండురోజుల సదస్సు ముగిసిన అనంతరం వెలువడే,  న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్  కోసం సభ్య దేశాలే కాదు, ప్రపంచం మొత్తం  వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. మరో వంక ఢిల్లీ డిక్లరేషన్, గతానికి భిన్నంగా  ఆచరణ సాధ్యంగా ఉటుందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, దక్షిణ ప్రపంచం (గ్లోబల్ సౌత్) ఆశలు, ఆశయాలకు ప్రతీకగా నిలుస్తుందని, భారత దేశం విశ్వాసాన్ని ప్రకటించింది. నిజానికి జీ 20 శిఖరాగ్ర సదస్సుల గత చరిత్ర అంత ఘనంగా లేదనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. అయితే   కొవిడ్ అనంతర ప్రపంచానికి  ఇండియా చూపిన వెలుగు మార్గం నేపధ్యంలో  జి 20 శిఖరాగ్ర  సదస్సు ప్రధాన వేదికైన భారత్ లో కనుల పండగగా కొలువు తీరిన నేతలు గతానికి భిన్నంగా ఆచరణయోగ్యమైన, అంతకంటే ముఖ్యంగా మారుతున్న ప్రపంచం అవసరాలకు అనుగుణంగా భారత దేశం రూపొందించిన ఢిల్లీ డిక్లరేషన్’కు  ఆమోద ముద్ర వేస్తాయని ఆశిద్దాం.   జీ20లో ప్రారంభంలోనే కీలక  పరిణామం చోటు చేసుకొంది.  ఆఫ్రికన్‌ యూనియన్‌ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ లో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రారంభోపన్యాసంలోనే 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయం అంటూ భారత ఆలోచనలు  సభ్య దేశాల ముందుంచారు.  పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి  తన మాన్ కీ బాత్ ను పంచుకున్నారు.  అందుకనే మనం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందనే నగ్న సత్యాన్ని గుర్తు చేస్తూ యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందని, అందరి మనసులోని మాటను మోడీ తన నోట వినిపించారు. కొవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చునని అదరం  కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదామని పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య తేడాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్‌ జీ20 అధ్యక్షతన దేశం లోపలా, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారింది. దేశంలోని 70 పైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయి.   అయితే, జీ 20 శిఖరాగ్ర  సదస్సుపై ఎన్నో ఆశలు ఉన్న మాట ఎంత నిజమో, అంతకు పదిరెట్లు .. అనుమానాలు ఉన్నాయన్నది కుడా అంతే నిజం. ఈ నేపధ్యంలో   మొదలైన  జీ 20 మరో ప్రస్థానం .. ప్రపంచ సమస్యలకు  ముఖ్యంగా ప్రపంచ ప్రగతికి ప్రతిబంధకంగా నిలిచిన పర్యావరణ, కాలుష్య సమస్యలు, ఆర్థిక అసమానతల వంటి సంస్యలకు పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.

ఏలిన వారికి అడుగులకు మడుగులొత్తడానికే పరిమితమా?.. నవ్వుల పాలౌతున్న ఏపీ పోలీసు వ్యవస్థ!

చట్టానికీ, న్యాయానికీ ధర్మానికీ కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనే పవర్ ఫుల్ సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. పోలీసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ ఈ డైలాగ్ ను ఉటంకించడం పరిపాటిగా మారిపోయింది. అటువంటి నాలుగో సింహం ఏపీలో మాత్రం నవ్వుల పాలౌతోంది. అభాసుపాలౌతోంది. అధికార పార్టీ క్రియాశీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరుతో మొత్తం పోలీసు వ్యవస్థపైనే జనంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పాలి. ముఖ్యంగా సీఐడీ నమోదు చేసే ప్రతి కేసూ, చేసే ప్రతి అరెస్టు కేవలం అధికార పార్టీ ప్రాపకం కోసమే అన్నట్లుగా ఉంటున్నాయి. ఇందుకోసం సీఐడీ సీఆర్పీసీ నిబంధనలను సైతం తుంగలో తొక్కి ముందుకు సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక పోలీసు వ్యవస్థ విపక్ష నేతల పర్యటనలకు భద్రత కల్పించాల్సింది పోయి వారిపై దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించడం కొండొకచో.. దాడులకు పాల్పడేవారికి రక్షణ కవచంగా నిలబడటం చేస్తోందంటున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇలా విపక్షాల నాయకులపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడుతుంటే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి నిలబడిపోతోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  నిందితులపై చర్యలు తీసుకోవలసిన, ముద్దాయిలపై కేసులు పెట్టాల్సిన వాళ్లు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ, విపక్షాల నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఏ రాష్ట్రంలోనయినా వీవీఐపీలు, కేంద్రభద్రత ఉన్న ప్రముఖులకు.. ఆయా రాష్ట్రాల పోలీసులు భద్రత కల్పించడం రివాజు. సదరు ప్రముఖుల పర్యటన పూర్తయ్యేవరకూ  ఎటన్షన్ లో ఉండాల్సిన పోలీసులు ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతల. మరీ ముఖ్యంగా జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలకు పోలీసుల ప్రోత్సాహం, సహకారం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.    ఏపీలో అధికార పార్టీ మూకలు జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనలలో ఆయనకు అత్యంత సమీపంగా వెళ్లి దాడులకు తెగబడుతున్నా.. ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైపెచ్చు అధికార పార్టీ శ్రేణులకు చంద్రబాబుకు అత్యంత సమీపంలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనలలో వరుసగా చోటు చేసుకున్న, చోటు చేసుకుంటున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు తెలుగుదేశం విమర్శలు అక్షర సత్యాలనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతా జరిగిన తరువాత  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేసి స్వామి భక్తిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం  కార్యాలయంపై  వైసీపీ శ్రేణులు  దాడి చేసి, అద్దాలు-తలుపులు ధ్వంసం చేసి, కార్యాలయ సిబ్బందిని గాయపరిస్తే వారిపై కేసులు నమోదు చేయడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగకపోవడాన్ని తెలుగుదేశం వర్గాలు ఎత్తి చూపుతున్నాయి. పోలీసుల చిత్తశుద్ధిని, విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం కార్యాలయంపై వైసీసీ దాడి అనంతరం ఎస్పీజీ అధికారులు  వచ్చి పరిశీలించి బాబు భద్రత విషయంలో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వెళ్లారంటే ఏపీ పోలీసుల తీరు ఎంత దివ్యంగా ఉందో ఇట్లే అవగతమౌతుంది.    హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టింగుల విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర పోలీసులు, సీఐడీ విఫలమయ్యారంటూ హైకోర్టు ఆ కేసులు సీబీఐకి అప్పగించిందంటేనే ఏపీలో పోలీసు వ్యవస్థ తీరు తెన్నులు ఎలాగున్నాయన్నది ఎవరికైనా అర్ధమైపోతుంది.  అయితే సీఎంపై సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టారన్న కారణంతో వృద్ధులు, వికలాంగులు, విద్యార్ధులపై కేసులు పెట్టే పోలీసుల ఉత్సాహం.. హైకోర్టు జడ్జిలపై పోస్టింగుల విషయంలో ఏమైందని ప్రశ్నలు అదే సమాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.    అలాగే మార్గదర్శి కేసుల , అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న కోర్టు ఆదేశాలు కూడా  సీఐడీ ధిక్కరిస్తున్న వైనం పరిశీలిస్తే పోలీసులకు నిజమైన బాస్ ఎవరో ఇట్టే తెలిసిపోతుందని పరిశీలకులు అంటున్నారు.  అధికారంలో ఉన్న వారికి అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పూర్తిగా కోల్పోక ముందే  తీరు మార్చుకుంటే మేలని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.    తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ నంద్యాలలో అరెస్టు చేసిన తీరు, ఆ సందర్భంగా పోలీసులు చూపిన అత్యుత్సాహం, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఉందో లేదో కూడా చూసుకోకుండా అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసు ఇచ్చి విజయవాడకు తరలించడం చూస్తుంటే.. పోలీసులు చట్టానికి లోబడి కాకుండా.. అధికారంలో ఉన్న కొద్ది మంది వ్యక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

కార్డు ఎందుకు దండగ.. ఏటీఎంలో యూపీఐ స్కాన్ ఉండగా!

ఏటీఎం.. ఇప్పుడంటే పేటీఎం, జీపే, ఫోన్ పే, భారత్ పే, వాట్సాప్ పే, భీమ్ పే ఇలా ఎన్నో రకాల యూపీఐ పేమెంట్ యాప్స్ వచ్చాయి కానీ.. అంతకు ముందు బ్యాంకు, లేదంటే ఏటీఎం మాత్రమే లావాదేవీలకు దిక్కు. బ్యాంకులో రద్దీని తట్టుకోలేక వీలైనంతవరకు అందరూ ఏటీఎంల మీదనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పటికీ చాలా మంది నగదు కావాలంటే ఏటీఎంలలో విత్ డ్రా  చేసుకుంటారు. అయితే  తరచుగా ఎక్కడో చోట పెట్టేసి కార్డులు మర్చిపోవడం, పోగొట్టుకోవడం, లేదా పిన్ నంబర్ మర్చిపోవడం పలువురికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్  అప్షన్స్ తీసుకొచ్చారు. అయితే  సదరు బ్యాంక్ యాప్ ఉంటేనే ఇది వీలవుతుంది. ముందుగా యాప్ లో ఎంత కావాలో అంతకు కార్డ్ లెస్ లో సెలక్ట్ చేసుకుంటే ఒక పాస్ వర్డ్ వస్తుంది. దాంతో ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ కార్డ్ లెస్ విత్ డ్రాయల్ విధానంలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. యూపీఐ పేమెంట్ అప్షన్ ద్వారా కూడా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.  హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. యూపీఐ ఏటీఎంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీన్ని  హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం  అని పిలుస్తారు. దీనిని ఉపయోగించుకుని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో పని లేకుండానే  ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో ఈ హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను లాంచ్ చేశారు. త్వరలో ఈ ఏటీఎంలను  అందుబాటులోకి రానున్నాయి.  యూపీఐ ద్వారా నగదు పొందాలంటే ముందుగా ఎంత మెుత్తం డ్రా చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ సాధారణ ఏటీఎంల మాదిరే రూ.100, రూ.500, రూ.1000,  వంటి మొత్తాల వంటి నగదు అప్షన్స్ కనిపిస్తాయి. ఎంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నారో ఎంటర్ చేయాలి. అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్‌ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. తర్వాత మీ యూపీఐ పిన్  ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ కరెర్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ప్రక్రియ మెుదలవుతుంది. అది పూర్తి అయిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.  సాధారణంగా ఏటీఎం కార్డుతో ఎలా ట్రాన్సక్షన్ చేస్తామో ఈ ఏటీఎంలో కూడా అంతే ఉంటుంది. అక్కడ కార్డు వివరాలను ఏటీఎం రీడ్ చేసి మీ వివరాలను స్క్రీన్ మీద చూపిస్తే.. ఈ యూపీఏ ఏటీఎంలలో మాత్రం మీరు స్కాన్ చేసిన అనంతరం యూపీఐ యాప్ వివరాలను స్కాన్ చేస్తుంది అంతే తేడా. ప్రస్తుతం దేశంలో 3000 ఏటీఎంలకు ఇది యాక్సస్ కలిగి ఉన్నట్లు చెప్తుండగా.. త్వరలోనే ఈ ఏటీఎంలలో సేవలు అందుబాటులో రానున్నాయని చెప్తున్నారు. ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థలచే నిర్వహించబడుతుండగా.. యూపీఏ, కార్డుల స్కిమ్మింగ్ వంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్?!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టు అనూహ్యమేమీ కాదు. గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో చంద్రబాబు అరెస్టు పై విస్తృతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. స్వయంగా చంద్రబాబే తనను జగన్ సర్కార్ రెండు మూడు రోజులలో అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయన తన అరెస్టు గురించి చెప్పి మూడు రోజులు గడిచాయో లేదో ఆయన అనుమానాలు నిజమేనని తేలుస్తూ ఏపీలో అత్యంత విదూషక పాత్ర పోషిస్తున్న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అయితే సీఐడీ గత అరెస్టులు, కేసులకు భిన్నంగా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ అధిష్ఠానం మాస్టర్ ప్లాన్ ఉందని పరిశీలకులు అంటున్నారు. తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మోడీ మరో సారి అంటే ముచ్చటగా మూడో సారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే దేశంలో, అలాగే బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని ఏపీలో కూడా ఏదో ఒక విధంగా అలజడి, అనిశ్చితి ఏర్పడితే.. అది అంతిమంగా జగన్ కు అనుకూలంగా మారితే.. ఏపీలో సీట్లు, ఓట్లూ లేకపోయినా బీజేపీకి వచ్చిన బాధేమీ లేదు. కేంద్రంలో మరో సారి మోడీ అధికారంలోకి రావడమంటూ జరిగితే..జగన్ ఎటూ తన చెప్పుచేతల్లోనే ఉంటారు కనుక మద్దతుకు ఢోకా ఉండదు. జగన్ పార్టీ పేరుకు ఎన్డీయే భాగస్వామ్య పార్టీ కాదు కానీ.. ఆ భాగస్వామ్య పక్షాలకు మించిన విధేయతా, విశ్వాసం వైసీపీ నుంచి బీజేపీకి దక్కుతోంది. ముందు ముందు దక్కుతుంది కూడా. ఇక బీజేపీ మాస్టర్  ప్లాన్ ప్రకారం ఏపీలో బలమైన రాజకీయ పార్టీ ఉండకూడదు. 2019 ఎన్నికలలోనూ అదే లక్ష్యంతో పని చేసింది. ఇప్పుడు 2024 ఎన్నికలలోనూ అదే లక్ష్యంతో పని చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే ఏపీలో తెలుగుదేశం బలం తగ్గించడం కోసం రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఉనికిని సైతం కోల్పోవడానికి రెడీ అవుతోంది. అందుకే పార్టీ రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర నాయకత్వమే జగన్ తో సంబంధాలు నెరుపుతోంది. అడ్డగోలు అప్పులకు సహకారం అందిస్తోంది.  జగన్ కు మద్దతుగా నిలవడం వల్ల రాష్ట్రంలో బీజేపీ ఏమాత్రం బలపడే అవకాశాలు లేవు. అసలా పార్టీకి ఏపీలో ఉన్న బలం దాదాపు శూన్యం. అందుకే తన ప్రయోజనాల కోసం కాకుండా జగన్ ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేపీ అధినాయకత్వం ఏపీల పావులు కదుపుతోంది.  ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో తెలుగుదేశం పార్టీకి జనం సానుకూలంగా ఉన్నారనీ, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పొత్తులతో సంబంధం లేకుండా ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమనీ బీజేపీ అంచనాకు వచ్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఐటీ షోకాజ్ నోటీసుల పేరుతో జగన్ కు ఒక ఆయుధాన్ని ఇచ్చింది. ఆ షోకాజ్ నోటీసులతో చంద్రబాబు అరెస్టయ్యే అవకాశం లేకపోయినా.. జగన్ చేతుల్లో ఉన్న ఏపీ సీఐడీని చంద్రబాబుపై ప్రయోగించే వెసులు బాటు వచ్చింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఐటీ నోటీసులే ఉన్నాయన్న భావన ఏపీ ప్రజలలో కల్పించి.. ఏపీ సీఐడీ అడ్డగోలుగా రెండేళ్ల కిందటి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది. ఇందుకు వెనుక నుంచి బీజేపీ  మద్దతు, ప్రోత్సాహం దండిగా ఉన్నాయనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.   వచ్చే ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోనికి వచ్చి మళ్లీ బలపడకుండా బీజేపీ  చేస్తున్న వ్యూహరచనలో భాగమే ఈ అరెస్టు అని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనగ్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబును ప్రజలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా తెరవెనుక నుంచి ఏపీలో తన మిత్రపక్షమైన జనసేన పట్ల జనం మొగ్గు చూపేలా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చి కొత్త అంకానికి బీజేపీ తెరలేపే అవకాశం ఉందని కూడా పురిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సునీల్ కనుగోలు మాటే శాసనం.. ఈయన చెప్పిన వారికే ఏఐసీసీ సీట్లు!

సునీల్ కనుగోలు.. గతంలో ఈ పేరు అక్కడక్కడా వినిపించినా కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ పేరు మార్మోగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అసెట్ గా సునీల్ కనుగోలు మారిపోయారని చెప్పొచ్చు. గతంలో కర్ణాటక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఈయన మాటే శాసనంగా మారిపోయింది.  తన వ్యూహలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేస్తున్న సునీల్ మాటే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కూడా వేద వాక్కుగా మారిపోయింది. అంతకు ముందు ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ పేరు మాత్రమే వినిపించేది.  ఇప్పుడు సునీల్ కనుగోలు పేరు అదే స్థాయిలో వినిపిస్తుంది. అవుతుందా లేదా.. బీజేపీ సక్సెస్ సీక్రెట్ గా మారిన మోడీ-షాల ద్వయం వ్యూహాలను సునీల్ ఛేదించగలరా అనే అనుమానాల మధ్యనే కర్ణాటకలో ఆయన వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి.  కర్ణాటకలో కాంగ్రెస్ కోసం ఏడాది కాలంగా ఆయన చేసిన సేవలు భేష్ అనిపించాయి. లెక్కలేసి పక్కగా ప్లాన్ అమలు చేయడంతో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. మ్యాజిక్ ఫిగర్ కు మించి స్థానాలను గెలిచిన కాంగ్రెస్ కర్ణాటకలో సింగిల్ గానే అధికారంలోకి వచ్చేసింది. ఒక్క కర్ణాటకలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది. ఇంతటి విజయానికి కారణమై, పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన కనుగోలుకు సిద్ద రామయ్య సర్కార్ పెద్దపీట వేసింది. ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా నియమించింది.  నెక్ట్స్ టార్గెట్ గా ఇప్పుడు సునీల్ తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మొత్తం ఆరు పాయింట్లతో సెగ్మెంట్లలో కనుగోలు విశ్లేషణ తెలంగాణలో కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు సునీల్ అభ్యర్థులను ఎలా ఫైనల్ చేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే సునీల్ అభ్యర్థుల ఎంపికలో ఒకదశ పూర్తి కాగా వివరాలను నేరుగా ఏఐసీసీ అధిష్టానికే అప్పగించినట్లు తెలుస్తుంది. రాష్ట్రస్థాయి నేతల సిఫారసులు, రిఫరెన్సులు లేకుండా ఢిల్లీ పెద్దలు కూడా సునీల్ నివేదికలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సునీల్ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలనే ప్రతిపాదన తీసుకురాగా.. ఇప్పటికే టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 119 స్థానాలకు గాను వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై దరఖాస్తుల్ని పరిశీలించింది. నియోజకవర్గాల వారీగా పరిశీలించి 1:3 నిష్పత్తిలో  అభ్యర్థులను ఫిల్టర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే, ఇదంతా కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా చేసినా ఫైనల్ గా సునీల్ ఫైనల్ చేసిన అభ్యర్థులకే టికెట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, సోనియాగాంధీ పర్యటన ఉండగా ఈ హడావిడి ముగిసిన అనంతరం అభ్యర్థుల తొలి జాబితా వెలువడనున్నట్లు తెలుస్తుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే 30 మంది పేర్లతో తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రత్యామ్నాయ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సి న అవసరం లేని ముప్పై నియోజకవర్గాలతో సునీల్ టీం ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేయగా ఆ  30 స్థానాల్లో ఎలాంటి మార్పులు లేకుండా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లిస్ట్ సునీల్ నివేదిక ప్రకారం వస్తే.. ఇక మిగతా నియోజకవర్గాలలో కూడా నేతల రిఫరెన్సులు ఏ మాత్రం పనిచేయవు. ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థులను సునీల్ నివేదికలేఎంపిక చేయనున్నాయి.

చంద్రబాబు అరెస్ట్.. అనుమానాలే నిజమయ్యాయి!

కేసులు ఆరోపణలు, సాక్ష్యాధారాలు నిబంధనలతో పని లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అన్న ఒకే ఒక లక్ష్యంతో గత నాలుగున్నరేళ్లుగా జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అమరావతి రాజధానిగా నిర్ణయించడం వెనుక భూముల కుంభకోణం ఉందనీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ మొదలు పెట్టి చంద్రబాబుపై జగన్ సర్కార్, వైసీపీ చేయని ఆరోపణ లేదు. వేయని నింద లేదు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లో ఒక్కటీ రుజువు చేయలేకపోయింది కానీ.. మూడు రాజధానుల నుంచి, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం వరకూ ప్రతి విషయంలోనూ జగన్ సర్కార్ న్యాయస్థానాలలో మొట్టికాయలు తింది. జగన్ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి పని చేసిన అధికారులకు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని సందర్భాలలో శిక్షలు విధించి కూడా సామాజిక సేవ వంటి వాటికి పరిమితం చేసి గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టింది. అలా ఈ నాలుగున్నరేళ్లలో జగన్ గారు ఏం చేస్తున్నారయ్యా.. అంటే నిర్ణయాలు తీసుకోవడం కోర్టులు కళ్లెం వేయడంతో వాటిని సవరించుకోవడంతోనే సరిపోయిందన్న సమాధానమే వస్తుంది. రాష్ట్ర ప్రగతి కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంపు. సంక్షేమం పేరిట పందేరం చేసిన సొమ్ముకు అంతకింతా ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేయడం వినా జగన్ సర్కార్ సాధించినదేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో జనంలో జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. జగన్ సభలలోంచి జనం గుంపులు గుంపులుగా లేచి వెళ్లిపోవడాన్ని దీనికి తార్కానంగా పరిశీలకులు చూపుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలకు ఎదురైన ప్రజా నిరసనే జగన్ పాలన పట్ల ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని ఎత్తి చూపిందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాకపోతే మరెప్పూడూ కాదు అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇక టార్గెట్ చంద్రబాబు అన్నట్లు ఆయన అరెస్టు చూసి ఎన్నికలకు వెళ్లి ఇంటికి వెళ్లిపోదాం అని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టు గురించిన ఫీలర్లు అధికార పార్టీ వదులుతూ వచ్చిందనీ, అయితే ఏ కేసులో, ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేస్తారన్నది వెల్లడించకుండా రోజుల వ్యవధిలో చంద్రబాబు అరెస్టు ఖాయమంటై వైసీపీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేసింది. దాంతో చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని మూడు రోజుల కిందట చంద్రబాబు చెప్పారు.  ఒక్క చాన్స్ ను పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న జగన్ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని నిర్ధారణకు వచ్చారనీ, దీంతో తాను ప్రజలలోకి వెళ్ల కుండా అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు.  తనపై  దాడులు అందులో భాగమేనని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజలలో మమేకం కాకుండా అడ్డుకునేందుకు తమ పార్టీ శ్రేణులపై  రౌడీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇవేవీ జగన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనీ, జనాదరణ, జనాభిమానం మెండుగా ఉన్న తనను ప్రజలలోకి వెళ్లకుండా ఆపడంలో విఫలమైన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతూ, జైలుకు పంపాలని కుట్ర పన్నిందని చంద్రబాబు మూడు రోజుల కిందటే ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ పాలన అంతం కావడం కోసం రాష్ట్రంలో ఇంటికి ఒకరు చొప్పున తనతో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  జగన్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనీ, ఆరేడు నెలలలో జరిగే ఎన్నికలలో  తెలుగుదేశం అనూహ్య మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  నిప్పులా బతికిన తనను తప్పుడు వ్యక్తిగా చూపేందుకు జగన్ పన్నుతున్న కుట్రలు ఫలించవన్నారు.  అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి తనపైనే ఐపీసీ 307కింద కేసు పెట్టారని  కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.  ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ వచ్చే సమయానికి చంద్రబాబును అరెస్టు చేసి జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని  కొందరు ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. చివరికి ఆ ప్రచారమే నిజమని తేలింది.  ఎప్పుడో విచారణ ముగిసిపోయిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తే ఆందోళనలు చెలరేగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్టులు, అరెస్టులూ చేస్తూ రాష్ట్రాన్నే జైలుగా మార్చేస్తున్నారు. మరి ఇంతకీ చంద్రబాబు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఒక వేళ ఆయన అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో చూడాల్సి ఉంది.

సకల శాఖల మంత్రే సీఐడీ సూపర్ బాస్!

సీఐడీకి సూపర్ బాస్ గా ప్రభుత్వ ముఖ్య సలహాదారు మారిపోయారా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుని ఈ ఉదయం సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా ఏ కేసులో ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పడానికి వెనుకాడారు. అన్ని అరెస్టు చేసిన తరువాత రిమాండ్ రిపోర్టులో చూపిస్తామంటూ దాటవేశారు. ఈ విషయంపై గట్టిగా అడిగిన  చంద్రబాబు తరఫు న్యాయవాదులకు స్టఫ్ లేదంటూ పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. ఆ తరువాత ఉపసంహరించుకున్నారు అది వేరే సంగతి. అరెస్టు చేస్తున్నామని చెబుతూ పోలీసులు చూపిన ఎఫ్ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరే లేదు. దీంతో ఈ విషయంపై గట్టిగా నిలదీసిన న్యాయవాదులకు సమాధానం చెప్పలేక పోలీసులు అన్నీ రిమాండ్ రిపోర్టులు ఉంటాయష అంటే దాటేశారు.  అసలింతకీ ఈ  చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు రెండేళ్ల కిందటిది. దీనిపై  సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఈ విషయాన్ని సీఐడీ పోలీసులు నేరుగా చెప్పడానికి జంకారు. అయితే సకల శాఖల మంత్రిగానే ఇప్పటి వరకూ పాపులర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సీఐడీ బాస్ అవతారమెత్తి మరీ వక్కాణిస్తున్నారు.  ఇలా చంద్రబాబు అరెస్టయ్యారో లేదో అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలందరినీ అరెస్టులు, గృహ నిర్బంధాలూ చేస్తూ సీఐడీ మొత్తం రాష్ట్రాన్నే ఒక పెద్ద జైలుగా మార్చేస్తుంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి సీఐడి పలు కడిగిన ముత్యమనీ, ఇప్పటి వరకూ సీఐడీ చేసిన అరెస్టులు, నమోదు చేసిన కేసులూ అన్నిటికీ పూర్తి సాక్ష్యాధారాలున్నాయని చెప్పుకొచ్చారు.   అయితే అసలు వాస్తవమేమింటే.. ఏపీ సీఐడీ ఇప్పటి వరకూ పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసింది. వారిలో అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారు.  అయితే  ఒక్క కేసులోనూ ఆధారాలు చూపించి చార్జిషీటు దాఖలు చేసిన దాఖలాలు కనిపించవు. పోలీసులు ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ వస్తున్న సజ్జల .. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ తరఫున వకాల్తా పుచ్చుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు రాత్రికి రాత్రి జరిగిందని కాదని నమ్మబలికే ప్రయత్నం చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి అవసరమైన అన్ని సాక్ష్యలూ, ఆధారాలు ఉన్నాయన్నారే కానీ అవేమిటో మాత్రం సజ్జల వెల్లడించలేదు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడం, ప్రశ్నించడం సాధారణమేనన్న సజ్జల తన అరెస్టు గురించి చంద్రబాబుకు కూడా తెలుసుననీ, అందుకే మూడు రోజుల ముందట  నుంచీ తాను అరెస్టయ్యే అవకాశాలున్నాయంటూ సెంటిమెంటును, సానుభూతిని పొందేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని సజ్జల చెప్పుకొచ్చారు. అయినా చంద్రబాబును అరెస్టు చేసిన నిముషాల వ్యవధిలోనే.. సజ్జల మీడియా ముందుకు వచ్చి సీఐడీ వద్ద అన్ని సాక్ష్యాధారాలూ ఉన్నందునే అరెస్టయ్యారని చెప్పడానికి ఎందుకు అంత ఉత్సాహపడ్డారన్న సందేహం వైసీపీ శ్రేణుల్లోనే కాదు, పోలీసు వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. అసలు చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సీఐడీ మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ వారికా అవకాశం ఇవ్వకుండా సజ్జల వచ్చి తాను చెప్పాల్సింది చెప్పేశారు. కాదు కాదు.. సీఐడీ అధికారులు ఏం చెప్పాలో సజ్జల తన ప్రెస్ మీట్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . నిజంగా స్కల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుపై  పక్కా ఆధారాలు ఉంటే.. ఇలా అర్థరాత్రి హడావుడి అరెస్టు చేయకుండా.. ఆయన ప్రమేయంపై ఉన్న ఆధారాలను సాధ్యమైనంత ఎక్కువగా  ప్రచారం చేసి మరీ అరెస్టు చేసేవారు.  నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాని ఐటీ షోకాజ్ నోటీసుకే విస్తృత ప్రచారం కల్పించిన వైసీపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుపై నిజంగా ఆధారాలు ఉంటే.. మరింత ప్రచారం చేసేవారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో  సీఐడీ పెట్టిన కేసులు, చేసిన అరెస్టులు ఏవీ కోర్టులో నిలవలేదనీ.. ఇప్పుడు ఇది కూడా అంతేననీ అంటున్నారు. 

రోడ్డుపై బైఠాయించిన లోకేష్

తెలుగుదేశం అధినేత  చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా   కోనసీమ జిల్లా   పొదలాడలో ఉన్న లోకేశ్‌ తండ్రి అరెస్టు వార్త వినగానే బెజవాడకు బయలు దేరారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో  లోకేష్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.   రాజోలు సీఐపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు.  తన తండ్రి అరెస్టు అయితే కుటుంబ సభ్యుడిగా వెడుతున్న తనను అడ్డుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. తాను ఒక్కడినే వెడుతున్నాననీ, వెంట ఎవరూ రావడం లేదనీ స్పష్టం చేశారు.   ఇలా ఉండగా పోలీసులు మీడియానే కాకుండా  ఆహారం, నీరు కూడా లోకేష్ క్యాంప్ సైట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పొదలాడలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. జగన్ సర్కార్ నియంతృత్వానికి చంద్రబాబు అరెస్ట్, లోకేష్ ను బెజవాడ వెళ్లకుండా అడ్డుకోవడం పరాకాష్ట అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం పోలీసు క్యాంపుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

చంద్రబాబు అరెస్టు.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు హౌస్ అరెస్ట్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడిని  పోలీసులు అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు.ప్రభుత్వ వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను చంద్రబాబు నుంచి అరెస్టుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన బస చేసిన బస్సులోనే ఆయనతో మాట్లాడిన డీఐజీ రఘురామ రెడ్డి ఆ సందర్భంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు న్యాయవాదుల వద్ద స్టఫ్ లేదని వ్యాఖ్యానించి ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబును అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీఐడీ పోలీసులు ఆయనను   స్కిల్ డెవలెప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  చంద్రబాబును  ఆయన కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో ఓర్వకల్లు విమానాశ్రయానికీ, అక్కడ నుంచి విజయవాడకు తరలించనున్నట్లు చెప్పారు. ఇలా ఉండగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు ఆయన హై బీపీ, సుగర్ ఉందని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అదలా ఉంటే తొలుత శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నంద్యాలలో చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగేదేశం ముఖ్యనాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు.  ఐటీ నోటీసుల కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని మొదట ప్రచారం జరిగినప్పగటికీ, ఆ కేసులో షోకాజ్‌ నోటీసు మాత్రమే వచ్చినందున అరెస్ట్‌ చేసే అవకాశం లేదని, అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటనలో ఆయన్ను అరెస్ట్‌ చేస్తున్నారనీ అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్టుకు జగన్‌ సర్కార్ పావులు కదుపుతున్న తీరు కుట్రపూరితంగాఉందని, ఆయన అరెస్టుకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు రావడమే ఇందుకు నిదర్శనమని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి  ఎందుకంటే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు బెయిలు మంజూరయ్యే అవకాశాలున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   అదలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సమయం గడిచే కొద్దీ  రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెన్షన్ వ్యాపించింది. నంద్యాల చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ వద్దకు పోలీసులు చేరుకున్న వార్త తెలిసిన క్షణాలలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. నంద్యాల నుంచే కాకుండా చుట్టుపక్కన జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు నంద్యాల ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు.    ఇలా ఉండగా చంద్రబాబును అరెస్టు చేస్తున్నామంటూ పోలీసులు చూపిన ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదని న్యాయవాదులు డిఐజీని ప్రశ్నించగా, అన్ని పత్రాలూ ఉన్నాయనీ, హైకోర్టుకు సమాచారం ఇచ్చామనీ చెప్పారు. అరెస్టు తరువాత అన్ని వివరాలూ చెబుతామంటూ మాట దాటేశారు.జగన్ ప్రభుత్వం తనను ఏదో విధంగా అరెస్టు చేయడానికి కుట్ర పన్నుతోందన్న అనుమానాన్ని చంద్రబాబు మూడు రోజుల కిందటే వ్యక్తం చేశారు.  ఆయన అనుమానించినట్లే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇక అప్పటి నుంచీ శనివారం తెల్లవారే వరకూ హైడ్రామా కొనసాగింది. ఊహాగానాలే తప్ప అసలు చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్నది కూడా పోలీసులు చెప్పడానికి వెనుకాడారు.  చంద్రబాబును  ఎలాగైనా జైలుకు పంపాలన్న ప్రభుత్వాధినేత జగన్ ఆదేశాన్ని శిరసావహించేందుకు పోలీసులు అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.  డీఐజీతో చర్చల సందర్భంగా చంద్రబాబు తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని   కానీ చేసిన తప్పేంటో .. కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏమిటన్ననియంతృత్వం కాకమరేమిటని చంద్రబాబు, నిలదీశారు. అయితే డీఐజీ మాత్రం వివరాలన్నీ  రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. సర్వ విలువలనూ, నిబంధనలనూ తుంగలో తొక్కి చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు చంద్రబాబు న్యాయవాదులు తమను చుట్టుముట్టి బెదరిస్తున్నారంటూ ఎదురు ఆరోపణలు చేయడం అందరినీ విస్మయపరిచింది. అయితే పోలీసుల వితండ వాదనకు చంద్రబాబు న్యాయవాదులు దీటుగా బదులిచ్చారు మా హక్కుల గురించి ప్రశ్నిస్తే… బెదిరించడం ఎలా అవుతుదని నిలదీశారు. మొత్తం మీద గంటల తరబడి సాగిన హై డ్రామా అనంతరం చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి ఆయన కాన్వాయ్ లోనే ఓర్వకల్లు విమానాశ్రయానికి తరలించారు.  

జగన్ అంటే దుల్కర్ సల్మాన్ కీ దడే!

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన కెరీర్‌లో చేయని పాత్ర లేదు. మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఆయనకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా విభిన్నమైన క్యారెక్టర్లు, విభిన్నమైన సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మలయాళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న దుల్కర్‌ డబ్బింగ్‌ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.  ఇప్పుడు దుల్కర్‌ చేస్తున్న సినిమాల కంటే ముందే ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే ‘యాత్ర2’. 2019లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన ‘యాత్ర’ చిత్రంలో వైఎస్‌ఆర్‌గా మమ్ముటి నటించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి జీవించారు. ఈ సినిమా  2019 ఎన్నికలలో వై.ఎస్‌.జగన్‌ విజయానికి ఎంతగానో దోహదపడిందనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వి.రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌, జగన్‌ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించనున్నారు. మొదట ఈ సినిమాలో వై.ఎస్‌.జగన్‌ పాత్రకు దుల్కర్‌ సల్మాన్‌ని అనుకున్నారట. తండ్రి మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా నటించారు కాబట్టి తనయుడు దుల్కర్‌ అయితే జగన్‌ పాత్రకు అతికినట్లు సరిపోతాడని భావించిన దర్శకుడు దుల్కర్‌కు  ‘యాత్ర 2’ గురించి చెప్పి ఆ సినిమీలో జగన్ పాత్ర పోషించాలని కోరారట. అయితే ఇందుకు దుల్కర్ విముఖత చూపారు.  తాను వై.ఎస్‌.జగన్‌ పాత్ర పోషించడం వల్ల రాజకీయంగా  ఇబ్బందులు వస్తాయని, అది తన సినిమా కెరీర్‌ని దెబ్బ తీస్తుందని  దుల్కర్‌ భావించి ఆ ఆఫర్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడని చెబుతున్నారు.  దీంతో జగన్‌ పాత్ర కోసం జీవాని ఫిక్స్‌ చేసుకున్నారు. మొత్తం మీద జగన్ రాజకీయ ప్రత్యర్థులకే కాదు.. సినీ జీవులకూ దడే అంటే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలలో హాల్ మార్క్ నిబంధనల పరిధిలోకి మరిన్ని జిల్లాలు

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం  కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ నిబంధనను అమలులోకి  తీసుకువచ్చింది. హాల్ మార్క్ ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలు దారులు  స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  2021 జనవరి 15 నుంచి బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనను తప్పనిసరి అయినప్పటికీ ఈ నిబంధన ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలోనే అమలులో ఉంది. తాజాగా దీనిని విస్తరించడంతో తెలంగాణలో కొత్తగా ఈ నిబంధన పరిధిలోకి మరో ఐదు జిల్లాలు చేరాయి.   ఇప్పటి వరకూ తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే హాల్ మార్క్ నిబధన పరిధిలో ఉండగా ఇప్పుడు   మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో  12 జిల్లాలు బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చినట్లైంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఈ నిబంధన పరిధిలో   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే ఉండగా ఇప్పుడు  అన్నమయ్య ,కోనసీమ , ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలయాడ్ అయ్యాయి. దీంతో ఏపీలో హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చిన జిల్లాల సంఖ్య 17కు పెరిగింది.