హోంగార్డ్ రవీంద్ర మృతి.. దిగి వచ్చిన ప్రభుత్వం    

అసెంబ్లీ ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి.. ముచ్చటగా మూడోసారి అధికారం అందుకొనేందుకు బీఆర్ఎస్  పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండ్ కో ఓటర్లను కాకా పట్టేందుకు.. తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు లబ్దిదారులకు కేటాయించే కార్యక్రమాన్ని కారు పార్టీ నేతల కనుసన్నల్లో కేటాయిస్తున్నారు.  అలాగే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని.. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే గులాబీ బాసు సూచించారు. అలాగే ప్రజలకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వాయు వేగంతో కదులుతోంది. అలాంటి వేళ.. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని.. ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారంటూ.. హోంగార్డులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ.. తమను పోలీసులతో సమానంగా చూడాలంటూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కామాండెంట్ కార్యాలయం ఎదుట ఎం రవీంద్ర ఓంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. 60 శాతంపైగా కాలిన గాయాలతో.. అతడిని తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  అయితే అతడి పరిస్థితి విషమంగా మారడంతో.. కంచన్ బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. ఉపిరితిత్తులు దెబ్బతినడంతో.. వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. ఆ క్రమంలో శుక్రవారం అంటే ఆగస్ట్ 8వ తేదీన రవీంద్ర మరణించారు. అతడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  రవీంద్ర మృతితో హోం గార్డులు జేఏసీ ఆందోళన బాట పట్టింది. ఈ నెల 16వ తేదీ వరకు విధులు బహిష్కరించాలంటూ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమై.. పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. ఆ క్రమంలో హోంగార్డులందరు డ్యూటీలో తప్పని సరిగా ఉండాలని.. డ్యూటీలో లేని హోంగార్డులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో ఉండాలని సూచించారు. అలాగే వీరంతా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్‌పెక్టర్లను ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌లో పని చేసే వారుసమ్మెకు దిగితే.. వారిని విధుల నుంచి బహిష్కరిస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.    మరోవైపు.. హోంగార్డు రవీంద్ర భార్య సంధ్య ఇతర కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తన భర్త ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మరణించారంటూ ఆరోపించారు. తన భర్త ఆత్మహత్మకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని.. అందుకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారుల పేర్లను సైతం ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.  అలాగే ఆమె ఆందోళన చేస్తున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెను పరామర్శించారు.  ఇంకోవైపు ఆందోళనకు దిగిన హోంగార్డు భార్యతో పోలీస్ ఉన్నతాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయి.  రెండు రోజుల తర్వాత నగర పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లనున్నట్టుగా డీసీపీ హామీ ఇచ్చారు. అలాగే హోంగార్డు ఉద్యోగం కాకుండా పోలీస్ శాఖలో మరో ఉద్యోగం  ఇప్పించే ప్రయత్నం చేస్తామని  సంధ్యకు డీసీపీ హామీ ఇచ్చారు. ఈ హామీతో సంధ్య సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమె తన ఆందోళన విరమించారు.

కేశినేని స్వరం మారిందా.. తత్వం బోధపడిందా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఏం మాట్లాడినా ముక్కుసూటిగా ఉంటుందంటారు. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన రాజకీయవేత్త అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా బెజవాడ రాజకీయాలలో ఆయన ఆధిపత్యం తిరుగులేనిది. అందుకు ఆయన గత ఎన్నికలలో విజయవాడ నుంచి ఎంపీగా ఎన్నిక కావడమే అంటారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో  అత్యధిక అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించినా.. లోక్ సభ సభ్యుడిగా కేశినేని నాని గెలవడమే బెజవాడలో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెబుతారు. అటువంటి నాని ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోందన్న బెంగలో పడ్డారు. అసలు ఆయన రాజకీయాలలోకి రావడమే కాకతాళీయం అంటారు ఆయన ప్రస్థానం గురించి తెలిసిన వారు. అసలు నాని రాజకీయ నాయకుడు కాదు.. సినిమా హీరో కావాల్సిన వారు. తొలుత ఆయన తన భవిష్యత్ కు, ఎదుగుదలకు సినీ హీరోగా కెరీర్ ప్రారంభించాలని భావించారు. ఇందు కోసం ఆయన దర్శక రత్న దాసరి వద్దకు వెళ్లారు. దాసరి అప్పట్లో కొత్త నటీనటులతో ఓ సినిమా తీసే యోచనలో ఉన్నారు. అందులో ఇద్దరు హీరోలలో ఒకరిగా నానికి దాదాపు చాన్స్ ఇచ్చేశారు. అయితే అప్పట్లో కేశినేని నానితో పోటీ పడి చివరి నిముషంలో కేశినేని నాని అవకాశాన్ని తన్నుకు పోయిన వ్యక్తి కలెక్షన్ కింగ్ గా విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు. ఔను అప్పటిలో చివరి క్షణంలో సినీమా హీరోగా అవకాశం తప్పిపోవడంతో కేశినేని నాని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కేశినేని ట్రావెల్స్ స్థాపించి రవాణా రంగంలో రాణించారు. అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా ఎదిగారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కెరీర్ లో ఏరీ ఆయన చాయిస్ కాదు.. చాన్స్ అంతే. రాజకీయంగా తన ఎదుగుదలకు దోహదపడిన తెలుగుదేశంతో గత కొంత కాలంగా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలై విపక్ష పాత్రకు పరిమితమైన నాటి నుంచీ  అధికార వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా నాని తీరు ఉంది.  పార్టీలోని కొందరు నాయకులతో తన కున్న విభేదాలను అడ్డుపెట్టుకుని తన స్థాయిని మరిచి మరీ  సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించి ఉద్దేశపూర్వకంగా పార్టీకి దూరం అవుతున్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ  కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలపై పొగడ్తల వర్షం కురిపించి ఇక తెలుగుదేశం పార్టీ కూడా తనను లెక్కలోంచి తీసేసే పరిస్థితిని స్వయంగా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని వైసీపీ గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే నిర్ణయానికి వచ్చేసి కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో   విజయవాడ లోకసభ స్థానం నుంచి కేశినేని చిన్నిని పార్టీ అభ్యర్థిగా నిలపాలన్న నిర్ణయానికి వచ్చేసింది.  దీంతో బెజవాడ బరి అన్నదమ్ముల సవాల్ గా మారనున్నదన్న భావన సర్వత్రా కలిగింది. అయితే వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించారో ఏమో కానీ కేశినేని నాని తన ప్రయాణం తెలుగుదేశంతోనే అని పదే పదే చెబుతూ పార్టీ అధిష్ఠానం మెప్పు పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  ఆయన పదే పదే తాను విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రానున్న ఎన్నికలలో నిలబడతానని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హస్తినలో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించిన సంగతిని మరిచిపోయి ఆయన వంటి దార్శనికుడు, నిజాయితీ పరుడు లేడంటూ కీర్తిస్తున్నారు. తాజాగా కంచికచర్లలోని ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కు హాజరైన కేశినేని నాని మరోసారి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి నిజాయితీ పరుడు లేడన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయాలలో మచ్చ లేని వ్యక్తిగా చంద్రబాబుది స్వచ్ఛమైన వ్యక్తిత్వమన్నారు. ఇంతకీ అంత చేసిన కేశినేని నాని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం విశ్వాసాన్ని పొందగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు కు ఐటీ నోటీసులపై స్పందించిన కేశినేని నాని నోటీసులు పెద్ద విషయం కాదన్నారు. వివరణ ఇస్తే సరిపోతుందనీ దానిపై అనవసర ఊహాగానాలు వ్యర్థమని వైసీపీకి చురకలంటించారు. అక్కడితో ఆగకుండా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఉంటాననీ చెబుతూ వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తానే బరిలో ఉంటానన్నారు.  ఇక ఏపీలో పొత్తులపై చర్చ గురించి మాట్లాడుతూ పొత్తుల విషయం పూర్తిగా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయమేననీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే క్యాడర్ అంతా దానికి కట్టుబడి ఉంటుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలనీ, తాను పార్టీలోనే పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. 

మా ఎన్నికలు మరోసారి గోల గోల?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పదవీ కాలం ఆక్టోబర్ రెండో వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 10 తేదీన మళ్లీ మా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించిన హడావుడి ఏమీ  మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో  కనిపించకపోవడం పట్ల ఫిలింనగర్ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మా ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే..  ఆ క్రమంలో  2021, ఆక్టోబర్ 10న  మా ఎన్నికలు జరిగాయి. ఆక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.  మళ్లీ ఈ ఏడాది అంటే 2023, అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉందని.. కానీ దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు పెదవి విప్పకపోవడంపై ఆశ్చర్యం  వ్యక్తమౌతోంది.  2021లో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్గం, మంచు విష్ణు వర్గం హోరా హోరీగా తలపడ్డాయి. అందులో భాగంగా వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు.  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అప్పటి  మా ఎన్నికలు  అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే తాను మా అధ్యక్షుడిగా ఎన్నికైతే... చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కార్యక్రమాలు చేస్తానంటూ ఆ సమయంలో స్పష్టమైన హామీలు  ఇచ్చారు. అయితే ఆ హామీలు ఎంత వరకు అమలు అయ్యాయన్న ప్రశ్నకు   మంచు విష్ణు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.  మరి మా అధ్యక్ష పదవి కాలం అక్టోబర్‌లో ముగియనుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మా ఎన్నికల హడావుడి మొదలు కాకపోవడంపై పిలింనగర్ వర్గాలు ఓకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు బరిలో దిగుతారు? ఒ కరే నిలబడి.. మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా చేసుకుంటారా? లేక పోటీ అనివార్యమౌతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదీకాక.. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ చాలా ఒడుదుడుకులు ఎదుర్కొంది. సినిమా థియేటర్ల టికెట్ ధరల తగ్గింపు అంశంలో జగన్ పార్టీ వ్యవహారించిన తీరు.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంతో జగన్ పార్టీపై చిత్ర పరిశ్రమ చాలా గుర్రుగా ఉందనే   ప్రచారం జరిగింది. జరుగుతోంది. మరోవైపు  ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఏపీ సీఎం జగన్‌కు సమీప బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇదే విషయాన్ని గత మా ఎన్నికలకు ముందు మంచు విష్ణు వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్యూలో వివరించిన విషయం కూడా తెలిసిందే.  కానీ సినిమా థియేటర్ల టికెట్ల ధరలు తగ్గింపు అంశంపై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కానీ.. ఆయన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ చొరవ తీసుకొని.. ఏపీ ప్రభుత్వంతో భేటీ అయి చర్చింలేదు.  ఇటువంటి పరిస్థితుల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. టాలీవుడ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఎక్కడ ఉన్నారనే ఓ ప్రశ్న సైతం నేటికి ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మా ఎన్నికలు మళ్లీ అక్టోబర్‌లో నిర్వహిస్తే.. అధ్యక్ష పదవికి ఎవరు నిలబడతారు? టాలీవుడ్‌లోని సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే సత్తా ఉన్న వాళ్లు నిలబడతారా? లేకుంటే.. మాటల్లో తప్ప చేతల్లో హీరోయిజాన్ని ప్రదర్శించలేని వారే నిలబడతారా? అని ఫిలింనగర్ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. మా ఎన్నికలకు సమయం అసన్నమవుతోన్నా.... సినిమా పెద్దల్లో మాత్రం ఉలుకు పలుకు లేకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న అనుమానం కూడా ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

పేద సీఎం జగన్ విదేశీ పర్యటన ఖర్చెంతో తెలుసా?!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 శనివారం రాత్రి 9.30 గంటలకు తన సతీమణి భారతితో కలిసి జగన్ లండన్‌  పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా సీఎం జగన్ తన వ్యక్తిగత పర్యటన. అక్కడే ఉంటున్న తమ పిల్లలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో  గడిపేందుకు చేస్తున్న పర్యటన. సెప్టెంబర్ 11న సీఎం జగన్ తిరిగి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అప్పటి వరకూ జగన్ అక్కడి నుండే  పాలన సాగించనున్నారు. అయితే, జగన్ లండన్ పర్యటన ఖర్చు, ఆయన ప్రయాణ వివరాలు, వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ ధనం వినియోగం ఇదే రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిన సంగతి తెలిసిందే. అటువంటి ధనిక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంతకు మించి లగ్జ్యూరియస్ గానే ఉంటుంది అందులో సందేహం లేదు. ఆ విషయాన్నే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చెబుతూ.. జనం సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదు మా జగన్ అంటూ కీర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. జనానికి గుర్తు చేస్తున్నారు.  ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదని, కేవలం రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్ మాత్రమే తాగుతారని, సీఎంగా జీతాన్ని కూడా జగన్ త్యాగం చేశారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తానో సర్వసంగ పరిత్యాగిననీ,   పేదల పక్షపాతినని సందర్భం వచ్చినా రాకపోయినా.. సందర్భం ఉన్నా, లేకపోయినా  చెప్పుకుంటూ జగన్ కూడా తన భుజాలను తానే చరుచుకోవడం కూడా కద్దు.  అయితే  అదే సీఎం ఆ మధ్య తాడేపల్లి నుండి తెనాలి వరకూ జస్ట్ 28కిలో మీటర్ల  రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ పై వెళ్లారు. అప్పుడే దానిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఆ తర్వాత అమరావతి రాజధానిలో తన ఇంటికి అత్యంత సమీపంలో జరిగిన ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికీ హెలికాప్టర్లోనే వెళ్లారాయన.  జస్ట్ పది నిమిషాల రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్లిన పేద సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేశారు. అదలా ఉండగా  ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఖర్చు కూడా విమర్శల పాలవుతోంది. జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. అది కూడా ఏదో ఆషామాషీ ఫ్లైట్ కాదు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాలలో ఒకటైన ఎంబ్రాయెర్ లినేజ్ 1000 ఫ్లైట్ . 435 కోట్ల రూపాయల విలువైన ఈ విమానంలో సుమారు 19 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఈ విమానం అద్దె గంటకు సుమారు 14 వేల 850 డాలర్లు. మన కరెన్సీలో చూస్తే గంటకు సుమారు 2 లక్షల 71 వేలు. విజయవాడ నుంచి లండన్ వెళ్లేందుకు సుమారు 11 గంటల సమయం పడుతుంది.. అలాగే అటు నుంచి రావడానికి మరో 11 గంటలు పడుతుంది. దీంతో పాటు ఇంధనం నింపుకోవడానికి నిలిపే సమయానికి కూడా అద్దె కట్టాల్సిందే. ఫ్లైట్ ఫ్యూయల్ అండ్ ఆపరేషన్ కాస్ట్ కూడా అద్దెకి తీసుకున్న వారే చెల్లించాలి. ఈ లెక్కన చూస్తే  జగన్  లండన్ పర్యటనకు ఒక్క విమాన ఖర్చు రూ.40 కోట్ల పైమాటే. అంతేకాదు, ఒకవేళ విమానాన్ని పర్యటన మొత్తం తనతో ఉంచుకోవాలని అనుకుంటే అక్కడ దానికి పార్కింగ్ ఛార్జీలు, ఫైలట్ మెయింటనెన్స్, ఇతరత్రా ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఈ ఖర్చు మరో 10 లేక 20 కోట్లు పెరిగిపోతుంది. జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లినా ఈ ఖర్చు మొత్తం ప్రభత్వ ఖజానా నుండే  చెల్లిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.  ఈ క్రమంలో తాను పేద సీఎంను అని.. పేదల పెన్నిధిని అంటూ జగన్ చెప్పుకోవడం, ఆయన పార్టీ నేతలు తానతందాన అనడం ఎవర్ని మభ్య పెట్టడానికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జగన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పేద సీఎం తన కుమార్తెపై ప్రేమ చూపేందుకు  రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు,  కానీ ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పేదవాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారా అంటూ నిలదీశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా జగన్ లండన్ పర్యటన వ్యయంపై  తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అనగనగా ఓ పేదవాడు.. వాడి ఇంట్లో డ్రైవర్లు, పనిమనుషులు, వంట మనిషి అందరూ పేదవారే అంటూ సాగే ఓ సినిమా వీడియోతో సీఎంను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ గతంలో దావోస్ కు వెళ్ళినపుడు కూడా ప్రభుత్వ ఖర్చుతో అత్యంత విలాసవంతమైన విమానంలోనే వెళ్లారు. ప్రయాణికుల విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణించడమూ ఆడంబరమే అవుతుందని ఆయన భావిస్తారేమో పాపం. అందుకే సొంతంగా అత్యంత విలాసవంతమైన విమానాన్ని అద్దెకి తీసుకొని సతీసమేతంగా కుమార్తెల వద్దకు వెళ్లారు ఈ పేద సీఎం.

జగన్ యాత్ర.. ప్రజలకు దూరంగానేనా?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ.. భవిష్యత్త్ గ్యారంటీ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు పేరుతో చేపట్టిన యాత్రలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రతో... ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ   యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో అధికార పార్టీ కూడా తన పాలనలో ప్రజలకు అందించిన ప్రయోజనాలు, సంక్షేమం, రాష్ట్ర ప్రగతి తదతర అంశాలతో ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఏపీలో అధికార వైసీపీ మాత్రం ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చేసింది, చెప్పుకోవడానికీ ఏం లేదన్న భావనా, గడపగడపకూ, జగనన్నే మా నమ్మకం కార్యక్రమాలలో ఎదురైన అనుభవమే మళ్లీ పునరావృతం అవుతుందన్న భయమో కానీ వైపీపీ ఇంత వరకూ ప్రజల ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రజలలో మమేకం కావడానికి ఓ యాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఆ పర్యట నుంచి తిరిగి రాగానే యాత్రకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు.  గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. అయితే ఈ సారి యాత్ర మాత్రం పాదయాత్ర కాదు..   ప్రజా యాత్రలాగా రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు పేర సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లోకి నగదు జమచేస్తున్నారు. ఆ విషయాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తూ.. ప్రజలకు తన ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని మరోసారి వారికి వివరించడం, అదే సమయంలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా జగన్ ఈ యాత్రకు సంకల్పించినట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి వారం నుంచీ జగన్ యాత్ర ప్రారంభం అవుతుందని అంటున్నారు.  ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, ఏర్పాట్లు తదితర అంశాలను ఖరారు చేసేందుకు జగన్  ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు  ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఓ కమిటీని వేసినట్లు చెబుతున్నారు.   ఈ యాత్రలో భాగంగా  రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సీఎం జగన్ బస చేసి స్థానిక ప్రజలతో మమేకం అవుతారనీ, పనిలో పనిగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటారనీ,  అలాగే  ఆయా నియోజకవర్గంల్లోని పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే పని కూడా చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  జగన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించిన  విషయం తెలిసిందే. ఆ క్రమంలో 2009, సెప్టెంబర్ 2 వ తేదీ.. కర్నూలు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్    హెలికాప్టర్  ప్రమాదంలో కన్నుమూసిన సంగతి విదితమే.  అప్పట్లోవైఎస్  రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు గ్రామస్థాయిలోని  ప్రజలకు అందుతున్నాయా లేదో తెలుసుకోవడం లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం నిర్వమించేవారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి  వైఎస్ పథకాలకు అద్భుతమైన ప్రజాస్పందన అప్పట్లో వచ్చింది. అందుకే ఆయన రచ్చబండ కార్యక్రమానికి ధైర్యం చేయగలిగారు. అయితే అందుకు భిన్నంగా జగన్ పథకాలకు ప్రజాదరణ సంగతి అటుంచి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ తరుణంలో జగన్ రచ్చబండ పేరుతో  ప్రజల మధ్యకు వెళ్లితే.. ప్రజల నుంచి వ్యతిరేకతను ఆయన ప్రత్యక్షంగా చూసే వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా  జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను  ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత  పట్టించుకోలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి.. ఆ తర్వాత మూడు రాజధానులను తెరపైకి తీసుకు వచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్నే కాదు.. ప్రత్యేక హోదాను సైతం పక్కన పెట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యకు సీఎం  జగన్ వెళ్తే... ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆయన స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని పరిశీలకులు అంటున్నారు.  అదీకాక సీఎంగా   జగన్  ఇప్పటి వరకూ చేపట్టిన  పర్యటనల్లో రహదారులకు ఇరువైపులా పరదాలు కట్టుకొని వెళ్లారు. అలాగే సీఎం పర్యటన కావడంతో భారీగా పోలీసులు మోహరించి జనం ఆయన సమీపానికి రాకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు.  చెట్లను సైతం నరికేశారు. వీటన్నిటికీ మించి సీఎం క్యాంప్ కార్యాలయానికి  మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి సైతం ఆయప హెలికాఫ్టర్‌లో వెళ్తున్నారు. అలాంటి సీఎం జగన్   రాజధాని అమరావతి ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగలరా? అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వేళజగన్  ఆ ప్రాంతానికి వెడితే గిడితే  భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను, ఆవేశాన్ని, వారి ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని అంటున్నారు.  ఏది ఏమైనా  జగన్ రచ్చబండ కార్యక్రమం అంటూ ప్రజల్లోకి వెళ్లడం అంటూ జరిగితే.. గతంలో గడపగడపకూ కార్యక్రమంలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎదుర్కొన్న చేదు అనుభవాలు జగన్ కు కూడా ఎదురు కాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా ఆయన అధికారిక పర్యటనల్లాగే పరదాలు అడ్డు పెట్టుకుని పోలీసులను మోహరించి ప్రజలకు దూరంగా జగన్  యాత్ర జరిగితే.. ఆయన పట్ల, ఆయన ప్రభుత్వం పట్లా ఇప్పటికే ఉన్న ప్రతికూలత మరింత పెరగడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదని అంటున్నారు. 

తెలంగాణలో చతుర్ముఖ పోటీ.. కమలనాథుల వ్యూహమేనా?

కర్నాటక ఎన్నికల తరువాత తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చేసింది. కర్నాటక ఓటమితో ఆ పార్టీ నేర్చుకున్న గుణపాఠాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ పార్టీ అంత వరకూ అనుసరించిన   పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం పఠించే  విధానానికి తెలుగు రాష్ట్రాలలో చెల్లు చీటీ అయితే చెప్పేసింది.  ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని డిసైడైపోయిన కమలనాథులు తెలుగు రాష్ట్రాలలో  కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.   తెలంగాణలో అప్పటి వరకూ తిరుగులేని పార్టీగా, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగా భావిస్తూ వచ్చిన  కమలం హైకమాండ్ .. కర్నాటక  ఫలితాల తరువాత తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలను చూసి తెల్లబోయింది.  వెంటనే ప్రక్షాళన అంటూ  రాష్ట్ర పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టింది. బండి సంజయ్ నుంచి  రాష్ట్ర పగ్గాలు తప్పించి వాటిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కట్టబెట్టింది. అయితే రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన పేర బీజేపీ  హైకమాండ్ చేసిన వైద్యం వికటించింది. అప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పార్టీలో విభేదాలు.. ఈ మార్పుల తరువాత ఒక్క సారిగా  బహిర్గతమయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపై నుండే బండి మద్దతు దారులు హడావుడి చేశారు. దీంతో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్తా బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది. అధిష్టానం నిర్ణయం పట్ల తన అసంతృప్తిని, వ్యతిరేకతను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు వంటి వారు అన్యాపదేశంగానైనా అదే సభావ వేదిక పై నుంచి వెల్లడించేశారు. ఇక విజయశాంతి వంటి వారు ఆ కార్యక్రమం నుంచి అర్ధంతరంగా వాకౌట్ చేసి తన నిరసన తెలియ చేశారు.  అది మొదలు తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అస్త్ర సన్యాసం చేసేశారు. దీంతో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ బీజేపీ ఆర్భాటంగా చెప్పిన అమిత్ షా ఖమ్మం సభ చప్పగా ముగిసింది.   దీంతో  అప్పటి వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో ద్విముఖ పోరుతోనే తమకు ప్రయోజనంగా  భావించి అడుగులు వేసిన బీజేపీ వ్యూహం మార్చి రాష్ట్రంలో త్రిముఖ పోరు జరిగితేనే రాజకీయంగా లబ్ధి పొందుతామన్న నిర్ణయానికి వచ్చింది.  ఈ వ్యూహంలో భాగంగానే  బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు దూరంగా ఉంటున్నట్లు కలర్ ఇస్తోందనీ, తెలంగాణలోని అన్ని స్థానాలలోనూ తెలుగుదేశం పోటీ నిర్ణయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా తెలుగుదేశం తెలంగాణలో ఇప్పటికీ బలమైన పార్టీయే ఇందులో సందేహం లేదు. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం గత ఎనిమిదిన్నరేళ్లుగా కాడె వదిలేయడం వల్ల క్యాడర్ స్దబ్దుగా మిగిలిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయిందో.. అప్పటి నుంచీ తెలుగుదుశం తెలంగాణలో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. తెలంగాణ సెంటిమెంట్ ఇక పని చేయదన్న అంచనాతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో.. మరీ ముఖ్యంగా విశ్వనగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందే విషయంలో తెలుగుదేశం పాత్ర, చంద్రబాబు దార్శనికతను తెలంగాణ ప్రజకు గుర్తు చేస్తూ విస్తృతంగా జనంలోకి వెడుతున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఖమ్మంలో నిర్వహించిన సభ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా తెలుగుదేశం కూడా పోటీలో నిలవడం ఖాయమన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితినే బీజేపీ కేంద్రంలో మరో సారి అధికారంలోకి రావడానికి అనువుగా మార్చుకునే విధంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పొత్తులు లేకుండా  బలమైన శక్తిగా తెలుగుదేశం బరిలో నిలిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దెబ్బతింటాయనీ, రాజకీయంగా కమలం లబ్ధి పొందుతుందనీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఇప్పటికే తన ఖాతాలో పడిందని అంచనా వేస్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల బరిలో గట్టిగా నిలబడితే కాంగ్రెస్ బలహీనం అవుతుందని భావిస్తున్నది. రాష్ట్రంలో నేరుగా అధికారంలోకి రాలేకపోయినా.. చతుర్ముఖ పోటీ వల్ల  తెలంగాణలో హంగ్ ఏర్పడితే.. అప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పే అవకాశం తమదే అవుతుందని కమలనాధులు భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకోసమే ఏపీలో కమలం పార్టీ తటస్థ వైఖరిని అవలంబిస్తోందనీ, తెలుగుదేశం పార్టీతో పూర్తి అవగాహనతోనే.. ఈ వ్యూహాన్ని పక్కాగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోందనీ వివరిస్తున్నారు. దీంతో తెలుగురాష్ట్రాలలో నేరుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోయినా.. ఆ రెండు రాష్ట్రాలలో కింగ్ మేకర్ పాత్ర పోషించి తద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి  పెద్ద పంఖ్యలో లోక్ సభ సభ్యుల మద్దతు కూడగట్టేలా కమలనాథులు వ్యూహరచన చేశారని చెబుతున్నారు. 

ఏపీలో బీజేపీ తటస్థం.. అసలు వ్యూహం ఏమిటంటే?

కేంద్రంలోని మోడీ సర్కార్ అయితే జమిలి లేకుంటే మినీ జమిలి అని ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. దీని ద్వారా రాజకీయంగా బోలెడు లబ్ధి ఉందని భావిస్తోంది. ప్రజా వ్యతిరేకతను తట్టుకుని ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు దీరాలంటే ముందస్తే బెస్ట్ అని డిసైడైపోయినట్లు కనిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రాలలో జాతీయ అంశాలు, జాతీయ స్థాయిలో స్థానిక అంశాలు మిక్స్ అయిపోయి గట్టెక్కేయగలమన్నది మోడీ సర్కార్ భావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాగ్రహం బీజేపీకి ఓట్ల రూపంలో  లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. మిగిలిన రాష్ట్రాలలో సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఏవీ ఫలించేలా కనిపించడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. సనాతన ధర్మం వివాదం, జమిలి ఎన్నికల నిర్ణయం ఇలా నేల విడిచి ఎన్ని సాములు చేసినా వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు మూడో సారి అధికారంలోకి రావాలంటే చెమటోడ్చినా ఫలితం ఉంటుందా? ఉండదా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఐక్యతను దెబ్బ కొట్టైనా సరే అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నది. ఉత్తరాదిలో ఎలాగోలా పాస్ మార్కులు సంపాదించేసుకోగలమన్న ధీమాతో ఉన్న బీజేపీకి దక్షిణాది మాత్రం కొరుకుడు పడటం లేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవం, ఆ తరువాత అప్పటి వరకూ అధికారమే తరువాయి అన్నట్లుగా కనిపించిన తెలంగాణలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడం.. చేరికల పేరిట బయట నుంచి తెచ్చుకున్న నాయకులకు.. తొలి నుంచీ పార్టీలోనే ఉన్న వారికి మధ్య పొరపచ్చాలతో మొదటికే మోసం అన్నట్లుగా తయారైన పరిస్థితి బీజేపీని గాభరాపెడుతున్నాయనడంలో సందేహం లేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో అధికారం సంగతి తరువాత కనీసం ముందస్తు ఎత్తుతో ఆ రాష్ట్రాలలో కొన్న పార్లమెంటు స్థానాలనైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  జీరో అక్కౌంట్ ఉన్న ఏపీలో కనీసం కొన్ని ఎంపీ స్థానాలను దక్కించుకోవడం లేదా.. ఆ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే పార్టీని తమ కూటమిలో చేర్చుకోవడం లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదని అంటున్నారు. అందులో భాగంగానే బీజేపీ బీజేపీలో తటస్థ వైఖరి అవలంబిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నదని చెబుతున్నారు.  ఏపీలో అధికారంలో  ఉన్న జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే.. రాష్ట్రంలో మాత్రం ఢీ అంటే ఢీ అనేలా విమర్శలు గుప్పిస్తున్నది. కేంద్రంలో మోడీ సర్కార్ ఏపీ సర్కార్ విధానాలకు వత్తాసు పలుకుతుంటే.. అవే విధానాలను ఏపీ బీజేపీ ఎండగడుతోంది. ఇలా ద్వంద్వ ప్రమాణాలతో బీజేపీ ఏపీ ప్రజలను తాను రాష్ట్రంలో తటస్థంగా ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని మించి అప్పులు చేస్తున్నదని ఏపీ బీజేపీ విమర్శలు గుప్పించి గణాంకాలతో సహా వివరిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం జగన్ సర్కార్ అలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని మించి అప్పులు తీసుకోవడానికి అనుమతులు ఇస్తోంది. జమిలి పేర కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తుకు వెళితే అప్పుడు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటికే తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే 119 స్థానాలలోనూ పోటీలో ఉంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఆయన ఈ ప్రకటన చేసే సమయానికి జమిలి ప్రస్తావన లేదు. అయితే ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగే అవకాశాలు కనిపిస్తుండటం.. అలా జరిగితే ఏపీలో పొత్తు, తెలంగాణలో పోరు అనే విధానం అంతిమంగా తెలుగుదేశం, బీజేపీలకు రెండు రాష్ట్రాలలోనూ నష్టం చేకూరుస్తుంది. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేసినా ఆ కూటమిలో బీజేపీ చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. అంటే ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ కూడా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ విధానం వల్ల ఏపీలో బీజేపీ స్వయంగా పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఏమీ మెరుగు అవ్వవు. 2019 ఎన్నికలలో లాగే ఈ సారీ కూడా ఆ పార్టీ అటు ఏపీ అసెంబ్లీలో కానీ, ఇటు ఏపీ నుంచి లోక్ సభకు కానీ ఖాతా తెరిచే అవకాశాలు ఉండవు. అయితే బీజేపీ తన తటస్థ వైఖరి వల్ల ఎన్నికల తరువాత ఏపీలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పార్టీని తన కూటమిలో చేర్చుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీల మద్దతును పొందేందుకు అవకాశాలను సజీవంగా ఉంచుకుంటోందని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఒకే సమయంలో ఏపీలో అధికార, విపక్షాలకు తాను దగ్గరగా ఉన్నామన్న సంకేతాలను ఇస్తోంది.  అందుకే బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నది. ఇరు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగితే.. జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉన్న చంద్రబాబు ఏపీలో ప్రచారానికే పరిమితమౌతారు. ఆయనకు తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం పెద్దగా ఉండదు. దీంతో ఆయన ప్రచారం వల్ల తెలంగాణలో బీజేపీపై ప్రభావం పడే అవకాశాలు దాదాపుగా మృగ్యమైపోతాయి. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం ఓటు బ్యాంకును బీజేపీ తన వైపునకు తిప్పుకునే అవకాశాలు మెరుగౌతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే సమయంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి కేంద్రంలో బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ కూడా జమిలి అనే సరికి పూర్తిగా తెలంగాణకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత సార్వత్రిక ఎన్నికలు జరుగుతాన్న ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేశారు. ఎప్పుడైతే జమిలి ప్రతిపాదన తెరపైకి వచ్చిందో ఆయన మహారాష్ట్ర పర్యటనలు కూడా ఆగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటన, అసంతృప్తులను బుజ్జగించడం, ఎన్నికల వ్యూహరచన, బీఆర్ఎస్ ను తెలంగాణలో మరోసారి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రణాళికల రచన వీటితోనే ఆయనకు సరిపోతున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభావం దేశంలో మరే ప్రాంతంలోనూ ఇసుమంతైనా కనిపించడం లేదు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు అన్న బీజేపీ వ్యూహం తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో ఏపీలో బీజేపీ తటస్థ వైఖరి అంతిమంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో ఎవరికి ప్రయోజనం చేకూరినా ఆ ఫలితం మాత్రం బీజేపీకి అనుకూలంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో ముందస్తేనా?.. జగన్ కు మరో దారి లేదా?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అడుగు ముందుకు వేయాలన్నా, వెనక్కు వేయాలన్నా ఆదేశాలు కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచే రావాల్సి ఉంటుంది. అడ్డగోలు అప్పుల కోసం.. కేసుల నుంచి రక్షణ కోసం జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ కాళ్లు ముందు మోకరిల్లేలా చేసింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల దగ్గర నుంచి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కంటే ముందుగానే జై కొడుతోంది. అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే జగన్ కూడా అందుకు సై అంటూ ఏపీ అసెంబ్లీ రద్దు కు సిద్ధపడక తప్పదు. ఇప్పటికే మోడీ సర్కార్ ఈ ఏడాది డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి యోచనలో ఉందనీ, అందుకోసం అవసరమైన సన్నాహాలన్నిటినీ చాపకింద నీరులా సాగించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో అందరి దృష్టి సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలపైనే ఉంది. మరీ ముఖ్యంగా ఒడిషా, ఏపీ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే బీజేపీ ముందస్తుకు వెడితే.. ఈ రెండు రాష్ట్రాలూ కూడా ముందస్తుకు సై అంటాయా నో అంటాయా అన్ని చర్చ జరుగుతోంది. ఒక వేళ మోడీ సర్కార్ ప్రతిపాదనకు ఈ రెండు రాష్ట్రాలూ నో అనడమంటూ జరిగితే మోడీ జమిలి లేదా మినీ జమిలి ప్రతిపాదనకు పురిట్లోనే సంధి కొట్టినట్లు అవుతుంది. అయితే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ముందస్తుకు వెళ్లినా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ కారణంతోనే ఆయన ఇప్పటికే ముందస్తుకు సిద్ధమని కేంద్రానికి తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే అన్ని వైపుల నుంచీ సమస్యలతో సతమతమౌతున్న జగన్ ముందస్తుకు వెడితే ముందస్తు మునక తప్పదన్న భావనలో ఉన్నారు. అప్పులు పుట్టడం గగనంగా మారి బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తుండటంతో ముందస్తుకే మొగ్గు చూపాలా? లేదా  చివరి క్షణం వరకూ అధికారంలో కొనసాగి ఆ తరువాతే అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? అన్న మీమాంసలో జగన్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోలా ఏం చేయాలో, ఏం తేల్చుకోవాలో అర్ధం కాని అయోమయంలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి బీజేపీ ఆదేశిస్తే జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై అనక తప్పదు. ఆయన ప్రభుత్వం బీజేపీ గుప్పెట్లో బందీ అయిన పరిస్థితిలో ఉందని అంటున్నారు.   బీజేపీముందస్తుకు  సిద్ధపడితే జగన్ ఆ పార్టీని అనుసరించక తప్పదని.. నో అనే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజలు ఐదేళ్ల పాటు అధికారంలో  ఉండేందుకు తీర్పు నిచ్చారనీ, తము ఐదేళ్లూ అధికారంలో కొనసాగుతామని అందులో మరో ఆలోచనే లేదనీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి వారు గంభీర ప్రకటనలు చేస్తున్నా..అదంతా మేకపోతు గాంభీర్యమేనని అంటున్నారు.  అసలు రాష్ట్రంలో ముందస్తు ప్రస్తావన తెచ్చినదే సజ్జల అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ ముందస్తు దిశగా అడుగులు వేస్తే.. జగన్ ఆ అడుగుల్లో అడుగులు వేయడం తప్ప మరో గత్యంతరం లేదని చెబుతున్నారు.   అయితే బీజేపీకి ఉన్న అతి పెద్ద ఆందోళన ఏమిటంటే.. ముందస్తు సరే ఎలాగోలా ఎదుర్కోగలం.. కానీ జమిలి అయితే మాత్రం మునిగిపోవడం ఖాయం అన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ప్రజా గ్రహం ఎంత ఉందో.. అంత కంటే ఎక్కువ కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఉంది. జగన్ అడ్డగోలు విధానాలకు అంతకు మించి అడ్డగోలుగా మద్దతు ఇచ్చిన బీజేపీకీ గతం కంటే ఓటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని ఇటీవల పలు సర్వేలు బయటపెట్టాయి.   అంటే జమిలి అంటూ జరిగితే జగన్ తన ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతనే కాకుండా బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా మోయాల్సి ఉంటుంది. అంటే ముందుస్తుగానే జగన్ సర్కార్ దుకాణం మూతపడుతుందన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలోనే జమిలిపై ఏకాభిప్రాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏదో గొణుగుడు వ్యవహారం కాకుండా.. గట్టిగా బీజేపీని వ్యతిరేకించలేని  బలహీనత వైసీపీలో ఉంది. బీజేపీ నిర్ణయం తీసుకుని ఆదేశించినా జగన్ సర్కార్ ముందస్తుకు ముందుకు రాకపోతే కేసులు చుట్టుముట్టి పుట్టిముంచుతాయని జగన్ ఆందోళన. అందుకే మునిగిపోతామని తెలిసినా బీజేపీ ఆదేశిస్తే జగన్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు  సై అనక తప్పని అనివార్య పరిస్థితిలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీజేపీ.. రజినీకాంత్.. ఓ డైలీ సీరియల్!

మీరిస్తానంటే నేనొద్దంటానా"అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇంతకీ ఎవరు ఇస్తానంటున్నారు? ఏం ఇస్తానంటున్నారు? అనేగా మీ డౌట్. ఇంకెవరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రజినీని ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని చూస్తోందట. ఈ విషయంపై రజినీ స్పందించలేదు కానీ, ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం "దేవుడు శాసిస్తాడు, మా అన్నయ్య పాటిస్తాడు" అన్నట్టుగా.. "పదవుల కోసం పాకులాడరు.. పదవి వస్తే మాత్రం తిరస్కరించరు" అంటూ గవర్నర్ పదవి తీసుకోవడం ఇష్టమేనని తన మాటనే రజినీ మాటగా చెప్పేశారు. కానీ ఫైనల్ గా రజినీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే. సినిమాల్లో రజినీకాంత్ దారి రహదారే కానీ.. రాజకీయాల్లో మాత్రం గతుకుల రోడ్డే. సినిమాల్లో జస్ట్ అలా స్టైల్ గా నడిచి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి మాత్రం ధైర్యం చెయ్యట్లేదు. ఇదిగో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ 2017 నుంచి ఊరించారు రజినీ.  2020 లో అయితే.. రేపు లేకుంటే ఎల్లుండే పార్టీ ప్రకటన అంటూ నెలకోసారి హడావుడి జరిగింది.  అలా ఊరించి ఊరించి చివరికి అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే ఆ అంశానికి, అంకానికి శుభం కార్డు వేశారు సూపర్ స్టార్. తాజాగా గవర్నర్ పదవి వార్తలతో దాని సీక్వెల్ కథ మొదలైంది. రజినీకాంత్ ముందు నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీకి కూడా సౌత్ లో సూపర్ స్టార్ లాంటి బ్రాండ్ కావాలి. అందుకేనేమో గవర్నర్ పదవి ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ పదవి వల్ల రజినీకి కొత్తగా ఒరిగేదేమి లేదు. ఈ ఐదేళ్ల పదవి కంటే కూడా ఆయనకు జనాల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. అయితే రజినీకి గవర్నర్ పదవి ఇచ్చి, తమవాడు అనిపించుకోవడం వల్ల బీజేపీకి బోలెడంత లాభముంది. తమిళనాడులో బీజేపీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశముంది. అప్పుడు డీఎంకే ని ఢీ కొట్టే పార్టీ బీజేపీనే అవుతుంది. ఇదంతా జరగాలంటే రజినీపై అధికారికంగా కమలం ముద్ర పడాలి.  ఇటీవలి కాలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో రజనీ భేటీ కావడం గమనిస్తే,  బీజేపీ పదవి ఇస్తే ఆయన తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మనసు ఎప్పుడైనా మారొచ్చు. రాజకీయాల్లోకి రావాలని చూసి దానిని నాంచి నాంచి చేతులెత్తేశారు. ఇప్పుడు గవర్నర్ గిరీ విషయంలో కూడా.. ఎక్కడ కొన్ని వర్గాలకు దూరం అవుతానోనన్న భయంతో నాంచి నాంచి చివరికి సైడ్ అయిపోయే అవకాశముంది.

తారస్థాయికి చేరిన ప్రజా వ్యతిరేకత.. డిఫెన్స్‌లో జగన్?!

మాది పేదల ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నదే మా ఎజెండా. ఇందుకోసం ఎలాంటి మధ్య వర్తులూ లేకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా, రాజకీయాలకు అతీతంగా తమ పథకాలు ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇదీ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పిన మాట. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్న విధానమే నవరత్నాలు. నవరత్నాలలో సంక్షేమంతో పాటు మరికొన్ని అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. అయితే, మిగతా హామీలను పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట బటన్ నొక్కి ఖాతాలలోకి నగదు బదిలీ చేయడం మొదలు పెట్టింది. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ లాంటి పేదవాడికి అక్కరకు వచ్చే పథకాలను కూడా కాదని కేవలం బటన్ బటన్ నొక్కుడు కార్యక్రమానికే జగన్ పరిమితమయ్యారు.  ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల నగదును  బటన్ నొక్కుడు ద్వారా  బదిలీ చేసింది. అయినా ప్రజలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. సంక్షేమం పేరిట పంచిన దాని కంటే మూడింతలు ఎక్కువగా ప్రజల నుండి పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేయడం, అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి ప్రజల కొనుగోలు శక్తి నశించిపోయినా.. ప్రతి వస్తువు కొనుగోలులో పన్ను  పోటు ప్రజలలో అసంతృప్తిని  పెంచేసింది.  నిజానికి గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్  సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులు ఎక్కువేం కాదు. గతంలో రకరకాల మార్గాల ద్వారా ప్రజలకు చేర్చిన నగదును ఇప్పుడు బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు చేర్చారు. కానీ గత ప్రభుత్వానికి మించి పన్నుల బాదుడు,  ఉపాధి అవకాశాల క్షీణత ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెట్టింది. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఫలాలు అందించినా తమ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని అధికార పార్టీ ఇప్పుడు తెగ ఆందోళన చెందుతోంది. తలకి ఇంత లెక్కన ప్రజల ఖాతాలలోనే జమ చేసినా ప్రజలలో వ్యతిరేకత పెరుగిపోతుండడం ఇప్పుడు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.  ప్రజలలో ఏ వర్గాన్ని కదిలించినా అసహనం.. ఏ నోట విన్నా  అసంతృప్తి.. ఆగ్రహం, ఎవర్ని కదిలించినా కన్నీటి కష్టాలే. ప్రభుత్వం అంత చేశాం.. ఇంత చేశాం అని చెప్తున్నా ప్రజలలో మాత్రం ప్రభుత్వంపై ఏ మాత్రం సానుకూలత కానరావడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఈసారి మళ్ళీ తమదే అధికారమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వైసీపీ నేతలు  మనోవేదనకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది.  ఇప్పటికే కొన్ని సర్వే ఫలితాలు ప్రజలలోని ఈ అసంతృప్తిని బహిర్గతం చేసి గణాంకాలతో సహా  జగన్ పార్టీ పరాజయం అనివార్యం అంటూ తేల్చేశాయి.. దీంతో వైసీపీ, మరీ ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత, అసంతృప్తిపై డిఫెన్స్ లో పడిపోయినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల పాటు అభివృద్ధి, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ప్రజల అవసరాలను అన్నీ వదిలేసి.. కేవలం బటన్ నొక్కడం.. తిరిగి పన్నుల పేరిట అంతకంత ముక్కుపిండి వసూలు చేయడంతో ప్రజలు విసిగి వేసారిపోయినట్టు నిర్ధారణ చేసుకున్న జగన్ ఇప్పుడు మరోసారి విజయం కోసం ఏం చేయాలన్నది తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   కడుపు మండిన పేదవాడిని నమ్మించి మరో సారి బుట్టలో వేసుకోవడానికి ఏం చేయాలో  తెలియని పరిస్థితుల్లో జగన్, వైసీపీ వ్యూహకర్తలు ఉన్నారంటున్నారు.  జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సగటు ప్రజల ఆదాయాలు పెరగకపోగా.. ఏటేటా ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్రం బాదుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి  బాదుడే బాదుడు అంటూ ప్రజలను కుంగదీసింది. తమ జీవన స్థితిగతులు నానాటికీ దిగజారుతుండటంతో జగన్ సర్కార్ పై ప్రజలలో తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఆ అసహనమే ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విశాఖ జైల్లో మొద్దు ‘సీన్’?!

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా  2019 ఎన్నికల ముందు   అప్పటి  ప్రతిపక్షనేత   జగన్‌పై కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ.. దాదాపు నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓచర్చ పోలిటికల్ సర్కిల్‌‌లో సాగుతోంది.  కోడి కత్తి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ కుమారుడిని బెయిల్‌పై విడిపించాలంటూ కొడికత్తి శ్రీను తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు   జగన్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొన్నారు.  అలాగే ఈ అంశంపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి   వారు స్వయంగా వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ విషయాలన్నిటిపైనా రాజకీయ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. బాధితుడిగా కోర్టుకు హాజరు కావడానికి జగన్ ఎందుకు ఇష్టపడటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు.. కోడికత్తి శ్రీను కూడా మొద్దు శ్రీనులాగానే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య చేసిన మొద్దు శ్రీను..  ఆ తర్వాత అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తూ... అదే  జైల్లో ఉన్న ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి రాజకీయ వర్గాల చర్చల్లో  ప్రస్తావనకు వస్తోంది. అదే తరహాలో కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనపల్లి శ్రీను  సైతం జైల్లోనే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఆ చర్చల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు బుధవారం(సెప్టెంబర్ 6)  విశాఖపట్నం కోర్టు వద్ద ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు   జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పించి మరెవరూ  ప్రత్యక్ష సాక్షులుగా (ఐ విట్నెస్‌లు) లేరని,  అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్, సెక్యూరిటీ అధికారులు.. తాము ఈ దాడిని చూడలేదని చెప్పారన్నారు.   ఆయితే ఆ రోజు కోడికత్తి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను వద్ద మాత్రమే ఉందని... ఏపీ పోలీసుల మీద నమ్మకం  లేదంటూ మందుగా కోడికత్తి సమర్పించలేదన్నారు. ఈ కేసులో కర్మ కర్త క్రియా అన్నీ మజ్జి శ్రీనివాసేనని కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ సమయంలో మజ్జి శ్రీను.. తన పోనును పోలీసులు అడిగితే.. ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉద్దేశపూర్వకంగానే జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుపై కేసుపెట్టారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని.. వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అబ్దుల్ సలీం స్పష్టం చేశారు.   హరీశ్ సాల్వే వివాహానికి హాజరయ్యేందుకు లండన్ కు వెళ్లే తీరిక ఉన్న జగన్ కు.. కోడికత్తి కేసులో బాధితుడిగా విశాఖకు వచ్చే పాటి తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ యువకుడు నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నా? తనపైనా దాడి జరిగిందని స్వయంగా ఫిర్యాదు చేసి పట్టుబట్టి మరీ  ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఉండటం ఎంత మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు.  జగన్ పై కోడికత్తి దాడి జరిగినప్పుడు జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పని చేస్తున్నాడని అయితే ఆ రోజు  ఐదుగురు వైసీపీ నేతలు పాస్‌లు లేకుండానే  విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయాన్ని కోర్టు ముందుంచామని చెప్పారు.  అలాగే కోడికత్తి దాడి జరిగిన రోజు.. పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై  దాడి చేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.   2023 ఆగస్ట్ వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి దాడి కేసు విచారణ జరిగింది. ఇటీవలే  ఆ కేసును విశాఖకు బదిలీ చేశారు. ఆ క్రమంలో కోడికత్తి శీను  ఇన్నాళ్లు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి  ప్రతీ వాయిదాకు  విశాఖకు తీసుకు రావడం కష్టమన్న ఉద్దేశంతో అతడిని  విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టును ఎన్ఐఏ  అభ్యర్థనను కోర్టు అంగీకరించడంతో . కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంకోవైపు.. విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల మత్తు పదార్థాల కలకలం సృష్టించిన విషయం విదితమే.  కోడికత్తి కేసు ఏళ్ల తరబడి ముందుకు సాగకపోవడం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం చూస్తుంటే.. పరిటాల రవి హత్య కేసులో జరిగిన విధంగానే  మొద్దు శ్రీను సీను విశాఖ జైల్లో రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.  

తెలంగాణ బీజేపీ ఎవరికి వారే యమునా తీరే తీరు!

ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడ లేకపోతున్నారా? అసలు ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కమలం గూటికి చేరినప్పుడే ఆయన గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు.  ఆ పార్టీలో ఆయన ఎక్కువకాలం ఇమడలేరని జోస్యాలు చెప్పారు. అసలు వామపక్ష భావజాలం ఉన్న ఈటల చేరితే కాంగ్రెస్ లో చేరాలి.. అందుకు భిన్నంగా బీజేపీలో  ఎందుకు చేరారన్న సందేహాలు అప్పట్లోనే రాజకీయ వర్గాలలో, పరిశీలకులలో వ్యక్తం అయ్యాయి.   అయితే ఇప్పటి దాకా బీజేపీలో ఉక్కపోతకు గురైనా ఈటల మాత్రం సంయమనంతో సర్దుకుని ఉన్నారు. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో విభేదాలను రచ్చ చేయకుండా అధిష్ఠానంతో మాట్లాడుకుని చక్కదిద్దుకున్నారు. అసలు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం వెనుక ఈటలను సంతృప్తి పరిచే ఉద్దేశమే ఉందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు చేశారు. సరే బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ కమిటీకి చైర్మన్ గా ఈటలను నియమించింది. ఈటల ఆధ్వర్యంలో  బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ... ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనీ అంతా ఆశించారు. అదలా ఉంటే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల నియామకానికి ముందు పార్టీలో ఈటలకు చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు.  కానీ ఈటల బీజేపీలో చేరిన క్షణం నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వామిని చేయడం, అమిత్ షా, మోడీ వంటి అగ్రనేతల సభలలో కూడా వేదికపై ఆసనం ఇవ్వడంతో  ఈటలకు బీజేపీలో ఉక్కపోత అన్న వార్తలు వదంతులేనా అన్న భావన కూడా సర్వత్రా కలిగింది.   అయితే బండితో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో ఈటల గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఈటలను తక్కువ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఈటల సన్నిహితులు అంటున్నారు.  ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తాను పార్టీలోకి చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడాన్ని ఈటల సహించలేకపోతున్నారని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కృష్ణయాదవ్  పార్టీలో చేరిక చివరి క్షణంలో ఆగిపోవడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కారణమని అంటున్నారు. దీనితో ఈటల ఇక పార్టీలోకి చేరికల విషయంలో ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదని అంటున్నారు. అలాగే.. ఈటల ద్వారా పార్టీలోకి స్పష్టమైన హామీతో చేరిన తుల ఉమ వంటి వారికి పోటీగా ఇతరులను తీసుకురావడం వంటి ఘటనలతో ఈటల పార్టీ వ్యవహారాలలో పెద్దగా పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అదే విధంగా అమిత్ షా ఇటీవల ఖమ్మం వచ్చారు. ఆ సభావేదికపై బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరికలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో తన సంబంధాలను ఉపయోగించుకుని అక్కడ అసంతృప్తులను ఈటల బీజేపీలో చేరుస్తారని బీజేపీ హైకమాండ్ కూడా భావించింది. అయితే ఈటల మాత్రం తాను పార్టీలోకి తీసుకువచ్చిన వారికీ, తన ద్వారా వద్దామనుకున్న వారికీ వెల్ కమ్ అంతంత మాత్రంగా ఉండటంతో చేరికల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదని బీజేపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈటల అసంతృప్తిని పార్టీ హైకమాండ్ కూడా లైట్ గా తీసుకుంటోందనీ అంటున్నారు.  దీంతో బీజేపీ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎవరికి వారు తమ వర్గం పైచేయిగా ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ బీజేపీ పరిస్థితు మూడు గ్రూపులూ ఆరు వర్గాలు అన్నట్లుగా తయారైంది.

గురువంటే గూగులే.. ఉపాధ్యాయులు ఎందుకు.. విద్యాశాఖ మాజీ మంత్రి పాండిత్యం!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. సెప్టెంబర్ 5వ తేదీన ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. ఈ సందర్బంగా ఆయన  బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చిందని.. గురువులు బదులు ఇప్పుడు గూగుల్ వచ్చిందన్నారు. గురువులకు తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని చెప్పారు. ఇంకా కాస్త ముందుకెళ్లి గూగుల్ వచ్చిన తర్వాత గురువుల అవసరం లేదంటూ మంత్రి సురేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువుల్లో కంటే గూగుల్‌లో మెటిరియల్ ఎక్కువగా లభిస్తుందంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు అటు మీడియలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యాలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మంత్రి సురేశ్ వ్యాఖ్యలు అర్థరహితం.. అసంబద్దమని వారు  కొట్టిపారేస్తున్నారు. అసలు ఆయన గురుపూజోత్సవ కార్యక్రమంలో గురువులను సన్మానించారో? లేక అవమనించారో? ముందుగా ఆయన తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం ఇంతవరకు ఎక్కడా ఏదీ లేదని వారు వివరిస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం గురువులతో బోధనలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని మంత్రిగారు గమనించాలంటూ.. ఉపాద్యాయ సంఘాల నేతలు మంత్రిగారికి హితవు పలుకుతున్నారు.  మరోవైపు మంత్రి సురేశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పదవి వెలగబెట్టారని.. ఆ సమయంలో ఈ మంత్రి పుంగవులకి గురువు కంటే గూగుల్‌లోనే ఎక్కువ మెటిరియల్ దొరుకుతుందని తెలిసి ఉంటుందని  చురకలంటిస్తున్నారు. అయినా పెద్ద చదువులు చదువుకొని.... సెంట్రల్ సర్వీస్‌లో ఉద్యోగం చేసిన సురేష్   గురువుకి గూగుల్‌కి మధ్య తేడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే.. ఆయన జ్ణానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటున్నారు.    జగన్ తొలి కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా.. జగన్ మలి కేబినెట్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్నఆదిమూలపు సురేష్ కు గురు పూజోత్సవంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో  తెలియనంత అజ్ణానం గూడుకట్టుకుందని అంటున్నారు. అయినా జగన్ తొలి, మలి కేబినెట్‌లో మంత్రి పదవులు తారుమారు అయినా.. బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లు ఇద్దరు ఇద్దరేనని.. వీరిరువురూ కూడా సింగిల్ పీస్  డైమండ్ లనీ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి  జగన్‌కి ఇలాంటి వాళ్లే కావాలని.. అందుకే వీరిద్దరు.. జగన్ తొలి, మలి కేబినెట్‌లలో  కొనసాగుతున్నారని అంటున్నారు.  అదీకాక...  మన పెద్దలు గురు బ్రహ్మ, గురు విష్ణు,  గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ  తస్మై శ్రీ గురువే నమ: అని అన్నారని..  కానీ అదే మీరైతే.. గూగుల్ బ్రహ్మ, గూగుల్ విష్ణు, గూగుల్ దేవో మహేశ్వరహ గూగుల్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గూగులే నమ: అని అన్నా అంటారని నెటిజన్లు..  మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు.  ఇక మాతృదేవో భవ.. పితృ దేవో భవ.. ఆచార్య దేవో భవ అని మన పూర్వికులు అన్నారని.. అదే మీరైతే.. ఆచార్య దేవో భవాకు బదులు గూగుల్ దేవో అన్న అనగల   సమర్థులని నెటిజన్లు ఆదిమూలపు సురేష్ ను ఓ ఆటాడుకుంటున్నారు. 

వారానికి మూడు రోజులు విశాఖలోనే జగన్?.. దసరాకి గృహ ప్రవేశం!

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి?.. ఏమో మన ఏపీకి కూడా మూడు రాజధానులు వస్తాయేమో. ఇదీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019లో చేసిన ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ముందు బయటపెట్టగా.. ఆ తర్వాత మిగతా వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. అయితే ప్రభుత్వం ఇది ప్రకటించి నాలుగేళ్లు అయ్యింది. మూడు రాజధానులు లేవు. ఉన్న అప్పటి వరకూ ఉన్న ఒక్క రాజధాని అమరావతిలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ మా నినాదం మూడు రాజధానులే. అందులో పరిపాలన విశాఖ నుండే అన్నది వైసీపీ నేతల వాదన. అయితే, ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉండగా అక్కడ విచారణ పూర్తయ్యేసరికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఐదేళ్ల గడువూ పూర్తయిపోతుంది.  అందుకే అనధికారికంగా అయినా విశాఖ నుండి పరిపాలన చేసి తన పరువు కాపాడుకోవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు. జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేశారు. అమరావతి రైతులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకురావడం, విపక్షాల తీవ్ర వ్యతిరేకత, కోర్టులలో పిటిషన్ల దాఖలు చేయడంతో కోర్టులు అమరావతి రాజధానికే అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి.  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లగా అక్కడ కూడా వ్యతిరేక తీర్పు వస్తుందనే ఆలోచనతో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారు కూడా. అయితే  సుప్రీం కోర్టులో వ్యవహారం మాత్రం ఇంకా విచారణ దశలోనే ఉంది. గతంలో ప్రభుత్వం అమరావతి రైతుల నుండి భూములను తీసుకున్న సమయంలో చేసుకున్న ఒప్పందాలను బట్టి చూస్తే ఈ అంశంలో ఇప్పటి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ విషయం ఇప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. కానీ, తాము చెప్పినట్లుగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలి. అధికారికంగా ఎలాగూ వీలు పడదు కనుక కనీసం అనధికారికంగా విశాఖ నుండి పరిపాలన చేసి పరువు నిలుపుకోవాలన్నది సీఎం జగన్ ఆరాటం. ఇందుకోసమే విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. రుషికొండపై కట్టడాల నిర్మాణం గురించి ఆంధ్ర ప్రజానీకం మొత్తానికి తెలిసిందే. పర్యాటక భవనాల పేరిట ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు పరిపాలన భవనాలని ముందుగా వైసీపీ అధికారికంగా ప్రకటించి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇది కాకుండా విశాఖ నగరంలో కూడా మరో చోట సీఎం నివాసానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం నగరానికి వస్తున్నారని పలుచోట్ల త్వరితగతిన అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. ఇవి నాసిరకంగా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పటికే వినపడుతున్నాయి. కాగా  జగన్ విశాఖ నుండి పరిపాలనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. ఈ దసరాకి సీఎం విశాఖ నుండి పరిపాలన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి సమాచారం వస్తున్నది. ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ హోదాను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఐజీ ర్యాంక్ హోదాలో ఉన్న విశాఖ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ హోదాకు అప్ గ్రేడ్ చేశారు. ఈ మేరకు హోం శాఖ   ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇదంతా జగన్ ఇక్కడ నుండే  పాలన సాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని చెప్పొచ్చు. ఇక  రుషికొండ వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఒకటి మంచి వ్యూ పాయింట్ తో ఉన్నదానిలో సీఎం జగన్ నివాసం ఉండనున్నట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన ఒక భవనంలో క్యాంప్ కార్యాలయాన్ని  ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్తున్నారు. ఈ దసరా ముహూర్తాలలో ఈ రెండు భవనాలకు సీఎం దంపతులు గృహ ప్రవేశం చేయనుండగా..  దాదాపుగా వైసీపీ పార్టీ వ్యవహారాలను కూడా విశాఖ కేంద్రంగా నడిపించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వారానికి మూడు రోజుల పాటు విశాఖ నుండి జగన్ పరిపాలన సాగిస్తారని..  సోమవారం నుండి బుధవారం వరకూ జగన్ విశాఖలోనే ఉండనున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దసరా తర్వాత మూడు రోజులు విశాఖ, నాలుగు రోజులు తాడేపల్లిలో జగన్ అందుబాటులో ఉండనున్నట్లు చెప్తున్నారు.  మరి ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది.

ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు.. సంకటంలో ఇండియా కూటమి

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిథి స్టాలిన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఇచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని భగ్నం చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూమటి భాగస్వామ్య పక్షంలోని పార్టీకి చెందిన మంత్రి అన్న కారణంతో ఉదయనిథి స్టాలిన్  వ్యాక్యలు సమర్థిస్తే ఒక తంటా.. ఖండిస్తే మరో తంటా అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. పోనీ ఎటువంటి స్పందనా లేకుండా వదిలేద్దామా అంటే అదీ కుదిరే పని కాదు. ఆయన మొత్తంగా హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న భావన ప్రజలలో బలంగా ఏర్పడే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ పార్టీలూ, హిందుత్వ వాదులూ బలంగా ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ మించి సనాతన ధర్మాన్ని కరోనా వంటి మహమ్మారితో పోల్చడం ద్వారా ఉదయనిథి స్టాలిన్  దేశంలోని మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న భావన మెజారిటీ ప్రజలలో వ్యక్తం అవుతున్నది.   అన్నిటికీ మించి ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ హ్యాట్రిక్ అనుమానం అన్నట్లుగా మారిన బీజేపీ అధికార ఆశలకు ఊపిరులూదిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానిగా మోడీ వైఫల్యాల మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఆ చర్చను పక్కదారి పట్టించడమే కాకుండా హిందుత్వే వచ్చే సార్వత్రిక ఎన్నికల అజెండాగా మార్చేశాయని అంటున్నారు.  ఇక సంఘ్ పరివార్ ఉదయనిథి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ వివాదాన్ని రగులుస్తూనే ఉంటుందని చెబుతున్నారు.  ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ కు ఇప్పటి వరకూ కనిపిస్తున్న సానుకూలత మాయమైపోయి ప్రమాదం కనిపిస్తోందనీ, ఇప్పుడ కాంగ్రెస్ హిందు వ్యతిరేకం కాదన్నది రుజువు చేసుకోవాల్సిన అనివార్యతను తెచ్చి పెట్టిందని అంటున్నారు. ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఎన్నికల వేళ ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయాచిత బ్రహ్మాస్త్రంగా లభించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బలోపేతానికి కూడా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు గండి కొట్టినట్లేనని చెబుతున్నారు.  ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే విపక్ష పార్టీలు ఇండియా కూటమితో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఉదయనిథి వ్యాఖ్యలను విస్మరించి డీఎంకే ఉన్న ఇండియా కూటమిలో కొనసాగితే.. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఉనికే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ  కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం.. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ సహా ఇండియా భాగస్వామ్య పార్టీలన్నీ సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. ఉదయనిథి స్టాలిన్ మాటలతో ఏకీభవించడం లేదని ప్రకటించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కీలక నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంతవరకూ స్పందించపోవడాన్ని బీజేపీ ఎత్తి చూపుతూ ఈ విషయంలో గాంధీ ద్వయం వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ సెక్యులరిజం ముసుగులో హిందూత్వకు వ్యతిరేకంగానే పని చేస్తున్నదంటూ హిందూ సంఘాలు విమర్వలు గుప్పిస్తున్నాయి.  దీనిని బట్టే ఉదయనిథి స్టాలిన్ సతానత ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఏ స్థాయిలో ఇరుకున పడేశాయో అర్ధం చేసుకోవచ్చు.  ఈ విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మరెన్నో రోజులు మౌనంగా ఉండే అవకాశం లేదు. వారి మౌనం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చక తప్పదు. సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమ స్టాండ్ ఏమిటన్నది ఎటువంటి శశబిషలకూ తావు లేకుండా సోనియా రాహుల్ లు నోరు విప్పక తప్పని  పరిస్థితి. ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నిస్సందేహంగా బీజేపీ వ్యతిరేక  కూటమి ఐక్యతపై ప్రభావం చూపకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జమిలి సాధ్యాసాధ్యాలు.. లాభ నష్టాలు.. ఒక పరిశీలన!

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 22 వరకూ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన పార్లమెంటు భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. నూతన పార్లమెంటు భవనంలో6 పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగడం ఒక విశేషమే కానీ.. ఈ ప్రత్యేక సమావేశాలలో అజెండా ఏమిటన్నదానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ విపక్షాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఏ ఎంజెండా ఉండాలని భావిస్తున్నాయో తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ సంగతి పక్కన పెడితే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండా కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తేదీలు ప్రకటించేయడం దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది. కేంద్రం ముఖ్యంగా మూడు అంశాలు టార్గెట్ గా ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానంగా జమిలి ఎన్నికలు, ఇండియా పేరును ఎరాడికేట్ చేసి ఇక నుంచి అన్ని భాషలలోనూ దేశాన్ని భారత్ అని మాత్రమే సంబోధించాలన్న తీర్మానం చేయడం, మహిళా బిల్లు అని చెబుతున్నారు. వీటిలో మహిళా బిల్లు విషయంలో కేంద్రానికి పెద్ద పట్టింపు ఉందని ఎవరూ భావించడం లేదు. కానీ జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు విషయాలను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు, వాటి విషయంలో తన పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలను కూడా ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.    ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది గత ఐదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక నినాదంగా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా మోడీ సర్కార్ మెదడులోంచి పుట్టుకొచ్చిన వినూత్న ఆలోచనేం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి రెండు సార్వత్రిక ఎన్నికలూ జమిలి ఎన్నికలే. అప్పట్లో పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తరువాతే కేంద్రంలోనో, రాష్ట్రాలలోనో తలెత్తిన రాజకీయ పరిణామాల కారణంగా మధ్యంతర ఎన్నికలు అనివార్యం కావడంతో జమిలి ఎన్నికలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచీ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలూ, ఆ తరువాత పార్లమెంటు గడువు మిగిసిన తరువాత పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం రివాజుగా మారిపోయింది. అంటే ఆచరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, పార్లమెంటుకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్న సంగతి పదే పదే రుజువైంది. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం జమిలి ఎన్నికల వల్ల పలు ప్రయోజనాలున్నాయనీ గత ఐదేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది. వాటి నిర్వహణ కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. మోడీ సర్కార్ జమిలి వల్ల ప్రయోజనాలు అంటూ చెబుతున్న అంశాలు కూడా కొత్తవేమీ కాదు. ప్రజాధనం వృధాను అరికట్టడం, శాంతి భద్రతల సమస్య తలెత్తకపోవడం, అన్నిటికీ మించి ఏడాది పొడవునా ఎన్నికలు జరిగే పరిస్థితిని నివారించడం తద్వారా.. ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగే పరిస్థితి ఏర్పడుతుందన్నది మోడీ సర్కార్ వాదన. ఇందుకోసం ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాల అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ   నివేదికను ఈ పార్లమెంటు ప్రత్యేక  సమావేశాలలోనే చర్చించి నిర్ణయం తీసుకునే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నది.   కాగా మోడీ సర్కార్ జమిలి వల్ల ప్రయోజనాలను ఏకరవు పెడుతుంటే.. నిపుణులు జమిలి కారణంగా ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల జాతీయ సమస్యలు, ప్రాంతీయ సమస్యలూ  ఓవర్ ల్యాప్ అవుతాయని... ఓటర్ కన్ఫ్యూజ్ అవుతారనీ, అన్నిటికీ మించి ప్రాంతీయ పార్టీల ఉనికికి, మనుగడకు జమిలి ఎన్నికలు తీరని నష్టం చేకూరుస్తాయనీ వివరిస్తున్నారు.   దేశంలో  3800 పైగా ఉన్న ఎమ్మెల్యే స్థానాల ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల పైన ఆధారపడి ఉంటాయి. దానికి విరుద్ధంగా 543 ఎంపీ స్థానాల లోక్ సభ ఎన్నికల ప్రక్రియ దేశ పరిస్థితులు పైన  ఆధారపడి ఉంటాయి. ఈ రెండు ఎన్నికలు అలాగే స్థానిక ఎన్నికలు ఒకేసారి జరపడం ద్వారా అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా   అయోమయంలో పడే పరిస్థితి లేకపోలేదని అంటున్నారు. అన్నిటికీ మించి జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల ప్రాధాన్యతాంశాలు మరుగున పడిపోతాయనీ, దీని వల్ల కేంద్ర లబ్ధి పొందడమే కాకుండా.. ఫెడరల్ స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ చాలా వరకూ రాష్ట్రాల అధికారాలను తగ్గించేసిందనీ, ముఖ్యంగా ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఉద్యోగుల నియామకాలు కూడా కేంద్రం అధీనంలోకి తెచ్చేసుకుందనీ, జమిలి ఎన్నికల ఆచరణలోకి వస్తే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

తెలంగాణలో కాంగ్రెస్ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకుంటోందా?

తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు రంగం సిద్ధమైందా? 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వలె చివరి నిముషంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వాతావరణం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వైఎస్ ఇమేజ్ అంటూ షర్మిలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తప్పులో కాలేస్తోందా? వైఎస్సార్టీపీ విలీనం కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉన్న సానుకూలతను ప్రతికూలతగా మార్చేస్తుందా, రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితి ఏర్పడేందుకు దోహదం చేస్తుందా? అంటే పరిశీలకులు ఆ అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.   ఆంధ్రా మూలాలున్న లీడర్లు ఇక్కడ రాజకీయంగా యాక్టివ్​ కావడం,  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కేవీపీ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్​ పెట్టిన నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ గా మారిన తరువాత ఇక తెలంగాణ సెంటిమెంట్ అధికార పార్టీకి ఇసుమంతైనా దోహదపడే అవకాశాలు లేవని అంతా భావించారు. అయితే తెలంగాణ రాజకీయాలలో ఏపీ ప్రాంతానికి చెందిన నేతలు చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తుండటంతో  బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా మారుతోందా అన్న అనుమానాలను పరీశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ మరో సారి దెబ్బతినడం ఖాయమన్న విశ్లేషణలు చేస్తున్నారు.    2014లో జరిగిన  ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్​ బలంగా పనిచేసింది. అయితే ఆ పరిస్థితి   2018  ఎన్నికల సమయంలో పెద్దగా కనిపించలేదు. అప్పుడు నాటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల అజెండాగా అంతా భావించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు  చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కూటమి కట్టారో..అభివృద్ధి, సంక్షేమం అజెండాలు పక్కకు పోయి తెలంగాణ సెంటిమెంట్ బలంగా పని చేసింది. తెలుగుదేశం  అధినేత   చంద్రబాబు  తెలంగాణ  ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగానే జనం చూశారు. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీనే కాదు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆ ఎన్నికలలో తిరస్కరించారు.  ఎంత లేదన్న కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు కాురుణంగా 2018 ఎన్నికలలో పాతిక నుంచి ముప్ఫై స్ధానాలలో కాంగ్రెస్​ దెబ్బతిని పరాజయం పాలైందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. పొత్తు లేకుండా నాటి ఎన్నికలలో కాంగ్రెస్ కచ్చితంగా మరో పాతిక నుంచి ముప్ఫై స్థానాలలో విజయం సాధించి ఉండేదనీ, అప్పుడు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు పెద్దగా స్పందన ఉండి ఉండేది కాదనీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు.   ఏతా వాతా అప్పుడూ, ఇప్పుడూ కూడా కాంగ్రెస్ చెప్పేదేంటంటే అప్పట్లో తాము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని.  తాము చంద్రబాబు వల్ల నష్టపోయాయని అప్పట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా అంగీకరించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఐదేళ్లు గడిచిపోవచ్చాయి. మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చేసింది. కాంగ్రెస్ కు వాతావరణం సానుకూలంగా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ మరో సారి షర్మిల పార్టీ విలీనం అంటూ ఆ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకునే దిశగా ఆడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏపీ నుంచి ఎవరైనా రాష్ట్రానికి రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గతంలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఇప్పటికీ మరచిపోలేదు. అటువంటి నాయకుడి కుమార్తె  షర్మిలను తెలంగాణ సమాజం అంగీకరించి ఆదరించే పరిస్థితులు ఇప్పటికీ లేవు.  అందుకే  షర్మిల  వైఎస్సార్టీపీ పేర తెలంగాణలో రాజకీయంగా ఎదుగుదామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు   తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3,600 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేసినా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినా..   జనం నమ్మలేదు. తెలంగాణలో ఆమె కానీ, ఆమె పార్టీ కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ ఆయ్యారు. కాంగ్రెస్ కూడా రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెబుతున్నట్లుగానే కనిపిస్తోంది.  టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించినా,  వీహెచ్ వంటి సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పినా కాంగ్రెస్ హై కమాండ్ ఖాతరు చేస్తున్నట్లు కనిపించదు.  షర్మిల పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకుని ఆమెను తెలంగాణ రాజకీయాలకు దూరం పెట్టినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఏపీ రాజకీయాలలో చూపే ప్రభావం కూడా అంతంత మాత్రమేననీ, వైఎస్ ఇమేజ్ పేరిట ఆమె ఏపీ రాజకీయాలలో అక్కడి అధికార జగన్ పార్టీకి ఒకింత నష్టం చేకూరిస్తే చేకూర్చవచ్చు కానీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంతగా ప్రభావితం చేయలేరనీ అంటున్నారు.