కేసీఆర్‌ కంచుకోటలపై కమలం కన్ను... షాకిచ్చేందుకు అమిత్‌షా స్కెచ్‌...

  తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ... కేసీఆర్‌ కంచుకోటలపై కన్నేసింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ హవాకు చెక్‌ పెట్టాలని వ్యూహ రచన చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాలు పెట్టడం ద్వారా కేసీఆర్‌‌ దూకుడుకి కళ్లెం వేయాలనుకుంటోన్న కాషాయదళం... పకడ్బందీ ప్లాన్‌‌తో ముందుకెళ్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా... గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటోంది.   గత ఎన్నికల్లో ఒక్క జహీరాబాద్‌ మినహా మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లన్నీ టీఆర్‌ఎస్సే గెలిచింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఈసారి టీఆర్‌ఎస్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. కేసీఆర్‌‌కి మంచి పట్టున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సత్తా చాటడం ద్వారా టీఆర్‌ఎస్‌కి షాకివ్వాలనుకుంటోన్న కమలం నేతలు... అందుకు సరైన నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్లకు గాలమేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో చర్చలు జరిపిన బీజేపీ నేతలు... మరికొందరి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వీళ్లందరినీ పార్టీలోకి రప్పించాలనుకుంటున్నారు. అంతేకాదు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు... సీట్ల కేటాయింపులో మీరు చెప్పినవారికి టికెట్ల ఇస్తామంటూ బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ వలలో పడే నేతలెవరో చూడాలి.   ఏదిఏమైనా కేసీఆర్‌ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌ నుంచే టీఆర్‌ఎస్‌‌కు సవాల్‌ విసరాలని బీజేపీ డిసైడైంది. అమిత్‌షా కూడా అందుకు భారీ స్కెచ్‌ గీశారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి... ఆయన మేనల్లుడు హరీష్‌రావుకి మంచి పట్టున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదనేది మాత్రం వాస్తవం.

కేటీఆర్‌ - హరీ‌ష్‌ మధ్య కోల్డ్ వార్‌? పార్టీలో పట్టు కోసం ఎత్తులు పైఎత్తులు

  కేసీఆర్‌ తర్వాత ఎవరు?... కొడుకు కేటీఆరా? మేనల్లుడు హరీష్‌రావా?... ఈ చర్చ ఎప్పట్నుంచో అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ నడుస్తున్నా... మొగ్గు కేటీఆర్‌ వైపే ఉంటుందన్నది సహజంగా ఎవరైనా భావిస్తారు? అయితే కేసీఆర్‌ ఉద్యమం చేపట్టినాటి నుంచి ఆయన అడుగుల్లో అడుగేసి వెన్నంటే ఉన్న హరీష్‌రావు బలమేమీ తక్కువ కాదు... పార్టీ లీడర్లలోనూ కేడర్‌లోనూ హరీష్‌రావుకు విశేషమైన ఆదరణ ఉంది. అందుకే కేటీఆర్‌‌కు అటు పార్టీలో... ఇటు ప్రభుత్వంలో నెంబర్‌ టూ పొజీషన్‌ కట్టబెట్టేందుకు కేసీఆర్‌ వెనుకాడుతుంటారని టాక్‌. అంతేకాదు కేటీఆర్‌‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించాలని కేసీఆర్‌కి ఉన్నా... హరీష్‌ భయంతోనే వెనకడువేస్తున్నారనే ప్రచారమూ ఉంది. అయితే సమర్ధత విషయంలో కేటీఆర్‌‌, హరీష్‌రావూ ఇద్దరూ సమర్ధులే. కానీ కేసీఆర్‌ ఉద్యమం చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో ఉండటంతో... టీఆర్‌ఎస్‌ లీడర్లు, కేడర్‌లో హరీష్‌రావుకే పట్టు ఎక్కువగా ఉంది. దీన్ని బ్రేక్‌ చేసేందుకు కేటీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో హరీష్‌రావుపై దాదాపు పైచేయి సాధిస్తూనే... అటు పార్టీలోనూ తన పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు కేటీఆర్‌.   ముఖ్యంగా పార్టీ, నామినేటెడ్ పదవుల్లో కేటీఆర్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా పదవుల పంపకంలో కేటీఆర్‌ అనుచరులకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటు నామినేటెడ్, అటు పార్టీ పదవులు రెండింటిలోనూ ఆయన అనుచరులకే పెద్ద పీట దక్కుతోంది. పార్టీ అనుబంధ సంఘాల నియామకాలే పార్టీలో పెరుగుతున్న కేటీఆర్ హవాకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను తన శిష్యుడు... MLC శంబుపూరి రాజుకి కట్టబెట్టారు. విద్యార్ధి విభాగపు అధ్యక్షుడిగా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన రాకేష్ కూడా కేటీఆర్ అనుయాయులే.. తెలంగాణ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన బాలమల్లు కూడా కేటీఆర్ వర్గీయుడే. వీరే గాక... గ్రంధాలయ ఛైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీలో కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.   ఇక జిల్లా కన్వీనర్లు, పార్టీ కార్యవర్గంలో తన అనుచరులకు అధిక ప్రాధన్యత దక్కేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో పార్టీ పదవుల విషయం అంతగా పట్టించుకోని కేటీఆర్‌...పార్టీపై పట్టు బిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కేటీఆర్‌ ఛాంబర్, నందినగర్‌లో ఆయన క్యాంప్ కార్యాలయం కిటకిటలాడుతోంది. పదవుల కోసం నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కేటీఆర్ కూడా కీలక జిల్లాల బాధ్యతలు తన అనుచరులకే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందుకే పార్టీ పదవుల భర్తీ ఆలస్యమవుతుందనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడానికి హరీష్‌రావే కారణమనే టాక్‌ వినిపిస్తోంది.  

రాజనర్సింహ‌ను సైడ్‌ చేస్తోంది అందుకేనా? మాజీ డిప్యూటీ... పార్టీ మారడం ఖాయమేనా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ రాష్ట్ర విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన దామోదర రాజనర్సింహకు... మొన్నటి రాహుల్ సభలో ప్రాధాన్యత దక్కకపోవడానికి కారణమేంటో తెలిసింది. రాష్ట్ర విభజనకు ముందు ఢిల్లీలో జరిగిన పలు కీలక మీటింగ్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పాల్గొన్న దామోదర రాజనర్సింహ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే రాష్ట్ర విభజన విషయంలో కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పుదోవ పట్టించారని ఆలస్యంగా గ్రహించిన హైకమాండ్‌... పలువురి విషయంలో కోపంగా ఉందని, ఆ లిస్ట్‌లో దామోదర రాజనర్సింహ కూడా ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది.   మరోవైపు దామోదర రాజనర్సింహ... బీజేపీ వైపు చూస్తున్నారనే సమాచారం కాంగ్రెస్‌ హైకమాండ్‌‌కి ఉప్పందిందని అంటున్నారు. రాహుల్‌ సంగారెడ్డి మీటింగ్‌కి ముందు తెలంగాణలో పర్యటించిన బీజేపీ చీఫ్‌ అమిత్‌షాను రాజనర్సింహ రహస్యంగా కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అంతేకాదు అమిత్‌షా తెలంగాణ పర్యటనకు రాకముందే... రాష్ట్ర బీజేపీ నేతలు దామోదరతో చర్చలు జరిపారని, అయితే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో భేటీ అసంపూర్తిగా ముగిసిందని, ఇదంతా హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిందని అంటున్నారు.   అయితే అమిత్‌షా తెలంగాణ పర్యటన సమయంలోనే దామోదర రాజనర్సింహ... బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా... చర్చల్లో ప్రతిష్టంభనతో ఆగిపోయిందని, కానీ ఏదో ఒకరోజు ఆ పార్టీలోకి జంప్‌ చేయడం ఖాయమనే నిర్ణయానికి టీకాంగ్రెస్‌ వచ్చిందని, అందుకే రాజనర్సింహకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారే టాక్‌ వినిపిస్తోంది. అందులో భాగంగానే దామోదర రాజనర్సింహకు... రాహుల్‌ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

చేప ప్రసాదం… విశేషాలు, విమర్శలు, వివాదాల సమ్మేళనం!

  1.     మృగశిర కార్తె వస్తే అందరూ వాన చినుకుల కోసం చూస్తారు! రైతులు విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతారు. కాని, లక్షలాది ఆస్తమా రోగులు భాగ్యనగరం వైపు చూస్తారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదం కోసం నిరీక్షిస్తారు! ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేప ప్రసాదం గతం, ఘనత ఏంటి?   2.    ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైద్రాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.   3.    చేప ప్రాసదం పంపిణీ వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి వుంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జోరు వానలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్న గౌడ్ భక్తిగా సేవలు చేశారు. అందుకు మెచ్చి ఆయన ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పి దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లాడు. అప్పట్నుంచీ బత్తిని వంశజులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు.   4.    చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి… ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.   5.    ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం… మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.   6.    కొన్నాళ్లుగా ఎంతో చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాదంపై  హేతువాదులు, శాస్త్రీయవాదుల దృష్టి పడింది. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మీడియా సాయంతో ఏటేటా పెద్ద వివాదమే రాజేశాయి. చివరకు వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.   7.    కోర్టులో చేప మందు అని కాకుండా చేప ప్రసాదం అని వ్యవహారించాలని జడ్జ్ తీర్పునిచ్చారు. అలాగే అనేక సూచనలు కూడా న్యాయస్థానం చేసింది. కాని, ఉద్యమకారులు కోరినట్టు చేప ప్రసాదం పంపిణీ మాత్రం నిషేధించలేదు.   8.    శతాబ్దమున్నర కాలంగా రోగులు అంతకంతకూ పెరుగుతూనే వున్న చేప ప్రసాదం హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే శాస్త్రీయత కూడా ఋజువు కాలేదు. కాని, చేప ప్రసాదం హైద్రాబాద్ కి ఒక ప్రత్యేకత అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోంచి జనం ఈ ప్రసాదం కోసం ఏటా వస్తుంటారు!   9.    వివాదాల కారణంగా మధ్యలో ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అండగా వుంటం మానేసినా… ఇప్పుడు గవర్నమెంటే అన్ని ఏర్పాట్లూ చూసుకుంటోంది. వచ్చే రోగులకి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడుతోంది.   10.  కాల పరీక్షకి నిలబడి, ఎన్ని విమర్శలు, వివాదాలు వచ్చినా తట్టుకున్న బత్తిని సోదరుల చేప ప్రసాదం ఒక విధంగా సాంస్కృతిక అద్బుతమే. ఇక దాని వైద్యపరమైన లాభాలు ఔషధం స్వీకరిస్తున్న ఆస్తమా రోగులకే తెలియాలి. అందులో ఎలాంటి ఉపయోగం లేకుంటే లక్షలాది మంది ఎంతో శ్రమకోర్చి తీసుకోరు కదా?

ర్యాంకుల పంటలు… ప్రతిభకి తెగులు!

ఏ దేశం ఎంత కార్పోరేట్ పరమైనా, క్యాపిటలిజమ్ పడగ విప్పినా… రెండు రంగాలు మాత్రం ప్రైవేటీకరణ కావద్దని చెబుతారు మేదావులు. అది నిజం కూడా! ఆ రెండు రంగాలే… విద్యా, వైద్యం! కానీ, మన దేశంలో నెహ్రు కాలంలో సోషలిజమ్ వున్నా, ఇప్పుడు క్యాపిటలిజమ్ వున్నా.. ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వున్నవి కూడా అవ్వి రెండే! భారతదేశంలో విద్యా, వైద్య రంగాలు దారుణంగా వుండిపోతున్నాయన్నది దాదాపుగా అందరూ అంగీకరించే సత్యమే!   స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతన్నా మన విద్యా రంగం ఇంకా ప్రపంచ స్థాయికి ఎదగకపోవటం ఆందోళన కలిగిస్తుంటే… మరో వైపు రానురాను విద్యొక వ్యాపారమైపోతుండటం మరింత విషాదంగా మారిపోతోంది! ఏ చిన్న పరీక్షా ఫలితం వచ్చినా టీవీల్లో ర్యాంకుల హోరు మార్మోగిపోతుంటుంది. ఇక ఆ రోజంతా వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల భీకరమైన యాడ్స్ కర్ణభేరుల్ని పగలగొట్టేస్తుంటాయి. ఒక్కో సంస్థ వందల ర్యాంకులు తమకే వచ్చినట్టు ప్రకటించుకుంటూ వుంటాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్ల వల్ల లాభమే లేదని చెప్పలేం. చాలా మంది పిల్లలు అక్కడి క్రమశిక్షణ వల్ల నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుని పాస్ అవుతున్నారు. కాని, అదే సమయంలో కార్పోరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్ల దెబ్బకి ఒత్తిడితో తల్లడిల్లుతున్న లెక్కలేనంత మంది విద్యార్థులు కూడా వున్నారు! వారంతా పరిపక్వత లేని జ్ఞానంతో కేవలం గుమాస్తులుగా తయారవుతున్నారు. లేదా  ఏ మాత్రం తెలివి వున్నా తరువాత విదేశాలకు వెళుతున్నారు!   ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి రంగాల్లో పోటీ పరీక్షల పరిస్థితి మనకు తెలిసిందే. ఇప్పటికీ కాస్త ప్రతిభకి విలువ దొరుకుతోంది సివిల్స్ లోనే! తాజాగా వెలువడ్డ సివిల్స్ ఫలితాల్లో కూడా చాలా మంది టాపర్లు ఏ కోచింగ్ సెంటర్ సాయం లేకుండా ఉత్తీర్ణత పొందారు. వారి సక్సెస్ స్టోరీలు మీడియాలో ప్రచారం కూడా అవుతున్నాయి. అయితే, భవిష్యత్ లో ఐఏఎస్ లో, ఐపీఎస్ లు అవ్వబోయే సివిల్స్ టాపర్స్ తో కూడా కొన్ని కోచింగ్ సెంటర్లు ఆటలాడుకుంటున్నాయి. వారు కష్టపడి స్వంతంగా సాధన చేసి టాపర్స్ గా నిలిస్తే ప్రైవేట్ శిక్షణ సంస్థలు తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. అదీ ఎలాంటి పర్మిషన్లు గట్రా లేకుండానే!   సివిల్స్ మూడో ర్యాంక్ సాధించిన తెలుగు విద్యార్థి రోణంకి గోపాలకృష్ణ. ఆయన తమ విద్యార్థి అంటూ హైద్రాబాద్లోని కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రచారం చేసుకున్నాయట! తాను అలాంటి కోచింగ్ లు ఏవీ తీసుకోలేదని స్వయంగా గోపాలకృష్ణ చెప్పారు. అసలు సివిల్స్ అటెంప్ట్ చేసేవారూ ఎవరూ కూడా కోచింగ్ లు తీసుకోకపోవటమే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఒక ర్యాంక్ సాధించిన టాపర్ అనుమతి లేకుండా అతడి ఫోటోను, పేరును వాడుకోవటం అనైతికం. అందులోనూ ఆ విద్యార్థి అసలు సదరు కోచింగ్ సెంటర్ వద్దకొచ్చి ఏనాడూ శిక్షణ తీసుకోకపోతే , అప్పుడు కూడా బరితెగించి అతడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటం నేరం కూడా!   భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతోంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది యువత వున్నది కూడా మన దేశంలోనే. అందుకే, ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. అప్పుడే దేశం భవిష్యత్ భద్రంగా వుంటుంది. లేదంటే, మన అభివృద్ధి బుడగ ఏదో ఒక రోజు అమాంతం పేలిపోతుంది!

రాహుల్ కి పబ్లిసిటీ దక్కుతోంది! పబ్లిక్ లో నమ్మకం?

దేశంలో కాంగ్రెస్ పతనమవుతోందా? బీజేపి బలపడుతోందా? బీజేపి బలపడటం కంటే కాంగ్రెస్ పతనం అవుతోందని చెప్పటమే కరెక్టే! ఎందుకంటే, అడపాదడపా కమలదళం ఎక్కడైనా మంచి అవకాశం ఇచ్చినా హస్తం పార్టీ అధికారం హస్తగతం చేసుకోవటంలో విఫలం అవుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో రైతులపై కాల్పులు అలాంటి దుర్ఘటనే!   ఎక్కడైనా సరే… అన్నం పెట్టే రైతులు తూటాలకు బలికావటం అత్యంత దారుణం. పోలీసులు కాల్పులు జరిపారో, లేదో మరో కారణం చేతనో, మొత్తానికి మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో విషాదం జరిగిపోయింది. కాల్పుల ఘటనలో కుట్ర కోణం వున్నా లేకున్నా.. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అంటే ఎంపీలోని బీజేపీదే! కాని, రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని, మీడియాలో చెలరేగుతున్న చర్చని … కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటోందా? రాహుల్ గాంధీ వ్యవహార శైలి చూస్తుంటే కాదనే అనిపిస్తోంది!   దాద్రిలో బీఫ్ కారణంగా మర్డర్ జరిగిందన్న వార్త వచ్చింది మొదలు హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య వరకూ రాహుల్ ఎక్కడ బీజేపి దోషిగా దొరుకుతుందా అని ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న కారణం దొరికినా యాంగ్రీ యంగ్ మ్యాన్ లా ఎంట్రీ ఇస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోనూ అదే చేశాడు. అయితే, రైతులు మరణించి కర్ఫ్యూ అమల్లో వున్న సున్నితమైన ప్రాంతంలోకి ప్రతిపక్ష పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ ని ఏ ప్రభుత్వమైనా అనుమతిస్తుందా? శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ కూడా పోలీసుల ద్వారా అదే చేసింది! కాని, మరణించిన రైతుల కుటుంబాల పరామర్శకి బయలుదేరిన రాహుల్ అరెస్టై, నిరసన తెలిపి వెనక్కి వచ్చేయలేదు. రచ్చ రచ్చ చేసి పబ్లిసిటీ స్టంట్ గా మార్చేసుకున్నాడు…   రైతుల కుటుంబాల్ని పరామర్శించటం మంచిదే అయినా పోలీసులు అనుమతించకపోగానే రూల్స్ ని బ్రేక్ చేసి హంగామా చేయటం రాహుల్ స్థాయికి తగదు. ఆయన పోలీసులతో పోట్లాడుకోవటమే కాకుండా ఒక పోలీస్ ని తోసేశాడు కూడా. అంతటితో ఆగకుండా పోలీసులు అనుమతించని ప్రాంతంలోకి నెంబర్ ప్లేట్ కూడా లేని బైక్ పైన మరో ఇద్దిరితో కలిసి ప్రవేశించాలని ప్రయత్నించాడు. హెల్మెట్ పెట్టుకోవాలని కూడా భావించలేదు! ఇంతా చేసి తనని పోలీసులు రైతుల కుటుంబాల వద్దకి పరిస్థితి ఉద్రిక్తంగా వున్నప్పుడు అనుమతించరని రాహుల్ కి తెలియధా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే అక్కడికి ప్రతిపక్ష నేతల్ని స్వేచ్ఛగా వదిలేస్తారా? ఇంత మాత్రం లాజిక్ వుండాలి కదా?   రైతుల ప్రాణాలు పోయి జనం విషాదంలో వున్నప్పుడు వారికి నైతికంగా రాహుల్ అండగా వుంటే బావుంటుంది. అంతే కాని, అమాంతం సంఘటనా స్థలంపైకి దండెత్తి వచ్చి పోలీసులు చేయగానే రచ్చ చేసి దిల్లీకి తిరిగి వెళ్లిపోతే… శివరాజ్ సింగ్ ని కాదని రాహుల్ ని మధ్యప్రదేశ్ ఓటర్లు ఎందుకు నమ్ముతారు? త్వరలోనే భారతదేశ అత్యంత పురాతన పార్టీకి అధ్యక్షుడు అవుతాడని చెబుతోన్న రాహుల్ గాంధీ మరింత మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తే తప్ప బీజేపిని ఢీకొట్టడం సాధ్యం కాదు. నెంబర్ ప్లేట్ లేని బైక్ పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మీడియాలో కవరేజ్ తప్ప ప్రాక్టికట్ ఉపయోగం అంటూ వుండదు!

ఇది కూడా విజయమే మన సైనికులకి

  పేరు దానిష్ అహ్మద్. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో వున్న డూన్ పీజీ కాలేజ్లో అగ్రికల్చర్ సైన్స్ అండ్   టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. అయితే, దానిష్ కాశ్మీర్లోని భద్రతా దళాల సమక్షంలో బేషరతుగా లొంగిపోయాడు! ఎందుకు? ఇదే కదా మీ అనుమానం? అతనో మామూలు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే ఇంత చర్చే జరిగేది కాదు. అతనో కాశ్మీరీ. సైన్యం పై రాళ్లు రువ్వుతున్నాడని కొన్నాళ్ల కింద ఆర్మీ అరెస్టు చేసింది. తరువాత అతడి కెరీర్ దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసింది. కట్ చేస్తే … సదరు స్టూడెంట్ మహాశయుడు సబ్జర్ భట్ అనే హిజ్బుల్ ఉగ్రవాది అంత్యక్రియల్లో ప్రత్యక్షమయ్యాడు! తనను ఫైటర్ గా అలంకరించుకున్న జిహాదీ వీరుడు చేతిలో గ్రెనెడ్ పట్టుకుని దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు. ఇదంతా లోకల్ కాశ్మీరీ మీడియా వాళ్లు తీసిన వీడియోలో రికార్డ్ అయింది!   బుర్హాన్ వనీ తరువాత హిజ్బుల్ కామాండర్ అయిన సబ్జర్ భట్ అంత్య క్రియల్లో దానిష్ అహ్మద్ కనిపించటం సైన్యాన్ని అలెర్ట్ చేసింది. అతడ్ని గతంలో స్టోన్ పెల్టర్ గా భావించిన ఆర్మీ ఈసారి ఉగ్రవాదిగా పరిగణించింది. వెంటనే అతడి తల్లిదండ్రుల్ని గుర్తించి వాళ్లకు కౌన్సింగ్ ఇచ్చి అహ్మద్ ను లొంగిపోయేలా ఒత్తిడి తేవాలని సూచించింది. వాళ్లు అదే పని చేశారు. చివరకు, ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తున్న అహ్మద్ ఉగ్రవాద నరకాన్ని వదిలి బయటపడ్డాడు. లొంగిపోయాడు.   దానిష్ అహ్మదే చెప్పిన దాని ప్రకారం, అతడ్ని సోషల్ మీడియాలో దక్షిణ కాశ్మీరీ ఉగ్రవాద సంస్థలు ముగ్గులోకి లాగాయి. ఉత్తర కాశ్మీర్లో కూడా అతడ్ని ఉగ్రవాదం రాజేయమని ప్రొత్సహించాయి. రాళ్లు రువ్వు మూకల్ని సిద్ధం చేయమని చెప్పాయి. అవన్నీ అహ్మద్ చేశాడు కూడా. అయితే, తీరా మనోడు దక్షిణ కాశ్మీర్ కి వెళ్లి ఉగ్రవాదులతో కలిసి నాలుగు రోజులు వున్నాక కాని అసలు విషయం అర్థం కాలేదు. నిజంగా ఉగ్రవాదపు హింసతో సాధించగలిగేది ఏం లేదని అహ్మద్ కి తేలిగ్గానే అర్థమైంది! అందుకే, వెనక్కి వచ్చి రాష్ట్రీయ రైఫిల్స్ సైన్యాధికారుల సమక్షంలో లొంగిపోయాడు.   సైన్యం ముందు లొంగిపోయిన దానిష్ అహ్మద్ ఖచ్చితంగా తెలివైన పనే చేసినట్లుగా భావించాలి. ఎందుకంటే, మోదీ సర్కార్ రాను రాను సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తోంది. కాబట్టి ఉగ్రవాదులు బతికి బట్ట కట్టడం కష్టమైన పనే. దానిష్ కూడా హిజ్బుల్ సంస్థలో వుండి గన్ను పడితే తూటాలకు రాలిపోవాల్సింది. ఇప్పుడు ఇలా లొంగిపోవటం వల్ల ప్రాణానికైతే ప్రమాదం వుండదు. అలాగే, చట్టరిత్యా విచారణ జరిగిన తరువాత అతడికి జైలు శిక్ష పడుతుంది. ఆ శిక్ష కూడా ముగించుకుంటే అతని బతుకుదెరువు విషయంలో కూడా ప్రభుత్వ సాయం అందుతుంది!   దానిష్ అహ్మద్ వ్యక్తిగత లాభాలు పక్కన పెడితే కాశ్మీర్ లోయలో ఈ పరిణామం పెద్ద మార్పులకే దారి తీయవచ్చు. ఉగ్రవాదం పట్ల ఇంత కాలం ఆకర్షితలవుతూ వచ్చిన యువత రెండో ఆలోచన చేసే అవకాశం వుంది. నిజంగా జిహాదీల మాటల్లో నిజాయితీ లేదని వారు విశ్వసించటం మొదలుపెట్టవచ్చు. అంత భారీ మార్పులే కాకున్నా కనీసం ముందు ముందు మరింత మంది యువ టెర్రరిస్టులు లొంగుబాటు బాటలో నడిచే అవకాశమైతే వుంది. ఎన్ కౌంటర్లలో దిక్కుమొక్కూలేని చావు కన్నా విచారణ ఎదుర్కొని ప్రాణాలతో వుండటం మేలని భావించవచ్చు. మొత్తం మీద, దానిష్ అహ్మద్ లొంగుబాటులో సైన్యం, కాశ్మీరీ పోలీసుల పాత్రని మెచ్చుకుని తీరాలి. ఉగ్రవాది తాలూకూ తల్లిదండ్రుల్ని కూడా ఓపికగా కన్విన్స్ చేసి అహ్మద్ ను బయటకి లాగ గలిగారు!

2019లో… పిల్ల కాంగ్రెస్‌కి తల్లి కాంగ్రెస్సే గండి కొడుతుందా?

  రాహుల్ ఏపీకి వచ్చాడు. వెళ్లాడు. ఆంధ్రా హస్తానికి జరిగిన లాభమేంటి?  ఏం లేదని పెదవి విరిచే వారూ వున్నా, ఎంతో కొంత కదలిక వచ్చిందని సర్ది చెప్పే వారూ వున్నారు! కాని, అసలు రాహుల్ ఆంధ్రా సభ ఎఫెక్ట్ ఎవరి మీదా? ఎంత వరకూ? ఇదీ ఇప్పుడు రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది! అందులో ఒకటి కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ సిద్ధాంతం!   మామూలుగా చంద్రబాబు లాంటి నాయకులు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ వుంటారు. అంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అని అర్థం! జగన్ పార్టీ నిజానికి కాంగ్రెస్ లోంచి పుట్టుకొచ్చిందే. అందులోని మెజార్టీ నేతలు ఒకప్పుడు జై సోనియా అంటూ నినాదాలు చేసినవారే. తరువాత జగన్ టెన్ జనపథ్ ను ఢీకొట్టి వేరు కుంపటి పెట్టగానే ఫ్యాన్ కిందకొచ్చి కూర్చున్నారు బోలెడు మంది ఆంధ్రా కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజన తరువాత మరీ సున్నా సీట్లు కాంగ్రెస్ కి రావటానికి ఇది కూడా ఒక కారణం! రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన హస్తానికి బుద్ధి చెప్పాలని జనం భావించినా… మెజార్జీ కాంగ్రెస్ నేతలు జగన్ కి జై కొట్టడంతో కూడా ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది! అలా ఒక వైపు విభజన, మరో వైపు జగన్ విప్లవం దెబ్బకి కాంగ్రెస్ కుదేలైంది!   2014లో వచ్చిన జీరో సీట్ల రిజల్ట్ చూసి అందరూ ఇక కాంగ్రెస్ ఖతమ్ అనుకున్నారు. మూడేళ్లుగా ఏపీలోని ఒకరిద్దరు బడా కాంగ్రెస్ నాయకులు కూడా అదే డిసైడ్ అయ్యారు. కాని, ఈ మధ్య జరిగిన రాహుల్ గుంటూరు సభ ఆశ్చర్యం కలిగించేలా కొనసాగింది. ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలంగాణలో ఎంత సక్సెస్ అయిందో దాదాపు అంతే విజయవంతం అయింది ఏపీలో కూడా! అసలు ఒక్క ఎమ్మేల్యే కూడా లేని ఆంధ్రాలో కాంగ్రెస్ కు అలాంటి రెస్పాన్స్ రావటం నిజంగా విచిత్రమే! కాని, జనం ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ భరోసా ఏంటో చూద్దామని వచ్చి వుంటారనుకోవాలి!   రాహుల్ సభకి జనం వచ్చారా? లేక తెచ్చారా? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే … కమ్యూనిస్టులు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ మాటను బలపరుస్తున్నారు. ఇవ్వగలిగిన బీజేపి ఇవ్వనని తెగేసి చెబుతోంది కాబట్టి మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్సే ఇప్పుడు ప్రత్యేక హోదా ఆశావహులకి ఆశాదీపం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అమాంతం ప్రధాన ప్రతిపక్షం అవ్వలేకపోయినా కొన్ని సీట్లు మాత్రం కాంగ్రెస్ ఎగరేసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది! అయితే, ఈ ప్రమాదం టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీకే అంటున్నారు విశ్లేషకులు! ఎందుకంటే, గతంలో కాంగ్రెస్ ను కాదని ఓటేసిన వారంతా వైసీపీకే వేశారు.   ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ను ఆదరించాలని వారు డిసైడ్ అయితే గండి పడేది జగన్ కే! 2019లో కాంగ్రెస్ కనీసం పది సీట్లు గెలిచి మరో ఇరవై, ముప్పై సీట్లలో గెలుపుని ప్రభావితం చేసినా వైసీపీ అధికార పీఠం ఆశలు తారుమారు కావచ్చు! అంతే కాక, మరో జాతీయ పార్టీ బీజేపి ఏ మేర వైసీపీ నేతలకి గాలం వేస్తుందో కూడా పెద్ద సస్పెన్స్ గా వుంది. అధికారంలో వున్న టీడీపీలోంచి పెద్దగా వెళ్లకుండా బీజేపిలోకి వైసీపీలోంచే ఎక్కువ మంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది! అదే జరిగితే… ఇటు కాంగ్రెస్ , అటు బీజేపి రెండు పార్టీల మధ్యా జగన్ పార్టీ తీవ్ర ఇబ్బందులే పడాల్సి వుంటుంది. ఇక టీడీపీతో యథా ప్రకారం బద్ధ శత్రుత్వం వుండనే వుంటుంది!

మహానాడులకు వారం... దీక్షలకు మరో వారం... వెలవెలబోతున్న సచివాలయం

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న నవనిర్మాణ దీక్షలకు ప్రజల నుంచి మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో చంద్రబాబు దీక్షా శిబిరం ప్రారంభించిన మొదటిరోజే జనం లేక వెలవెలబోగా.... ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అయితే జనం ఉన్నా లేకున్నా చంద్రబాబు మాత్రం తన స్టైల్లో స్పీచ్‌లిచ్చుకుంటూ పోతున్నారు. ఇక ఈ మూడేళ్ల ప్రగతిపై నిర్వహిస్తోన్న చర్చాగోష్టిలకు టీచర్లు, ఉద్యోగులను బలవంతంగా తరలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే వచ్చినవాళ్లు సభ ప్రారంభం కాకముందే వెనుదిరుగుతున్నారు. దాంతో సీట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎవరున్నా లేకపోయినా తాను చెప్పదల్చుకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారు.   మరోవైపు నవనిర్మాణ దీక్షల్లో తప్పనిసరిగా పాల్గోవాలని మంత్రులను సీఎం ఆదేశించడంతో.... అమాత్యులంతా జిల్లాలకే పరిమితమైపోయారు. దాంతో రెండు వారాలుగా మంత్రులు సచివాలయం వైపు రావడమే మానేశారు. ఒకరిద్దరు మంత్రులు మినహా ఎవరూ సెక్రటేరియట్‌ గడప తొక్కడం లేదు. మినీ మహానాడులు, మహానాడుకు వారంరోజులు... నవనిర్మాణ దీక్షలకు మరో వారం రోజులు కేటాయించడంతో మంత్రులందరూ జిల్లాలకే పరిమితమయ్యారు. మంత్రుల రాకపోవడంతో... ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక కిందిస్థాయి సిబ్బంది హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. దాంతో రెండు వారాలుగా సచివాలయంలో పాలన కుంటుపడింది.    మరోవైపు ప్రతి సోమ, గురువారాల్లో మంత్రులు తప్పనిసరిగా సెక్రటేరియట్‌లో అందుబాటులో ఉండాలన్న సీఎం ఆదేశాలను ఎక్కువమంది మంత్రులు పట్టించుకోవడం లేదు. ఇక మినీ మహానాడులు, మహానాడుకు వారంరోజులు... నవనిర్మాణ దీక్షలకు మరో వారం రోజులు కేటాయించడంతో సచివాలయం వెలవెలబోతోంది. దీక్షల పేరుతో మంత్రులంతా జిల్లాల్లోనే ఉండటం.... ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో సచివాలయంలో పాలన పడకేసింది. పైగా నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కోట్లు వెచ్చించినా దీక్షలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంపై జోకులు పేలుతున్నాయి.

ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తోన్న రాథోడ్..!

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేత. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తారని సీఎం కేసీఆర్.... పార్టీలో చేర్చుకున్నారు. అయితే అధినేత నిర్ణయం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు దడపుట్టిస్తోంది. ఇప్పటికే ఖానాపూర్ టీఆర్ఎస్ నాయకులు... ఎమ్మెల్యే రేఖాశ్యామ్ వర్గం నుంచి రాథోడ్ వైపు చేరారు. ఇదేవిధంగా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. దాంతో జిల్లా మంత్రులైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల్లో వణుకు పుడుతోంది.    మంత్రి  ప్రాతినిథ్యం వహిస్తున్న అదిలాబాద్ మున్సిపాలిటిలో మంత్రి చెప్పినా జరగని పనిని చేసి చూపించారు రాథోడ్. తానే స్వయంగా రంగంలోకి దిగి మున్సిపల్ కమిషనర్ ను బెదిరించి కార్యాలయాన్ని సాధించిపెట్టారు. దీంతో రాథోడ్ వర్గం అనందానికి అవధులు లేకుండా పోయింది. పార్టీలో చేరి వారం రోజులు కూడా గడవక ముందే రాథోడ్ పట్టుబిగుస్తుండటంతో మంత్రి జోగురామన్న అందోళన చెందుతున్నారు. ఇలానే రాథోడ్ స్పీడ్ పెంచితే, తాము పలుచన కావడం ఖాయమని భయపడుతున్నారు. రాథోడ్ దూకుడుకు మొగ్గలోనే కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని జోగురామన్నను కోరుతున్నారు.   ఖానాపూర్ లో పట్టు సాదించిన రాథోడ్... ఆసిఫాబాద్ లోనూ పట్టుబిగించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ఆందోళన చెందుతున్నారు. కోవ లక్ష్మి బదులు సర్పంచ్ సరస్వతిని పార్టీలోకి తీసుకురావడానికి రాథోడ్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. టీడీపీలో ఉన్నప్పుడు జిల్లాలో ఆధిపత్యం సాధించి, పార్టీని అంతా తన కనుసన్నల్లో నడిపించిన నాయకుడిగా రాథోడ్ కు గుర్తింపు ఉంది. అదే ఊపుతో ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ పార్టీలో పట్టుసాధిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నెలల రోజులు చెప్పులు అరిగేలా తిరిగినా కాని పనులను రాథోడ్ గంటల్లో పూర్తిచేస్తున్నారు.    మంత్రి ఇంద్రకరణ‌్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇప్పటికే జెడ్పీ ఛైర్మన్‌ శోభా సత్యనారాయణ, పార్టీ నేత శ్రీహరిరావు గ్రూపులతో సతమతవుతున్నారు. రాథోడ్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యామ్ సుందర్ ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రులతో సంబంధం లేకుండా రాథోడ్ అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోతుండటంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. రాథోడ్ కారెక్కి వారం రోజులు కాకముందే... గ్రూపులు కడుతుండటంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. రాథోడ్ చేరిక రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్న తీరుగా ఉందని మదనపడుతున్నారు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు.

చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి... లేదంటే పాలు పోసినట్లే

చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు... అందుకే ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా... కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తుండటంతో... టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎవరు ఓట్లేస్తారులే... అని లైట్‌ తీసుకోకుండా... ఆ పార్టీ చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ... విభజన చేసిన తీరు, ఆ సమయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన విధానాన్ని ఎండగడుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులకు వివరిస్తున్న చంద్రబాబు... రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయాలను ప్రజలకు గుర్తుచేయాలని చెబుతున్నారు.   జగన్‌ ఢిల్లీ పర్యటన, ఎన్డీఏకి మద్దతిస్తామన్న ప్రకటన తర్వాత వైసీపీ బలహీనపడిందని, కొన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దూరం జరుగుతున్నారని చంద్రబాబు అంచనా వేశారు. అదే సమయంలో ఆ ఓటర్లందరూ మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లే అవకాశముందని... అందుకే కాంగ్రెస్‌ చేసిన విభజన గాయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు సూచిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ లబ్ది పొందే అవకాశముందని తెలుగు తమ్ముళ్లను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నుంచి బహిరంగ సభ నిర్వహించే స్థితికి ఏపీ కాంగ్రెస్‌ వచ్చిందని గుర్తుచేస్తున్నారు.   ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్ధులకు మనమే పాలు పోసినట్లు అవుతుందన్న చంద్రబాబు... ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయాల్లో విశ్రాంతి, విరామం ఉండకూడదని... అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైతేనే గెలుపు సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు సూచించారు.

డయాబిటిస్ ని ఓడించిన 69 ఏళ్ల భామ… సారీ బామ్మ!

ఆమెకు కూడా అందరిలాగే డాక్టర్లు షుగర్ వచ్చే ప్రమాదం వుందని చెప్పారు. కాని, ఆమె అందరిలాగా టెన్షన్ పడిపోయి మందులు మింగేస్తూ ఎడాపెడా స్వీట్లు, రైస్ తినేయలేదు! పట్టుదలగా షూగర్ మానేసింది. దానికి బదులు జిలిటాల్ అనే తియ్యటి ప్రత్యామ్నాయం ఎంచుకుంది. ఇది సహజంగా పళ్ల వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, కృత్రిమంగా తయారు చేసి కూడా అమ్ముతుంటారు. జిల్ టాల్ వాడదలచిన ఆమె పూర్తిగా షూగర్ మానేసి రెగ్యులర్ ఎక్స్ ర్సైజు మొదలెట్టింది. ఇంకేముంది, ప్రీ డయాబిటిస్ అన్న డాక్టర్లు ఆమెకు ఇప్పటి వరకూ డయాబిటిస్ వచ్చిందని చెప్పనే చెప్పలేదు! కాకపోతే, మీకు అసలు విషయం చెప్పలేదు కదూ… ఆమెకిప్పుడు 69ఏళ్లు, 4గురు మనవళ్లు, మనవరాళ్లు! 26ఏళ్ల కిందట ఆమెకి డయాబిటిస్ ప్రమాద గంటిక మొగింది! అప్పట్నుంచీ ఆమె షూగర్ ను , షూగర్ వ్యాధిని పూర్తిగా జయించింది!   ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చెందిన  కరోలిన్ హార్ట్స్ అనే ఈ స్త్రీ లాంటి వారు బోలెడు మంది వుంటారు. డయాబిటిస్ ను జయించి నిలుస్తుంటారు. కాని, ఈమెలోని విశేషం అది మాత్రమే కాదు! 69ఏళ్ల వయస్సులో కూడా కరోలిన్ బికిన్ వేసుకుని ఫోజులిచ్చి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తే అవ్వి వైరల్ అయ్యాయి! ఎందుకంటే, 26ఏళ్లుగా షూగర్ మానేసి, వ్యాయామం మొదలుపెట్టిన ఆమె సగానికి సగం యవ్వనంగా కనిపిస్తోంది! అదీ అందర్నీ ఆకట్టుకుంటోన్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ సీక్రెట్!   నిజంగా చక్కెర మానేస్తే … ఇంకో నెలలో డెబ్బై ఏళ్లు వచ్చేస్తాయన్నా.., జాలీగా తిరగొచ్చా? ఖచ్చితంగా అంటోంది కరోలిన్! షూగర్ ఫ్రీ బేకింగ్ అనే బుక్ కూడా రాసిన ఆమె ఆస్ట్రేలియాలో జిలిటాల్ ప్రవేశపెట్టిన బిజినస్ వుమన్ గా కూడా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు షూగర్ కాని, షూగర్ బారిన పడనివ్వనీ… తియ్యటి జిలిటాల్ అమ్ముకుంటూనే హ్యాపీగా, హెల్తీగా బతికేస్తుంది ఈ భామ… సారీ బామ్మ!

ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తోన్న రాథోడ్‌... వణుకుతోన్న జోగు, ఇంద్రకరణ్‌!

  ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేత. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తారని సీఎం కేసీఆర్.... పార్టీలో చేర్చుకున్నారు. అయితే అధినేత నిర్ణయం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు దడపుట్టిస్తోంది. ఇప్పటికే ఖానాపూర్ టీఆర్ఎస్ నాయకులు... ఎమ్మెల్యే రేఖాశ్యామ్ వర్గం నుంచి రాథోడ్ వైపు చేరారు. ఇదేవిధంగా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ  పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. దాంతో జిల్లా మంత్రులైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల్లో వణుకు పుడుతోంది.   మంత్రి  ప్రాతినిథ్యం వహిస్తున్న అదిలాబాద్ మున్సిపాలిటిలో మంత్రి చెప్పినా జరగని పనిని చేసి చూపించారు రాథోడ్. తానే స్వయంగా రంగంలోకి దిగి మున్సిపల్ కమిషనర్ ను బెదిరించి కార్యాలయాన్ని సాధించిపెట్టారు. దీంతో రాథోడ్ వర్గం అనందానికి అవధులు లేకుండా పోయింది. పార్టీలో చేరి వారం రోజులు కూడా గడవక ముందే రాథోడ్ పట్టుబిగుస్తుండటంతో మంత్రి జోగురామన్న అందోళన చెందుతున్నారు. ఇలానే రాథోడ్  స్పీడ్ పెంచితే, తాము పలుచన కావడం ఖాయమని భయపడుతున్నారు. రాథోడ్ దూకుడుకు మొగ్గలోనే కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని జోగురామన్నను కోరుతున్నారు.   ఖానాపూర్ లో పట్టు సాదించిన రాథోడ్... ఆసిఫాబాద్ లోనూ పట్టుబిగించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ఆందోళన చెందుతున్నారు. కోవ లక్ష్మి  బదులు సర్పంచ్ సరస్వతిని పార్టీలోకి తీసుకురావడానికి రాథోడ్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. టీడీపీలో ఉన్నప్పుడు జిల్లాలో ఆధిపత్యం సాధించి, పార్టీని అంతా తన కనుసన్నల్లో నడిపించిన నాయకుడిగా రాథోడ్ కు గుర్తింపు ఉంది. అదే ఊపుతో ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ పార్టీలో పట్టుసాధిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నెలల రోజులు చెప్పులు అరిగేలా తిరిగినా కాని పనులను రాథోడ్ గంటల్లో పూర్తిచేస్తున్నారు.   మంత్రి ఇంద్రకరణ‌్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇప్పటికే జెడ్పీ ఛైర్మన్‌ శోభా సత్యనారాయణ, పార్టీ నేత శ్రీహరిరావు గ్రూపులతో సతమతవుతున్నారు. రాథోడ్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యామ్ సుందర్ ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రులతో సంబంధం లేకుండా రాథోడ్ అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోతుండటంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. రాథోడ్ కారెక్కి వారం రోజులు కాకముందే... గ్రూపులు కడుతుండటంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. రాథోడ్ చేరిక రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్న తీరుగా ఉందని మదనపడుతున్నారు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు.

చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి... లేదంటే పాలు పోసినట్లే

  చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు... అందుకే ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా... కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తుండటంతో... టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎవరు ఓట్లేస్తారులే... అని లైట్‌ తీసుకోకుండా... ఆ పార్టీ చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ... విభజన చేసిన తీరు, ఆ సమయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన విధానాన్ని ఎండగడుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులకు వివరిస్తున్న చంద్రబాబు... రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయాలను ప్రజలకు గుర్తుచేయాలని చెబుతున్నారు.   జగన్‌ ఢిల్లీ పర్యటన, ఎన్డీఏకి మద్దతిస్తామన్న ప్రకటన తర్వాత వైసీపీ బలహీనపడిందని, కొన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దూరం జరుగుతున్నారని చంద్రబాబు అంచనా వేశారు. అదే సమయంలో ఆ ఓటర్లందరూ మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లే అవకాశముందని... అందుకే కాంగ్రెస్‌ చేసిన విభజన గాయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు సూచిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ లబ్ది పొందే అవకాశముందని తెలుగు తమ్ముళ్లను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నుంచి బహిరంగ సభ నిర్వహించే స్థితికి ఏపీ కాంగ్రెస్‌ వచ్చిందని గుర్తుచేస్తున్నారు.   ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్ధులకు మనమే పాలు పోసినట్లు అవుతుందన్న చంద్రబాబు... ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయాల్లో విశ్రాంతి, విరామం ఉండకూడదని... అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైతేనే గెలుపు సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు సూచించారు.

‘ఆమె’కి ఐ లవ్ యూ అని చెప్పాటానికి సల్మాన్ భయపడ్డాడట!

  ప్రతీవాడికీ ఓ వన్ సైడ్ లవ్ స్టోరీ వుంటుంది! ఏ .. నమ్మరా? సర్లెండీ, కొంత మందికి వుండదనుకుందాం! కాని, సల్మాన్ ఖాన్ లాంటి కండల వీరుడికి, బాలీవుడ్ బాక్సాఫీస్ బజ్రంగీ భాయ్ జాన్ కి కూడా వన్ సైడ్ లవ్ వుంటుందా? అయినా సల్లూ ప్రేమిస్తే వద్దనే సుందరి ఎవరుంటారు? అఫ్ కోర్స్, ఇప్పుడైతే సల్మాన్ ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోటానికి లక్షల మంది అమ్మాయిలు క్యూలో వున్నారు కాని… మనోడు 16ఏళ్ల టీనేజ్ లో వున్నప్పుడు అంత సీన్ లేదు కదా? భవిష్యత్ లో ఐష్ మొదలు కత్రీనా వరకూ అందర్నీ ఎడాపెడా డేటింగ్ చేసేసే మొనగాడు అవుతాడని తెలీక ఒకమ్మాయి పట్టించుకోనేలేదట!   సల్మాన్ స్వీట్ సిక్స్ టీన్ లో వున్నప్పుడు ఒక బ్యూటీని ప్రేమించాడట! ఆమె బాలీవుడ్ భామైతే కాదుగాని… సల్లూకి మంచి ఫ్రెండ్ అట! కాని, సల్మాన్ కు ధైర్యం చాలక మనసులో మాట చెప్పలేదట. ఆమె కూడా సల్మాన్ ప్రేమ సంగతి తెలిసో, తెలియకో ఖాన్ సాబ్ ని పట్టించుకోలేదట. సల్మాన్ ఫ్రెండ్స్ లోనే ఇద్దరు ముగ్గుర్ని డేట్ కూడా చేసిందట! అప్పుడు మన వన్ సైడ్ లవ్వర్ సల్మాన్ తెగ బాధపడేవాడట! అయినా కూడా నోరు తెరిచి చెప్పనేలేదు! ఫైనల్ గా సల్మాన్నీ, అతడి ఫ్రెండ్స్ ని ఎవ్వర్నీ పెళ్లి చేసుకోని ఆ డ్రీమ్ గాళ్ మరెవర్నో చేసుకుని వెళ్లిపోయిందట!   సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా… ఇలా బోలెడు మందితో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడిపిన సల్మాన్ తన మొట్ట మొదటి లవ్ కి మాత్రం ప్రపోజ్ కూడా చేయలేకపోయాడు. అయితే , త్వరలో రానున్న తన ట్యూబ్ లైట్ సినిమా కోసం చేస్తోన్న ప్రమోషన్లో భాగంగా, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్ … ఆమె ఎవరు, పేరేంటి అని మాత్రం చెప్పలేదు! అదీ మంచిదే! పాపం ఆవిడ ఈ పాటికి సల్మాన్ తో సమానంగా యాభై ఏళ్ల వయస్సుకొచ్చీ… మనవళ్లతో ఆడుకుంటూ వుండి వుండవచ్చు! మనోడు అనవసరంగా ఆమె ఎవరో చెప్పేసి ఇబ్బంది పెట్టకూడదు కదా….

టీవీ ముందు పిల్లలు ఠీవీగా కూర్చుంటున్నారా? అయితే, డేంజరే!

చిన్న పిల్లలు బొద్దుగా వుంటే ముద్దుగా అనిపిస్తారు! పదేళ్లు, పదకొండేళ్ల పిల్లలు కూడా లావుగా వుంటే బాగానే వుంటారు! కాని, ఆ తరువాత కూడా గాలి నింపిన బెలూన్ల మాదిరిగా వుంటే? వయస్సు పెరిగే కొద్దీ లావుదనం లక్ష సమస్యలు తెచ్చిపెడుతుంది! కాని, ఇప్పుడు తేలిన తాజా సత్యం ఏంటంటే… పెద్దయ్యాక వచ్చే ఓవర్ వెయిట్, ఒబెసిటీ సమస్యలన్నిటికీ చిన్నప్పుడే బీజాలు పడిపోతున్నాయట! అదీ బెడ్ రూంలోని టీవీల రూపంలో!   అధిక బరువు, లావుదనం… వీటికి చిన్న పిల్లల బెడ్ రూంలోని టీవీకి ఏంటి లింక్ అంటారా? బ్రిటన్ లో జరిపిన ఓ భారీ అధ్యయనం ప్రకారం పెద్ద సంబంధమే వుంది! అక్కడ దేశ వ్యాప్తంగా 12వేల మంది పదకొండేళ్ల వయస్సున్న చిన్నారుల పై అధ్యయనం చేశారు! దాంట్లో తేలింది ఏంటంటే… 11ఏళ్లప్పుడు అధిక బరువుతోనో, లావుగానో వున్న పిల్లందరూ 7, 8ఏళ్ల వయస్సప్పుడు బెడ్ రూంలో టీవీ వున్న వారేనట! తమ బెడ్ రూంలో టీవీలు వుండటం వల్ల సదరు పిల్లలు ఒకే దగ్గర కూర్చుండిపోయి శారీరిక శ్రమ లేక బరువు పెరిగారట! లావయ్యారట!   బెడ్ రూంలలో టీవీలు వుంటే అమ్మాయిలు 30శాతం అధిక బరువు, లావు వున్నారట. అబ్బాయిలు మాత్రం 20శాతమే ఓవర వెయిట్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారట! ఇలా అమ్మాయిలకు మరింత ప్రమాదం ఎందుకంటే… సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల శారీరిక శ్రమ తగ్గుతూ వస్తుంది. అబ్బాయిలు ఆట, పాటల్లో గడిపినంత వారు గడపకపోవచ్చు. అందుకే, వారు టీవీ చూడటం మరింత దుష్ఫలితాలు ఇస్తోందట!   బెడ్ రూంలలో టీవీలపై అధ్యయనం చేశారు కాని… అసలు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఎలక్ట్రానిక్ తెరలకు అంటుకుపోతున్నారు. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వగైరా వగైరా… అన్నీ పిల్లల్ని ఆటపాటలకి దూరం చేస్తున్నాయి! కుందేళ్లలా వుండాల్సిన వారు నిండు కుండల్లా తయారైపోతున్నారు! అందుకే, మీ చిన్నారుల చేతుల్లో ఫోన్లు, కళ్ల ముందు టీవీలు, కంప్యూటర్లు సాధ్యమైనంత వరకూ లేకుండా చూడండి! లేదంటే… భారీ సమస్య భవిష్యత్ లో దాడి చేయటానికి ఆల్రెడీ బయలుదేరిందని అర్థం… 

అంతరిక్షంలో ఇస్రో సరికొత్త ఆరంభం!

  ఇస్రో మరో ప్రయోగం చేసింది! మళ్లీ విజయవంతం అయింది! ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? అదీ నిజమే! ఇండియా, పాకిస్తాన్ పై క్రికెట్ మ్యాచ్ గెలవటం అంటే ఉత్కంఠ కాని… గెలవటం అలవాటుగా మార్చుకున్న ఇస్రో విషయంలో నో టెన్షన్స్! అలాంటి స్థితి చేరుకుంది మన అంతరిక్ష పరిశోధనా సంస్థ! అసలు ఒక్కో ప్రయోగం చేస్తూ ముందు ముందుకు చొచ్చుకుపోతున్న ఇస్రో ఇప్పుడు మరో దేశంతో పోటీ పడుతోందనటం పొరపాటే అవుతుంది! ఇస్రో తన మీద తానే గెలుస్తోంది! తన గత విజయం కన్నా అద్భుత విజయం ఈసారి సాధిస్తోంది! అంతకంటే గొప్ప విజయం కోసం మళ్లీ సిద్ధమవుతోంది! తాజాగా రోదసిలో ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ ఎంకే III  అలాంటి ఓ చారిత్రక విజయమే! ఇంకో విజయ యాత్రకి సన్నాహమే!   జూన్ 5న నింగికి ఎగిసిన జీఎస్ఎల్వీ ఎంకే III రాకెట్ గతంలో ఇస్రో ప్రయోగించిన రాకెట్స్ లాంటిది కాదు. అత్యంత భారీ ఉపగ్రహ వాహక నౌక ఇది! 640టన్నుల బరువున్న జీఎస్ఎల్వీ ఎంకే III 2వందల భారీ ఏనుగులతో సమానం! అయిదు జంబ్ జెట్ విమానాలతో సమానం! ఇక పొడవులో అయితే 13అంతస్థుల బంగాళ అంత వుంటుంది! అందుకే, ఈ చిన్న సైజు అంతరిక్ష భవనం ఇస్రో ప్రయోగించటం దేశానికే గర్వకారణం!   మాన్ స్టర్ రాకెట్ అని శాస్త్రవేత్తలు పిలిచే ఇస్రో బాహుబలి కేవలం 300కోట్లతో నిర్మించారు. ఇది ఇప్పుడు విజయవంతం కావటంతో ఇక మీదట భారత్ మూడు టన్నుల కంటే అధిక బరువుండే ఉపగ్రహాల్ని కూడా ప్రయోగించగలదు! ఇటువంటి ఘనత కలిగిన దేశాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే. అయితే, బాహుబలి రాకెట్ విజయవంతంలోని అసలు విశేషం భారీ ఉపగ్రహాలు ప్రయోగించటం మాత్రమే కాదు! ఈ సక్సెస్ తో ఇప్పుడు ఇస్రో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలదు!   అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపే ప్రయోగాల కోసం ఇస్రో 12500కోట్లు కేంద్రం నుంచి కోరింది. ఈ నిధులు మంజూరైతే రాబోయే ఏడేళ్లలో ఇస్రో భారతీయ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే వీలుంటుంది. అది మన అంతరిక్ష విజయాల చరిత్రలోనే అతి పెద్ద మైలురాయి అవ్వగలదు. అంతే కాదు, రానున్న రోజుల్లో అంతరిక్ష పర్యాటక రంగం కూడా కాసులు కురిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తునారు. అదే జరిగితే ఇస్రో డబ్బున్న వార్ని ఆకాశవీధీలోకి తీసుకెళ్లి లాభసాటి వ్యాపారం కూడా చేయగలదు!   టన్నుల కొద్దీ బరువుండే ఉపగ్రహాల్ని మోసుకెళ్లటం సుసాధ్యం చేసిన జీఎస్ఎల్వీ ఎంకే III వల్ల ముందు ముందు గురు గ్రహంపైకి, శుక్ర గ్రహంపైకి కూడా మనం వ్యోమనౌకల్ని పంపగలం! అలాగే, భూమి ఆవల వున్న కక్ష్యలోకి వ్యోమగాముల్ని పంపటం కూడా సుసాధ్యం అవుతుంది.అంతరిక్షంలో కాలుమోపనున్న తొలి భారతీయ వ్యోమగామిగా ఒక మహిళను పంపాలని ఇస్రో యోచిస్తోంది! మొత్తం మీద ఈ బాహుబలి రాకెట్ దేశ అంతరిక్ష ప్రస్థాన చరిత్రని కొత్త మలుపు తిప్పునుండటం మాత్రం గ్యారెంటీ!

ఖతార్ కి ఖతర్నాక్ షాకిచ్చిన ట్రంప్!

ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఎవ్వరూ ఊహించని పనులు చేయటం కొత్త కాదు! ఆయన స్టైలే షాకివ్వటం! తాజాగా ఆయన మొదటి సారి కాలు బయటపెట్టి ఒక విదేశీ గడ్డపై పర్యటించాడు. అయితే, ఇది కూడా అనూహ్యంగానే చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా సౌదీ అరేబియాకు బయలుదేరాడు! ఎందుకు అనే సమాధానం ట్రంప్ పర్యటిస్తున్నంత సేపూ దొరకలేదు! కాని, ఇప్పుడు అర్థమవుతోంది మెల్ల మెల్లగా!   ట్రంప్ మొదటి నుంచీ ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకం. ఆ విషయం ఎన్నికల సందర్భంలో కూడా ఆయన దాచి పెట్టలేదు. కాని, సౌదీ లాంటి ముస్లిమ్ గడ్డపై కూడా ఆ మాట మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించలేదు. కాని, ట్రంప్ ఇస్లామిక్ టెర్రరిజమ్ అనకుండా… ఉగ్రవాదానికి మూలాలు ఏ దేశంలో వున్నా సహించేది లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. దాన్ని తమకు అనుకూలంగా స్వీకరించాయి కొన్ని ఇస్లామిక్ దేశాలు! దాని ఫలితమే… ఖతార్ తో సౌదీ అరేబియా, ఈజీప్ట్, యూఏఈ, బహ్రైన్ లు ఉన్నపళంగా సంబంధాలు తెంచేసుకోటం!   ఖతార్ చమురు సమృద్ధిగా దొరికే మధ్య ప్రాచ్యంలోనే వున్న కీలకమైన ముస్లిమ్ దేశం. కాని, దానితో ప్రధాన ఇస్లామిక్ రాజ్యమైన సౌదీకి పడదు. బహ్రైన్, ఈజీప్ట్, యూఏఈ లాంటి దేశాలకు ఖాతార్ తో పొసగదు. ఎందుకంటే, లోపాయికారిగా ఖతార్ ఇరాన్ తో కలిసి పని చేస్తోంది. ఇరాన్ అటు అమెరికాకి, ఇటు సౌదీ అరేబియాకి కూడా శత్రువు. ఇరాన్ అండతోనే అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్రవాదం పెచ్చుమీరుతోందని చాలా మంది వాదన! అటువంటి దేశానికి ఖతార్ అండగా నిలబడటం వైట్ హౌజ్ కి నచ్చదు. కాని, ఇంత వరకూ ఒబామా లాంటి అమెరికన్ ప్రెసిడెంట్లు ఖతార్ ను చూసి చూడనట్లే వదిలారు. కాని, ట్రంప్ సౌదీకి వచ్చి మరీ అగ్గి రాజేసి వెళ్లాడు!   సౌదీ, ఖతార్లకు వున్న విభేదాలు, వాట్ని వాడుకుని అమెరికా ఖతార్ ను కంట్రోల్ చేయాలని చూడటం… ఇవన్నీ ఎలా వున్నా… మధ్య ప్రాచ్యంలో ఇప్పుడప్పుడే రాజకీయ సంక్షోభం మాత్రం సమసిపోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఖతార్ షియా జనాభా వున్న బలమైన రాజకీయ శక్తి. సౌదీ లాంటి దేశాలు సున్నీ ముస్లిమ్ లు మెజార్జీలుగా వున్నవి. కాబట్టి ఇక ఇప్పుడు షియా, సున్నీ ముస్లిమ్ దేశాల మధ్య మనస్పర్థలు మరింత ముదరవచ్చు. హింసాత్మక పరిణామాలకు దారి తీయవచ్చు. అంతే కాదు, ఖతార్ పై వివిధ దేశాల విపరీత ఆంక్షాల వల్ల చమురు రేట్లు పెరిగే ఛాన్స్ వుంది. ముఖ్యంగా, ఎల్ పీజీ ధర అదుపు తప్పవచ్చు. ఎల్ పీజీ అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఖతారే!   ట్రంప్ సౌదీకి వచ్చి తిరిగి వెళ్లే దాకా ఆయన భార్య అతడి చేయి పట్టుకోలేదు, విసిరికొట్టింది అని వార్తలు రాసిన ఇంటర్నేషనల్ మీడియా ఖతార్ పరిణామం అస్సలు ఊహించలేదు! కాని, అమెరికా తన మిత్ర దేశాలైన అరబ్ శక్తుల్ని ఏకం చేసి ఖతార్ పై ప్రయోగించింది! దీనికి ఆ దేశం, ఆ దేశాన్ని సపోర్ట్ చేసే ఇరాన్, ఉగ్రవాదుల రియాక్షన్ ఎలా వుంటుందో వేచి చూడాలి…

పండగలా పచ్చదనం పెంచే పని... 40 కోట్ల టార్గెట్‌గా తెలంగాణలో ఏర్పాట్లు

  తెలంగాణలో మూడో విడత హారితహారానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24శాతం పచ్చదనాన్ని.... 33 పర్సంటేజ్‌కి చేర్చడమే లక్ష్యంగా థర్డ్‌ ఫేజ్‌‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో 2 కోట్ల 10 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అలాగే సిద్దిపేట, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 2 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 2వేల 925 నర్సరీల్లో ఈ మొక్కలను సిద్ధంచేస్తున్నారు.   హరితహారం కార్యక్రమానికి రుతుపవనాల రాకే సరైన సమయమని భావిస్తోన్న ప్రభుత్వం.... అందుకు తగ్గట్టుగా  ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈసారి పెద్దఎత్తున పండ్ల మొక్కలను నాటనున్నారు. ముఖ్యంగా ఉసిరి, నేరేడు, మేడి, పనస, జామ మొక్కలతోపాటు తాటి, ఈత, టేకు చెట్లను పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు.   రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం.... రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల మేర మూడో విడత హారితహారం చేపట్టనున్నారు. అలాగే సీడ్‌ బాంబింగ్‌ పేరిట మట్టి, విత్తనాలు కలిపి తయారు చేసిన విత్తన బంతులను గుట్టల్లో చల్లనున్నారు. మొత్తానికి జులై ఫస్ట్‌ వీక్‌లో పండుగలాగా మూడో విడత హారితహారం చేపట్టనున్నారు.