వైఎస్ జగన్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను : శ్రీహరి

        ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో శ్రీహరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే శ్రీహరి జగన్ పార్టీలో చేరతారని, ఆ విషయం జగన్ చెవిన వేసేందుకే ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినట్లే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానని సినీనటుడు శ్రీహరి తెలిపారు.   జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్కే ఉందని శ్రీహరి తెలిపారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి చేస్తానని, జగన్ ఏది ఆశిస్తే అది చేస్తానని శ్రీహరి చెప్పారు.

పొన్నాల లక్ష్మయ్య కథ 21న విడుదల

        2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేవలం 236 ఓట్ల మెజారిటీతో జనగామ నుండి గెలుపొందారు. అయితే, తెరాసకు చెందిన ఆయన సమీప ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల కౌటింగ్ అధికారులను బెదిరించి తనకనుకూలంగా ఫలితాలు ప్రకటింపజేసుకొన్నారని ఆరోపిస్తూ, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించమంటూ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ కేసు హైకోర్టు విచారణకొచ్చేసరికి పొన్నాల దాదాపు నాలుగు సం.లు పదవీ కాలం కూడా పూర్తి చేసేసుకొన్నారు. కేవలం మరో ఏడాది మాత్రం మిగిలి ఉన్నఈతరుణంలో, ఈరోజు ఆయన కేసును హైకోర్టు విచారణకు స్వీకరించడంతో తప్పనిసరిగా పొన్నాల కోర్టుమెట్లు ఎక్కవలసి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు ఇరుపక్షాల లాయర్ల మద్య జరిగిన వాదనలు విన్నతరువాత, న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుపై స్టే కోరుతూ పొన్నాల గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోవలసిన విషయాన్నీ తన వద్దకు తెచ్చినందుకు కోర్టు ఆయనను మందలించింది. అప్పటికే ఆ కేసు విచారిస్తున్న హైకోర్టు ‘ఈవీయం మెషిన్ల’ను తన అధీనంలో ఉంచుకొంది. ఈ రోజు వాదనలు పూర్తయినందున, బహుశః రేపు హైకోర్టు ఈవీయం మెషిన్లలో రికార్డ్ అయిన ఓట్లను మళ్ళీ లేక్కించమని ఆదేశిస్తే, పొన్నాలకు ఎన్ని ఓట్లు పడిందీ స్పష్టమయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా 236 ఓట్ల మెజారిటీ ఉన్నట్లు నిరూపితం అయితే పరువలేదు. కాని పక్షంలో, ఆయనకి పదవి పోవడమే కాకుండా, మోసానికి పాల్పడినందుకు, మోసపూరితంగా పదవిలో కొనసాగి రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడినందుకు కొత్త కేసులు మెడకు చుట్టుకోక తప్పదు. అదే జరిగితే, ఇంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు, వచ్చే ఎన్నికలకు పోటీ చేసే అవకాశం కూడా కోల్పోవచ్చును. రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణ అనంతరం ఈనెల 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2009లో ఎన్నికకు సంబంధించిన కేసులో ఐటీ మంత్రిగా ఉన్న పొన్నాల శుక్రవారం ఉదయం హైకోర్టుకు మరోమారు హాజరయ్యారు.ఈ కేసులో ప్రత్యర్థి తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నాల సమాధానం ఇచ్చారు. అలాగే, 2009 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి కోర్టుకు అందించారు. ఇరు వర్గాల తరపు వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు.  

నాగం జనార్ధన్ రెడ్డి కి ఎర్త్ పెడుతున్న కేసిఆర్

        నాగర్ కర్నూల్ స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌లపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న తనను తెలంగాణా జేఎసిలోకి చేరనీయకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కోదండరామ్‌లు ఉద్యమం గురించి కాకుండా ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణా ఉద్యమాల గురించి, తెలంగాణలో జరుగుతున్నబలిదానాల గురించి ఆలోచించకుండా, వారిరువురూ ఎన్నికల గురింఛి ఎందుకు ఆలోచిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అసలు నాగమన్నతనని తెలంగాణా జేఎసిలోకి  జేరనివ్వనందుకు బాధపడుతున్నారా లేక వారిరువురూ ఉద్యమం పక్కదారి పట్టిస్తునందుకు బాధపడుతున్నారో తెలియదు గానీ,  (ఆ అక్కసుతో) ఆయన చేసిన ఆరోపణలతో తెలంగాణా జేఎసి చేస్తున్న ఆలోచనలను మాత్రం బయటపెట్టారు.  

జగన్ పార్టీలో చేరుతున్న హీరో శ్రీహరి

        ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో శ్రీహరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ ను ఈ రోజు ములాఖత్ లో శ్రీహరి కలిశారు. త్వరలోనే శ్రీహరి జగన్ పార్టీలో చేరతారని, ఆ విషయం జగన్ చెవిన వేసేందుకే ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను అసేంబ్లీకి పోటీ చేస్తానని శ్రీహరి ఇంతకు ముందే ప్రకటించాడు. ఈ మేరకు ఆయన జగన్ పార్టీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్, ఖైరతాబాద్ తదితర స్థానాలలో ఏదో ఒక స్థానం నుండి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది.

'మిర్చి' సినిమా హైలైట్స్

        యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'మిర్చి' మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రెబెల్ సినిమా ఫ్లాప్ తరువాత ప్రభాస్ తన ఆశలన్నీ 'మిర్చి' సినిమా మీద పెట్టుకున్నాడు. ఈ సినిమా తో మాటల రచయిత కొరటాల శివ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. మరి ప్రభాస్ మిర్చి తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాడో లేదో చూద్దాం. 'మిర్చి' మూవీ హైలైట్స్ "మిర్చి" మూవీ లో ప్రభాస్ మెయిన్ హైలైట్ గా చెప్పవచ్చు. ఈ సినిమాలో డిఫరెంట్ బాడీలాంగ్వేజ్ తో, పంచ్ డైలాగులతో ప్రభాస్ అదరగొట్టాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర  మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో చేసిన క్యారెక్టర్ లాగా వున్న, తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొదటి భాగం నేరేషన్ వేగంగా సాగుతూ కామెడీ సన్నివేశాలతో బాగుటుంది. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సినిమా స్టోరీలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో బోర్ తెప్పిస్తాయి. దర్శకుడు కొరటాల శివ సినిమాలో ఫ్యామిలీ డ్రామాను మిలితం చేస్తూనే మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ యూత్‌కు నచ్చే విధంగా ప్రభాస్ యాక్షన్ హీరో ఇమేజ్‌ను కంటిన్యూ చేసాడు. స్క్రిప్టును కమర్షియల్ వేలో నడిపి హిట్ కొట్టాలనే ప్రయత్నం చేసాడు. కొరటాల శివ రైటర్ గా మంచి అనుభవం ఉంది కాబట్టి అదరిపోయే డైలాగులు రాసాడు. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి  డూడ్', ‘వీలైతే ప్రేమించు...మహా అయితే తిరిగి ప్రేమిస్తారు', ‘కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవ్వడూ వాడలేడు' లాంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సన్నివేశాల కంపోపింగ్ బాగుంది. ముఖ్యంగా ఈ సీన్లలో కెమెరా వాడిన తీరు బ్రిలియంట్ గా ఉంది. ప్రభాస్ పంచకట్టు ఫైట్ సినిమాలో హైలెట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. అనుష్క సినిమాలో గ్లామర్ ఆరబోసింది. రిచా గంగోపాధ్యాయ్ ఫర్వాలేదనిపించింది.  

పాదయాత్రలో కాళ్ళపీకులు

  ఒకవైపు చంద్రబాబు మరో వైపు షర్మిల ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని పాదయాత్రాలతో చుట్టేస్తున్నారు. ఇద్దరూ కూడా కాళ్ళ సమస్యలతో బాధపడుతున్నపటికీ, తమకన్నాఎక్కువ కష్టాల్లో ఉన్న ప్రజలని ఒదార్చడమే తమ తక్షణ కర్తవ్యంగా భావించి, చమటోడ్చి మరీ పాదయాత్రలు చేస్తున్నారు. ఒకవైపు వీరిద్దరూ ఎండనక వాననక పాదయాత్రలు చేస్తుంటే బ్యాక్ గ్రౌండ్లో వారివారి పార్టీ నేతలు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. తమతమ నేతల కష్టాన్ని ప్రజలు గుర్తించేలా చేస్తూనే, అదే సమయంలో ఎదుట పార్టీ నేతల్ని బజారుకీడ్చేందుకు కూడా అంతే తీవ్రంగా శ్రమిస్తున్నారు.   మొన్న బీజేపీ నాయకుడు ప్రభాకర్, అటుమొన్న తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత, నిన్న తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణంనాయుడు అందరూ వరుసకట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మీద దండయాత్ర ప్రారంభించారు. “షర్మిలకు అసలు కాలికి ఏ దెబ్బా తగలలేదు, మోకాలికి ఆపరేషనూ జరుగలేదు, అంతా పెద్ద డ్రామా!” అంటూ హేళన చేసారు.   గాలి ముద్దు కృష్ణంనాయుడు మరో అడుగు ముందువేస్తూ షర్మిల ఒకసారి ఎడమకాలికి, మరోసారి కుడికాలికి బ్యాండేజీలు వేసుకున్న ఫోటోలను మీడియాకు విడుదలచేస్తూ, ఆమెకు కుడికాలుకి దెబ్బతగిలితే, మరి ఎడంకాలికి దెబ్బ తగిలినట్లు ఎందుకు నటించిందో అని ఎద్దేవా చేసారు. అసలు ఆమెకి ఏ దెబ్బా తగులలేదని, తగిలి ఉంటే జగన్ స్వంత బాకా మీడియా సాక్షి దాని గురించి జనాన్ని ఊదరగొట్టక వదిలేదా? ఆమె పడిపోయినప్పుడు ఆమె చుట్టూ ఉన్న సాక్షి మీడియా, ఆమెకు అంత పెద్దదెబ్బ తగిలినా కూడా కనీసం ఒక్క ఫోటో కూడా తీసి ప్రచురించలేదంటే, అసలు కధ అర్ధమవుతోందని ఆయన అన్నారు.   విపక్షాలు ఇంత రాద్దాంతం చేస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు వంటివారు చేతులు ముడుచుకొని కూర్చోరు గనుక, షర్మిలాకు దెబ్బ తగలలేదని, ఆమెకు ఆపరేషను జరుగలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది గనుక, దానిని వారే నిరూపించాలని సవాలు విసిరారు.   కొన్ని నెలల క్రితమే జగన్ పార్టీలో చేరిన చంద్రబాబు ప్రియ శత్రువు లక్ష్మీ పార్వతి, అంబటి వదిలేసిన మరో పాయింటు లేవనెత్తుకొని టీవీ ఛానళ్ళ ముందుకు వచ్చారు. షర్మిల పడిపోయినప్పుడు రెండు కాళ్ళకీ దెబ్బలు తగిలినందున, ఆరోజు ఆమె చంచల్ గూడ జైల్లో తన అన్నగారు జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తూనప్పుడు షర్మిల తన రెండో కాలి నొప్పి భరించలేకనే ఆవిధంగా నడిచేరని, అయితే, ఆవిషయాన్ని కూడా రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లునని ఆమె విమర్శించారు.   అన్నీ మాట్లాడి, తన ప్రియ శత్రువు చంద్రబాబు గురించి మాట్లాడకపోతే ఆమె లక్ష్మీ పార్వతి ఎలావుతుంది? గనుక చంద్రబాబును కూడా సీన్లోకి లాకొచ్చారామె. ఆనాడు అలిపిరిలో చంద్రబాబు మీద నక్సలయిట్లు దాడిచేసినప్పుడు ఆయనకీ, మరో 15మందికి తీవ్ర గాయాలయినపుడు చంద్రబాబు చేతికి పెద్దకట్టు వేసుకొని, సానుభూతి ఓట్లు సంపాదించుకోవచ్చుననే దురాశకుపోయి ఏడాది కాలం మిగిలుండగానే ముందస్తు ఎన్నికలకి వెళ్లి బోర్లాపడలేదా అని చురకలు వేసి, ఆనాడు ఆయన ఆవిధంగా చేసినప్పుడు తప్పు పట్టనివారు ఇప్పుడు షర్మిలాను మాత్రం ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు.   ఇరు పార్టీ నేతలు ఈ కాళ్ళ, చేతుల సమస్యలపై టీవీ చానళ్ళలో ఒకవైపు వాదులాడుకొంటుంటే, మరో వైపు షర్మిల చంద్రబాబులు ఇద్దరూ కూడా కాళ్ళు నొప్పులతోనే తమ పాదయాత్రలు కొనసాగిస్తునారు. షర్మిలకి మళ్ళీ ఇప్పుడప్పుడే బ్రేక్ తీసుకొనే ఆలోచనలేనపటికీ, చంద్రబాబు మాత్రం ఈ ఆదివారం పాదయాత్రకు శలవు ప్రకటించినట్లు సమాచారం.

నటి ఖుష్బు పై చెప్పులతో దాడి

        డీఎంకే చీఫ్ కరుణానిధి వారసత్వంపై ఖుష్బు చేసిన వ్యాఖ్యలపై తమిళ నాడులో ఆమెకు నిరసనలు ఎదురవుతున్నాయి. తిరుచ్చిలో జరిగిన డీఎంకే సభలో పాల్గొనేందుకు వెళ్ళిన కుష్బు పై రాళ్ళు, చెప్పులతో కొనదరు దాడి చేశారు. పోలీసులు వారిని పట్టుకోనేలోపు ఖుష్బూ డీఎంకే వ్యతిరేకి, స్టాలిన్ కి వ్యతిరేకి అని అరుస్తూ పారిపోయారు. ఈ ఘటనలో కుష్బుకు గాయలేమి కాలేదు. మరోవైపు కొంతమంది వ్యక్తులు కుష్బూ ఇంటిపై రాళ్ళదాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కారు అద్దాలు పగిలాయి. ప్రహరీపై ఉన్న విద్యుద్దీపాలను ధ్వంసం చేసిన స్టాలిన్ అభిమానులు.. ఖుష్బూ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఖుష్బూ తాను చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వారు అపార్థం చేసుకున్నారని ఖుష్బూ ఆవేదన వెలిబుచ్చారు. తాను స్టాలిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. పార్టీకి తాను విశ్వాసపాత్రురాలినని, పార్టీ నేతల ఆజ్ఞను శిరసావహిస్తానని అన్నారు. 

రాజపక్సే తిరుపతి పర్యటన: టెన్షన్ టెన్షన్

        తిరుపతిలో శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే తిరుమల పర్యటనకు నిరసనగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా తమిళ పార్టీలు నిరసన తెలిపేందుకు పోలీసులను అనుమతి కోరాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తిరుపతిలో 144 సెక్షన్ విధించారు. రాజపక్సేను అడ్డుకుంటామని తమిళ ప్రజాసంఘాలు, పీఎంకే నేత వైగో హెచ్చరికలతో తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రాజపక్సే తమిళ ద్రోహి అని, ఆయన పర్యటనను అడ్డుకుంటామంటూ తమిళవాసులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. దాంతో రాజపక్సే తిరుమల పర్యటన ఉత్కంఠకు గురి చేస్తోంది. ఆయన పర్యటన ఈ రోజు ఉదయం నుండే ఉండాల్సి ఉంది. అయితే ఈ సాయంత్రానికి వాయిదా పడింది. హెచ్చరికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో భారీగా తమిళనాడుకు చెందిన పార్టీల కార్యకర్తల వాహనాలు భారీగా కనిపిస్తున్నాయి. రాజపక్సే తనతో పాటు 60 మంది కుటుంబ సభ్యులు, ఇతర బంధువులతో ప్రత్యేక విమానంలో తిరుమలకు రానున్నారు.  

ప్రభాస్ మిర్చి రిలీజ్: కేక పెట్టిస్తున్న కటౌట్లు

        యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి'సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. ప్రభాస్ ‘మిర్చి' మూవీ ఈ రోజు విడుదలైన నేపద్యంలో రాష్ట్రంలోని ‘మిర్చి' థియేటర్లన్నీ భారీ కటౌట్లతో నిండిపోయాయి. భీమవరంలోని ప్రభాస్ అభిమానులు 'మిర్చి' భారీ కటౌట్ లు పెట్టి హంగామా చేస్తున్నారు. ఇందులో ఒకటి 150 అడుగుల వెడల్పుతో ఉండగా, మరొకటి 70 అడుగుల పొడవుతో కేక పెట్టిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ జై (ప్రభాస్) ఇటలీలో ఆర్కిటెక్ ఉద్యోగం చేస్తుంటారు. వీలైతే ప్రేమిద్దాం అనే మనస్తత్వం గల వ్యక్తి. హ్యాపీగా జీవితం గడుపుతున్న అతను ఉన్నట్టుండి ఓ సమస్య కారణంగా ఇండియాకి తిరిగి వస్తాడు. వెన్నెల(అనుష్క), మానస(రీచా గంగోపాధ్యాయ్) లలో జై ఎవరిని ప్రేమించాడు? ఆ సమస్య ఏమిటి? అనేది కథ. మాటల రచయితగా పరిశ్రమలో మంచి పేరుతెచ్చుకున్న కొరటాల శివ మిర్చి తో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు,రొమాంటిక్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మిర్చి సినిమా టాక్ కొద్ది సేపట్లో మీకోసం. 

వైయస్ కుటుంబానికి విశ్వసనీయతే లేదు

        జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా,ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ లపై బిజెపి మరోసారి ధ్వజమెత్తింది. ఎప్పుడు విశ్వసనీయత గురు౦చి మాట్లాడే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అసలు విశ్వసనీయతే లేదని మండిపడింది. బిజెపి నేతలు దాసరి మల్లేశం, రాములతో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.   వైయస్ కుటుంబానికి దమ్ము, ధైర్యం ఉంటే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్లు ప్రకటించాలని. లేదంటే కంపెనీలు మీవి కావని చెప్పండి. అలా చెబితే ఆధారాలతో సహా నిరూపించడానికి మా సిద్ధంగా ఉంది అని అన్నారు. విజయలక్ష్మి బైబిల్‌ను చేతిలో పట్టుకుని విశ్వసనీయత గురించి మాట్లాడతారు. విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించి ఎందుకు విశ్వసనీయతను చాటుకోవట్లేదు? అంటే నేను చేసిన ఆరోపణలు వాస్తవాలేనని అంగీకరిస్తున్నారా?" అని ఆయన అన్నారు.   విశ్వసనీయత లేని షర్మిల ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర పేరిట ప్రజల వద్దకు వెళుతోందని ప్రశ్నించారు.  

ధర్మాన మళ్ళీ డ్యూటీలో జేరారా?

  తన మంత్రి  పదవికి రాజీనామా చేసిన కారణంగా గత కొన్ని నెలలుగా సచివాలయం వైపు చూడని రెవెన్యూశాఖ మంత్రి థర్మాన ప్రసాదరావు, ఇంతవరకు తగిలిన ఎదురు దెబ్బలకి ఇక నేడోరేపో స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకొంటారని మీడియాలో వార్తలు వస్తున్నతరుణంలో గురువారంనాడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన ఎన్ఏసీ బోర్డు సమావేశంలో పాల్గొనడంతో, ఆయన మళ్ళీ విధులకు హాజరు కాబోతున్నట్లు తెలియజేసినట్లయింది.   క్రిందటి నెల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖకు వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఒక అధికారిక కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నపుడు, మీడియా ప్రశ్నకు బదులిస్తూ తానూ రాజీనామా చేసినప్పటికీ, దానిని ముఖ్యమంత్రి ఆమోదించనందున ఆ సమావేశంలో పాల్గొన్నానని, అయితే ఇప్పటికీ తానూ తన రాజీనామాకు కట్టుబడే ఉన్నానని తెలిపారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే, ఆయన సచివాలయంలో జరిగిన అధికారిక సమావేశంలో పాల్గొనడంతో, ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని విధులకు హాజరవుతారని భావించవచ్చును. అయితే, మళ్ళీ కోర్టుకు వెళ్ళవలసి వస్తే అప్పుడు ఏమి చేస్తారనేదే ప్రశ్న.

బాబు పాదయాత్రకు ఆదివారం సెలవు

ఆరోగ్య సమస్యలు, కాలి నొప్పులు పీడిస్తున్నా మొండితనంగా ముందు సాగుతున్న చంద్రబాబు నాయుడు, ఆదివారంనాడు పాదయాత్రకి విరామం ఇచ్చి పూర్తీ విశ్రాంతి తీసుకోవాలని అనుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా, ఆరోగ్యకారణాలతో నాలుగు రోజులు విరామం తీసుకొన్న సంగతి తెలిసిందే. అప్పుడు వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలూ కూడా ఆయనను పాదయాత్ర విరమించమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన కొనసాగించేందుకే నిర్ణయించుకొన్నారు. అయితే, మళ్ళీ ఇంత త్వరగా ఆయన విశ్రాంతి కోరుకోవడం చూస్తే, ఆయన శరీరం సహకరించనప్పటికీ ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికయినా, ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడకపోతే అది ఆయనకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది కనుక బహుశః మళ్ళీ వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలూ ఆయన పాదయత్ర విరమింపజేసే ప్రయత్నం చేయవచ్చును.     జంటనగరాలుగా గుంటూరు-విజయవాడ   చంద్రబాబు తన 129వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం స్థానిక ఎస్ఆర్ఐ వైద్య కళాశాల నుంచి ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర సందర్బంగా ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రెండు నగరాలను జంట నగరాలుగా అభివృద్ధిచేసి, ఒక ఐటీ హబ్‌ ను ఏర్పాటు చేస్తామని, ఆ రెండు నగరాల చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దానిని నగరంలోని ముఖ్యమయిన అన్ని  ప్రాంతాలతో అనుసంధానం చేస్తామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మిర్చి రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.              

వీఐపీలకు భద్రత తగ్గించి..మహిళలకు రక్షణపెంచండి: సుప్రీం

        మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ సిబ్బందిని ఎక్కువగా వినియోగించాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలాది మంది సిబ్బందిని వీఐపీల భద్రత కొరకు వినియోగిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించి, మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ సిబ్బందిని వినియోగించాలని ఆదేశించింది. ప్రత్యేకించి డిల్లీలో ప్రముఖులకు ఉన్న అదనపు భద్రత సిబ్బందిని తొలగించి మహిళల భద్రదతకు ఉపయోగించాలని సుప్రింకోర్టు ఆదేశించడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసును దృష్టిలో ఉంచుకుని సుప్రింకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషంగానే కనిపిస్తుంది. వివిఐపిల భద్రతకు పోలీసు ఆఫీసర్లను వినియోగించే విషయమై ఈ నెల 11వ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. సోమవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో రాష్టాల హోం శాఖ కార్యదర్శలు నేరుగా తమ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సినీ నటి కుష్బూ ఇంటిపై రాళ్ళ దాడి

        సినీ నటి కుష్బూ ఇంటి మీద కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గురువారం కొంతమంది వ్యక్తులు కుష్బూ ఇంటిపై రాళ్ళదాడి చేసి పరారయ్యారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇటీవల కుష్బూ మీడియాతో మాట్లాడుతూ డీఎంకే వారసుడు స్టాలినా..ఇంకెవరు అన్నది పార్టీ జనరల్ కౌన్సిల్ తేలుస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో స్టాలిన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వ్యాఖ్యల మీద కోపంతో నే స్టాలిన్ వర్గీయులు ఈ దాడి చేశారని తెలుస్తుంది. స్టాలిన్ ను తన వారసుడిగా కరుణానిధి ప్రకటించినప్పటి నుండి పార్టీలో వర్గపోరు పెరిగిన విషయం తెలిసిందే. కరుణ పెద్ద కుమారుడు అళగిరి తండ్రి నిర్ణయం మీద ఆగ్రహంగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే తన నిరసనను తెలిపారు. అయితే  ఈదాడి సంఘటన చెన్నైలో సంచలనంగా మారింది.

కిరికిరి కిరణ్

      చంద్రబాబు నాయుడు గుంటూరు పాదయాత్రలో కిరణ్కుమార్ రెడ్డి పై ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరీల ముఖ్యమంత్రని, ఆయనకు విషయ పరిజ్ఞానం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు జగన్ పై కుడా చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదనే జగన్మోహన్‌రెడ్డి పిల్ల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారని, జైలు పార్టీకి ఓటేస్తే మీరూ జైలుకెళతారని వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్ ఎందుకు రావడంలేదో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మిర్చి రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.అందరికీ వర్తించే విధంగా ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు, విజయవాడ నగరాలను జంటనగరాలుగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. రెండు నగరాలకు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దాని నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నారు.  

పొన్నాల ఎన్నికల కేసు విచారణ వాయిదా

        జనగాం శాసనసభ ఎన్నికల వివాదం కేసులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు మంత్రి పొన్నాల వాంగ్మూలంను రికార్డు చేసింది. తరుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 2009 ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగాం శాసనసభా నియోజకవర్గం నుంచి 236 ఓట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. పొన్నాల లక్ష్మయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయగా, కొమ్మూరి ప్రతాప రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరఫున పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో గెలిచిన పొన్నాల లక్ష్మయ్యపై కొమ్మూరి ప్రతాప రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు.

ఎన్నికల ఫలితాలతో తేలిపోయిన కెసిఆర్ 'వేర్పాటు'వాదం

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       ఆంధ్రప్రదేశ్ సమైక్యతా అనుల్లంఘనీయమని నిజాం, బ్రిటిష్ పరాయి పాలనలవల్ల పలు ప్రాంతాలలో చెల్లాచెదురై శతాబ్దాలపాటు కష్టనష్టాలకు వోర్చి, తుదకు తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం ఫలితంగా ఒకే భాషా సంస్కృతుల ప్రాతిపదికపైన ఏకమైన తెలుగు (ఆంధ్ర)జాతిని తిరిగి కృత్రిమ పద్ధతుల ద్వారా విభజించడం అసాధ్యమనీ ఇటీవల రాష్ట్రవ్యాపితంగా జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి! ఈ ఫలితాలు మూడుప్రాంతాలలోని తెలుగుప్రజల వకాలిక ప్రయోజనాల రక్షణ తెలుగుజాతి సమైక్యత వల్లనే సాధ్యంకాని చీలికవల్ల కాదని మరోసారి నిరూపించాయి. గత కొన్నేళ్ళుగానూ, అంతకుముందూ కొందరు రాజకీయ నిరుద్యోగులు తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో కృత్రిమంగా నిర్మించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాలను ఎంతమాత్రం సమర్ధించుకోడానికి వీలులేకుండా సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పంచాయితీల మాదిరే ఈ సహకార సంఘాల ఎన్నికలు కూడా కిందిస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంవల్ల వాటి ఫలితాలు ప్రాథమికస్థాయిలో ప్రజాబాహుళ్యం స్థిరాభిప్రాయానికి దిక్సూచిగా భావించాలి. చివరికి కృత్రిమ "వేర్పాటు ఉద్యమ'' నిర్మాణం కోసం మోసులెత్తిన కె.సి.ఆర్. అనే ఉత్తరాంధ్రపు వలసదారైన 'బొబ్బిలిదొర' తెలంగాణా ప్రజలమధ్య టి.ఆర్.ఎస్. పార్టీ పేరిట కుంపటి పెట్టి ఇతర ప్రాంతాలలోని తోటి తెలుగుప్రజల మధ్య పచ్చి అబద్ధ ప్రచారాలద్వారా. అక్కరకురాని కృత్రిమ హామీలద్వారా తెలంగాణా ప్రాంతంలోని మన తెలుగుయువతను భ్రమలోకి నెట్టి, ఆ భ్రమలు ఆధారంగా వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడానికి ప్రత్యక్ష సూత్రధారి అయ్యాడు. ఆ పార్టీ పేరిట ఇంతవరకూ పరిమిత సంఖ్యలో గెలిచిన అసెంబ్లీ లేదా పార్లమెంటు సీట్లు కేవలం ఉపఎన్నికల ద్వారానే గాని ప్రత్యక్ష జనరల్ ఎన్నికల ద్వారా కాదు. తీరా తాజాగా తెలంగాణా సహా యావత్తు రాష్ట్రంలోనూ జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలలో గెలిచిందెవరు? ఏ "బొబ్బిలి వలసదారు'' కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాలోని ఆత్మహత్యలకు, రాష్ట్రవిభజనకు, తెలంగాణా ప్రజలకూ వ్యతిరేకమనీ, మోసకారి అనీ ఇంతకాలంగా ఆడిపోసుకుంటూ వచ్చాడో ఆ కె.సి.ఆర్. పార్టీ [ఒక్క కరీంనగర్ మినహా, అక్కడ కూడా టి.ఆర్.ఎస్.తో సమంగా కాంగ్రెస్ కూ స్థానాలు దక్కాయి] ఘోరపరాజయాలు చవిచూడవలసి వచ్చింది. అంతేగాదు, చివరికి రాష్ట్ర విభజన సమస్యపై అటూ ఇటూ కాకుండా ఉన్న, పాతికేళ్ళ రాజకీయ, పాలనానుభవంగల "తెలుగుదేశం'' పార్టీ సహితం కాంగ్రెస్ తర్వాత రెండవ పెద్ద పార్టీగా ఈ ఎన్నికల్లో తన పునాదుల్ని గణనీయంగా నిలుపుకుని విజయాలు పొందింది; అప్పటికీ "బొబ్బిలి వలస దారై''న కె.సి.ఆర్. తెలంగాణా పేరుమీద రాజకీయ నిరుద్యోగిగా పెట్టిన టి.ఆర్.ఎస్. పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం మూడవస్థానాన్ని కూడా దక్కించుకొనలేకపోవడం అతని రాజకీయ శూన్యతనే కాదు, రాజకీయ నిరుద్యోగిగా అతని పదవీ వ్యామోహాన్ని కూడా ఈ ఎన్నికలు బహిర్గతం చేయడం విశేషం! కాగా, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయరంగంలో తన మరణం ద్వారా నిలిపిన శూన్యతనుంచి దూసుకువచ్చి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా "వై.యస్.ఆర్. కాంగ్రెస్'' పేరిట జగన్మోహనరెడ్డి నెలకొల్పిన పార్టీ మూడవస్థానంలో ఈ స్థానిక ఎన్నికల్లో నిలబడడం పెద్ద  విశేషం! రాష్ట్రవ్యాపితంగా మూడు ప్రాంతాలలోనూ 1219 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జరిగిన ఎన్నికలలో 940కి పైగా సహకార సంఘాలను కాంగ్రెస్ చేపట్టబోవటం ఇంత కృత్రిమమైన వ్యతిరేక రాజకీయ గాలిదుమారం మధ్య ఆ పార్టీ ఘనవిజయంగానే భావించక తప్పదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, పాలనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సారథ్యంలో సరికొత్త వాతావరణానికి దారితీసి, కాంగ్రెస్ పార్టే పునరుజ్జీవనానికి తొలిమెట్టుగానూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను సంఘటితం చేయడానికి దోహదపడగల అవకాశంగానూ భావించుకోవచ్చు. ఈ తాజా ప్రాథమికస్థాయి ఎన్నికల ఫలితాలను చూచిన తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాష్ట్ర విభజనకు, తెలుగుజాతిని చీల్చడానికీ సాహసించగల అవకాశాలు కూడా క్రమంగా తొలగిపోక తప్పదు. ఈ ప్రాథమికస్థాయి ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ "బొబ్బిలి వలస దొర'' కెసిఆర్ ఒకవైపున కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్. ను విలీనం చేయడంద్వారా 2014 నాటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలన్న "దింపుడుకల్లాం'' ఆశతో ఉన్నాడు; కాంగ్రెస్ లో తన పార్టీని అతడు విలీనం చేయడానికి ఎప్పుడు మాట ఇచ్చి వచ్చాడో అప్పటినుంచీ తన సొంత పార్టీలోనూ, బయటా "కెసిఆర్ తెలంగాణా విద్రోహి'' అన్న తీవ్ర ఆరోపణాముద్రను మోయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా ఇప్పటిదాకా అతడు యువత "ఆత్మహత్యల''కు బాధ్యతను కాంగ్రెస్ పైకి, లేదా తనతో కృత్రిమంగా బతుకుతెరువు రాజకీయం కోసం తన పార్టీకి "మద్దతు''గా గొంతును అద్దెకు యిచ్చిన తెలంగాణా కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులపైకి నెట్టజూస్తూ వచ్చాడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు జాతీయ కాంగ్రెస్ అగ్రేసర స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి ఆచరణ తొలిరూపం ఆంధ్రరాష్ట్రం కాగా, మలిరూపం విశాలాంధ్ర ఏర్పాటు - అదే "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రవతరణం. అందువల్ల తాడూ-బొంగరం లేని కెసిఆర్ లాంటి అవకాశవాద రాజకీయ నిరుద్యోగులకూ, ఎన్ని తప్పోప్పులున్నా ఒక స్థిరమైన జాతీయస్థాయి పార్టీగా 150ఏళ్ళ చరిత్రగల, ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ సంస్థగా కాంగ్రెస్ పార్టీకీ, అది ఆచితూచి చేయవలసిన నిర్ణయాలలో భూమికీ, ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది, ఉంటుంది. అందువల్ల తెలంగాణలో యువత ఆత్మహత్యలకు ప్రత్యక్ష బాధ్యత టి.ఆర్.ఎస్.దీ, దాని నాయకుడిది కాగా, దివంగత ప్రధాని ఇందిరాగాంధీలాగా దేశ సమగ్రతా రక్షణ కోసం, రాష్ట్రాల సమైక్యతా పటిష్టత కోసం వేర్పాటు ఉద్యమాలను ఆదరించి, ప్రోత్సహించే ప్రశ్నలేదని 1969-1972 నాటి ఆంధ్ర-తెలంగాణా ప్రత్యేక ఉద్యమాల తతంగాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లోని ఇరుపక్షాలనూ చీవాట్లు పెట్టగల స్థిరచిత్తంతో నేటి కాంగ్రెస్ అధిష్ఠానవర్గం వ్యవహరించక పోవడం వల్ల కెసిఆర్ ప్రోత్సహించిన ఆత్మహత్యలకు కాంగ్రెస్ పరోక్షంగా కారకురాలు కావలసివచ్చిందని విజ్ఞుల భావన! అందుకనే తాజా పరిణామాలలో భాగంగానే, ప్రాథమికస్థాయి సహకార సంఘాల ఎన్నికల ఫలితాల అనంతరం - వేర్పాటువాదుల రాష్ట్ర కృత్రిమ విభజన డిమాండ్ కు విలువ ఉండదని భావించవచ్చు! కాగా, సహకార సంఘాల ఎన్నికలను "మేము సీరియస్ గా తీసుకోబోమ''ని కెసిఆర్ మల్టీ నేషనల్ కుటుంబసభ్యుడు, కుమారరత్నం తారక రామారావు దిగాలుగా వ్యాఖ్యానించబోవడం ఆత్మవంచనా శిల్పంలో పరాకాష్ట!

స్వామిగౌడ్ పై క్రిమినల్ కేసు

        టిఎన్జీవో మాజీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత స్వామి గౌడ్ క్రిమినల్ కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలవిషయంలో స్వామిగౌడ్ ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కోర్టుకు చార్జిషీటు సమర్పించారు. ఒక హౌసింగ్ ఫ్లాట్ కు సంబంధించి స్వామిగౌడ్ తమతో సొమ్ము తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయించకుండా, సొమ్ము వెనక్కుఇవ్వకుండా బెదిరింపులకుపాల్పడుతున్నాడని ఒక వ్యక్తి స్వామిగౌడ్ పై హై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో స్వామిగౌడ్ పై వివాదం మొదలైంది. ఈ విషయంలో ఇన్ని రోజులూ స్తబ్ధుగా ఉండిపోయిన పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మళ్లీ పాతకేసును కదిలించారు. మరి ఇది స్వామిగౌడ్ ఎమ్మెల్సీ కలలపై ఏమైనా ప్రభావం చూపుతుందేమో!

ఓయూ స్నాతకోత్సవానికి తెలంగాణ సెగ: నరసింహన్ వెనకడుగు

        ఉస్మానియా విశ్వవిద్యాలయం 79వ స్నాతకోత్సవం సంధర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించారు. అయితే గవర్నర్ రాకను నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలు ఉస్మానియా బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బంద్ కాల్ ను ఉపసంహరించుకోవాలని వీసీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాల నాయకులతో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు చర్చలు కూడా జరిపారు. అయినప్పటికి వారు ఒప్పుకోలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపుతూ, తెలంగాణ అంశం పట్ల చులకన భావన ఉన్న గవర్నర్ ను ఉస్మానియాలో అడుగుపెట్టినవ్వమని వారు అధికారులతో చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రాక పెద్ద వివాదంగా మారే అవకాశం ఉండడంతో చివరినిమిషంలో గవర్నర్ ఉస్మానియా స్నాతకోత్సవానికి రాకుండా తప్పుకున్నారు.  గవర్నర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో స్నాతకోత్సవానికి చివరి నిమిషంలో గోవర్దన్ మెహతాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీంతో ఓయూ క్యాంపస్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.