క్యాబినెట్ ముందుకు తెలంగాణ నోట్..!

      రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. కిరణ్ ధిక్కారణ ధోరణితో ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి నోట్ ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కే రాబోతోందని పెద్ద ఎత్తున కధనాలు వస్తున్నాయి. 22 పేజీల తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి మొదలైనవాటిని కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని జాతీయ వార్తా చానెళ్లలో కధనాలు వస్తున్నాయి.

కాంగ్రెస్, వైకాపాల వ్యూహం

  జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమైక్యసభకి సిద్దం అవుతున్నారు. తద్వారా ఆయన ఉద్యోగులలో చీలికలు కూడా తేగలిగారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మె విరమించుకోగానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడేమి చేస్తాడు? అని ఆలోచిస్తే కేసీఆర్ ని అతని కుటుంబ సభ్యులని, తెరాస పార్టీని ఈ సందర్భంగా ఒకసారి తలుచుకోక తప్పదు. తెలంగాణాలో కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ మాటలతో అగ్గి రాజేస్తూ ఇంతకాలంగా తెలంగాణా సెంటిమెంటు తగ్గిపోకుండా కాపాడుకొంటూ ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందగలిగారో, అదేవిధంగా ఇక ముందు సీమంద్రాపై పూర్తి ఆధిపత్యం పొందేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల వరకు సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగించవచ్చును.   ఒకసారి రాష్ట్ర విభజన జరుపుకోవడానికి మార్గం సుగమమం అయిపోయిన తరువాత, వైకాపా సమైక్య ఉద్యమాలు చేసుకోవడాన్నికాంగ్రెస్ కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. పైగా అతనిని పరోక్షంగా ప్రోత్సహించవచ్చును. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎలాగు వీలుకాదు కనుక అటువంటప్పుడు కేంద్రంలో తమకు మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాను ప్రోత్సహిస్తే, తద్వారా తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చుకూడా.   ఈలోగా మరికొన్ని డమ్మీ సమైక్య పార్టీలను సృష్టించగలిగితే, వాటి ద్వారా ఓట్లు చీల్చి ఎన్నికల తరువాత ఆ డమ్మీపార్టీలు సాధించిన సీట్లను బట్టి వీలయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో, అక్కడ కేసీఆర్ తో అధికారం పంచుకోగలదు. బహుశః ఈ వ్యూహంతోనే ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నట్లున్నాయి.

సమైక్యం పేరిట విభజన

  జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసుల అనుమతి దొరుకుతుందో లేదో, దొరికినా సభని తెలంగాణావాదులు జరుగనిస్తారో లేదో తెలియదు. కానీ, అతను పన్నిన ఈ వ్యూహంతో ఏపీఎన్జీవోల మధ్య ఊహించినట్లే చీలికలు సృష్టించగలిగాడు. ఇంతవరకు రాజకీయ పార్టీలను దూరంగా ఉంచుతూ ఎంతో ఐకమత్యంగా సమైక్యఉద్యమం చేస్తున్నఎన్జీవోలు, కొందరు అతని సభలో పాల్గోనాలని, మరి కొందరు దూరంగా ఉండాలని నిశ్చయించుకావడంతో చీలికలు మొదలయ్యాయి. హైదరాబాద్ సచివాలయ సీమంధ్ర ఉద్యోగులు, అదేవిధంగా సీమంధ్ర ప్రాంతం నుండి మరి కొంత మంది ఉద్యోగులు ఈ సభలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.   గత రెండు నెలలుగా కేవలం ఏపీయన్జీవోలు చేస్తున్న సమ్మె కారణంగానే రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయలేకపోతున్న కేంద్రం, ఇప్పుడు జగన్ వలన వారిలో చీలికలు ఏర్పడితే ఇక త్వరలో తన పని మొదలుపెడుతుంది. అక్టోబర్ మొదటి వారంలో టీ-బిల్లు క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టి తీరుతామని బల్ల గుద్ది మరీ చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఏపీఎన్జీవోలు తమ సమ్మెను అక్టోబర్ 15వరకు పొడిగిస్తున్నామని ప్రకటించగానే, టీ-బిల్లుని కూడా సరిగ్గా రెండు వారాలకి వాయిదా వేసుకోవడం గమనిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగులు వెనక్కి తగ్గగానే రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు అర్ధం అవుతోంది.   జగన్ సమైక్యాంధ్ర సభ అంటూనే ముందుగాఉద్యోగుల సమైక్యఉద్యమాన్ని దెబ్బతీయడం గమనిస్తే, అతను రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగుల సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూనే, మరో వైపు వారికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించేందుకు, ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన బొత్స, ఆనం, చిరంజీవి వంటి కొందరు సీమంధ్ర కాంగ్రెస్ నేతలతో పావులు కదుపుతోంది.   అందుకే కుంటి సాకులు చెప్పి టీ-బిల్లుని రెండు వారాలకి వాయిదా వేసుకొంది. బహుశః ఈ రెండు పనులు రాగల 10-15రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. జగన్ హైదరాబాదులో తలపెట్టిన సమైక్య సభ తేదీ (అక్టోబర్ 19)యే ఇందుకు ముహూర్తమేమో?

బామ్మ వేషంలో టిడిపి ఎంపీ

      ఎంపీ శివప్రసాద్ కొత్త అవతారమెత్తాడు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ముసలి వితంతువు వేషం వేశాడు. విలేకరుల ముందుకొచ్చి తనదైన శైలిలో సమైక్యాంధ్రకకు మద్దతుగా తన వాణి వినిపించాడు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. గాంధీ తాత ఎక్కడ చూసినా కర్ర పట్టుకుని నిలుచుని ఉంటాడని.. ఐతే ఆయన ఆ కర్ర పట్టుకుని వచ్చి సోనియా గాంధీ నెత్తిన ఒక దెబ్బ.. కేసీఆర్ ముఖం మీద మూడు దెబ్బలు కొట్టాలని.. అప్పుడైనా వాళ్ల బుద్ధి మారుతుందని అన్నారు. డీకే అరుణ కూతురిని నెల్లూరు వాసికిచ్చి పెళ్లి చేసిందని, గీతా రెడ్డి భర్తది కర్నూలని, సబితా ఇంద్రారెడ్డి కోడల్ని తూర్పు గోదావరి నుంచి తెచ్చుకుందని, మల్లు రవి.. కోనేరు రంగారావు కూతుర్ని చేసుకున్నాడని.. కేసీఆర్ ది విజయనగరమని.. కేటీఆర్ భార్య కాకినాడ అమ్మాయి అని చెప్పారు. ఇప్పుడు వీళ్లంతా విడిపోతారా.. సీమాంధ్రతో సంబంధాలు తెంచుకుంటారా అని ప్రశ్నించారు.

కేవలం ఐదారుగురు మంత్రులే సమైక్యం కోరుకొంటున్నారు: డొక్కా

  మొన్నముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా ముఠాకట్టిన తొమ్మిది మంది సీమంధ్ర మంత్రులలో ఒకరయిన మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మీడియాతో మాట్లాడుతూ " సీమంధ్ర మంత్రులలో కేవలం కేవలం ఐదారుగురు మంత్రులు మాత్రమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నారని, మిగిలినవారు గందరగోళంలో ఉన్నారని" బాంబు పేల్చారు.   మొన్న మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై యుద్ద భేరి మ్రోగించగా నేడు మంత్రి డొక్కా ఆయనపై నేరుగా యుద్దమే మొదలుపెట్టేసారు. ముఖ్యమంత్రి అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని ఎదిరించడం, తప్పుబట్టడం చాలా తప్పని అన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ కొంత మంది చెక్కభజన చేస్తున్నారని, వారి కారణంగానే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని డొక్కా ఆరోపించారు. ఆయన కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించకపోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.   ముఖ్యమంత్రిగా ఉన్నకిరణ్ కుమార్ రెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయకపోగా వారి మధ్య విద్వేషాలు మరింత రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాము కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖించమని ఆయన స్పష్టం చేసారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానాన్ని కోరుతామని ఆయన తెలిపారు.   ఇంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేవలం తెలంగాణా మంత్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కానీ బహుశః రేపటి నుండి మిగిలిన సీమంద్రా మంత్రులు కూడా ఆయనకు వ్యతిరేఖంగా తమ గొంతులు సవరించుకొని విమర్శలు గుప్పిస్తారేమో. దీనివలన ఇప్పటికే దెబ్బ తిన్న కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయం. అది సమైక్యవాదం చేస్తున్న వైకాపాకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. అదే విధంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం ద్వారా, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసిన సదరు నేతలు సమైక్యవాదుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.

రాహుల్ దెబ్బకి ఆర్డినెన్స్ వెనక్కి

  నేరచరితులయిన ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ యూపీయే ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించడంతో ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి చాలా అవమానకరమే అయినప్పటికీ, దానిని కొనసాగించడం వలన కూడా ప్రతిపక్షాల చేతిలో మరింత పరాభవం తప్పదనే సంగతి గ్రహించిన కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోజు సాయంత్రం ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ ఆర్డినెన్స్ రద్దుచేయవచ్చును.   అందువల్ల ఇక నుంచి సుప్రీంకోర్టు జూన్ 10న ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుంది గనుక, రెండేళ్ళు జైలు శిక్షపడిన ప్రజాప్రతినిధులు ఇకపై ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇప్పటికే మెడికల్ సీట్ల కుంభకోణంలో శిక్షపడిన కాంగ్రెస్ యంపీపై అనర్హత వేటుపడనుండగా, పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడిన బీహార్ మాజి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కి రాంచీలో సీబీఐ కోర్టు రేపు జైలు శిక్ష ఖరారు చేస్తే అతను అనర్హత వేటు పడ్డ రెండవ వ్యక్తవుతారు.   రాష్ట్రంలో తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ ఇంతలు ఇదే అంశం ప్రస్తావిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రేపు కోర్టు జైలు శిక్ష విదిస్తే అతనిపై కూడా అనర్హత వేటు పడక తప్పదని జోస్యం చెపుతున్నారు.

మోడీ ప్రభంజనంతో దిక్కుతోచని కాంగ్రెస్ పార్టీ

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సుడిగాలిలా దేశాన్నిచుట్టేస్తూ మోడీ చేస్తున్న ప్రసంగాలతో దేశప్రజలు, ముఖ్యంగా యువత చాలా ప్రభావితులవుతున్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజపేయికి ఎంత ఆదరణ ఉండేదో, నేడు మళ్ళీ బీజేపీలో మోడీకి అంత ఆదరణ కనబడుతుండటంతో 2014ఎన్నికల తరువాత మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ అగ్ర నేతలలో కూడా ఇప్పుడు నమ్మకం ఏర్పడుతోంది. అందువలన ఇంతవరకు పార్టీలో ఆయనపట్ల ఉన్న వ్యతిరేఖ భావనలు కూడా క్రమంగా సమసిపోతున్నాయి.    భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశ్యించి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ స్పందించకపోయినా, మోడీ “మా దేశ ప్రధానిని ఏమయినా అంటే కబడ్దార్” అంటూ వెంటనే తీవ్రంగా హెచ్చరించడంతో మోడీపట్ల ప్రజలలో మరింత అభిమానం పెరిగింది. తమ పార్టీకి చెందిన ప్రధానిని మోడీ వెనకేసుకు వస్తూనే, మరోపక్క అయన అసమర్దుడని విమర్శిస్తుంటే, కాంగ్రెస్ మోడీని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతోంది. పైగా మోడీ వాక్చాతుర్యం, ఆయన మాటలలో ప్రజ్వలించే దేశభక్తి కాంగ్రెస్ నేతలెవరిలో లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి దిగులు పుట్టిస్తోంది.   అయితే ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాక, తను నిర్దేశించుకొన్న సమున్నత లక్ష్యాల గురించి కూడా వివరిస్తూ, అందులో తాము కూడా భాగస్వాములమేననే భావన ప్రజలలో కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసుకుపోతున్నారు. మానవ వనరులకు కొదవలేని మన దేశంలో దానిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చునో ఆయన చెపుతుంటే యువత ఆయనకి జేజేలు పలుకుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, ప్రజలు ఎంత మాత్రం నమ్మని ఆహార భద్రత, భూసేకరణ చట్టం, నగదు బదిలీ పధకం వంటివి వల్లెవేస్తూ ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకొంటోంది. ఇటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ ఆయనను గుజరాత్ అల్లర్లతో, నఖిలీ ఎన్కౌంటర్ కేసులతో గట్టిగా ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.   దానిపై కూడా మోడీ తనదయిన శైలిలో స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న సీబీఐ, రా, ఈడీ, ఆధాయశాఖ మరి దేనిని తనమీద ప్రయోగించినా తానూ బయపడేది లేదు, లొంగేదీ లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళకి ముందే బంధం వేసారు. ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ వీటిలో ఏ ఒక్క శాఖను ఉసిగొల్పినా, ప్రజలకు అయన కాంగ్రెస్-సీబీఐ బంధం గురించి చెప్పినవన్నీ నిజమని మరింత నమ్మకం కలుగుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగి ప్రమాదం ఉంది.   బహుశః ఈ సారికి కాంగ్రెస్ పార్టీ కూడా ‘నమో నమో’ అనుకొంటూ పక్కకు తొలగి ఆయనకు దారీయక తప్పదేమో?

మోడితో భేటి అవ్వనున్న బాబు

  రాష్ట్రంతో పాటు, కేంద్రంలోనూ ఎన్నికల వేడి మొదలవుతుండటంతో చంద్రబాబు కేంద్ర రాజకీయలమీద దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పలువరు జాతీయ నాయకులతో చర్చించిన చంద్రబాబు బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో బిజెపికే విజయావకాశాలు ఎక్కవేని అన్ని సర్వేలు చెపుతుండటంతో బాబు కూడా బిజెపితో పొత్తు దిశగా పావులు కదుపుతున్నారు. అందులో బాగంగానే బుధవారం డిల్లీకి వెళుతున్న ఆయన బిజెపి ప్రదాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడితో సమావేశం అవుతారన్న వార్త బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర పరిస్థితులు తెలంగాణ ఏర్పాటు వంటి అంశాలను ఆయనతో చర్చించనున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌, బిజెపియేతర పార్టీలతో మూడో ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా బలంగా ప్రయత్నించిన బాబు, ఆ ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఇప్పుడు బిజెపితో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు అత్యధిక ప్రాదాన్యత

  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర మాత్రం విభజన దిశగానే అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ప్రదాని మన్మోహన్‌ సింగ్‌ మరోసారి రాష్ట్రవిభజన తమ తొలి ఎజెండా అని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మన్మోహన్ ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లగానే హోం మంత్రి సుశీల్‌కుమార్‌ తో సమావేశమై, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మనసులో తెలంగాణ ఏర్పాటు అత్యదిక ప్రదాన్యత కలిగిన అంశం అని ఆయన పిటిఐ తో తెలిపారు. దీనితో పాటు దోషులుగా రుజువన వారు చట్టసభల్లో ప్రవేశించవచ్చు అంటూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాహుల్‌ ఏ పరిస్ధితుల్లో ఆ వ్యాఖ్యలు చేశారో అడిగి తెలుసుకుంటామన్నారు. రాజీనామా చేసే ప్రసక్తి లేదన్న ప్రధాని, రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కోనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

లాలూ తరువాత జగన్

      ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. లాలూ మాదిరిగా జగన్ దోషిగా రుజువు కావడం తథ్యమని అన్నారు. రూ.950 కోట్ల దాణ కుంభకోణం కేసులో లాలూ దోషిగా తేలినట్టే లక్ష కోట్ల రూపాయల కుంభకోణంలో జగన్ కూడా దోషిగా తేలుతాడని తెలిపారు. తాను పదహారు నెలలు జైళ్లో ఉన్నానని ప్రచారం చేసుకుంటూ జగన్ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని యనమల విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని, సహకరిస్తానని జగన్ సోనియాకు మాట ఇచ్చి అసెంబ్లీ ఏర్పాటు ద్వారా అందుకు సహకరించాలని చూస్తున్నారని యనమల ఆరోపించారు. జగన్ నీతి వ్యాఖ్యలు వల్లించడం సెక్యులరీజం గురించి జగన్ మాట్లాడ్డాం విడ్డూరంగా ఉందని, సైతాన్ బైబిల్ చదివినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుంభకోణం కేసులో నిందితునికి గవర్నర్ ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని యనమల ప్రశ్నించారు.

విజయమ్మ చిలుకపలుకులు

      పరకాల ఉప ఎన్నికల సమయంలో విజయలక్ష్మి చిలుకపలుకులు పలికారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పై మాట మార్చినవారాని ద్రోహులుగానే పరిగణిస్తామని అన్నారు. ఓయూ విద్యార్థులను తాలిబన్లతో పోల్చినప్పుడు అది మీకు సంస్కారమనిపించిందా అని అడిగారు. సీమాంధ్ర నేతలు రాక్షసులని అనలేదని, తానేమీ మాట్లాడినా తప్పు అనడం దత్తాత్రేయ, నారాయణకు అలవాటైపోయిందని మండిపడ్డారు.     తెలంగాణ రాష్ట్రం కోసం రెండు నెలలుగా సహనంతో ఉన్నామని, తమ సహనాన్ని అలుసుగా భావించవద్దని హెచ్చరించారు. అశోక్‌బాబు కోట్లాటకు రమ్మని ఉసుగొల్పడం సంస్కారమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వైకాపా ఇక్కడ సభ ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ పెడితే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర నాయకులు అవాకులు చవాకులు మానుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్ లో జగన్ సభ ఎలా పెడతారు?

        వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల హైదరాబాద్ ను పాకిస్తాన్ అంటే, ఆయన ఇక్కడ సభ పెడతానంటారా అని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్ర విభజన గురించి తన వద్దకు వచ్చిన జగన్ కు గవర్నర్ ఎలా కలిసేందుకు అనుమతి ఇస్తాడు ? అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకుని జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన జగన్ ను కలవడం ఎలాంటి సంకేతాలు సమాజానికి ఇస్తుంది ? రేపు హత్య చేసిన వాడు కూడా వస్తే గవర్నర్ ఆహ్వానిస్తాడా ? అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఇంకా జగన్ మీద కేసులు విచారణలోనే ఉన్నాయని, ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించిందని అలాంటి వ్యక్తి బెయిలు మీద బయటకు వస్తే ఆరుగంటల పాటు ఊరేగింపుగా ఇంటికి వెళ్తే పోలీసులు రక్షణ ఎలా కల్పిస్తారని వీహెచ్ ప్రశ్నించారు. రేపు హత్య చేసిన వాడు ఊరేగింపు చేస్తే ఇలాగే భద్రత ఇస్తారా ? అని ప్రశ్నించారు. జగన్ హైదరాబాద్ సభకు ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వొద్దని, అనుమతి ఇస్తే తెలంగాణ వాదులు ఊరుకోరని హెచ్చరించారు.

హైదరాబాదుపై క్యాబినెట్ చర్చ, నిర్ణయం?

మొన్న హైదరాబాదులో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తనతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి ‘టచ్చు’లోనే ఉందని అక్టోబరు ఆరులోగా అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయబోతున్నదని ప్రకటించారు. ప్లగ్గు పీకడం సంగతి ఎలా ఉన్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో బాటు బీజేపీ అధిష్టానంతో కూడా పూర్తి టచ్చులోనే ఉన్నట్లు సమాచారం.   రాష్ట్ర విభజన సజావుగా జరగాలంటే హైదరాబాదుపై కొంత పట్టువిడుపులు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ నేతలకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విభజనకు అంగీకరిస్తేనే హైదరాబాదుపై సీమాంద్రా నేతల డిమాండ్లను కొన్నిటినయినా నేరవేర్చగలమని వారికి నచ్చచెపుతున్నట్లు తెలుస్తోంది.   ఈ విషయంలో బీజేపీ అధిష్టానాన్నికూడా సంప్రదిస్తూ దానిపై వారి సలహా, సూచనలు తీసుకొంటునట్లు తెలుస్తోంది. తద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ఆలోచన. కొద్ది రోజుల క్రితం వరకు ‘సమన్యాయం’ అని మాట్లాడిన బీజేపీ అందుకే తన వైఖరి మార్చుకొని ఉంటుంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మెహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చును.   రేపు జరుగబోయే క్యాబినెట్ సమావేశంలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టబోయే టీ-బిల్లులో ఈ ప్రతిపాదనలు ఉండవచ్చునని తాజా సమాచారం. 1. గ్రేటర్ హైదరాబాదు మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది.   2. విద్య, వైద్యం, ఉద్యోగాలు, లా అండ్ ఆర్డర్, భూశిస్తు, మరియు ఇతర ఆదాయ వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి.   3. ప్రస్తుతం హైదరాబద్, సైబరాబాద్ రెండు పోలీస్ కమీషనరేట్లను గ్రేటర్ హైదరాబాదు పరిధిలోకి తీసుకు వస్తారు.   4. ముందు ప్రకటించినట్లుగానే హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగంగా, తెలంగాణా రాజధానిగా ఉంటుంది. అదే సమయంలో మరో పది సంవత్సరాల వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.   ఈ ప్రతిపాదనలకు సీమాంధ్ర, టీ-నేతలు అంగీకరించినట్లయితే వెంటనే విభజన ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజదానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై సీమంద్రా నేతలతో సంప్రదింపులు మొదలవుతాయి.

కాంగ్రెస్ పార్టీకి కేవలం సీబీఐపై మాత్రమే అదుపుంది: మోడీ

  కాంగ్రెస్ పార్టీ తన పెంపుడు చిలుకలయిన సీబీఐ, ఈడీ, ఆదాయ శాఖలను ప్రయోగించి తన రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టి, బెదిరించి లొంగదీసుకొంటుందని కేవలం బీజేపీయే కాక యూపీయే ప్రభుత్వానికి బయటనుండి మద్దతు ఇస్తున్నమాయావతి, ములాయం సింగ్ తదితరులు కూడా ఆరోపిస్తుంటారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ ఇంటిపై కూడా గత ఏడాది కాలంగా సీబీఐ చిలుకలు వాలి చాల హడావుడి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తనను సీబీఐ, ఈడీ, లేదా మరే పెంపుడు చిలుకలు భయపెట్టి లొంగదీసుకోలేవని మోడీ అన్నారు.   నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొనాదానికి ముంబై వచ్చిన మోడీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ “యూపీఏ ప్రభుత్వం నానాటికి పతనమవుతున్న రూపాయి విలువ పడిపోకుండా చర్యలు తీసుకొంటానని చెపుతుంది, కానీ రూపాయి పతనం ఆగలేదు. కారణం దానికి దేశంలో ఏ సంస్థపైన పట్టు అదుపు లేదు. కానీ సీబీఐ, ఈడీ, ఆదాయ శాఖల వంటి వాటిపై మీద మాత్రం పూర్తి పట్టు ఉంది. నాతో ఎవరెవరు ఫోటోలు దిగుతున్నారు, ఎవెరవరు కలుస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు దండలు వేస్తున్నారు వంటి వివరాలన్నీ ఉన్నవీడియోలను తెప్పించుకొని చూస్తూ వారిపైకి సీబీఐ, ఆదాయశాఖలను ఉసిగొల్పుతుంది. అయితే నేను ఇటువంటి వాటికి ఎంత మాత్రం భయపడను. నాపైకి సీబీఐని ఉసిగొల్పి నన్ను భయపెట్టి లొంగ దీసుకోవాలని ప్రయత్నించినా నేను భయపడను, లొంగను,” అని మోడీ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్ననరేంద్ర మోడీకే ఈ బాధలు తప్పకపోతే, ఇక మిగిలిన వారి సంగతేమిటి?

ఆయనకు మూడు కళ్ళట

  చంద్రబాబు తనకి ఆంద్రా,తెలంగాణా ప్రాంతాలు రెండు కళ్ళవంటివని చెపితే, ఆయనకంటే తనకి మరో కన్నుఎక్కువుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు తనకు మూడు కళ్ళవంటివని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన పార్టీ ముందు సీమంద్రాలో తన రెండు కళ్ళను కాపాడుకొనే ప్రయత్నంలో ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రయత్నంలోనే ఆయన తన మూడో కన్నుతెరిచి హైదరాబాదులో సమైక్య శంఖారవం పూరించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటయితే కుప్పం నుండి శ్రీకాకుళం వరకు నీటి సమస్యలు వస్తాయని చెపుతూనే, తనకు పట్టం కడితే తెలంగాణా ప్రజల కోసం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తిచేస్తానని వాగ్ధానం చేసారు. తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తూ హైదరాబాదులో సభ పెట్టబోతూ, అక్కడి ప్రజలు తనకు ఓటేసి గెలిపిస్తే వారందరినీ అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని వాగ్దానం చేసారు. మరి తెలంగాణా ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

క్యాబినెట్ సమావేశంతో కాంగ్రెస్ హడావుడి

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశం భుజాలకెత్తుకొన్నపటి నుండి నేటి వరకు దానిని సమర్ధంగా పరిష్కరించలేక ఎప్పటికప్పుడు కోర్ కమిటీలు, అంటోనీ కమిటీలు, టీ-నోట్, కేంద్ర మంత్రుల, నేతల వ్యాఖ్యలతో రోజులు నెట్టుకు వస్తోంది. రాష్ట్రంలో ఏదయినా హడావుడి కనబడగానే అది డిల్లీలో కూడా ప్రతిఫలిస్తుంటుంది. అంత మాత్రాన్నఅక్కడేదో కీలక నిర్ణయాలు జరిగిపోతాయని కాదు. కేవలం ప్రజలని, పార్టీలని, చివరికి తన స్వంత పార్టీ నేతలని భ్రమింపజేయడానికి మాత్రమే ఆ డ్రామా అంతా.   గత వారంలో కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ తిరుగుబాటు జండా ఎగురవేయడం, కేసీఆర్ ‘కాంగ్రెస్ కాకుంటే బీజేపీ ఉండనే ఉందని’ ప్రకటించడం, జగన్ కూడా మోడీని పొగిడి, ఆయన బీజేపీని సెక్యులర్ దారికి తీసుకువస్తే మద్దతు ఇవ్వచ్చుననట్లు మాట్లాడటం, తెదేపా బీజేపీల మధ్య వికసిస్తున్న స్నేహబంధం, ఏపీయన్జీవోలు మరో 15రోజుల సమ్మెకు సిద్దపడటం వంటి అనేక పరిణామాలతో మేల్కొన్నకాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రేపు క్యాబినెట్ సమావేశంతో హడావుడి చేయనుంది.   ప్రస్తుత పరిస్థితుల్లో టీ-నోట్ రాష్ట్ర శాసనసభకు పంపడం వలన భంగపాటు ఎలాగు తప్పదు. అంతే గాక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్నికూల్చుకోవలసిన పరిస్థితి దాపురిస్తుంది. అయినప్పటికీ సమస్యలేవీ పరిష్కారం కాకపోగా మరింత చిక్కుముడులు పడవచ్చును. అందువలన టీ-నోట్ పై క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ మరో మారు చాలా లోతుగా అధ్యయనం చేసేసిన తరువాత ఏవో కొన్ని సూచనలతో హోంశాఖకు దానిని త్రిప్పిపంపి చేతులు దులుపుకోవచ్చును. తద్వారా టీ-నోట్ ను క్యాబినెట్ లో చర్చించినందుకు అటు టీ-నేతలను, దానిని ముందుకు కదపకుండా అక్కడే ఉంచుతూ ఇటు-సీమాంధ్ర నేతలను చల్లబరిచే ప్రయత్నం చేయవచ్చును.   ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా జిల్లాలను రాజధానిగా చేయడానికి పరిశీలిస్తున్నామని ప్రకటించడం ద్వారా సీమాంధ్రలో ఉద్యమాలను, ఉద్యోగుల సమ్మెలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చును. రాజధానికోసం వారందరూ కత్తులు దూసుకొంటుంటే కాంగ్రెస్ అధిష్టానానికి మరికొంత సమయం చిక్కుతుంది. ఒకవేళ ఇదే కారణంగా ఉద్యమాలు సమ్మెలు నిలిచిపోతే అప్పుడు ఇక తనను ప్రశ్నించేవరెవరూ ఉండరు గనుక తాపీగా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును.

ఇడుకులపాయకు ఓకే, గుంటూరుకు నో

  అక్రమాస్తుల కేసులో 16 నెలల రిమాండ్‌ తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. దీంతో హైదరాబాద్‌ విడిచి ఎటూ వెళ్లడానికి అవకాశం లేని జగన్‌ తనను ఇడుకులపాయతో పాటు గుంటూరుకు వెళ్లటానికి అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. అయితే తన తండ్రి సమాధిని చూడటానాకి ఇడుకులపాయకు వెళ్తానన్న జగన్‌ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన కోర్టు, పార్టీ కార్యక్రమంగా గుంటూరులో చేస్తున్న రైతు గర్జనకు వెళ్లటానికి జగన్‌కు అనుమతి నిరాకరించింది. దీంతో 1,2 తారీఖుల్లో జగన్‌ ఇడుకులపాయ వెళ్లనున్నారు. అయితే మరి గుంటూరు వెళ్లే విషయమై జగన్‌ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.