విమానంలో కుదుపులు.. ఇద్దరికి సీరియస్!

  రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కుదుపులు వస్తే ఓకే.. అదే విమానంలో ప్రయాణిచేటప్పుడు కూడా కుదుపులు వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రయాణికుల ప్రాణాల మీదకి వస్తుంది. సౌతాఫ్రికాకి చెందిన ఒక విమానంలో ఇలాగే జరిగి ఇద్దరు ప్రయాణికుల ప్రాణాలు డేంజర్‌లో పడ్డాయి. సౌతాఫ్రికన్ ఎయిర్ వేస్‌‌కి చెందిన విమానం మలేసియా నుంచి హాంకాంగ్‌కి వెళ్తోంది. దారిలో విమానానికి ఏమైందోగానీ, తీవ్రమైన కుదుపులకు లోనైంది. విమానం సీట్లలో కూర్చుని వున్న ప్రయాణికులందరూ కిందపడిపోయారు. ఈ మూలన కూర్చున్న ప్రయాణికులు ఎగిరి ఆ మూలకు వెళ్ళి పడ్డారు. ఈ సంఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని: మైసూరా సలహాలు

  అంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూములను కొనాలని అనుకోవడం సరికాదని వైసీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రైవేట్ భూములు కొనాలని ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ ఆయన వైసీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల్ని కొనొద్దని ఆయన తన లేఖలో సూచించారు. ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని ఎందుకంటే, ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన చెప్పారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని మైసూరా రెడ్డి సూచించారు. రాజధాని కోసం పర్యటనలు జరుపుతున్న శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

బోర్డర్‌లో కాల్పులు: పాకిస్థాన్ బుద్ధి వంకర!

  అందరూ కుక్కతోక వంకర అని అంటూ వుంటారుగానీ, నిజానికి అనాల్సింద పాకిస్థాన్ బుద్ధి వంకర అని! కుక్కతోకకున్న వంకర్ని సరిచేయొచ్చేమోగానీ, పాకిస్థాన్ వంకర బుద్ధిని సరిచేయడం మాత్రం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నిన్న మొన్నటి వరకూ పాకిస్థాన్ నాయకులు స్నేహహస్తం అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. నవాజ్ షరీఫ్ అయితే మోడీ తల్లికి చీరను కూడా కానుకగా పంపాడు. ఇంతలోనే పాకిస్థాన్ బుర్రలో ఏం పురుగు పుట్టిందోగానీ, కాశ్మీర్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు పాకిస్థాన్ సైనికులు సరిహద్దులో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక భారత సైనికుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు సైనికులు కాగా, నలుగురు స్థానిక పౌరులు.

కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు-3

  తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం బుధవారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఆ వివరాలు.. 1. దేవాలయ ట్రస్టీల నియామకాల విషయంలో ఆర్డినెన్స్, 2. ఇప్పటికే ఆమోదించిన తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు, 3. తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవికి కర్నె ప్రభాకర్ పేరు ఖరారు, 4. తెలంగాణ శాసనసభకు ఆంగ్లోఇండియన్ సభ్యుడిగా రాయిడిన్‌రోచ్ పేరు ఖరారు, 5. అడ్వొకేట్ జనరల్‌గా కె.రామకృష్ణారెడ్డి నియామకానికి ఆమోదం, 6. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసేలా వైద్య శాఖకు ఆదేశాలు, 7. జంటనగరాల్లో గతంలో రద్దు చేసిన కల్లుడిపోలు, సొసైటీలను పునరుద్ధరించాలని నిర్ణయం, 8. బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా పరిగణిస్తూ నిర్ణయం, 9. పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం దేశంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానానికి రూపకల్పన, 10. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి కొత్తగా మాస్టర్‌ప్లాన్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీల సాయం తీసుకోవాలని నిర్ణయం, 11. అన్ని రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, అనుభవజ్ఞులు, జర్నలిస్టులతో కూడిన రాష్ర్ట సలహా మండలి ఏర్పాటుకు తీర్మానం.

తెలంగాణ రాజముద్రలో మార్పులు!

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోలో మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన లోగో రాష్ట్రాల లోగో చట్టానికి అనుగుణంగా లేదని ఇటీవల కేసు నమోదు అయింది. మూడు సింహాల గుర్తు కిందనే దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే మాట వుండాల్సి వుంది. అయితే తెలంగాణ లోగోలో మాత్రం మూడు సింహాల గుర్తుకు, సత్యమేవ జయతే అనే మాటకు చాలా దూరం వుంది. ఈ విషయాన్నే ప్రశ్నస్తూ కేసు నమోదు అయింది. అలాగే కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేసింది. దాంతో లోగోని మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం తెలుగులో వున్న సత్యమేవజయతే అక్షరాలను దేవనాగరి లిపిలోకి మార్చడంతోపాటు సింహం గుర్తు, సత్యమేవ జయతే రెండు సమ్మిళితం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది.

కేసీఆర్ నిర్ణయం: 1956 ముందు నుంచి వుంటేనే స్థానికులు

  ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో కేసీఆర్ తన పట్టుదలను సడలించుకోలేదు. 1956 సంవత్సరం ముందు నుంచి పూర్వికులు తెలంగాణలో వుంటేనే వారిని తెలంగాణ విద్యార్థులుగా గుర్తిస్తామని కేసీఆర్ మంత్రివర్గం సమావేశం తర్వాత ప్రకటించారు. విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) అమలుకు స్థానికతతోపాటు ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 1956కు ముందు తెలంగాణలో నివాసం కలిగి ఉన్న వారికే దీన్ని వర్తింపచేస్తామని, ఆయన వెల్లడించారు.

గంగోత్రిలో ఇరుక్కుపోయిన రామ్‌దేవ్ బాబా

  ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా నాలుగు వందల మంది విద్యార్థులతో కలసి గంగోత్రి బయల్దేరారు. అయితే హిమాలయ ప్రాంతంలో వర్షాలు బాగా కురుస్తూ వుండటంతో బాబా రామ్ దేవ్ గంగోత్రిలో ఇరుక్కుపోయారు. వర్షాలు బాగా కురుస్తూ వుండటంతోపాటు వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకుపోవడంతో బాబా రామ్ దేవ్ యాత్రకి బ్రేక్ పడింది. అయితే ఈ సమయంలో 400 మంది విద్యార్థులతో కలసి గంగోత్రి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని తాము బాబా రామ్ దేవ్‌కి చెప్పినప్పటికీ ఆయన వినకుండా యాత్ర కొనసాగించారని, ఫలితంగా ఇప్పుడు గంగోత్రిలో ఇరుక్కుపోయారని అధికారులు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా 400 మంది విద్యార్థులలో ఒక్కరికి అపాయం జరిగినా దానికి రామ్ దేవ్ బాబానే కారకుడిగా తాము పరిగణిస్తామని పోలీసుఅధికారులు చెప్పారు. వర్షాల కారణంగా గంగోత్రి, కేదార్‌నాథ్ వెళ్తున్న యాత్రికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు గంగోత్రి యాత్రను మూడు రోజులపాటు రద్దు చేశారు. అనుకూల వాతావరణం ఏర్పడిన తర్వాతే తిరిగి యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

తల్లి పేరు మీద రాష్ట్రాలు స్పందించాలి: సుప్రీం

  ఈమధ్యకాలంలో పిల్లలకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, అఫిడవిట్లలో తల్లి పేరును జత చేస్తున్నారు. అయితే తల్లిపేరును తప్పనిసరిగా కాకుండా ఆప్షనల్‌గా పేర్కొంటున్నారు. దీనీమిద ఒక జర్నలిస్టు సుప్రీం కోర్టులో కేసు వేశారు. సర్టిఫికెట్లలో తల్లిపేరును తప్పనిసరిగా వుంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన తన కేసులో అభ్యర్థించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్వరితంగా స్పందించింది. సర్టిఫికెట్లతో తల్లిపేరును తప్పనిసరి చేయడం మీద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్పందన కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు-2

  తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం బుధవారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఆ వివరాలు.. 1. 43 అంశాలపై చర్చ, పలు ఎన్నికల హామీలకు ఆమోదం, 2. లక్షలోపు రుణాల మాఫీతో సర్కారుపై రూ. 19 వేల కోట్ల భారం, 3. బంగారంపై రుణాలు, పాత బకాయిలకూ వర్తింపు, 4. 39 లక్షల మంది రైతులకు లబ్ధి, త్వరలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలు, 5. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. 40 వేల మందికి వరం, 6. విద్యార్థులకు ఆర్థిక సాయానికి 1956 ప్రామాణికత, 7. దళిత, గిరిజన వధువులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 50 వేల సాయం, 8. అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఇల్లు, భూమి, ఒకరికి ఉద్యోగం, 9. తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఓకే, కేంద్ర స్థాయిలో వేతనాలకు కమిటీ, 10. ఎస్టీలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు, 11. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు.

కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు-1

  తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం బుధవారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఆ వివరాలు.. 1. అమర వీరులకు కుటుంబాలకు 10 లక్షల రూపాయిల పరిహారం. అమరవీరుల పిల్లలకు ఉచిత విద్య, అర్హులైన వారికి ఉద్యోగం. 2. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం, 50 వేల రూపాయల ఆర్థిక సాయం, 3. నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, 4. తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, 5. ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్పై కమిటీలు, 6. తెలంగాణ ఎన్ఆర్ఐలకు కేరళ తరహా సంక్షేమ బోర్డు, 7. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయిల పింఛన్, 8. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ కారులపై ఉన్న కేసుల ఎత్తివేత, 9. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారికే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపు, 10. వ్యవసాయ యూనివర్సీటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, 11. అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్.

ముందస్తు బెయిల్ ప్లీజ్: టీవీ9 రవిప్రకాష్

  టీవీ9 ఛానల్‌లో శాసన సభ్యుల మీద ప్రసారం చేసిన కథనం విషయంలో నమోదు చేసిన కేసు విషయంలో తనమీద అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశం వుంది కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని టీవీ9 ఛానల్ సీఇఓ రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9లో తెలంగాణ శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ప్రసారమైన బుల్లెట్ న్యూస్‌పై ఒక న్యాయవాది కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పోలీసులు రవి ప్రకాష్ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం వుంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని రవి ప్రకాష్ హైకోర్టును కోరారు. తాను కింది కోర్టుల నుంచే బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తన కేసును వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల తాను నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ధోతీలు వద్దంటే లైసెన్సులు రద్దువుతాయ్: జయ

  తమిళ సంస్కృతిలో లుంగీ, ధోతీ అంతర్భాగం. తమిళనాడు ఏ ప్రదేశానికైనా పంచెకట్టుని అనుమతించమని క్లబ్బులు అంటే, సదరు క్లబ్‌ల లైసెన్సులు రద్దు చేస్తాం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వార్నింగ్ ఇచ్చారు. ఒక జడ్జి గారిని పంచెకట్టుతో క్లబ్‌లోకి రానివ్వమని చెప్పడంతో వివాదం తలెత్తింది. చెన్నై చేపాక్‌లో వున్న క్రికెట్‌ క్లబ్‌లో తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి హరిపరంధామన్‌, ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. ఆ ముగ్గురూ పంచెకట్టుతో ఉండడంతో క్లబ్‌ సెక్యూరిటీ లోనికి అనుమతించలేదు. దీనిమీద ముఖ్యమంత్రి జయలలిత జోక్యం స్పందించారు. తమిళ సంప్రదాయం, ఆచారాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలను నియంత్రించడానికి, సంప్రదాయాల రక్షణకు ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించే క్లబ్‌, సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జయలలిత ప్రకటనను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి.

కారుణ్య మరణాలపై రాష్ట్రాలు స్పందించాలి: సుప్రీంకోర్టు

  కొన్ని దేశాల్లో అమలులో వున్న కారుణ్య మరణం విధానాన్ని భారతదేశంలో కూడా అమలు చేసే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నవారు ఆ బాధను అనుభవించకుండా ప్రశాంతంగా కన్నుమూసే అవకాశాన్ని కారుణ్య మరణం కల్పిస్తుంది. అయితే కారుణ్య మరణం మీద అనేక విమర్శలు కూడా వున్నాయి. ఒక వ్యక్తి తన అనారోగ్యాన్ని భరించలేక స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటే దానిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని చేయాల్సి వుంది. దీని మీద స్పందించాలని దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయాలని, మరణించే హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కోరుతూ ‘కామన్ కాజ్’ ఎన్జీఓ వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పందించింది.

పెళ్ళయి 26 రోజులే అయింది.. అంతలోనే...

  తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా తనవంతు పోరాటం చేసిన ఒక తెలంగాణ యువకుడు అనూహ్యంగా కరెంట్ షాక్‌తో మరణించాడు. అతనికి పెళ్ళయి కేవలం 26 రోజులు మాత్రమే అయింది. తెలంగాణలోని షాపల్లి గ్రామానికి చెందిన రాజు (24) తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా చురుకుగా పాల్గొన్నాడు. రాజుకు 26 రోజుల క్రితం పెళ్ళి అయింది. డిగ్రీ పూర్తి చేసినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో పొలం పనులు చూసుకుంటున్న రాజు బుధవారం పొలంలో నాట్లు వేయించడానికి వెళ్ళాడు. అక్కడ మోటర్ పైపుకు కరెంటు ప్రవహిస్తున్న విషయాన్ని గమనించని రాజు పైపును పట్టుకోవడంతో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. పెళ్లయిన 26 రోజులకే రాజు మృతిచెందడంతో రాజు భార్య గుండెలు పగిలేలా రోదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కాబూల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి

  ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం మీద ఉగ్రవాదులు దాడి చేశారు. మిషన్ గన్లు, పేలుడు పదార్ధాలతో ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ విధ్వంసం సృష్టించారు. సకాలంలో స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఉగ్రవాదులతో ఎదురుకాల్పులకు దిగారు. భారత కాలమాన ప్రకారం గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఎయిర్ పోర్టుపై ఏ తీవ్రవాద సంస్థ దాడి చేసిందన్న సమాచారం ఇంకా అందలేదు. కాబూల్ఎయర్ పోర్టులో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో కాబూల్ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలను నిలిపివేశారు.

బ్రిక్స్ సదస్సుతో బహుళ ప్రయోజనాలు

  బ్రిక్స్ దేశాల కార్యాచరణ ఇప్పుడు కాస్త వేగం పుంజుకుంది. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మాత్రమే ఏర్పడిన కూటమి దక్షిణాఫ్రికా చేరాక బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. ప్రపంచ ఆర్థిక వ్యవహారాలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకుల పెత్తందారీతనం పెరిగింది. అవి అప్రజాస్వామికంగా తయారయ్యాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ దశలో ఇలాంటి ప్రాంతీయ కూటముల అవసరం చాలా వుంది. డాలర్‌ను మాత్రమే అంతర్జాతీయ చలామణికి అర్హత వున్న కరెన్సీలా భావించే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తీరు, అంతర్జా తీయ మార్కెట్‌లను నియంత్రించలేని వాటి నిస్సహాయత కారణంగా ఆర్థిక సంక్షో భాలు తలెత్తుతున్నాయి. బ్రిక్స్ తొలి శిఖరాగ్ర సదస్సునాటికే వచ్చిపడిన ఆర్ధికమాంద్యంలో ఈ కూటమి దేశాలు వ్యవహరించిన తీరు ఆ మాంద్యం తీవ్రతను చాలా తగ్గించిందనే చెప్పాలి. ఇందుకు అప్పటికే జీ-20వంటి వేదికల్లో ఈ కూటమి దేశాలు పనిచేయడం చాలా అక్కరకొచ్చింది. బ్రిక్స్ దేశాల ఐక్యత వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు గుత్తాధిపత్యానికి కళ్ళెం పడే అవకాశం వుంది.

ఇంటికో రైతు రుణ మాఫీ: చంద్రబాబు హామీ

  ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు తీసుకున్న రుణాల్లో ఇంటికో రుణం చొప్పున మాఫీ చేస్తామని ముఖ్యమంత్రిచంద్రబాబు ప్రకటించారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోటలో జరిగిన రైతు సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రైతు రైతుల రుణమాఫీకి తాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నానని, తప్పకుండా ఇంటికో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపైఆర్బీఐ గవర్నరుతో చర్చించానని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పదేళ్లుగా రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు తాను రైతుల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.