వారసుడిని కనలేదని భార్యకు, పిల్లలకు నిప్పటించిన రాక్షసుడు

కుమారుడిని కనలేదని తన వంశానికి వారసుడిని ఇవ్వలేదని ఓ రాక్షసుడు తన భార్యను, ముగ్గురు ఆడపిల్లలని సజీవదహనం చేశాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కాండి అనే గ్రామంలో ఉస్తాఖ్, నజీఫాలు భార్య భర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఈ నేపథ్యంలో ఉస్తాఖ్ తనకు వారసుడిని ఇవ్వలేదని తరుచుగా తన భార్యతో గొడవపడేవాడు. ఆ కోపంతో ఆ కర్కోటకుడు తన భార్యను, ముగ్గురు పిల్లలను ఇంట్లోకి నెట్టి ఇంటికి నిప్పటించాడు. వారు ఆ మంటలలో కేకలు పెడుతూ సజీవదహనం అయ్యారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

తెరాస, కాంగ్రెస్ అభ్యర్ధులకే గెలుపు అవకాశాలు

  తెలంగాణా శాసనమండలి ఎన్నికలకు వామపక్షాలు రెండూ దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో ఇప్పుడు ఒక్కో యం.యల్సీ అభ్యర్ధి గెలుపుకి 17మంది యం.యల్యేల మద్దతు ఉంటే సరిపోతుందని తేలింది. మజ్లీస్, వైకాపాల 8మంది యం.యల్యేల మద్దతు, ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన 8మంది యం.యల్యేలతో కలిపి తెరాస బలం ఇప్పుడు మొత్తం 85కి చేరింది. కనుక ఇక ఆ పార్టీ ఐదవ అభ్యర్ధి విజయం కూడా దాదాపు ఖాయం అయినట్లే భావించవచ్చును. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆకుల లలిత విజయం కూడా ఖాయమనే చెప్పవచ్చును. ఆరు స్థానాలలో ఐదింటిని తెరాస, ఒకటి కాంగ్రెస్ దక్కించుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తెదేపా అభ్యర్ధి వేం నరేంద్ర రెడ్డి ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తెదేపా యం.యల్యే రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి జడ్జి లక్ష్మీపతి అంగీకరించడంతో ఆయన కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

రేవంత్ కి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ

  ఏసిబి అధికారులు తెదేపా కొండగల్ యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరచగా అయన రేవంత్ రెడ్డికి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కానీ ఈరోజు జరగనున్న శాసనమండలి ఎన్నికలలో ఆయనను ఓటు వేసేందుకు అనుమతించడంతో కొద్ది సేపటి క్రితమే ఏసిబి అధికారులు కట్టుదిట్టమయిన భద్రత నడుమ రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకువచ్చారు. అక్కడ ఆయన కోసం వేచి చూస్తున్న తెదేపా శాసనసభ్యులు, ఆయన రాగానే అందరూ కలిసి తెదేపా శాసనసభా పక్ష కార్యాలయంలోకి వెళ్ళబోతుంటే వారిని ఏసిబి అధికారులు అడ్డుకొన్నారు. తాము అందరం ఏవిధంగా ఓటింగ్ వేయాలనే విషయంపై ముందుగా చర్చించుకోవాలని అది కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగమేనని తెదేపా యం.యల్యేలు గట్టిగా చెప్పడంతో ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని అందుకు అనుమతించారు. ఓటింగ్ అనంతరం ఆయనని చర్లపల్లి జైలుకి తరలించవచ్చును. రేవంత్ రెడ్డికి బెయిలు కోసం మరికొద్ది సేపటిలో ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషను వేయబోతున్నారు.

మరికొద్ది సేపటిలో కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభం

  మరి కొద్దిసేపటిలో తెలంగాణా శాసనమండలి ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తరువాత 5గంటలకు ఓట్లు లెక్కింపు చేసి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. యం.యల్యే.ల కోటా క్రింద జరుగుతున్న ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.   తెరాస తరపున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్ రావు,యాదవ రెడ్డి, బి.వెంకటేశ్వరులు అభ్యర్ధులుగా నిలబడ్డారు. కాంగ్రెస్ తరపున ఆకుల లలిత, తెదేపా-బీజేపీ కూటమి తరపున వేం నరేంద్ర రెడ్డి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన ఏడుగురు యం.యల్యేలు వైకాపాకు చెందిన ఒక యం.యల్యే తెరాసకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించగా, చెరో ఒక్క సీటు ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.   ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం 18మంది, తెదేపా(11), బీజేపీ(5) లకు కలిపి మొత్తం 16 మంది యం.యల్యేలున్నారు. ఒక్కో యం.యల్సీ. అభ్యర్ధికి కనీసం 18మంది యం.యల్యేల మద్దతు ఇస్తే తప్ప ఎన్నికలలో గెలవలేరు. కనుక కాంగ్రెస్ అభ్యర్ధికి ఆ పార్టీకి చెందిన అందరు యం.యల్యేలు తప్పకుండా ఓటేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస వైపు మళ్ళినా ఆ పార్టీ అభ్యర్ధి గెలుపు అనుమానమే. ఇక తెదేపాకు చెందిన మాధవరం కృష్ణారావు మొన్న తెరాసలోకి పార్టీ ఫిరాయించడం, పార్టీ సీనియర్ యం.యల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు నిన్న అరెస్ట్ చేయడంతో తెదేపా యం.యల్సీ. అభ్యర్ధి గెలుపు అనుమానాస్పదంగానే కనబడుతోంది.   తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 8మంది యం.యల్యేలను తెరాస ఆకర్షించగలిగినప్పటికీ వారందరికీ కూడా ఆ రెండు పార్టీలు విప్ జారీ చేసినందున, వారు తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వారు అందుకు సిద్దపడి ఓటు వేస్తారా లేదా అనే దానిపై తెరాస ఐదవ అభ్యర్ధి జయాపజయాలు నిర్ణయం అవుతాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమ ఐదవ అభ్యర్ధిని ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కనుక కాంగ్రెస్, తెదేపాల నుండి తెరాసలో చేరిన ఆ పార్టీల యం.యల్యేలు తమ పార్టీలు జారీ చేసిన విప్ ని దిక్కరించి తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఒకవేళ ఇదంతా ప్రతిపక్షాలను గందరగోళంలో పడేయడానికే తెరాస అధ్యక్షుడు పన్నిన వ్యూహమయితే చివరి నిమిషంలో తెరాస తన ఐదవ అభ్యర్ధిని పక్కనబెట్టినా ఆశ్చర్యం లేదు.

కోడలి మరణవార్త విని అత్త మృతి

కోడలి మరణవార్త విని అత్త గుండెపోటుతో మరణించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం రాజానగరం గ్రామంలో జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెంగమ్మ (40) అనే మహిళ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నానికి రాజానగరం గ్రామానికి తరలించారు. కోడలి మృతదేహాన్ని చూసిన వెంటనే ఆమె అత్త గిరమ్మ (70) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించింది. అత్తాకోడళ్ళు ఒకేసారి మరణించడంతో ఆ ఇంట్లో విషాదం కమ్ముకుంది. ఈరోజుల్లో కూడా ఇంత అన్యోన్యంగా వుండే అత్తాకోడళ్ళు వుండటం విశేషమేనని పలువురు అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డికి ప్రాణహాని వుంది

  తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రాణహాని వుందని తమకు అనుమానాలు వున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని ప్రలోభపెట్టారన్న ఆరోపణలమీద రేవంత్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని వస్తున్న వార్తల మీద వారు స్పందించారు. దీనిమీద తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే బయటకు తీసుకురావాలని కోరారు. అధికారం వుంది కదా అని ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్ష తీర్చుకుంటున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటన మీద వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

ఏసీబీ అదుపులో రేవంత్ రెడ్డి?

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని ప్రలోభపెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కూడా రేవంత్ రెడ్డి అరెస్టు కాలేదని చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేస్తే 5 కోట్లు ఇస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో రేవంత్ రెడ్డి బేరం ఆడారని ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అరెస్టుతోపాటు 50 లక్షల డబ్బును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తన దగ్గర ఎలాంటి డబ్బు లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తెదేపాకు మాధవరం గుడ్ బై

  శాసనమండలి ఎన్నికల ముందు తెదేపాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కూకట్ పల్లి యం.యల్యే. మాధవరం కృష్ణారావు ఈరోజు తెదేపాను వీడి తెరాసలో చేరిపోయారు. ఆయన ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.   అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు నన్ను ఎంతో ప్రోత్సహించిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు లోకేష్ కి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారిరువురి పట్ల నాకు గౌరవమే తప్ప ఎటువంటి ద్వేషభావమూ లేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను తెరాసలో చేరాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.” అని అన్నారు.   ఆయన తెరాసలో చేరాలనుకొంటున్నట్లు చాలా కాలంగానే చెపుతున్నారు. చివరికి ఈరోజు పార్టీ మారారు. కానీ పార్టీకి అత్యవసరమయిన మండలి ఎన్నికల సమయంలో మారడమే తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మండలి ఎన్నికలలో తెరాస తనకు తగినంత బలం లేకపోయినప్పటికీ 5వ అభ్యర్ధిని నిలబెట్టి, ప్రతిపక్ష పార్టీల యం.యల్యేలను ఈవిధంగా ఫిరాయింపులకి ప్రోత్సహించడాన్నిప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.   కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తమ యం.యల్యేలందరూ కూడా కేవలం తమ పార్టీ అభ్యర్ధులకే తప్పనిసరిగా ఓటు వేయాలని విప్ జారీ చేసాయి. నేటికీ తెదేపా యం.యల్యేలుగా ఉంటూ తెరాసలో కొనసాగుతున్నవారికి కూడా ఆ విప్ లేఖలు అందజేశాయి. కనుక మాధవరం కృష్ణారావుతో సహా తెరాసలో కొనసాగుతున్న తెదేపా, కాంగ్రెస్ యం.యల్యేలు అందరూ తెరాస అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు తెరాస తన 5వ అభ్యర్ధిని ఏవిధంగా గెలిపించుకొంటుందో వేచి చూడాలి.

మాది సూటు-బూటు పాలన.. మీది సూటుకేసు పాలన

గతంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీది సూటు-బూటు పాలన అని విమర్మించిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలకు ధీటుగా నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ పై విమర్శలవర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ తమది సూటు-బూటు పాలన అని విమర్శిస్తున్నారు, కానీ.. వాళ్లలాగ తమది సూటుకేసు పాలన కాదు, దానికంటే ఇది బెటరే అని రాహుల్ కు రివర్స్ పంచ్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశం ఇప్పటికీ పేదరికంలోనే ఉందని, నిజంగా మీరు పేదల పక్షమే అయితే ఇప్పటికీ దేశం ఇంకా పేదరికంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల గురించి, వాళ్లకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు. సొంత మనుషులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అని అలాంటి పార్టీకి తమ గురించి విమర్శించే అర్హత లేదని తేల్చి చెప్పారు.

కొట్టుకుంటే సమస్యలు తీరవు.. చంద్రబాబు

ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సూచించారు. అలాకాకుండా కొట్టుకుంటే సమస్యలు తీరవు, కోర్టుల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఉపయోగం ఉండదు అందుకే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలకు ఉన్న సమస్యలను అధిగమించి అభివృద్ధి బాటలో నడవాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, దానికి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తెలంగాణ కూడా దీనికి సహకరించాలని కోరారు. అంతేకాక నీటి విడుదలపై వివాదం తలెత్తినప్పుడు గవర్నర్‌ తో సమావేశమయ్యేందుకు నేనే చొరవ తీసుకున్నా అప్పుడు 'ఏపీకి అన్యాయం జరిగితే ఢిల్లీకి వెళదామని కేసీఆర్‌ కూడా అన్నారు’ అని చంద్రబాబు గుర్తుచేశారు. అదే తరహాలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని అన్నారు.

ఏపీ రాజధాని భూమిపూజ స్థలం మార్పు?

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయో ఇప్పుడు నూతన రాజధాని భూమిపూజకు కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజధాని భూమిపూజను జూన్ 6న చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం మందడం శివారు తాళ్లాయపాలెం వద్ద భూమిని కూడా చూశారు. ఇదిలా ఉండగా రాజధాని భూమిపూజ కోసం కేటాయించిన భూమి జడ్పీటీసీ నరేంద్రబాబు ఆయన బంధువులకు చెందినది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇదే భూమిలో నరేంద్రబాబుకు సమీపబంధువు భార్య చనిపోగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. నరేంద్రబాబు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా కప్పిపుచ్చారు. కానీ, ఈ విషయం ఒకరిద్దరు మంత్రుల దృష్టికి వెళ్లడంతో దాన్ని వారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా రాజధాని భూమిపూజ స్థలం మార్చే యోచనలో పడింది ప్రభుత్వం.

ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్

  శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నా మరోవైపు స్మగ్లర్లు యదావిధిగా తమ స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారని నిన్న మరొకమారు రుజువు అయింది. పోలీసులు నిఘా పెరగడంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఈసారి తీర్ధ యాత్రికుల వేషంలో తమ పని చక్కబెట్టుకోవడానికి బయలుదేరడం విశేషం. తమిళనాడుకి చెందిన 72మంది కూలీలను, వారు ప్రయాణిస్తున్న బస్సులో దాచిన 77 ఎర్రచందనం దుంగలను, కత్తులు, గొడ్డళ్ళను నిన్న కడప జిల్లా సుండుపల్లి పోలీసులు చిన్నమండెం గ్రామం వద్ద పట్టుకొన్నారు. వారందరూ కడప జిల్లాలో సుండుపల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారినందరినీ రాయచోటి పోలీస్ స్టేషన్లో విలేఖర్ల ముందు ప్రవేశపెట్టారు. తమిళనాడుకి చెందిన అరుణాచలం అనే ఎర్రచందనం స్మగ్లర్ వారి వెనుక ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.

నేడు జగన్ని కలవనున్న బొత్స

  వైకాపా నేతలు నిన్న హైదరాబాద్ లో బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలో చేరవలసినదిగా ఆహ్వానించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఆయన స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసానికి వెళ్లి తుదివిడత చర్చలు జరుపబోతున్నారు. అనంతరం ఆయన పార్టీలో చేరికపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చేనెల 3వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు మంగళగిరిలో సమర దీక్ష (నిరాహార దీక్ష) చేయబోతున్నారు. కనుక వీలయితే అదే రోజున బొత్స పార్టీలో చేరవచ్చును. లేకుంటే జూన్ 9న తన స్వంత జిల్లా అయిన విజయనగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరవచ్చునని సమాచారం. బొత్స సత్యనారాయణ చేరికను జిల్లాకు చెందిన వైకాపా నేతలు చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ, విశాఖ, విజయనగరం జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనవంటి బలమయిన నాయకుడు అవసరమని జగన్ భావిస్తున్నందున ఆయనను పార్టీలో చేర్చుకోనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా శాసనమండలికి పోటీ చేయించి మండలిలో వైకాపా పక్ష నేతగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.