స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొన్న రౌడీ షీటర్లు

స్వచ్ఛ హైదరాబాద్ లో రౌడీ షీటర్లు కూడా స్వచ్చందంగా పాల్గొని చెత్తను ఊడ్పిపారేశారు. హైదరాబాద్ లో సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పరిధిలో ఉన్న 18 పోలీస్ స్టేషన్లో పోలీసులు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్లలోని 400 మంది రౌడీ షీటర్లతో పాటు పోలీసు సిబ్బంది కూడా పాల్గొని స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొనడానికి రౌడీ షీటర్లు ఆసక్తి చూపించారని, వారే స్వచ్చందంగా ముందుకు వచ్చారని తెలిపారు. వారిలో మార్పు వస్తుందని, ప్రజలతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు.

తెదేపా మహానాడు.. ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ స్పెషల్ ఎట్రాక్షన్

మూడు రోజుల పాటు జరిగే తెదేపా 34వ మహానాడు ఏర్పాట్లలో ఎన్నో ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. మహానాడు వేదికపై ఒకవైపు తెలంగాణకు చెందిన కాకతీయ స్థూపాన్ని ఉంచగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలు ఉంచారు. రక్త సిబిర ఏర్పాట్లు, ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ లో ఒక ఫోటో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది తెలుగుదేశ పార్టీ పునాది వేసిన నందమూరి తారకరామారావు పెళ్లి శుభలేఖ. 1942 మే 2న జరిగిన ఎన్టీఆర్ పెళ్లి పత్రికను ఫోటోఎగ్జిబిషన్ లో పెట్టడంతో మహానాడు వచ్చే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికి 24 రకాల వంటకాలతో 35 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు.

నారా లోకేశ్ అర్హుడే.. దేవినేని

హైదరాబాద్ గండిపేటలో నిర్వహించిన తెదేపా 34న మహానాడు కార్యక్రమం ప్రారంభం అయింది. అనేక మంది తెదేపా నేతలు భారీ ఎత్తున ఈ మహానాడు కార్యక్రమానికి తరలివస్తున్నారు. అయితే ఈ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలు, ఓ ముఖ్యమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నారా లోకేశ్ కు పదవి ఇవ్వడంలో తప్పులేదని, దానికి అతను అర్హుడేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని అన్నారు.

ఏపీ రాజధానిలో జపాన్ బృందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయవచ్చు, అక్కడ ఏ విధమైన డెవలప్ మెంట్ చేయవచ్చు తదితర అంశాలు పరిశీలించడానికి జపాన్ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ బృందం విజయవాడ నుండి బయలుదేరి ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడ నుండి మందడం మీదిగా తాళాయాపాలెం చేరుకుని అక్కడ నుండి కృష్ణానదిని పరిశీలించారు. అయితే ఈ ప్రాంతంలో పర్యటక కేంద్రంగా మార్చడానికి అనువైన స్థలంగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానదిపై ఆసక్తి కనపరిచి అక్కడి ప్రాంత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మహానాడుకి సర్వం సంసిద్దం

  నేటి నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్, గండిపేటలో తెదేపా 34వ మహానాడు సమావేశాలు జరుగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చేందుకు ఈ మహానాడు సమావేశాలలో తీర్మానం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తెదేపాను విస్తరించవలసి ఉంటుంది. ఈ మహానాడు సమావేశాలలో వీటన్నిటిపై చర్చలు జరిపి తీర్మానాలు చేసే అవకాశం ఉంది. కనుక ఈ 34వ మహానాడు సమావేశాలు తెదేపాకు చాలా కీలకమయినవని చెప్పవచ్చును. ఈ మూడు రోజుల సమావేశాలకి రెండు రాష్ట్రాల నుండి కనీసం 40 వేల మంది కార్యకర్తలు తరలిరావచ్చని భావిస్తున్న తెదేపా అందుకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేసింది. రెండు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాల కోసం సుమారు 100 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నుండి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం మూడు ప్రాంతాలకు చెందిన 34 రకాల శాఖాహార వంటకలాను మాగంటి బాబు పర్యవేక్షణలో సిద్దం చేస్తున్నారు. వేసవి తాపానికి తట్టుకొనేందుకు ఎయిర్ కూలర్లు, చల్లటి మజ్జిగ, మంచినీళ్ళను ఏర్పాటు చేసారు.

కాసేపట్లో ప్రారంభంకానున్నతెదేపా మహానాడు

తెలుగుదేశం పార్టీ 34 వ మహానాడు కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గండిపేట వేదికగా జరగనునన్న ఈ మహానాడు కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుండి తెదేపా నేతలు భారీగా తరలివస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ యువనేత, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్, హరికృష్ణ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ మహానాడు కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ నారా లోకేశ్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ మహానాడుకు 20 వేల మంది ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో 31 తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిసింది. ఇందులో ఉమ్మడి తీర్మానాలు 7, ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి 10 ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

సాగర్ ప్రక్షాళనకు సుప్రీం బ్రేక్

  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఒక మంచి పనికి కూడా అవరోధాలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిన హుస్సేన్ సాగర్ ఒక పెద్ద మురికికూపంగా మారిపోవడంతో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ స్వచ్చమయిన మంచినీటితో నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది. అందుకోసం ముందుగా హుస్సేన్ సాగర్ తో అనుసంధానమయున్న కాలువలను శుభ్రం చేసి చెరువులో ఉన్న మురికినీరును బయటకు పంపిస్తున్నారు. కానీ జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ హుస్సేన్‌ సాగర్‌ను ఎండగడుతున్నాయంటూ హైదరాబాద్ కి చెందిన ‘సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌ (సోల్‌)’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లుబ్నా సర్వత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హుస్సేన్ సాగర్ ని పూర్తిగా ఎండగట్టవద్దని, కాలువల మరమ్మత్తులకు అవసరమైనంత మేరకు మాత్రమే నిర్మాణ పనులు చేయాలని, ఇందుకు అవసరమయితే సాగర్‌ నుంచి కొంత మేరకు నీటిని వదలొచ్చునని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం ఎన్‌జీటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రక్రియపై ఒక నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.   సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం ఆర్దాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పనులలో విశేష అనుభవమున్న ఆస్ట్రేలియా సంస్థకు చెందిన ప్రతినిధులు, ప్రజలకు, పర్యావరణానికి ఎటువంటి కలుగకుండా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తామని ముందుకు వచ్చేరు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆర్దాంతరంగా నిలిపి వేయకుండా అవసరమయితే విదేశీ సాంకేతిక సహాయం తీసుకొని అయినా పూర్తిచేయగలిగితే బాగుంటుంది.

సమావేశానికి నలుగురు కాంగ్రెస్ యం.యల్యే.లు డుమ్మా!

  తెలంగాణాలో 6 యం.యల్సీ. స్థానాలకు 7మంది అభ్యర్ధులు పోటీలో ఉండటంతో బేరసారాలు అనివార్యమని తేలిపోయింది. పోలింగ్ కి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతిపక్ష పార్టీలు తమ యం.యల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఏకైక అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు అవసరమయిన 18మంది యం.యల్యేలున్నారు. కానీ వారిలో నలుగురు యం.యల్యేలు- పువ్వాడ అజయ్‌, గీతారెడ్డి, కిష్టారెడ్డి, వంశీచంద్‌రెడ్డిలు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశానికి డుమ్మా కొట్టారు. వారి నలుగురిలో పువ్వాడ అజయ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున రాలేదని తెలుస్తోంది. కానీ మిగిలిన ముగ్గురు యం.యల్యేలు కీలకమయిన ఈ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టేరో అసలు కారణం తెలియదు గానీ వారు వ్యక్తిగత పనులున్నందున సమావేశానికి రాలేకపోయారని, కానీ పోలింగ్ రోజున తప్పకుండా హాజరయ్యి కాంగ్రెస్ యం.యల్సీ.అభ్యర్ధి ఆకుల లలితకు ఓటువేసి గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొన్నారు. వారిలో గీతారెడ్డి సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ ఆమెను అనుమానించాల్సిన పనిలేదు. కానీ మిగిలిన ఇద్దరు యం.యల్యేల సంగతే కొంచెం అనుమానంగా కనిపిస్తోంది. వారు నలుగురు వచ్చి తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వేస్తే పరువాలేదు కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస అభ్యర్ధికి ఓటు వేసినా కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచే అవకాశం ఉండదు. క్రాస్ ఓటింగ్ జరుగకుండా నివారించేందుకు ఈ ఎన్నికలలో తొలి ప్రాధాన్యత ఓటును మాత్రమే వేయాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది.

కిసాన్ ఛానల్ ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో దూరదర్శన్ కిసాన్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతోనే ఆర్ధికాభివృద్ధి సాధ్యమని, వ్యవసాయంతో గ్రామాలు.. గ్రామాలతో దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. వ్యవసాయం, గ్రామాలు, దేశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, వ్యవసాయం తరువాతే వ్యాపారం ఉద్యోగం అని అన్నారు. దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని, కృతిమ ఎరువుల గురించి తెలియనప్పుడే సేంద్రియ ఎరువులు ద్వారా రైతులు బాగా పండించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్రమోడీ తోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాఠోడ్ తో పాటు పలు అధికారులు వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు.

లోకేశ్ కు మంచి పదవి ఇవ్వాలి.. ఎర్రబెల్లి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు మంచి పదవి ఇవ్వాలని కోరారు. టీడీపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీని జాతీయ పార్టీగా మహానాడులో ప్రకటిస్తామని తెలిపారు. అంతే కాక ఏపీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తోందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. లక్ష రూపాయలు మాత్రమే ఇస్తోందని విమర్శించారు. ఇక ఎండతీవ్రతకు వడదెబ్బ తగిలి చనిపోతున్న వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని అన్నారు.

ఏపీ ప్రత్యేక హోదాపై అయోమయం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఒకో నేత ఒకోలా మాట్లాడుతున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని 14వ పైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేర ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంతి అరుణ్ జైట్లీ చెప్పగా ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలేవీ లేవని ఒక్క ఆర్ధిక లోటు కారణంగా ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతున్నమని వెంకయ్యనాయుడు అన్నారు. ఇదిలా ఉండగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీ ఏడాది పాలనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానని, త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఏపీకీ ప్రత్యేక హోదా రాదని ఓవైపు చెపుతూ ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం.. మరోవైపు అమిత్ షా ప్రత్యేక హోదా గురించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడం జీజేపీ నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో అయోమయ పరిస్థితి నెలకొంది.

నా డబ్బుతో ఇన్సూరెన్స్ చేస్తా... స్మృతి ఇరానీ

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమేథీ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను అమేథీ కుటుంబానికి కూతురునని, అమేథీ నియోజక వర్గంలో ఉన్న 25 వేల మంది మహిళలకు తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ కడతానని హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమేథీ ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తాము పదిరోజుల్లోనే పలు రకాల పనులు చేసి చూపిస్తామని, యూపీఏ ప్రభుత్వం చేయలేని పనులను మోడీ ఏడాది పాలనలో చేసి చూపించామన్నారు. స్మృతి ఇరానీ అమేథీ నియోజక వర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓడిపోయిన సంగతి తెలిసందే.

ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీ అసెంబ్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే ప్రమాదం జరగడం, ప్రమాదం సంభవించే సమయానికి ఆరోగ్యమంత్రి కూడా అక్కడ లేకపోవడం వంటివి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

బాంబు పెట్టింది నేతకు... బలైంది బాడీగార్డ్

బీహార్ గయాలో జేడీయూ నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం మంగళవారం బయటపడింది. జేడీయూ అధ్యక్షుడు జిల్లా నేత అభయ్ కుశ్వాహ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు పార్శిల్ పంపారు. వచ్చిన పార్శిల్ ను తెరిచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో అభయ్ కుశ్వాన్ బాడీగార్డ్ అక్కడికక్కడే మరణించగా, అభయ్ కుశ్వాన్ బంధువుకు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, మావోయిస్టులకు ఈ పేలుడుపై ఎదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించారు. ఈ ఉచిత వైఫై సౌకర్యం ద్వారా మొదటి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. దీనితో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవలను మరింత విస్తరింపజేస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంగా మారుస్తామని అన్నారు. ఈ ఉచిత వైఫై సేవలను మరి కొన్ని రైల్యేస్టేషన్ లకు విస్తరింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె. శ్రీవాత్సవ పాల్గొన్నారు.

టీడీపీ నేతల అనుమానాస్పద మృతి

తెలుగుదేశం పార్టీ కార్యకర్త నారాయణస్వామి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్‌సాన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన నారాయణస్వామిని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో టీడీపీ నాయకుడు కూడా మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. మారుతీనగర్‌కు ఆనుకుని ఉన్న కాల్వకట్ట వద్ద పురుషుడి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడికి చేరుకున్న సీఐ ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతిచెందింది మొగల్రాజపురం 6వ డివిజన్‌ కు చెందిన పడాల కన్నారావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

2జీ స్కాంలో మన్మోహన్ సింగ్ బెదిరించారు... బైజాల్

2జీ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మండిపడ్డారు. బైజాల్ 'ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫామ్స్- 2జీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్ ఏ ప్రాక్టీషనర్స్ డైరీ' పేరుతో రాసిన పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. మన్మోహన్ సింగ్ వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఈ రోజు తను విచారణను ఎదుర్కొనడానికి కారణం మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లేనని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2జీ వ్యవహారంలో సహకరించకుంటే హాని తప్పదని తనను హెచ్చరించారని, యూపీఏ ప్రభుత్వం వలన తన పరువు, ప్రతిష్ట దిగజారిపోయిందని అన్నారు. టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియమకాన్ని వ్యతిరేకించానని, మన్మోహన్ సింగ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా మారన్ ను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మారన్ కూడా తనను బెదిరించారని 2009-10లో 2జీ స్కామ్ బయటపడిన తరువాత దానికి సంబంధించిన పలు కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని బైజాల్ తన పుస్తకంలో ఆరోపించారు.  

నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ఈ మధ్య పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు ఆర్డీఓ ను కలవడానికి వెళితే పట్టించుకోలేదని, వెంటనే అతనికి ఫోన్ చేసి మందలించామని తెలిపారు. ఎలాంటి పరిస్థితిలోనైనా అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాకు వద్దంటున్నా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొంతకాలం తరువాత తెలంగాణ వారు ఆంధ్రాలో కలవాలని కోరుకునే రోజు వస్తుందని అన్నారు.