పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తా.. చంద్రబాబు

పట్టిసీమ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి రాయలసీమకు నీళ్లిస్తామని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా గొట్లూరులో నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 5లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు కనుక వేయగలిగితే జిల్లాలో కరువు అనేదే ఉండదని, అంతేకాక రైతులకు 90శాతం రాయితీతో తుంపర్లు, బిందు సేద్యం పరికరాలు ఇస్తామని అన్నారు. జిల్లాలో 62 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డ్వాక్రా మహిళల రుణమాఫీ, కొత్త పించన్ల పంపిణీ కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

కాల్పులకు ఎదురుకాల్పులే సరి... శివసేన

ముల్లును ముల్లుతోనే తీయాలనే తరహాలో కాల్పులకు కాల్పులతోనే బుద్ధిచెప్పాలని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలో పాకిస్థాన్ జరిపిన కాల్పులపై శివసేన మండిపడింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్ వాళ్లు కాల్పులు జరుపుతున్నారని గతంలో కూడా ఇలాగే చేశారని శివసేన తెలిపింది. అలాంటి వారికి బుద్ధి రావాలంటే మనం కూడా నిబంధనలను ఉల్లంఘించి అయినా సరే ఎదురు కాల్పులు జరపాలని సూచించింది. పాకిస్థాన్ చేసే ఈ దుశ్చర్యల వల్ల సరిహద్దుల్లో ఉండే ప్రజలు వారి నివాసాలను వీడిపోవాల్సి వస్తుందని శివసేన అంది.

రూ.5 తీశాడని కొడుకుకి నిప్పంటించిన తల్లి

పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ల తప్పులను క్షమిస్తుంది తల్లి అదే అమ్మలోని మాతృత్వం. కానీ ఓతల్లి తన కొడుకు చేసిన చిన్న తప్పుకు ఏకంగా నిప్పటించింది. ఇంతటి భయంకరమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతానికి చెందిన రుక్సానా అనే ఆమెకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఆ బాలుడు చిరుతిండి కోసం పెట్టెలోంచి ఐదు రూపాయలు తీసుకొంటుండగా రుక్సానా చూసింది. అంతే రుక్సానాకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. దీంతో కొడుకు అని కూడా చూడకుండా ఆబాలుడికి నిప్పంటించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని కాపాడి ఆస్పత్రికి తరలించి, రుక్సానాపై నయా శహర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

చంద్రబాబు సంభాషణలు ఏసీబీ దగ్గర ఉన్నాయి.. నాయిని

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇస్తూ పట్టుబడిన వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ తో రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని, అంతేకాక ఈ వ్యవహారంతో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా సంబంధం ఉంది.. తన పేరును కూడా చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయని అన్నారు. తెర వెనుక ఉండి కథ మొత్తం నడిపించింది చంద్రబాబే అని, దానికి సంబంధించిన ఆధారాలు.. ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడిన సంభాషణలు ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నాయని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నాయిని స్పష్టం చేశారు.

జగన్ దీక్షపై బాబు ఫైర్

వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ సమీపంలో సమరదీక్ష ను చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనప్పటికీ ఏపీకి మాత్రం సరైన న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీటుగా స్పందిస్తూ కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారాడని, ఇందులో భాగంగానే ఈ సమరదీక్షను చేపట్టాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ తో కుమ్మక్కయి జగన్ చేస్తున్న దీక్షను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులతో పాటు ఏపీ ప్రజలకు పిలిపునిచ్చారు చంద్రబాబు. జగన్ దీక్ష వల్ల ప్రజలకు ఒరిగేది ఏమి లేదని దీక్ష పేరుతో తెదేపా పార్టీని విమర్శించడమే జగన్ పని అని ఎద్దేవ చేశారు.

జగన్ సీమాంధ్ర ద్రోహి... సోమిరెడ్డి

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీసి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్ కేసీఆర్ కు మద్దతివ్వడంతో సీమాంధ్రులకు ద్రోహిగా మారారని అన్నారు. వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్ కుమ్మక్కయి ఎన్ని కుట్రలు చేసినా తెలుగు దేశం పార్టీని ఏం చేయలేరని ప్రజలకు టీడీపీ పై నమ్మకం ఉందని అన్నారు.

కోర్టులో 30రౌండ్ల కాల్పులు.. ముగ్గురు మృతి

ఒక పక్క కోర్టులో విచారణ జరుగుతోంది.. ఇంతలో ఇద్దరు దుండగులు అమాంతంగా కోర్టు హోలులోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం అనేక అక్రమాలకు పాల్పడిన కేసులో సుశీల్ శ్రీవాస్తవ్ అనే కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐదేళ్లుగా విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా శ్రీవాస్తవ కోర్టులో హాజరుకాగా ఇద్దరు దుండగులు కోర్టు హాలులోకి ప్రవేశించి వారి దగ్గరున్న ఏకే 47 తుపాకులతో కాల్పులు జరపగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రౌండ్ల తూటాలు బయటకొచ్చాయి. ఈ కాల్పుల్లో శ్రీవాస్తవ్ తోపాటు అతని సన్నిహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఏపీ యం.యల్సీ. ఎన్నికల షెడ్యుల్

  ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటాలో 12యం.యల్సీ. స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమీషన్ నిన్న షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు నోటిఫికేషన్ జూన్ 9న జారీ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు: జూన్ 16, నామినేషన్ల పరిశీలన: జూన్ 17, నామినేషన్ల ఉపసంహరణ: జూన్ 19, పోలింగ్: జూలై 3, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: జూలై 7. కనుక నిన్నటి నుండే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు.   ఈ 12స్థానాలలో విజయనగరం, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం మరియు అనంతపురం జిల్లాల నుండి చెరో ఒక్కో స్థానానికి, కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల నుండి చెరో రెండేసి స్థానాలకి స్థానిక సంస్థల కోటా క్రింద ఎన్నికలు నిర్వహించబడతాయి.   అధికార తెదేపా కృష్ణా, గుంటూరు జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఇప్పటికే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది. అనంతపురం నుండి పయ్యావుల కేశవ్, చిత్తూరు నుండి గాలి ముద్దు కృష్ణం నాయుడు, విశాఖపట్నం నుండి పప్పల చలపతిరావు, తూర్పు గోదావరి నుండి రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రకాశం నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసింది. కృష్ణా జిల్లా నుండి విజయవాడ పట్టణ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, రాజేంద్రప్రసాద్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లా నుండి అన్నే సతీష్, యం. సోంబాబు, చందు సాంభశివరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.   వైకాపా కూడా కృష్ణా జిల్లా నుండి నటుడు కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పేరును ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన వైకాపాలో చేరబోతున్న బొత్స సత్యనారాయణకు విశాఖ నుండి పోటీ చేయించాలని వైకాపా భావిస్తోంది.

తెలంగాణకు వ్యతిరేకం కాదు.. చంద్రబాబు

రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల్లో ఎలాంటి విభేదాలు లేవని విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని అలాగైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అంతేకాక నవనిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణలో ఉన్న సమస్యలపై కూడా పోరాటం చేస్తామని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ఇచ్చే ఒక్క ప్రత్యేక హోదాతో ఏపీ అభివృద్ధి అసాధ్యమని ఏపీ ఆభివృద్దికి కేంద్రం తప్పకుండా సహకరించాలని కోరారు. ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని అందుకు తెలుగు ప్రజలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఒకవైపు తెలంగాణ వేడుకలు... మరోవైపు విద్యార్ధుల దర్నా

ఒక పక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతుంటే మరోపక్క ఓయూ విద్యార్ధులు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో ముఖ్య భూమిక పోషించిన ఓయూ విద్యార్ధులే కేసీఆర్ కు వ్యతిరేకంగా దర్నా చేపట్టారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, దానితో పాటు ఓయూ భూముల విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులంతా నల్లజెండాలతో తమ నిరసనను తెలుపుతూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించారు. అయితే పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు ఓయూ వెళ్లే దారులను బ్యారీకేడ్లతో, ముళ్లకంచెలతో ఎక్కడికక్కడభద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఓయూ నాయకులను ముందే అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులకు ఓయూ విద్యార్ధులకు వాగ్వాదం జరగడంతో కొంతమంది విద్యార్ధులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి చంచల్ గూడ టు చర్లపల్లి

రేవంత్ రెడ్డికి 14 రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే చంచల్ గూడ జైలు అధికారులు చంచల్ గూడలో తీవ్రవాదులున్నారని, సరిపడా బ్యారక్ లు లేవని ఈ సమయంలో రేవంత్ రెడ్డికి భద్రత కల్పించడం కష్టమని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషిన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, జైలులో తనకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు తెదేపా నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డిని కలిసి పరామర్శించారు. 

నౌక ముగిని 405 మంది గల్లంతు

చైనాలో తుఫాన్ కారణంగా ఓ నౌక అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 450 మంది జలమయం అయ్యారు. వివరాల ప్రకారం ఈస్టెన్ స్టార్ అనే నౌక చైనాలోని అతి పొడవైన నదిగా పేరొందిన యాంగ్జీ నది మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఒక్కసారిగా విపరీతమైన గాలులు, తుఫానుతో ప్రతికూల వాతవరణం ఏర్పడి నౌక నదిలో మునిగి పోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే నౌకలో మొత్తం 405 మంది ప్రయాణికులు, 47 మంది సిబ్బంది ఉండగా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగారు. తుఫాన్ వల్ల సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందని, గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.

ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.. కేసీఆర్

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని వారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, అలాంటి వారికోసం ఎంతటి కష్టానైనా భరిస్తానని అన్నారు. అంతేకాక ఆయన చేపట్టిన, చేపట్టబోయే పలు అంశాల గురించి సభాపూర్వకంగా తెలియజేశారు. * సంక్షేమ పథకాల కోసం 28 వేల కోట్లు * మిషన్ కాకతీయ పథకం ద్వారా 46వేల చెరువులు బాగు చేస్తాం * హరితహారం కింద 300 కోట్ల మొక్కలు నాటుతాం * వచ్చేనెల జులైలో 25వేల ఉద్యోగాలకు ప్రకటనల జారీ * 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపడతాం * 50 వేల డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం * ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ * రూ.91వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టలతో 2018 నాటికి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ * అంగన్ వాడీ ఉద్యోగులకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం * మహిళల భద్రతకోసం షీ టీమ్స్ ఏర్పాటుచేశాం * రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ * రూ. 20 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశాం

అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా... చంద్రబాబు

రాష్ట్రాన్ని విభజించినవారే అసూయపడేలా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముందున్న ఒకే ఒక సంకల్పం నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణమని, దీనికోసం మేము అహర్నిశలు శ్రమిస్తామని ప్రజలు కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు. అంతేకాక నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషిచేస్తామని దీక్షకు వచ్చిన ఉద్యోగులు, ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ కోరుకునేదని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరైనా తెలుగుప్రజలంతా ఒక్కటేనని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు.