ఏపీకీ పెట్టుబడుల ప్రవాహం.. మూడు సెల్ కంపెనీలు

  ఏపీకి అరుదైన ఘనత దక్కడంతో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది.  దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్న ప్రదేశాల్లో రెండో స్థానం దక్కించుకోవడం రాష్ట్రానికే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆనందాన్నిచ్చే అంశం. ఒకపక్క చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి.. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో  చంద్రబాబు సర్కారుకు తీపి కబురును అందించింది. దీనిలో భాగంగానే చంద్రబాబు విజయవాడలోని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మూడు ముబైల్ కంపెనీలు తమ పెట్టుబడులను ఏపీ పెట్టడానికి గాను ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏర్పాటు చేసిన వేదిక మీదే మైక్రోమ్యాక్స్.. సెల్ కాన్.. కార్బన్ కంపెనీలు తమ పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో తమ ఫ్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు రావడం.. కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు ఎంవోయూలు కుదుర్చుకోవటం వెంటవెంటనే జరిగిపోవడం విశేషం. ఇప్పటికే ఏపీలో ప్రముఖ మొబైల్ కంపెనీ జియోమీ తన ఉత్పత్తిని ఏపీలో స్టార్ట్ చేసింది. దీంతో మొత్తం నాలుగు మొబైల్ కంపెనీలు ఏపీకి వచ్చాయి. మొత్తానికి ప్రపంచ బ్యాంకు నివేదిక పుణ్యమా అని ఏపీలోకి పెట్టుబడులు రావడం ఆనందాన్నిచ్చే అంశమే.

శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం

రైళ్లలో దోపిడీ దొంగల ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయి, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని రైల్వే అధికారులు చెబుతున్నా, దొంగల ఆగడాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. రెండ్రోజుల క్రితం సింహపురి ఎక్స్ ప్రెస్ లో లేడీ ఐపీఎస్ పై జరిగిన దాడిని మరిచిపోకముందే, మరో ట్రైన్ లో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. కాకినాడ నుంచి బెంగళూర్ వెళ్తున్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో చొరబడిన దొంగలు... నెల్లూరు జిల్లా మనుబోలు దగ్గర చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, ఎస్-7, ఎస్-8 కోచ్ లలో ప్రయాణికులను కత్తులతో బెదిరించిన దొంగలు...నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు.ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రామ్ చరణ్... భయపెట్టాడంటున్న మహేష్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి నిద్రపట్టకుండా చేశాడట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ప్రిన్స్ మహేశ్ బాబే వెల్లడించారు. శ్రీమంతుడు సినిమా రిలీజ్ కి ముందు రామ్ చరణ్ మగధీర సినిమాను తలచుకుని, తెగ భయపడ్డానని చెప్పుకొచ్చారు. మగధీర లాంటి బిగ్ హిట్ తర్వాత రెండు మూడు నెలలపాటు ఏ సినిమా కూడా విజయాన్ని చవిచూడలేదని, అలాగే శ్రీమంతుడి విషయంలోనూ జరుగుతుందని భయపడ్డానన్నారు. బాహుబలి తర్వాత కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని, దాంతో శ్రీమంతుడు రిజల్ట్ ఎలా ఉంటుందోనని రిలీజ్ కు ముందు టెన్షన్ పడినట్లు తెలిపారు. కానీ తన టెన్షన్ ను పటాపంచలు చేస్తూ, శ్రీమంతుడు సూపర్ హిట్ అయ్యిందని ప్రిన్స్ సంతోషం వ్యక్తంచేశారు.

రేవంత్, ఎర్రబెల్లి.. కోల్డ్ వార్ ముగిసిందా?

  తెలంగాణ  తెలుగుదేశం పార్టీలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.  ఏపీ సీఎం చంద్రబాబు టీ టీడీపీ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారా లేదా ఎర్రబెల్లికి అప్పగిస్తారా అన్న నేపథ్యంలో ఈ ఆధిపత్యపోరు బయటపడింది. అసలు ఒకే పార్టీ అయినా రేవంత్ రెడ్డికి.. ఎర్రబెల్లికి ఎప్పటినుండో సఖ్యత లేదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకానొక సందర్బంలో ఈ ఇరువురు నేతలు మధ్య మాటలు కూడా తగ్గిపొయాయి. ప్రత్యక్షంగా ఒకరినొకరు తిట్టుకోకపోయినా పరోక్షంగా మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతూనే ఉండేది. అది ఇప్పుడు ఇంకోసారి బహిర్గతం అయింది. అయితే నిన్నటి వరకూ వీరిద్దరి మధ్య ఉన్న పోరు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దరి మధ్య రాజీ కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి ఇచ్చినా తాను మాత్రం ఎర్రబెల్లికి ఇప్పుడున్న పెద్దరికపు హోదానే కొనసాగిస్తానని చెప్పడం.. ఆ విషయంలో తాను పోటీపడనని.. చెప్పడంతో ఎర్రబెల్లి కూడా సమాధానపడినట్టు తెలుస్తోంది. అంతేకాక టీఆర్ఎస్ పై రేవంత్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడంతో తాను కూడా దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా మరోవైపు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరాడినట్టు ఎర్రబెల్లి తాను పోరాడలేనని తెలిసే తాను ఈ ఒప్పందానికి అంగీకరించారని.. కేవలం రేవంత్ కు మద్దతు తెలిపేందుకు సిద్దమయ్యారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. మొత్తానికి కారణమేదైనా ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆ ఆసఖ్యత పోవడం పార్టీకే లాభదాయకం.

పొంగులేటి అందుకే వెళ్లిపోయారా?

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. టీకాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం సాక్షిగా నేతల మధ్య అనైక్యత మరోసారి బయటపడింది. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ఈ మధ్య కలిసికట్టుగా ముందుకెళ్తున్నారని అనిపించినా, ఇంతలోనే విభేదాలు రచ్చకెక్కాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సమావేశమైన భేటీ నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు, ఎక్స్ గ్రేషియా, రుణమాఫీ అంశాలపై సభను స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకోగా, తాను సూచించిన పోలవరం ముంపు గ్రామాల అంశాన్ని అజెండాలో ఎందుకు చేర్చలేదంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తన డిమాండ్ పై మిగతా నేతల సరిగా స్పందించకపోవడంతో  అలిగిన పొంగులేటి...సోనియా వద్దే తేల్చుకుంటానంటూ సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు.

మహేష్ బాబుపై చంద్రబాబు పొగడ్తల వర్షం

శ్రీమంతుడు సినిమా రిలీజై...ఆరు వారాలవుతున్నా, ఇంకా సంచలనాలు స-ష్టిస్తూనే ఉంది.  బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లతో కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ శ్రీమంతుడు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని సైతం మెప్పించింది. అత్యంత బిజీ షెడ్యూల్ లోనూ కాస్తంత తీరిక చేసుకుని...శ్రీమంతుడు సినిమా చూసిన టీడీపీ అధినేత... ఆ చిత్ర యూనిట్ ను అభినందించారు. మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజానికి ఎంతోకొంత తిరిగివ్వాలన్న కాన్సెప్ట్ చాలా బాగుందని, మహేష్ అద్భుతంగా నటించాడని మెచ్చుకున్నారు.తాను ప్రారంభించిన స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్ కాన్పెప్ట్ ను సినిమాను పోలి ఉందన్న చంద్రబాబు... ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ట్వీట్స్ కు స్పందించిన ప్రిన్స్ మహేష్ ...తమ సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రిప్లై ఇచ్చారు.

జగన్ వారికి చిల్లిగవ్వ ఇవ్వలేదు

  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని విమర్శించారు. తన కంపెనీలకు పెట్టుబడి పెట్టిన వారికి చిల్లిగవ్వకూడా జగన్ ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనువైన ప్రదేశాల ఎంపికలో ఏపీ రెండవ స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఈ సందర్బంగా ఆయన పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం చాలా సంతోషకరమైన వార్త అని అన్నారు. రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏపీకి ఇలాంటి అరుదైన ఘనత దక్కడం చాలా అభినందనీయమని అన్నారు. చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారని.. అవినీతి పేరిట వైఎస్ లూటీ చేసిన డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని సోమిరెడ్డి విమర్శించారు.

రేవంత్ రెడ్డిని చూడాలని ఉంది

  నల్గొండ జిల్లా చంద్రపేట మండలంలోని ఓ భూమి వివాదంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు.. టీడీపీ నే తకు చందూలాల్ మధ్య వివాదం జరిగింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు చందూలాల్ పై దాడి చేయగా ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చందూలాల్ ను హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే చందూలాల్ తనకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చూడాలనిపిస్తుందని కోరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తాను వస్తున్నట్లుగా చందూలాల్ కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి చెప్పారు. తాను వెంటనే బయలుదేరి వస్తున్నానని.. ధైర్యంగా ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా రేవంత్, ఇతర టిడిపి నేతలు ఉదయం చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లారు.

టీ సర్కార్ కు మరోసారి సుప్రీం చురక

ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వం తమ సొంతగా తీసుకున్న నిర్ణయాలకు గాను అటు హైకోర్టులో కాని.. ఇటు సుప్రీంకోర్టులో కాని మొట్టికాయలు తింటునే ఉంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలవల్లనో లేక.. కావాలని ఒంటెద్దు పోకడని అనుసరిస్తూ తీసుకున్న నిర్ణయాలే కావచ్చు కాని మొత్తానికి పలుమార్లు ధర్మాసనాల చేతిలో టీ సర్కార్ చురకలు వేయించుకుంది. ఇప్పుడు కూడా తాజాగా టీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కళింగులు బీసీల వర్గానికి చెందేవారిగా చట్లాలు అమల్లో ఉండేవి. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కళింగ సామాజిక వర్గం లేనందున రాష్ట్రం ఆ వర్గాన్ని బీసీ జాబితా నుండి తీసేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వైద్య విద్యాకోర్సుల్లో తాము రిజర్వేషన్లు కోల్పోతున్నామంటూ ఇద్దరు వైద్య విద్యార్ధినులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి తలంటింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల అమలు ప్రకారం వారికి రిజర్వేషన్లు ఉన్నప్పుడు  ఏ ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు తీసేస్తారని ప్రశ్నించింది. ఏపీకి చెందిన విద్యార్థులు రిజర్వేషన్లు ఉందని వస్తారు.. లేవని మీరెలా చెప్తారు అని గట్టిగా అడిగింది. విభజన వల్ల కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రానికి వెళ్లినంత మాత్రాన రిజర్వేషన్లు చెల్లవని చెప్పటం సమంజసం కాదని అభిప్రాయపడటం గమనార్హం. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల పలు అంశాల్లో ఇలా చురకలు అంటించుకోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బైరెడ్డి.. ఇంట్లోనే దీక్ష.. ఎన్నిరోజులు బంధిస్తారు?

  రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తలపెట్టిన రైతు  రైతు బతుకు దెరువు యాత్రను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా కర్నూలు జిల్లా తంగడంచ మండలంలో పరిశ్రమల కోసం భూసేకరణకు పూనుకుంది. అయితే దీనికి వ్యతిరేకంగా బెరైడ్డి తగడంచ నుంచి కర్నూలు వరకు ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పాదయాత్రకు అధికారుల అనుమతి లేదని ముందుగానే అతనిని గృహనిర్బంధం చేశారు. అయితే పోలీసులు బైరెడ్డిని గృహనిర్భందం చేయడంతో ఆయన ఇంటి వద్దనే తన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతకాలం ఇలా నన్ను ఇంటిలో బంధిస్తారు.. ఏ రోజైనా బయటకు వస్తానని అప్పుడు మళ్లీ పాదయాత్ర నిర్వహిస్తానని అన్నారు. ప్రభుత్వ ఈ రకంగా రైతుల మీద తమ వ్యతిరేకతని చూపించిందని.. వారి భూములు తీసుకొని వారి పొట్టలు కొట్టొద్దని చెప్పారు. ఇప్పటికైనా భూ సేకరణను ఆలోచన మానుకొని దానిని ఆపేస్తే తాను కూడా పాదయాత్రను విరమించుకుంటానని, లేకపోతే పాదయాత్ర ఒక్కటే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపడతామని హెచ్చరించారు.

భిక్షాటన చేసిన ఎంపీ..

  రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని పలువురు విమర్సలు చేస్తున్నారు.  దీనికి తోడు ఇప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తోడైనాయి. రైతల ఆత్మహత్యలు చేసుకోవడమేమోకాని వారివల్ల ప్రతిపక్షాలకు మాత్రం అధికార పార్టీమీద విమర్శలు చేయడానికి మంచి పాయింట్ దొరికింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదోలా తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా ఉంటే వర్కవుట్ కాదకున్నారేమే కాని ఈమధ్య బాగానే మీడియా సమావేశాలు గట్రా పెట్టి.. ఏదో కారణంతో ప్రతిపక్ష నేతలను నాలుగు తిట్లు తిడుతూ ఫోకస్ అవుతున్నారు.  అలాంటిది ఇప్పుడు రైతుల ఆత్మహత్యలను అంత తేలికగా వదిలిపెడతారా.. మంచి పాయింట్ దొరికింది కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్లు అధికార ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ ఒకేలా చేస్తే ఏం బావుంటుంది అని అనుకున్నారేమో ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. రాజకీయాల్లో తన విలక్షణ పోకడను కనబరిచారు. తెలంగాణ లోని భూదాన్ పోచంపల్లిలో ఒక చేనేత కార్మికుడు పగడాల నగేష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆనందభాస్కర్ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన ఆర్థిక సాయం చేయడానికి ఎంపీ రాపోలు ఆ గ్రామంలో భిక్షమెత్తారు. అలా భిక్షాటన చేయగా వచ్చిన రూ. 50వేల రూపాయలను నగేష్ కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలు రైతు ఆత్మహత్యల వల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ల పోకడను చూపిస్తున్నారు.

పవన్ పొలిటికల్ టూర్.. మూహూర్తం ఖరారు..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర్రపదేశ్ పర్యటనలో భాగంగా ప్రజల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో పర్యటనకు గాను ఆయన మూహూర్తం కూడా ఖరారు చేశారని.. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పర్యటనలో శ్రీకాకుళం నుండి తన పర్యటనను ప్రారంభిస్తారని.. ఈ పర్యటనలో ఆయన ప్రజలు బాధపడుతున్న అనేక అంశాలపై వారితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ భూసేకరణ అంశంపై ప్రభుత్వంపై పోరాడి వారి తీసుకున్న నిర్ణయాన్నే వెనక్కితీసుకునేలా చేశారు. ఒక రకంగా దీనివల్ల పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా బీజేపీ టీడీపీ మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. ఈ పార్టీలకి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారు. అయితే ఇప్పుడు టీడీపీ సంగతమే కాని పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని.. పవన్ కళ్యాణ్ మద్దతు ద్వారా ఎపిలో పాగా వేయాలని బిజెపి చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో లేదో చూడాలి.

సైకో సూదిగాడిలా జగన్

  ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఈ మధ్య అందరికి ఇంజక్షన్ ఇస్తూ గుబులు పుట్టిస్తున్న సైకో సూదిగాడితో వైఎస్ జగన్ ను పోల్చి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లారీ ప్రమాదంలో గాయపడిన కురందాసు రాజును పరామర్శించడానికి వెళ్లి జరిగిన ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. అతను పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో సూదిగాళ్ల సమస్య ఎక్కవైందని.. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఓ పెద్ద సైకో సూదిగాడిగా తయారయ్యాడని.. ఎక్కడ ఎప్పుడు గుచ్చుతాడో తెలియడం లేదని.. అతని మానసిక పరిస్థితి బాలేదని ఉమా ఎద్దేవ చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ఏమి జగన్ కు కనపడవని.. ప్రతి విషయాన్ని విమర్శించమంటే మాత్రం ముందుంటారని అన్నారు.

టీడీపీ, బీజేపీ.. కలిసుండలేమంటున్న నేతలు

  టీడీపీ, బీజేపీ పార్టీలు రెండూ మిత్రపక్షాలని అందరికి తెలిసిందే. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలైనప్పటికీ అప్పుడప్పుడూ తమ విభేదాలను మాత్రం బయటపెడుతూనే ఉంటారు. ఏదో కేంద్రం ఒకపక్క.. చంద్రబాబు మరోపక్క ఉంటున్నారు కాబట్టి నేతలు ఒకరిపై ఒకరికి ఎంత కోపమున్నా వాటిని మనసులో దాచుకుంటూ కాలం నెట్టుకొస్తున్నారు. అయితే పశ్చిమగోదావరిలో జరిగిన సంఘటనతో ఇది పైపైన నేతలు చేస్తున్న మెరుపులే అని స్వచ్ఛంగా అర్ధమయింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ, టీడీపీ నేతలు మధ్య గొడవ రాజుకుంది. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ ముదిరి ఇరు పార్టీల సభ్యలు వాదులాడుకున్నారు. దీంతో గూడెం మున్సిపల్ ఛైర్మన్.. ఇక బీజేపీతో కలిసి ఉండలేమని చెప్పేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అన్యాయ చేస్తోందంటూ బీజేపీ... బీజేపీ అన్యాయ చేస్తోందంటూ టీడీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట. ఒకమెట్టెక్కి ఇక కలిసుండేది లేదని కూడా అనుకున్నారు. మొత్తానికి ఈరకంగా ఇరు పార్టీనేతలు తమ కోపమంతా కక్కేసుకుంటూ నిజాన్ని మాత్రం వెళ్లగక్కారు.

అది చంద్రబాబుకు మంచి వార్తనే

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాష్ట్ర నూతన పర్యాటక విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని.. దీనికి సంబంధించి వివిధ ప్యాకేజీలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా దీనిని రూపొందించామని తెలిపారు. ఈ నూతన పర్యాటక విధానం ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. అంతేకాదు పంచంలోనే అత్యంత ధనవంతమైన, పవర్ ఫుల్ గాడ్ శ్రీవారు అని.. వెంకటేశ్వర స్వామి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని.. ఆయనకు రూ.10,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆక్కడ ఉన్నవారిని నవ్వించారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు అరుదైన ఘనత లభించింది. ఏంటంటే ప్రపంచ బ్యాంకు తాజాగా ఒక ప్రకటన చేసింది. వ్యాపార అనుకూల వాతావరణ రాష్ట్రాలను జాబితాలో గుజరాత్‌కు తొలి స్థానం లభించగా ఏపీకి రెండో స్థానం దక్కింది. మొత్తానికి ఇది చంద్రబాబుకు తీపి కబురు లాంటిదే.

ఫిటింగ్ వీహెచ్.. ఫిటింగ్ పెట్టాడా?

  రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఊహించని రీతిలో సమాధానం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనట్టే మళ్లీ ఏపీలో ఆపార్టీ కోలుకోవాలంటే కొన్ని సంత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఆపరిస్థితి కనిపించడంలేదు. గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పుడు వారికి అందివచ్చిన ఛాన్స్ లను ఏ మాత్రం వదలిపెట్టుకోకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతు ఆత్మహత్యలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల ఆతహత్యలను పట్టించుకోకపోవడం వారికి కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎవరికి తోచినట్టు వాళ్లు తమ పర్పెర్మెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు.. కనీసం రైతుల కుటుంబాలను కూడా పరామర్శించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా వీహెచ్ మరో ఫిటింగ్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఇటు కాంగ్రెస్ నేతలపై కూడా తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పై దాడి చేస్తూ యాక్టివ్ గా ఉంటే కొంత మంది మాత్రం అవేమి పట్టనట్టూ ఇంట్లోనే  కూర్చొని కాలక్షేపం చేస్తున్నారంట. దీంతో ఆయన కాంగ్రెసులో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా - పోరాడకుండా ఉన్న నాయకుల పేర్లను రాసుకొని దానిని టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. ఈవిషయాన్ని ఆయనే ప్రకటించారు. అయితే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని కేంద్రంతో చెప్పే వీహెచ్ ఇప్పుడు ఈ విషయాన్ని కూడా కేంద్రంతో చెప్పి ఉంటారని.. దీంతో వీహెచ్ మళ్లీ ఫిటింగ్ పెట్టారని నేతలు అనుకుంటున్నారు.

సీఎం అవుతాడో లేదో... జైలుకైతే ఖాయం

  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో మూడేళ్లలో తానే సీఎం అవుతానని చెప్పుకుంటున్న జగన్ కలలు నెరవేరవని, మరో ముప్పై ఏళ్లయినా ముఖ్యమంత్రి కాలేడంటూ చురలంటించారు. కోర్టు అనుమతి లేకుంటే, కనీసం అసెంబ్లీకి కూడా రాలేని జగన్...ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న జగన్...ప్రజలను పక్కనబెట్టి... జ్యోతిష్యులను నమ్ముకున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం కావాలన్న జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవన్న యనమల... మరో 20ఏళ్ల వరకూ టీడీపీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. జ్యోతిష్కుడు చెప్పినట్లు జగన్‌ సీఎం అవుతాడో లేదో తెలియదు గానీ...రేపోమాపో జైలుకెళ్లడం మాత్రం ఖాయమంటూ సెటైర్లు వేశారు.