పవన్ కళ్యాణ్ ఎక్కడ? దీక్ష ఎక్కడ?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు.. దీక్ష చేస్తానని చెప్పి ఏమయ్యాడు.. ఇప్పుడు ప్రతిఒక్కరులోనూ మొదలయ్యే ప్రశ్నలు ఇవి. నిర్భంద తమిళం చట్టం ద్వారా తమిళనాడులో తెలుగుబాషపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ అమ్మకు వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ దీక్షను సెప్టెంబర్ నెలఖారున చేపట్టాలని అప్పుడు తెలిపారు. పవన్ తీసుకున్న ఈనిర్ణయానికి తెలుగు ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు కూడా. కానీ ఇప్పుడు సెప్టెంబర్ ముగిసిపోయింది.. దీక్ష పరిస్థితి ఏంటి? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విట్టర్ ద్వారా ఏదో ఒకటి పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది రోజులుగా ట్విట్టర్ ద్వారా ఎలాంటి పోస్ట్ లు చేయడంలేదు. దీక్ష చేస్తానని చెప్పిన నెల అయిపోయింది.. మరి దీక్ష విరమించుకున్నారా? లేక దీక్షను వాయిదా వేసుకున్నారా? అని చెప్పేవాళ్లు కూడా లేరు. మరోవైపు దీక్ష విషయంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారా? లేక నిజంగానే సినిమాలతో బిజీగా ఉన్నారా అని పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి ప్రకటన చేయాలి.. లేకపోతే ట్విట్టర్ ద్వారా అయినా కూత వేయాల్సిందే.

ఆశాభోంస్లే తనయుడు హేమంత్ భోంస్లే మృతి

  ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశాభోంస్లే తనయుడు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు హేమంత్ భోంస్లే ఈ రోజు మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నహేమంత్ భోంస్లే స్కాట్లాండ్ లో మరణించారు. దీంతో ఆశా భోంస్లే కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిపోయారు. హేమంత్ భోంస్లే  'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు. కాగా బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో అంటే 2012 లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే కూడా డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు హేమంత్ భోంస్లే మరణానంతరం లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వేడుకలను రద్దు చేశారు.

ఎన్‌కౌంటర్‌ కు అనుమతులు ఉన్నాయి.. హరగోపాల్

  వరంగల్ జిల్లా తాడ్వాయ్ లో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ వామపక్షాలు ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడదామని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అయితే ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. ప్రజలను కట్టడి చేసి విధ్వంసాన్ని సృష్టించవద్దని.. అధికార పార్టీ చేసే ప్రతిఒక్క పని రికార్డు అవుతుందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన మొదటి ప్రభుత్వం.. అలాంటిది ఒకవేళ తెలంగాణ చరిత్ర కనుక రాస్తే మొదటి తెలంగాణ ప్రభుత్వ అనుసరించిన విధానాలు గురించి కూడా తప్పనిసరిగా చర్చించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాదు ఎన్ కౌంటర్ గురించి మాట్లాడుతూ పైనుండి అనుమతులు లేనిదే పోలీసులు ఎన్ కౌంటర్ చేయరని వ్యాఖ్యానించారు. ఎన్ కౌంటర్ చేయకూడదని.. వీలుంటే వారిని అరెస్ట్ చేయాలని.. న్యాయవ్యవస్థ ద్వారా వారిని విచారణజరిపించాలి అంతేకాని ఎన్ కౌంటర్ చేయడమేంటని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఎన్ కౌంటర్ కు ప్రభుత్వం అనుమతి ఉందని హరగోపాల్ మాటల ద్వారా స్పష్టం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఛలో అసెంబ్లీ.. ముట్టడి కట్టడి

వరంగల్ జిల్లా తాడ్వాయ్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో శృతి, విద్యాసాగర్ లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఈ పని చేసిందని.. 350 సంఘాలతో చలో అసెంబ్లీ చేపడతామని వామపక్షాలు తెలిపారు. దీనిలోభాగంగానే ఈరోజు వామపక్షాలు శృతి, విద్యాసాగర్ ఎన్‌కౌంటర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వామపక్షనేతలు.. కార్యకర్తలు.. ఇతర సంఘాల నేతలు పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు ముందే సమాచారం తెలుసుకొని అసెంబ్లీ వద్ద భారీ బందో బస్తు ఏర్పాటుచేశారు. అంతేకాదు నిరసనలో పాల్గోనే వారందరిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థినులను ఎన్‌సీసీ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు..కొంతమందిని గృహనిర్భందం కూడా చేశారు. దీంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇంత బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ రాజ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది.

తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు

టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం లేదని.. మాకు ఆస్తులు సంక్రమించిన సమయంలో ఉన్న విలువనే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తామని అంతేకాని ఎప్పటికప్పుడు పెరిగే..తరిగే విలువలను బ్యాలెన్స్ షీట్లో ఉండదని అన్నారు. తాము ఆస్తివివరాలు తెలిపినట్టు ఇతర పార్టీలకు చిత్తశుద్ది ఉంటే వారి ఆస్తి వివరాలు కూడా ప్రకటించాలని అన్నారు. అంతేకాదు తమ ఆస్తుల గురించి వాస్తవాలు తెలియకుండా తెలివితక్కువగా మాట్లాడవద్దని చంద్రబాబు సూచించారు.

మోడీతో కరచాలనం.. చేతులు దులుపుకున్న సత్యనాదెళ్ల..

  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో పలు సంస్థల అథిపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కూడా కలిశారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉంది అయితే ఈ సందర్భంగా ఒక అంశంపై ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే మోడీని సత్యనాదేళ్ల కలిసిన నేపథ్యంలో అప్పుడు మోడీతో కరచాలనం చేసిన సత్యనాదెళ్ల తన రెండు చేతుల్ని దులిపేసుకుంటూ పక్కకు వెళ్లినట్టు వచ్చిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరూ సత్యనాదెళ్ల ప్రధానిని అవమానించారని అనుకుంటుండగా.. కొంతమంది అది కావాలని చేసింది కాదు.. అలవాటు పూర్వకంగా చేసి ఉంటారని అనుకుంటున్నారు. దీనితో పాటు మోడీ ఫేస్ బుక్ అధినేత జుకెర్ బర్గ్ ను కలవడంపై కూడా వివాదాలు తలెత్తుతున్నాయి. మోడీ, జుకెర్ బర్గ్ ను కలిసిన నేపథ్యంలో గుజరాత్ లో సంభవించిన అల్లర్లకు కారణమైన మోడీతో చేయి కలిపిన జుకెర్ బర్గ్ చేతులకు రక్తపు మరకలు అంటుకున్నాయని.. ఆరక్తపు మరకలు కడుక్కునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జుకెర్ బర్గ్ కు 250 బాటిల్స్ పంపించారట.

రైతుల అలక దీక్షతో టీఆర్ఎస్ కు చెమటలు

  నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని.. విపక్షాలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అధికార పార్టీ రైతుల ఆత్మహత్యల సమస్యతో సతమతమవుతుంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి అధికార పార్టీని ఇరుకున పెడదామనే ప్లానింగ్ లో ఉన్నాయి. దీనిలో భాగంగానే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు దీనికి తోడు వారికి మరో తలనొప్పి వచ్చిపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా రైతులు అలక దీక్ష చేపట్టారు. అది ఎవరో కాదు కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న గ్రామ రైతులే దీక్షకు పూనుకున్నారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దీక్షకు నేతృత్వం వహించింది.. కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి కోసం గడ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఓఎస్డీ అశోక్ కుమార్. ఆయన రైతుల పక్షాన నిలిచి నిరసన వ్యక్తం చేయటంతో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో సమస్యలు ఎదుర్కొంటున్నకారణంగా ఇప్పుడు ఈ విషయం ప్రచారం అయితే ఇంకా తలనొప్పులు తప్పవని గుర్తించిన ప్రభుత్వ అధికారులు ఉరుకులు పరుగులు తీసుకుంటూ అక్కడి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా అక్కడికి వచ్చిన అధికారులకు అశోక్ కుమార్ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో సరికొత్త కారణాలు చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకూ తాను దీక్షను విరమించనని మొండికేశారు. అయితే ఆయన్ను ఎలాగొలా బుజ్జగించి దీక్షను విరమించే సరికి అధికారుల తల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది. ఏది ఏమైనా రైతుల ఆత్మహత్యల అంశం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుంది.

తెదేపా ఏపీ, తెలంగాణా, కేంద్ర కమిటీల ప్రకటన

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆంద్రప్రదేశ్, తెలంగాణా, కేంద్ర పోలిట్ బ్యూరో కమిటీల వివరాలను విజయవాడలో ప్రకటించారు. తెదేపా ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును, తెలంగాణా అధ్యక్షుడిగా మళ్ళీ యల్. రమణను నియమించారు. చంద్రబాబు నాయుడు తెదేపా జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. నారా లోకేష్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమింపబడ్డారు.   ఆంద్రప్రదేశ్ : ఈ కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 70మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: కళా వెంకట్రావు, ఉపాధ్యక్షులు: కారణం బలరామ్,బండారు సత్యనారాయణ, వెంకటేశ్వర చౌదరి, జె.ఆర్. పుష్పరాజ్, ఎం. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు: వార్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగేశ్వర్ రెడ్డి, రామానాయుడు, అధికార ప్రతినిధులు: డొక్కా మాణిక్యవర ప్రసాద్, జూపూడి ప్రభాకర్, వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, ముళ్ళపూడి రేణుక,ముత్తం శెట్టి శ్రీనివాస రావు, అనురాధ, లింగారెడ్డి, కోశాధికారి: బిసి. జనార్ధన్ రెడ్డి.   తెలంగాణా: ఆంద్రప్రదేశ్ కంటే తక్కువ జిల్లాలు ఉన్నప్పటికీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర కమిటీలో 93మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్: రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు:ఎం. వెంకటేశ్వర రావు, సాయన్న, స్వామీ గౌడ్, యూసఫ్ ఆలి, కృష్ణ యాదవ్, ఎ. గాంధీ, సి.హెచ్. సురేష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ. తెలుగు యువత అధ్యక్షుడు: వీరేందర్ గౌడ్, తెలుగు మహిళ అధ్యక్షురాలు: శోభారాణి   కేంద్ర కమిటీ: కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు: నందమూరి హరికృష్ణ, యనమల, అయ్యన్న, ప్రతిభా భారతి, అశోక్ గజపతి రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిన్న రాజప్ప, కాల్వ శ్రీనివాసులు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్, ఉమా మాధవ రెడ్డి, తదితరులు. అధికార ప్రతినిధులు: కే.రామ్మోహన్ నాయుడు, అరవింద్ కుమార్ గౌడ్, బోండా ఉమా.

అక్బరుద్దీన్ రియాక్ట్ వెనుక కారణం అదా?

  తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఐఏఎంపార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పార్టీని కడిగేసిన సంగతి తెలిసిందే. రైతు ఆత్మహత్యలపై ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కేటీఆర్ కు కూడా ఘాటుగా సమాధానం చెప్పి కేటీఆర్ నోరు మూయించాడు.. దాంతో మంత్రి హరీశ్ రావు కూడా కల్పించుకొని అక్బరుద్దీన్ వాగ్దాటికి బ్రేక్ వేద్దామని చూసినా కూడా అది వర్కవుట్ కాలేదు. ఆవిధంగా మొత్తానికి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రైతు ఆత్మహత్యల విషయంపై అధికార పార్టీని ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆ పని అక్బరుద్దీన్ ఒకరే చేసి చూపించారు. అయితే రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం వేరే ఉందట. అదేంటంటే.. గతంలో ఒకసారి అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దాని గురించి చెపుతూ మృత్యుముఖం వరకూ వెళ్లి వచ్చిన నాకు ఆ బాధ ఏంటో తెలుసని.. నేను రైతును కాకపోయినా.. ఆ రైతు కుటుంబం బాధ ఏలా ఉంటుందో తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. చావు వరకూ వెళ్లిన నాకు ఆ బాధ తెలుసు ఇంటి పెద్దకు ఏదైనా అయితే కుటుంబ సభ్యులు ఎలాంటి బాధ అనుభవిస్తారో నేను ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు. మొత్తానికి అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవడానికి పర్సనల్ ఎక్స్ పీరియన్స్ కారణం అన్నమాట..

నయనతార, సమంత ఇళ్ళపై ఐటీ దాడులు

  ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. వారేగాక ప్రముఖ తమిళహీరో విజయ్ ఆయన చేసిన ‘పులి’ సినిమా నిర్మాత షిబు సెల్వ కుమార్ ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడులో చెన్నై, మధురై, కేరళ రాష్ట్రంలో నయనతార ఉంటున్న కొచ్చి నివాసంపై ఏక కాలంలో ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. దేశంలో మరో 32 ప్రాంతాలలో కూడా ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజే దాడులు నిర్వహించారు. అంటే దేశంలో ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ఐటి అధికారులు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతల ఇళ్ళు కార్యాలాలపై దాడులు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ చాలా కాలంగా దాడులు చేయకపోవడం వలన ఇవి సంచలనం కలిగిస్తున్నాయి.

లోకేశ్, రేవంత్ కు కీలక పదవులు

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల కమిటీలను ప్రకటించారు. ఈసందర్భంగా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి... * కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్‌లు ఉండనున్నారని తెలుస్తోంది. * ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది. * అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం. * తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకముందు కొనసాగిన ఎల్ రమణనే కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు. * ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు.

ఏపీ, తెలంగాణ.. ఈసారి సరిహద్దు వివాదం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటది. ఇప్పటికే ఈరెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలలో కొన్ని సమస్యలు తీరినా.. కొన్ని సమస్యలు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఇది వివాదం సరిహద్దు సమస్యగా మారబోతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు వివాదం ఏంటంటే నాగార్జున సాగర్ సమీపంలో అనువు దగ్గర కొత్త బోట్లు తయారీకి గాను మొత్త మూడు లారీల్లో తయారీ సామాగ్రితో తెలంగాణ టూరిజం సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఆంధ్రాభూభాగంలో బోట్లు ఎలా నడుపుతారు అంటూ వారిని ఏపీ టూరిజం అధికారులు అడ్డుకున్నారు. అదే తెలంగాణ హుస్సేన్ సాగర్ లో నడిపితే ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు. అంతే దీంతో తెలంగాణ టూరిజం అధికారులకు.. ఏపీ టూరిజం అధికారులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఇప్పుడు సరిహద్దు వివాదానికి దారితీస్తుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ పట్టించుకోరు.. చంద్రబాబుకు 3 కోట్లిస్తా.. తలసాని

టీడీపీ పార్టీలో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలో పదవి అనుభవిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అలాంటిది ఇప్పుడు తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపని.. సనత్ నగర్ నియోజక వర్గం నుండి తానే గెలుస్తానని.. తాను ఇంట్లో ఉండి కూర్చొని గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టించుకోరని తలసాని చెప్పారు. అంతేకాదు నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు తెలిపిన నేపథ్యంలో తలసాని దాని గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ఇంటి విలువ కేవలం రూ 23 లక్షలేనా.. నేను రూ.3 కోట్లు ఇస్తాను చంద్రబాబు తన ఇంటిని అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వారు తెలిపిన ఆస్తుల వివరాలు అంతా ఒట్టిదే అని విమర్శించారు.

అసెంబ్లీ ముందే రైతు ఆత్మహత్యాయత్నం

అన్నదాతల ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే, ఓ రైతు ఏకంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ పైకెక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, వ్యవసాయంలో నష్టం రావడంతో తనకు రెండు లక్షల రూపాయలు అప్పు అయ్యిందని, దాన్ని ఎలా తీర్చాలో తెలియడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులకు తన గోడును వెళ్లబోసుకోవడానికి వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక తనకు చావే శరణ్యమంటూ సెల్ టవర్ పైనే పురుగుల మందు తాగేశాడు, దాంతో అసెంబ్లీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది, అయితే పురుగుమందు తాగిన రైతు సమ్మయ్యను అతికష్టంమీద కిందికి దించిన పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు, సమ్మయ్య...వరంగల్ జిల్లా నెక్కొండ వాసిగా గుర్తించారు.

కేటీఆర్ కు అక్బరుద్దీన్ కౌంటర్.. కాపాడిన హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు రైతుల ఆత్మహత్యలపై చర్చ జరుపుతున్న నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు ఆత్మహత్యల అంశంపై ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆపని ఒక్క అక్బరుద్దీనే చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మూడు ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది అంటున్నారు.. ప్రతి ప్రాంతంలో పంట పొలాలకు నీరందితే అత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని నిలదీశారుయ. అయినా రైతుల ఆత్మహత్యలను ప్రకృతి మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.. మరి వర్షాలు పడిన ప్రాంతంలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఏ మంత్రి నియోజక వర్గంలో ఎంత మంది రైతులు చనిపోయారో కూడా చెప్పారు. కేటీఆర్ నియోజకవర్గంలో 18 ఆత్మహత్యలు - ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో 15 - హరీష్ రావు నియోజకవర్గంలో 11 - చందూలాల్ నియోజకవర్గంలో 11 మంది - మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో 10 - జూపల్లి ప్రభాకర్ నియోజకవర్గంలో 10 - లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు దీంతో మంత్రులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే అక్బరుద్దీన్ రైతు ఆత్మహత్యల గురించి మాట్లడుతున్న సమయంలో టీఆర్ఎస్ నాయకులు నవ్వుతుండగా.. అక్బరుద్దీన్ నేను రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందా.. మీ వ్యవహారాన్ని ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఐటీ మంత్రి కేటీఆర్ కల్పించుకొని మేమేమి నవ్వడంలేదు..రైతుల ఆత్మహత్యలపై మేము కూడా సీరియస్ గానే ఉన్నామని.. మీరేం మాట్లాడినా సూటిగా మాట్లాడాలని అన్నారు. దీనికి అక్బరుద్దీన్ కూడా కేటీఆర్ కు ఘాటుగా సమాధానమిచ్చారు. తామేమి సూటిగా మాట్లాడలేదో చెప్పండి అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. అంతేకాదు కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీ నేతలకు చెప్పుకోండి అంటూ చురకలు అంటించారు. దీంతో కేటీఆర్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియక అవస్తపడుతుండగా ఇంతలో హరీశ్ రావు కల్పించుకొని ఒక్క నేతకు ఇంత సమయం ఇస్తే ఎలా అంటూ స్పీకర్ ను కోరడంతో స్పీకర్ అక్బరుద్దీన్ ను త్వరగా ముగించాలని కోరారు. మొత్తానికి బావ పడుతున్న అవస్త చూసి హరీశ్ ముందే తేరుకొని చాలా చక్కగా పరిస్థితిని చక్కదిద్దారు.  

అక్బరుద్దీన్ ఓవైసీ - మంత్రి కేటీఆర్ మధ్య గొడవ

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది, తాను మాట్లాడుతుండగా కొందరు సభ్యులు నవ్వుతున్నారంటూ అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేయడంతో వివాదం మొదలైంది. అంతేకాకుండా రైతు ఆత్మహత్యలపై మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఓవైసీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.... మీడియా కోసమో, ప్రజలను అట్రాక్ట్ చేయడం కోసమో అక్బరుద్దీన్ మాట్లాడుతున్నట్లుందని కౌంటర్ ఇచ్చారు. పెద్ద గొంతేసుకుని మాట్లాడినంత మాత్రాన అవన్నీ నిజాలైపోవని అన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు అక్బర్ తీవ్ర అభ్యంతరం చెప్పారు, స్పీకర్ అధికారాలను కేటీఆర్ తీసుకుంటున్నారని విమర్శించారు, దానికి కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చిన కేటీఆర్... రైతు ఆత్మహత్యల సమస్యపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, మిగతా పక్షాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అక్బర్ వ్యాఖ్యలపైనే వివాదం వచ్చిందన్నారు, అయితే ఎంఐఎం, టీఆర్ఎస్ పరోక్షంగా మిత్రపక్షాలంటూ బీజేపీ విమర్శలు చేసిన తరుణంలో అక్బర్-కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరగడంతో ఈ రెండు పార్టీల మధ్యా ఎక్కడో సత్సంబంధాలు దెబ్బతిన్నాయేమోనని చెవులు కొరుక్కుంటున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలోకి?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ టీడీపి తీర్ధం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయనకు ప్రశంసలు సంగతి దేవుడెరుగుకాని విమర్శలే ఎక్కువ మోశారు. దానికి తోడు అప్పుడే రాష్ట్రవిభజన జరగడం.. ఒకవైపు తాను సమైక్యాంధ్ర అంటూ ఉన్నా కాని రాష్ట్రం విడిపోవడంలో కేంద్రానికి సపోర్టు చేశారనే ప్రజలు తిట్టిపోసుకున్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కిషోర్ కుమార్ అన్నీ తానై చూసుకునేవారు. తరువాత రాష్ట్రం విడిపోవడం ఆయన వేరే పార్టీ పెట్టడం జరిగాయి. అప్పుడు  పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచి  వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆతరువాత ఇద్దరూ దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ కిషోర్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈవార్తల నేపథ్యంలో మరో వార్త షికారు చేస్తుంది.  తమ్ముడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేసి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నారట. చూద్దాం ఇందులో ఎంత నిజముందో.

మోడీని రాష్ట్రపతి చేసిన ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రపతిని చేశారు. ఎప్పుడు ఎలా అనుకుంటున్నారా. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతం పలికారు. అయితే ఆయన మోడీకి స్వాగతం పలికే క్రమంలో ‘వెల్‌కమ్ ప్రెసిడెంట్ మోడీ' అన్నారు. వెంటనే పక్కన ఉన్న అధికారులు ఇది గమనించి తప్పును సరిచేశారు. అయితే భేటీ సందర్భంగా మళ్లీ మోడీ ప్రెసిడెంట్ అనే సంబోధించడం జరిగింది.. ‘ప్రెసిడెంట్ మోడీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది' అని ఒబామా చెప్పారు.. అయితే ఈ వీడియోను వైట్‌హౌస్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయగా అప్పుడు ఆవ్యాఖ్యలు విన్న సిబ్బంది నాలుక కరుచుకొని అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.