రోజాకి దిమ్మతిరిగే షాక్.. అలవెన్సులను నిలిపివేయాలని నిర్ణయం

  ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించవద్దని ప్రివిలేజ్ కమిటీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రోజాకు మరోషాక్ తగిలింది. ఇకపై రోజాకు ఎమ్మెల్యే హోదాలో అందుతున్న అలవెన్సులను కూడా నిలిపివేయాలని ప్రివిలేజ్ కమిటీ నివేదికను అందజేసింది. హైకోర్టు రోజా సస్సెన్షన్ ను కొట్టివేసిన నేపథ్యంలో దానిని తప్పు పడుతూ రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ.. అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు సభా నియమాలకు విఘాతమేనని తేల్చి చెప్పిన కమిటీ, రోజాపై సస్పెన్షన్ కరెక్టేనంటూ చెప్పింది. అక్కడితో ఆగకుండా..  రోజాకు అందుతున్న అలవెన్సులను నిలిపివేసి కఠినంగా వ్యవహరించాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది.

ఆర్థికాభివృద్ధి కోసమే వడ్డీరేట్లు తగ్గించాం- అరుణ్‌ జైట్లీ

ప్రభుత్వం పీపీఎఫ్‌, కిసాన్ వికాస పత్ర వంటి పొదుపు పథకాలన్నింటి మీదా గత వారం వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే! మనుపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) మీద 8.7 శాతం వడ్డీ లభిస్తుండగా దాన్ని ఏకంగా 8.1 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 8.7% ఉన్న కిసాన్‌ వికాస పత్రాల మీద వడ్డీ ఇప్పడు 7.8%గా మిగిలింది. పోస్టాఫీసుకి సంబంధించిన పొదుపు పథకాలన్నింటి మీదా వడ్డీలు ఇలాగే తగ్గుముఖం పట్టాయి. ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి మనుషుల ఆశల మీద ప్రభుత్వం నీరు చల్లిందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ‘కష్టపడి జీవించే మధ్యతరగతి జీవుల మీద ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టిందంటూ’ రాహుల్‌ గాంధి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగానే వడ్డీరేట్లలో మార్పులు చేస్తూంటామని ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్లో రుణాల వడ్డీ తక్కువగా ఉంటే, పొదుపు రేట్లు అంతకంటే ఎక్కువగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నాగానీ ఒక స్థిరమైన ఫార్ములా ప్రకారమే ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటామని వివరించారు.

రిజర్వేషన్ల కోసం.. నిన్న జాట్లు.. నేడు రాజ్ పుట్లు

  రిజర్వేషన్ల కోసం రోజుకో ప్రాంతంలో రోజుకో ఉద్యమం మొదలవుతుంది. మొన్నటి వరకూ తమకు రిజర్వేషన్లు కావాలని జాట్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాజ్ పుట్లు కూడా ఉద్యమానికి తెరతీయనున్నాయి. తమకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని గళమెత్తుతున్నారు. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన బిజ్నూర్, ముజఫర్ నగర్ ల కేంద్రంగా ‘రవా రాజ్ పుట్ సేవా సమితి’ ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర జనాభాలో 7 శాతం ఉన్న రాజ్ పుట్లు ఆర్థికంగానే కాక సామాజికంగానూ అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నారని సమితి ప్రతినిధి దేవేంద్ర కుమార్ చెప్పారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తో తమ ప్రతినిధి బృందం త్వరలో సమావేశం కానుందని, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కుమార్ చెప్పారు. మరి వీరి ఉద్యమం ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో..

మోదీ అసలు రంగు బయటపడింది... రాహుల్

ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన తొమ్మది మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బీజేపీలో చేరిపోవడంతో రాహుల్‌ గాంధి కారాలుమిరియాలు నూరుతున్నారు. సదరు తొమ్మది మంది ఎమ్మెల్యేలూ పార్టీ మారడం వల్ల, ఇప్పుడు అక్కడ బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. త్వరలోనే ఆ పార్టీ అక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొదట అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అధికారం ఇలాగే కాంగ్రెస్‌ చేజారిపోగా, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ అదే చరిత్ర పునరావృతం కావడంతో రాహుల్ గాంధి తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. తన ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు ఆయన ట్విట్టర్‌ బాట పట్టారు. ‘డబ్బు, అధికారంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని బీజేపీ అన్యాయంగా పడగొడుతోందని’ ఆయన విరుచుకుపడ్డారు. ‘అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పరిణామాలు, మోదీజీ అసలు రంగుని బయటపెడుతున్నాయ’ని విమర్శించారు. కానీ బీజేపీ వాదన మాత్రం వేరేగా ఉంది. రాష్ట్రాలలో ఉండే కాంగ్రెస్ నేతల వెతలను సోనియా, రాహుల్‌గాంధిలు పట్టించుకోరనీ... అందుకే విసిగివేసారిన రాష్ట్రనేతలు తమ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ గట్టు దాటే గుట్టు మాత్రం పెరుమాళ్లకెరుక!

గోదావరి నీళ్లతో కాళ్లు కడుగుతామన్న రైతులు.. వద్దన్న కేసీఆర్..

  తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఏదైనా పని చేస్తానని చెబితే అది ఖచ్చితంగా చేసి తీరతారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్నలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలో నీటి సమస్యలకు గాను.. సాగు నీటి పథకాలకుగాను..  సీఎం కేసీఆర్ ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే పలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది రైతులు గోదావరి జలాలను కలశాల్లో తీసుకుని ర్యాలీగా హైదరాబాదుకు వచ్చి.. అక్కడి నుండి నేరుగా సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే వారి రాకను తెలుసుకున్న కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఇంతటి గొప్ప పనిచేసిన మీ కాళ్లను గోదావరి జలాలతో కడుగుతామంటూ రైతులు కేసీఆర్ వద్దకు వచ్చారు. అయితే, కేసీఆర్ వారిని వారించి గోదావరి జలాలున్న కలశాలను అక్కడి బల్లపై పెట్టించారు.

టీడీపీ నేతలు మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టీడీపీ నేతలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు నగర శివారు యాదమరి మండలం ముత్తిరేవుల క్రాస్ వద్ద చెన్నై-బెంగళూరు హైవేపై లారీ-బోలేరు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కుప్పంలోని శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, పార్టీ నేతలు బాలకృష్ణ, సురేశ్ లు మృతి చెందగా.. సర్పంచ్ గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈప్రమాదం గురించి తెలుసుకున్న చంద్రబాబు, లోకేశ్ లు షాక్ కు గురయ్యారు. వెంటనే పార్టీ చిత్తూరు జిల్లా నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న వారిద్దరూ చనిపోయిన పార్టీ నేతల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఇండియాతో ఓడిపోయినందుకు ఆఫ్రిదిపై వేటు

  టీం ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ మరీ చెత్తగా ఏమీ ఆడలేదు. కానీ ఆ ఓటమి హీట్ మాత్రం కెప్టెన్ కు గట్టిగా తగలబోతోంది. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటతో సంబంధం లేకుండా, ఆఫ్రిదిని కెప్టెన్ గా, వకార్ ను కోచ్ గా తప్పించాలని డిసైడైపోయిందట పాకిస్థాన్ బోర్డు. దీనిక సంబంధించిన కథనాలు ఆ దేశ మీడియాలో వెలువడుతున్నాయి. వరల్డ్ కప్ గెలిచినా కూడా, ఈ నిర్ణయంలో మార్పు లేదట. కానీ నిజానికి, ఆఫ్రిదిని తప్పించడం వెనుక, పాక్ కంటే భారత ప్రేక్షకులే తమపై ఎక్కువ ప్రేమను చూపిస్తారని ఆఫ్రిది ఇచ్చిన స్టేట్ మెంటే కారణమని తెలుస్తోంది. ఆ స్టేట్ మెంట్ పై పాక్ ప్రజలే కాక, బోర్డు కూడా గుర్రుగానే ఉంది. ఆ స్టేట్ మెంట్స్ ఆఫ్రిది కెరీర్ నే ముగిసిపోయేలా చేసినట్టున్నాయి. ఈ వరల్డ్ కప్ తర్వాత ఆఫ్రిది మళ్లీ పాక్ కు ఆడటం అనుమానమే..

పోరాడి ఓడిన పసికూన ఆప్ఘాన్, సౌతాఫ్రికా గెలుపు

  సౌతాఫ్రికాతో మ్యాచ్ లో 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ పోరాడి ఓడింది. టోర్నీ ఓడిపోయినా, అందరి మనసులూ గెలుచుకుంది. బ్యాటింగ్ లో ఓపెనర్ మొహ్మద్ షాజాద్ ఇరగదీశాడు. కేవలం 19 బంతుల్లో 44 పరుగులతో సఫారీలకు చెమటలు పట్టించాడు. తర్వాత వచ్చిన వాళ్లు కూడా ధాడిగా ఆడటానికి ప్రయత్నించి అవుటయ్యారు. 20 ఓవర్లలో, సౌతాఫ్రికా లాంటి బౌలింగ్ లైనప్ పై 172 పరుగులకు ఆలౌట్ అయింది ఆఫ్ఘాన్ టీం. ఓడిపోయినా, తమ పోరాటంతో అందర్నీ ఆకట్టుకుంది. సఫారీ బౌలర్లలో రబాడా, అబ్బాట్, తాహిర్ లకు తలో రెండు వికెట్లు లభించగా, క్రిస్ మోరిస్ 4 వికెట్లతో రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా క్రిస్ మోరిస్ కే లభించింది.  

పసికూనకు సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్యం, డివిలియర్స్ వీరంగం

  వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో, సౌతాఫ్రికా చెలరేగిపోయింది. వరసగా రెండో సారి ప్రత్యర్ధి టీం కు 200 పైగా స్కోరును నిర్దేశించింది. డివిలియర్స్ (29 బంతుల్లో 64) వీర విహారం చేశాడు. బ్యాటింగ్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ బ్యాట్ ఝళిపించడంతో, టోర్నీలో వరసగా రెండో సారి 200 స్కోరును దాటగలిగింది సౌతాఫ్రికా. ఈ ఘనత సాధించిన మొదటి టీం సౌతాఫ్రికాయే కావడం విశేషం. ఇంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 229/4 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శనతో, సౌతాఫ్రికా ఓడిపోయింది.

భారీగా బరువు తగ్గిపోయిన అంబానీ కొడుకు

భారతదేశానికి కుబేర కుటుంబం అంబానీ ఫ్యామిలీ. దేశంలో అంబానీలు అడుగుపెట్టని రంగమే లేదు. డైరెక్ట్ గానో, ఇన డైరెక్ట్ గానో చాలా వాటిలో వీళ్ల భాగస్వామ్యం ఉంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ల టైం లో మీరు అంబానీ తనయుడిని చూశారా. భారీ కాయంతో ఉన్న ఆ అంబానీ వారసుడి పేరు అనంత్ అంబానీ. చిన్నప్పటి నుంచి అతి గారాబం కారణంగా, కాస్త ఒళ్లు చేశాడు. అతని వెయిట్ గురించి కామెంట్స్ చేయవద్దని, అప్పట్లో ముఖేష్ అంబానీ మీడియాకు రిక్వెస్ట్ లు, ఆర్డర్లు కూడా పాస్ చేశాడు. లేటెస్ట్ గా ఈ అనంత్ అంబానీ 70 కేజీల బరువును తగ్గించేశాడు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో మీరే చూడండి.   అంతకు 140 కేజీలున్న వాడు కాస్తా, ఇప్పుడు 70 కేజీలకు వచ్చేశాడు. తాజాగా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయానికి దర్శనానికి వచ్చిన అంబానీని చూసి, అందరూ షాకయ్యారు. ఒక అమెరికన్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలోనే, కష్టపడి తన బరువును కరిగించాడట అనంత్ అంబానీ. అనంత్ కాకుండా ముఖేష్ అంబానీకి ఆకాశ్ అంబానీ , ఇషా అంబానీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

టీం ఇండియా బోణీ, చితగ్గొట్టిన కోహ్లీ

  టి20 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్ధి పాక్ పై కష్టమైన పిచ్ మీద కూడా అద్భుతంగా రాణించాడు కోహ్లీ. తనను ఛేజింగ్ కింగ్ అని ఎందుకంటారో ప్రూవ్ చేసుకున్నాడు. తనకు అలవాటైన చివరి బాల్ సిక్స్ బదులు, లాస్ట్ బట్ వన్ బంతిని సిక్స్ కొట్టి ధోని లాంఛనాన్ని పూర్తి చేశాడు. నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా నిలిచి గెలిచింది.18 ఓవర్లలో 119 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 6 వికెట్లతో గెలుపొందింది. విరాట్ పోరాటం అతని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుంది. కష్టమైన పిచ్, పాకిస్థాన్ తో మ్యాచ్, పెవిలియన్ కు క్యూ కడుతున్న సహచరులు, ఇలాంటి సమయంలో టీం కు ఇరుసులా నిలిచి 37 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కోహ్లీ. ఒకానొక టైం లో, న్యూజిలాండ్ మ్యాచ్ రిపీట్ అవుతుందని భారత అభిమానులు భయపడినా, కోహ్లీ ఉన్నంత వరకూ ఏం కాదులే అన్న భరోసాతో ఉన్నారు. నిజంగానే కోహ్లీ తనకు అలవాటైన రీతిలోనే మళ్లీ ఇండియాను గెలిపించాడు. 18 ఓవర్ల ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారత అద్భుత బౌలింగ్ వల్ల 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ లో అహ్మద్ షెహజాద్ (25), షోయబ్ మాలిక్ (26), ఉమర్ అక్మల్ (22) రాణించారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, జడేజా, రైనా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. టీం ఇండియా ఇన్నింగ్స్ లో రోహిత్ (10, 11 బంతుల్లో) అనవసర షాట్ కు అవుటైతే, ధావన్ (6, 15 బంతుల్లో) పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ ఎప్పటిలాగే, తన ఛేజింగ్ కింగ్ పేరును నిలబెట్టుకున్నాడు. అతని 55 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. యువరాజ్(24, 23 బంతుల్లో) ఫామ్ లో ఉన్నట్టే కనిపించినా, త్వరగా గేమ్ ను ముగించే ప్రయత్నంలో అవుటయ్యాడు. చివర్లో వచ్చిన ధోనీ (13, 9 బంతుల్లో) నాటౌట్ గా నిలిచాడు. ఓవరాల్ గా పాయింట్స్ పట్టికలో అకౌంట్ ఓపెన్ చేసిన టీం ఇండియా,రెండు మ్యాచ్ ల్లో, ఒక గెలుపు, 2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్ లూ గెలిచిన న్యూజిలాండ్ టాప్ లో ఉండగా, రెండు మ్యాచ్ లాడి ఒకటే గెలిచి పాయింట్లలో ఇండియాతో సమానంగా ఉన్నా, మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది పాకిస్థాన్. నాలుగు ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ రెండు టీమ్ లు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు.

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా

  వరల్డ్ టి20లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో టీం ఇండియా టాస్ గెలిచింది. బహుశా డ్యూ గురించిన ఆలోచన ఉందో ఏమో గానీ, ఛేజింగ్ నే ఇష్టపడ్డాడు ఇండియా సారధి. మొదట బౌలింగ్ తీసుకున్నాడు. మరో వైపు తమ టీం బాగా ఆడుతుందనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు ఆఫ్రిది. తన టీం మీద విశ్వాసముంచాడు ధోనీ. ఏ మార్పులు చేయకుండా అదే టీంతో బరిలోకి దిగుతున్నాడు. పాకిస్థాన్ కూడా గత మ్యాచ్ లో గెలిచిన టీం లో స్పిన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం ను తప్పించి మొహమ్మద్ సమీని తీసుకుంది.కాసేపట్లోనే మ్యాచ్ మొదలుకానుంది. మ్యాచ్ ను 18 ఒవర్లకు కుదించారు.

వర్షం కారణంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లేట్

  కోల్ కతా లో దాయాదుల పోరు ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంటే, వర్షం ఆ ఎదురుచూపులను మరింతగా పెంచింది. టాస్ తో పాటు మ్యాచ్ ను కూడా అరగంట ముందుకు జరిపారు. గుడ్ న్యూస్ ఏంటంటే, నిజంగా ఎనిమిదింటికల్లా మ్యాచ్ మొదలైపోతే, ఫుల్ కోటా ఓవర్లతో మ్యాచ్ జరగడం కన్ఫామ్. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయింది. కోల్ కతా వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ మ్యాచ్ గురించే చర్చ వినిపిస్తోంది.   కేవలం దాయాదుల పోరు మాత్రమే కాక, ఈ మ్యాచ్ గెలవడం భారత్ కు అత్యావశ్యకం కూడా. అందుకే ఇది టీం ఇండియా అభిమానులకు చాలా ఉత్కంఠ కలిగించే మ్యాచ్ గా మారింది. పిచ్ బ్యాటింగ్ ట్రాక్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ ను ఎంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరో వైపు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా పాకిస్థాన్ విమెన్ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డొచ్చాడు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్ టీం 2 పరుగులతో గెలుపొందింది. మెన్ ఇన్ బ్లూ మాత్రం, ఆ ఫలితాన్ని ఇక్కడ రానివ్వకుండా జాగ్రత్త పడతామంటున్నారు. కాసేపట్లోనే సమరానికి తెరలేవనుంది.

మ్యాచ్ జరుగుతుందోచ్.. దేశ వ్యాప్తంగా పూజలు..

టీ 20 భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ జరుగుతుందా.. లేదా అన్న అనుమాలకు తెర పడింది. అయితే అలాంటి సందేహాలు ఏం వద్దు.. మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సిబ్బంది తెలిపారు. ఈరోజు ఉదయం కోల్ కతాలో భారీ వర్షం కురవడంతో ఈ అనుమానాలు తలెత్తాయి. మరోవైపు ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా ఈ మ్యాచ్ ఫీవర్ పీక్స్ కి వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. కొంత మంది ఏకంగా ఇండియా గెలవాలని పూజలు కూడా చేసేస్తున్నారు. మరి ఇంకో రెండు గంటల్లో జరగబోయే మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరు విజయ కెరటం ఎగరేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.