అదే మా విజయ రహస్యం- ధోని

టి-20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో ఇండియా కీలక పోరు. ఇందులో ఓడినవారు ఇంటిబాట పట్టక తప్పదు. గణాంకాలన్నీ ఇండియాకు అనుకూలంగా ఉన్నా, అప్పుడప్పుడూ అద్భుతాలు సాధించే సత్తా బంగ్లాకు ఉంది. అనుకున్నట్లే ఆట సాగుతుండగా బంగ్లాది పైచేయిగా కనిపిస్తోంది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే చాలు, మ్యాచ్‌ బంగ్లా కైవసం అవుతుంది. అలాంటప్పుడే ధోని చకచకా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇటు సింగిల్‌ కానీ, అటు భారీ షాట్ కానీ ఆడేందుకు అవకాశం లేకుండా ఫీల్డర్లను మోహరించాడు. ఇలాంటి సమయంలో బ్యాట్స్‌మెన్‌ కంగారుపడి బాల్‌ని కొట్టకపోయినా, పరుగు కోసం బయల్దేరతాడని ధోనీ అనుభవం చెబుతోంది. అందుకే బ్యాట్స్‌మెన్‌ను రనౌట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ధోనీ ఊహించినట్లే జరిగింది. లేని పరుగు కోసం పరుగులెత్తి రనౌట్‌ అయ్యాడు బంగ్లా ఆటగాడు. ఒక్క పరుగుతో ఇండియా విజయాన్ని దక్కించుకుంది. ‘క్లాసులో ఉన్నవాడు ఎవ్వడైనా ఆన్సర్‌ చెబుతాడు, కానీ ఎగ్జామ్‌లో రాసేవాడే టాపర్‌ అవుతాడు’- జులాయి సినిమా క్లైమాక్సులో అల్లు అర్జున్‌ డైలాగుని విన్నాడో లేదో కానీ, బంగ్లా మ్యాచ్‌ తరువాత ధోనీ ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఆడగలిగితే ఫలితం దక్కుతుందని’ అంటున్నాడు. తన దగ్గరకు వచ్చి చాలామంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారనీ... అవన్నీ దృష్టిలో ఉంచుకుని చివరికీ తాను నిర్ణయం తీసుకుంటాననీ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు జోరు మీద ఉన్నప్పుడే తాను ఆఖరి ఓవరు ఎవరితో ఎలా వేయించాలో నిర్ణయించుకున్నాని వెల్లడించాడు. మొత్తానికి ధోనిని మిస్టర్‌ కూల్‌గా ఎందుకు పిలుస్తారో, ప్రపంచానికి అర్థమైపోయి ఉంటుంది.

బాల్‌థాకరేను చంపే ప్రయత్నం జరిగింది- హెడ్లీ

ముంబై కోర్టు ముందు ఇదివరకు ఎన్నో సంచలనాలను ప్రకటించిన లష్కర్‌ తీవ్రవాది డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ, మరో వార్తని పేల్చాడు. శివసేన నాయకుడు బాల్‌థాకరేను చంపాలని ఒకప్పుడు లష్కర్‌ ఏ తయ్యబా సంస్థ పథకం వేసిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ పథకాన్ని అమలుచేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో, పని జరగలేదట. పోలీసుల కస్టడీలో ఉన్న సదరు నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తేలింది.   శివసేన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, తాను కూడా వారి కార్యాలయాన్ని సందర్శించినట్లు హెడ్లీ చెప్పాడు. గత విచారణలో పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాద సంస్థల గురించీ, ఆ సంస్థలతో అక్కడి ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాల గురించీ చెప్పుకొచ్చిన హెడ్లీ... ఈసారి విచారణలో మరెన్ని సంచలనాలు ప్రకటిస్తాడో చూడాలి. ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్న హెడ్లీని భారతదేశానికి తీసుకురాగలమా లేదా అన్నది, అతను వెల్లడించే వివరాల మీదే ఆధారపడి ఉంది.

హిందువులని బెదిరించేందుకు గోహత్య... అమెరికాలో

  అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఓ సంఘటన ఆ దేశంలోని హిందువులను ఉలిక్కిపడేలా చేసింది. అక్కడ నిర్వహింపబడుతున్న ఓ గోసంరక్షణా కేంద్రం ముందు ఎవరో ఆగంతకులు, ఓ ఆవుతలని వదిలి వెళ్లారు. ఈ గోసంరక్షణా కేంద్రాన్ని న్యూయార్క సిటీ కళాశాలలో పనిచేసిన శంకరశాస్త్రి అనే పెద్దాయన 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టారట. అమెరికాలో శాంతియుతంగా నివసిస్తున్న హిందువులను బెదిరించేందుకు, నిందితులు ఈ చర్యకు పాల్పడినట్లు అక్కడి హిందూ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయమై కేసును నమోదు చేసి దర్యాప్తుని మొదలుపెట్టారు. కానీ శంకర శాస్త్రిగారు మాత్రం ఈ విషయం మీద ప్రశాంతంగానే ఉన్నారు. హిందువులకు గోవు ఎంత పవిత్రమైనదో తెలియనివారు ఇలా చేసి ఉంటారనీ, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా తాము గో ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ విషయం మరింత వివాదాస్పదం కాకూడని ఆయన కోరుకున్నారు. అందరి ఆశా అదే!

నీ భార్యని బద్నాం చేస్తా... ట్రంప్‌!

అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలనే అంశం ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయింది. ఆ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికలలో నిలబడేందుకు డొనాల్డ్ ట్రంప్‌, టెడ్‌ క్రూజ్‌ల మధ్య మంచి వేడి రాజుకుంది. అయితే ఈ విషయంలో భారతీయ నేతలు కూడా గర్వించేలా సదరు అభ్యర్థులు దిగజారుతున్నారు. తాజాగా ఓ వెబ్‌సైట్, ట్రంప్ భార్య ఉన్న ఓ నగ్న చిత్రాన్ని విడుదల చేసింది. ‘మీరు కనుక ట్రంప్‌ను ఎన్నుకొంటే, ఈమెను అధ్యక్షులవారి భార్యగా అంగీకరించాల్సి వస్తుంది’ అంటూ సదరు వెబ్‌సైట్‌ జనాల్ని హెచ్చరించింది. ఈ ఫోటోని చూసిన ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. ఇదంతా నీ పనేనంటూ క్రూజ్‌ మీద మండిపడ్డాడు. ‘నా భార్య జోలికి వస్తే, నీ భార్యని కూడా బద్నాం చేస్తా!’ అంటూ హెచ్చరించాడు. దీనికి క్రూజ్‌ కూడా ఘాటుగానే స్పందించాడు. తమకీ ఫొటోకీ ఏ సంబంధమూ లేదనీ, నా భార్య జోలికి వస్తే నీకంటే పిరికిపంద మరెవ్వరూ ఉండరని బదులిచ్చాడు. ఎన్నికల సంగతేమో కానీ, అమెరికాకు కాబోయే ఈ అధ్యక్షులని చూసి మాత్రం ప్రపంచం నవ్వుకుంటోంది. ఏమో నవ్విన నాపచేను పండే రోజులే వస్తాయేమో!

క్రికెట్ కామెంటేటర్‌గా షారుక్.... ఈరోజే!

టి-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య  ఇవాళ జరగనున్న పోటీ ఇరుజట్లకీ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు, పోటీ నుంచి నిష్క్రమించాల్సి రావచ్చు. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ మీద గెలుపొందిన ఊపుతో ఉన్న భారత్‌, వరుస పరాజయాలతో నిండిన బంగ్లాదేశ్ మీద గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి తోడు బంగ్లాదేశ్‌ బౌలర్లు తస్కిన్‌, అరాఫత్‌లు ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.   ఎటు చూసినా భారత్‌కు విజయ సంకేతాలు కనిపిస్తున్న ఈ సందర్భంలో, షారుక్‌ ఖాన్‌ కూడా పాలుపంచుకోనున్నట్లు సమాచారం. నేడు ఆయన కపిల్‌దేవ్, షోయబ్‌ అక్తర్‌లతో కలిసి అరగంట పాటు కామెంట్రీని చెప్పనున్నారట. కోల్‌కతాలో జరిగిన భారత్‌-పాక్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూడలేకపోయినందుకు షారుక్‌ ఇప్పటికే తెగ బాధపడిపోతున్నారు. అందుకే ఈసారి బెంగళూరులో జరగనున్న భారత్-బంగ్లా మ్యాచ్‌కు, కామెంట్రీ చెప్పి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోనున్నారు. భారత్‌లో అసహనం గురించి వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయిన షారుక్, ఇలాగైనా మళ్లీ నిలదొక్కుకుంటాడని ఆశిద్దాం!

ఉద్యోగం వెతుక్కో.... భర్తమీద భారం కావద్దు- ఓ కోర్టు తీర్పు

భార్యాభర్తలు విడిపోతే... భర్త, భార్యకి భరణంగా కొంత డబ్బుని అందిస్తూ ఉండటం సహజం. కానీ దిల్లీలోని ఓ కోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఒక విడాకుల కేసులో భర్తకంటే భార్య మంచి చదువు చదువుకున్నందుకు, ఆమెనే ఉద్యోగం వెతుక్కోమని సూచించింది. తను ఒక్కసారి కూడా ఉద్యోగం చేయలేదనీ, తోడు లేకుండా బయటకు వెళ్లే అలవాటు కూడా తనకి లేదని చెప్పిన బాధితురాలి మాటలను కోర్టు అంగీకరించలేదు. కోర్టు కేసు కోసం రోజూ రాగలిగినప్పుడు, ఉద్యోగం కోసం వెళ్లలేవా అంటూ తిరిగి ప్రశ్నించింది. ఎమ్మెస్సీలో బంగారు పతకం పొందిన సదరు స్త్రీకి, తప్పకుండా ఉద్యోగం చేసే అవకాశం ఉందని కోర్టు భావించింది. అందుకోసం అవసరమైతే ఆమె మాజీ భర్త సాయం కూడా తీసుకోవచ్చునని సూచించింది. ఒక ఏడాదిపాటు ఆమె భర్త 12,000 రూపాయలు చెల్లించాలనీ, ఈలోగా ఆమె ఒక ఉద్యోగంలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించాలని తీర్పునిచ్చింది. విడాకుల కేసులో ఇప్పటివరకూ ఇలాంటి తీర్పు రాలేదు కనుక, ఈ ఘటనను ఒక సంచలనంగా భావిస్తున్నారు.

పీడబ్యూఎఫ్ తో డీఎండీకే పొత్తు..

    తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీలన్ని ఎటువంటి పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు తెలిపాయి. అయితే విజయ్ కాంత్ కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో మరో మలుపు తిరిగింది. ఎండీఎంకే, పీడబ్యూఎఫ్ తో కలసి తాము పోటీ చేస్తున్నట్టు డీఎండీకే స్పష్టం చేసింది. మొత్తం 124 సీట్లకు తాము పోటీ చేయనున్నామని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ ఉంటారని ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిగతా సీట్లను పొత్తులోని ఇతర పార్టీలకు పంచుతామని పేర్కొంది.

ఉస్మానియా యూనివర్శిటీలో మృతదేహం.. విద్యార్దుల ఆందోళన

  ఉస్మానియా యూనివర్శిటీలో కలకలం రేగింది. వాటర్ ట్యాంక్లో దూకి ఆత్మహత్య చేసుకున్న మృతదేహం బయటపడటంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే విద్యార్ధి మృతదేహం తరలింపులో పోలీసులకు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదంటూ విద్యార్ధులు అడ్డుపడ్డారు. అయినా పోలీసులు వినకపోవడంతో వారిమధ్య గొడవ పెరగింది. దీంతో పోలీసులపై విద్యార్దులు రాళ్లు రువ్వారు. మరోవైపు వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ స్టూడెంట్ దే అంటూ స్టూడెంట్స్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ చేరుకున్న కన్నయ్య.. ఉద్యమాన్ని ఆపేది లేదు..

జెఎన్ యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేటి ఉదయం విమానంలో బయలుదేరి శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగిన కన్నయ్యకు సీపీఐ అగ్రనేతలు కె.నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నయ్య హెచ్ సీయూ రోహిత్ తల్లి, సోదరుడిని కలుస్తానని.. రోహిత్ తల్లి చేసే దీక్షకు మద్దతు తెలుపడానికే వచ్చానని.. కానీ హెచ్ సీయీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. రోహిత్ పేరిట చట్టం తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన ప్రకటించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే తాను హెచ్ సీయూకు వెళుతున్నానని.. ఇవాళ సాయంత్రం హెచ్ సీయూకి వెళతానని చెప్పాడు.   మరోవైపు హెచ్ సీయూలో ఇప్పటికే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్ధి సంఘాల వివిధ సమావేశాలతో అక్కడి వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

నా మాట విని ఉంటే ఈ దాడులు జరిగేవి కావు.... ట్రంప్‌

బెల్టియంలో అలా ఉగ్రవాదుల దాడులు జరిగాయో లేదో, ఇలా ట్రంప్ తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టాడు. కాకపోతే ఈసారి ట్రంప్‌కు తోడుగా మరో రిపబ్లికన్‌ అభ్యర్ధి టెడ్‌ క్రూజ్‌ కూడా తోడయ్యాడు. బెల్జియం దాడుల నేపథ్యంలో, అమెరికాలోని ముస్లింలు అధికంగా ఉండే చోట నిఘాని పెంచాల్సి ఉంటుందని వీళ్లిద్దరూ పేర్కొన్నారు. తరచూ ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్‌ను చూసి క్రూజ్‌ కూడా స్ఫూర్తిని పొందాడో ఏమో... ముస్లిం శరణార్థులు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలంటూ ప్రకటించారు. ఇక ట్రంప్ అయితే ఏకంగా తన మాట విని ఉంటే బెల్జియంలో బాంబులు పేలేవి కావని అన్నారు. ఇంతకీ ఆ మాట ఏమిటంటారా! పోలీసులకు ఎవరన్నా ఉగ్రవాదులు పట్టుబడితే, వారి నుంచి నిజాలను రాబట్టేందుకు, వారిని చిత్రహింసలకు గురిచేయాలన్నది ట్రంప్ ఉవాచ. గతంలో ప్యారిస్‌లో పట్టుబడిన ఉగ్రవాదిని కనుక చావచితక్కొట్టి ఉంటే, అతను బెల్జియం దాడులు గురించి చెప్పేసేవాడన్నది ట్రంప్ బాధ. ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవహక్కుల సంఘాలవారు ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మొదలుపెడితే, వాటికి ఎక్కువగా బలయ్యేది అమాయకులే అని వారి వాదన. కానీ ట్రంప్‌ ప్రజాదరణ పెరిగిపోవడం చూస్తుంటే, ఆయన మాటలతో ఏకీభవించేవారి సంఖ్య కూడా పెరుగుతోందని అనిపిస్తోంది.

పఠాన్ కోట్లో మరో ఘటన.. తుపాకి గురి పెట్టి కారు అపహరణ

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమానం స్థావరంపై ఉగ్రవాది జరిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా ఏదో ఒక సంఘటనతో నిరంతరం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మొన్నటకి మొన్న ఆ పరిసర ప్రాంతాల దగ్గర అనుమానంగా తిరుతున్న నేపథ్యంలో ఓ మహిళను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఓ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారును ముగ్గురు దుండగులు అడ్డుకుని తుపాకితో బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. దీంతో మరోసారి భద్రతా దళాలను పని పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పఠాన్ కోట్ - జమ్మూ జాతీయ రహదారిపై రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి తన కారులో వస్తుండగా, ఓ వ్యక్తి లిఫ్ట్ కోసం కారు ఆపాడని... అనంతరం ఆగిన కారులోని వ్యక్తికి తుపాకీ చూపి బెదిరించి, తనతో పాటు ఉన్న మరో ఇద్దరుతో పారిపోయాడని అన్నారు. అయితే వారు ఉగ్రవాదులు కారని చెప్పారు.

మాల్యాను పట్టుకోలేరుగానీ.... ఓ మహిళ ఆవేదన!

  లక్ష రూపాయలు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు అడిగే బ్యాంకులు, విజయ్ మాల్యాకు వేల కోట్లు ధారాదత్తం చేయడం గురించి భారతీయుల గుండెలు మండిపోతున్నాయి. దానికి ఇదిగో ఈ వార్తే సాక్ష్యం! ముంబైకు చెందిన ప్రేమ్‌లతా భన్సాలీ అనే 44 ఏళ్ల స్త్రీ మొన్న ఆదివారం ఓ మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఆమె దగ్గర టికెట్‌ లేకపోవడం గమనించిన రైల్వే తనిఖీ అధికారులు, భన్సాలీకి 260 రూపాయల జరిమానాను విధించారు. భన్సాలీ దాన్ని కట్టగలిగే స్తోమత ఉండి కూడా, తాను జరిమానా కట్టేందుకు నిరాకరించారు. పైగా మాల్యా నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలను రాబట్టండి, ఆ తరువాతే నేను జరిమానా కడతానంటూ వాదించడం మొదలుపెట్టారు. సామాన్యులని పీడించే అధికారులు, విజయ్ మాల్యా పట్ల అంత మెతకగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. దాంతో ఆమెను రైల్వే పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచవలసి వచ్చింది. న్యాయమూర్తి ముందు కూడా భన్సాలీ తన పాత వాదననే కొనసాగించారు. జరిమానాకు బదులుగా వారం రోజుల జైలు శిక్షనైనా అనుభవిస్తాను కానీ, చస్తే జరిమానా కట్టనని చెప్పుకొచ్చారు. దాంతో న్యాయమూర్తి ఆమెకు వారంరోజుల జైలుశిక్షను విధించక తప్పలేదు. మాల్యా పేరు చెప్పి ప్రభుత్వానికి నష్టం కలిగించడం తప్పే కానీ, మాల్యాను వదిలేసిన ప్రభుత్వం తమని మాత్రమే ఎందుకు శిక్షిస్తోందన్న సందేహం రావడంలో తప్పు లేదు కదా!

హెచ్ సీయూలో ఉద్రిక్తత.. భోజనం, నీరు కట్..రేపు హెచ్ సీయూకి కన్నయ్య..!

హెచ్ సీయూ వీసీ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్ధులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పారావు ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో విద్యార్ధులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో హెచ్ సీయూ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు హెచ్ సీయూలోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీసీ అప్పారావుకు మద్దతు పలికారు. విద్యార్ధులకు భోజనం, నీరు, విద్యుత్ ను నిలిపివేశారు.   ఇదిలా ఉండగా రేపు సాయంత్రం హెచ్ సీయూ కి జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ రానున్నట్టు తెలుస్తోంది. దీంతో హెచ్ సీయూ లో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సభకు అనుమతి నిరాకరించినట్టు సమాచారం.

క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయాల్లోకి.. ఎన్నికల్లో బీజేపీ తరపున..?

  త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. శ్రీశాంత్ ను ఎన్నికల్లో దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే..  బీజేపీ నాయకులు శ్రీశాంత్ను సంప్రదించారట. అయితే తన నిర్ణయాన్ని మాత్రం రేపు వెల్లడిస్తానని శ్రీశాంత్ చెప్పాడు. మరోవైపు త్రిపునితుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేయాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ఢిల్లీ నుంచి శ్రీశాంత్కు ఫోన్ చేశారని మాత్రం అతని కుటుంబసభ్యులు తెలిపారు.

సంస్కారం లేనివాళ్లు సభ నడుపుతున్నారు.. డీకే అరుణ వ్యాఖ్యలతో డిప్యూటీ స్పీకర్ కంటతడి..

అసెంబ్లీ తెలంగాణ సమావేశాల్లో డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. సంస్కారం లేనివాళ్లు సభను నడిపిస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించడంతో.. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి  కంటతడి పెట్టారు. దీంతో అధికార పక్ష పార్టీ నేతలు డీకే అరుణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చైర్ ను గౌరవించడం సభ్యుల బాధ్యత..ఈ సమావేశాల్లో ఎవరు మాట్లాడినా రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు.. ప్రతిపక్షాలు మాట్లాడటానికి చాలా సమయం ఇచ్చాం.. గత సమావేశాల్లో కూడా డీకే అరుణ మైక్ విసిరేశారు.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన ఏపీ అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరును కూడా గుర్తుచేశార. పక్క సభలో ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేసినందకుగాను.. ఏడాది పాటు సస్పెండ్ చేశారని.. కానీ మేం అలా చేయడం లేదు..క్షమాపణ మాత్రం చెప్పితీరాల్సిందే అని డిమాండ్ చేశారు. మరోవైపు నేను సంస్కారం లేదన్న పదం వాడలేదు.. ఉద్దేశ్యపూర్వకంగానే నాపై ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ అన్నారు.