ముగిసిన తిరుపతి గంగమ్మ‌ జాతర

తిరుపతి గంగమ్మ జాతర వేడుకగా ముగిసాయి.  బుధవారం ( మే 14) ఉదయం అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు కార్యక్రమంతో ఎనిమిది రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం అయ్యింది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంతం, రాష్ట్రం నలుమూలల నుంచే  కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా జనం పోటెత్తారు.  ఆలయంలోని విశ్వరూప స్తూపానికి గంగమ్మ విశ్వరూపాన్ని తయారు చేశారు.  ఆలయం ముందు బాగంగలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగళి, గొల్ల వంటి మిరాశిదార్లు పాల్గొంటారు. గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు   ఆచ్చారులకు అందించడం ఆనవాయితీ. అచ్చారులు నీలిమందునూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలిరంగును అద్దారు. బంగారు పూతపూసిన చేప ఆకారంలో చెక్కిన  ముక్కెరను అలంకరించారు. బంగారం రంగురేకుల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు. చెవులకు బంగారంలా మెరిసే సింగపూరు రేకుతో చేసిన కమ్మలు, జుంకీలను అలంకరిస్తారు. మంగళి వాళ్ళు గంగమ్మ బొమ్మ తలమీద తలవెనుక తెల్ల వెంట్రుకలను దారాల్లాగా పేర్చి, పొడవుగా వేలాడదీశారు. బంగారంలా ధగధగ మెరిసే సింగపూరు రేకుతోనే చేసిన నగిషీలు చెక్కిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. కిరీటం క్రింద మల్లెపూలతోను., కనకంబరాలతోను అలంకరించారు. గంగమ్మ నుదురు భాగమంతా ఎర్రని కుంకుమను పట్టీలా పెట్టారు.  నుదురు భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలను అమర్చారు. కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు. గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకొని ఉన్నట్లుగా రూపాని పెట్టారు. నోటినిండా ఎర్రకుంకుమను నింపారు. వెదురు రెబ్బలతో చేసిన పళ్ళను పెట్టారు. చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు కట్టారు. గొల్లవాళ్లే తెచ్చిన మంగళసూత్రాలను గంగమ్మ మెళ్ళో వేశారు. గంగమ్మ చీరకు ఒడిబాలును గొల్లవాళ్లే తెచ్చి పెట్టారు. కొద్దిసేపు బంగారు తాళిబొట్లును గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు. కింద వెండితో చేసిన కన్నులను అమర్చుతారు. వెండి కన్నుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కనుగుడ్లను మాత్రం చివరలో పెడ్తారు. నల్లగుడ్లను పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు భావిస్తారు. తెల్లవారు జామున పేరంటాలు తాతయ్య గుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తూనే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది. గంగమ్మ బొమ్మ దగ్గరుండే వారు పేరంటాలు వేషానికి హారతిచ్చి గంగమ్మ పూలహారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేశారు. తర్వాత చుట్టూ ఉన్న జనం, అరుపులు, కేకలు, కిలారింపులు అధికమయ్యాయి. పంబలవారు పంబను వాయిస్తూంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ, ఆవేశంతో, ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేయడాన్నే  "గంగమ్మ చెంప నరకడం" అంటారు. పేరంటాలు వేషం వెనక్కు వెళ్ళిపోతూ ఎదురుపడ్డ వారికి ఒడిబాలులోని అక్షింతల్ని ఇస్తారు. మొదటి తాతయ్యగుంట గంగమ్మ చెంప నరికి.. అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ చెంప నరకడంతో జాతర పూర్తి అయ్యింది. తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మ్రొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తం అయింది.

మూడ్ ఆఫ్ ది నేషన్ మారుతోందా?

నిజమే. కాల్పుల విరమణ  విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు, చివరకు బీజేపీ అభిమానులు, సామాన్యులు  కూడా తప్పు పట్టారు. ఒక విధంగా చూస్తే.. అంతవరకు సానుకూలంగా ఉన్న  ‘మూడ్ ఆఫ్ ది నేషన్’, ప్రతికూలంగా  మారిపోయింది. అంతవరకు  ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్ధించిన రాజకీయ పార్టీలు విమర్శలకు తెర తీశాయి. కాల్పుల విరమణకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చేసిన ట్వీట్లకు సంబంధించి విపక్షాలు చేసిన విమర్శలు, విశ్లేషణలi దేశం మూడ్  ను మరింతగా మార్చివేశాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం వ్యాపించింది. ప్రభుత్వం ఇరకాటంలో పడింది.   అయితే అదే సమయంలో ఇటు ప్రభుత్వం, అటు బీజేపీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి. గడచిన 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే..  ఇటు ప్రభుత్వం, అటు బీజేపీ నష్ట నివారణ  చర్యల వేగం పెంచినట్లు స్పష్టంవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి.. బీజేపీ ముందుగానే  మూడ్ అఫ్ ది నేషన్ ను పసిగట్టింది. కాల్పుల విరమణ నిర్ణయం సామాన్యుల నుంచి మేథావుల వరకు అందరినీ అసంతృప్తికి గురిచేసిందనే సత్యాన్ని కమల దళం ముందుగానే గుర్తించింది. అందుకే..  ఏ మాత్రం జాప్యం చేయకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సొంత పార్టీలో వినిపించిన అపశ్రుతులను సరి చేసేందుకు  చర్యలు తీసుకుంది.  అందులో భాగంగానే  తిరంగ యాత్ర  పేరిట పార్టీ క్యాడర్ ముందు ఒక కార్యక్రమాన్ని ఉంచిందని పార్టీ వర్గాలు  పేర్కొంటున్నాయి. మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే అంటున్నారు. మోదీ ప్రసంగం పార్టీని మళ్ళీ ఏక తాటిపైకి తీసుకు వచ్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే  కాల్పుల విరమణ నిర్ణయం పట్ల మరీ ముఖ్యంగా అమెరికా ఆదేశాలతో మోదీ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారని జరిగిన ప్రచార ప్రభావాన్ని మోదీ ప్రసంగం కొంతవరకు తగ్గించగలిగిందని అంటున్నారు. అలాగే..  మోదీ ప్రసంగానికి కొనసాగింపుగా  భారత విదేశాంగ శాఖ  మంగళవారం(మే 13) ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ, జమ్మూ కశ్మీర్ వ్యవహారం, అమెరికా జోక్యంకు సంబంధించి మరింత స్పష్టత ఇచ్చిందిని అంటున్నారు.  అందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ శాఖ మరో మారు స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ప్రతిపాదత పాకిస్థాన్ నుంచే వచ్చిందని దానిపై డీజీఎంవోల సమావేశంలో చర్చించి  నిర్ణయంతీసుకున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాగే.. పరోక్షంగానే అయినా  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చేసిన చప్పుళ్ళకు జైస్వాల్ సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో భారత్, అమెరికా నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదని చెప్పారు. ఇక సింధూ   జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. కాశ్మీర్‌పై తమ విధానం మారలేదని తెలిపారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఎంత మాత్రమూఆమోదించబోమని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి..  నో ..థాంక్స్ అని చెప్పకనే చెప్పారు. అదలా ఉంటే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (మే 13)  ఉదయం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌ బేస్‌ను సందర్శించి, జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకుని వారి ధైర్యసాహసాలను అభినందించారు. ఈ సందర్భంగా పాక్ నడ్డివిరిచిన ఎస్-400 (S-400) మిసైల్ బ్రాక్‌ డ్రాప్‌లో వీర జవాన్లకు ప్రధాని సెల్యూట్ చేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అదొకటి అయితే ప్రధాని అదంపూర్ విమానాశ్రయం పర్యటించడం ద్వారా, అదంపూర్ ఎయిర్‌బేస్‌ను తుత్తినియలు చేసినట్టు పాక్ చేస్తున్న అసత్య ప్రచానికి మోదీ ప్రత్యక్షంగా సమాధానం ఇచ్చారు. అదంపూర్ ఎయిర్ బేస్‌లోని రన్‌వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని పాక్  సాగించిన అసత్య ప్రచారాన్ని మోదీ పర్యటన తుత్తునియలు చేసింది.   ఈ పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆపరేషన్ సిందూర్ ఫలాలు చేజారకుండా   కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని  అంటున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఎలా స్పందించాలనే విషయంలో స్పష్టత లోపించడం కూడా బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా శశి థరూర్, చిదంబరం, మనీష్ తివారీ వంటి సీనియర్ నాయకులు  పార్టీ లైన్ కు విభిన్నంగా స్పందించిన తీరు హస్తం పార్టీని ఇరకాటంలో పడేస్తే, కమల దళానికి కలిసొచ్చిందని అంటున్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..హైదరాబాద్‌లో సిట్‌ సోదాలు

  ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కీలక పరిణామం చేటుచేసుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. మెహిదీపట్నం, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, షేక్‌పేట, యాకుత్‌పూరా తదితర ప్రాంతాల్లోని ఐదు కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  మైసూరులో అదుపులోకి తీసుకుంది. అతన్ని విజయవాడకు తరలించారు. మరోవైపు, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి, జగన్‌ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి  సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరటను అందించింది.  అదే సమయంలో హైదరాబాద్‌లో నిందితుల కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలవారీగా రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరించినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని వ్యక్తిగత సహాయకుడు దిలీప్ కుమార్, మరో నిందితుడు సిట్ అధికారులను అరెస్ట్ చేసింది.

ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించండి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

  ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖలవారి పురోగతిపై చర్చించారు. మరోవైపు గోల్డ్ అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ.. పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని.. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని... ప్రతిశాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.  ప్రక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు.. ప్రతీది రియల్ టైమ్‌లో ట్రాక్ చేయాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు తక్కువుగా ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే, సరైన విధానాలను అవలంభించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. తెలంగాణలో హైదరబాద్ నుంచే 75% ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.  ఏపీకి అలాంటి అవకాశం లేనందున ఆదాయం పెంచేందుకు లోతైన అధ్యయం చేయాలని అధికారులను సీఎం సూచించారు.

ఏపీకి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి : మంత్రి నారా లోకేశ్

  ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు  91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. .ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు, పూర్తిస్థాయి సహకారం అందించాలని అధికారలను మంత్రి ఆదేశించారు. ఏపీలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.  రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖపట్నం నగరాన్ని అత్యాధునిక ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.  

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త...వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

  తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఉంటాయని ఏపీ దేవాదయశాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం భక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించేందుకు తిరుమల దేవస్థానం సిద్ధమైంది. ఈ క్రమంలో మే 15 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు ప్రారంభం కానునట్లు  మంత్రి ఆనం పేర్కొన్నారు.  ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పై బ్రేక్ దర్శనాలు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ టీటీడీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి దర్మనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో టీటీడీలో కొన్ని సార్లు భక్తుల రద్దీ అధికంగా, మరికొన్ని సార్లు స్వల్పంగా ఉంటుంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.   

బీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలపై హరీష్ రావు క్లారిటీ.. కేటీఆర్‌‌ బాధ్యతలుపై కీలక వ్యాఖ్యలు

  బీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాని ఆయన పేర్కొన్నారు. గులాబీ బాస్  తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను, ఆయన ఆదేశాలను పాటిస్తానని అన్నారు. రాముడికి హనుమంతుడిలాగా కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట అని పార్టీలో విభేదాలను పుల్ స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక  చేతులు ఎత్తేసిందని అన్నారు. సీఎం రేవంత్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ పరిస్థితి పాకిస్థాన్‌ కంటే దారుణంగా ఉందని ఆయన అన్నారు. పాక్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు. కానీ రేవంత్‌ను నమ్మి అప్పు ఇవ్వడం లేదని హారీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించడం చేతకావడం లేదని విమర్శించారు

భారత మహిళల సిందూరం తుడిచిన ఉగ్రవాదులను అంతం చేశాం : ప్రధాని మోదీ

  పాకిస్థాన్ అణ్వాయుధాలను చూపించి భయపెట్టాలనుకుందని అవేమీ భారత్ ముందు చెల్లవని ప్రధాని మోదీ తెలిపారు. పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌‌లో  ప్ర‌ధాని పర్యటించారు. ఉగ్రవాదం అంతం చేస్తామని భారత ఆర్మీ చేస్తామని శపథం చేసిందని మన సైనికులు యుద్దక్షేత్రంలోనూ భారత్ మాతకీ జై నినాదాలు చేశారు. భారత సైనికుల శక్తిసామార్థ్యాలు చూసి నా జన్మ ధన్యమైందని ప్రధాని తెలిపారు. మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సిందూరం తుడిచిన ఉగ్రవాదుల నట్టింట్లోకి వెళ్లి చంపేశారని మోదీ పేర్కొన్నారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను మోదీ కలిసారు.  ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడారు. పాక్ న్యూక్లియర్ బాంబులతో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధంలో పోరాడిన సైనికులైన మీ దర్శనం కోసమే వచ్చాను… మీ ధైర్య సాహసాలను చూస్తే గర్వంగా ఉందని తెలిపారు. పాక్ డ్రోన్లు మన గగనతలాన్ని దాటలేకపోయాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌, ఇండియా మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో.. ఇవాళ మోదీ ఆ ఎయిర్‌బేస్‌కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందిని ప‌లుక‌రించారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌పై పాకిస్థాన్ అటాక్ చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. మే 9 రాత్రి, 10వ తేదీల్లో శ‌త్రు దేశం ఆ ప్ర‌య‌త్నం చేసింది. మోదీ త‌న ఆకస్మిక ప‌ర్య‌ట‌న‌తో సైనికుల్లో మ‌నోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జ‌వాన్ల‌ను కూడా ఆయ‌న క‌లుసుకున్నారు.

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఎందుకంటే?

  ప్రముఖ  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. జూన్ 17నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసార‌మ‌య్యే సినిమాలు, టీవీ షోల మధ్యలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ వెల్ల‌డించింది. ఒకవేళ ఎలాంటి యాడ్స్ వద్దు అనుకుంటే వారు అదనంగా ఏడాదికి రూ. 699 లేదా నెలకు రూ.129 చెల్లించాలని పేర్కొంది.  కాగా  ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఇప్పటికే ఏడాదికి రూ.1499 చెల్లిస్తున్నారు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేర‌కు అమెజాన్ త‌న వినియోగదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. "ఇది మేము ఆకర్షణీయమైన కంటెంట్‌లో పెట్టుబడి పెట్టడం కొనసాగించడానికి, ఆ పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు పెంచుకోవడానికి అనుమతిస్తుంది. టీవీ ఛానెళ్లు, ఇతర స్ట్రీమింగ్ సేవల కంటే అర్థవంతంగా తక్కువ ప్రకటనలను కలిగి ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం" అని సందేశాలు పంపుతోంది. 

అగ్ర రాజ్యంకు షాక్.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు

  భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై భారత్ కస్టమ్స్ పన్ను  విధించాలని నిర్ణయించింది.  విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలియజేసింది. యూఎస్ దిగుమతులపై ఇచ్చిన రాయితీలను వెనక్కి తీసుకోవడమే కాకుండా కొన్ని వస్తువులపై టారిఫ్‌లు పెంచున్నట్లు  డబ్ల్యూటీఓకి భారత్ తెలియజేసింది. భారత  వస్తువులు స్టీల్‌, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన యూఎస్ వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. అమెరికా ఇటీవల విధించిన టారిఫ్‌ల కారణంగా 7.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అందుకే అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్‌ తప్పుపట్టింది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు. క్రూడ్‌ స్టీల్‌ తయారీలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉంది.  ఇప్పుడు దీనిపై ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం పడనుంది. ఇప్పుడు అమెరికా వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్‌ తెలియజేయడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ-వాషింగ్టన్‌ అత్యంత సమీపానికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించడం కోసం ఈ డీల్‌ ద్వారా భారత్‌ చాలా రాయితీలను ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. ఇక అమెరికా-చైనా మధ్య జరిగిన సుంకాలు, ప్రతీకార సుంకాలు తారస్థాయికి చేరుకోవడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.   

నైరుతి వచ్చేసింది.. ఇక వానలే వానలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

మండే ఎండల్లో చల్లటి కబురు వినిపించింది వాతావరణ శాఖ. వేసవి తాపం నుంచి త్వరలోనే జనాలకు ఉపశమనం కలగబోతోందని చెప్పింది.    దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి  నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురకుగా కదులుతున్నాయన్న తొలకరి లాంటి కబురు చెప్పింది రైతులలో ఆశల మెలకలెత్తించింది. ఐఎండీ. అంచనాలకు మించి నైరుతి రుతుపవనాల కదలిక వేగం ఉందని పేర్కొంది.  నైరుతి రుతుపవనాలు మంగళవారం (మే 13) అండమాన్, నికోబార్ ఐలెండ్స్ ను తాకాయన్న చిరుజల్లు లాంటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు నాలుగు రోజులలో అవి మరింత విస్తరించి అండమాన్ నికోబార్ అంతటా వ్యాపిస్తాయనీ, అలాగే మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయనీ పేర్కొంది. రుతుపవనాల కదలికకు వాతావరణం అనుకూలంగా ఉందనీ, ఇదే వేగంతో రుతుపవనాల విస్తరణ ఉంటే.. ముందుగా అంచనా వేసినట్లు మే 27 వరకూ అగాల్సిన అవసరం లేకుండా అంత కంటే రెండు మూడు రోజుల ముందుగానే  కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదౌతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  

ఆప‌రేష‌న్ సిందూర్.. మ‌న ఆయుధ మార్కెట్ అ‘ధర’ హో!

భార‌త్ ఆయుధాలు పరీక్షకు నిలబడ్డాయా?  భార‌త్ ఆయుధాలు కూడా   మార్కెట్లోకి ప్ర‌వేశించిన‌ట్టేగా? ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా  మ‌రో ఆయుధ లాభ‌మేంటి?  ఇన్నాళ్ల పాటు మ‌న ఆయుధాలు.. ఎక్క‌డో గోదాముల్లో మాత్ర‌మే ఉండేవి. అప్పుడ‌ప్పుడూ వాటి ప‌రీక్షల స‌మ‌యంలో  మాత్రం సినిమాలలో ఐటెం సాంగ్ లా మన ఆయుధాలు కూడా ఐటెం కింద వార్తల్లో నిలిచేవి. ఎంత పెద్ద బ్ర‌హ్మోస్ క్షిప‌ణి వార్త గురించైనా స‌రే స్పీడ్ న్యూస్ లో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవి. ఇప్పుడ‌లా కాదు.. మ‌న బ్ర‌హ్మోస్ ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ హెడ్ లైన్.  మ‌న ఆకాష్ ఒక పవర్ ఫుల్ క‌వ‌ర్ ప్యాకేజ్.  ఇక మ‌న స్కై  స్ట్రైక‌ర్, నాగాస్త్ర‌- 1 వంట‌టివి నాన్ స్టాప్ న్యూస్ క‌వ‌రేజ్.  వీటికి ర‌ష్య‌న్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి ఫుల్ ఫాలోయింగ్. రాఫెల్ కి కూడా కావాల్సినంత ఇమేజ్.. స‌రే ర‌ష్య‌న్ ఎస్ 400 హండ్రెడ్స్, ఫ్రెంచ్ రాఫెల్స్ అంటే అది మన స్వ‌దేశీ ప‌రిజ్ఞానం  కాదు. అదే బ్ర‌హ్మోస్ అలాక్కాదే. అది పాకిస్థాన్ గుండెల్లో మోగించిన అణుబాంబులు అంత మామూలు విష‌యం కాదు. భార‌త అమ్ముల పొదిలో దాగిన బ్ర‌హ్మాస్త్రం. స్వ‌యానా మ‌నం త‌యారు చేసిన అద్భుత‌మైన ఆయుధం. ఇదెంత వ‌ర‌కూ పేలిందో పేల్లేదో తెలియాలంటే ఈ విష‌యం గురించి మ‌నం భార‌తీయుల‌ను కాదు అడ‌గాల్సింది పాకిస్తానీ నేష‌న‌ల్ క‌మాండ్ మీటింగ్ కి హాజ‌రైన వారిని అడ‌గాలి. ఎందుకంటే వారేగా ఇది నూర్ ఖాన్ వైమానిక స్థావ‌రం ద‌గ్గ‌ర ప‌డ్డంతో ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఎందుకంటే ఇక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే  క‌ర్ణీ కొండ‌లుంటాయి. వాటి ప‌క్క‌నే 170 పాక్ మేడ్ అణ్వాయుధాల నిల్వ‌లుంటాయి. మ‌న బ్ర‌హ్మోస్ వారి అణు నిల్వ‌ల ప‌క్క‌న ప‌డ్డందుకే పాకిస్థాన్ అంత‌గా ఉలిక్కి ప‌డి వెంట‌నే యూఎస్ కి సంకేతాలిచ్చింద‌ని చెబుతారు. ఆ త‌ర్వాత అమెరికా  జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హా దారు మార్క్ ఆంటోనీ రూబెన్స్, ఇక మ‌న ఇంటి అల్లుడు జేడీ వాన్స్ రంగంలోకి దిగ‌డం ఆ న‌ల‌భై ఎనిమిది గంట‌ల పాటు భార‌త్ పాక్ మిల‌ట‌రీ ఇత‌ర విదేశాంగ అధికారుల‌తో మాట్లాడ్డం చ‌క‌చ‌క జ‌రిగాయ్. ఆల్ క్రెడిట్స్ గోస్ టూ బ్ర‌హ్మోస్. మ‌న బ్ర‌హ్సోస్ ఆపిన యుద్ధ‌మిది. అప్ప‌టి వ‌ర‌కూ ఇంట‌ర్నేష‌నల్ మీడియాను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది చైనా మార్క్ పీఎల్ 15. ఇది శాటిలైట్ క‌మ్ ఏఐ ఆప‌రేటెడ్ సైలెన్స్ వెప‌న్ అనీ.. దీన్నుంచి మ‌న రాఫెల్స్ ఎంత మాత్రం త‌ప్పించుకోలేవ‌ని ఓ ఊద‌ర‌గొట్టేవారు. దీంతో చైనా పీఎల్ 15 కి విశేష మైన ఆధ‌ర‌ణ ల‌భిస్తోన్న వేళ‌.. మ‌న వాళ్లు తెలివిగా మే 10 వ తేదీన మ‌న బ్ర‌హ్మోస్ ని క‌ర్ణీ  కొండ‌లకు ద‌గ్గ‌ర‌గా  ప్ర‌యోగించ‌డంతో.. గేమ్ ఛేంజ‌ర్ గా నిలిచింది. అందుకే ఈ బ్ర‌హ్మోస్ కి ఆప‌రేష‌న్ సిందూర్ లో కాల్పుల విర‌మ‌ణ‌ను ఆపిన గొప్ప పేరొచ్చింది. బ్ర‌హ్మోస్ ఎంత హిట్ అంటే ఆర్మేనియా 6 వేల కోట్ల‌కు మ‌నకు ఆర్డ‌రిచ్చింది. ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాయ్. ఇక మ‌న ఆకాశ్ అయితే ఈ స‌రికే.. 23 వేల కోట్ల విలువైన ఆర్డ‌ర్ ప‌ట్టేసింది. ఇది గ‌తంతో పోలిస్లే 12 శాతంక‌న్నా   ఎక్కువ‌. దీని ఫ్యాన్ ఫాలోయింగ్ అంత మామూలుగా లేదు. పాక్ వాడిన ట‌ర్కిష్ డ్రోన్ దాడుల‌ను ఎదుర్కోవడంలో మ‌న ఆకాశ్ ప‌నితీరుకు విశేషమైన ప్ర‌శంస‌లు ల‌భించాయి. 1980లో భార‌త ప్ర‌భుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవ‌లప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రూపుదిద్దుకుంటూ వ‌చ్చినది ఆకాశ్. ఇది శ‌తృ విమానాలు, డ్రోన్లు, చాప‌ర్ల‌ను ఇట్టే ఢీ కొట్ట‌గ‌ల‌దు. దీన్ని మ‌న డీఆర్డీవో, బీఈఎల్, బీడీఎల్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో త‌యారు చేశారు. వీటితో పాటు.. మ‌న యాంటీ డ్రోన్ ఫోర్ డీ సిస్ట‌మ్ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కింద భార‌త్ త‌యారీ చేసిన స్వ‌దేశీ ప‌రిజ్ఞాన‌పు మ‌చ్చు తున‌క‌ల్లో ఇది కూడా ఒక‌టి.  పాక్ వాడిన ట‌ర్కిష్ డ్రోన్ల‌ను  గ‌ట్టిగా దెబ్బ తీసిన ఆయుధాల్లో ఇదే అత్యంత వేగంగా ఖ‌చ్చితంగా ప‌ని చేసింది. ఇది డీఆర్డీవో ద్వారా డెవ‌ల‌ప్ చేయ‌బ‌డి బీడీఎల్ త‌యారీ. దీని కెపాసిటీ మొత్తం ఈ ఆప‌రేష‌న్ సిందూర్ లో వెలుగులోకి వ‌చ్చింది. ఇక నాగాస్త్ర 1 సంగ‌తి స‌రే స‌రి. ఇది ఎలాంటిదంటే ఆత్మాహుతి డ్రోన్ సంత‌త‌కి చెందిన‌ది. టార్గెట్ దొరికే వ‌ర‌కూ ఆ ప్రాంతంలో అలాగే నిలిచి.. త‌ర్వాత.. దూసుకుపోగ‌ల‌దు. ఇది ఏక‌కాలంలో టార్గెట్ ఛేజింగ్ దాని ధ్వంసం రెండూ చేయ‌ల నాగాస్త్రం. ఇలా దీని ప్ర‌త్యేక‌త‌లు చాలానే. ఈ ఆప‌రేష‌న్  సిందూర్ లో ఇలాంటి ఆయుధాలు ఉంటాయ‌ని కూడా తెలియ‌ని వారికి వీటి విలువ ఏమిటో తెలియ వ‌చ్చింది. స్కై స్ట్రైక‌ర్స్. ఇది మ‌న బెంగ‌ళూరులో త‌యారైనది. ఇందులో ఇజ్రాయెల్ టెక్నాల‌జీ వాడాం.  ఇది భార‌త్ ఇజ్రాయెలీ జాయింట్ వెంచ‌ర్. అలాంటి ఇది కూడా ఆప‌రేష‌న్ సిందూర్ లో త‌న ప‌ని త‌నం చూపించి భార‌త్ ఆయుధ మార్కెట్ విలువ అమాతం పెంచేసింది. ఇప్పుడు ప‌లు దేశాలు భార‌త్ కి సంబంధించిన ఆయుధాల‌ను మేం కొంటామంటే మేం కొంటామంటూ ఎగ‌బ‌డుతున్నారు. కార‌ణం ఏంటంటే ఒక ర‌ష్యా, యూఎస్, ఫ్రెంచ్ వంటి దేశాల నుంచి ఆయుధాల కొనుగోలు అంటే అదేమంత మాములు విష‌యం కాదు. అదే భార‌త్ ఇటు సినిమాలు, అటు శాటిలైట్ల‌తో పాటు.. ఆయుధాల త‌యారీలోనూ స్వ‌దేశీ ప‌రిజ్ఞానం వాడి.. అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే అమ్మే కెపాసిటీ  సొంతం చేసుకుంది.. దీంతో మ‌న ఆయుధ మార్కెట్ అ..ధ‌ర‌హో! అంటోంది..

చార్మినార్ వద్ద మిస్ వ‌ర‌ల్డ్ కంటెస్టెంట్‌లు హెరిటేజ్ వాక్.. పోలీసుల‌ భారీ బందోబ‌స్తు

  నిత్యం ర‌ద్దీగా ఉండే హైదరాబాద్, చార్మినార్ ప్రాంతం ఇవాళ నిర్మానుష్యంగా కనిపించింది. మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు పాత‌బ‌స్తీలో మిస్ వ‌ర‌ల్డ్ కంటెస్టెంట్‌లు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా క్లోజ్ కానున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. చార్మినార్ వద్ద మూడు కిలోమీటర్ల లోపు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దని ఆంక్షలు విధించారు.  చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు పోలీసులు చేశారు. హెరిటేజ్ వాక్ కోసం పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ ఒక్క‌రోజు చిరు వ్యాపారుల‌ దుకాణాలు కూడా మూసివేయించారు. చార్మినార్ వ‌ద్ద సుంద‌రీమ‌ణులకు గ్రాండ్ వెల్‌క‌మ్ కార్య‌క్ర‌మంలో భాగంగా అక్క‌డి ప‌రిస‌రాల‌ను పూల‌తో అందంగా అలంక‌రించారు. చార్మినార్ వద్ద భద్రతను స్వయంగా పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ పరిశీలించారు. ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గోన్నారు.ప్రపంచ సుందరీమణులు లాడ్ బజార్‌లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, అలంకరణ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు  తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లతో చార్మినార్ పరిసర ప్రాంతాలు ముస్తాబు చేసింది.      

ఉద్రిక్తతల వేళ భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్న అందాల పోటీలు

ఆపరేషన్ సిందూర్ మొదలైన తర్వాత భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాయాది దేశం పాకిస్తాన్‌తో టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న టైమ్‌లో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అందాల పోటీలేంటనే విమర్శలు వెల్లువెత్తాయి.  కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే.. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల మన దేశంపై ఉన్న అభిప్రాయమే మారిపోతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ డబుల్ అవుతుందనే వాదన కూడా  బలంగా వినిపిస్తోంది. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అందాల పోటీలు అవసరమా? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. మిస్ వరల్డ్ పోటీలను పోస్ట్ పోన్ చేయడం పెద్ద పనేం కాదు. దానికి పెద్దగా టైమ్ ఏమీ పట్టదు.  మరెందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సమయంలోనూ అందాల పోటీలను ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది? ముందుగా అనుకున్న షెడ్యూల్ డిస్టర్బ్ అవకుండా.. ఎందుకు నిర్వహించాలనుకుంటోంది? అనే కోణంలోనూ చర్చలు మొదలయ్యాయి. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో..  దేశం మొత్తం ఓ ఉద్విగ్న వాతావరణం కొనసాగుతున్న వేళ,  హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతున్నాయి. అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా, మిస్ వరల్డ్ లాంటి ఓ మెగా ఈవెంట్ జరుగుతోందంటే,  ఇండియా ప్రశాంతంగానే ఉంది, అంతకుమించి సేఫ్‌గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళుతుంది. భారత్‌లో అంతా సేఫ్ అన్న సందేశంమిగతా ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అందుకే మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందంట. సరిహద్దుల్లో పాక్ ఎన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలకు దిగినా, కాల్పుల విరమణకు ఒప్పుకొని,మళ్లీ దానిని ఉల్లంఘించినా, ఈ టెన్షన్స్ అన్నీ బోర్డర్ వరకే పరిమితమయ్యాయన్న విషయం మిస్ వరల్డ్ పోటీలతో మిగతా వరల్డ్‌కు అర్థమవుతుంది. భారత్-పాక్ మధ్య నెలకొన్న టెన్షన్స్ కశ్మీర్ బోర్డర్ వరకే ఉన్నాయి, మిగతా దేశమంతా ప్రశాంతంగానే ఉందనే సందేశం భారత్‌కు ఎంతో ప్లస్ అవుతుందనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా, మిస్ వరల్డ్ పోటీలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తే.. తెలంగాణతో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇండియా ఎంత సేఫ్‌గా ఉందనే విషయం.. గ్లోబల్ వైడ్‌గా అందరికీ బాగా అర్థమవుతుంది. ఏ అంతర్జాతీయ మీడియాలో భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు ప్రసారమవుతున్నాయో.. అదే ఇంటర్నేషనల్ మీడియాలో ఈ మిస్ వరల్డ్ పోటీల కవరేజ్ కూడా వస్తున్నది. దాంతో  ఇండియా అంతా కూల్‌గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళుతుంది.  తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌కి.. ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా.. పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో డ్రోన్‌లపై నిషేధం విధించింది.  పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు ఉండే హోటళ్ల దగ్గర.. నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా పోలీసులను.. భద్రత కోసం రంగంలోకి దించారు. గచ్చిబౌలి స్టేడియంతో పాటు సుందరీమణులు బస చేసే హోటళ్ల దగ్గర షార్ప్ షూటర్లను, స్పైపర్లను మోహరించారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ టీమ్స్‌ని మోహరించారు. ఇంతటి భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. హైదరాబాద్‌లో.. ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌ని ఎంతో సేఫ్‌గా నిర్వహించగలరనే సందేశం వెళుతుంది. గతేడాది తెలంగాణని లక్షన్నర మందికి పైగా.. అంతర్జాతీయ టూరిస్టులు సందర్శించారు. ఈ అందాల పోటీల ద్వారా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. 

మిథున్ రెడ్డి నాలుగు వారాల ఊరట.. కోర్టు నుంచి కాదు ఏపీ ప్రభుత్వం నుంచి!

ఏపీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మథున్ రెడ్డి నిండా ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టుకు రిఫర్ చేసింది. అయితే అరెస్టు నుంచి మాత్రం రక్షణ కల్పించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం హైకోర్టు మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై నిర్ణయం తీసుకునే వరకూ అరెస్టు చేయబోమని కోర్టులకు తెలిపి మిథన్ రెడ్డికి ఊరట కలిగించింది. విషయం ఏమిటంటే..  మద్యం కుంభకోణం కేసులో గతంలో హైకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిలు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం.. ఆయనను అరెస్టు చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడంతో హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. దీంతో మెరిట్స్ ఆధారంగా మరోసారి మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై నిర్ణయం తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు సూచించింది. అదే సమయంలో గతంలో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి ఇచ్చిన షీల్డ్ ను తొలగించింది. కానీ  బెయిల్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సుప్రీం కోర్టు హైకోర్టుకు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నాలుగు వారాలలోగా విచారణ చేపట్టాలని గడువు విధించింది. అంటే ఏపీ ప్రభుత్వం మిధున్ రెడ్డిని మరో నాలుగు వారాల వరకూ అరెస్టు చేయకుండా భారీ ఊరట కల్పించిందని చెప్పాలి. ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై ఏపీ హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనీ, మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారనీ దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ వరుసగా అరెస్టులు చేస్తుండటంతో మిథున్ రెడ్డి కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా ఉండగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి  సుప్రీంలో స్వల్ప ఊరట లభించింది. వారి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం వరకూ వారిరువురినీ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.  

ఏపీ మద్యం కుంభకోణం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్

అరెస్ట్.. రాజ్ కేసిరెడ్డి అప్రూవర్? వాట్ నెక్స్ట్!   ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.   ఈ కేసులో నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలన్ని ఆయనే చక్కబెడతారని అంటారు.  మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి   సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురినీ విజయవాడ కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఈ ముగ్గురూ కూడా నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం వీరికి అరెస్టు నుంచి  మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. జగన్‌కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్‌రెడ్డి,  గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్‌ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్‌ కేసిరెడ్డి వీరికి చేరవేస్తే.. వీరు దాన్ని జగన్‌కు అందజేసేవారని ఇప్పటివరకూ అరెస్టైన నిందితులకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్‌ అరెస్ట్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటికే కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ లను అరెస్టు చేసింది. ఇరువురిరీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించింది. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ముగ్గురి కోసం వేట మొదలెట్టింది. అందులో భాగంగా జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్పను అరెస్టు చేసింది. గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు జగన్ కు అత్యంత సన్నిహితులు. ఈ ముగ్గురినీ అరెస్టు చేస్తే ఏపీ మద్యం కుంభకోణం గుట్టు విడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ ముగ్గురిలో గోవిందప్ప అరెస్టయ్యారు. ఇక నేడో రేపో మిగిలిన ఇద్దరూ అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిల అరెస్టు కూడా ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైనట్లు వార్తలు వినవస్తున్నాయి. అదే జరిగితే మొత్తం జగన్ దోపిడీ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారతారనడానికి ఆయన న్యాయవాది కోర్టులో చేసిన వాదనలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో పెద్దలంతా తప్పించుకుని తన క్లయింట్ రాజ్ కేసిరెడ్డిని బలిపశువుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఈ ప్రయత్నాలను సహించబోమనీ, అన్నీ బయటపెడతామనీ సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.  ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి లాయర్ ఏకంగా కోర్టులోనే తన క్లయింట్ ను బలిపశువును చేశారంటే చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇవే ఆరోపణలు రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నట్లు దర్యాప్తు అధికారులకు పంపిన సందేశంగా కూడా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

ఉజ్వల ఇన్నింగ్స్‌కి తెర.. టెస్టులకు కోహ్లీ గుడ్‌బై

స్టార్ బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్‌ కోహ్లిని ఇక మనం తెల్లజెర్సీలో చూడలేం. టీ 20 లీగ్‌లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్టు క్రికెట్‌ వైపు ఆకర్షించి, వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి.. ఉత్తేజపరిచి, ఉర్రూతలూగించిన కింగ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దాదాపు దశా బ్దంన్నర పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన విరాటుడు.. దీర్ఘఫార్మాట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. నిరుడు టీ 20ల నుంచి రిటైరైన కోహ్లి.. ఇక వన్డేల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీని యర్లకు ‘చీకూ’గా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్‌గా భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లిని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది. అతడు బ్యాటుతో పరుగుల వరద పారించడమే కాదు.. సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు.  విదేశాల్లో తడబడే అలవాటున్న టీమ్‌ఇండియా.. కోహ్లి నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన ఐదో టెస్టే కోహ్లి కెరీర్‌లో ఆఖరి టెస్టు. అది 2014 డిసెంబర్.. భారత టెస్ట్ క్రికెట్‌ పాతాళానికి పడిపోతున్న క్షణం. ఐసీసీ పాయింట్స్‌ టేబుల్‌లో 7వ స్థానం. మేటి ఆటగాళ్లంతా రిటైర్మెంట్ ప్రకటించారు. రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ కూడా.. కెప్టెన్సీ వదిలి జట్టుకు దూరం అయ్యాడు. టీం భవిష్యుత్  ఏంటనేది అందరిలో ప్రశ్నార్థకం. భారత టెస్ట్ క్రికెట్ ఇక కనుమరుగయిపోతుంది అనుకున్న క్షణం.. అప్పుడొచ్చాడు విరాట్ కోహ్లీ. టెస్ట్‌ క్రికెట్‌లో తాను కింగ్ అని నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీమిండియా అభిమానుల్లో ఆశలు పెంచి.. సంప్రదాయ విధానాలను సవాల్ చేస్తూ.. కొత్త తరహా టీమిండియాను తయారు చేయడంలో సఫలం అయ్యాడు. టెస్టులు ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లను స్టేడియాలకు రప్పించాడు కోహ్లీ. క్రికెట్‌ అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. టీ 20లే కాదు.. టెస్టులు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి అనిపించేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ రాత మార్చాడు. విదేశీ గడ్డపై టీమిండియా అంటే చెమటలు పట్టేలా చేశాడు. అప్పటివరకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిందే లేదు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు మనవాళ్లు ముందే చిత్తయ్యేవాళ్లు. కానీ కెప్టెన్‌గా కోహ్లీ వారి సొంతగడ్డ పైనే వారికి దీటుగా జవాబిచ్చేవాడు. టీమిండియా ప్లేయర్ల జోలికి ఎవరైనా రావాలంటే ముందు తనను దాటాలని ప్రతి టీంకు చాటి చెప్పాడు.  మరో రెండు దశాబ్దాలు పైబడినా.. బెస్ట్ టెస్ట్ కెప్టెన్‌ అంటే కోహ్లీ పేరు చెప్పేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ కెరీర్ కోహ్లీకి ముందు.. కోహ్లీకి తర్వాత అని చెప్తారు ఎవరైనా.  ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. విరాట్ టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న తర్వాత.. ప్రపంచ క్రికెట్‌లో భారత్ చక్రం తిప్పింది. 2017 నుంచి 2021 వరకు ఐదేళ్లు టీమిండియాను నెంబర్‌ వన్‌గా నిలబెట్టాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘనత  సాధించిన కెప్టెన్ ఎవరూ లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా భారత్ ను వరుసగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌లు ఆడి.. 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై 11 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గానూ  రికార్డు విరాట్ కోహ్లీ పేరుమీదే ఉంది.   కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో భారత్.. 15 విజయాలు నమోదు చేసింది. కెప్టెన్‌గా వరుసగా అత్యధికంగా 9 టెస్ట్ సిరీస్ గెలిచింది కూడా కోహ్లీనే. ఆడిలైడ్, పెర్త్ గడ్డపై కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. అలాంటిది వాళ్ల సొంతగడ్డపైనే  వారిని మట్టి కరిపించి.. వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్ విశ్వరూపం కొనసాగడానికి కారణం కోహ్లీనే. ఆటగాడిగా.. కెప్టెన్‌గా తోటి ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అదే టీమిండియా రాత మార్చింది.  విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా టెస్ట్ జట్టును ఊహించుకోవడం చాలా కష్టం. కెప్టెన్‌గా తాను 2022లో రిటైర్ అయినా.. లీడర్‌గా రోహిత్ శర్మకు విలువైన సలహాలు అందించాడు. రోహిత్‌ టీంను నడిపించలేని టైంలో.. తాను ముందుకు వచ్చి భారత్‌ను రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో ప్లేయర్, మరో కెప్టెన్‌, మరో లీడర్‌ను భారత క్రికెట్‌ చూడటం కష్టమే.

మోదీ సందేశం.. సారాంశం ఏమిటి ?

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్’సిందూర్, భారత్ , పాకిస్థాన్ మధ్య  మినీ వార్ , కాల్పుల విరమణ తదనంతర పరిణామాలు, విశ్లేషణలు,విమర్శల నేపథ్యంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సోమవారం (మే 12) ర్రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాన మంత్రి మోదీ మౌన సందేశమే కానీ, నోరు విప్పి మాట్లాడింది లేదు.  అఫ్కోర్స్  పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒకటి రెండు రోజులకు బీహార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ స్పందించారు. ఉగ్రవాదాన్ని క్షమిచేంది లేదని అన్నారు .ఉగ్రవాదంపై యుద్దాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నపాక్ కు గట్టి హెచ్చరిక చేశారు. ఆ తర్వాత మోడీ మళ్ళీ, పెదవి విప్పలేదు. ఒక్క ముక్క ఆయినా  మాట్లాడలేదు.  కానీ..  ఆయన మౌనం మాట్లాడుతూనే వుంది. ఉగ్రదాడి  జరిగిన పక్షం రోజుల తర్వాత  పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం  ఆపరేషన్ సిదూర్ పేరిట క్షిపణి దాడులు చేసింది.  తొమ్మిది స్థావరాలనూ నేల మట్టం చేసింది.   25 నిముషాల వ్యవధిలో 100 కి పైగా  ఉగ్రవాదులను మట్టు పెట్టింది.  అలాగే..  భారత్ దాడులకు ప్రతిగా పాక్  జరిపిన డ్రోన్  దాడులను భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. పాక్ వైమానిక స్థావరాలను లేపేసింది. చివరకు పాక్  చేతులెత్తేసే స్థితికి చేరుకున్న సమయంలో..  అనూహ్యంగా  మోదీ కాల్పుల విరమణ ప్రతిపాదనకు తలూపారు. విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో  సోమవారం (మే 12) రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి  చేసిన ప్రసంగం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది.  ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా..  ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ, దేశంలో అంతర్గత రాజకీయ యుద్ధానికి తెర తీసింది.  అయితే.. సుమారు  20 నిముషాల పాటు సాగిన ప్రసంగంలో మోదీ  దేశం ముందున్న ప్రశ్నలకు సమాధానంచెప్పారా.. అంటే విశ్లేషకులు చెప్పారనో లేదనో సమాధానం చెప్పడం కష్టమే అంటున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ విషయంలో విభిన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిజం ఏమిటన్నది, నిలకడ మీద గానీ తెలియదు. కానీ.. ఈలోగా జరగవలసిన నష్టం జరిగి పోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో పరాయి వారో, ప్రతిపక్షాలో కాదు..  సొంత మనుషులే కొంత మంది  మోదీ  నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తప్పు పడుతున్నారు. విజయం స్వాగతం పలుకుతున్న సమయంలో మోదీ ఎందుకు వెనకడుగు వేశారు, కాల్పుల విరమణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్నలు, సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నిటినీ మించి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని  ‘ఆపు’ అనగానే జీహుజూర్  అంటూ మోడీ, అస్త్ర సన్యాసం ఎందుకు చేశారు?  దేశం మొత్తం భారత  సైనిక సామర్ధ్యాన్ని చూసి మురిసి పోతున్న సమయంలో..  మోదీ దేశం నెత్తిన కాల్పుల విరమణ నీటిని ఎందుకు కుమ్మరించారు?  అంటే..  వ్యూహంలో భాగమనో, ఇంకొకటనో తప్పించు కోవడమే కానీ  సరైన  సమాధానం లేక బీజీపీ నాయకులు,  అభిమానులు బేల చూపులు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రధానంగా బీజేపీ, నాయకులు, కార్య కర్తలు, అభిమానులకు ఇచ్చిన సందేశంగా తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ మొదలు కాల్పుల విరమణ వరకు జరిగిన పరిణామాలను, భవిష్యత్ ప్రణాళికను దేశ ప్రజలకు వివరించేందుకు   మంగళవారం (మే 13) నుంచి 11 రోజుల పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ  ‘తిరంగ యాత్ర’ నిర్వహిస్తున నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం పార్టీకి ఇచ్చిన సందేశంగానే భావించాలని అంటున్నారు.  జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో  దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం పెద్దగా లేదని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి వివరణ  ఇవ్వడంలో మోదీ విఫలమయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.    అయితే..  అదే సమయంలో మోదీ ప్రసంగంలో  పాకిస్థాన్ కు , ప్రపంచానికి రెండు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని బీజేపీ అనుకూల వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను, విమర్శలను తిప్పికొడుతూ..  బీజేపీ అనుకూల విశ్లేషకులు  ప్రధాని తమ ప్రసంగంలో కాల్పుల విరమణ తాత్కాలికమని స్పష్టం చేశారని, ఉగ్రవాదం నిర్మూలన విషయంలో పాకిస్థాన్ వ్యవహరించే తీరును బట్టే..  కాల్పుల విరమణ పై భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారని అంటున్నారు.అలాగే, పాక్ తో చర్చలు అంటూ జరిగితే, ఒకటి ఉగ్రవాదం, రెండు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)  ఈ రెండు విషయాలపైనే ఉంటాయని, ఇతర విషయాలపై చర్చలు ఉండవని స్పష్టం చేశారని అంటున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం, ప్రసంగం కాదు పాక్  పై కురిపించిన మిస్సైల్ దాడితో సమానమని  బీజేపీ అనుకూల వర్గాలు, అనుకూల విశ్లేషకులు అంటున్నారు.  అయితే..  విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కాల్పుల విరమణ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్’ వరసగా చేస్తున్న ప్రకటనలను మోదీ తమ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని తప్పు పడుతున్నాయి. అయితే..  బీజేపీ అనుకూల వర్గాలు మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దు అన్నట్లుగా  ఆ ఒక్క విషయాన్ని వదిలేసి  మోదీ ప్రసంగాని, సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. అంతిమంగా  మోదీ ప్రసంగం ఎవరి కోసం? ఎందుకోసం? ప్రసంగంలో ఏముంది? ప్రసంగం సారాంశం ఏమిటి.. అన్నది, సమధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.