లోకేష్ కు మోడీ బిగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో ప్రమోషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడపలో జరగనున్న పసుపు పండుగ మహానాడు వేదికగా నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఇస్తారనీ, ఆయన కోసమే ఒక పార్టీలో ఓ కొత్త పదవి సృష్టించి మరీ ఆయనకు మరింత కీలక పదవి, కీలక బాధ్యతలు అప్పగిస్తారనీ తెలుస్తోంది. ఇక తెలుగుదేశం శ్రేణులైతే పార్టీలో ప్రమోషన్ సంగతి సరే ప్రభుత్వంలో కూడా ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చలన్నీ ఇలా ఉంటే.. వీటన్నిటికీ మించిన ప్రమోషన్ లోకేష్ కు ఎప్పుడో వచ్చేసింది. ఆయన పని తీరు, ఆయన సమర్ధత, ఆయన వ్యవహారశైలి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు.. కుటుంబ సమేతంగా ఢిల్లీ వచ్చి తనను కలవాలని ఆహ్వానించారు. నిజమే ఈ ఆహ్వానం ఒక సారి కాదు రెండు సార్లు లోకేష్ కు దక్కింది. రెండో సారి అయితే మోడీ మరింత చనువుగా.. నేను ఆహ్వానించినా కలవరా? అంటూ లోకేష్ ను నిష్టూరమాడారు కూడా.  సాధారణంగా ముఖ్యమంత్రులకూ, ముఖ్య నేతలకూ కూడా ప్రధాని అప్పాయింట్ మెంట్ అంత తేలిగ్గా లభించదు. రోజులు, వారాల తరబడి ఎదురు చూసినా ప్రధాని అప్పాయింట్ మెంట్ అనుమానమే. అయితే లోకేష్ విషయంలో అలా కాదు.. ప్రధానే స్వయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నా అప్పాయింట్ మెంట్ ఉంటుంది.. ఒక సారి వచ్చి కలవండి అంటూ లోకేష్ కు ఆహ్వానం అందజేశారు.  రెండో సారి ఒకింత నిష్టూరంగా మోడీ నేను పిలిచినా కలవరా? అంటూ మరింత ఆత్మీయంగా ఆహ్వానించడంతో లోకేష్ ఇక ఆలస్యం చేయలేదు. భార్యా కుమారుడితో సహా ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు.  ఈ భేటీ ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. లోకేష్ కుటుంబాన్ని ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్న మోడీ వారితో దాదాపు గంటన్నర సేపు గడిపారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్ ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. బ్రహ్మణి, లోకేష్ లను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ భేటీలో ప్రధాని, లోకేష్ మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది ఎన్నికలకు ముందు నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్రకు సంబంధించిన వివరాలు, విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్ ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించి తొలి కాపీ అందుకున్నారు. అంతే కాదు.. ఆ పుస్తకంపై తాను సంతకం చేసి మరీ లోకేష్ కు అందించి మరుపురాని ఆత్మీయ జ్ణాపకాన్ని పంచారు. లోకేష్, బ్రహ్మణి, దేవాన్ష్ లకు మోడీ ఆశీస్సులు అందజేశారు.   ఈ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ అందిస్తున్న సహకారానికి కృతజ్ణతలు తెలిపారు. అదే సఃమయంలో రాష్ట్రప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను మోడీ దృష్టికి తీసుకువచ్చి సహకారం కోరారు.  వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందిస్తుందని, అందుకు మోడీ దిశానిర్దేశం అవసరమనీ కోరారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలన, అభివృద్ధి తదితర అంశాలను లోకేష్ ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. లోకేష్ వినతులన్నిటికీ ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ భేటీ ప్రధాని మోడీ, లోకేష్ మధ్య ఉన్న అనుబంధం రాజకీయాలకు మించి అన్న సందేశాన్ని చాటింది.ఈ అనుబంధం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని మరింత పెంచుతుందన్న విశ్వాసాన్ని ఇచ్చింది.  ఇక ప్రధాని మోడీని కుటుంబంతో కలిసే అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంత‌రం మంత్రి లోకేశ్ 'ఎక్స్'  వేదిక‌గా పెట్టిన పోస్టులో  త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌ధానిని క‌లిసే అవ‌కాశం రావ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.   ఏపీ పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధ‌న్య‌వాదాలు. 2047  వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్ప‌డాలో ప్రధాని నుంచి స‌ల‌హాలు తీసుకున్నానంటూ ట్వీట్ చేశారు. 

ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు

  విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు   పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్  ఆసుపత్రిలో సుజనాకు చేసిన సర్జరీ విజయవంతమైంది.  మరో రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు ఇచ్చిన మెడికేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. 

సీఎం రేవంత్‌రెడ్డితో నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ భేటీ

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు తదితర అంశాలపై చర్చించారు. త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్‌ బెనర్జీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు. ఫ్యూచ‌ర్ సిటిలో ఆర్ట్స్ అండ్  క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాల‌ని బెనర్జీ సూచించారు.  సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రగతికి దోహదపడే పలు సూచనలను అభిజిత్ బెనర్జీ సీఎం రేవంత్‌కి అందించారు. ముఖ్యంగా, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో కళలు, చేతివృత్తులు, సృజనాత్మకతను అంతర్భాగం చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులను నిర్వహించాలని కూడా సూచించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్‌

  ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిశారు.శనివారం సాయంత్రం నారా లోకేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానమంత్రి ఆహ్వానం మేరకే జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని అమరావతిలో పర్యటించిన విషయం విదితమే. ఆ పర్యటన సందర్భంగా, నారా లోకేశ్‌ను దిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని సూచించారు.  ఈ నేపథ్యంలోనే, లోకేశ్‌ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు.ఈ సందర్భంగా ప్రధాని, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు, చిన్నారి దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. ఫ్యామిలీపరమైన విషయాలతో పాటు, ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  

రైతు బజార్‌లో కూరగాయలు కొని ..‌ ఫోన్ పే చేసిన సీఎం చంద్రబాబు

  కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రైతుబజార్‌లో కూరగాయలు కొని ముఖ్యమంత్రి డిజిటల్ పేమెంట్ చేశారు. అనంతరం కూరగాయలు వ్యాపారి అయిన మహిళను ఫోన్ పే చేశాను అమ్మ  ఒకసారి చెక్ చేసుకో సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో సదరు వ్యాపారి సంతోషం వ్యక్తం చేసింది. స్వయనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెజిటేబుల్స్ కొనడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తానే రైతు బజార్‌ లను ఏర్పాటు చేశానని అన్నారు. కర్నూలులోని రైతు బజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 రైతు బజార్‌లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందిస్తామని సీఎం తెలిపారు.

భారత సైన్యానికి సంఘీభావంగా ట్యాంక్ బండ్‌పై బీజేపీ తిరంగా ర్యాలీ

  కశ్మీర్  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ సైనిక దళం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సెక్రటరీయట్ నుంచి సైనిక్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి. దీనిలో భాగంగా  వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలని పేర్కొన్నారు.   ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు.  

తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం.. మరో మూడు రోజులు వానలే వానలు

  తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతల్లో కరెంట్ అంతరాయం ఏర్పడింది. అటు తెలంగాణలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల కారణంగా న్యూ అశోక్ నగర్ ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్ పై కప్పు ధ్వంసమైంది. బలమైన గాలులతో టిన్ షెడ్ గాల్లోకి ఎగిరిపోయి, ఒక వాహనం పై పడింది.  రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. గంటకు 50 కి. మీ వేగంతో ఈదురుగాలులు  భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొన్నాది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్ట్.. భారత సైనిక సమాచారం పాక్‌కు చేరవేత

  భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు  చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.  మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది. డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్..పంద్రాగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం

  ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు. జూన్ నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సభకు హాజరైన ప్రజలతో ప్రమాణం సీఎం చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.  ప్రపంచం మెచ్చుకునేలా విశాఖలో యోగా డే ను నిర్వహించబోతున్నామని.. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తానే రైతు బజార్‌ లను ఏర్పాటు చేశానని అన్నారు. కర్నూలులోని రైతు బజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో రైతు బజార్‌లను పెడతామని అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర దిశగా అందరం ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదని.. అన్నీ ఏదో రూపంలో ఉపయోగపడుతాయని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని అన్నారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించానని తెలిపారు. చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు పని చేస్తున్నాయని అన్నారు. రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు.  

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించండి : కాంగ్రెస్ నేత కపిల్ సిబల్

  పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు తగ్గాయని ఆయన తెలిపారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉన్న రోజుల్లో భారత సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఉగ్రవాదం కూడా తగ్గుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశానికి నిజమైన సమస్య టెర్రరిజమేనని పేర్కొన్నారు.  అందుకే మన విదేశాంగ విధానం పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందనే వాస్తవంపై ఇప్పటికైనా ఎన్డీయే సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. దాయాది పోషిస్తున్న టెర్రరిజంపై ప్రపంచ దేశాలకు అసలు వాస్తవాలను ముందుంచి.. పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమ కార్యకలాపాల  చట్టంలో కొన్ని సవరణలు తప్పనిసరి అని కపిల్ సిబల్ అన్నారు.  

ఐపీఎల్ పునఃప్రారంభం.. కోల్‌కతాతో ఆర్సీబీకి కీలక మ్యాచ్

భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ , కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి.  అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 12 మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించి, ఆరో స్థానంలో ఉంది.  ఈ లీగ్ దశ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో దాని స్థానం పదిలం అవుతుంది. కానీ, ఈ సీజన్‌లో సొంత మైదానంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆర్‌సీబీకి, అదే మైదానంలో కేకేఆర్‌తో జరిగిన పేలవమైన రికార్డు మరో తలనొప్పిగా మారింది. నిజానికి, 2015 నుంచి ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా చేతిలో వరుసగా ఓడిపోతూనే ఉంది. అంటే, శనివారం ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఆర్‌సీబీ 10 సంవత్సరాల చరిత్రను మార్చాల్సి ఉంటుంది. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన బాగాలేదు. ఈ మైదానంలో ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఆర్‌సీ  బీపై విజయం సాధిం చింది. 2015 తర్వాత ఆర్‌సీబీ వారి సొంత గడ్డపై ఒక్కసారి కూడా కేకేఆర్‌ను ఓడించలేకపోయింది. అదే సమయంలో, ఈ మైదానంలో రెండు జట్ల మొత్తం రికార్డులు చూస్తే ఆర్‌సీబీ వెనుకబడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగగా, బెంగ ళూరు కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. కోల్‌కతా 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరిగాయి. ఆర్‌సీబీ  15 గెలిచి, 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, ఈ సీజన్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ అనేక పాత రికార్డులను బద్దలు కొట్టింది. అది 17 సంవత్సరాల తర్వాత చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 10 సంవత్సరాల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించగలిగింది. ఆర్‌సీబీ ఇప్పుడు కోల్‌కతాపై కూడా అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.

ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌ను కలిసిన సీపీ సీవీ ఆనంద్

  ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.  ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్  డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ నెంబర్‌‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ  కోసం తన కలలను సాకారం చేస్తున్న పోలీసులకు ఎప్పుడు మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు  ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.  

మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట..8 ఏళ్లనాటి కేసు కొట్టివేత

  తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఇది రైతుల విజయమని, చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలపై నమ్మకం బలపడిందని మంత్రి తెలిపారు. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూసేకరణపై ప్రజా విచారణ జరుగుతున్న సమయంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన తాము నిలిచామని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. రైతుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించింది అని ఆయన వివరించారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగిందని, తాజాగా నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేయడం సంతోషకరమని శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, పోలీసులను అడ్డగోలుగా వినియోగించుకున్నారని ఆరోపించారు. 

మళ్లీ ఆస్పత్రికి వల్లభనేని వంశీ

విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.   వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్‌ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన నూజివీడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్ పై  నూజివీడు కోర్టు సోమవారం (మే 20)  దీనిపైన విచారణ జరపనుంది. 2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం పని చేసిన బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాలకు చెందిన కొంత మందికి నకిలీ ఇళ్ల స్థలాల పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ అక్టోబరులో హనుమాన్‌ జంక్షన్‌ పీఎస్‌లో  9 మందిపై కేసు నమోదు చేశారు. అయితే నాడు కేసు నమోదు చేసిన వారి జాబితాలో వంశీ పేరు లేదు. అయితే 2024లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇదే కేసుకు సంబంధించి ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వంశీ హయాంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, వీటిపైన అధికార ముద్రలు నకిలీవని రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదకలో తేలిందని, దీంతో వంశీని కూడా  నిందితుడుగా చేర్చారు.  ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం జైల్లో ఉన్న వంశీని శుక్రవారం నూజివీడు 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శ్రావణి ముందు పోలీసులు హాజరు పరిచారు. అదలా ఉంటే.. వల్లభనేని వంశీ గురువారం (మే 17) జైలులో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిక ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం అదే రోజు మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు వంశీని తీసుకువెళ్లారు. తాజాగా శనివారం కూడా వల్లభనేని వంశీ మరో సారి అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆయనను ఆస్పత్రికితి తరలించారు.   

రేపే పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం...ఇస్రో 101వ ప్రయోగానికి సర్వం సిద్ధం

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు 100 రాకెట్లను ప్రయోగించింది. 101వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. విజయం పరంపరంలో కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం అయ్యేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట -షార్ నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం 5.59 నిమిషాలకు పి ఎస్ ఎల్ వి సి61 రాకెట్ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లను ఇస్రో సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి...1696.24 కేజీల బరువు కలిగిన ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్  44.5 మీటర్ల పొడవు 321 టన్నుల బరువు కలిగి ఉంటుంది. పిఎస్ఎల్వి  సి 61 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం  7.59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానున్నది.  కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటలు కొనసాగిన అనంతరం ఆదివారం ఉదయం  5.59 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో నిర్ణయించింది. భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టి భారత భూభాగం పైన నిశితంగా పరిశీలించే నిఘా ఉపగ్రహముగా పనిచేయునున్నది. భారత దేశ భూభాగాన్ని మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా నిగా పెట్టడమే ఈవో ఎస్ -09 సాటిలైట్ ముఖ్య ఉద్దేశం. గతంలో దేశ రక్షణ కోసం ప్రయోగించిన ప్రయోగాల కన్నా.. ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని కొత్త సాంకేతికంగా శాస్త్రవేత్తలు రూపుదిద్దారు. భారత్- పాక్ సరిహద్దుల వద్ద ఉద్రుక్తత పరిస్థితులు నెలకొనడంతో... శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి సి 61 రాకెట్ ప్రయోగానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణ శ్రీహరికోటకు చేరుకొని.. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

సెక్రటేరియట్ వద్ద ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు..కేసు నమోదు

  మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హైదరాబాద్ సచివాలయం దగ్గర కలకలం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ వద్ద వివిధ దేశాల జెండాలు ఏర్పాటు చేయగా ఇజ్రాయిల్ జెండాను జకీర్ అనే వ్యక్తి తొలగించాడు.  జెండాను తొలగిస్తూ సోషల్ మీడియాలో లైవ్ కూడా పెట్టాడు జకీర్ అనే యువకుడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే అధికారులు స్పందించారు. అనంతరం రంగంలోకి దిగిన అధికారులు తిరిగి ఇజ్రాయిల్ జెండాను ఏర్పాటు చేశారు.ఈ సంఘటనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నమోదు అయింది.  సదరు వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇలా ఇజ్రాయిల్ జెండాను తొలగించడం పై కొత్త చర్చ జరుగుతుంది.ఆ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇలా ఇజ్రాయిల్ జెండాను తొలగించడం పై కొత్త చర్చ జరుగుతుంది.  

సింహపురి రూరల్ పాలిటిక్స్... కోటంరెడ్డి బ్రదర్స్ మార్క్

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన బ్రాండ్ ఉన్న నేతల్లో ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టీడీపీ అధికారంలోకి రావడానికి తొలిమెట్టు ఆయనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుటా ఎగురవేశారు. దాంతో అప్పటి అధికార పార్టీ  సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు పార్టీ ఫిరాయించడంతో, పార్టీ పిరాయంపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అనార్హత వేటు వేయాలని  స్పీకర్ కు లేఖలు అందించింది. చర్యలు తీసుకునే లోపే ఎన్నికలు వచ్చాయి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయ ఢంకా మోగించి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. సంచలన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటారు టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజాభిమానంతో వరుసగా మూడుసార్లు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని లీడర్‌గా ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేసి, మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే ఎమ్మెల్యే కోటం రెడ్డి హ్యాట్రిక్ విజయాల వెనుక తన తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమంట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి  స్వయంగా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. రూరల్ నియోజక వర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన ఈ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఇపుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.    నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. సుదీర్ఘకాలం తమ అడ్డాగానే ఉండాలనే లక్ష్యంతో కోటం రెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లాన్ తో కోటంరెడ్డి బ్రదర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. ఈసారి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నిలబెట్టేందుకు తన రాజకీయ వారసుడిగా తెరమీదకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తనను ఆదరించినట్లే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని కూడా ఆదరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరుతున్నారట. రేపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త సెగ్మెంట్లు ఏర్పడతాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంట. మరో పక్క ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుసరించిన స్ట్రాటజీనే తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు.. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం.. అభివృద్ధి పనులు చేయడం..వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచు కోవడం..  ఇవే కోటంరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేని చేశాయంట. ఇప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఇదే బాటలో  పయనిస్తున్నారు. ఇప్పటికే "గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి" కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.  మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా తన తమ్ముడితో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. రూరల్ నియోజకవర్గంలో దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని విధంగా ఒకేరోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు.  తర్వాత వారం రోజుల్లో వరుసగా 234 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మంత్రి లోకేష్ అభినందనలు అందుకున్నారు. మొత్తం 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తానని ఆరోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేయించారు. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధవీరులకు అంకితమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చెప్పిన మాటకు కట్టుబడి 5  రోజుల ముందే 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇలా ఒకవైపు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయిస్తూ, మరో వైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్ట పరుస్తూ.. కోటంరెడ్డి బ్రదర్స్ తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్డారు.  నిత్యం ప్రజల్లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకుని దాన్నే ఎన్నికల్లో అస్త్రంగా వాడు కుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగే  ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్టు కాకుండా, ప్రతిరోజు ఎన్నికలన్నట్టు కోటంరెడ్డి బ్రదర్స్ కష్టపడుతూ ... ఎన్నికలకు నాలుగేళ్ల ముందు నుంచే ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటుండటంతో కోటంరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నా.. రాజకీయంగా ఎదుర్కోవాలన్నా.. ప్రత్యర్థి పార్టీలకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోందట.  అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. అయితే ఆ పార్టీ నుంచి జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ , ఆనం రామనారాయణరెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. దాంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కావాలన్నా కల నెరవేరలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగా క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరి కోటంరెడ్డి క్యాబినెట్ బెర్త్ ఆశలు ఎప్పటికి నెరవేరతాయో చూడాలి.

ఏపీ మద్యం కుంభకోణం కేసు..జగన్ అరెస్టు ఖాయమంటున్న పేర్ని?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలా ఉండగా ఇదే కేసులో  మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లకు సుప్రీం కోర్టు ఇలా బెయిలు నిరాకరించగానే సిట్ అలా అరెస్టు చేసింది.  ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాదశం ఉంది.  మొత్తం మీద మద్యం కుంభకోణం కేసు విషయంలో ఒక లాజికల్ ఎండ్ కు వచ్చే దశగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి అరెస్టు జగనే అంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని బాంబు పేల్చారు.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్ ను అరెస్టు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నదన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం కూడా లేదనీ, అయినా కూడా జగన్ కు సన్నిహితంగా ఉన్న వారందరినీ అరెస్టు చేసి వారి చేత బలవంతంగా  జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏదో విధంగా జగన్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.  పేర్ని నాని విమర్శలు, ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేస్తామని అటు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎవరూ ఇప్పటి వరకూ చెప్పలేదు. ఎవరి నోటా రాని జగన్ అరెస్టు మాట మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నొ నాని నోటి వెంట రావడమే పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.   ఈ కేసులో జగన్ ప్రమేయం  బయటపడటం ఖాయం, జగన్ అరెస్టు తథ్యం అని వైసీపీ శ్రేణులకు పేర్ని నాని చెప్పకనే చెప్పినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో   జగన్‌ అరెస్టు తప్పదన్న భావనకు పేర్నినాని వచ్చేసినట్లే కనిపిస్తోందని అంటున్నారు. 

తప్పలేదు పాపం.. నూర్ వైమానిక స్థావరంపై భారత్ దాడి నిజమే.. పాక్ ప్రధాని ఒప్పుకోలు

బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని  షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.  అంతే కాదు అన్ని విధాలుగా అసహాయంగా మిగిలిపోవడం వల్లనే భారత్ కాళ్లా వేళ్లా పడి  కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని కూడా బేలగా చెప్పేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్  లో భాగంగా ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత.. మే 10 తెల్లవారు జామున రెండున్నర గంటలకు పాకిస్థాన్ వైమానిక స్థావరంపై మిస్సైల్ స్ట్రైక్ జరిగిందనీ, ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు.  ఇదే పాక్ ప్రధాని నిన్న మొన్నటి వరకూ భారత్ ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అనీ, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలకు కారణమైన ఆ ఆపరేషన్ ను విజయవంతంగా ఫెయిల్ చేశామనీ, భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిందనీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ పార్లమెంటులో కూడా ప్రకటించారు. అయితే అవన్నీ బుకాయింపులేనని అంగీకరిస్తూ ఇప్పుడు వాస్తవాన్ని ప్రకటించారు. భారత్ కచ్చితత్వంతో దాడులకు పాల్పడిందనీ, ఆ దాడులలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైందనీ అంగీకరించేశారు. అయితే  దాడుల కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ఇప్పటికీ దాచిపెడుతున్న ఆయన భారత్ తో యుద్ధాలు గెలవలేమని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఇక చర్చలు మార్గమని తేల్చేశారు.  వాస్తవానికి  భారత్ దాడులలో పాకిస్థాన్ లోని అన్ని వైమానిక స్థావరాలు, రాడార్లు, ఆర్మీ కంటోన్మెంట్ లు ధ్వంసమైనట్లు సమాచారం ఈ దాడులలో  పాకిస్తాన్ సైనికులతో పాటు, టర్కీ సైనికులు కూడా మృతి చెందారు.