ఏపీ మద్యం కుంభకోణం కేసు..జగన్ అరెస్టు ఖాయమంటున్న పేర్ని?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలా ఉండగా ఇదే కేసులో  మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లకు సుప్రీం కోర్టు ఇలా బెయిలు నిరాకరించగానే సిట్ అలా అరెస్టు చేసింది.  ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాదశం ఉంది.  మొత్తం మీద మద్యం కుంభకోణం కేసు విషయంలో ఒక లాజికల్ ఎండ్ కు వచ్చే దశగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి అరెస్టు జగనే అంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని బాంబు పేల్చారు.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్ ను అరెస్టు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నదన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం కూడా లేదనీ, అయినా కూడా జగన్ కు సన్నిహితంగా ఉన్న వారందరినీ అరెస్టు చేసి వారి చేత బలవంతంగా  జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏదో విధంగా జగన్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.  పేర్ని నాని విమర్శలు, ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేస్తామని అటు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎవరూ ఇప్పటి వరకూ చెప్పలేదు. ఎవరి నోటా రాని జగన్ అరెస్టు మాట మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నొ నాని నోటి వెంట రావడమే పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.   ఈ కేసులో జగన్ ప్రమేయం  బయటపడటం ఖాయం, జగన్ అరెస్టు తథ్యం అని వైసీపీ శ్రేణులకు పేర్ని నాని చెప్పకనే చెప్పినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో   జగన్‌ అరెస్టు తప్పదన్న భావనకు పేర్నినాని వచ్చేసినట్లే కనిపిస్తోందని అంటున్నారు. 

తప్పలేదు పాపం.. నూర్ వైమానిక స్థావరంపై భారత్ దాడి నిజమే.. పాక్ ప్రధాని ఒప్పుకోలు

బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని  షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.  అంతే కాదు అన్ని విధాలుగా అసహాయంగా మిగిలిపోవడం వల్లనే భారత్ కాళ్లా వేళ్లా పడి  కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని కూడా బేలగా చెప్పేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్  లో భాగంగా ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత.. మే 10 తెల్లవారు జామున రెండున్నర గంటలకు పాకిస్థాన్ వైమానిక స్థావరంపై మిస్సైల్ స్ట్రైక్ జరిగిందనీ, ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు.  ఇదే పాక్ ప్రధాని నిన్న మొన్నటి వరకూ భారత్ ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అనీ, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలకు కారణమైన ఆ ఆపరేషన్ ను విజయవంతంగా ఫెయిల్ చేశామనీ, భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిందనీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ పార్లమెంటులో కూడా ప్రకటించారు. అయితే అవన్నీ బుకాయింపులేనని అంగీకరిస్తూ ఇప్పుడు వాస్తవాన్ని ప్రకటించారు. భారత్ కచ్చితత్వంతో దాడులకు పాల్పడిందనీ, ఆ దాడులలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైందనీ అంగీకరించేశారు. అయితే  దాడుల కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ఇప్పటికీ దాచిపెడుతున్న ఆయన భారత్ తో యుద్ధాలు గెలవలేమని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఇక చర్చలు మార్గమని తేల్చేశారు.  వాస్తవానికి  భారత్ దాడులలో పాకిస్థాన్ లోని అన్ని వైమానిక స్థావరాలు, రాడార్లు, ఆర్మీ కంటోన్మెంట్ లు ధ్వంసమైనట్లు సమాచారం ఈ దాడులలో  పాకిస్తాన్ సైనికులతో పాటు, టర్కీ సైనికులు కూడా మృతి చెందారు. 

హరీష్ రావు నివాసానికి కేటీఆర్.. తెరవెనుక కథేంటి?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీలో కీలక నాయకులూ, అందునా దగ్గరి బంధువులు అయిన వారిరువురూ భేటీ కావడం వాస్తవానికి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో వారిరువురి భేటీయే అత్యంత ప్రధాన వార్తగా మారిపోయింది. మిగిలిన విషయాలన్నీ మరుగున పడిపోయి.. ఇప్పుడు చర్చంతా వారిద్దరి రెండు గంటల భేటీపైనే కేంద్రీకృతమై ఉంది.  ఇందుకు కారణం లేకపోలేదు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం, త్వరలో పార్టీ పగ్గాలు తన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించనున్నారన ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. అదీ కాకుండా ఒక ప్రణాళిక మేరకు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.  ఇటీవల బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో జరిగిన  భారీ సభ సందర్భంగా హరీష్ రావుకు ఇసుమంతైనా ప్రాధాన్యత లభించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. అదే సమయంలో హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేయనున్నారనీ, టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదంతా అవాస్తవ ప్రచారం అంటూ హరీష్ రావు ఇచ్చిన వివరణ కూడా ఆ ప్రచారం మరింత జోరందుకోవడానికి దోహదపడిందే తప్ప మరో ప్రయోజనం సిద్ధించలేదు. హరీష్ రావు కారు దిగి, వేరే పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో వాటిని పార్టీయే కాదు.. ప్రజలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అందుకు కారణం కేసీఆర్. కేసీఆర్ ను కాదని హరీష్ రావు పక్క చూపులు చూస్తారంటే ఎవరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేసీఆర్  పోలిటికల్ గా యాక్టివ్ గా లేరు. పార్టీ వర్గాలే ఆయన ఇక పార్టీ పగ్గాలను తన రాజకీయవారసుడికి అప్పగించేసి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారంటున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో  జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల పోస్టర్లలో హరీష్ ఫొటోనే కనిపించలేదు. దీంతో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖారరైపోయిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది.  ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా  వెలుగొందని హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి, ఆయన స్థాయికి తగ్గ గౌరవం కూడా ఇవ్వడం లేదన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేస్తుంటే మౌనంగా ఉంటారా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో కేసీఆర్ తనయ, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మాటేంటంటూ గొంతెత్తడం మొదలెట్టారు. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడటంతో పార్టీలో లుకలుకలు ఉన్నాయనీ, అవి కూడా కేసీఆర్ కుటుంబం నుంచే మొదలయ్యాయన్న భావన అందరిలో వ్యక్తం అయ్యింది.  ఈ తరుణంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అ భేటీలో  ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వెల్లడించలేదు. అయినా భేటీ చుట్టూ ఊహాగాన సభలు మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి.  అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. హరీష్ రావు, కేటీఆర్ ల భేటీపై రాజకీయ చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మళ్లీ పార్టీలో ఇటీవలి కాలంలో హరీష్ రావుకు తగ్గుతున్న ప్రాధాన్యతే అనడంలో సందేహం లేదు.  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో హరీష్ కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోవడం, పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా ఎక్కడా హరీష్ రావు పేరు వినిపించకపోవడం, ఫొటో కనిపించకపోవడంపై కేటీఆర్ హరీష్ కు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారనీ, విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలన్న ప్రతిపాదన చేశారనీ అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురి మధ్యా విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిన తరువాతే పార్టీ పగ్గాల అప్పగింత ఉంటుందన్న కేసీఆర్ విస్పష్టంగా చెప్పి కే టీఆర్ ను హరీష్ నివాసానికి పంపారని కూడా అంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేసీఆర్ ఈ ముగ్గురితోనూ భేటీ  అయ్యే అవకాశాలు ఉన్నాయి.  మొత్తం మీద పార్టీలో లుకలుకలు, చీలిక వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారని చెబుతున్నారు. 

జగన్ ఒక సీతయ్య.. ఎవరి మాటా వినడు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం. ఈ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పని చేసిన పార్టీ నేతలే కాదు, ఉన్నతాధికారులూ చెబుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే జగన్ ఎవరి సలహాలూ, సూచనలూ స్వీకరించరు. తోచింది చేసేస్తారు. వాటి పర్యవశానాల వల్ల తనకు అత్యంత సన్నిహితులు, తనను నమ్ముకున్న వారూ నిండా మునిగిపోయినా పట్టించుకోరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సీతయ్య ఎవడి మాటా వినడు అని. జగన్ సీతయ్యకు మించి..ఆయన కూడా ఎవడి మాటా వినరు. వినకపోవడమే కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సహించరు. ఔను.. ఈ విషయం ఎవరో కాదు.. గతంలో  జగన్ అధికారంలో ఉండగా సీఎస్ గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా చెప్పిన మాట. ఇటీవల ఓ సందర్భంలో ఆయన జగన్ వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ, ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనీ, ముందు వెనుకలు ఆలోచించరనీ, ఎవరైనా చెప్పినా వినరనీ, అలా చెప్పడానికి ప్రయత్నించిన వారపై ఫైర్ అయిపోతారనీ చెప్పారు. జగన్ ఆ వైఖరి కారణంగానే ఆయనకూ, ఆయన పార్టీకీ కూడా భారీగా డ్యామేజి జరిగిందని వివరించారు.  జగన్ తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుని ఇక వాటికే కట్టుబడి ఉంటారనీ, మంచి చెడ్డల గురించి చెప్పబోయినా వినిపించుకోరనీ వివరించారు. జగన్ తీరు కారణంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎల్వీ చెప్పారు.   ఇందుకు జగన్ తీసుకువచ్చిన ఇసుక విధానమే పెద్ద ఉదాహరణ అని అయన అన్నారు. జగన్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఇసుక ఉచితంగా లభ్యమయ్యేది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పలు కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. అలాగే మద్యం విధానం కూడా జగన్ ప్రభుత్వానికి పూడ్చలేనంత నష్టం చేసింది. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ ఇసుక, మద్యం విధానాల విషయంలో వెనక్కు తగ్గలేదు. అధికారులు ఏమైనా చెప్పబోయినా, నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఇక మార్చేది లేదు. అని కరాఖండీగా చెప్పేసి వాళ్ల నోళ్లు మూయించే వారని ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ హయాంలో అధికారుల అసహాయత, నిస్సహాయత గురించి వవరించారు. జగన్ వైఖరి పట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి చెందేవారనీ, ఈ యాటిట్యూడ్ ఏమిటని ఆశ్చర్యపోయారనీ కూడా ఎల్వీ వివరించారు. అన్నిటికీ మించి జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ప్రభుత్వోద్యోగం అన్నట్లుగా వ్యవహరించేవారిని ఎల్వీ గుర్తు చేసుకునే వారు. ఒక రాజకీయ  నాయకుడి నుంచి అందరూ ఆశించే పనితీరు ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదన్నారు.  ప్రజా సమస్యల పట్ల ఆయనలో ఇసుమంతైనా  సీరియస్ నెస్ కనిపించేది కాదన్నారు. డబ్బు, అధికారం ఉంటే చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉండేదన్నారు. జగన్ ముందు చూపు లేని వ్యవహార శైలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారనీ, అందుకే జగన్ పట్ల స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందనీ వివరించారు. జగన్ తన నిర్ణయాల కారణంగా ప్రభుత్వం, ప్రజలూ కూడా ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నా కూడా జగన్ తాను చేసిందే రైట్ అని భావించేవారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు.  మొత్తం మీద జగన్ ప్రభుత్వ పనతానికి పూర్తి కారణం ఆయనేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పకనే చెప్పారు. 

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

  భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నా పేరు మీద ఒక స్టాండ్ కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి అవుతుంది.  భారతదేశం ఇక్కడ ఏ జట్టుతో ఆడినా, అది మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు.  ఈ పెద్ద గౌరవం లభించినందుకు నేను కృతజ్ఞుడను’’ అని అన్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రోహిత్ శర్మ తల్లిదండ్రులు నేడు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. రోహిత్ శర్మతో పాటు అతడి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు మైదానం మధ్యలో నుంచి రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌లతో పాటు రోహిత్‌ సతీమణి రితికా సజ్దే పాల్గోన్నారు

భారత సైనిక దళాలను చూస్తే గర్వంగా ఉంది : సీఎం చంద్రబాబు

    విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త 'తిరంగ యాత్రలో భాగంగా నేడు ఏపీలో భారీ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ.. భారత సైనికులకు మద్ధతు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు మన దేశాన్ని, మనల్ని కాపాడిన జవాన్లకు సెల్యూట్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆపరేషన్ సిందూర్ అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.  అంతా గర్వించదగ్గ దళాలు మనకుండటం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతంవారే కావడం మన అదృష్టం. పహల్గామ్ అనగానే మనలో ఖబర్దార్ అని హెచ్చరించే పౌరుషం వస్తోంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యే, టీడీపీ బీజేపీ, జనసేన నాయకులు, నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు విచారణలో భాగంగా ప్రశ్నించిన అధికారులు తాజాగా వీరిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. రేపు వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కార్యాలయ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి సాయంత్రం వరకు వారిని అరెస్ట్ చేయకూడదు అనే ఆదేశాలు ఉండటంతో.. ఈ మూడు రోజులు వారిని సిట్ ఆఫీసులో విచారించారు. సుప్రీం విధించిన గడువు ముగియడంతో కొద్దిసేపటి క్రితం వారిని అరెస్ట్ చేశారు అధికారులు. ఈ ఉదయం వీరిద్దరు దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

విశాఖలో యోగా డే రికార్డు సృష్టిద్దాం : సీఎం చంద్రబాబు

  విశాఖలో జూన్ 21న యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు  అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో ప్రచారం చేపట్టలని దీనిపై ప్రజలకు సన్నద్దం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. జూన్‌ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్‌ చేసిన వారికి సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారని, ఆర్‌కే బీచ్‌ నుంచి సముద్రతీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు.  యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

  ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పలు లెక్చరర్ పోస్టుల పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, టీటీడీ కళాశాలలు కోసం జూన్ 16 నుండి 26 మధ్య జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది.  కొత్త తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లు 13/2023, 16/2023, 17/2023 కింద 99 పాలిటెక్నిక్, 47 జూనియర్, 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, టీటీడీ పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (https://psc.ap.gov.in) పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.  

హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ..సడెన్‌గా అమెరికాకు కవిత గులాబీ పార్టీలో గుబులు

  బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు  నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారిద్దరూ సుమారు  2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. హరీశ్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్ రావు తండ్రి ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు.  ఈ క్రమంలో హరీశ్ రావు ఇంటికి వచ్చిన కేటీఆర్ అక్కడ సుమారు 2 గంటల పాటు హరీశ్ రావుతో సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, గులాబీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత పరిస్తితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల హరీశ్ రావుపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ రావు క్లారీటీ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని స్వాగతిస్తానని ఇటీవలే హరీశ్ రావు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.  మరోవైపు మరికాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్ళనున్నారు. ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇటీవల కవిత సైతం సొంత పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని  కవిత  హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేటీఆర్ భేటీ కావడం పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.

రాజ్ కేసిరెడ్డి విచారణకు ఈడీ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ కేసులో కింగ్పిన్ గా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డిని విచారణకు అనుమ తించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇక నేరుగా రంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే  ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు సిద్ధమౌతోంది. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు  అనుమతి ఇవ్వాల్సిందిగా విజయవాడ ఏసీపీ కోర్టులో ఈబీ పిటిషన్ దాఖలు చేసింది.   మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కేశినెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం (మే 16) విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన న్యాయవాది ఏకంగా కోర్టులోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు తప్పించుకుని రాజ్ కేసిరెడ్డిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కోర్టులోనే రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారన్న అభిప్రాయం పరిశీలకులలో  వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు రెడీ అవుతుండటంతో  ఇక ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టు కావడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో  ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనీ, సంచలన అరెస్టులు జరుగుతాయనీ అంటున్నారు.  

శ్రీవారికి సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల బంగారు ఆభరణాలు విరాళం

  తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇవాళ ఉదయం  సంజీవ్ గోయెంకా తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి  శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు

ప్రత్యేక సదుపాయాలకు కోర్టు నో.. గాలి సాధారణ ఖైదీయే!

ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని  నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను  తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు మైనింగ్ అక్రమాల కేసులో దోషిగా చంచల్ గూడ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు.   మాజీమంత్రి గాలి జనార్థన్‌ రెడ్డి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణై చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇదే కేసులో ఇప్పటికే  నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించినందున దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అదలా ఉంటే.. గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆటోమేటిగ్గా ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దైపోయింది.  ఇక ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు ఆయన అభ్యర్థనను తోసి పుచ్చింది. నేరం రుజువై, దోషిగా నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలూ కల్పించడం కుదరదని సీబీఐ కోర్టు స్ఫష్టం చేసింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి చెంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగా మాత్రమే పరిగణించబడతారు. అంటే మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డిని చెంచల్ గూడ జైలులోని ఇతర సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తారు. సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన జైలు ఖైదీ యూనిఫారంనే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. 

మంత్రులు ఎంతెంత కమీషన్ తీసుకున్నారో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి డిమాండ్

  మంత్రులు కమిషన్లు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని  స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వమంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  18 నెలల రేవంత్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్త చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలను ప్రజల ముందుంచాలని కేంద్రమంత్రి వెల్లడించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి కౌంటర్‌గా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు చెప్పామని అన్నారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నెలమట్టం చేశామని పేర్కొన్నారు. భారత్ రాఫెల్ విమానాలను ధ్వంనం చేశామంటూ.. దిక్కుతోచని స్థితిలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. దాయాదుల దాడులకు త్రివిధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని కిషన్ రెడ్డి తెలిపారు.   

కాకాణికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ నిరాకరణ

  క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై  ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. మాజీ మంత్రి కాకాణి   కోసం పోలీసులు గాలిస్తున్నారు.  క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్‌లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్లు గుర్తించారు.  ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

ఇక ఆ ఇద్దరూ కూడా అరెస్టే!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల అరెస్టునకు రంగం సిద్ధమైపోయినట్లే.. ఎందుకంటే వారిద్దరి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దశలో బెయిలు ఇవ్వడమంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే  మాజీ సీఎం జగన్  మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఇప్పటి వరకూ సుప్రీం కోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ ఉంది. అయితే వారి యాంటిసిపేటరీ బెయిలును తిరస్కరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ సమయంలో వీరికి యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. ఇరువురి ముందస్తు బెయిలు  పిటిషన్లను కొట్టివేసింది.  దనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఈ దశలో బెయిలు ఇవ్వడం దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే అవుతుందని అభిప్రాయపడింది.   ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరిరువురూ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీంకు వెళ్లారు.  వీరి బెయిలు పిటిషన్లను శుక్రవారం (మే 16) విచారించిన సుప్రీం కోర్టు బెయిలు నిరాకరించింది.  ఇదే కేసులో గతంలో సుప్రీం కోర్టు వీరిని శుక్రవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ దర్యాప్తు సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిలు నిరాకరించడంతో  వీరి అరెస్టు తధ్యమని అంటున్నారు.  

వల్లభనేని వంశీ... అయ్యో పాపం అనే నాథుడే లేడు!

  చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు వంశీ గత 95 రోజులుగా రిమాండ్ ఖైదీగగా జైలులో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో ఒకటి రెండు సార్లు జైలు నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా గురువారం (మే 16) కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన జైలుకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. అప్పటి నుంచీ ఆయన జైలులోనే ఉన్నారు. ఒక కేసు తరువాత ఒక కేసు వంశీ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తం ఐదు కేసులలో నాని నిందితుడు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే విషం కక్కారు. పార్టీ అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు అక్రమాలు, దౌర్జన్యాలు. ఇప్పుడా పాపాలన్నీ ఒకే సారి పండుతున్నాయా అన్నట్లుగా ఆయనపై కేసులు నమోదౌతున్నాయి. చివరికి ఆయన సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం వంశీ పరిస్థితి పట్ల ఇసుమంతైనా సానుభూతి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏదో కొద్ది మంది అనుచరులు వినా ఆయనకు మద్దతుగా మాట్లాడే వారే కరవయ్యారు. ఇదంతా వంశీ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయమే సాధారణ జనం నుంచి వైసీపీ క్యాడర్ వరకూ వ్యక్త అవుతోంది.  రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి ఆ పార్టీ కష్ట కాలంలో ఉండగా కాడె వదిలేసి అధికారపార్టీ పంచన చేరిన వంశీ.. అలా చేరి ఊరుకోకుండా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు  తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే 2024 ఎన్నికల నాటికే ఆయన జనం మద్దతును సానుభూతినీ కోల్పోయారు. ఇక ఓటమి తరువాత నియోజకవర్గానికి ముఖం చూపిన పాపాన పోలేదు. అసలు దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్నట్లుగా ఆయన కనిపించలేదు. వినిపించలేదు. అయితే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మళ్లీ రంగంలోకి దూకారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అక్కడే అడ్డంగా బుక్కై అరెస్టయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయన కటకటాల వెనుకే ఉన్నారు.  అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిలు వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయనపై ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్య‌క్తికి సంబంధించిన ఇంటి వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. వాటితో స‌ద‌రు ఇంటి కబ్జాకు సహకరించారన్న కేసు, అలాగే 2019 ఎన్నికల సమయంలో వంశీ ఓ పోలింగ్ బూత్ వద్ద చేసిన హంగామాకు సంబంధించిన కేసు వంశీ స‌హ‌క‌రించారని కేసు న‌మోదైంది. ఇలా వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు కేసుల్లో వంశీకి బెయిలో, ముందస్తు బెయిలో లభించింది. ఇక ఆరో కేసులో అంటే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన బెయిలు పిటిషన్ పై శనివారం ( మే 17)న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆ కేసులో కూడా వంశీకి బెయిలు వస్తే ఇక ఆయన విడుదలే అని అంతా భావించారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులూ వంశీ విడుదల ఖాయమన్న ఆశాభావంతో ఉన్నారు. అంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై వంశీపై నమోదైన కేసులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానికి నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సపోజ్, ఫర్ సపోజ్ బెయిలు వచ్చినా విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి.   నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఈ నెల 19లోగా కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశిం చింది. అయితే వంశీని ఈ కేసులో శనివారమే పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని అంటున్నారు.  వంశీ వరుస కేసులతో జైళ్లోనే ఉంటున్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు వినవస్తున్నా అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు. 

ట్రంప్ ను భయపెడుతున్న భారత్ స్వదేశీ రక్షణ సామర్ధ్యం

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు అనే కంటే ట్రంప్  సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్.  ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పల్లో నిజముందో లేదో వేరే చెప్పవలసిన అవసరం లేదు.అగ్రరాజ్యం అధ్యక్షుడు అంతటివాడు చెప్పిన విషయాన్నే ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు అంటేనే, అందులో నిజం లేదని అర్థమౌతోందని దౌత్య రంగ నిపుణులు అంటున్నారు.  నిజానికి  ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందే నిజం అయితే..  అందుకు సంబంధించి ఉభయ దేశాలు సంయుక్త ప్రకటన చేయాలి.  కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ అమెరికా ప్రభుత్వం అయినా ఒక అధికారిక ప్రకటన చేసిందా అంటే అదీ లేదు.  ట్రంప్  స్వయంగా ట్వీట్ చేశారు. ఆ వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో అదే స్వరం ఎత్తుకున్నారు. మరో వంక కాల్పుల విరమణకు భారత్  పాకిస్థాన్ దేశాలు రెండూ అంగీకరించినా, అమెరికా  పాత్రను ఒక్క పాక్ మాత్రమే ప్రస్తావించింది.  భారత దేశం ఆ ప్రస్తావన చేయలేదని  అమెరికా పత్రికలే పెద్ద అక్షరాల్లో రాశాయి. అవును. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన వెంటనే అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్, అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. భారత్-పాకిస్థాన్ అధికారులు కాల్పుల విరమణను ధ్రువీకరించారు. అయితే.. పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్రను ప్రస్తావించింది  అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. అంటే  ట్రంప్  క్లెయిమ్’ ను భారత దేశం అంగీకరించలేదనే నిజాన్ని అమెరికా పత్రిక స్పష్టం చేసింది. అయినా.. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నవ్వి  పోదురు గాక నాకేటి సిగ్గు అన్నచందంగా పదే పదే కాల్పుల విరమణ తన ఘనతేనని చాటుకుంటున్నారు. చాటింపు వేస్తున్నారు. నిజానికి అప్పుడే కాదు, ఇప్పటికీ భారత దేశం అమెరికా మధ్యవర్తిత్వం వాదనను  ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే కాదు, భారత్, పాకిస్థాన్ దేశాల డీజీఎంవోల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే కాల్పుల విరమణ నిర్ణయం జరిగిందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.  అలాగే.. భారత విదేశాంగ శాఖ అధికారికంగానే జమ్మూ కశ్మీర్  విషయంలో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించేది లేదని ప్రకటించింది. నిజానికి  భారత విదేశాంగ  మంత్రి జై శంకర్  పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని స్పష్టం చేశారు. కుండ బద్దలు కొట్టేశారు. మరోవంక  భారత దేశం తాత్కాలిక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించింది. అందుకే.. ఇప్పుడు తాజాగా  కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించాలని, ఉభయ దేశాల సైనిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ పొడిగింపు క్రెడిట్  కూడా అగ్ర రాజ్య అధినేత ట్రంప్   తమ ఖాతాలో వేసుకుంటే వేసుకోవచ్చును కానీ..  కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు  వ్యవహారం గానీ, సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ భారత  దేశం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాక్  కాళ్ళ బేరానికి వచ్చిన తీరును గానీ, గమనిస్తే ట్రంప్ సార్  గప్పాల ఘన కీర్తి ప్రపంచానికి తేట తెల్లంగా తెలిసి పోయింది.   అయినా..  భారత దేశం మాటల ద్వారా, చేతల ద్వారా ఎంతగా స్పష్టం చేసినా..  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మాత్రం అదే పాట పాడుతున్నారు. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని  పదే పదే చెప్పుకుంటున్నారు. ఒకే అబద్ధాన్ని పది సార్లు చెపితే నిజం అవుతుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. ట్రంప్ నిరాధార ప్రకటనలతో ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారు. అయితే..  అగ్ర రాజ్యాధినేత  ట్రంప్ ఎందుకు ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లే వేస్తున్నారు? ఎందుకు,  ఆ క్రెడిట్ కోసం అంతలా ఆరాట పడుతున్నారు?  అంటే..  అందుకు  ట్రంప్ వ్యహార సరళి, అగ్ర రాజ్య అహంకారంతో పాటుగా వచ్చిన వ్యక్తిగత దురహంకారం  సహా  ఇతర కారణాలు కూడా ఉంటే ఉండవచ్చును.  కానీ, మూడు రోజుల మినీ వార్’ ద్వారా భారత దేశం సైనిక సామర్ధ్యాన్ని ప్రపంచం ముందుంచింది. ఆర్థిక ప్రగతితో పాటుగా భారత దేశం సైనిక శక్తిగా ఎదుగుతున్న తీరు ప్రపంచం  కళ్లారా చూసింది. స్వదేశీ సాంకేతిక, సాయుధ శక్తిని ప్రపంచాని తెలిసింది. భారత దేశం సైనిక శక్తి రోజురోజుకీ పెరుగుతోంది. అ త్యాధునిక ఆయుధ సంపత్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో, రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ, శక్తి సామర్ధ్యాలు ప్రపంచం కళ్లకు సాక్షాత్కరించింది.  నిజానికి, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగలేదు. కానీ.. ఆపరేషన్ సిందూర్,  మూడు రోజుల మినీ వార్ ప్రపంచానికి  భారత దేశ శక్తి సామర్ధ్యాలను చాటి చెప్పింది. ఒక విధంగా అగ్ర రాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. అందుకే..  ట్రంప్  భారత దేశం అజేయ శక్తిగా ఎదుగుతున్న నిజాన్ని జీర్ణించుకోలేక, అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా భారత రాజకీయాల్లో వివాదాన్ని రాజేసి..  తద్వారా  భారత్ శక్తి సామర్ధ్యాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు  ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కు వంత పాడుతున్నాయి. భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.?  అలాగే ఆపరేషన్‌ సిందూర్‌ ఎందుకు నిలిపివేశారో జవాబు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జైహింద్  ర్యాలీలు నిర్వహిస్తోంది. అయితే..  నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా..  మెల్ల మెల్లగా అసలు నిజం ప్రపంచానికి తెలుస్తోంది. భారత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్ధ్యం, ఆధునిక సాంకేతిక సామర్ద్యాలతో  భారత్ అజేయ శక్తిగా ఎదుగుతోందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. ఆ నిజమే అగ్రరాజ్య అధినేతను భయపెడుతోంది. అందుకే ట్రంప్  బడాయి మాటలకు ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.