వేమిరెడ్డి సతీమణికి నారా భువనేశ్వరి సంఘీభావం

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భువనేశ్వరి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో నారా భువనేశ్వరి స్పందించారు. మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతిరెడ్డికి తాను పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు నారా భువనేశ్వరి. ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న భువనేశ్వరి, మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు వారి విలువను తగ్గించలేవన్నారు. మహిళల స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవన్నారు. మన సంస్కృతి, విలువలు ఆడవారిపై గౌరవాన్ని నిలబెట్టాయనీ,  దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

అడుగడుగునా ఉల్లంఘన... పోలీసులపై ఆగ్రహం

    మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగడుగునా ఉల్లంఘన చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి పోలీసులు అనుమతిస్తే వైసీపీ భారీగా జనసమీకరణ చేసింది. ఉదయం 11 నుంచి మధ్యా 1.40 వరకు సైతం మార్కెట్ యార్డు కు చేరుకోలేదు. పోలీసుల భారీ భద్రతా కల్పించిన అనుమతి ఇచ్చిన 500 మంది కంటే 5వేల వరకు జనసమీకరణ చేశారు. రోడ్డు షో వద్దని పోలీసులు వారించినా వినకుండా వైఎస్ జగన్ పర్యటన రోడ్డు షో గా మారింది. నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై మామిడి కాయలు పోసి ట్రాక్టర్లతో తొక్కించిన నానా హడావిడి చేశారు. వైఎస్ జగన్ వాహనం వెంట వచ్చిన నాయకులు వల్ల స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 

జర్నలిస్ట్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి

  వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ మీడియా  ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు. సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారని శివకుమార్ తెలిపారు. ఉదయం నుంచీ తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇంచార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది. మెమరీ కార్డు.. విజయానంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారని . తనపై వైసీపీ గూండాలే దాడికి పాల్పడినట్టు శివకుమార్ తెలిపారు. తన కెమెరా చిప్ లాక్కుని ఫోటోలు డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

క‘ర్ణాటకం’మళ్ళీ మొదటికి!?

కర్ణాటకం మరోమారు తెరపై కొచ్చింది. నిజానికి.. కర్ణాటకలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే సీరియల్  తెర పైకి వచ్చింది. అయితే..  కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్  ల మధ్య సంధి కుదిర్చింది. ఇద్దరు చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి  పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిర్చి  అప్పటికి ఆ సమస్యను పరిష్కరించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా,డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయినా.. కారణాలు ఏవైనా ఈ రెండు సంవత్సరాలలో ఇద్దరి  మధ్య సంబంధాలు అంత సజావుగా లేవనే విషయంలో ఎలాంటి దాపరికం లేదు.   అదలా ఉంటే..  ఫిఫ్టీఫిఫ్టీ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ప్రకారం సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవలసిన సమయం ఆసన్నం అవుతున్న నేపధ్యంలో గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పుఅంశం  రాష్టంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రముఖంగా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనే వార్తలు కూడా ప్రముఖంగా వినిపించాయి. చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా..  ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని  చెప్పడం ద్వారా సీఎం మార్పు తప్పక పోవచ్చన్న సంకేతాలు ఇచ్చారు.  అయితే..  అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని ఇష్యూని సెటిల్ చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాను రంగంలోకి దించింది. ఆయన మూడు నాలుగు రోజులు  బెంగుళూరులో కూర్చుని, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. సంప్రదింపులు జరిపారు. చివరకు  అధిష్టానం అనుమతి, ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని, ఐదేళ్ళు సిద్దరామయ్య ఒక్కరే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారనీ.. అదే అధిష్టానం నిర్ణయమనీ ప్రకటించారు. నిజానికి..  ఇది ఒక విధంగా డీకే శివకుమార్ వర్గం ఆశించని, ఆ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడని నిర్ణయం.   డీకే వర్గమే కాదు.. జరుగతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేశకులు కూడా ముఖ్యమంత్రి మార్పు ఎంతో దూరంలో లేదు, త్వరలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అవసరం లేదని మీడియా సాక్షిగా ప్రకటించారు. అందుకే అధిష్టానం నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయినా..  డీకే శివకుమార్ మాత్రం ఏం చేస్తాం, అధిష్టానం చెపితే వినాలి  అన్న ధోరణిలో సిద్దరామయ్య ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని  స్వయంగా ప్రకటించారు.  అక్కడితో కర్ణాటకం కథ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పరిస్థితి మళ్ళీమొదటికి వచ్చిందని అంటున్నారు. నిజానికి..  ఇప్పటికీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య  ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నారు. కానీ, తాజా పరిణామాల నేపధ్యంలో  ఆయనకు  పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిన్న మొన్నటి  వరకు ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి అని చెప్పిన  డీకే శివకుమార్  ముఖ్యమంత్రి  పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అంటూ సీఎం కావాలనే తమ మనసులోని ఆశను మరో మారు బహిరంగంగా బయట పెట్టారు. దీంతో మరోమారు ముఖ్యమంత్రి మార్పు అంశం పతాక శీర్షికలకు ఎక్కింది.   ఈ నేపధ్యంలోనే.. తాజాగా డీకే శివకుమార్  అనుకూల వర్గానికి చెందిన ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్..  ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని మరో మారు తెరపైకి తెచ్చారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు డీకే శివకుమార్ కే ఉందని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నారు. డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు ఇదే కోరుకుంటున్నారని యోగేశ్వర్‌ అన్నారు. అయితే..  నిర్ణయం మాత్రం అధిష్ఠానం చేతిలో ఉందన్నారు. డీకేకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరో నేత చెప్పుకొచ్చారు. దీంతో సుర్జేవాల్ దౌత్యంతో పరిష్కారం అయిన ముఖ్యమంత్రి వివాదం.. మళ్లీ మొదటికి వచ్చింది.  నిజానికి.. ఇప్పుడు కూడా  ఈ వివాదం కూడా టీ-కప్పులో తుపానులా సమసి పోతుందని అనుకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు నేతలను   గురువారం( జూలై 10) ఢిల్లీ రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదో జరగబోతోందన్న ఉత్కంఠకు తెరతీసింది.  

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

  వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.  ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశముంది. ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సంఘటనతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తనపై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ అండగా నిలిచిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ సీజ్

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది. కాగా తాజాగా ఈ కేసులో ఉన్న ఎస్ఐబీ ప్రభాకరరావు ఫోన్ ను, ల్యాప్ టాప్ ను సీజ్ చేసింది. ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ లో ఉన్న డేటా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు కీలకమని సిట్ భావిస్తోంది. ప్రభాకరరావు ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపారు. వాటి రిపోర్టులు వచ్చిన తరువాత  సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు పెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న సిట్.. వాటి ఆధారంగా  2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు సిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ప్రభాకరరావుకు నోటీసులు పంపింది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన తరువాత ప్రభాకరరావుకు సిట్ మరో సారి నోటీసులు జారీ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. ఇక సిట్ అరెస్టుల పర్వం జోరందు కుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ.  అదీ ఐపీఎల్‌కున్న క్రేజ్‌, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది ఐపీఎల్. అందుకే దాని వాల్యూ కూడా అలా అలా పెరిగిపోతూ వస్తోంది.  ఏడాది కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 12.9 శాతం పెరిగింది. అంటే 18.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది కంటే ఇది 3.9 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అటూ ఇటూగా  1.56 లక్షల కోట్లు.  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ హౌలిహాన్‌ రిలీజ్ చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం బీసీసీఐ మొత్తం నలుగురు స్పాన్సర్లకు అవకాశం ఇచ్చింది. మైఎలెవన్ సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, సియట్.. ఈ నాలుగు స్పాన్సర్లు 14 వందల 85 కోట్ల మనీని జనరెట్ చేశాయి. ఇది లాస్ట్ ఇయర్ కంటే పాతిక శాతం ఎక్కువ. అదే సమయంలో ఈ టోర్నమెంట్‌ స్పాన్సర్‌షిప్‌గా ఉన్న టాటా గ్రూప్‌.. 2028 వరకు డీల్‌ను పొడిగించింది. ఈ డిల్ విలువ 2 వేల 500 కోట్లు. ఈ కారణాలు ఐపీఎల్‌ బ్రాండ్‌ను మరింత పెంచాయి.  ఐపీఎల్‌ ఓకే.. ఇక ఫ్రాంచైజీల విషయానికి వస్తే.. ఈ సారి టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 17 ఏళ్లపాటు కప్పు గెలవకపోతేనే ఈ టీమ్‌ ఫ్యాన్‌ బేస్, బ్రాండ్‌ వాల్యూ చెక్కు చెదరలేదు. ఈసారి కప్పు గెలవడంతో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. గత ఏడాది 227 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ.. ఈ సారి ఏకంగా 269 మిలియన్ డాలర్లకు చేరింది. ఇండియన్‌ కరెన్సీలో చూస్తే 2 వేల 300 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఎప్పటి నుంచో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటున్నాయి. కానీ ఈ ఏడాది ఆర్సీబీ వీటిని బీట్‌ చేసేసింది. ఇక 2 వేల 21 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, 1963 కోట్లతో మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఉన్నాయి. ఈ ఏడాది బ్రాండ్‌ వాల్యూను అమాంతం పెంచుకున్న ఏకైక టీమ్‌ పంజాబ్‌ కింగ్స్. ఈ ఏడాది తమ ఆటతో అందరి మనసులు దోచుకున్న ఈ టీమ్‌ ఏకంగా తమ బ్రాండ్‌ వాల్యూని 39.6 శాతం పెంచుకుంది. ప్రస్తుతం ఈ టీమ్‌ 12 వందల 9 కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో  ఉన్నా.. ఎదుగుదల విషయంలో మాత్రం టాప్‌ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. 1946 కోట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో.. 1320 కోట్లతో  సన్ రైజర్స్ హైదరాబాద్  ఐదోస్థానంలో.. 1303 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో, 1252 కోట్లతో రాజస్థాన్‌ ఏడో స్థానంలో.. 1217 కోట్లతో  గుజరాత్ టైటాన్స్ 8వస్థానంలో నిలిచాయి.  ఇక 1046 కోట్లతో లక్నో చివరి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్  పెరుగుతూ వస్తుంటే..  టీమ్‌ వాల్యూస్ మాత్రం ఆయా జట్ల పర్ఫామెన్స్‌, ఫ్యాన్‌ బేస్‌ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటున్నాయి. మరి నెక్ట్స్‌ సీజన్‌లో ఏ టీమ్‌ వాల్యూ ఎలా మారుతుందో చూడాలి.

నీటి ఎద్దడి నివారణకు బోర్ పిట్స్.. కేంద్రం సహకారంతో ఏపీ ముందడుగు

నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం,  వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా వేసవితో సంబంధం లేకుండానే నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొందరు నీటి ట్యాంకర్ల దందా చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అలాగే మినరల్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంటు లను నెలకొల్పి నీటిని తోడేస్తున్నారు. నగరాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో  కురిసిన నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు ఉండాలి. ఇంకుడు గుంతల విధానం తో కొంతవరకూ భూగర్భజలాలను కాపాడవచ్చు. అయితే వర్షంపు నీరు ప్రతి చుక్కా భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందుకు ప్రతి ఇల్లు, ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్ మెంట్ లలో ఖాళీ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయ్యాలి. అయితే అందుకు భిన్నంగా ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం గచ్చు చేయించి నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో నీటి ఎద్దడి డేంజర్ బెల్స్ మోగించే పరిస్థితి ఏర్పడుతోంది.  ఇది అరికట్టాలంటే   ఇంకుడు గుంతలు తో పాటు బోర్ పిట్ల ద్వారా నీరు భూమిలోకి ఇంకేలా  మరింత మెరుగైన విధానానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బోరు బావులను తవ్వి దాని చుట్టూ ఇంకుడు గుంతల తరహాలో పెద్దపెద్ద గోతులు తవ్వి వాన,వృధా నీటిని ఒడిసి పట్టి  బోరు ద్వారా భూమిలోకి పంపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఈ తరహా బోర్ పిట్ లను నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది  .మోడల్ ప్రాజెక్టు గా విజయనగరం, సీమ జిల్లాల్లో  బోర్ పిట్ల నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం కేంద్రం నిధులు సమకూరుస్తుంది.   భవిష్యత్ తరాలకు నీటికొరత రాకుండా వాననీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఇందుకుగాను  భూగర్భ జల శాస్త్ర వేత్త లతో ఏపీ సర్కార్  విస్తృతంగా సమాలోచనలు చేసింది. ఈ విధానం వల్ల 80 శాతం అదనంగా భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంటున్నారు.  

32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ.. భక్తజన సంద్రంగా మారిన సింహాద్రి అప్పన్న ఆలయం

ప్రతిష్ఠాత్మక సింహాద్రి అప్పన్న ఆలయంలో బుధ, గురు (జులై 9, 10) జరిగే గిరి ప్రదక్షిణకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడు పదిలక్షల మంది వరకూ హాజరౌతారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు జరిగే ఈ గిప్రదక్షిణకు  దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక అధికార బృందం పర్యవేక్షణ కోసం నియమించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.  32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, వైద్య బృందాలు గిరి  ప్రదక్షిణ మార్గం వద్ద ఏర్పాటు చేశారు.  సింహాద్రి అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతి రాజు స్వామి వారి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి   జెండా ఊపి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు.  

ఓవైసీ కాలేజీ అందుకే కూల్చడం లేదంట.. రంగనాథ్ క్లారిటీ

గ్రేటర్‌లో హైడ్రా కూల్చివేతల పర్వం మొదలైనప్పటి నుంచి పాతబస్తీలోని ఒవైసీ విద్యాసంస్థలపై పెద్ద దుమారమే రేగుతోంది. పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, ఒవైసీకి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ స్పందించారు. ఈ కాలేజీని ఎందుకు కూల్చి వేయడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరూ తమని అడుగుతున్నారన్న ఏవీ రంగానాథ్ అన్నారు. ఈ కాలేజీ ఎఫ్‌టీఎల్‌లో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేశామని చెప్పామని గుర్తుచేశారు. కానీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు.  పేద ముస్లిం మహిళలను వెనుక బాటుతనం నుంచి ఒవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోందని అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కావడంతోనే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు ఏవీ రంగానాథ్. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని ఏవీ రంగానాథ్ తేల్చిచెప్పారు. పాతిక ఎకరాల సరస్సును ఫ్లాట్‌గా మార్చిన ఒవైసీ కుటుంబానికి చెందిన సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చివేశామని గుర్తుచేశారు. మజ్లిస్ నాయకుల నుంచి దాదాపు రూ. 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని వెల్లడించారు. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సామాజిక కారణాలతోనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామని అన్నారు . సామాజిక స్పృహతో ఈ కాలేజీ నడుస్తోందని.. అందుకే కూల్చివేయడానికి కాస్త ఆలోచిస్తున్నామని ఏపీ రంగనాథ్ అంటుండటం మానవతావాదుల ప్రశంసలు అందుకుంటున్నా.. రాజకీయ విమర్శలు మాత్రం తప్పడం లేదు.

బంగారుపాళ్యంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఆ షరతుల మేరకు మార్కెట్ యార్డులో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఎలాంటి అల్లర్లకు చోటులేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తుగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కావాలనే ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు. అయితే పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా సృష్టించారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి మరీ వైసీపీ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారు  వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బంగారు పాళ్యంలోని హెలిప్యాడ్‌కి జగన్ రెడ్డి చేరుకునే సరికి హెలి‌ప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా ఎగబడ్డాయి. వారిని కంట్రోల్ చేయలేక పోలీస్‌లు చేతులు ఎత్తేస్తున్నారు. వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. హెలి‌ప్యాడ్ వద్ద తొక్కిసలాటతో పరిస్థితి గందరగోళంగా మారింది. వైసీపీ నేతల వైఖరితో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వైసీపీ  మూకలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాలకే పరిమితం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు.  అయితే ఈ పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో  ఉచిత ప్రయాణం పథకం అమలు అవుతుందనీ, అయితే ఈ పథకంలో ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలు తమ జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చనీ, అయితే జిల్లా దాటితే మాత్రం టికెట్ తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రం అంతటికీ వర్తింప చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అములులో సాధ్యాసాధ్యలన్నిటినీ అధ్యయనం చేసిన అనంతరం జిల్లాలకు పరిమితం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక పోతే  తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ,  పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి వారి కోసం ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని యోచిస్గున్నది.  గుండెజబ్బులు, కిడ్నీల సమస్య, పెరాలసిస్, తలసేమియా, లెప్రసీ,   వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  

నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ ఉరకలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట మట్టానికి నీరు చేరువ అయ్యింది. దీంతో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నీరు నాగార్జున సాగర్ కు ఉరకలేస్తున్నది. దీంతో  దీనితో నాగార్జునసాగర్ జలాశయానికి 1,05,764 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అధికారులు   9,334 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా..  ప్రస్తుతం 534.50 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 177 టీఎంసీలుగా నమోదైంది. 

అందరి టార్గెట్ హండ్రెడ్ సీట్స్.. మూడు పార్టీలది ఒకటే క(గో)ల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే..  2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.  నిజానికి..  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో  ఎందుకో ఏమో కానీ ఎన్ని ‘కలలు’ మొదలయ్యాయి. అదికూడా మరెవరో కాకుండా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే  ఎన్ని’కల’లకు శ్రీకారం చుట్టారు.  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో..  వంద అసెంబ్లీ, 15 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ముఖ్యమంత్రి  హామీ ఇవ్వడంతో..  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ‘వంద’ చర్చ మొదలైంది.  నిజానికి.. ప్రస్తుత రాజకీయాల్లో బొమ్మా– బొరుసూ తారుమారు అయ్యేందుకు మూడున్నర సంవత్స రాలు చాలా చాలా ఎక్కువ సమయం. మూడున్నర సంవత్సరాలు కాదు..  మూడున్నర వారాలలో కూడా రాజకీయం ఉల్టాపల్టా అయ్యే అవకాశం ఉందని  నడుస్తున్న చరిత్రే చెపుతోంది. ఎక్కడిదాకానో ఎందుకు..  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు కూడా విశ్వసించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో  హస్త రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. సో.. రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. గెలుపు ఓటములు ఎలా తారుమారు అవుతాయో  నెలల ముందు  ఉహించడం కూడా  ఒక విధంగా సాహసమే అవుతుంది. కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు  ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి, ఎప్పుడో మూడున్నరేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే కలలు కంటున్నాయి. నిజానికి..  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రాజకీయ ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. సో... మూడున్నర సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఇప్పుడే చెప్పడం సాహసం కాదు..  ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. అయినా..  మూడు ప్రధాన పార్టీలూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తునాయి. చప్పట్లు కొట్టి  చిటికెల పందిళ్ళు వేస్తున్నాయి.  అయితే..  అందరికీ తెలిసిన ఈ రాజకీయ సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా అంటే తెలియక కాదు కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకున్న 100 అసెంబ్లీ , 15 లోక్ సభ సీట్ల  రాగాన్ని  బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ అధ్యక్షడు ఎన్. రామచంద్ర రావు ఎత్తు కున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ వందకు ఐదు తక్కువ 95 సీట్లు ఖాయంగా వస్తాయని కేటీఆర్   అంటే..   బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు  కమలానికి వంద సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు.  అంతే  కాదు..  గమ్మత్తుగా రామచంద్ర రావు, ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనేందుకు..  కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అన్నంత సింపుల్ లాజిక్ చెప్పారు. అవును..  తెలంగాణ ప్రజలు పదేళ్లు టీఆర్ఎస్/బీఆర్ఎస్ సుందర ముదనష్ట పాలన చూశారు.  ఇప్పుడు అదే తరహాలో.. ఇంకా చెప్పాలంటే.. అంతకంటే ఘోరంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి..  తెలంగాణ ప్రజలకు బీజేపీని గెలిపించడం తప్ప మరో గత్యంతం లేదన్న రీతిలో చెప్పుకొచ్చారు.  అయితే ఎవరి కలలు ఎలా ఉన్నా.. వాస్తవాలు మరోలా ఆన్నాయని చరిత్ర చెపుతోంది. రీసెంట్  ఉదంతాలనే ఉదాహరణగా తీసుకున్నా..  2024 ఎన్నికల్లో బీజేపీ  చార్ సౌ పార్ (400 ప్లస్) కలలు కంది. ఫలితం ఏమిటో చెప్పనక్కర లేదు..  దో సౌ చాలీస్’ (240) దగ్గరే ఆగిపోయింది. అలాగే.. ఇంకొంచెం వెనక్కి వెళితే, 2023 తెలంగాణ  శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్  కూడా హండ్రెడ్ ప్లస్ (100ప్లస్) పైనే ఆశలు పెట్టుకుంది. కానీ.. 40 దగ్గరే ఆగి పోయింది.(అందులో  ఓ పది సీట్లు ఇప్పటికే జారి పోయాయి అనుకోండి అది వేరే విషయం). అలాగే..  ఇంకో అడుగు వెనక్కివేస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో, మారుమోగిన, సారూ ..కారూ .. పదహారు  స్లోగన్ గురించి చెప్ప నక్కర లేదు.  సో .. రాజకీయ నాయకుల  పగటి కల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ.. రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలు మాత్రం, రాను రాను రాజు గుర్రం గాడిద  సామెతను గుర్తు చేస్తున్నాయి. రోజురోజుకు గీత దాటుతున్నాయి. రోత పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం అయితే సర్వతా వ్యక్తమవుతోందని అంటున్నారు.

ఓ సినీ వ‌ట వృక్షం.. శివ‌శ‌క్తి ద‌త్త‌

ఒక్కో వంశానికి ఒక్కో మూల పురుషుడు ఉంటారు. రాజ‌మౌళి వంశానికి శివ‌శ‌క్తిద‌త్త అలాగ‌. ఎందుకంటే ఆయ‌నేగానీ తాను సినిమాల్లోకి రావాల‌ని అనుకోకుండా ఉండి  ఉంటే ప‌రిస్థితి మ‌రోలా  ఉండేది.   అస‌లా కుటుంబానికి సినిమా పిచ్చి ప‌ట్టి ఉండేదే కాదు. రాజ‌మౌళీ వంటి లెజండ‌రీ  డైరెక్ట‌ర్ల‌ు వచ్చి ఉండేవారు కాదు అంటారు  నిపుణులు. శివ‌శ‌క్తి ద‌త్త‌.. చెప్పుకోడానికి కేవ‌లం గీత ర‌చ‌యిత‌. అంతే అనుకోవ‌డంతో స‌రిపోదు. ఆయ‌న ప్ర‌భావం ఆ ఇంట శాఖోప శాఖ‌లుగా విస్త‌రించింది. ఆయ‌న రాసిన పాట‌లు కొన్నే కావ‌చ్చు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఒకటి రెండు సినిమాలే కావ‌చ్చు. కానీ ఆ ఇంట్లో లేని టెక్నీషియ‌న్ లేరు. మీకు తెలుసో తెలీదో.. రాజ‌మౌళి కుటుంబంలో ప్ర‌తి ఒక్క‌రూ సినీ నిపుణులే. ఒక సీన్ ఎక్క‌డో వంటింట్లో కూర‌లో పోపు వేస్తూనే విని.. అది జ‌నానికి ఎక్కుతుందా ఎక్క‌దా.. చెప్పేయ‌గ‌ల‌రు రాజ‌మౌళి త‌ల్లి. వారి ఇంట్లో ప‌ని చేసే వారు కూడా సినిమా ప‌ట్ల ఒక పేష‌న్ని  క‌లిగి ఉంటారు. ఒక స‌మ‌యంలో నాగార్జున   ఇండ‌స్ట్రీలో ఎవ‌రితో పెట్టుకున్నా పెట్టుకోకున్నా రాజ‌మౌళి ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోలేమ‌ని అన్నారు. అందుకు కార‌ణం.. ఆ కుటుంబం అంత‌టి  సిని జీనియ‌స్ ల నిల‌యం కావడమే.  దిగ్గజ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్, దిగ్దర్శ‌కుడు రాజ‌మౌళి, ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి.. ఇలా వారి  ఇంట్లో ఇంకా ర‌క‌రాల రంగాల‌కు చెందిన వారు ఉన్నారు.  కాంచి సైతం కామెడీ పండించ‌డంలో దిట్ట‌. లాస్ట్ బట్ నాట్ లీస్ట్  ర‌మా రాజ‌మౌళీ సైతం కాస్ట్యూమ్ డిజైనింగ్ లో ఎక్స్ ప‌ర్ట్. త‌ర్వాతి త‌రం కూడా మ‌త్తు వ‌ద‌ల‌రా అంటూ కామెడీ పండిస్తూ.. ప్రేక్ష‌క జ‌నాన్ని  ఉర్రూత‌లూగించేదే. ఇక సంగీతంలో కీర‌వాణితో పాటు శ్రీలేఖ, క‌ళ్యాణీ మ‌ల్లిక్ వంటి వారు సైతం ఈ కాంపౌండ్ లోంచి వ‌చ్చిన వారే. క‌ళ్యాణి మ‌ల్లిక్ అయితే.. శివ‌శ‌క్తి ద‌త్త కుమారుడు.   ఒక్క సినీ జీవి ఒక విత్త‌నంలా మారి ఆ ఇంట 24 క్రాఫ్ట్ ల‌లో దాదాపు స‌గం వ‌ర‌కూ రంగాల్లో విస్త‌రింప చేసింది ఎక్క‌డైనా ఉందంటే అది శివ‌శ‌క్తిద‌త్త ఇంట్లోనే.  ఆయ‌న త‌న 92వ ఏట మంగళవారం (జూలై 7) హైద‌రాబాద్ మ‌ణికొండ‌లోని త‌న స్వ‌గృహంలో వ‌యోధిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఒక మేరు న‌గ ధీర‌, ఒక మ‌హా సినీ వ‌ట వృక్షం నేల‌కూలింద‌ని చెప్పాల్సి ఉంటుంది. ఆయ‌న తెలుగు సినిమాల్లో సంస్కృత పాట‌ల‌కు పెట్టింది పేరు. ఈయ‌న విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి సోద‌రుడు, కీర‌వాణికి తండ్రి. రాజ‌మౌళికి పెద‌నాన్న అవుతాడ‌ని అన‌డం క‌న్నా.. వారంద‌రికీ ఆరాధ్య దైవం. సినీ భిక్ష పెట్టిన ఆదిగురువుగా చెప్పాలి. శివ‌శ‌క్తి ద‌త్త సై, ఛ‌త్ర‌ప‌తి, రాజ‌న్న‌, బాహుబ‌లి ద బిగినింగ్, బాహుబ‌లి టూ, ట్రిపుల్ ఆర్, హ‌నుమాన్ వంటి సినిమాల‌కు పాట‌లు రాశారు. బాహుబ‌లి చిత్రంలోని మ‌మ‌త‌ల త‌ల్లి, ఛ‌త్ర‌ప‌తిలో అగ్ని స్ఖ‌ల‌న‌, మ‌న్నేల తింటివిరా కృష్ణ‌, రాజ‌న్న‌లో అమ్మా అవ‌ని వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సాంగ్స్ రాశారు.   ఆయ‌న మొద‌ట సినిమా వారు కారు. సాహితీ వేత్త కావ‌డం వ‌ల్లే సినిమాల్లోకి వెళ్లాల‌ని భావించారు. అలా సినిమాల‌పై ఉన్న ఆస‌క్తి కొద్దీ ముంబై వెళ్లి జేజే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరారు. అక్క‌డ చిత్ర‌క‌ళ‌పై ప్రావీణ్యం సంపాదించారు. త‌ర్వాత క‌మ‌లేశ్ అనే క‌ళం పేరిట చిత్ర‌కారుడిగా కొంత కాలం ప‌ని చేశారు. సంగీతం పట్ల మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం వంటి వాద్యాలను నేర్చుకున్నారు. అలా అలా శివశక్తి దత్త సినీరంగంలో ప్రవేశించిన త‌ర్వాత‌ ఆయన సోదరుడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1988లో విడుదలైన జానకి రాముడు సినిమా ద్వారా శివశక్తి దత్తా రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆపై ఆయన రచించిన పాటలు, స్క్రీన్ ప్లేలు.. తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. 

ప్రజలే ప్రభువులు- చందాలతో పనులు

ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న ఓ కవి మాటను ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామాల ప్రజలు తమ సొంత వ్యయంతో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ప్రజలే ప్రుభువులు.. చంద్రాలతో పనులు అంటూ గ్రామాల అభివృద్ధికి నడుంబిగిస్తున్నారు.   మొన్నటికి మొన్న ములుగు జిల్లాలోనీ వెంకటాపురం మండలం ముత్తారం గ్రామస్తులు  ఓ మోస్తారు వర్షానికి ఉప్పొంగి రవాణాకు ఆటంకంగా ఉన్న వాగుపై కల్వర్టు నిర్మించుకున్నారు. ముత్తారం గ్రామ గిరిజనులు చందాల రూపంలో రెండు లక్షల 50 వేలు  సేకరించి ఆరు సిమెంట్ పైపులు కొనుగోలు చేసి అందరు కలిసి రెండు రోజుల్లో కల్వర్ట్ నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేడు  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోటగడ్డ గ్రామ ప్రజలు..  డ్రైనేజీ కాల్వ కోసం అధికారులకు వినతులు ఇచ్చి ఇచ్చి విసుగెత్తి.. ప్రతి ఇంటికీ నాలుగు వేల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు  630 ఫీట్ల మేర డ్రైనేజీ నిర్మించుకున్నారు.     డ్రైనేజీ నిర్మించండని అధికారులకు చెప్పి చెప్పి విసుగేసి కాలనీ వాసులే సొంత నిధులతో  డ్రైనేజీ పనులు చేయించుకుంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిం చుకోవడానికి నడుం   బిగించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కోటగడ్డ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించిన పనులు జరగలేదు.దీంతో  ఇక అధికారుల చుట్టూ తిరిగితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి సొంత నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టి  మొత్తం 630 ఫీట్ల మేర డ్రైనేజీని నిర్మించుకుంటున్నారు. కాలనీలో ఉన్న దాదాపు 20 కుటుంబాలు ఇంటికి 4000 చొప్పున జమ చేసుకొని డ్రైనేజీ పైపులైన్లు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీలో సిసి రోడ్డు, డ్రైనేజీ కాలువలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోడ్డుపై మురుగునీరు నిలిచి దోమలు, పందులకు ఆవాసంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తామే తలా కొంత డబ్బులు వేసుకొని డ్రైనేజీ నిర్మించుకొన్నారు. 

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (జులై 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదుగంటలకు పైగా సమయం పడుతుండగా, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 8) శ్రీవారిని మొత్తం 78 వేల 320 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 950 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హండీ కానుకల ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది. 

ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర : పయ్యావుల

  ఏపీ బ్రాండ్‌ను  దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ  రాష్ట్రంలో  ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని అడ్డుకునేందుకు  పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాభివృద్దికై ఏపిఎండిసి ద్వారా రూ.9 వేల కోట్ల మేర ఋణా తెచ్చేందుకు  ప్రభుత్వం జి.ఓ. నెం.32 ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఆ ఋణం రాకుండా అడ్డు పడేందుకు విఫల యత్నం చేశారని పేర్కొన్నారు.  జర్మనీలో పనిచేస్తున్న విప్రో ఉద్యోగి ఉదయభాస్కర్ అనే అతనితో  బాంబో మార్కెట్లోని పెట్టుబడిదాలు అందరికీ  పెట్టుబడులు పెట్టవద్దు అంటూ దాదాపు 200 మెయిల్స్  పంపించారు. వైసీపీ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యులు మరియు ఫైనాన్సు స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి ఆర్.బి.ఐ.కి సెబీ కి కంప్లైంట్స్ పెట్టించారు, వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో  పిల్ వేయించారని ఆర్థిక మంత్రి తెలిపారు. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదు, ఓవర్ గా సబ్ స్క్రైబ్ చేశారు. ఇప్పటికైనా వాళ్లు ఏడుపులు ఆపితే మంచిదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేలా వీరు చేసిన తప్పుడు ప్రచారానికి, రాద్దాంతానికి దేశ ద్రోహం కేసులు వీరిపై పెట్టాలని అన్నారు