15 ఏళ్ల తరువాత తెరుచుకున్న పాఠశాల!

వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని బోజ్యానాయక్ తండాలో గత దశాబ్దంనరగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు తెరుచుకుంది. ఈ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు.  గ్రామ యువకుల కృషితో పాఠశాల పున: ప్రారంభమైంది. యువకుల కృషినీ, ఆదర్శాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ పాఠశాల పున: ప్రారంభంలో గ్రామ యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించారు.  గ్రామ యువత అంతా ఏకతాటిపైకి వచ్చి ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం పని చేయడం ముదావహమన్న కలెక్టర్..  విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ పాఠశాల ముందుంటుందన్న ఆశాభావం వ్యక్త  చేశారు.  అదే విధంగా ఈ గ్రామం నుంచి చదువుకొని ఉన్నత స్థాయికి చేరిన వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు.  భవిష్యత్తులో స్కూల్‌కి అవసరమైన పుస్తకాలు, యూనిఫారంలు అన్నీ అందజేస్తామని కలెక్టర్ చెప్పారు.   ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారంటూ సోదాహరణంగా చెప్పిన ఆమె  ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంఈవో సారయ్య.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.  అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు.. పాఠశాల పునః ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు. 

విశాఖలో ట్రైన్ హోటల్.. అచ్చం రైల్లోలాగే

 రైల్లో ప్రయాణం,  రైల్లో ఆహారం అన్నది ఒక విభిన్న అనుభూతి. అదో సరదా.. అదో హాయి.. అటువంటి అనుభూతి, సరదాను విశాఖ వాసులకు అందుబాటులోకి తీసుకు వస్తోంది ఓ హోటల్. అదే ట్రైన్ క్యాప్సుల్. విశాఖ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ మొదటి అంతస్తులో ఈ హోటల్ ఏర్పాటు చేశారు. అచ్చం రైలులోలాగే ఈ హోటల్ లో సింగిల్ ప్యాడ్, బడుల్  ప్యాడ్ లుఉంటాయి.  స్క్రానింగ్ ప్యాడ్లు సైతం ఏర్పాటు చేశారు.   ఒక వరుసలో పైన కింద ఎదురెదురుగా ఈ బెడ్లు డిజైన్ చేశారు.  కర్టెన్లు కూడా ఉంటాయి.  24 గంటలకు రూ600లు ధరగా నిర్ణయించారు.  రైలు బోగి తరహాలో నిర్మించిన ఈ హోటల్లో 73 సింగిల్ ప్యాడ్లు 15 డబుల్ బెడ్ ప్యాడ్లు ఉంటాయి . 18 పడకలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఉచితంగా వైఫై స్నానానికి వేడి నీరు అందుబాటులో ఉంటుంది సింగిల్ బెడ్ కు మూడు గంటలకు 200 రూపాయలు అక్కడి నుంచి 24 గంటల వరకు 400 రూపాయలు వసూలు చేస్తారు.  డబుల్ బెడ్ అయితే 3 గంటలకు 300 ఆ తర్వాత 24 గంటల వరకు అయితే 600 వసూలు చేస్తారు. ఈ కొత్త తరహా రైల్ హోటల్ ను డిఆర్ఎం లలిత్ బోహారా గురువారం (జులై 10) ప్రారంభించారు

విశాఖలో వైసీపీకి షాక్!

మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది విశాఖలో వైసీపీ పరిస్థితది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారౌతోంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆ పార్టీ కార్పొరేటర్లు.. రాష్ట్రంలో అధికారం మారగానే.. రివెంజ్ తీర్చుకున్నారు. పలువురు పార్టీ ఫిరాయించి మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. ఇక ఇప్పుడు  జెడ్పీ చైర్ పర్సన్ విషయంలో నూ అదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లాలో అత్యధిక జడ్పిటిసిలను గతంలో వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జడ్పీచైర్ పర్సన్ గా గిరిజన ప్రాంతానికి చెందిన జల్లిపల్లి సుభద్ర  ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో వైసీపీ జడ్పీటీసీలలో పలువురు ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  నిధులు కేటాయింపు తమ ద్వారా కాక నేరుగా చేస్తున్నారన్నది  వీరి ఆరోపణ.  అయితే ఆమె  ఆ అంశాన్ని అంగీకరించడం లేదు కేవలం స్వపక్షంలో కొందరు పదవి కోసం  చేస్తున్న ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో  రెండు రోజుల కిందట జరిగిన   జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి  వైసీపీకి చెందిన 22 మంది జడ్పీటీసీలు గైర్హాజరయ్యారు.  నిజానికి జిల్లా పరిషత్ లో అనంతగిరిలో సిపిఎం, మాకవరపాలెం లో తెలుగుదేశం మినహాయిస్తే మిగిలిన జడ్పీటీసీలందూ వైసీపీ సభ్యులే. వారిలో అత్యధికులు జడ్పీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడం చూస్తుంటే స్వపక్షంలోనే జడ్పీ చైర్పర్సన్ తీరుపై ఎంత అసంతృప్తి గూడుకట్టుకుందో అవగతమౌతుంది. ఈ నేపథ్యంలో త్వరలో అంటే సెప్టెంబర్ తరువాత జడ్పీ చైర్సన్ పదవి కూడా వైసీపీ చేజారడం ఖాయమని అంటున్నారు. అంత వరకూ ఎందుకంటే.. ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే.. నాలుగేళ్ల పాలనా కాలం ముగియాల్సి ఉంటుంది. అది సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది. ఆ వెంటనే జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసీపీ జడ్పీటీసీలు భావిస్తున్నారు.  ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ విషయంలో చేతులు కాల్చుకున్న వైసీపీ.. జడ్పీ చైర్ పర్సన్ విషయంలో అలా జరగకూడదని భావిస్తున్నది.  దీంతో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు రంగంలోకి దిగి వైసీపీ అసంతృప్త జడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  మరి కురసాల కన్నబాబు బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా చూడాల్సి ఉంది. 

భద్రాచలం వద్ద ఉరకలేస్తున్న వరద గోదావరి

గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద వరద గోదావరి స్నానఘట్టాలను ముంచేసింది. బుధవారం (జులై 9) 24.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతంగా పెరుగుతోంది. గురువారం(జులై 10)  23 అడుగులకు తగ్గింది. అయితే  శుక్రవారం (జులై 11) ఉదయానికి వరద మళ్లీ పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 33.30 అడుగులకు చేరింది. ఇక 5 లక్షల 45 వేల 600 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతున్నది. శుక్రవారం సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పోతే గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తoగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

బంగారు పాళ్యంలో జగన్‌ పర్యటనపై కేసు నమోదు

  చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్‌ పర్యటన  సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించారు. హెలిప్యాడ్‌ వద్ద 30 మందికి, యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిచ్చినా.. నిబంధనల్ని పాటించలేదంటూ ఓ కేసు పెట్టారు.  ఇందులో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, బంగారుపాళ్యం మండల వైసీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ కుమార్‌రాజా పేర్లను ప్రస్తుతానికి చేర్చారు. జగన్‌ వచ్చేటప్పుడు ఆ మార్గంలో రోడ్డు మీద మామిడి కాయల్ని పారబోసిన ఘటనలో అక్బర్‌, ఉదయ్‌కుమార్‌ అనే ఇద్దరిపై రెండో కేసును నమోదు చేశారు. మీడియా ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌పై దాడికి సంబంధించి మూడో కేసు నమోదైంది. BNS 223, 126(1)r/w 3(5) సెక్షన్లు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టనున్నారు. నిందితులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..4 గురు స్మగ్లర్లు అరెస్టు

  అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు  ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్  అధ్వర్యంలో  డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ ఎం. మురళీధరరెడ్డి టీమ్ బుధవారం  రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు.  గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు కనిపించాయి. సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని చుట్టు ముట్టే క్రమంలో  వారు పారిపోదానికి ప్రయత్నించారు.  అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. అక్కడ పరిశీలించగా  22ఎర్రచందనం దుంగలు కనిపించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లార్డ్స్ టెస్టులో అదరగొట్టిన నితీశ్..ఒకే ఓవర్లో 2 వికెట్లు

  ప్రతిష్ఠాత్మక లార్డ్స్  మైదన వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి అదరగొట్టారు. తాను వేసిన తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపేనర్లు డకెట్ (23) క్రానే (18)ను పెవిలియన్‌కు పంపారు. ఇదే ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్  గిల్ పట్టి ఉంటే వికెట్లు పడేవి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లపై పేస్ బౌలింగ్ భారం ఉండగా, వారికి ఆకాశ్ దీప్ సహకారం అందించనున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో టీమిండియా పేస్ విభాగం మరింత బలోపేతమైంది.  

జూబ్లీ ఉప ఎన్నిక.. మాగంటి ఫ్యామిలీకి బీఆర్ఎస్ మొండి చేయి ?

  సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ రాజకీయ భవిష్యత్’ను నిర్ణయించడంలో జూబ్లీహిల్స్ గెలుపు ఓటములు టర్నింగ్ పాయింట్ అవుతుందని, రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సర్వశక్తులు ఒడ్డి అయినా సరే, జుబ్లీ సీటు గెలిచి తీరాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతోందని అంటున్నారు. అలాగే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడంతో పాటుగా, పడి లేచిన కెరటంలా రాష్ట్ర రాజకీయాల్లో  దూసుకు పోవాలని చూస్తున్న బీఆర్ఎస్’ పార్టీకి కూడా జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక గెలుపు అత్యంగా కీలకంగా బావిస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, సిట్టింగ్ సీట్’ ను నిబెట్టుకునెందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక,తెలంగాణలో ఏపీ కూటమి ప్రయోగానికి సిద్దమవుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గాన్ని, లాంచింగ్ ప్యాడ్’గా భావిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, మూడు ప్రధాన పార్టీలు, వ్యూహ రచనతో పాటుగా, అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా,గెలుపు ఓటములను నిర్ధారించడంలో కీలకంగా భావిస్తున్న ముస్లిం మైనారిటీ ఓటు టార్గెట్’గా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహ రచన చేస్తుంటే,బీజేపీ హిందూ ఓటు బ్యాంకు’ ను కన్సాలిడేట్’ చేసే దిశగా పావులు కదుపుతోందని  అంటున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసంగతంలో పోటీచేసి ఓడిపోయినా, మాజీ క్రికెటర్ అజారుద్దీన, బీఆర్ఎస్’నుంచి కాంగ్రెస్’లోకి జంప్ చేసిన జీహెచ్ఎంసీ’ మాజీ మేయర్. బొంతు రామ్మోహన్’ సహా మరి కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  అయితే, ఎంఐఎం  నిర్ణయం పై కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక ఆధారపడి ఉంటుందని, పార్టీ వర్గాల సమాచారం.ఇక బీజేపీ అభ్యర్ధి విషయానికి సమబందించి,గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా లంక దీపక్ రెడ్డి పేరుతొ పాటుగా, గతంలో కూకటపల్లి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసిన, నందమూరి సుహాసిని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేయాలో తేలిన తర్వాతనే, అభ్యర్ధి ఎంపిక పై, కూటమి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నాయకులు అంటున్నారు.   అదలా ఉంటే, మాగంటి మరణం మొదలు, అదే కుటుంబం నుంచి పార్టీ అభ్యర్ధిని బరిలో దించాలని భావించిన, బీఆర్ఎస్’ మనసు మార్చుకుని,ముస్లిం అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్’ అధినేత కేసీఆర్’ ముందు నుంచి కూడా మాగంటి సతీమణి సునీతను బరిలో దించాలని భావించారు. నిజానికి, ఆమె పోటీకి అంత  సుముఖంగా లేక పోయినా,ఆమెను ఒప్పించారని పార్టీవర్గాల సమాచారం. అయితే, అంతలోనే అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్’ పోటీకి సిద్ధం కావడంతో, కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే, వ్యూహం మార్చి ముస్లిం అభ్యర్ధిని బరిలో దించాలని బీఆర్ఎస్ బాస్’ నిర్ణయించినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలో నిన్న (జూలై 9) బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ మైనార్టీ విభాగం సమావేశంలో ముస్లిం మైనారిటీ అభ్యర్ధిని పోటీకి దించాలన్న నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెపుతున్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.సమావేశంలో హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్’  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తమది సెక్యులర్‌ ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్‌, 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదన్నారు.హైడ్రా, మూసీ పేర్లతో రేవంత్‌ సర్కార్‌ ముస్లింల ఇళ్లను కూల్చి వారికి గూడులేకుండా చేసిందన్నారు. మైనార్టీల కోసం ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్’కు బుద్ధిచెప్పాలని మైనార్టీలను కోరారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, బీఆర్ఎస్’ ప్రస్తుతానికి ముస్లిం మైనారిటీ వైపు మొగ్గుచుపుతున్నట్లు తెలుస్తోందిని పరిశీలకులు అంటున్నారు. అయితే,ఇదే తుది నిర్ణయం కాకపోవచ్చని,పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ‘తెలుగు వన్’ కు చెప్పారు. మరో వంక, రాజకీయ పార్టీ చక చక వ్యూహాలను మార్చుకుంటున్న నేపధ్యంలో   జూబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక మరిత్న ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు.  

మా కుమారుల్ని రక్షించండి..పవన్‌కు మహిళ వినతి

  ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ   గండబోయిన సూర్యకుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని  కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయనగరానికి చెందిన ఆమె– మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. బుధవారం  పవన్‌ని కలసి.. తమ ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు వివరించారు.  ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ఎలాగైనా కాపాడాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు.దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.  మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన హామీ ఇచ్చారు. పవన్ చొరవపై కేంద్ర విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది. బాధితులను వీలైనంత త్వరగా గుర్తించి, సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది. 

ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి : సిద్దరామయ్య

  కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య తెలిపారు."ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు విషయంలో సిట్ కీలక నిర్ణయం

  ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా సిట్ బృందాన్ని ముప్పతిప్పలు పెడుతున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును  సిట్ అధికారులు ఐదుసార్లు విచారించారు. ఐదు సార్లు సుమారు నలభై గంటలపాటు ప్రభాకర్‌రావును విచారించింది సిట్. అయితే విచారణలో సమాధానాలు చెప్పకుండా అధికారుల సహనాన్ని పరీక్షించారు ఎస్‌ఐబీ మాజీ చీఫ్. ఈ క్రమంలో ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. పిటిషన్‌లో ప్రభాకర్ రావు మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సిట్ అధికారులను ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెబుతూ వచ్చారు.  తనకేమీ సంబంధం లేదని, తన పైస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేశానని, వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ చేయమంటూ ఎవరికీ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఇదంతా చేశామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. సిట్ అధికారులకు ఆయన డిఫెన్సివ్ మోడ్‌లోనే సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను కస్టోడియల్ విచారణకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రభాకర్ రావుకు ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.

లోకేశ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు

  మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. లోకేశ్ ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుందన్నారు.   మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్య పాఠశాల చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతకొంత సాయం చేయాలి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలిని పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశ్యంతోనే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి తెలిపారు. వేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. మెగా పేరెంట్స్​మీటింగ్​తో గిన్నిస్​రికార్డు నెలకొల్పామన్నారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు.  నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం ఇక్కడ వచ్చిందన్నారు. పేరెంట్స్​ కమిటీ ఏర్పాటు చేయాలని 1998‌లో అనుకున్నానని తెలిపారు.  విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్​కు అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఒక టీచర్​ను కూడా నియమించలేదన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగన్​ చెప్పాలన్నారు. ఆంగ్ల మాధ్యమం పెట్టామంటూ లేనిపోని సమస్యలు తీసుకొచ్చారని ఆరోపించారు. టీచర్లను తాము గౌరవంగా చూస్తాం.. నూతన సంస్కరణలను తీసుకు వస్తామని అన్నారు. ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ ​ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.   

బంగారు పాళ్యానికి..దండు పాళ్యం ముఠా

  ఇదీ జ‌గ‌న్ బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌కు ప‌త్రిక‌ల్లో పెడుతోన్న క్యాప్ష‌న్స్. జులై 9న జ‌గ‌న్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల ప‌ర‌మార్శ‌కు వ‌చ్చారా? లేక త‌న హంగూ ఆర్భాటం చూపించ‌డానికి వ‌చ్చారా? ఎవ‌రికీ అర్ధం కాలేదు. అద‌స‌లు ప‌ర‌మార్శ యాత్ర‌లా లేదు. దండ‌యాత్ర‌ను త‌ల‌పిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. అధ్య‌క్షుడినే ఏకంగా చొక్కా ప‌ట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవ‌రూ ఎవ‌రి మాట విన‌డం లేదు. జ‌గ‌న్ అరుస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదెవ‌రూ. 10 ల‌క్ష‌ల జ‌నాభా వ‌చ్చినా టీడీపీ స‌భ‌లు స‌జావుగా  జ‌రిగిన‌వి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేక‌లేంటి? ర‌చ్చ రావ‌ణ్య‌మేంటి? కొంద‌ర‌న‌నే మాట‌లేంటంటే అర‌లుంగీలు క‌ట్టి వ‌దిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది స‌ర్వ‌త్ర‌ .అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒక‌టే బ్యాచ్, ఒక‌టే లుక్. ఎలాంటి తేడా లేదు. అల‌జ‌డి  సృష్టించ‌డానికి అంద‌రూ క‌ల‌సి క‌ట్టు క‌ట్టుకుని మూకుమ్మ‌డిగా దిగిన‌ట్టుగా క‌నిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల క‌ష్టాలు తెలుసుకోవ‌డం కాదు.. మ‌న్నాంగ‌డ్డి కాదు. ఇది అదే. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌కు విఘాతం క‌లిగించేదే.. కాబ‌ట్టి దీన్ని కంప‌ల్స‌రిగా క‌ట్ట‌డి చేయాలంటారు కొంద‌రు. మ‌రి కొంద‌రైతే ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా స‌మ్య‌ల‌ను తెలుసుకుని.. ప్ర‌జా వేదిక‌లైన అసెంబ్లీకి వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం  క‌నుగొన‌డం ఒక రూట్ మ్యాప్. ఆయ‌న‌స‌లు అసెంబ్లీకే వెళ్ల‌కుండా  ఏం సాధించేట‌ట్టు? అదీ నిజ‌మే క‌దా అంటారు ఇంకొంద‌రు. జ‌గ‌న్ ఇప్ప‌ట్లో అప్ప‌ట్లో అసెంబ్లీకి వ‌చ్చేది లేదు. అక్క‌డ రైతులు కాదు.. ఇత‌రులెవ‌రి స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించే అవ‌కాశమే లేదు. ఇదంతా త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.  అయినా సీజ‌న్ అయిపోయాక వ‌చ్చి ప్ర‌యోజ‌న‌మేంటి? అంటారు కొంద‌రు రైతులు. ఒక వేళ జ‌గ‌న్ నిజంగా చేయాల్సి వ‌స్తే ఇప్ప‌టికే జిల్లాలోని ఫ్యాక్ట‌రీల్లో నిల్వ ఉన్న ల‌క్ష కిలోల ప‌ల్ప్ ని కొనాలి. ఎందుకంటే త‌మ ద‌గ్గ‌ర అంత నిల్వ ఉంది కాబ‌ట్టి.. ఈ సీజ‌న్ కి ప‌ల్ప్ వ‌ద్ద‌న్న‌ది ఫ్యాక్ట‌రీల మాట‌. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడ‌వుతుందో ఆపై తాము కొంటామ‌ని అంటారు వారు. ఈ సీజ‌న్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్ప‌ట్లో ముప్పై రూపాయ‌లు ప‌ర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయ‌ల‌కు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొన‌డం లేదు. ఇక్క‌డ చూస్తే ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు కొంటున్నాయి క‌దాని.. టేబుల్ ర‌కాలు ప‌క్క‌న పెట్టి, తోతాపురి ర‌కం ఎక్కువ‌గా వేసేశారు రైతులు.  ఈ క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల వ‌చ్చిన తంటా ఇది. దానికి తోడు త‌న హ‌యాంలో ఈ రైతుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. జ‌గ‌న్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖ‌లాలు కూడా లేవు. ఈ  సారి వ‌ర్షాలు కూడా బాగా ప‌డ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. ఇది జ‌నానికి అర్ధం కావ‌ల్సిన విష‌యం. కానీ  జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికో వేదిక చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో స‌మ‌స్య ఏంటో అర్ధంకాక ఒక గ‌జిబిజి గంద‌ర‌గోళానికి ఆస్కార‌మేర్ప‌డుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!  

చర్చ రచ్చ ఏదైనా ..చివరకు మిగిలేది శూన్యం

  తెలంగాణలో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన సవాళ్ల రాజకీయం మలుపులు తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతోంది. సూది కోసం సోది కెళితే. అన్నట్లుగా అసలు చర్చ పక్కకుపోయి,రాజకీయ రచ్చ, పొంగి పొరలుతోంది. సాగుతోంది.   నిజానికి, సవాళ్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం రైతు సమస్యల వరకే పరిమితం అయ్యారు. ‘రైతులకు ఎవరు ఎంత మేలు చేశారు తేల్చుకుందాం రండని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’కు,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు బహిరంగ వేదిక నుంచి ఒకే సారి సవాలు విసిరారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణాలు ఏవైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,కేటీఆర్’ రియాక్ట్ అయ్యారు. సోమాజీగూడ గూడ ప్రెస్ క్లబ్  వేదికగా   చర్చకు సై ..అన్నారు. ఇక అక్కడి నుంచి చర్చ,రచ్చగా మారింది. చర్చ జరగవలసింది, చట్ట సభల్లో కానీ, క్లుబ్బుల్లో, పబ్బుల్లో కాదని, అసలు ముఖ్యమంత్రి సవాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్’ కు కానే కేటీఆర్’కు కాదని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు  కేటీఆర్’ విమర్శలను తిప్పి కొట్టారు. నిజమే, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు,కాంగ్రెస్ నాయకులు లేటెస్ట్’గా చెపుతున్నట్లుగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చించేందుకు సరైన వేదిక చట్ట సభలే..నిజానికి  సమస్య లేదా విషయం ఏదైనా, చర్చ జరగవలసింది, చట్టసభల్లోనే,..అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు,ప్రజా సమస్యలపై చర్చలు జరగవలసింది చట్టసభల్లోనే..మరో వేదిక అది ఎంత పవిత్రమైనది అయినా, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు అది తగిన వేదిక కాదు. నిజమే కావచ్చును,చట్టసభలు ఎంత చక్కగా జరుగుతున్నాయో,గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంత గౌరవ ప్రదంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం..అయినా సరే చట్ట సభల తీరు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నా సరే,పభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగవలసింది చట్ట సభల్లోనే.. క్లబ్బుల్లోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో కాదు. ఈ విషయంలో   అధికార, విపక్షాలకు ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు,ఉండరాదు.ఉన్నా అది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని, న్యాయస్థానాలు,రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాలో స్పష్టం చేశారు.    కానీ, ఇప్పడు రాష్ట్రంలో, రైతులకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసింది’ అనే విషయంపై చర్చ పేరిట జరుగతున్నరచ్చ, విషయానికి వస్తే.. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.సవాళ్లు ప్రతి సవాళ్లుగా సాగుతున్నరాజకీయం,రాజకీయమ పార్టీలు, నాయకులు   గమనిస్తున్నాయో లేదో  సామాన్యులకు చీదర పుట్టిస్తోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారని మీడియా చర్చల్లో పాల్గొంటున్న పెద్దలు హెచ్చరిస్తున్నారు.నిజానికి, రాజకీయ పార్టీల తీరు, అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన అంతా శ్రీ వైష్ణవులే ..అన్నట్లు, ఉందని, సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యంతో కూడిన అవేద వ్యక్తపరుస్తున్నారు.  అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున రాజకీయ రచ్చలో అసలు విషయం పక్కకు పోయి, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇదలా ఉంటే ఇప్పడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ఎజెండాతో కొత్త ప్రపోజల్’తో ముందుకొచ్చారు. కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌‌కు రమ్మంటే వస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు.  అలాగే, ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్‌ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, ఈ ప్రతిపాదనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడవలసి వుంది.అయితే, చర్చ అయినా, రచ్చ అయినా, ఏమి జరిగిన ఏమి జరగక పోయినా, చివరకు మిగిలేది శూన్యం.  

తెలంగాణ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో కోర్టు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని  నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  

యశోద ఆస్పత్రికి కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

    బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మాజీ సీఎంకు మరోసారి  డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరగ్గానే ఉందని బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయిలు కొద్దిగా పెరిగాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు.  ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్‌ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు.  కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు గులాబీ బాస్ స్పష్టం చేశారు.  జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ మాజీ మంత్రి హరీశ్ రావు  విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరుకావడం లేదని కమిషన్‌కు హరీశ్ రావు సమాచారం అందజేశారు. అయితే, కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజున విచారణకు హాజరవుతానని జస్టిస్ పీ చంద్రఘోష్‌కు సమాచారం అందజేశారు హరీశ్ రావు    

ట్రంప్ టార్గెట్ భారత్.. ఫార్మా, కాపర్‌లపై టారిఫ్‌ బాదుడు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలు టారిఫ్‌ల విషయంలో డీల్స్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండగా.. రోజుకో దేశానికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. లెటెస్ట్‌గా భారత్‌ను ఈ లిస్ట్‌లో చేర్చారు. ఓ వైపు ట్రేడ్‌ డీల్‌పై ఓ అవగాహనకు వస్తున్న సమయంలో భారత్‌ ఎగుమతి చేసే కాపర్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం.. కాపర్‌పై 50 శాతం టారిఫ్‌ విధిస్తామని ఓ బాంబు పేల్చారు.   నిజానికి ట్రంప్‌ గతంలో సైతం భారత స్టాక్‌ మార్కెట్‌ను అల్లకల్లోలం చేసే వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో అమలైనవి చాలా తక్కువే. కానీ ఈసారి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే మాత్రం భారత్‌కు పెద్దదెబ్బే అంటున్నారు. ఎందుకంటే భారత్‌ ఫార్మా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది భారత ఫార్మా ఉత్పత్తిలో 40 శాతం. ఇక కాపర్ విషయానికి వస్తే.. టెక్, కన్‌స్ట్రక్షన్‌తో పాటు అనేక రంగాల్లో ఉపయోగించే కాపర్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్ డాలర్ల విలువైన కాపర్‌ను ఎగుమతి చేసింది. ఆ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలు నిజంగా అమలైతే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి.  ట్రంప్‌ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధించారు. ఇప్పుడు ఆయన చూపు కాపర్, ఫార్మాపై పడింది. ఫార్మా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ అంటున్నారు. దీని కోసం ఏడాది సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత వారిపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెబుతున్నారు.  ఇప్పటికే బ్రిక్స్‌ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందులోని దేశాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డాలర్‌ ఆధిపత్యం చేలాయించాలనేది ట్రంప్ ఆలోచన. కానీ బ్రిక్స్ దేశాలు అమెరికా ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయనేది ఆయన భయం. అందుకే  తన అమ్ములపొదిలోని అత్యంత బలమైన అస్త్రంగా భావిస్తున్న టారిఫ్‌లను ప్రపంచదేశంపైకి వదులుతున్నారు.  ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే ట్రేడ్‌ డీల్‌పై అమెరికాతో మంతనాలు జరుపుతుంది భారత్. ఇక ఇండియన్ ఫార్మా కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ను అమెరికాకు తరలించలేకపోయినా.. లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని.. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ తన టెంపరితనంతో నిజంగానే నిజంగానే టారిఫ్‌లను విధిస్తే మొదట ఆయా దేశాలకు తిప్పలు తప్పవు. అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవనేది వాస్తవం. ఫార్మా కంపెనీలు ఏసియా దేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే మరింత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికన్లపై మరింత భారం మోపుతాయన్న చర్చ కూడా ఉంది. మరి ట్రంప్‌ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.