టాస్క్ ఫోర్స్ పోలీసుల దారిదోపిడీ

ఖమ్మంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచే చేను మేసిన చందంగా వ్యవహరించారు. దోపిడీలను అరికట్టాల్సిన వారే.. దారిదోపిడీకి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.  ఖమ్మంలో రాజస్థాన్ కు చెందిన మిర్చి వ్యాపారి గమస్తా రూ. 10లక్షల నగదు తో రాత్రి సమయంలో వెళ్తుండగా టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డగించారు.  గంజాయి కేసులో ఇరికిస్తామంటూ బెదరించి ఆ వ్యాపారి వద్ద ఉన్న పది లక్షల రూపాయలలో ఆరు లక్షల రూపాయలు తీసేసుకున్నారు. ఆ తరువాత అతడిని విషయం ఎవరికీ చెప్పవద్దని బెదరించి విడిచిపెట్టారు.  ఖమ్మంలో జరిగిన ఈ సంఘటనను రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి అసోసియేషన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసోసియేషన్ నాయకులు విషయాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ తెలియజేశారు. దీనిపై విచారణ జరిపించిన కమిషనర్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మరో అధికారిని డీఐజీ ఆఫీసుకు సరెండర్ చేశారు. అలాగే వ్యాపారి గుమస్తా నుంచి పోలీసులు అపహరించిన ఆరు లక్షల రూపాయలను రికవర్ చేసి వ్యాపారికి అప్పగించారు.  

గ్రామ పెద్దల అమానుషం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను ఎలా శిక్షించారంటే..?

ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలూ అంగీకరించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసినా కూడా ఆచారం పేరిట గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. పెద్దల అంగీకారంతో ప్రేమపెళ్లి చేసుకున్న ఓ జంట ఏదో చేయకూడని ఘోర అపరాధం చేసిందన్నట్లుగా గ్రామ పెద్దలు అమానుష శిక్ష విధించారు. ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమపెళ్లి గ్రామ ఆచారం ప్రకారం పెద్ద తప్పు అంటూ కంజమజ్జిరా గ్రామ పెద్దలు ఆ జంటకు దారుణమైన శిక్ష విధించారు. ఆ జంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. ఆ తరువాత పాపపరిహారం అంటూ ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి చిత్రహింసలకు గురి చేశారు.  పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు ఇంతటి అమానుష శిక్ష విధించిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

ఢిల్లీలో కుప్ప కూలిన మరో భవనం.. శిథిలాల కింద జనం

ఢిల్లీ ఆజాద్ మార్కెట్‌లో ఓ బిల్డింగ్ కుప్పకూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది. శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ మధ్య కాలంలో భవనాలు కుప్పకూలుతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఓ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో రెండు బిల్డింగులు కూలిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆజాద్ మార్కెట్ ఏరియాలో ఓ బిల్డింగ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 45 ఏళ్ల పప్పు అనే వ్యక్తి చనిపోయాడు. బిల్డింగ్ సమీపంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెట్రో పనుల కారణంగా బిల్డింగ్ కుప్పకూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆజాద్ మార్కెట్‌లో బిల్డింగ్ కూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది.   శనివారం (జులై 12) ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.  సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు ఉన్నట్లు సమాచారం. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే..  ప్రమాదానికి గల కారణాలు  తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని భీకర దృశ్యాలు కలచి వేస్తున్నాయి. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఆ ఇళ్లులు కూడా బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిన్న రజత్ భార్గవ - నేడు విజయసాయి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఎవరూ ఊహించనంత లోతుగా వెళ్తోంది.  చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణం ఎలా జరిగిందో.. డబ్బులు ఎలా రూట్ అయ్యాయో మొత్తం తెలుసుకున్న సిట్..  ఇప్పుడు అందులో పాత్రధారులు, సూత్రధారుల్నే కాదు..  డమ్మీలుగా వాడుకున్న అధికారులతో కలిపి డాట్స్ కలుపుతోంది.  దీంతో కేసు దర్యాప్తు అసలు కింగ్ పిన్ దగ్గరకు చేరువ అవుతోంది.  కొన్ని నెలల కిందటే రిటైర్ అయిన  సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు  చాలా సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు తన పర్యటనలలో రజిత్ భార్గవను ఆయనను పక్కన పెట్టుకునే ఎక్కువ దేశాలకు తిరిగేవారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం రజత్ భార్గవ పరిస్థితి తారుమారైంది. జగన్ రజత్ భార్గవను ఆయనను ముందు పెట్టి మద్యం కుంభకోణం వ్యవహారం నడిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ హయాంలో ఉన్నతాధికారిగా రజత్ భార్గవ  పాత్ర పరిమితం అయిపోయిం దంటారు. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా సిట్ దర్యాప్తులో బయటకు వస్తున్నది. సిట్ ఎదుట రజత్ భార్గవ్ మద్యం కుంభకోణం గుట్టు రట్టు చేశారని, పూసగుచ్చినట్లు జరిగిందేమిటో చెప్పేశారని అంటున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన క్లూస్ అన్నీ రజత్ భార్గవ సిట్ కు ఇచ్చేశారని అంటున్నారు.   ఇక పోతే ఈ కేసులో ఏ5గా ఉన్న విజయసాయిరెడ్డి శనివారం (జులై 12)న సిట్ ముందు హాజరయ్యారు. ఆయన గతంలోనే  ఈ కుంభకోణం విషయంలో తనను తాను విజిల్ బ్లోయర్ గా చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్నదానికి సార్థకత రావాలంటే..  ఇంకా చాలా చాలా చెప్పాల్సి ఉంటుందని  సిట్ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియాఅంతా రాజ్ కేసిరెడ్డే అని అంటున్నారు.. కానీ  కుంభకోణంలో  డబ్బంతా జగన్ రెడ్డికి చేరిందంని మాత్రం చెప్పడం లేదు. అలాగని చేరలేదని కూడా చెప్పడం లేదు. ఆ విషయం తనకు తెలియదంటున్నారు.  నేరుగా కాకపోయినా.. కొన్ని క్లూస్  ఆయన దర్యాప్తు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రాకూడదనే విజయసాయిరెడ్డి ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.  తాజా విచారణలో సిట్ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని విజయసాయిరెడ్డి ఇస్తారని భావిస్తున్నారు.  రూ.32 కోట్ల వరకూ లిక్కర్ స్కామ్ సొమ్మును జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ జరిగిన స్కాంలో ఇది చాలా చిన్న మొత్తం. వందల కేజీల బంగారం, అంతకు మించి షెల్ కంపెనీల్లో నగదు. భారతి సిమెంట్స్, పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్  లోకి చేరిన నగదు, ఇంకా డెన్‌లలలో మిగిలి ఉన్న నోట్ల కట్టల బండిల్స్ ను సిట్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బయటకు తీసుకు రావడం చాలా అవసరం.  

భగవద్గీత శ్లోకం ట్వీట్ చేసిన విజయసాయి

కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు.. కానీ వాని ఫలితముల మీద లేదు... నీవు కర్మఫలములకు కారణం కారాదు... అట్లని కర్మలను చేయుట మానరాదు ...  విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో తాజా పెట్టిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు విజయసాయి శనివారం (జులై 12) ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.    ఇదిలా ఉండగా.. సిట్ నోటీసుల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  ‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ భగవద్గీత శ్లోకాన్ని  పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పడు తెగ వైరల్ అయ్యింది.  

బ‌ద్రీ, నందా మ‌ధ్య డిష్యూం డిష్యూం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు ప్ర‌కాష్ రాజ్. జ‌స్ట్ ఆస్కింగ్ ద్వారా ఈ స్థాయిలో అమ్మ‌క‌మా అంటూ ప‌వ‌న్ పై మ‌రో మారు విమ‌ర్శ‌లు గుప్పించారాయ‌న‌. గ‌త మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ని అధ్య‌క్షుడిగా చేయ‌డం కోసం మెగా కాంపౌండ్ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. నాగ‌బాబు ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ ఎన్నిక‌ల్లో ఫైట్ చేశారు. ప‌వ‌న్ కూడా ప్ర‌కాష్ రాజ్ కే స‌పోర్ట్ చేశారు. ఒక్క ఈ ఇద్ద‌రే కాదు మెగా కాంపౌండ్ మొత్తం ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ త‌రుఫున నిల‌బ‌డ్డారు. అయితే అది వేరు- ఇది వేర‌ని అంటారు ప్ర‌కాష్ రాజ్. బేసిగ్గా ఆయ‌న నాస్తికుడు. కొంత వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న వ్యక్తి ప్రకాశ్ రాజ్.  ఆయ‌న నేప‌థ్యం అలాంటిది. డీప‌ర్ కర్ణాట‌క నుంచి త‌న తండ్రి బెంగ‌ళూరు రావ‌డం.. అక్క‌డ ఆరోగ్యం బాగ‌లేక ఆస్ప‌త్రిలో చేరితే.. అక్క‌డొక న‌ర్సుతో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి ఆపై ఆమెనే పెళ్లాడారాయ‌న‌. ఆ త‌ర్వాత పుట్టిన సంతానంలో ఒక‌రు ప్ర‌కాష్ రాజ్.  ఎన్నేసి హిందూ సినిమాల్లో హిందూ పాత్ర‌లు చేసినా.. స‌రే ఆయ‌న బ‌య‌ట మాత్రం యాంటీ హిందూ- యాంటీ మోడీ- యాంటీ బీజేపీ-  లాంగ్వేజ్ లో మాట్లాడ‌తారు. అయితే ఇక్క‌డ ప‌వ‌న్ కి ప్ర‌కాష్ రాజ్ కి ఉన్న గొడ‌వేంట‌ని చూస్తే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా హిందుత్వాన్ని భుజానికెత్తుకుని మోస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.  మొన్న‌టి మురుగన్ మానాడు, అటు పిమ్మ‌ట హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో  హిందుత్వ నినాదం.. ఇలా సినిమా ప‌రంగా, రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న హిందుత్వాన్ని ప‌బ్లిగ్గానే హ్యాండిల్  చేస్తున్నారు. వ‌క్ఫ్ బోర్డులాగా స‌నాత‌న్ బోర్డు ఉంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే కాషాయంలో తిర‌గ‌డానికైనా వెన‌కాడ్డం లేదు. దేవాల‌యాల‌కు కూడా విరివిగా తిరుగుతున్నారు. వీట‌న్నిటినీ చూసిన ప్ర‌కాష్ రాజ్.. ఆయ‌నపై గ‌త కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా కూడా అమ్ముడ‌వుతారా? అంటూ ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఈ కామెంట్ల కాట్లాట‌లో చివ‌రికి ఎవ‌రు గెలుస్తారు? అస‌లు ప‌వ‌న్ స్కెచ్ ఏంటి? మ‌ధ్య ప్ర‌కాష్ రాజ్ ఈ గిచ్చుడేంట‌న్న‌ది ఇటు పొలిటిక‌ల్ అటు సినిమా ఇండ‌స్ట్రీలో వాడీ వేడిగా చ‌ర్చ న‌డుస్తోంది.

మోడీకి ఆర్ఎస్ఎస్ ఎసరు?

ప్రధాని నరేంద్రమోడీకి బీజేపీ మెంటార్ గా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎసరు పెడుతోందా?  బీజేపీలో, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మోడీ వ్యక్తిపూజ పీక్స్ చేరిందని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆయన పదవి దిగిపోవాలని కోరుకుంటోందా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు, ఆ తరువాత దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి కొనసాగుతున్న ప్రధాని మోడీని ఆ పదవి నుంచి దిగిపోవాల్సిందేననీ, ఆ టైమ్ ఇచ్చేసిందనీ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ గుర్తు చేస్తుండటం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నారు. వచ్చే సెప్టెంబర్ తో ప్రధాని మోడీకి 75 ఏళ్లు వస్తాయి.  ప్రధాని మోడీ హవా బీజేపీలో మొదలైన తరువాత ఆయనే 75 ఏళ్ల వయస్సు నిబంధనను తీసుకువచ్చారని చెప్పాలి. 75 సంవత్సరాలు వచ్చిన  వారెవరూ పార్టీ, ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా నిబంధన విధించారు. ఇప్పుడు మోడీ 75 సంవత్సరాల నిబంధన పరిధిలోకి వస్తున్నారు. ఇక్కడ వయస్సు నిబంధన విషయంలో మోడీకి మినహాయింపు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం మోడీకి వయస్సు గురించి గుర్తు చేస్తూ వారసుడి అన్వేషణ అనివార్యం అని హెచ్చరిక లాంటి సూచన చేస్తోంది.   ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్‌భ‌గ‌వ‌త్‌.. ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని  ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఆయన వయస్సు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీకి ఓ హెచ్చరికేనని అంటున్నారు.   స్థాయితో సంబంధం లేకుండా నాయకుడనే వారు ఎవరైనా సరే నిబంధనలు పాటించి తీరాలి. అలా పాటించకపోతే అసలు నిబంధనలు ఎందుకు? అంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ ప్రధానిగా కొనసాగే విషయంలో ఆయన విస్పష్టంగా తన అభ్యంతరాన్ని చెప్పినట్లుగానే ఉన్నాయి. 75 ఏళ్లు వచ్చిన తరువాత ఎవరైనా సరే తమ పదవులు త్యాగం చేయాల్సిందేనని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు. దీంతో    న‌రేంద్ర మోడీ ప్రధాని పదవిలో కొనసాగడంపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ తో ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. ఈ క్ర‌మంలో నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌ధాని ప‌ద‌విని వ‌దులు కోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌గా ఉన్న మోహ‌న్‌భ‌గ‌వ‌త్ కూడా అదే నెల‌లో ప‌ద‌వీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబ‌రు నాటికి ఆయ‌న మోడీ కంటే కూడా.. ముందే 75వ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌నున్నారు. దీంతో ముందు ఆయ‌న రిజై న్ చేసి..కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. ప్ర‌ధాని మోడీకి కూడా తాను తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుందని అంటున్నారు.  కానీ..  బీజేపీని మూడుసార్లు వ‌రుస‌గా అధికారంలోకి తెచ్చిన నాయ‌కుడిగా మోడీ పదవి నుంచి తప్పుకోవడానికి బీజేపీ అంగీకరిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ప్ర‌పంచ దేశాల‌కు కూడా ‘విశ్వ‌గురు’గా గుర్తింపు పొందిన మోడీ.. ఇప్పటి కిప్పుడు అధికారం నుంచి దిగితే? ఎలా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.   ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, వ‌న్ నేష‌న్‌-వన్.. ఇలా దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ సాధించాలని ప్రయత్నిస్తున్న లక్ష్యాలను మోడీ తనహయాంలో సాధించి చూపారు.  ఈ నేపథ్యంలో మోడీకి దిగిపోవాలంటూ  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్ష హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మోడీకి సన్నిహితుడు.. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు కుడి భుజంగా ఉంటూ వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను ప్రధాని రేసులో లేనని విస్పష్టంగా చెప్పేశారు. తాను రాజకీయ రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో మోడీని కొనసాగించడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడే ఆ పార్టీకి గట్టి చిక్కు వచ్చి పడింది. బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వారి విషయంలో మోడీషా ద్వయం అనుసరించిన విధానంపై బీజేపీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి నాయకుల విషయంలో వయస్సు నిబంధనను కఠినంగా అమలు చేసి వారిని రాజకీయాలకు దూరం చేసిన తీరు పట్ల జనసామాన్యంలో కూడా ఒకింత అసహనం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ కూడా స్టెప్ డౌన్ అయి.. వయస్సు నిబంధన అన్నది తనకు కూడా వర్తిస్తుందని రుజువు చేసుకోవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద 75 ఏళ్ల వయస్సు నిబంధన ఇప్పుడు మోడీ విషయంలో అమలు అవుతుందా? లేదా అన్న ఉత్కంఠ దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. 

యలమంచలి వైసీపీలో గుడివాడ వివాదం

వైసీపీలో జరుగుతున్న  పరిణామాలు గమనిస్తే.. ఇదంతా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అన్న అనుమానం కలగక మానదు. వైసీపీకి ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలవా అన్నట్లు ఆ పార్టీ నేతలు అంతర్గత విభేదాలను రచ్చకీడ్చి కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ నియామకం వైసీపీలో రచ్చకు కారణమౌతోంది. కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ హైకమాండ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.    చాలా కాలంగా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొనసాగుతున్నారు.  గత ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడు సుకుమార వర్మ కు ఎలమంచిలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్మోహన్రెడ్డిని కోరారు కానీ..  ఆయన నిరాకరించడంతో కన్నబాబు రాజు స్వయంగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ వ్యతిరేక పవనాలలో పరాజయం పాలయ్యారు.  ఓటమి తరువాత కన్నబాబురాజు రాజకీయంగా పెద్ద యాక్టివ్ గా లేరు. అయితే గత రెండు నెలలుగా ఆయన మళ్లీ చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.  ఈ దశలో ఆయన వచ్చే ఎన్నికలలో తన కుమారుడిని పోటీకి నిలబెట్టాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా ఉంటున్నారు. అయితే..  ఈ దశలో ఉన్నట్టుండి కరణం ధర్మశ్రీని ఎలమంచిలి సమన్వయకర్తగా పార్టీ హైకమాండ్ నియమించింది.  ఈ ప్రకటనకు కొన్ని రోజులు ముందు  కన్నబాబు రాజును వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మాట్లాడారు.  ఆ సందర్భంగా ఈ సారి కన్నబాబు రాజుకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అయితే మొదటి నుంచీ కూడా కన్నబాబురాజు ప్రత్యక్ష ఎన్నికలో తన కుమారుడిని గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకు కావలసిన పట్టు కన్నబాబురాజుకు యలమంచలి నియోజకవర్గంలో ఉంది కూడా. అందుకే జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ కు కన్నబాబురాజు అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో  సరిగ్గా తన పుట్టినరోజు రోజున పార్టీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ ప్రకటన వెలువడటంపై కన్నబాబురాజు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీలోని ఒక వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని కన్నబాబురాజు భావిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనవసరంగా తన నియోజకవర్గ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో కూడా గుడివాడ అమర్నాథ్   బొడ్డేడి ప్రసాద్ ద్వారా తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగించారని ఈ సందర్భంగాకన్నబాబురాజు గుర్తు చేస్తున్నారు.  పార్టీ పరాజయం తరువాత గుడివాడ అమర్నాథ్ ను పార్టీ అధినేత జగన్ చోడవరం ఇన్చార్జిగా నియమించారు. దీంతో అప్పటి వరకూ అక్కడ ఇన్ చార్జ్ గా ఉన్న కరణం ధర్మశ్రీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇక్కడే గుడివాడ చక్రం తిపపారని కన్నబాబురాజు వర్గం అనుమానిస్తోంది. తన వయస్సును కారణంగా చూపి పక్కన పెట్టే విధంగా గుడివాడ తనకు వ్యతిరేకంగా పావులు కదిపారనీ, ఆ కారణంగానే  యలమంచలి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కరణం ధర్మశ్రీ నియామకం జరిగిందని కన్నబాబు రాజు వర్గం అంటున్నది. వాస్తవానికి కన్నబాబు రాజు తన స్థానంలో తన కుమారుడిని తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కన్నబాబురాజు కుమాడుడు సుకుమార్ వర్మ గత దశాబ్దంగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉంటున్నారు. ఇప్పుడు ఉరుములేని పిడుగులా నియోజవర్గ సమన్వయకర్తగా జగన్ కరణం ధర్మశ్రీని నియమించడం వెనుక గుడివాడ అమర్నాథ్ ఉణ్నారని కన్నబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.  కరణం ధర్మశ్రీ నియామకంతో ఉత్తరాంధ్ర వైసీపీలో సామాజిక సమతుల్యం కూడా దెబ్బతిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక పోతే  యలమంచలిలో కరణం ధర్మశ్రీకి సహకారం అందే పరిస్థితి ఇసుమంతైనా లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో నియోజవకర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. 

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి చేరువలో ఇక్కడ నీటిమట్టం ఉంది.  ప్రజలు నదిలోకి దిగకుండా, లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం 40.40 అడుగులకు చేరింది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 

ఫ్యుయెల్ స్విచ్ లు ఆఫ్ కావడంవల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి వందల మంది మరణించడానికి కారణం టేకాఫ్ అయిన తరువాత ఇంజిన్లకు ఫ్యుయెల్ సరఫరా చేసే స్విచ్ లు ఆఫ్ కావడమేనని తేలింది. టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఈ స్విచ్ లు ఆగిపోయాయని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.   విమానం టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయాయనీ..  వెంటనే అప్రమత్తమైన పైలట్ వాటిని ఎందుకు ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడనీ, దానికి ఆ రెండో పైలట్ తాను ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చాడనీ నివేదిక వెల్లడించింది. అలాగే పైలట్ మేడే కాల్ చేశాడనీ,  అయితే ఆ కాల్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి  స్పందన వచ్చేలోపే విమానం కూలిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.  

రాజాసింగ్ రాజీనామా ఆమోదం... బీజేపీకీ మైనస్సే

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఆ పార్టీతో పదేళ్ళ అనుబంధం ముగిసింది. ఈ పదేళ్ల కాలంలో రాజాసింగ్ తెలంగాణలో బీజేపీకి ఫేస్ గా ఎదిగారు. హిందుత్వకు రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణలో రాజాసింగ్ బీజేపీని మించి ఎదిగారు. ఆ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని నాయకులుగా గుర్తింపు పొందిన అందరి కంటే ఎక్కువ జనాదరణ పొందారు. ఇదే ఆయనను బీజేపీకి దూరం చేసింది. ఆ పార్టీ తలుపులు రాజాసింగ్ కు శాశ్వతంగా మూసుకుపోయేలా చేసిందా?  అంటే రాజకీయ పరిశీలకుల నుంచీ, బీజేపీ శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది.   అయితే రాజాసింగ్ పార్టీలో ఇంతలా ఎదగడానికి కారణం ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే. స్వపక్షం, విపక్షం అని లేకుండా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటమే అంటారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర పార్టీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిపై ఘాటు విమర్శలే చేశారు. ఇవన్నీ క్రమశిక్షణ గీత దాటడమేనని బీజేపీ అధిష్ఠానం భావించింది. ఈ క్రమంలో రాజాసింగ్ కు, పార్టీకీ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయినా రాజాసింగ్ రాజీనామా అంటే గతంలో కూడా పలుమార్లు ప్రకటించారు. అయితే అప్పడు ప్రతి సందర్భంలోనూ పార్టీ ఆయనను బుజ్జగించింది.  ఓ సారి సస్పెండ్ చేసి కూడా.. మళ్లీ ఆ సస్పెన్షన్ ను రద్దు చేసి మరీ గత ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అందుకు కారణంగా రాష్ట్ర బీజేపీలో రాజాసింగ్ కు ఉన్న పాపులారిటీ మరో బీజేపీ నేతకు లేకపోవడమే. అయితే.. రాష్ట్రంలో పార్టీని మించి రాజాసింగ్ పాపులారిటీ పెరగడంతో ఇక ఆయనను భరించలేమన్న నిర్ణయానికి వచ్చేసిన హై కమాండ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది.  ఇప్పుడు రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. హిందుత్వ ముద్ర పడిన ఆయన మరో పార్టీలో చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. మైనారిటీలను దూరం చేసుకోవడానికి బీజేపీ వినా మరో పార్టీ ధైర్యం చేసే పరిస్థితి తెలంగాణలో.. ఒక్క తెలంగాణ అనేమిటి? దేశంలో ఏ పార్టీకి లేదు.  ఇక ఇప్పుడు ఆయన ముందు మిగిలినది ఒకే ఒక్క ఆప్షన్. స్వతంత్రంగా గోషామషల్ లో తన పాపులారిటీ పోకుండా కాపాడుకోవడం. అయితే అదేమంత సులువు కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలింతకీ బీజేపీ రాజాసింగ్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి రావడానికి పలు కారణాలున్నా.. ప్రధానంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆయన అధిష్ఠానన్నే ప్రశ్నించేలా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలే అని చెప్పాలి.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపినను వ్యతిరేకించిన రాజాసింగ్.. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తానంటూ ముందుకు వచ్చారు. అయితే కారణాలేమైనా ఆయన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. ఇందుకు తన మద్దతుదారులను బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బెదరించారని ఆరోపణలు చేశారు. అంతే కాదు.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేసేశారు. సరిగ్గా ఇక్కడే బీజేపీ రాష్ట్ర నేతలు ఒక అవకాశం దొరికిందని భావించి రెండో ఆలోచన లేకుండా ఆయన రాజీనామాను హైకమాండ్ కు పంపేశారు. ఆయనను పార్టీ భరించలేదని నివేదిక కూడా ఇచ్చారని చెబుతారు. దీంతో పార్టీ హై కమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించేసింది.  ఈ ఆమోదం రాజాసింగ్ కే కాదు, రాష్ట్రంలో బీజేపీకీ మైనస్సేనని పరిశీలకులు అంటున్నారు. అ గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించడం వల్ల ఎలా పార్టీ నష్టపోయిందో.. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా ఆమోదం వల్ల కూడా అంతటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. 

కాకినాడ GGH లో నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్

  కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై  నలుగురు ఆర్ఎంసి  ఉద్యోగులు  సస్పెన్షన్ విధించారు. ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్ చక్రవర్తి,  టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అజ్ఞాతంలో A1 నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు.  ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నివేదిక ఆధారంగా నిందితులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్‌పి బిందుమాధవ్‌ మాట్లాడుతూ నిందితులను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నామన్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు  

గవర్నర్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ

  రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను సీఎం గవర్నర్‌కు  వివరించారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించి, పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు. బనకచర్ల అంశంపై గవర్నర్‌‌తో చర్చించినట్లు తెలుస్తోంది

ఎంపీ రేణుకా చౌదరికి ఊరట

  మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. 2014 లో ఆమెపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది.  2014లో తనకు, లేదా తన భర్తకు వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి రేణుకా చౌదరి చీటింగ్ చేశారంటూ భూక్య రాంజీ భార్య కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. అయితే రేణుకపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పును వెలువరించారు. రేణుక తరపున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు.   

అల్లు అస్సలూహించలేదు కదూ!?

  నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్. దానికి తోడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లు తున్నట్టుగానూ భావిస్తున్నారట ఇక్కడ ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఇక్కడ అసలు మేటరేంటంటే.. ఈయనగారి ఈమాత్రం రాజకీయానికి అనవసరంగా వేలు పెట్టి లేని పోని గొడవకు కారణమయ్యాం కదాని తెగ ఫీలవుతున్నారట పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్.  పుష్పరాజ్ గా ఫేమస్ అయిన దానికంటే.. నంద్యాల రవి కోసం ప్రచారానికి వెళ్లినపుడే ఎక్కువగా ట్రోల్ అయ్యారాయన. అంతేనా కుటుంబంలో లేని పోని గొడవలు. నానా యాగీ జరిగింది. నాగబాబు ట్వీట్ నుంచి మొదలు పెడితే.. మెగాహీరోల్లో సాయి ధరమ్ వంటి కొందరు హీరోలు అల్లువారబ్బాయిని అన్ ఫాలో చేయడం వంటి పరిణామక్రమాలు. ఆపై అల్లు అర్జున్ ఈ మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చుకోవల్సి రావడం.. ఇలా నానా రకాల రభస జరిగింది. ఏదో తన రెడ్డింటి భార్యామణి బంధువు కదాని.. వెళ్లినందుకు ఇంత హైరానా హంగామా జరిగాయి. ఇప్పుడవన్నీ బూడిదలో పోసిన పన్నీరా? అన్న క్వశ్చిన్ మార్క్ అల్లు అర్జున్ని తెగ డిస్ట్రబ్ చేస్తోందట.  తాను సపోర్టుగా వెళ్లిన రవి చూస్తే కూటమి పార్టీలకే పెద్ద దిక్కయిన టీడీపీలోకి వెళ్లడమంటే ఇన్నాళ్ల పాటు తాను అనుభవించిన కష్టానికే అతి పెద్ద అవమానకరంగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు. మరొక పక్క చూస్తే రాజకీయ కక్ష సాధింపుల్లాంటి ఘటనలు. ఎటు నుంచి ఎటు చూసినా.. నంద్యాల ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినా, తనకు నేషనల్- స్టేట్ అవార్డులు రెండొచ్చినా.. రవీ తీసిన ఈ ఎదురు దెబ్బ ముందు అవన్నీ తేలిపోయినట్టుగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఇది తాను అస్సలు ఊహించలేదట. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు.  ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్లి కూడా అక్కడ రవి ఓడిపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన పార్టీయే మారనున్నారు. అంటే, ఒకటికి రెండు దెబ్బలు. రవి కోసం నంద్యాలకు వెళ్లడంతో తనను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి. ఈగ కూడా వాలనివ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ అడవులను దోచేవాడు హీరో ఏంటన్న కామెంట్ల సమయంలో కూడా అల్లు అర్జున్నే వెనకేసుకొచ్చారు వీరంతా. దీనంతటికీ కారణమైన రవి ఒక వేళ టీడీపీలోకి వెళ్లిపోతే.. తాను కూడా ఆ పార్టీలోకి వెళ్లినట్టా? లేక ఫ్యాన్ పార్టీలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కంటిన్యూ అవుతుందా? తేలాల్సి ఉందంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ.

కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ సీఐ సస్పెండ్

  హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. DTF నర్సిరెడ్డి, ఏఈఏఎస్ మాధవయ్య సహా మిగతా వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది. తనిఖీలు చేయకుండా కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుపై వేటు వేసింది. కల్తీ కల్లు ఘటనపై ఐదు టీంలో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ   ఇప్పటికే  హైదర్‌నగర్, హెచ్ఎంటీ హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది . నలుగురు వ్యాపారులు  రవితేజ గౌడ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు.  కల్తీ కల్లు తాగి 8 మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.   

చెలరేగిన బుమ్రా..ఇంగ్లండ్ ఆలౌట్

  లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడో టెస్టులో టీమిండియా పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు 251/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి మరో 102 పరుగులను ఇంగ్లాండ్‌ జోడించింది. ఆ మూడు వికెట్లనూ బుమ్రానే తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే(56), వికెట్ కీపర్ జేమీ స్మిత్‌(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.  

కొత్త రేషన్​కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

  తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్‌ పంపిణీ చేసింది.  త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డుల జారీ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల కార్డు రేషన్ కార్డులిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది.