తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

తెలుగు రాష్ట్రాలలో గురువారం (జులై 10) ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో అలాగే కరీంనగర్ జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలో ఒక చిన్నారి సహా ఐదుగురు మరణించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి మైదుకూరు వెడుతున్న స్కార్పియో వాహనం అతి వేగంగా ముందు వెడుతున్న ఓ ట్రాక్టర్ ను ఢీ కొంది. ఈ దుర్ఘటనలో  ఇద్దరు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్ను మూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద బైక్ పై వెడుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ సంఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. 

రాణా, దేవరకొండ విజయ్ సహా పలువురు నటులపై ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది. ఇందుకు సంబంధించి   29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద కేసులు నమోదు చేసింది. ఈడీ కేసులు నమోదు చేసిన వారిలో ప్రముఖ నటులు దగ్గుబాటి రాణా,  విజయ్ దేవరకొండ,, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ఉన్నారు. గతంలోనే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ..వీరంతా భారీ పారితోషికాలు తీసుకుని నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని నిర్ధారణకు వచ్చింది.  అలాగే ఈ కేసులో ప్రముఖ యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, , సిరి హనుమంతు సహా  పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు  కూడా ఉన్నారు. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసి విాచరణకు పిలిచే అవకాశం ఉంది. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై 9) శ్రీవారిని మొత్తం 76 వేల 501 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 33 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది. ఇలా ఉండగా తిరుమలలో బిగ్, జనతా  క్యాంటీన్ల ఏర్పాటుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరమలలో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వాహకులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి  సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మిన్ భవనంలో  ఈ సమావేశం జరిగింది. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23న టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తిరుమలలో గుర్తింపు పొందిన హోటళ్లు, క్యాంటిన్ల నిర్వాహకులతో టీటీడీ ప్రిబిడ్ మీటింగ్ నిర్వహించింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని ఈ సందర్భంగా టీటీడీ ఈవో, ఏఈవోలు ఆదేశించారు. భక్తులకు లాభాపేక్ష లేకుండా, సేవా దృక్ఫథంతో నిర్దేశిత ధరలకే నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు. 

నటుడు ఫిష్ వెంకట్ కు తెలంగాణ సర్కార్ చేయూత

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను బుధవారం (జూన్ 9) మంత్రి శ్రీహరి పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడమే కాకుండా..తక్షణ ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించారు. రెండు కిడ్నీలూ పూర్తిగా దెబ్బ తినడంతో ఇన్నాళ్లూ డయాలసిస్‌తో నెట్టుకొచ్చిన వెంకట్ పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు కిడ్నీ  ట్రాన్స్ ప్లాంట్ చేయక తప్పని పరిస్థతి ఏర్పడింది. చికిత్స చేయించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పుడు వెంకట్ కుటుంబ సభ్యులు కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నారు.  

అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక ప్రముఖ దినపత్రిలో గత కొన్ని రోజులుగా క్రైమ్ వార్తలు రాస్తున్న మెట్ల కుమార్ గత నెల 23న తన బైక్, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచీ కనిపించకుండా పోయి మెట్ల కుమార్ గురువారం (జులై 8) ఈస్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో శవంగా కనిపించాడు. మెట్ల కుమార్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి వయస్సు 45 సంవత్సరాలు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ కు తరలించారు.  మెట్ల కుమార్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం : సీఎం రేవంత్

  గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ఇందుకు శిక్షించాల్సి వస్తే… ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కెసీఆర్ చేసిన పనికి వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిన పరిస్థితిని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీ అనుభవం సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడితే పరిగణలోకి తీసుకుంటాం అవసరమైతే ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మా మంత్రులకు పంపిస్తా కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా. దయచేసి నన్ను పబ్బులు, క్లబ్బుల్లో చర్చకు పిలవొద్దు అన్నారు. ఎవరు పెరిగిన నేపథ్యం వారిని అలా మాట్లాడిస్తుంది. అని పేర్కొన్నారు.

యాపిల్‌ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్‌ ఖాన్‌కి బాధ్యతలు

  ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. విలియమ్స్‌ సీవోవో బాధ్యతలను యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సబిప్‌ ఖాన్‌‌కు  ఈ నెల చివర్లో అప్పగించనున్నారు. ఈ క్రమంలో డిజైనింగ్‌ టీమ్‌  బాధ్యతలను నేరుగా టిమ్‌కుక్‌ స్వీకరించనున్నారు.  సబిప్‌ ఖాన్‌ మాలాలు భారత్‌లో ఉన్నాయి. ఆయన యూపీ మొరాదాబాద్‌ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్‌ గ్రేడ్‌ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్‌కు  వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికా కు వెళ్లారు.  1995లో ఆయన యాపిల్‌ ప్రొక్యూటర్‌మెంట్‌ గ్రూప్‌లో పనిచేశారు.

ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు

  గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.  ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి.   ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.  

వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు

  గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ. 1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది.  గత జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి. కాగా బుధవారం హుండీ, మ్రొక్కుబడుల లెక్కింపు చేపట్టగా  113 రోజుల కాలపరిమితికి గాను స్వామి వారికి భక్తుల నుండి కానుకుల రూపంలో  46 లక్షల 76 వేల, 204 రూపాయల నగదు, 19 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 319 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి.

అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ

  గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయ వద్దకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూడగా హుండీ కూడా పగలగొట్టి అందులో ఉన్న సొమ్మును దొంగిలించినట్లు గమనించడం జరిగిందనీ అన్నారు.   ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేయగా ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ ,గుమస్తా వచ్చి చోరీ జరిగినప్పుడు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. శివాలయంలో గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని, సుమారు 15 నుండి 21వేల వరకు సొమ్ము పోయి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

  తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ అవసరాల మేరకు కేంద్ర మంత్రి నడ్డా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కాకుండా, అన్ని జిల్లాలకు యూరియా పంపిణీ చేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు.  సీఎం రేవంత్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న నడ్డా బుధవారం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇటీవల రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ, వరంగల్‌ ఎయిర్‌ఫోర్ట్ ఆర్థిక సాయం, హైదరాబాద్‌-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై చర్చించారు.

హె‌చ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్

  హైదరాబాద్ క్రికెట్  అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. జగన్మోహన్ రావు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని బెదిరించారని నిర్ధారణ కావడంతో ఇవాళ  ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20 శాతం టికెట్లు  ఉచితంగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో.. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన  తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది

రైతన్నలకు బాబు సర్కార్ తీపి కబురు.. ధ్యానం పాత బకాయిలకు మోక్షం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్‌లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. ఆ క్రమంలో మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ జులై 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో ఈ ధాన్యం బకాయిల సొమ్ము జమ కానుందని తెలుస్తుంది.  ఇదే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.672కోట్లు విడుదలకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 32 వేల మంది రైతులకు ఈ నిధులు మంజూరు ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.  

అమరావతిలో తొలి అడుగు.. వచ్చే డిసెంబరు నాటికి ఎంఎల్ఏ క్వార్టర్లు సిద్దం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా  అభివృద్ధి చేస్తున్నారు. ఈ సముదాయాలలో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలూ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే సౌర విద్యుత్, గ్రౌండ్ వాటర్ రీచార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ వంటి మెరుగైన వసతులు కల్పిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం (జులై 9)న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల సముదాయాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ క్వార్టర్ల నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వసతి గృహ సముదాయాన్ని మొత్తం 12 టవర్లలో   288 క్వార్టర్లు నిర్మిస్తున్నారు. ఇవి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.  వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని సభాపతి తెలిపారు. అదే విధంగా 35 మంది మంత్రులూ, న్యాయమూర్తుల కోసం కూడా అమరావతిలో క్వార్టర్స్ నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.  స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ నివాస సముదాయాలకు కూడా మంత్రుల క్వార్టర్స్ తో  పాటు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని స్పీకర్ ఈ సందర్భంగా సూచించారు.అలాగే..  బయటి రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అమరావతికి వచ్చినప్పుడు వారికి తాత్కాలిక వసతులు కల్పించేలా కూడా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పోతే సీఎం అధికార నివాసం, రాజ్ భవన్ లు కృష్ణానది ఒడ్డున నిర్మితమౌతాయి.   అదలా ఉంటే.. ఆగస్టు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తెలుగుదేశం కూటమి ఏడాదిపాలనపై ప్రత్యేక చర్చ సహా వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. 

అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్

  పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు. ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్‌ లోపల, బయట, చుట్టుపక్కల పారిశుధ్యం తనిఖీ చేయాలనుకున్న జిల్లా కలెక్టర్, ఆకస్మికంగా క్యాంటీన్‌కు  వెళ్ళారు. భోజనంకు వచ్చిన వారితో  పాటు ఆహారం తింటూ అన్నా కాంటీన్ లో ఆహార నాణ్యత తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్పందనను కోరారు. అన్నా క్యాంటీన్ నాణ్యత, నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి పరిచారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం రోజుకు దాదాపు రూ.90 ఖర్చు చేసి, వారికి రూ.15 కనీస ఖర్చుతో అందిస్తున్నదన్నారు. ప్రజలు అన్నా కాంటీన్ లో ఆహారాన్ని తీసుకోవాలని,  ఆకలితో ఉండకూడదని కోరారు.  క్యాంటీన్‌లో ఏవైనా లోపాలు ఉంటే  తెలియజేయాలని, వాటిని వెంటనే సరిచేస్తామని అన్నారు.

ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతిలో చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి    సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది.  ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం సిద్ధమవుతోందట. బనక చర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని చెబుతున్నారు.  

జ‌గ‌న్ పార్టీకి జ‌డ గండం?

మొన్న‌టి విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌ర ఉగాది పంచాంగం చ‌దువుతుండ‌గా ఆ పండితుడు చెప్పిందేంటంటే జ‌గ‌న్ కి స్త్రీ మూల‌క స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని. ఆ స‌రికే ఆయ‌న త‌న త‌ల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గ‌ట్రా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ్. ఇదే అతి పెద్ద గండం అనుకుంటే ఆయ‌న ఇంటా  బ‌య‌టా కూడా స్త్రీ  మూల‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్న‌ట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొన్న‌టికి మొన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ కార‌ణంగా  భువ‌నేశ్వ‌రి మాత‌ను అన‌రాని మాట‌ల‌ని.. ఆపై అది పార్టీకి అతి  పెద్ద చేటు తెచ్చిన అంశంగా త‌యారైంది. క‌ట్ చేస్తే నేడు ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనే ఈ కోవూరు మాజీ ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న  ప్ర‌శాంతిరెడ్డిని కూడా స‌రిగ్గా ఇలాంటి మాట‌లే అని పార్టీకి మ‌మూలు చెడ్డ పేరు తేలేదు. బేసిగ్గా జ‌గ‌న్ త‌న ప‌థ‌కాల‌న్నిటిలోనూ మ‌హిళ‌లే ప్ర‌ధానంగా ఉండాల‌ని భావించే ర‌కం. ఎందుకంటే మ‌గాళ్ల మూడు, ఓటు ఏ క్ష‌ణం ఎలా ట‌ర్న్ అవుతుందో తెలీదు. అదే మ‌హిళ‌లు అలాక్కాదు. వారి ఓటు- రూటూ అంతా స్ట్రయిట్ గా ఉంటాయ‌ని ఆయన నమ్మకం. అందుకే త‌న ఇంటి నుంచి త‌ల్లి, చెల్లి దూర‌మైనా స‌రే, రాష్ట్రంలో ఇంటింటా ఉన్న మ‌హిళల‌నే తన  త‌ల్లి , చెల్లిగా భావించారాయ‌న‌.  స‌రిగ్గా అదే  స‌మ‌యంలో క‌న్న త‌ల్లి, తోడ‌బుట్టిన చెల్లితో పాటు.. త‌న‌కు సోద‌రి వ‌ర‌స అయ్యే వైయ‌స్ సునీత నుంచి కూడా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కుంటున్నారు జ‌గ‌న్. అంతే కాదు.. ఇటీవ‌ల మాజీ మంత్రి, వైసీపీ మ‌హిళా నేత విడద‌ల ర‌జ‌నీ సైతం జ‌గ‌న్ అంటే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌బ‌రుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌పై ఇన్ని కేసులు న‌మోద‌వుతుంటే పార్టీ నుంచి క‌నీస మ‌ద్ధ‌తు లేద‌ని ర‌జ‌నీ వాపోతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆమె జ‌గ‌న‌న్న‌ను తెగ తిట్టుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి రోజా లోలోన ఎన్ని రాజ‌కీయ‌పు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారో ఆ వెంక‌న్నకే ఎరుక అంటున్నారు. న‌గ‌రి వైసీపీలోకి గాలి సోద‌రుడ్ని సాద‌రంగా ఆహ్వాస్తుండటంతో.. పైకి న‌వ్వుల మేక‌ప్పు వేసుకున్నా.. లోలోన జ‌గ‌న‌న్న‌ను తుక్కు తుక్కుగా తిట్టుకుంటున్నార‌ట  స‌ద‌రు మ‌హిళా నేత రోజా సెల్వ‌మ‌ణి.   దీంతో జ‌గ‌న్ కి ఎటు చూసినా  జ‌డ గండం త‌ప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ లీడ‌ర్ల‌లో దాదాపు సగానికి సగం మంది మ‌హిళ‌లంటే ఎంత మాత్రం గౌర‌వం లేని బాప‌తు.  గంజాయి, మ‌ద్య సేవ‌నంలో ఆరి తేరిన నిష్ణాతులు కావ‌డం వ‌ల్ల‌.. వారికీ సెన్సిబిలిటీ తెలీక పోవ‌డం వ‌ల్ల‌.. మ‌హిళ‌ల‌పై అకార‌ణంగా  నోరు పారేసుకోవ‌డంతో.. జ‌గ‌న్ ప‌ని ఇక్క‌డ త‌థిగిణతోం అయిపోతోందట‌. మొన్న ఎన్నిక‌ల ముందు వంశీ చేసిన మ‌హిళా వ్య‌తిరేక‌ ప్రేలాప‌న‌లు ఎంత చేటు తెచ్చాయో.. తెలిసి కూడా ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనే ఈ నేత మ‌రోమారు మ‌హిళ‌పై చేసిన  కామెంట్లు ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టీని మ‌రో ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యేలా చేస్తున్నాయంటున్నారు. ఇప్ప‌టికే ఒక మ‌హిళ‌ను అన్న పాపానికి 11 కి ప‌రిమిత‌మైంది జ‌గ‌న్ పార్టీ. వ‌చ్చే రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఆ ప‌క్క‌నున్న ఒక‌టి కూడా మాయ‌మ‌వుతుందేమో అన్న టాక్  స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది.

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

  కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు.  బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) ఆస్పుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన వారిలో 15 మంది అస్వస్థతకు గురియ్యారు. హెచ్‌ఎంటీ హిల్స్‌ లోని కల్లు కాంపౌండ్‌ లో కల్లు తాగిన జేఎన్టీయూ అడ్డగుట్టకు చెందిన యోబు, మియాపూర్‌ నందిగడ్డ తండాకు చెందిన దేవదాస్‌, గూగుల్‌ ఫ్లాట్స్‌ 9th ఫేస్‌కు చెందిన పోచవ్వ, జేఎన్టీయూకు చెందిన చాకలి లక్ష్మి, షంషీగూడ కు చెందిన గోవిందమ్మ, పెంటీశ్‌, శాతవాహన నగర్‌ చెందిన యాదగిరి, నరసింహ, మాధవి, మొనప్ప, ఇంద్ర హిల్స్‌ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి నలుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అస్వస్థకు గురైన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌ గౌడ్‌, బి. శ్రీనివాస్‌ గౌడ్, టి. శ్రీనివాస్‌ గౌడ్‌, టి.కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు.