గచ్చిబౌలీ వద్ద తెలంగాణా హైకోర్టు?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేవరకు అలుపెరుగని పోరాటం సాగించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు, హైకోర్టు విభజనకు చకచకా పావులు కదుపుతున్నారు. కేంద్ర న్యాయ శాఖామంత్రి సదానంద గౌడ కూడా అందుకు సై అనడంతో ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా రాష్ట్ర అసెంబ్లీ చేత అందుకు ఒక తీర్మానం చేయించారు. రాష్ట్ర న్యాయశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొందరు న్యాయవాదుల సంఘాల నాయకులను డిల్లీకి పంపించారు. అదేసమయంలో తెరాస యంపీలను కూడా సదానంద గౌడ వద్దకు పంపించి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, గచ్చి బౌలీ వద్ద 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సువిశాల భవనం ఒకటి సిద్దంగా ఉందని తెలియజేసారు.   హైకోర్టు విభజనకు కేసీఆర్ చాలా వేగంగా పావులు కదుపుతున్నప్పటికీ, ఉభయ రాష్ట్రాలు ఈ విషయం గురించి చర్చించుకొని తన వద్దకు రమ్మని చెప్పిన సదానంద గౌడ సూచనను మాత్రం పట్టించుకోలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ ఆయన పట్టించుకాకపోయినా, న్యాయశాఖామంత్రిగా ఉన్న సదానంద గౌడకి మాత్రం తప్పదు కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు విభజన గురించి లేఖ వ్రాసి దాని అభిప్రాయం తెలుసుకొన్న తరువాత ముందుకు వెళ్తానని తనను కలిసిన రాష్ట్ర ప్రతినిధులకు చెప్పినట్లు తెలుస్తోంది. హైకోర్టు విభజనకు కేసీఆర్ ఇంతగా తొందరపడుతున్నప్పుడు, ఆయనే ఒకమెట్టుదిగి చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడి ఉండి ఉంటే ఆలస్యం జరుగకుండా నివారించగలిగేవారు కదా? తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండానే కోర్టు విభజన జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు అడ్డు చెపుతారు? కనుక కేంద్రప్రభుత్వం హైకోర్టు విభజన చేయాలనుకొంటే అందుకు చంద్రబాబు నాయుడు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చును.

తెలంగాణా రవాణా శాఖకు హైకోర్టు మొట్టికాయలు

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ రాష్ట్రంలో ప్రవేశించే ఆంద్ర వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఒక జి.ఓ. జారీ చేసినప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో ఆ జి.ఓ.ను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. కానీ ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ కలిగి ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో తిరుగుతున్న వాహనాలపై రాష్ట్ర రవాణాశాఖ అధికారులు జీవితపన్ను చెల్లించమని గత నెలరోజులుగా నోటీసులు జారీ చేస్తుండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   వాహనాలు ఏ రాష్ట్రంలో కొన్నప్పటికీ వాటిని కొన్నప్పుడే జీవిత పన్ను వసూలు చేస్తారు. కనుక తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో తిరిగినప్పటికీ వాటిపై మళ్ళీ జీవితపన్ను విధించడానికి వీలులేదు. కానీ మళ్ళీ జీవితపన్ను చెల్లించమని రాష్ట్ర రవాణాశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో, వాటిని సవాలు చేస్తూ కోర్టులో నిత్యం పిటిషన్లు పడుతున్నాయి. వాటిపై దృష్టి సారించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   కొన్ని రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖ అధికారులు చెన్నైకి చెందిన ఒక వైద్యుడికి కారుని పట్టుకొని దానిపై వడ్డీతో సహా అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తం మొత్తం ఒక లక్షా డబ్బై ఎనిమిదివేలు జీవితపన్ను చెల్లించమని నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో రాజస్థాన్ కి చెందిన యస్.వి.ఈ.సి.అనే నిర్మాణసంస్థకు చెందిన ఒక లారీని జీవితపన్ను చెల్లించలేదంటూ రవాణా శాఖ అధికారులు నిలిపివేశారు.   ఇటువంటివే మరి కొన్ని కేసులు కోర్టు దృష్టికి రావడంతో చీఫ్ జస్టిస్ కళ్యాన్ సేన్ గుప్తా మరియు జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖకు మొట్టికాయలు వేసారు. ఒకసారి జీవిత పన్ను చెల్లించిన వాహనంపై మళ్ళీ జీవితపన్ను ఎందుకు విధిస్తున్నారని రవాణాశాఖ తరపున కోర్టుకి హాజరయిన న్యాయవాదిని నిలదీసినప్పుడు, తెలంగాణా రాష్ట్రంలో ముప్పై రోజులకంటే ఎక్కువ రోజులున్న వాహనానికి మళ్ళీ జీవితపన్ను చెల్లించవలసి ఉంటుందని ఆయన బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న న్యాయమూర్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి చట్టం ఎక్కడ ఉందో తమకు చూపించాలని ఆదేశించారు. అంతేగాక ఈవిధంగా వాహనదారులను ఇబ్బందులు పెడుతున్న సదరు అధికారుల పేర్లను తమకు తెలియజేయాలని ఆదేశించారు. వారు సీజ్ చేసిన అన్ని వాహనాలను తక్షణమే విడుదల చేయమని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారుల నుండి నష్టపరిహారం వసూలుచేసి సదరు వాహనదారులకు చెల్లింపజేయిస్తామని న్యాయమూర్తులు హెచ్చరించారు. ఈ జీవితపన్ను వ్యవహారంపై వారం రోజుల్లోగా రవాణా శాఖ సంజాయిషీ ఇవ్వవలసిందిగా కోర్టు ఆదేశించింది.

ప్రజాస్వామ్యమా...వైకాపాలో ఉందా అది?

  ఆంద్రప్రదేశ్ శాసనసభ ఈరోజు సమావేశం కాగానే మళ్ళీ షరా మామూలుగానే అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం మొదలయింది. నిన్న పట్టిసీమ మీద యుద్ధం చేసుకొంటే, ఈరోజు పంట రుణాలపై మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డికి తగినంత సమయం ఇవ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేసి అధికార పార్టీ సభ్యులకి మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇచ్చారంటూ యుద్ధం మొదలుపెట్టారు. వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకి వెళ్లి నినాదాలు చేయడం మొదలుపెట్టడంతో ఆయన సభను 10 నిమిషాలు వాయిదా వేసారు. అయితే అంతమాత్రాన్న వివాదం సద్దుమణుగుతుందని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది.   సభలో తనకి మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదనే అంశం మీదనే గంటలుగంటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండటం ఒక విచిత్రమేయితే, సభలో తన పార్టీ సభ్యులెవరికీ కూడా మాట్లాడే అవకాశం ఈయకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మరో విచిత్రం. సభలో సభ్యులు ఏదయినా ఒక అంశం గురించి మాట్లాడదలిస్తే, స్పీకర్ అందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. ఆ సమయంలోనే సభ్యుడు తను చెప్పదలచుకొన్నది క్లుప్తంగా చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తను ఎంతసేపు మాట్లాడదలుచుకొంటే అంతసేపు తనను ఎవరూ అడ్డుకోరాదని, అడ్డుకొంటే అది ప్రతిపక్షాల గొంతు నొక్కేయడమేనని వితండవాదన చేస్తుంటారు.   తను మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెందిన పదిమంది తనకు అడ్డుతగులుతున్నారని వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సభలో తన పార్టీ తరపున మరెవరూ మాట్లాడేందుకు ఎందుకు అనుమతించడం లేదు? అది వారి హక్కులను కాలరాయడం కాదా? అప్రజాస్వామికం కాదా? వైకాపా సభ్యులు అందరూ ఆయన ఆదేశానుసారం శాసనసభలో అల్లరి చేయడానికే పరిమితయ్యారా? ఈవిధంగా తన పార్టీలో సభ్యులు తమ తమ నియోజకవర్గాల సమస్యలను శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా వారి సమయాన్ని కూడా యధేచ్చగా వాడేసుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని గావుకేకలు పెడుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది.

ఆంధ్ర, తెలంగాణా శాసనసభల నిర్వహణలో ఎంత తేడానో

  ఆంద్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల తీరు చూసి ముక్కున వేలేసుకొంటున్న ప్రజలు తెలంగాణా శాసనసభను చూసి మెచ్చుకొంటున్నారు. ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 40 రోజులు ఎందుకు పెట్టలేదనే అంశంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలయిన యుద్ధం పట్టిసీమతో పరాకాష్టకు చేరుకొంది. నిన్న సభలో సభ్యులు ప్రవర్తించిన తీరు చూసిన తరువాత ఈ మాత్రం దానికి 17 రోజులు సమావేశాలు కూడా అనవసరమని ప్రజలు భావిస్తున్నారు.   తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, బీజేపీలు మూడు కూడా రాజకీయంగా శత్రువులే అయినప్పటికీ, ఆ మూడు పార్టీల సభ్యులు శాసనసభలో చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నతీరు చాలా ముచ్చట గొలుపుతోంది. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై సభ్యులు అందరూ లోతుగా చర్చించడం, అధికార పార్టీ చెపుతున్న విషయాల గురించి ప్రతిపక్షాలు ఆసక్తిగా అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తుండటం, వాటిని అధికార పార్టీ వినమ్రంగా స్వీకరిస్తుండటం చూస్తుంటే చాలా ముచ్చట కలుగుతోంది.   ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యులు నిన్న ఒకరినొకరు బూతులు తిట్టుకొంటుంటే, తెలంగాణా శాసనసభ లో సభ్యులు అందరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరు రాష్ట్రాల శాసనసభల నిర్వహణలో, సభ్యులు వ్యవహరిస్తున్న తీరులో చాలా తేడా కనబడుతోంది. ఒకే సమయంలో, ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్రాల శాసనసభలు జరుగుతున్నందున ఆ తేడా మరీ కొట్టవచ్చినట్లు కనబడుతోంది.

మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నేతలు

  మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా వ్యవహరించినప్పటికీ చట్టసభల పట్ల ప్రజలలో నెలకొని ఉన్న గౌరవం అలానే నిలిచి ఉంది. కారణం ప్రజాస్వామ్యంపై వారికున్న అపారమయిన నమ్మకం, గౌరవమే. కానీ చట్టసభలలో కూర్చొన్నవారికి మాత్రం అటువంటి మూడ నమ్మకాలు, అపోహలు ఏమీ లేవని పదేపదే నిరూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరును చూసి ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “అసెంబ్లీ అంటే మీ ఇడుపులపాయో లేకపోతే మీ లోటస్ పాండో అన్నట్లు ఏమి మాట్లాడినా చెల్లుతుందన్నట్లు వ్యవహరించడం సరికాదు,” అని హెచ్చరించవలసి వచ్చింది. కానీ ప్రజాసమస్యల గురించి మాట్లాడుతుంటే తమకు మాట్లాడే అవకాశం ఈయకుండా అధికార పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రత్యారోపణలు చేసారు.   రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన తరువాత ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంటూ ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికార తెదేపా పార్టీ ప్రతిపక్ష పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి మాట్లాడే అవకాశం ఇచ్చినా మాట్లాడేందుకు ఆసక్తి చూపేవారు కాదని అన్నారు.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వ్యవహారంలో ఎంత గొప్పగా వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. సాక్షాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వల్ల వచ్చే కష్టనష్టాల గురించి తన అధిష్టానానికి ఎంతగా వివరించి వారించినా వినకుండా రాష్ట్ర విభజన చేసింది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్రమంత్రులు చెప్పిన సలహాలను సూచనలను పెడచెవిన పెట్టింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు.   విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేసి, టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేసి అత్యంత హేయమయిన పద్దతిలో విభజన బిల్లుని ఆమోదింపజేసుకొంది. కానీ ఇవేవీ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ నేతలు భావించలేదు. అందుకే వారు ఇంతవరకు ఏనాడు కూడా అందుకు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. కనీసం ఆ ప్రసక్తి కూడా తేలేదు. రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ తదితర కాంగ్రెస్ నేతలు ఏవిధంగా వ్యవహరించారో, అప్పుడు ప్రజలు ఏవిధంగా స్పందించారో అందరికీ తెలిసిన విషయమే.   అటువంటి వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మొసలి కన్నీరు కారుస్తూ రోడ్ల మీద ధర్నాలు చేసినంత మాత్రాన్న రాష్ట్ర ప్రజలు వారు చేసిన తప్పులను మరిచిపోయి క్షమించేస్తారా? ఆనాడు యావత్ దేశ ప్రజలు నివ్వెరపోయేలా పార్లమెంటులో వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేశారని ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం.

ఒప్పు... తప్పు... బూతు...

  తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే కాకలు తీరిన రాజకీయ పండితులకు కూడా బుర్ర తిరిగిపోతోంది. హిచ్‌కాక్ సినిమాల్లో ట్విస్టులనైనా ముందుగా ఊహించగలం కానీ, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎప్పుడు, ఏమి, ఎందుకు, ఎలా జరుగుతోందో తమ ఊహకు అందడం లేదని సదరు పండితులు బుర్రలు గోక్కుంటూ చెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కూడా తెలుగుదేశాధినేత తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిశీలకుల దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.   ఎమ్మెల్యే కోటాలో తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే అవకాశం వుండటంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎంతోమంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి రేసులో నిలిచారు. మొన్నామధ్య జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారికి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఛాన్స్ లేదని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించడంతో అప్పుడు ఓడిపోయిన చాలామంది నిరుత్సాహపడి రేసులోంచి విరమించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సముచిత నిర్ణయం తీసుకుని సమర్థులకే ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తారని భావించారు. అయితే చంద్రబాబు నాయుడు అందరికీ షాకిస్తూ మూడు పేర్లు ప్రకటించారు. వారిలో కోస్తా నుంచి వి.వి.వి.చౌదరి, ఉత్తరాంధ్ర నుంచి గుమ్మడి సంధ్యారాణి, రాయలసీమ నుంచి తిప్పేస్వామి వున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ తప్పకుండా వస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయనని పక్కనపెట్టి తిప్పేస్వామిని తెరమీదకు తెచ్చారు. వీరిలో వి.వి.వి.చౌదరి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వినిపించడం లేదుగానీ, సంధ్యారాణి, తిప్పేస్వామిల ఎంపిక మాత్రం పార్టీలో కలకలం రేపింది.   చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పార్టీ కార్యకర్తలు ‘ఒప్పు... తప్పు... బూతు’’ అని అభివర్ణిస్తున్నారు. ప్రతిక్షణం పార్టీ పనిలోనే వుంటూ, నిరంతరం పార్టీ కార్యాలయంలోనే వుండే వి.వి.వి.చౌదరికి టిక్కెట్ ఇవ్వడం ‘ఒప్పు’ అని అంటున్నారు. అలాగే మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారికి టిక్కెట్ ఇవ్వనని చెప్పిన చంద్రబాబే ఇప్పుడు అరకు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సంధ్యారాణిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ‘తప్పు’ నిర్ణయంగా చెబుతున్నారు. ఇక తిప్పేస్వామి ఎంపిక నిర్ణయాన్ని ‘బూతు’ అని అభివర్ణిస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా సేవ చేసిన వారిని పక్కనపెట్టి నిన్నగాక మొన్న కాంగ్రెస్‌లోకి వచ్చిన తిప్పేస్వామికి ఎమ్మెల్సీ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడి తీరు అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డించిన చందంగా వుందని చెవులు కొరుక్కుంటున్నారు. సంధ్యారాణి, తిప్పేస్వామిలకు ఎమ్మెల్సీ స్థానాలు దక్కడం వెనుక చక్రం తిప్పిన ‘ఎమ్మెల్సీ మంత్రి’ గారి మీద టీడీపీ కార్యకర్తలు గుర్రుగా వున్నారు.

రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ దేనికయినా సిద్ధం

  గత అనేక ఏళ్లుగా దేశంలో అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాయి. కానీ యూపీయే ప్రభుత్వం దేనికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ, సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జే.డి.యు.) తమ యూపీయే కూటమిలో చేరేందుకు అంగీకరిస్తే, ఆయన కోరుకొన్నట్లుగా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్న ఆయన, రాహుల్ గాంధీని నెత్తినపెట్టుకొని తిరుగుతున్న యూపీయే కూటమిలో చేరడం వలన తన లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదనే ఆలోచనతో వామపక్ష పార్టీలనన్నిటినీ పోగేసి థర్డ్ ఫ్రంట్ కూటమి కట్టేడు. అందుకే యూపీయే ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. లేకుంటే అప్పుడే ఇచ్చేసేదే. అంటే నితీష్ కుమార్ కి తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే తపన కంటే తను ప్రధానమంత్రి అవ్వాలనే తపనే ఎక్కువని స్పష్టం అవుటోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన చేతిలో అధికారం ఉంది కనుక తనకు లాభం చేకూరుతుందంటే అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఏ రాష్ట్రానికయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వెనుకాడదని అర్ధమవుతోంది.   ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సరిగ్గా అలాగే ఆలోచించి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించేసింది. కానీ వ్రతం చెడ్డా ఫలం మాత్రం దక్కన్నట్లు ఆంద్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. మళ్ళీ రాష్ట్రంలో బలం పుంజుకొని నిలబడాలంటే, రాష్ట్ర విభజన చేసినందుకు తనపై ఆగ్రహంగా ఉన్న ప్రజలను మంచి చేసుకోవలసి ఉంటుందని గ్రహించి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతోంది. ఆవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని దానిని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఇరకాటంలో పెట్టవచ్చనే దురాలోచన కూడా ఇమిడి ఉంది.   ఒకప్పుడు రాష్ట్ర ప్రజల మనోభావాలను, వారి ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుస్తున్నట్లు నటిస్తోంది. కానీ ఆంధ్రాకే కాదు తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వవద్దని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పార్లమెంటులో గట్టిగా చేస్తున్న వాదనలు వింటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో, ఇన్నేళ్ళుగా దానిని నెత్తిన పెట్టుకొన్న తెలుగు రాష్ట్రాల పట్ల దానికి ఎంత గొప్ప అభిప్రాయం ఉందో అర్ధమవుతోంది.   ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకి పారిశ్రామిక అభివృద్ధికి సబ్సీడీలు ఇచ్చినట్లయితే, ఇరుగు పొరుగు రాష్ట్రాలకి నష్టం కలుగుతుందని, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయని వీరప్ప మోయిలీ హెచ్చరిస్తున్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం బీహార్ రాష్ట్రానికి ఏవిధంగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలనుకొంది?మరి అప్పుడు అడ్డురాని ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఇస్తేనే వస్తాయా? అయినా ఇచ్చేది పుచ్చుకొనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలయినప్పుడు, కందకు లేని కత్తిపీటకు ఎందుకన్నట్లు లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దురద?

‘వైకాపు’ల కలవరం.. కలకలం...

  ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని, తుంటిమీద కొడితే పళ్ళు రాలినట్టు అనే సామెతలు తెలిసినవే. ఇప్పుడు జగన్ పార్టీ వైకాపాలో అంతర్గత రాజకీయాలు ఈ సామెతకు తగ్గట్టుగా తయారయ్యాయి. ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన పరిస్థితులు ఇంతకాలం పార్టీకి ‘కాపు’గాసిన వారికి పార్టీలో మనశ్శాంతిగా వుండలేని పరిస్థితులు తెచ్చిపెట్టాయి. సిట్యుయేషన్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం పార్టీలోని వ్యక్తులు కాదు.. అసలు వైసీపీకి ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్. ఆశ్చర్యగా వుందా? నమ్మశక్యం కావడం లేదా? కానీ, ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్. వై‘కాపు’లలో కలవరం, కలకలం రేగడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా కారణమయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే....   ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌కి జనాల్లో ఎంత క్రేజ్ వుందో, ఆయన సామాజికవర్గమైన కాపులలో కూడా అంత క్రేజ్ వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజికవర్గం కొన్ని దశాబ్దాలుగా తమనుంచి సరైన నాయకుడు లేక చాలా వెలితిగా ఫీలవుతోంది. సంఖ్యాపరంగా రాష్ట్ర రాజకీయాలను శాశించే స్థితిలో వున్నప్పటికీ తమ నుంచి సరైన నాయకుడు రాలేదే అనే బాధ వీరికి వుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయన మీద ఆశలు పెట్టుకున్న వీరందరూ ఆయన జెండా పీకేసి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో షాకయ్యారు. అయితే మొన్నీమధ్యే రాజకీయ రంగప్రవేశం చేసి ‘జనసేన’ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ చుట్టూ వీళ్ళు తమ ఆశల పందిరిని అల్లుకుంటున్నారు. భవిష్యత్తులో తమ నుంచి ‘ముఖ్య’ నేతగా ఎదిగే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య అటు తిరిగి, ఇటు తిరిగి వైసీపీలోని కాపులలో కలకలం రేగేలా చేసింది.   ఏపీ రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ మొన్నామధ్య పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పదేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతే... ఈమాట డైరెక్టుగా వెళ్ళి వైసీపీ నాయకుడు జగన్‌ గుండెని తాకింది. అప్పటి వరకూ తమ పార్టీలోని సీనియర్ కాపు నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనుకుంటున్న జగన్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. ఆ పదవిని శెట్టిబలిజ నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్‌కి ఇవ్వాలని డిసైడ్ చేసేశారు. గోదావరి జిల్లాల్లో కాపులకు దీటుగా నిలిచే సామాజిక వర్గం శెట్టిబలిజ. తమ నాయకుడిని కాదని తమకు వ్యతిరేకంగా వుండే సామాజికవర్గం నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వైసీపీలోని కాపు నాయకులందరూ లబోదిబో అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కాపుల అండదండలతో తాను సీఎం అవ్వాలని ఓవైపు జగన్ భావిస్తుంటే, మరోవైపు కాపుల ఇష్టుడు పవన్ కళ్యాణ్ మాత్రం మరో పదేళ్ళపాటు చంద్రబాబే సీఎం అని అనడంతో జగన్ హర్టయ్యారట. ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయే కాపు నాయకులకు తాను ఎందుకు పదవులు ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి మొండిచెయ్యి ఇచ్చారట. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు తిరిగి, ఇటు తిరిగి ఉమ్మారెడ్డి పదవికి ఎసరుపెట్టేసరికి వైసీపీలోని కాపు నాయకులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారట.

ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద శాపనార్ధాలు

  ఈ ఏడాది నుండి శ్రీ రామనవమి ఉత్సవాలను కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామాలయంలో అధికారికంగా నిర్వహించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్రంగా తప్పు పట్టారు. హిందూమత సంబంధమయిన ఇటువంటి విషయాలలో ప్రభుత్వం తమవంటి మఠాధిపతులు, సాధువుల సలహాలు తీసుకోవడం అధికారుల సలహాలను పాటించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు గోదావరి పుష్కరాలకు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమనెవరినీ సంప్రదించలేదని ఇప్పుడు శ్రీ రామనవమి ఉత్సవాలకు కూడా సంప్రదించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తలబెట్టే ఇటువంటి కార్యక్రమాలకి ఆ దేవుడి ఆశీసులు కూడా దక్కవని అన్నారు. తమను పక్కనబెట్టి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూలిపోతుందని శపించారు.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెపుతున్నారు. ఆయన  కొన్ని రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు పనిగట్టుకొని వెళ్లి స్వామీ స్వరూపానందను కలవడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి ఆయనను దర్శించుకొని సేవించుకొన్నందునే స్వామీజీకి జగన్ పై అనుగ్రహం కలిగి ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిలాగే ఈ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చేపుతున్నారేమో? మతంపేరుతో స్వామీజీలు ఈవిధంగా రాజకీయాలలో, ప్రభుత్వ నిర్ణయాలలో వేలుపెట్టాలనుకోవడం, లేకపోతే ఈ విధంగా ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వాలు కూలిపోతాయని శాపాలు పెట్టడం సమంజసమేనా? ఈ విధంగా తెర వెనుక రాజకీయాలు చేస్తూ, ప్రభుత్వాలను అప్రదిష్టపాలు జేస్తూ ప్రభుత్వాలకు శాపనార్ధాలు పెట్టే బదులు స్వామీజీలు, వాస్తు సిద్దాంతులకు రాజకీయాల మీద అధికారం మీద అంత మక్కువ ఉంటే వారు కూడా ఎన్నికలలో పోటీచేసి గెలిచి ప్రభుత్వాన్ని తమకు నచ్చినట్లు నడిపించుకోవచ్చు కదా?

భోగాపురం వద్ద ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణానికి కసరత్తు మొదలు

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ చాలా ఆత్మవిశ్వాసం కనబరుస్తూ అనేక భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులు మరియు రాజధాని నిర్మాణం అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు తాజాగా విజయనగరం-విశాఖ నగరాల మధ్య ఉన్న భోగాపురం వద్ద 15, 000 ఎకరాల స్థలంలో ఒక విమానాశ్రయం, విమాన శిక్షణ కేంద్రం, విమానాల రిపేరింగ్ మరియు సర్వీసింగ్ విభాగలతో కూడిన ఒక ‘ఎయిర్ పోర్ట్ సిటీ’ నిర్మాణం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం సాంకేతిక మరియు సామాజిక సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఆర్.ఐ.టి.ఈ.యస్.(రైట్స్) అనే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థకు పని అప్పగించింది. ఆ సంస్థ ఈ ఏడాది చివరిలోగా తన నివేదిక సమర్పిస్తుంది.   ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల నుండి మొత్తం 28 అనుమతులు పొందవలసి ఉంటుందని వాటిలో కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన 18 అనుమతులను వచ్చే ఏడాదిలోగా సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని రాష్ట్ర మౌలిక వసతుల కల్పనా శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడతామని అందులో ప్రభుత్వం తన వాటాగా భూమిని ఇస్తుందని ఆయన తెలిపారు. దీని కోసం భోగాపురం వద్ద మొత్తం 15, 000 ఎకరాల స్థలం సేకరించి అందులో 5000 ఎకరాలు విమానాశ్రయానికి, 5000 ఎకరాలు విమాన శిక్షణ మరియు సర్వీసింగ్ విభాగాలకి, మిగిలిన 5000 ఎకరాలు అభివృద్ధి చేసి తిరిగి రైతులకే అప్పగిస్తామని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (నోడల్ సంస్థ)ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.   భోగాపురం వెళ్ళేదారిలోనే ఉన్న మధురవాడ వద్ద ఐ.టి.హబ్, ఐ.టి.ఇంక్యూబేటర్ సెంటర్, గంభీరం గ్రామం వద్ద ఐ.ఐ.యం. మొదలయిన ఉన్నత విద్యా ఉపాధి సంస్థలు రాబోతున్నాయి. ఇంతకాలం అభివృద్ధికి నోచుకోని విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజి వచ్చే అవకాశం ఉంది గనుక ఆ రెండు జిల్లాలలో మున్ముందు అనేక పారిశ్రామిక కారిడార్లు కూడా ఏర్పాటవ్వబోతున్నాయి. ఒకవేళ ఈ ఎయిర్ పోర్ట్ సిటీ కల కూడా సాకారం అయినట్లయితే ఇక విశాఖతో బాటు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో కూడా అభివృద్ధి జోరందుకొంటుంది.

జనసేనకి మద్దతు ఇచ్చిన జనాలకి థాంక్స్!

  రాజకీయాలలోకి హటాత్తుగా ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవిలాగే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా అయోమయంలో ఉన్నట్లుంది. చిరంజీవికయితే తన ప్రజారాజ్యం ఎన్నికలలో గెలవాలి, గెలిచి తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని ఏలేయాలనే ఒక నిర్దిష్టమయిన పగటి కలయినా ఉండేది. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మాత్రం అటువంటిదేమీ లేకుండానే బరిలోకి దిగిపోయి తడబడుతున్నాడు. పార్టీని పెట్టింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికేనన్నాడు. పోనీ ప్రశ్నించడానికయినా మనిషి కనబడతాడా? అంటే అదీ లేదు.   అంత తీరిక లేకపోతే కనీసం ట్వీటర్ లోనయినా ఆ పని కానిచ్చేస్తుంటే ఆయన అభిమానులు కూడా ఎలాగో సర్దుకుపోయేవారు. కానీ దానికీ ఆయనకీ టైం ఉండటం లేదు. అంత బిజీ మనిషి మళ్ళీ ఉన్నట్లుండి తుళ్ళూరుకి వచ్చి ఒకరోజంతా వీరంగం ఆడేశాడు. ఆ తరువాత ఏమయిందో ఏమో గానీ అంతకు ముందు తిట్టిన నోటితోనే ప్రభుత్వాన్ని తెగ మెచ్చేసుకొని మాయమయిపోయాడు. పోతూపోతూ "జి.హెచ్.యం.సి ఎన్నికలలోనే మళ్ళీ నే..కనబడేది." అని ఓ చిన్న మాట అనేసి పోయాడు. అది పట్టుకొని అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. కానీ ఆ సంబరంలో అంతకు ముందు, తరువాత ఆయన చెప్పిన మాటలన్నీ మరిచిపోయారు.   మళ్ళీ ఇప్పుడు తాజాగా “జనసేనకు మద్దతు ఇచ్చిన జనాలకి థాంక్స్” అంటూ ఒక ట్వీటర్ మెసేజ్ ఒకటి పోస్ట్ చేసాడు. ‘అయితే అదేదో అప్పుడే చెప్పేస్తే బాగుండేది కదా?’ అని కొందరు గొణుకొంటుంటే, ‘మళ్ళీ వస్తానన్న పెద్దమనిషి, ప్రశ్నించడానికి ఎప్పుడు వస్తాడో చెప్పకుండా ఇలా ఇప్పుడు చల్లగా ‘థాంక్స్’ చెపుతున్నాడేమిటి?’ అంటూ మరికొందరు రుసరుసలాడుతున్నారు. అయితే ఇన్ని రోజుల తరువాత ‘అక్కలకీ, చెల్లెమ్మలకీ, అన్నలకీ, తమ్ముళ్ళకీ పేరుపేరునా జగన్మోహన్ రెడ్డి ఇస్టయిల్లో ఎందుకు ‘థాంక్స్’ చెప్పుకోవడం దేనికో ఆయనే వివరిస్తే బాగుండేది. తన వన్-మ్యాన్-ఆర్మీ జనసేన పార్టీకి జనాలు మద్దతు ఇస్తున్నారని గ్రహించినప్పుడు, ఇలా ఎక్కడో కూర్చొని వారికి థాంక్స్ మెసేజులు పెట్టడం కంటే ఆయన కూడా వచ్చి వారికి మద్దతు ఇస్తే బాగుండేది కదా? ఇప్పుడు ఎందుకు రాలేకపోయాడో మరో ఆరు నెలల తరువాత జనాల మధ్యకి వచ్చినపుడు చెపుతాడేమో.

పంట పొలాల క్రింద పైప్ లైన్స్?

  రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టే వివిధ ప్రాజెక్టులలో అన్నిటి కంటే క్లిష్టమయిన ప్రక్రియ భూసేకరణే. ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప్పట్టిన భూసేకరణ ప్రక్రియ అందుకు అద్దం పడుతోంది. ప్రభుత్వం 40, 000 ఎకరాలు భూసేకరణ చేద్దామనుకొంటే ఇప్పటి వరకు అతికష్టం మీద 32, 0000 ఎకరాలు సేకరించగలిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపేట్టబోయే జల హారం (వాటర్ గ్రిడ్) ప్రాజెక్టులో భాగంగా నీళ్ళ గొట్టాలు వేసేందుకు భూసేకరణ చేయాలంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. కనుక దాని అవసరం లేకుండా అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికీ కూడా పెద్దగా నష్టం లేకుండా వ్యవసాయ భూములున్న ప్రాంతాలలో వాటి క్రింద నుండి గొట్టాలు వేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా పంట పొలాల క్రింద ఉండే భూమిని వినియోగించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని మొదట గుజరాత్ రాష్ట్రంలో అమలుచేసారు. తరువాత తెలంగాణా రాష్ట్రంలో అమలుచేయబోతున్నారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలుచేయాలని భావిస్తోంది. అందుకోసం ఆ రెండు ప్రభుత్వాలు రూపొందించిన నియామావళి, అనుసరిస్తున్న విధివిధానాలు, పద్దతులను రాష్ట్ర రెవెన్యూ మరియు జలవనరుల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వారి అధ్యయనం పూర్తి చేసి తమ నివేదికను అందజేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేస్తుంది. బహుశః ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయి.

రాహుల్ శలవు పొడిగింపా...అంతా కుట్ర!

  కీలకమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు వారాలు శలవు మీద వెళ్ళడం, అందుకు ఆ పార్టీ చెపుతున్న కారణాలవల్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలయ్యింది. అది సరిపోదన్నట్లుగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఈ నెలాఖరు వరకు తన శలవును పొడిగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలతో మరింత అభాసుపాలయింది. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించింది.   పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సురేజ్ వాలా డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శలవు మీద వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఆయన తన శలవును పొడిగించారని మీడియాలో వచ్చిన వార్తలేవీ నిజం కాదు. ఎవరో కొందరు వ్యక్తులు ఆయన ప్రతిష్టను, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. కనుక అటువంటి వార్తలను నమ్మవద్దని, ప్రచురించవద్దని మా మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము,” అని కోరారు.   కానీ రెండు వారాల శలవుపై వెళ్ళిన రాహుల్ గాంధీ ఇంకా ఎందుకు తిరిగిరాలేదు? ఎప్పుడు తిరిగి వస్తారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నారు? అనే మీడియావారి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేరుగా సమాధానం ఇవ్వలేదు. మీడియా కూడా రాహుల్ గాంధీ వ్యక్తిగత స్వేచ్చను గౌరవించాలని మాత్రం కోరారు.   నిజానికి ఆయన ఈనెల 10వ తేదీన పార్టీ కార్యక్రమాలలో తిరిగి పాల్గొంటారని అందరూ భావించేరు. కానీ నేటికీ ఆయన రాకపోవడంతో పార్టీ వర్గాలను సంప్రదిస్తే ఈనెలాఖరు వరకు ఆయన తన శలవును పొడిగించినట్లు చెప్పడంతో మీడియా అదే వార్తను ప్రచురించింది. కానీ ఇప్పుడు దాని వలన ఆయనకి, పార్టీ ప్రతిష్టకి భంగం కలుగుతోందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ వార్తలను ఖండిస్తోంది. కానీ ఆవిధంగా చేసి ప్రజలకు తనే స్వయంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఆయన శలవు పొడిగించినట్లయితే ఆయన ప్రతిష్టకు, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే ద్రువీకరిస్తునట్లుంది.   ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం, తన మీదే ఆధారపడున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం ఏవో సరికొత్త వ్యూహాలు, సిద్ధాంతాలు కనిపెట్టేందుకు శలవు తీసుకొన్నట్లు కాంగ్రెస్ పార్టీయే చెప్పుకొంటోంది. కానీ పార్టీని ఇంతగా నలుగురిలో నవ్వులపాలు చేస్తూ ఆయన పార్టీని తీర్చిదిద్దేందుకు శలవు తీసుకోవడందేనికో పార్టీకే తెలియాలి. తీరాచేసి శలవు ముగించుకొని ఆయన తన మంత్రదండంతో తిరిగి వచ్చిన తరువాత తనకంటే దేశముదురు కాంగ్రెస్ నేతలను ఏమీ చేయలేక చతికిలపడితే అప్పుడు ఇంకా అప్రదిష్ట కలుగుతుంది. అంతేకాదు పార్టీలో సీనియర్లను పక్కన బెట్టాలని ఆయన ప్రయత్నించినట్లయితే అప్పడు వారందరూ కలిసి ఆయనకే పార్టీ నుండి ఉద్వాసన ఇప్పించినా ఆశ్చర్యం లేదు. ఏమయినప్పటికీ రాహుల్ గాంధీ మొదలు పెట్టిన ఈ డ్రామాతో కాంగ్రెస్ పార్టీ చాలా ఇరకాటంలోపడింది. మున్ముందు ఇంకా పెద్ద ఇరకాటంలో పడబోయే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.

భ్రమలు వదిలించిన ఏపీ ఉద్యోగులు

  భ్రమలు వదిలించిన ఏపీ ఉద్యోగులు ఎవరూ ఎవరినీ ఎక్కువకాలం భ్రమల్లో వుంచలేరు. తాత్కాలికంగా భ్రమల్లో వుంచినా, చాలా కొద్దికాలానికే వారి అసలు స్వరూపం బయటపడిపోయి, వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే అయింది. రాష్ట్ర విభజన వద్దంటూ అప్పట్లో ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా నడిపారు. తెలుగువారు కలిసి వుండాలని ఉద్యోగులు ఎంత బాగా శ్రమపడుతున్నారో అని అప్పట్లో అందరూ అనుకున్నారు. అప్పటి వరకూ ప్రభుత్వోద్యోగుల మీద ప్రజల్లో వున్న వ్యతిరేక భావం మాయమైపోయింది. ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు హీరో అయిపోయారు. ఇంత మంచి ప్రభుత్వోద్యోగులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అని తెలుగువారు మురిసిపోయారు. అయితే ఆ మురిసిపోవడం మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ప్రభుత్వోద్యోగుల అసలు స్వరూపం మెల్లమెల్లగా బయటపడింది. ప్రజలు ప్రభుత్వోద్యోగుల మీద పెట్టుకున్న భ్రమలన్నీ క్రమంగా తొలగిపోయి, ఇప్పుడు వారి నిజ స్వరూప దర్శన భాగ్యం కలుగుతోంది.   రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన చూసిన ఏపీ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే, ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం చేసింది తెలుగు ప్రజలు ఒక్కటిగా వుండాలన్న ఉద్దేశంతో కాదు... హాయిగా స్థిరపడిన హైదరాబాద్‌ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టంలేకే. ఏపీ కొత్త రాజధానికి సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాలన మొత్తం హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఉద్యోగుల మొండి వైఖరి ఇబ్బందికరంగా మారింది. ఏపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సీఎం అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే ఏపీకి తరలి వెళ్ళిపోయినట్టయితే ప్రజల్లో వారి మీద వున్న గౌరవం పెరిగేది. అయితే వారు తాము ఇప్పుడప్పుడే హైదరాబాద్‌ వదిలేది లేదని, కొత్త రాజధానిలో తమకు సదుపాయాలు వుండవని చెబుతున్నారు. ఈ ఒక్క మెతుకు చాలు.. ప్రభుత్వ ఉద్యోగుల అన్నం ఎంతవరకు ఉడికిందో చెప్పడానికి.   కొత్త రాష్ట్రం ఏర్పడగానే రాష్ట్ర అభివృద్ధి కోసం సామాన్య ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అవకాశాలు కోల్పోయారు. భవిష్యత్ తరాల ప్రజలు కూడా ఎన్నో అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వోద్యోగులు మాత్రం తమకు చెందిన ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వోద్యోగుల పదవీకాలాన్ని రెండేళ్ళపాటు పెంచేలా ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. తద్వారా నిరుద్యోగుల నెత్తిన చెయ్యి పెట్టారు. ఆ తర్వాత తాము సమ్మె చేసిన కాలానికి స్వచ్ఛందంగా జీతం వదులుకున్నట్టయితే గౌరవంగా వుండేది. ఆ కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించేలా ఒత్తిడి తెచ్చి, తమ జీతం డబ్బులు ఎక్కడకీ పోకుండా చూసుకున్నారు. అసలే ఆర్థికంగా కష్టాల్లో వున్న ప్రభుత్వం మీద ఎంతమాత్రం జాలి చూపించకుండా 43 శాతం ఫిట్‌మెంట్ పుచ్చుకుని జీతాలు డబుల్ చేసుకున్నారు. ఇన్నిచేశాం కదా... ఇప్పుడు కొత్త రాజధానికి వెళ్దాం పదండయ్యా అంటే, అక్కడ మా స్థాయి సౌకర్యాలు లేవు కాబట్టి ఇప్పుడప్పుడే రాలేం అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇలాంటి వారిని నమ్ముకుంటే ఏపీ ఎప్పటికి బాగుపడుతుందో దేవుడనేవాడుంటే ఆయనకే తెలియాలి. ఏపీ ప్రభుత్వోద్యోగులు తెలంగాణ టూరిస్టులే... జీతం అక్కడ తీసుకోవాలి.. టాక్స్‌లు ఇక్కడ కట్టాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మొహమాటంగా చెప్పేసినా ఇంకా హైదరాబాద్‌‌నే పట్టుకుని వేలాడుతున్న వాళ్ళని ఏమనాలి?

తెదేపా, బీజేపీల కలహాల కాపురం ఇలాగేసాగుతుందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు తమ మిత్ర పక్షమయిన తెదేపాకి, తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వానికి ఇంతవరకు అప్పుడప్పుడు చిన్నచిన్న చురకలు వేస్తుండేవారు. కానీ తెదేపా నేతలు మిత్రధర్మం వల్లనయితేనేమి కేంద్రంతో తమ అవసరాల కారణం వల్లనయితేమేనీ ఎన్నడూ వారిపై ప్రతి విమర్శలు చేయకుండా నిగ్రహం పాటిస్తుండేవారు. కానీ కేంద్రబడ్జెట్ వెలువడిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా తెదేపా నేతలందరూ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే బీజేపీ నేతలు మౌనం దాల్చవలసి వచ్చింది.   ఆ తరువాత కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించడంతో తెదేపా వెనక్కి తగ్గగానే, మళ్ళీ బీజేపీ నేతలు గొంతు సవరించుకోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు తమ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగా విమర్శించడమే కాకుండా, తన పార్టీ నేతలను కూడా అందుకు అనుమతించినందుకు, రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనపై కొంచెం గుర్రుగానే ఉన్నారు. పైగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో తెదేపా యంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కోరుతూ ధర్నా కూడా చేసారు.   తెదేపా యంపీ యన్. శివప్రసాద్ మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు అనుమతిస్తే “మేము జమ్మి చెట్టుపై ఉంచిన మా అస్త్రశస్త్రాలన్నీ క్రిందకు దించి కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేసేందుకు సిద్దంగా ఉన్నామని” మీడియా సాక్షిగా ప్రకటించడం కూడా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సరిపోదన్నట్లు చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్ మరియు మాణిక్యాల రావు కొన్ని రోజుల క్రితం చిత్తూరులో కరువు ప్రాంతాలను పర్యటిస్తున్నప్పుడు, అక్కడ వారికి స్థానిక తెదేపా నేతల వలన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి సమావేశంలో ‘ఇంతకీ బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసింది?’ అనే శీర్షికతో కొందరు కార్యకర్తలు కరపత్రాలు పంచడం వారికి చాలా ఆగ్రహం కలిగించింది.   అందుకే తాము కూడా తెదేపాపై బాణాలు వేసుకొనేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చేసుకొన్నవిన్నపానికి బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే మొదట శాసనసభలో చంద్రబాబుని పొగిడిన బీజేపీ సభ్యులు ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి చిన్న చురకలు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తెదేపా సైలెంట్ అయిపోయింది. కానీ ఒకవేళ తెదేపా మళ్ళీ గళం విప్పితే తాము కూడా దానితో సమాన స్థాయిలో రాగాలాపన చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.   మోడీ అధికారం చేప్పట్టగానే అసలు ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనివిధంగా ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే 24x7గంటలు నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు, ఎయిమ్స్, ఐఐయం, ఐఐఐటి సంస్థలను మంజూరు చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వాటికంటే ముందు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించేందుకు మోడీ ప్రభుత్వం తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ఏడూ ముంపు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   ఒకవేళ తెదేపా నేతలు తమతో సఖ్యతగా ఉంటే సరేసరి లేకుంటే తాము కూడా కత్తులు, బాణాలు బయటకు తీయకతప్పదని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలు వారి ఈ కలహాల కాపురం ఇంకా ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో ఏమోనని అనుకొంటున్నారు.

ఏపీ గ్యాస్ ఏపీకే కానీ వయా గుజరాత్

  గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల కృష్ణా, గోదావరి బేసిన్ నుండి వెలికి తీస్తున్న అపారమయిన గ్యాస్ నిక్షేపాలు ఎక్కడో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి పైపుల ద్వారా తరలిపోతున్నాయి. అందువల్ల పెరట్లో ఉత్పత్తి అవుతున్న ఈ గ్యాస్ ని ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ కి భారీగా డబ్బు చెల్లించి మరీ కొనుగోలు చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విద్యుత్ సంస్థల నుండి విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ ముందు జాగ్రత్తతో గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ తో కూడా ఒక ఒప్పందం చేసుకొంది.   దాని ప్రకారం ఆ సంస్థ రోజుకి 1.6 మిలియన్ స్క్వేర్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ రాష్ట్రానికి సరఫరా చేస్తుంది. ఈ గ్యాసుతో రాష్ట్రంలో ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థల ద్వారా 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. దానితో ఈవేసవిలో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా జరుగుతుంది. ఇక మరో విశేషం ఏమిటంటే గెయిల్ సంస్థ ఇదే గ్యాసుకి 14.5 డాలర్లు వసూలు చేస్తుంటే, గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ మాత్రం 13.8 డాలర్ల ధరకే సరఫరా చేసేందుకు అంగీకరించింది. తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ సంస్థ నుండి గ్యాస్ కొనుగోలు చేసి లగడపాటి రాజగోపాల్ కి చెందిన ల్యాంకో గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థకు దానిని అందించి దాని నుండి విద్యుత్ తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.   కేంద్ర పెట్రోలియం మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేయగానే రాష్ట్రానికి గ్యాస్ సరఫరా మొదలవుతుంది.

పాదయాత్రలతో పాపాలను కడిగేసుకోగలిగితే...

  బొగ్గు కుంభకోణం కేసులో వచ్చేనెల 8న కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలని మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. ఆయనతో బాటు కుమార్ మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి పిసి.ఫారెక్, హిండాల్కో కంపెనీ, దానికే చెందిన మరో ఇద్దరు అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. 2005 సం.లో డా. మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహిస్తున్నప్పుడు, ఒడిషా రాష్ట్రంలోతలబిర-2 బొగ్గు గనులలో హిండాల్కో కంపెనీకి 15 శాతం వాటాను కేటాయించడం జరిగింది. బొగ్గు గనుల కేటాయింపులలో భారీ కుంభకోణం జరుగుతోందనే సంగతి గ్రహించిన సుప్రీంకోర్టు బొగ్గు గనుల త్రవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాదాపు 147 లైసెన్సులు రద్దు చేసి, వాటిపై విచారణ చెప్పట్టమని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుని ఏర్పాటుచేసి విచారణ మొదలుపెట్టింది. ఆ కోర్టు మొట్ట మొదటగా డా. మన్మోహన్ సింగ్ వైపే వేలెత్తి చూపడం విశేషం.   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు డిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం నుండి తన యంపీలు, సీనియర్ నేతలతో కలిసి డా. మన్మోహన్ సింగ్ కి మద్దతు తెలుపుతూ ఆయన ఇంటివరకు పాదయాత్ర చేసారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “డా. మన్మోహన్ సింగ్ నిష్కళంకమయిన వ్యక్తి అని యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. అటువంటి వ్యక్తిపై సీబీఐ ఇటువంటి నిందారోపణలు చేయడం కోర్టుకి హాజరుకమ్మని నోటీసులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి మద్దతుగా ఉంటుంది. అవసరమయితే ఆయన కోసం న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్దం,” అని తెలిపారు.   డా. మన్మోహన్ సింగ్ ఎటువంటి అవినీతికి పాల్పడరని అందరికీ తెలుసు. కానీ ఆయన బొగ్గు మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నప్పుడు అందులో జరిగే అక్రమాలకు ఆయన బాధ్యుడుకాడని చెప్పలేము. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలకు ఆయన ఆమోదముద్ర వేసి, ఇప్పుడు అందుకు తను బాధ్యుడినికానని ఆయన వాదించడం అసమంజసం. అదీగాక బొగ్గు గనుల కేటాయింపులో చాలా అవినీతి జరుగుతోందని ఆ సమయంలో ప్రతిపక్షాలు చాలా గట్టిగా హెచ్చరించాయి కూడా. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆయన ఆమోదముద్ర వేశారంటే ఖచ్చితంగా అందుకు బాధ్యత వహించాల్సిందే.   ఆయన స్వయంగా ఎటువంటి నేరమూ చేసి ఉండకపోవచ్చును. ఆ కుంభకోణంలో ఎటువంటి లబ్ది పొంది ఉండకపోవచ్చును. కానీ అవినీతి జరుగుతోందని ఖచ్చితంగా తెలిసిన తరువాత కూడా ఆయన ఆమోదముద్ర వేయడం అంటే అవినీతికి ఆమోదముద్ర వేసినట్లే. కనుక ఇటువంటి పాదయాత్రల వలన ఆయనకు అంటుకొన్న ఈ అవినీతి మసి తొలగిపోదు. పైగా ఇప్పుడు ఆయనకు మద్దతుగా సోనియాగాంధీ చేప్పట్టిన పాదయాత్ర వలన యావత్ ప్రపంచానికీ కూడా ఈ సంగతి కాంగ్రెస్ పార్టీయే స్వయంగా డప్పు కొట్టుకొని మరీ చాటింపు వేసుకొన్నట్లయింది. ఈ కుంభకోణంలో నిందితులుగా పేర్కొనబడిన ఆరుగురు వ్యక్తులు కూడా తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకొంటున్నారు. మరయితే ఇన్ని వేలకోట్ల అవినీతికి పాల్పడింది ఎవరు? దేశ సంపదని అంతా బొక్కేసింది ఎవరు?

ఆడిన మాట తప్పని జగన్

  ఇంతకాలం జగన్‌ అనుచరగణం ఆయన్ని మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పొగుడుతూ వుంటే రాజకీయ వర్గాలు మంచి జోక్ విన్నట్టుగా హాయిగా నవ్వుకునేవి. జగన్ అనే పేరు వినగానే లక్షల కోట్ల కుంభకోణాలు, పదహారు నెలల జైలు జీవితం తప్ప మరో విషయం ఎవరికీ గుర్తుకురాని పరిస్థితుల్లో, జగన్ అనుచరగణం ఆయన మాటతప్పని, మడమ తిప్పని మనిషి అని పొగుడుతూ ఆత్మానందం చెందుతూ వుండటం నిజంగానే నవ్వు తెప్పించే విషయమే. అయితే ఏపీ రాజకీయాలలో తాజాగా జరిగిన పరిణామాలు జగన్ మడమ తిప్పని మనిషి అనే విషయం అలా వుంచితే జగన్ మాట తప్పని మనిషి అనే విషయం మాత్రం చాలా కరెక్ట్ అని తేలిపోయింది. రాజకీయ వర్గాలు ఈ విషయంలో ఇంతకాలం ఆయన్ని అపార్థం చేసుకున్న విషయం కూడా స్పష్టమైంది. ఇంతకీ, జగన్ మాట తప్పని మనిషి అని ఎలా రుజువైంది?   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతోపాటు జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తాను కోరుకున్నట్టు అసెంబ్లీలో జరగకపోతే తాను ‘అగ్లీ’గా ప్రవర్తిస్తానని స్పీకర్ని హెచ్చరించారు. ఆ మీటింగ్‌లో జగన్ వ్యవహార శైలి, ‘అగ్లీ’గా ప్రవర్తిస్తానని హెచ్చరించడం గౌరవనీయ స్పీకర్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. వెంటనే ఆయన జగన్‌కి క్లాస్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మీరు ఇలా మాట్లాడ్డం సరికాదని మందలించారు. మామూలుగా ఎవరైనా తాను మాట్లాడిన విధానాన్ని పునః పరిశీలించుకుని పశ్చాత్తాపం చెందుతారు. కానీ, అక్కడ ఉన్నదెవరూ.... జగన్ గారు. అందుకే పశ్చాత్తాపం లాంటి పనులేమీ జరగలేదు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. స్పీకర్‌తో జరిగిన మీటింగ్‌లో తాను అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తానని చెప్పారో జగన్ కచ్చితంగా అలాగే ప్రవర్తిస్తూ తాను మాట మీద నిలబడే వ్యక్తినని నిరూపించుకున్నారు. ఇలా ఆడిన మాట తప్పని జగన్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా వుండటం ఆ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పుణ్యం.

మందు చూపుతో టీడీపీలోకి... ముందు చూపుతో వైసీపీలోకి...

  మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున ఓ పెద్దాయన ఎంపీగా గెలిచారు పారిశ్రామికవేత్తగా మంచి పేరు ప్రతిష్ఠలున్న ఆ పెద్దాయన చిటుక్కున ఇలా గెలిచాడో లేదో లటుక్కున వైసీపీలోంచి టీడీపీలోకి జంపైపోయారు. ఆయనకు ఓట్లు వేసిన ఓటర్ల వేళ్ళమీద ఇంకు ఆరకముందే ఆయన జంప్ జిలానీ అయిపోయారు. ఆ జంప్ జిలానీ పేరేంటో తెలుసుకోవాలన్న ఇంట్రస్ట్ మీకు బాగా పెరిగిపోయింది కదూ.. ఆయన పేరును మేం చెప్పడం కంటే.. రెండు నిమిషాలు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. సరే, ఎన్నికలు అయిపోయాయి, పార్టీ మారడమూ అయిపోయింది... ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఆయన ప్రస్తావన ఎందుకనే సందేహం మీకు రావడం సహజం.. ఆ సందేహాన్ని తీర్చడం మా బాధ్యత. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకురావలసి వచ్చిందంటే... ఆయన మరోసారి పార్టీ మారబోతున్నారు. టీడీపీ నుంచి బ్యాక్‌ టు హోం అన్నట్టుగా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే మూటాముల్లె సర్దేసుకుని సిద్ధంగా వున్నారు. రేపో ఎల్లుండో వైసీపీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తాను తిరిగి వైసీపీలోకి వెళ్ళబోతున్నానని ప్రకటించే అవకాశం వుంది. మరి ఎంతో ముచ్చటపడి టీడీపీలో చేరిన ఆయన మళ్ళీ ఎందుకు వైసీపీలోకి వెళ్ళబోతున్నారు? దీని వెనుక వున్న అసలు కారణమేంటి? పార్టీ ఫిరాయింపుల చట్టం చేతిలో చిక్కి చిక్కి శల్యమైపోతానన్న భయమా? లేక మరేదైనా వుందా?   నిజానికి సదరు పెద్దాయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అవడం వెనుక ‘మందు’చూపు వుంది. అచ్చు తప్పు కాదు.. నిజంగానే మందుచూపు వుంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద డిస్టిలరీ వుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా డిస్టిలరీలు తెలంగాణ రాష్ట్రంలోనే వుండిపోయాయి. అయితే ఏపీలో సదరు పెద్దాయనకు ఉన్న డిస్టిలరీని ప్రభుత్వం ఒడిలోకి చేర్చితే తనకు బోలెడంత ఆదాయం వస్తుందని ప్లాన్ వేసిన ఆయన టీడీపీలో చేరిపోయారు. దాంతో ఈమధ్యే ఆయన డిస్టిలరీని ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ఆ పెద్దాయనికి బోలెడు ఆదాయం వచ్చేలా చేసింది. తన మందు చూపు వర్కవుట్ అయిందని హ్యాపీగా వున్న ఆ పెద్దాయనకి ఇంతలో ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. తనకు ఒక ప్రాణాంతక వ్యాధి వుందని, అది అడ్వాన్స్ స్టేజ్‌లో వుందని తెలిసిపోయింది. జీవితంలో ఎంతో శ్రమించి, ఎంతో సాధించిన తనకు ఇక శాశ్వత విశ్రాంతి తప్పదని ఆయనకు అర్థమైపోయింది. కాలం ముందు ఎవరైనా ఓడిపోక తప్పదన్న సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారు. ఈ దశలో ఆయన ఇప్పుడు ముందుచూపుతో, మధ్యంతర ఎన్నికల చూపుతో ఆలోచిస్తున్నారు. మందుచూపుతో టీడీపీలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ముందుచూపుతో వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. తన తర్వాత తన వారసుడు టీడీపీ తరఫున పోటీకి నిలిచిన పక్షంలో తనమీద ఆగ్రహంతో వున్న వైసీపీ తప్పకుండా పోటీ పెడుతుంది. అప్పుడు తన వారసుడు గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు. అదే తాను మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతే తన వారసుడు తప్పకుండా గెలిచే అవకాశం వుంది. టీడీపీ కూడా అభ్యర్థిని పోటీకి నిలిపే అవకాశం లేదు. ఎందుకంటే, నందిగామ, తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని నిలపలేదు. ఈ కోణంలో ఆలోచించిన ఆ పెద్దాయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. వైసీపీ నాయకుడు జగన్‌కి ఈ పెద్దాయన మీద కోపం వున్నప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.