English | Telugu
‘జబర్దస్త్’తో బుల్లితెరను ఏలి.. రంగమ్మత్తగా వెండితెరపై వెలిగిన అనసూయ!
Updated : May 14, 2024
అనసూయ భరద్వాజ్.. కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టే అందం, చలాకీతనం ఆమె సొంతం. టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనసూయ 38 సంవత్సరాల వయసులోనూ కుర్రకారును హుషారెక్కిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బుల్లితెరపై తన ఉనికిని చాటుకొని, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. మే 15 అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుల్లితెర నుంచి వెండితెర వరకు ఆమె కెరీర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.
హైదరాబాద్లో జన్మించిన అనసూయ 2008లో ఎం.బి.ఎ. పూర్తి చేసి ఫిక్స్లాయిడ్ కంపెనీలో హెచ్.ఆర్.గా పనిచేసింది. కాలేజ్ మేట్ అయిన సుశాంక్ భరద్వాజ్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. చదువుకునే రోజుల్లోనే 2003లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా ‘నాగ’ చిత్రంలో స్టూడెంట్గా నటించింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఫిక్స్లాయిడ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని కాదని సాక్షి టీవీలో వ్యాఖ్యాతగా చేరింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోలో వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ షో ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇదే కాకుండా పలు రియాలిటీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించింది. సినిమాలకు సంబంధించిన పలు ప్రమోషన్స్కు యాంకర్గా బాధ్యతలు నిర్వర్తించింది.
పూర్తి స్థాయిలో అనసూయ నటించిన మొదటి సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమా తర్వాత ‘క్షణం’ చిత్రంలో చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇక ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరీర్లో ది బెస్ట్గా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో పోషించిన పాత్రలకు ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్తో సహా పలు అవార్డులు లభించాయి. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అనసూయ సినిమాలపైనే తన దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ నటిగా ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. యాంకర్గా పేరు తెచ్చుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ సినిమాల్లో మరిన్ని మంచి పాత్రలు పోషించి నటిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ అనసూయ భరద్వాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.