English | Telugu
‘నేను ఎవరి దయ వల్లనో ఎదగలేదు..’ ఉపాసన కొణిదెల సంచలన వ్యాఖ్యలు!
Updated : Aug 26, 2025
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన రామ్చరణ్ గ్లోబల్ స్టార్గా ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. భర్తకు తగ్గ భార్యగా, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్గా, ఒక తల్లిగా, వ్యాపార వేత్తగా, సామాజిక కార్యకర్తగా ఉపాసన కొణిదెల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను అందరితోనూ పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఉపాసన.. ఎమోషనల్గా చేసిన ఒక పోస్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలుగా, రామ్చరణ్ భార్యగా ఉండడం వల్ల తాను ప్రత్యేకమైన వ్యక్తిని కాలేదని, అన్నిరకాల సమస్యలను ఎదుర్కొనే శక్తే దానికి కారణం అని పేర్కొన్నారు. అసలు ఉపాసన పెట్టిన పోస్ట్ ఏమిటో ఒకసారి చూద్దాం.
‘నేను ఎవరి దయ వల్ల ఎదగలేదు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచి ముందుకు వచ్చాను. నా మీద నాకే నమ్మకం. అసలైన బలం ఆత్మగౌరవంలో ఉంటుంది. అది డబ్బు, హోదా, ఫేమ్లలో ఉండదు. అహంకారం గుర్తింపుని కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం ఎలాంటి శబ్దం రాకుండా గుర్తింపును సంపాదిస్తుంది’ అంటూ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్లో ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఆలోచనను పంచుకోవడంలో భాగంగా ఈ పోస్ట్ చేశారు. ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.