English | Telugu
వైరల్గా మారిన రామ్చరణ్ పాత ట్వీట్!
Updated : Sep 4, 2023
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, హీరో, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అతను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడమే కాకుండా అతనిపై బిజెపి వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. ఉదయనిధిపై కేసులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో రామ్చరణ్ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్గా మారుతోంది. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి 2020లో రామ్చరణ్ ఓ ట్వీట్ చేశారు. తన తల్లి తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అని ట్వీట్ చేశారు. ఇప్పుడు కొంతమంది హిందూ వాదులు ఆ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సనాతన నిర్మూలన అనే అంశంపై సదస్సు నిర్వహించగా దానికి ముఖ్యఅతిథిగా ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ‘సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతికేకంగా ఉంటుంది. కొన్నింటిని వ్యతికేకించి ఊరుకోకూడదు. దోమలు, డెంగ్యూ వంటి వాటిని వ్యతిరేకిస్తే లాభం లేదు. వాటిని నిర్మూలించాలి. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి’ అని వ్యాఖ్యానించారు ఉదయనిధి. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వచ్చినా చలించని ఉదయనిధి తను అన్నమాటలకే కట్టుబడి ఉంటానని, తనపై ఎటువంటి కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.