English | Telugu

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు దమ్ముంటే అలా చేసి చూడండి.. కేతిరెడ్డి డిమాండ్‌!

దేశవ్యాప్తంగా పలు భాషల్లో బిగ్‌బాస్‌ రియాలిటీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో గురించి చాలా సందర్భాల్లో వ్యతిరేకత వచ్చింది. బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలని వివిధ సంస్థలు పోరాటం చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ప్రముఖ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బిగ్‌ బాస్‌ షో అనేది పిచ్చికి పరాకాష్ట అనే విషయం ఇప్పుడు రుజువైందని, ఇకనైనా ఈ షో విషయంలో తమ బాధను అర్థం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చెయ్యాలని ఆ ప్రకటనలో కోరారు.

బిగ్‌ బాస్‌ 3 జరుగుతున్న సమయంలోనే 2019లో మొదట తెలంగాణ హైకోరులో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ దాఖలు చేయడం జరిగింది. యువత చెడుమార్గంలో నడిచేందుకు ఈ షో కారణమవుతోందని ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఢల్లీి, హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై నగరాలలో బిగ్‌ బాస్‌ షో ను బ్యాన్‌ చేయాలని కోరుతూ అటు ప్రజా పోరాటాలు, ఇటు నయపోరాటాలు చేస్తూనే ఉన్నామని కాబట్టి ఈ షో ని రద్దు చేయాలని కోరారు. 24 గంటలు ఒక రూంలో కొంతమందిని బంధించి వాళ్ళకు పిచ్చిపిచ్చి టాస్క్‌లు ఇచ్చి వాళ్ళను పిచ్చి వాళ్ళుగా తయారు చేస్తున్నారని కేతిరెడ్డి పేర్కొన్నారు. గేమ్‌ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు, హగ్గులు, ముద్దులు పెట్టుకున్నారన్న విషయాలను సమాజం దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు సాగిస్తూనే ఉన్నామని, వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని ఈ నిర్వాహకులు విచ్చలవిడిగా నడుచుకుంటున్నారని, వాటన్నింటికి అభ్యంతరం తెలపటం జరిగిందని అన్నారు. ఈ షోలు టెలికాస్ట్‌ కాకుండా ఆపేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ షోలో డ్రగ్స్‌ కూడా వాడుతున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ షో నిర్వాహకులకు దమ్ముంటే ప్రజల మధ్య రెండు రాష్ట్రాల్లో ప్రజా కోర్ట్‌లో ఓపెన్‌ డేబిట్‌ పెట్టి మీ షో పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవాలని తన ప్రకటనలో పేర్కొన్నారు.