English | Telugu
చిత్ర సీమలో విషాదం.. 'నిరీక్షణ' దర్శకుడు కన్నుమూత!
Updated : Jul 29, 2023
తెలుగు చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. మూవీ మొఘల్ డి. రామానాయుడు పరిచయం చేసిన దర్శకుల్లో ఒకరైన సీతారామ్ (49) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఎన్. ఎస్. ఆర్. ప్రసాద్ గానూ పరిచితుడైన సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం.
సినిమాల మీద ఆసక్తితో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రచయితగా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు సీతారామ్. ఆ అనుభవంతోనే రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' (2005) కోసం మొదటి సారిగా మెగాఫోన్ పట్టారు. ఆర్యన్ రాజేశ్, శ్రీదేవి విజయ్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం తరువాత.. శ్రీకాంత్ తో 'శత్రువు', నవదీప్ తో 'నటుడు' సినిమాలను తెరకెక్కించారు. ఇక సీతారామ్ దర్శకత్వంలోనే రూపొందిన కొత్త చిత్రం 'రెక్కీ' విడుదలకు సిద్ధమైంది. సీతారామ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.