English | Telugu
'భోళా శంకర్' పబ్లిక్ టాక్.. మెగా ఫ్యాన్స్ ని ముంచేసిన మెహర్ రమేష్!
Updated : Aug 10, 2023
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు(ఆగస్టు 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2015 లో వచ్చిన తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ కావడం, మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ బాలేకపోవడంతో.. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో కూడా పెద్దగా అంచనాల్లేవు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్లుగా లేవు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశం లేదనే అభిప్రాయాలున్నాయి. అభిమానులు కూడా ఆ ఆశతోనే ఎదురుచూస్తున్నారు. అయితే వారికి నిరాశ తప్పలేదనే టాక్ వినిపిస్తోంది.
మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టి చాలా కాలమే అయింది. 'శక్తి', 'షాడో' వంటి డిజాస్టర్స్ తర్వాత పదేళ్లు డైరెక్షన్ కి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మెగాస్టార్ ఆయనను నమ్మి అవకాశం ఇచ్చారు. కానీ ఆ నమ్మకాన్ని మెహర్ నిలబెట్టుకోలేక పోయారని సినిమా చూసినవాళ్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రారంభమవ్వడమే నీరసంగా ప్రారంభమైందని, ఫస్టాప్ ఏమాత్రం మెప్పించలేకపోయిందని అంటున్నారు. కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పించకపోగా, చిరాకు తెప్పించేలా ఉన్నాయని టాక్. ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త మెరుగ్గా ఉన్నా.. అది సినిమాని కాపాడే స్థాయిలో అయితే లేదట. ఓ 15-20 నిమిషాలు తప్ప దాదాపు సినిమా అంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందట. మెహర్ రమేష్ ఎనిమిదేళ్ళ క్రితం నాటి కథ తీసుకొని, 20-25 ఏళ్ల క్రితం నాటి సినిమాలా మలిచాడని.. రచనలో గానీ, దర్శకత్వంలో గానీ కొంచెం కూడా ప్రభావం చూపలేకపోయాడని చెబుతున్నారు. మెగాస్టార్ అనే బ్రాండ్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏంలేదని.. డైలాగ్స్, పవన్ కళ్యాణ్ సీన్స్ రిక్రియేషన్ అన్ని తేలిపోయాయని అంటున్నారు. ఆయన్ని నమ్మి మెగాస్టార్ అవకాశమిస్తే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా.. మెహర్ తమని ముంచేశాడని మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.