English | Telugu
ప్రజలు కోరుకోకముందే నాన్నగారు అది ఇచ్చేవారు: 'స్కంద' వేడుకలో బాలయ్య
Updated : Aug 26, 2023
నటరత్న నందమూరి తారక రామారావుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. వారిలో ఆయన తనయుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. తనకి అవకాశం దొరికినప్పుడల్లా నాన్న గురించి అభిమానంగా ఏదో ఒక కొత్త విషయం ప్రస్తావిస్తుంటారు బాలయ్య. ఇక 'స్కంద' ట్రైలర్ ఈవెంట్ లో కూడా తన ప్రసంగంలో మరోసారి నాన్న ప్రస్తావన తీసుకువచ్చారు నటసింహం.
"మన సినిమాలకు మన దగ్గరే కాదు.. భారతదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారంటే అది ఎంతో అభినందనీయం. ఒకరకంగా అది మొదలైంది.. మానాన్న నందమూరి తారక రామారావుతోనే. ఆయనకి ఎప్పుడూ ప్రజలకి కొత్తదనం ఇవ్వాలనే తపన ఉండేది. ప్రజలు కోరుకోవడానికి ముందే అలా ఇచ్చేవారు.. సర్వైవల్ కోసం కాదు.. చలనచిత్ర పరిశ్రమ నిలబడాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటన్నింటిని ప్రజలు ఆదరించారు. ఘనవిజయం చేశారు. కాలేజ్ రోజుల్లో నాన్నగారి సినిమాల గురించి విశ్లేషించేవాళ్ళం.. అది శ్రీకృష్ణుడు పాత్రైతేనేం.. రాముడు పాత్రైతేనేం.. మరోదైతేనేం.. " అంటూ చెప్పుకొచ్చారు.
ఇక 'స్కంద' కథానాయకుడు రామ్ గురించి మాట్లాడుతూ.. " దేవదాసు నుంచి రామ్ ని గమనిస్తున్నా.. కొత్త పాత్రలు చేయాలని, ఆవిష్కరించాలని తపన ఉన్న నటుడు. మనమంతా గర్వించదగ్గ నటుడు. తను రకరకాల పాత్రల ద్వారా వినోదం పంచాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. బోయపాటికి కూడా ఆల్ ది బెస్ట్ అంటూ 'స్కంద' విజయం సాధించాలని ఆకాంక్షించారు.