English | Telugu

ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి?

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. శ్రీభారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకుడు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు జి.సందీప్‌ మాట్లాడుతూ, "కథ అంతా రెడీ చేసుకుని సినిమా తీయడానికి నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే ప్రొడ్యూస్‌ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్‌ చేసి డబ్బు పెట్టారు. అందువల్లే ఈ సినిమా పూర్తయింది. అయితే దగ్గరుండి ఈ సినిమా పూర్తి చేయాలంటే నాకో మనిషి కావాలి. నాకు బాగా తెలిసిన నవీన్ గారికి విషయం మొత్తం చెప్పా. ఆయన నాతో ట్రావెల్‌ చేశారు. ప్రొడక్షన నుంచి క్యాస్టింగ్‌ వరకూ అన్ని చూసుకున్నారు. అలాగే హరి కూడా ఎంతో సపోర్ట్‌ చేశారు. అశోక్‌ అనే వ్యక్తి ద్వారా హీరో శ్రీరామ్‌ పరిచయం అయ్యారు. అలా నా చుట్టూ ఉన్న సన్నిహితుల వల్లే ఇక్కడి వరకూ రాగలిగాను. నా టీమ్‌ అంతా ఎంతో సహకరించారు. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని అన్నారు.

కిరీటి దామరాజు మాట్లాడుతూ, "ఈ చిత్రంలో నేనూ ఓ పాత్ర పోషించా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే ఈ చిత్రంలో చూపించారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. అదే సినిమా. దర్శకుడు సందీప్‌ చక్కగా ఎగ్జిక్యూట్‌ చేశారు. అంతే కాదు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మోస్తున్నాడు. సినిమాను తెరకెక్కించడంతో తన ఐడెంటిటీ చూపించాడు’’ అని అన్నారు.

మౌనిక కలపాల మాట్లాడుతూ "ఏ నటికైనా ఓ సినిమా హిట్టై పేరొచ్చాక అవకాశాలు వాటంతట అవే వస్తాయి. కానీ కెరీర్‌ బిగినింగ్‌లో ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినవారే గురువులుగా నిలుస్తారు. నా మొదటి దర్శకుడు రామరాజు. ఇప్పుడు సందీప్‌ గారు నాకు అలా అవకాశమిచ్చారు. నా మొదటి సినిమా లాక్‌డౌన్ వల్ల థియేటర్‌లో విడుదల కాలేదు. ఈ సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.

సోనియా మాట్లాడుతూ ''ఎవరి జీవితంలోనూ అనుకున్నవి అంతా తేలికగా జరగవు. ఈ సినిమా ఇతివృత్తం కూడా ఇదే. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. క్రైమ్‌, లవ్‌, కామెడీ ఉన్న ఈ చిత్రానికి చక్కని ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు.

పోసాని కృష్ణ మురళి, భమ్ చిక్ బబ్లు, కిరీటి, మిర్చి హేమంత్, గౌతమ్ రాజు, లోహిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గిడియన్ కట్ట సంగీత దర్శకుడు. డీఓపీలుగా చిన్నా రామ్, జి.వి. అజయ్, ఎడిటర్ గా కేసీబీ హరి వ్యవహరించారు.