English | Telugu

‘యానిమల్‌’పై కేసు నమోదు.. బ్లాక్‌బస్టర్‌ అయినా తప్పని తిప్పలు!

ఈమధ్యకాలంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన సినిమాల్లో ‘యానిమల్‌’ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. రణబీర్‌కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాపై విమర్శలు కూడా అదే రేంజ్‌లో వచ్చాయి. కొందరు సినీ ప్రముఖులు సైతం ‘యానిమల్‌’ చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఈ మాటలేవీ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించలేకపోయాయి. రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి రికార్డు క్రియేట్‌ చేసింది ‘యానిమల్‌’.
థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. జనవరి 26న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని ప్రకటించారు. అయితే అనుకోకుండా ‘యానిమల్‌’ చిత్రంపై ఓ కొత్త వివాదం మొదలైంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన సినీ 1 స్టూడియోస్‌ వారు కేసు వేసిన విషయం వైరల్‌గా మారింది. ‘యానిమల్‌’ చిత్ర నిర్మాణంలో తామూ భాగస్వాములమని. కానీ, సినిమాకి వచ్చిన లాభాలను తమకు పంచలేదన్నారు. అంతేకాదు.. తమకు తెలియకుండానే మరికొన్ని కార్యకలాపాలను టి సిరీస్‌ సంస్థ చేసిందని, అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను వెంటనే ఆపాలని సినీ 1 స్టూడియోస్‌ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

టి సిరీస్‌ తరఫు న్యాయవాదులు సినీ 1 స్టూడియోస్‌ సంస్థ వేసిన కేసుకు సమాధానమిస్తూ.. ‘యానిమల్‌’ సినిమా హక్కులని సినీ 1 స్టూడియోస్‌ సంస్థ 2.2 కోట్లకు టి సిరీస్‌కి వదిలేసిందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు ప్రాఫిట్స్‌ పంచలేదని తమపై ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి ఈ సినిమాతో సినీ 1 స్టూడియోస్‌కి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సినీ 1 స్టూడియోస్‌కు ఢల్లీి హై కోర్టు సూచన చేసింది. ఈ కేసును జనవరి 18కి వాయిదా వేసారని తెలుస్తోంది. జనవరి 26కి ఓటీటీలో వచ్చేస్తోందని భావించిన ప్రేక్షకులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాపై కోర్టులో కేసు ఉన్న కారణంగా జనవరి 26 ఓటీటీలో రిలీజ్‌ అవ్వడం కష్టమేనని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.