English | Telugu
'ఆదిపురుష్' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!
Updated : May 1, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరామునిగా కనువిందు చేయనున్న మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో టి.సిరీస్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.
నిజానికి ఆదిపురుష్ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని మొదట సన్నాహాలు చేశారు. అయితే గతేడాది అక్టోబర్ లో విడుదల చేసిన టీజర్ అంచనాలకు అందుకోకపోవడంతో.. వీఎఫ్ఎక్స్ కోసం మరింత సమయం తీసుకోవాలని భావించిన మేకర్స్ చిత్ర విడుదలను జూన్ కి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే త్వరలోనే ఆ సస్పెన్స్ కి తెరపడనుంది.
'ఆదిపురుష్' ట్రైలర్ ని మే 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ముందురోజున దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారని వినికిడి. అప్పటికీ ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ మెరుగుపడిందని, ట్రైలర్ అందరి అంచనాలకు మించేలా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి. మరి 'ఆదిపురుష్' ట్రైలర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.