English | Telugu
నంది అవార్డులపై సినీ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్!
Updated : May 1, 2023
తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు నంది అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆ అవార్డులకు సినిమా వారు ఎంతో విలువ ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులకు బ్రేక్ పడింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం గానీ నంది అవార్డులపై దృష్టి పెట్టడం లేదు. అయితే ఈ విషయంపై తాజాగా ఇద్దరు సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆల్ టైం హిట్స్ లో 'మోసగాళ్లకు మోసగాడు' ఒకటి. కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని 4K లో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరి రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా నుంచి నంది అవార్డులకు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా.. ఆదిశేషగిరి రావు, అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
"తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులు అనేది అప్రస్తుతం అయిపోయింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వాటి మీద ఆసక్తి లేదు. సినీ పరిశ్రమ తన దారిలో తాను వెళ్తుంది. అయినా ఒకప్పటిలా ప్రభుత్వ అవార్డులకు ఇప్పుడు విలువ లేదని నేను అనుకుంటున్నాను" అని ఆదిశేషగిరి రావు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మైక్ అందుకున్న అశ్వినీదత్.. "ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ.. వాళ్ళకి ఇస్తారు. సినిమాకి అవార్డులు ఇచ్చే రోజులు మళ్ళీ రెండు మూడేళ్ళలో వస్తాయి" అని సంచలన కామెంట్స్ చేశారు.
"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే అర్హత సూపర్ స్టార్ కృష్ణకి ఉందని, ఆ దిశగా మీ వంతుగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా?" అనే ప్రశ్నకు కూడా ఆదిశేషగిరి రావు సంచలన సమాధానం ఇచ్చారు. "కృష్ణ గారు అవార్డులకు దూరం. వస్తే స్వీకరించారు అంతే. మేం ఎప్పుడూ అవార్డుల కోసం ప్రయత్నించలేదు. ఆయన అర్హుడు అని ప్రభుత్వం భావించి ఇవ్వాలి. అయినా ఇప్పుడు అవార్డులు అనేవి ప్రభుత్వాలు వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నాయి." ఆదిశేషగిరి రావు అన్నారు.