English | Telugu
‘సామజవరగమన’ వివాదం.. కౌన్సిల్ ని ఆశ్రయించిన నిర్మాత
Updated : Aug 21, 2023
రీసెంట్ గా విడుదలైన ఘన విజయం సాధించిన చిన్న చిత్రాల్లో 'సామజవరగమన' ఒకటి. శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమాకు ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అనీల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించారు. సినిమా రిలీజ్ తర్వాత వివాదం అల్లుకోవటం కొస మెరుపు. సినిమా నిర్మాత అయిన రాజేష్ దండ తనకు ఉత్తరాంధ్ర ఏరియాలో సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కలెకన్స్ ను ఇవ్వలేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను ఆశ్రయించారు. ముందుగా రాజేష్ దండ, వైజాగ్ అసోసియేషన్ ను సంప్రదించారు. అయితే తనకు న్యాయం జరగటం లేదని భావించి ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.
మహా సముద్రం సినిమాకు నష్టాలు వచ్చినప్పుడు వాటిని పూడ్చుకోవటానికి అనీల్ సుంకర తనకు సామజవరగమన ఉత్తరాంధ్ర హక్కులను ఇచ్చారని సతీష్ పేర్కొన్నారు. అయితే సామజవరగమన నిర్మాత తను అయితే అనీల్ సుంకర గ్యారంటీ ఇవ్వటం ఏంటని రాజేష్ వాదన. అనీల్ ఇచ్చిన పత్రాలను కౌన్సిల్ కు ఇవ్వాలని రాజేష్ కోరుతున్నారు. అయితే సతీష్ సామజవరగమన సినిమాకు అసలు హక్కుదారు కాదని, 5 శాతం కమీషన్ కి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పి స్థానిక ఎగ్జిబిటర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారని సమాచారం.
ఏజెంట్ నష్టాల విషయంలో అనీల్ సుంకరపై వైజాగ్ సతీష్ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నిజానికి ఇది వైజాగ్ సతీష్ కి కొత్త సమస్య అనే చెప్పాలి. భోళా శంకర్ హక్కులను అనీల్ సుంకర ఇవ్వకపోవటం వల్లే ఈ సమస్య బయటకు వచ్చి రచ్చకెక్కింది. మరి చివరకు ఇష్యూ ఎలా ముగుస్తుందో చూడాలి మరి. అయితే రీసెంట్ గానే ఖుషి సినిమా ఉత్తరాంధ్ర హక్కులను వైజాగ్ సతీష్ ఫ్యాన్సీ రేటుకి చేజిక్కించుకున్నారు.