English | Telugu
బాహుబలి ఖాతాలో కొత్త రికార్డు
Updated : Jul 5, 2014
రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తునే వుంది. ఇప్పుడు ఈ చిత్రనికి సంబంధించిన తాజా కబురు టాలీవుడ్ అంతట సంచలనంగా మారింది. 'బాహుబలి చిత్రం ఒకటవ భాగం పంపిణీ హక్కులు అత్యధిక రేటుకు దిల్ రాజు సొంతం చేసుకున్నారని వినికిడి. కేవలం నైజాం హక్కుల్ని సుమారు 25 కోట్ల రూపాయలు చెల్లించి ఆయన సొంతం చేసుకున్నారట. ఇలా ఒక ప్రాంతం హక్కులకు ఇంత భారీ మొత్తం చెల్లించడం టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి అంటున్నారు.
హాలీవుడ్, బాలీవుడు, కాలీవుడ్ ఇలా ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్న బాహుబలి ప్రాజెక్టు గురించి భారీ అంచనాలున్నాయనే విషయం చెప్పవలసిన పనిలేదు. ఆ అంచనాలకు తగిన విధంగా స్పందన కూడా వుంటుందని ధీమగా వున్నారట దిల్ రాజు. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి చిత్రం మొదటి భాగం 2015లో విడుదలకు సిద్దమవుతోంది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా లాంటి తారాగణంతో, భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ తో రూపొందుతోంది ఈ చిత్రం.