Read more!

English | Telugu

మే 29న చారిత్రాత్మకంగా 'ఆదిపురుష్‌' సెకండ్ సాంగ్ రిలీజ్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట 'జై శ్రీరామ్'కి విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు రెండో పాట విడుదలకు ముహూర్తం ఖరారైంది.

ఆదిపురుష్‌ టీమ్ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే సెట్ అయిన బెంచ్ మార్క్ ను మరోమెట్టు పైకి తీసుకువెళ్లేలా.. మూవీ టీమ్ రెండో పాటను విడుదల చేయబోతోంది. ఈ తరహాలో ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాటా విడుదల కాలేదు. 'రామ్ సియా రామ్' అంటూ సాగే ఈ గీతాన్ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ గీతాన్ని సంగీత ద్వయం సచేత్ - పరంపర స్వరపరచడంతో పాటు వారే పాడారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాట ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం చెబుతోంది. మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోందని మేకర్స్ అంటున్నారు. 

ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.