మీ గుండెల్లో నిద్రపోతా బాబు
posted on May 1, 2011 9:19AM
కడప: పులివెందులలో గత రాత్రి చిరంజీవి కాన్వాయ్పై చెప్పులు, కోడిగుడ్లతో దాడి... తెల్లారేసరికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై రాళ్ల దాడి. పులివెందులలోని కోమునూతల గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబుపై జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు చెప్పులు, రాళ్లు విసిరి బీభత్సాన్ని సృష్టించారు. ఈ దాడిపై చంద్రబాబు తీవ్ర నిరసనను తెలియజేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇటువంటి ఉడుత ఊపులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. కడపలో కొంతమంది చిల్లర నాయకులు ఇచ్చిన ప్రేరణతోనే ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఈ దాడుల వెనుక ఉన్న నాయకుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. తరిమికొట్టడం తమ సంస్కృతి కాదనీ, ప్రజాస్వామ్యంగా మట్టికరిపించడమే తమ సంస్కృతి అని అన్నారు. త్వరలో ఈ దాడులకు కారణమైన నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. సీనియర్ నాయకుడు ఎర్రంనాయుడు మాట్లాడుతూ... పులివెందుల నియోజకవర్గంలో తెదేపా సమావేశాలు సక్సెస్ అవుతున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఇటువంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. భయభ్రాంతుల్ని చేసి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రిగ్గింగ్కు పాల్పడేవారనీ, 85 శాతం ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యేవని మరో తెదేపా నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు.