హైదరాబాద్ బోనాలు అదుర్స్!

  హైదరాబాద్‌ నగరంలో ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. పాతబస్తీలోని సింహవాహిని దేవాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వం తరఫున బంగారు బోనం అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు దేవాలయాలలో అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయాల వల్ల జరిగిన ఊరేగింపులలో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఒకవైపు బోనాలు, మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

నిఠారి దోషులకు రాష్ట్రపతి క్షమాబిక్ష నిరాకరణ

  2005-2006 మధ్యకాలంలో పలువురు చిన్నారుల మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన నిఠారీ హత్యల కేసులో దోషులుగా నిరూపణ అయిన ఐదుగురికి మరణశిక్ష ఖరారైంది. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ ఐదుగురూ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దాంతో వీరికి ఉరి ఖాయమైంది. త్వరలో వీరిని ఉరి తీస్తారు. ఈ కేసులో కోలీతోపాటుగా మహారాష్టక్రు చెందిన అక్కాచెల్లెళ్లు రేణుకాబాయి, సీమా, అదే రాష్ట్రానికి చెందిన రాజేంద్ర ప్రహ్లాద్‌రావు వాస్నిఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన జగదీష్, అసోంకు చెందిన హోలీరామ్ బోర్డోలికి త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

‘సాక్షి’ వల్లే జగన్ ఓడిపోయాడట...!

  జగన్‌ని ఎన్నికలలో గెలిపించడానికి ఆయన సొంత మీడియా ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఆ సంగతి అలా వుంటే జగన్ మీడియా మీద రాజకీయ వర్గాల్లో భారీ స్థాయిలో విమర్శలున్నాయి. అయితే వాటిని జగన్ ఎంతమాత్రం పట్టించుకోరు. తాజాగా జగన్ మీడియా మీద కొత్త విమర్శ వచ్చింది. ‘సాక్షి’ కారణంగానే జగన్ ఓడిపోయాడన్న కామెంట్ వినిపించింది. ఆ కామెంట్ చేసిందే ఏ ఇతర పార్టీ నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యేనే కావడం వెరైటీ. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి కారణంగానే జగన్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి జగన్ పత్రిక కాబట్టి అందులో అన్నీ జగన్‌కి అనుకూలంగా వుండే వార్తలే వస్తూ వుంటాయని, ఇతర పార్టీల నాయకులను అదేపనిగా సాక్షి మీడియాలో తిడుతూ వుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆయన అన్నారు. సాక్షి మీడియా వైసీపీ కరపత్రిక అన్న ముద్ర ప్రజల్లో బలంగా పడటంతోపాటు ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్‌ ప్రసారాలు జగన్‌తో పాటు తమ పార్టీలో అతి విశ్వాసాన్ని కల్పించాయని అందుకే తమ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని ఆయన అన్నారు.

వీళ్ళు టీచర్లు కాదు.. కీచకులు!

  టీచర్లే కీచకులై ఆడపిల్లల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. గురు బ్రహ్మ, గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర: అని గురువుకు అత్యంత ఉన్నతమైన స్థానం మన సమాజం ఇచ్చింది. అయితే కొంతమంది గురువులు మాత్రం ఆడపిల్లల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అకృత్యాలకు పాల్పడుతున్నారు. నిన్నగాక మొన్న బెంగుళూరులో ఒక స్పోర్ట్స్ టీచర్ ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశం మీద ఇంకా ఆందోళనలు జరుగుతూ వుండగానే అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక కళాశాల లెక్చరర్ కమ్ డైరెక్టర్ తనపై, మరికొందరు విద్యార్థినులపై అత్యాచారం చేశాడంటూ ఆ కళాశాలకు చెందిన ఒక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతని వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది విద్యార్థినులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

మైగాడ్.. 40 నెమళ్ళు చనిపోయాయి!

  ఈమధ్యకాలంలో పంటపొలాల్లో వుంచిన పురుగుమందులు తిని నెమళ్ళు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. ముఖ్యంగా నెమళ్లు అధికంగా వుండే తెలంగాణ ప్రాంతంలో వాటి మరణం చాలా భారీ సంఖ్యలో వుంటోంది. అందమైన పక్షి కావడంతోపాటు మన జాతీయ పక్షి అయిన నెమలికి పంటపొలాల్లోని విష రసాయనాల వల్ల గండం వచ్చిపడింది. తాజాగా వరంగల్ జిల్లాలోని కోలుకొండ గ్రామం దగ్గర పంటపొలాల్లో చల్లిన విష పదార్థాలు తిన్న 40 నెమళ్ళు గిలగిల కొట్టుకుంటూ మరణించాయి. 40 నెమళ్ళు ఒకేసారి మరణించడం చూసి స్థానికులు బాధపడుతున్నారు. చనిపోయిన నెమళ్ళను గుట్టగా వేశారు. ఆ దృశ్యం చాలా బాధాకరంగా వుందని స్థానికులు అంటున్నారు. నెమళ్ళ మరణం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భవిష్యత్తులో పొలాల్లో చల్లిన విష పదార్ధాలు నెమళ్ళు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార పదార్ధాల్లో విష పదార్ధాలు పెట్టి పొలాల్లో వదలకుండా రైతులకు సూచనలు చేయాలి.

అసభ్య దూషణ.. జైల్లో పడ్డ టీవీ యాంకర్!

  కొన్ని సినిమాల్లో నటించి, ప్రస్తుతం ఓ ఛానల్లో యాంకర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో అనే వ్యక్తి ఒక లేడీ టీచర్ని దారుణంగా దూషించడంతో పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు. హైదరాబాద్‌లో బైక్ డ్రైవింగ్ చేస్తున్న లోబో తన ముందు స్కూటీ మీద వెళ్తున్న ఓ స్కూలు టీచరమ్మ తనకి దారి ఇవ్వలేదని ఆమెని దారుణంగా తిట్టాడు. దాంతో ఆమె తిరగబడి అతనితో వాగ్వాదానికి దిగింది. లోబో హద్దులు దాటి అసభ్యకరంగా మాట్లాడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోబోని అరెస్టు చేయబోతే లోబో తానేదో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినట్టుగా, తానొక టీవీ యాంకర్‌నని బిల్డప్పుగా చెప్పాడు. దాంతో పోలీసులకు మండి అయితే జైల్లో కూర్చుని యాంకరింగ్ చేసుకోమని చెప్పి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఆంధ్ర రాజధాని నిర్మాణానికి కమిటీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కొత్త రాజధాని రూపురేఖలు నిర్ణయించడానికి సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు, పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి (జీవీకే), బొమ్మిడాల శ్రీనివాస్ (జీఎంఆర్), ఎం. ప్రభాకర్ రావు (నూజివీడు సీడ్స్), పీపుల్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి శ్రీనివాసరాజులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు రాజధానిలో రాజ్ భవన్, సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలపై పరిశీలిస్తుంది. రాజధాని రూపు రేఖలు ఏ విధంగా ఉండాలి... రవాణా వ్యవస్థ, రోడ్ల నిర్మాణం ఎలా ఉండాలి.. మౌలిక సదుపాల ఏర్పాటు... తదితర అన్ని ఏ విధంగా ఉండాలి అనే ఒక సలహా ఇవ్వడానికి ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. 10 రోజులలో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

డిప్రెషన్ లోకి వెళ్ళిన బాలినేని..!!

మాజీ మంత్రి , వైఎస్ఆర్.కాంగ్రెస్ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓటమితో డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు రాజకీయవర్గాలలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత బాలినేని ఏకంగా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. గెలుపు మీద అతి విశ్వాసంతో ఆయన కోట్లు ఖర్చు చేయడమే గాక, ఏకంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున పందాలు కాసి తీవ్రంగా నష్టపోయారట. జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందని ..తిరిగి తనకు మంత్రి పదవి ఖాయం అని ఎన్నో ఆలోచనలతో ఉన్న ఆయనకు పార్టీ ఓటమితో తీవ్రంగా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.

నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ పదవి వైకాపా కైవసం

  నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ రోజు మధ్యాహ్న౦ నిర్వహించారు.ఎన్నిక సమయంలో కోఆప్షన్లను కలుపుకున్నా టీడీపీ, వైసీపీ లకు సమానంగానే బలాబలాలున్నాయి. దీంతో అధికారులు లాటరీతోనే జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకూ ఎన్నిక జరిపారు. దీంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి (వైసీపీ) జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు వైసీపీకి ప్లేటు ఫిరాయించడంతో ఈ గెలుపు సాధ్యమయినట్లు సమాచారం. జడ్పీ వైస్ ఛైర్మన్ గా అదే పార్టీకి చెందిన శిరీష గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందాతిరేకాలు వెల్లువెత్తాయి.

అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కేసిఆర్

బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బంగారు బోనం సమర్పించారు. అన౦తరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు తాను ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తెలంగాణ రాష్ట్రంలో బోనం సమర్పించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతోనే తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. బోనాల పండుగను రాష్ట్రపండుగగా గుర్తించామని చెప్పారు. లాల్ దర్వాజ్ అమ్మవారి ఆలయాన్ని అద్బుతంగా రూపుదిద్దుతామని వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి సీఎం వెంట హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డిప్యూటీ సీఎం మహ్మద్ ఆలీ వచ్చారు.

నెల్లూరు జడ్పీ కోసం పోటాపోటీ వ్యూహలు

గత రెండు సార్లుగా వాయిదా పడుతూ వస్తున్న నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఇంకా సందిగ్ధతలో కొనసాగుతోంది. చైర్మన్ పదవి ఎలాగైన కైవసం చేసుకోవాలని చూస్తున్న ప్రధాన పార్టీలు రెండు పోటాపోటీ వ్యూహలు రచిస్తున్నాయి. జిల్లాలో ఉన్న 46 స్థానాల్లో 31 వైసిపి గెలుచుకోగా ఆ తరువాత వైసిపికి చెందిన ఎనిమిది మంది టిడిపి లో చేరగా ఇరు పార్టీలకి సమాన బలం వచ్చింది. దీంతో మ్యాజిక్ సంఖ్య చేరుకోవడానికి ఈ రెండు పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రోజు జరగాల్సిన ఎన్నికపై తమకు సమాచారం లేదని, అందుకని ఎన్నికను వాయిదా వేయాలని టిడిపి వారు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ ను కోరినట్లు తెలుస్తోంది.

యూపీలో రేప్‌లు అతి తక్కువే: ములాయం

  మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ కొత్త భాష్యం చెప్పారు. 21 కోట్ల మంది జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ రేప్‌లు జరుగుతున్నాయని ములాయం సమర్థించుకున్నారు. రాష్ర్టంలో జరుగుతున్న ప్రతి నేరంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని కుమారుడు అఖిలేష్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. 32 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య విషయాన్ని ప్రశ్నించిన మీడియాపై చిర్రుబుర్రులాడారు. మీడియా ఎందుకో యూపీ మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోందన్నారు. గతంలో కూడా రేప్‌లపై ములాయం చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ పై ఓయూ స్టూడెంట్స్ ఫైర్

  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటన వచ్చినప్పటి నుండి ఉస్మానియాలో నిరసనలు మొదలయ్యాయి. నిన్న విద్యార్థుల మీద లాఠీఛార్జ్ కూడా జరిగింది. ఈ రోజు కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉదయం భేటీ అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అలాగే తమ ఆందోళనకు మద్దతు ప్రకటించాలని విద్యార్థులు కోరారు. అన్ని శాఖలలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలంటూ ఈనెల 16 తెలంగాణకేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఏపీ శాసనసభ్యులకు లోక్ సభ స్పీకర్ పాఠాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వం పై తనకు పూర్తి విశ్వాసం ఉందని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె అన్నారు. శనివారం హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు రెండో రోజు జరిగే శిక్షణ తరగతులకు ఆమె హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్యేలకు బాధ్యత పెరిగిందన్నారు. శాసన వ్యవస్థ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సభ్యులందరూ సద్వినియోగపరుచుకోవాలని సుమిత్రా సూచించారు.