జీవో 43ని గౌరవించాల్సిందే: హైకోర్టు

  రెండు రాష్ట్రాల మధ్య మార్చి 31, 2015 వరకు రవాణా పన్ను వుండదంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇచ్చిన 43వ నంబర్ జీవోను రెండు రాష్ట్రాలూ గౌరవించాల్సిందేని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేసి త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, టూరిస్ట్ బస్సులు, మాక్సీ క్యాబ్‌ల నుంచి మోటారు వాహన పన్ను వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన రవాణా ఆపరేటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ మీద స్పందిస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 43వ నంబర్ జీవోకు విరుద్ధంగా ఏ రాష్ట్రమూ వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

‘సైకిల్’ ఎక్కనున్న కేటీఆర్?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో ‘సైకిల్’ ఎక్కబోతున్నారు. ఇంతకాలం ‘కారు’లో ప్రయాణించిన ఆయన ‘కారు’ కంటే ‘సైకిల్’ బెటర్ అని భావిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఆయన ‘సైకిల్’ ఎక్కే అవకాశం వుంది. ఇదేదో పార్టీలు మారే పొలిటికల్ మేటర్ కాదు.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో జరిగే ఓ సైకిల్ ర్యాలీలో పాల్గొని తాను కూడా సైకిల్ తొక్కబోతున్నారు. మొన్నామధ్య హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల ఉద్యోగులు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కారులో తిరగడం కంటే సైకిల్ తొక్కడమే ఆరోగ్యాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ప్రజలు సైకిల్ తొక్కడానికి మళ్ళీ అలవాటు పడే విధంగా అలవాటు పడే విధంగా నగరంలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా వుందని ఆయన అన్నారు.

కొండచరియ దుర్ఘటన: శిథిలాల్లోనే 100 మంది

  గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలోని మలిన్ గ్రామంలో కొండ చరియ విరిగిపడటంతో ఇప్పటి వరకు 25 మంది మృతదేహాలను వెలికి తీశారు. మలిన్ గ్రామం మొత్తం కొండ చరియ కింద, బురద కింద చిక్కుకుపోవడంతో దాదాపు 100 మంది గ్రామస్థులు కొండ చరియ కింద చిక్కుకుని పోయారని తెలుస్తోంది. వీరిని రక్షించడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుండపోత వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయం కావడంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు జాతీయ విపత్తు సహాయక దళం సభ్యులు 15 మందిని కాపాడారు. మొత్తం 44 ఇళ్లకు సంబంధించిన వారు శిథిలాల కింద చిక్కుకుని వున్నారు. కొండ చరియ శిథిలాలు, మట్టి కింద 100 మంది కూరుకుపోయి 24 గంటలు దాటిపోవడంతో మట్టి, బురద కింద చిక్కుకున్నవారు జీవించి లేరేమోనన్న భయం కలుగుతోంది.

సోనియా మీద నట్వర్‌సింగ్ బుక్ బాంబ్!

  కేంద్ర మాజీ కేంద్రమంత్రి నట్వర్‌సింగ్ ఆత్మకథ రూపంలో బుక్ బాంబ్ పేల్చారు. ఈ పుస్తకంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోగుట్టు రట్టు చేశారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ త్వరలో విడుదల కానుంది. నట్వర్ సింగ్ తన పుస్తకంలో వెల్లడించిన రహస్యాలలో కొన్ని...   1. 1991లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. సోనియాగాంధీ తమకు విధేయుడిగా వుండే శంకర్‌దయాళ్ శర్మను ప్రధానిగా చేయాలని అనుకున్నారు. అయితే శంకర్‌దయాళ్ శర్మ తన అనారోగ్యం కారణంగా ప్రధాని పదవి స్వీకరించడానికి ఒప్పుకోలేదు. దాంతో పీవీ నరసింహారావుకు ప్రధాని అయ్యే అవకాశం దక్కింది.   2. ప్రధాని అయ్యే వరకూ పీవీ నరసింహారావు గురించి సోనియాకేమీ తెలియదు. ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవు.   3. 2004 సంవత్సరంలో సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసిందని, ఆమె అంతరాత్మ ప్రధాని కావొద్దని చెప్పిందని ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజానికి సోనియాగాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీయే చాలా తీవ్రంగా అడ్డుకున్నారు. తన తండ్రి, నాయనమ్మ తరహాలోనే తల్లి కూడా తీవ్రవాదుల చేతిలో మరణిస్తుందన్న భయంతోనే రాహుల్ అడ్డుపడ్డారు. కొడుకుగా రాహుల్‌కి పూర్తి మార్కులు వేయవచ్చు.   4. తమకు సంబంధించిన విషయాలను నా ఆత్మకథలో రాయొద్దని కోరుతూ సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియంక గాంధీ ఈ ఏడాది మే 7వ తేదీన మా ఇంటికి వచ్చారు. అయితే నా ఆత్మకథలో అన్ని విషయాలనూ ఉన్నవి ఉన్నట్టుగా వెల్లడించాలని భావించాను.   5. చమురు కుంభకోణంలో ఇరుక్కుని నేను నా మంత్రి పదవికి రాజీనామా చేశాను. అయితే యుపిఎ ప్రభుత్వం ఈ కుంభకోణం విషయంలో నన్ను బలిపశువును చేసింది.   6. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు ప్రధాని కార్యాలయం విషయంలో వెల్లడించిన విషయాలు వాస్తవాలే.

బాత్‌రూమ్‌లో దూరిన మొసలి... బాబోయ్!

  గుజరాత్‌లోని ఆనంద్ నగరం సమీపంలోని సోజిత్రా అనే పట్టణంలో భరత్ పటేల్ అనే ఒకాయన నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే నిద్రలేచి ఆవలిస్తూ తమ ఇంట్లో వున్న టాయిలెట్‌కి వెళ్ళాడు. టాయిలెట్ లోపలకి చూసిన ఆయన ఆవలిస్తూ తెరిచిన నోటిని తెరిచినట్టే వుంచేసి కళ్ళు కూడా పెద్దవి చేసుకుని బాత్రూమ్‌లోకి చూశాడు. తాను చూస్తున్నది కలా నిజమా అని డౌటొచ్చి కళ్ళు నులుముకున్నాడు, చేతి మీద గిల్లుకుని కెవ్వుమనబోయి అంతలోనే నోరు మూసేసుకున్నాడు. ఇంతలో ఆయన గారు బాత్‌రూమ్‌లో ఏం చూశాడంటే ఓ అయిదడుగుల మొసలిని చూశాడు. ఓ మొసలి భరత్ పటేల్ బాత్‌రూమ్‌లో సెటిలై రెస్టు తీసుకుంటోంది. మొసలినిచూసిన కొద్ది క్షణాల తర్వాత భరత్ పటేల్‌కి తన కర్తవ్యం గుర్తొచ్చింది. తాను బాత్‌రూమ్‌కి ‘వచ్చిన పని’ని కూడా మరచిపోయి కార్యాచరణలోకి దిగిపోయాడు. వెంటనే బాత్‌రూమ్ డోర్ మూసేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్టు అధికారులు ఓ బోనును పట్టుకొచ్చి సదరు మొసలిని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఇంత టౌన్ మధ్యలోకి, అది కూడా మా బాత్రూమ్‌లోకి మొసలి ఎలా వచ్చిందో చెప్పండి.. నాకు తెలియాలి అని భరత్ పటేల్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు.

పార్లమెంటు క్యాంటిన్లో ఫుడ్డు.. యాక్..!

  పార్లమెంటు క్యాంటిన్లో ఆహార పదార్థాలు ఎంతమాత్రం బాగోవట్లేదని, క్యాంటిన్లో నిల్వ వున్న ఆహారం ఇస్తున్నారని, ఆ ఆహారం పాచికంపు కొడుతోందని, ఆ ఆహారం తిని తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని పలువురు రాజ్యసభ సభ్యులు స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. జేడీయూ ఎంపీ కేసీ త్యాగి, సమాజ్ వాది పార్టీ ఎంపీలు రాంగోపాల్ యాదవ్, జయాబచన్ స్పీకర్‌కి పార్లమెంటు క్యాంటిన్‌లో ఆహారం బాగాలేందంటూ ఫిర్యాలు చేసిన వారిలో వున్నారు. పార్లమెంటులో తిన్న ఆహారం కారణంగా తమ ఆరోగ్యాలు ఇప్పటికే పాడయ్యాయని, ఇప్పటికైనా పార్లమెంటు క్యాంటిన్‌ను సంస్కరించాలని వారు స్పీకర్‌కి విజ్ఞప్తి చేశారు.

స్టాలిన్ మీద జయలలిత కేసు

  తమిళనాడు అసెంబ్లీలో ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై ప్రిన్సిపల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అసెంబ్లీ బయట తనకు, అసెంబ్లీ స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని జయలలిత తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. ఈ పరువునష్ట దావాను ముఖ్యమంత్రి తరఫున చెన్నై నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఎల్.జగన్ కోర్టులో దాఖలు చేశారు. ఈ సంవత్సరం జులై 22వ తేదీన స్టాలిన్ అసెంబ్లీ నుంచి బయటకి వస్తూ తనకు, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని జయలలిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ రవాణా పన్నుకు హైకోర్టు బ్రేక్

  ఆంధ్రప్రదేశ్ వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే త్రైమాసిక పన్ను కట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. బుధవారం ఉదయం నుంచి తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను నిలిపేశారు. దీనిమీద ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి సిద్దా రాఘవరావు స్పందిస్తూ దీనిపై గతంలో జారీ అయిన జీవో నంబర్ 43ని గౌరవించాలని, మార్చి 2015 వరకు ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని చెప్పారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దీనికి అనుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద హైకోర్టు స్పందించింది. రవాణా పన్ను విషయంలో గతంలో జారీ అయిన జీవో నంబర్ 43 మార్చి 31, 2015 వరకు అమలులో వుంటుందని, దీనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని సూచించింది. హైకోర్టు జోక్యంతో తెలంగాణ ప్రభుత్వం సేకరించాలని భావించిన రవాణ పన్ను అంశానికి బ్రేక్ పడే అవకాశం వుంది.

ఢిల్లీ హైకోర్టులో సోనియా, రాహుల్ పిటిషన్

  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తులను దురాక్రమించారని భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆగస్టు 7వ తేదీన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసును సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌లో నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తాము దురాక్రమణ చేయలేదని పేర్కొనడంతోపాటు ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావడం నుంచి తమను మినహాయించాలని కూడా కోరినట్టు తెలుస్తోంది.

పవన్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలు..

  ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు విషయంపై అనంతపురం కోర్టు స్పందించింది. కేసీఆర్ పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు గతంలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు బుధవారం ఆ నివేదిక సమర్పించాల్సి వుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కోర్టును తమకు మరింత సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై కేసు పెట్టిన న్యాయవాది కోర్టుకు తన వాదనను వినిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విశ్వవిద్యాలయం

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైదరాబాద్‌లోని నల్సార్ తరహా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రాష్ట్ర రాజధానిలో న్యాయశాస్త్ర పరిశోధన, అధ్యయనం జరగడం కోసం జాతీయ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ (నల్సార్) ఏర్పాటు కావాలని గతంలో సుప్రీంకోర్టు కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర న్యాయశాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర మానవవనరుల శాఖల కార్యదర్శులకు, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతల్లేవ్!

  నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు రంజాన్ రోజున ఒక శుభవార్త విన్నారు. ఆ శుభవార్త మంగళవారం నుంచి అమలులోకి రావడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి తమను వేధించిన ఆ సమస్య మంగళవారంతో సమసిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు. ఆ సమస్య పేరు కరెంట్ కోత. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు నిలిచిపోయాయి. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్ళతో సహా అన్ని ప్రాంతాలోనూ నిరంతరాయంగా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కాలంతో సంబంధం లేకుండా నిరంతరం విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పరిణామం సంతోషాన్ని కలిగిస్తోంది. ఎండలు తగ్గిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. దానితోపాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పెరగడంతో కరెంటు కోతలను ఎత్తివేశారు. త్వరలో పరిశ్రమలకు కూడా ఎలాంటి కోత లేకుండా విద్యుత్ ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో విద్యుత్ అమ్మే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ వాహనాలు పన్నుకట్టాలా?.. ఆలోచించుకోండి!

  ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఇప్పటి నుంచి తెలంగాణ రవాణాశాఖకు మూడు నెలల పన్ను కట్టాల్సిందే. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు, గూడ్స్ వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్స్, ప్యాసింజర్ ఆటో రిక్షాలకు వర్తిస్తుందని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంఈ జీవో జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలు, వ్యక్తిగత వాహనాలకు పన్ను నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే పర్మిట్ ట్యాక్స్ చెల్లించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి శిద్దా రాఘవరావు స్పందించారు. పన్ను విధింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని శిద్దా రాఘవరావు అన్నారు. గవర్నర్ నిర్ణయం మేరకు 2015 మార్చి వరకు పన్ను విధించడం సరికాదన్నారు.

అసెంబ్లీ ద్వారం కూల్చివేత కేసు పురోగతి

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్వారం కూల్చివేత కేసులో పురోగతి వచ్చింది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ ద్వారాన్ని ఒక వ్యక్తి కూల్చివేశాడు. ఆ కూల్చివేతతో అసెంబ్లీ ఆవరణలో సంచలనం రేగింది. ప్రవేశ ద్వారాన్ని కూల్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన స్థలాన్ని డీజీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటన దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ద్వారాన్ని కూల్చిన వ్యక్తిని వరంగల్ జిల్లాకి చెందిన అశోక్‌రెడ్డి అని పోలీసుల విచారణలో తేలింది. అశోక్‌రెడ్డి అసెంబ్లీ ఒకటో గేటును దూకి లోపలకి వచ్చాడని, అతని మానసిక పరిస్థితి మీద అనుమానాలున్నాయని పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశద్వారాన్ని కూల్చడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి, వారికి సంబంధించిన ఆస్తులకు, అంశాలకు రక్షణ కరవైందన్న ఆరోపణలు వినవస్తున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఈ అంశంలో కేంద్రం మరింత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తోంది.

‘స్నేహ’ డెలివరీ... నల్లపిల్ల పుట్టింది!

  దేశంలో అరుదైన తెల్ల పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ పులి జాతి సంతతిని పెంచడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లపులి జాతిని అంతరించిపోతున్న జాతి జాబితాలో చేర్చి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ నేపత్యంలో భువనేశ్వర్‌లోని నందన్ కనన్ బయోలాజికల్ పార్కులో ‘స్నేహ’ అనే తెల్లపులి నాలుగు కూనలకు జన్మ ఇచ్చింది. ఈ నాలుగు కూనల్లో ఒక నల్ల రంగు కూన కూడా వుండటం విశేషం. ఇప్పటికే సిమిలిపాల్ పులుల సంరక్షణ కేంద్రంలో నల్లరంగు పులులు వున్నాయి. జూలో వున్న తెల్లపులికి నల్లటి పులిపిల్ల పుట్టడం ఇదే ప్రథమమని జూ క్యూరేటర్ చెబుతున్నారు.

చుండూరు కేసులో సుప్రీం కోర్టు స్టే

  దళితుల ఊచకోతకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా చుండూరు ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 20 మంది, ఇతర నిందితులు 36 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చుండూరు ఘటనలో మరణించినవారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్చయించారు. ఈ కేసు బుధవారం నాడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతోపాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.