లోకేశ్ అమెరికా పర్యటన ఫలితం.. 1000 గ్రామాలు దత్తత

  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి మే 3వ తేదీ నుండి అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయన పలు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఇందులో భాగంగానే ఆయన న్యూజెర్సీ లోని ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నైరైలు పాల్గొని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాలన్నింటిని అమెరికా శాసిస్తుంటే అమెరికా అమెరికాను ఇక్కడున్న తెలుగువారు శాసిస్తున్నారని, అమెరికాలో ఉన్న అత్యుత్తమ పది కంపెనీల్లో పది పోస్టులలో తెలుగువారు ఉన్నారని కొనియాడారు. నారా లోకేశ్ ప్రసంగానికి ముగ్దులైన ఎన్నారైలు అప్పటికప్పుడు 780 గ్రామాలను దత్తత తీసుకున్నారని, మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మీడియా ఛైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్ తెలిపారు.

జయలలితకు వంద కోట్ల విముక్తి... సీఎం ఛాన్స్

    మూడు దశాబ్దాలకు పైగా తమిళ రాజకీయాల్లో తనదైన మార్క్‌ను కనబరిచిన ఉక్కు మహిళ జయలలిత. బంగపడ్డ చోటే తిరగబడ్డ ధీర వనితగా ఆమె అభిమానుల మన్ననలు పొందారు. రాజకీయాల్లోకి తెచ్చింది ఎంజీఆరే ఆయినా... తనదైన ముద్ర కనబరిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆమెను చుట్టుముట్టిన వివాదాలు మరో ఎత్తు.   1948 ఫిబ్రవరి 24న మైసూర్‌లో జయలలిత జన్మించారు.  సొంతూరు తమిళనాడులోని శ్రీరంగం. బెంగళూరు, చెన్నైల్లో మెట్రిక్యులేషన్‌ వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో...  1963లో అంటే కేవలం 15 ఏళ్లకే ఆమె ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాల్సివచ్చింది.  సినిమాల్లో ఉన్నంతకాలం జయలలితకు గాడ్ ఫాదర్ ఎంజీఆర్.  1970ల్లో ఎంజీఆర్‌తో జయ లలితకు ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. 1981లో మళ్లీ ఎంజీఆర్ చెంతకే చేరారు. అదే ఏడాది  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయ... రెండేళ్లలోనే అన్నాడీఎంకే కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1984లో రాజ్యసభ ఎంపీగా  నామినేట్ అయ్యారు. అదే ఏడాది సీఎంగా ఉన్న ఎంజీఆర్‌కు గుండెజబ్బు వచ్చింది... అమెరికాలో ఆయన  ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా..తాను తాత్కాలికంగా గద్దెనెక్కేందుకు జయ ఉబలాటపడ్డారు. తనను ఆపద్ధర్మ సీఎం చేయాలంటూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకీ, గవర్నర్‌కూ లేఖలు రాశారు.  ఈ పరిణామం... ఎంజీఆర్‌కు కోపం తెప్పించింది. అమెరికాలో వైద్యంచేయంచుకుని తమిళనాడు వచ్చిన ఎంజీఆర్... జయలలితను పార్టీ నుంచి బహిష్కరించారు. 1987లో ఎంజీఆర్ మరణించాక అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు జయలలిత. 1989లో ప్రతిపక్షనాయకురాలి పాత్రపోషించారు.   1991లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని... తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  అవినీతి ఆరోపణలు ... 1996లో అన్నాడీఎంకే కొంప ముంచాయి.  అవినీతి కేసులు ఉండటంతో... 2001లో జయలలిత పోటీ చేయలేకపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చాకమాత్రం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే  జయ ఎన్నికను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. దీంతో  తను నమ్మినబంటు  పన్నీర్‌సెల్వమ్‌ను సీఎం  చేసి... పాలన మొత్తం తనే నడిపారు. 2003లో జయకు అవినీతి కేసులనుంచి విముక్తి లభించింది. దీంతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో అధికారాన్ని కోల్పోయారు.   1989లో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత...  ఆర్థికమంత్రిగాకూడా ఉన్న సీఎం కరుణానిధి బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.   దీంతో ఆగ్రహం చెందిన డీఎంకే ఎమ్మెల్యేలు జయలలిత కొంగులాగారు.  చీర కొంత చిరిగిందికూడా. ఈ ఘటన ఆమెను కలచివేసింది. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి... సీఎం కలను 1991లో నెరవేర్చుకున్నారు. తర్వాత కరుణానిధిపై  అర్థరాత్రి దాడులు చేయించి... గుడ్డలూడేలా కొట్టించారు.   1995లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత తన పెంపుడు కొడుకు సుధాకరన్ వివాహాన్ని అట్టహాసంగా జరిపి..వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకోసం రెండు వందలకోట్లకుపైగా ఖర్చుచేశారని సమాచారం.  తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి జయలలితపై అక్రమ ఆస్తులకేసు నమోదుచేశారు. 1996లో ఆమె కొన్నాళ్లు జైలులో గడపాల్సివచ్చింది. జయ ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున బంగారు, వజ్రాభరణాలు,వేల సంఖ్యలో చెప్పులు, రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన జయలలిత... తన జీవితంలో ఆభరణాలు, వాచ్‌లు ధరించనని 1996లో శపథం చేశారు. ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నారు.   2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. వంద కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ పది కోట్ల రూపాయలు జరిమానా విధించింది. శిక్ష పడటంతో జయలలిత ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. దాంతో తను నమ్మినబంటు పన్నీర్‌సెల్వమ్‌ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.   తాజాగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో  తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది. జయలలితను కర్నాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆమెపై ఉన్న కేసులు రద్దు చేస్తున్నట్లు  కోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా నుంచి జయలలితకు విముక్తి లభించడంతో.....అన్నాడీఎంకే కార్యకర్తలు ఆనందోత్సహాల్లో తేలుతున్నారు. కర్నాటక కోర్టు తీర్పు ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసిందంటున్న పిటిషనర్ సుబ్రమణ్యస్వామి....ఈ తీర్పుపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది.

మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనే చేయను... కిరణ్ బేడి

  మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ గోవాలోని పనాజీలో జరిగిన ఉమెన్ ఎకానిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను క్రియాశీల రాజకీయ వేత్తను కానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఇంతకు ముందు లాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని, తన జీవితం ఎంతో సంపన్నమని, ఎంతో జ్ఞానయుతమని, ఎంతో అనుభవ సహితమని, ఎంతో అంతఃదృష్టితో కూడినదని వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల చాలా నేర్చకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ అనుభవం అని, ఆ అనుభవాన్ని ఇచ్చిన జీజేపీకి కృతజ్ఞతలని కిరణ్ బేడీ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున సీఎం అభ్యర్ధిగా పోటీ చేసి కిరణ్ బేడీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

జయ నిర్దోషి.. స్వామి, డీఎంకే దిగ్భ్రాంతి

  ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషి అని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును దాఖలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రతి మీద అధ్యయనం చేయాల్సి వుందని, ఈ కేసును తాను వదిలిపెట్టనని సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆయన ప్రకటించారు. అలాగే ఈ తీర్పు ఏఐడీఎంకె రాజకీయ ప్రత్యర్థి డిఎంకె వర్గాల్లో కూడా కలవరం రేపింది. జయలలిత రాజకీయ కెరీర్ ముగిసినట్టేనని, రాబోయే రోజుల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్న డీఎంకే వర్గాలకు ఈ తీర్పు షాక్ ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే డీఎంకె వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఈకేసు విషయంలో డీఎంకె కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మళ్ళీ ముఖ్యమంత్రిగా జయలలిత?

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద వున్న అక్రమ ఆస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో, ఆమె మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వుంది. ఈ కేసులో ఆమెకు శిక్ష పడిన నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తన అనుచరుడు పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ కేసులో ఆమె ఇప్పుడు నిర్దోషిగా తీర్పు రావడంతో ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించే అవకాశాలున్నాయి. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రాగానే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం జయలలిత నివాసానికి చేరుకున్నారు. ఆయన త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జయలలిత మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. సోమవారం జయలలిత కేసులో తీర్పు వస్తుందని తెలిసిన ఆమె అభిమానులు తమిళనాడు దేవాలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. జయలలిత నిర్దోషిగా తీర్పు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు మిఠాయిలు పంచిపెట్టారు.

జయలలిత నిర్దోషి

  అన్నాడీఎంకే పార్టీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ‘పురచ్చి తలైవి’ జయలలితపై వున్న అవినీతి ఆరోపణల కేసులో ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. 18 ఏళ్లుగా సాగిన ఈ అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో జయలలిత పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విషయంలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఈ కేసులో జయలలితతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించింది.

టీవి నటి సూసైడ్ యత్నం

  ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బుల్లితెర నటి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ముంబైకి చెందిన రూపాకౌర్ అనే టీవీ ఆర్టిస్ట్ చంద్రముఖి, అంతపురం, ఆటో భారతి, శిఖరం వంటి పలు సిరియల్స్ లో నటించింది. అయితే ఈమె హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే తన బంధువైన కేవల్ సింగ్, రూపాకౌర్ ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ చింతల్ లో ఒక సంవత్సరం పాటు సహజీవనం కూడా చేశారు. అయితే రూపాకౌర్ గత కొద్ది కాలంగా పెళ్లి చేసుకోవాలని కోరుతుండగా అతను పెళ్లికి నిరాకరిస్తూ, ఇంట్లో వాళ్లు టీవీ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. 

ఆరో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఎండీ సమస్య పరిష్కారానికి చర్చలు నిర్వహించినా అవి కాస్తా విఫలమైన సంగతి తెలిసిందే. మరో పక్క హైకోర్టు కూడా సమ్మె విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించినా అవేమి పట్టించుకోకుండా కోర్టు తీర్పు కాపీ చేతికందేవరకు సమ్మే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ఆర్టీసీ ఈ.యూ నేత పద్మాకర్ . మరోవైపు అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఒప్పంద సిబ్బందితో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణాలో ఉనికిని చాటుకొనేందుకు వైకాపా తిప్పలు

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా యాత్రలు చేస్తూ రైతన్నలను ఆకట్టుకొని తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణాలో ఆ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో ‘రైతు దీక్ష’ అంటూ నిన్న ఒక్కరోజు నిరాహార దీక్ష చేసారు. అయితే ఉదయం సుమారు 9-10 గంటలకు ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టి సాయంత్రం 4గంటలకే ఇద్దరు రైతుల చేతుల మీదుగా నిమ్మరసం పుచ్చుకొని దీక్ష విరమించారు. ఆ మాత్రం దానికి అంత హడావుడి ఎందుకు అంటే తెలంగాణాలో తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికేనని వేరే చెప్పనవసరం లేదు. వైకాపాకు రైతుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే అవి సాధించేవరకు ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చినట్లయితే, ప్రభుత్వం కూడా రైతుల సమస్యల పరిష్కారం కోసం మరింత శ్రద్ధ పెట్టేది. కానీ ఈవిధంగా మొక్కుబడి దీక్షలు చేయడం వలన ముందు వైకాపాయే ప్రజలలో నవ్వులపాలవుతుంది.

నేటి నుండి జగన్ రైతు భరోసాయాత్ర

  ఇంతకు ముందు తన తండ్రి వై.యస్స్. రాజశేఖర్ రెడ్డి మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్రలు చేసి, పనిలోపనిగా తన పార్టీని బలోపేతం చేసుకొన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలలో మాత్రం గెలవలేకపోయారు. తన పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వంపై అప్పటి నుండి ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా యాత్రల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నుండి నాలుగు రోజుల పాటు చేయబోయే రైతు భరోసా యాత్రలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. పేరుకి అది రైతు భరోసా యాత్రే అయినా దాని కోసం వైకాపా చేస్తున్న హడావుడి చూస్తుంటే అది రైతులపై సానుభూతి చూపేందుకా లేక రైతుల తరపున వైకాపా పోరాడుతోందని ప్రచారం చేసుకోవడానికా? అనే అనుమానం కలుగక మానదు.

కిరణ్ పై కాంగ్రెస్ నేతల ఎదురు దాడి షురూ

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర విభజన ఏవిధంగా జరిగిందో, తెర వెనుక ఎటువంటి రాజకీయాలలో నడిచాయో, దానిలో కాంగ్రెస్ నేతల పాత్ర గురించి వివరిస్తూ ఒక పుస్తకం వ్రాస్తున్నారు. అది త్వరలో విడుదల కాబోతోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ నేతలు ప్రజలతో ఆడిన డబుల్ గేమ్ గురించి అందులో ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నారు.   రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోగా, తెలంగాణా రాష్ట్రంలోను ఎన్నికలలో ఓడిపోయినా తరువాత నేటి వరకు కోలుకోలేకపోతోంది. మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లుగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్రాస్తున్న అ పుస్తకం వచ్చి పడుతోంది. సహజంగానే అది ఆ పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కనుక, ఊహించినట్లే అప్పుడే కాంగ్రెస్ నేతలు ఆయనపై ఎదురు దాడి ప్రారంబించేసారు.   అందరి కంటే ముందుగా సోనియా గాంధీకి వీర విధేయుడినని గర్వంగా చెప్పుకొనే సీనియర్ కాంగ్రెస్ నేత మరియు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు స్పందిస్తూ “కాంగ్రెస్ అధిష్టానం ఆయనను నమ్మి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన రెండు రాష్ట్రాలలో కూడా పార్టీని, ప్రభుత్వాన్ని ముంచేసాడని తీవ్రంగా విమర్శించారు. ఆయన తన ముఖ్యమంత్రి పదవిని తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకొన్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రిని చేసినందుకు కృతజ్ఞత చూపకపోగా తిరిగి సోనియా గాంధీని అప్రతిష్టపాలు చేయడానికే ఆయన పనిగట్టుకొని పుస్తకం వ్రాయడం చాలా దారుణమని హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేసారు.

జయలలితకి జైలా...బెయిలా...తేలేది నేడే

  అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధింపబడిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, గతేడాది సెప్టెంబర్ నెలలో వారం రోజులపాటు జైలులో గడపవలసి వచ్చింది. కానీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిలుపై మళ్ళీ బయటకు రాగలిగారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేస్తూ ఆమె కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టును మూడు నెలలలోగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించవలసిందిగా ఆదేశించింది. కానీ జడ్జీల బదిలీ తదితర కారణాల వలన ఆ కేసు విచారణ ఆలస్యమయింది. ఆమె కేసుపై కర్ణాటక హైకోర్టు ఈరోజు తుది తీర్పు చెప్పబోతోంది.   ఒకవేళ హైకోర్టు కూడా ఆమెకు ప్రత్యేక కోర్టు వేసిన శిక్షనే ఖరారు చేసినట్లయితే ఆమె మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. అదే జరిగితే మళ్ళీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించడం కూడా ఖాయం. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెకు బెయిలు మంజూరు చేసేవరకు జైలు జీవితం తప్పకపోవచ్చును. అయితే ఆమె ఈరోజు కర్నాటక హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు కనుక ఆమె చెన్నైలో తన విలాసవంతమయిన పోయస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారు. తమిళనాడులో ఆమె పార్టీ- ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక ప్రభుత్వం ఆమెను జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలకి జగన్ బహిరంగ లేఖ

  రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తుండటం సర్వ సాధారణ విషయమే. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమ్మెలను తీవ్రంగా పరిగణించే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వారికి మద్దతు పలుకుతుంటాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరుగుతోంది. అధికారంలో ఉన్న తెదేపా, తెరాస ప్రభుత్వాలు ఈ సమ్మెను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఆవస్తలు పడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు వారి సమ్మెకు మద్దతు పలుకుతున్నాయి.ఒకవైపు వారికి సమ్మెకు మద్దతు తెలపడం ద్వారా వారి సమ్మెను మరింత ఉదృతంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని నిందిస్తుంటారు. అలాగని ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలకి వారిపై నిజంగా ప్రేమ ఏమయినా ఉందా? వారి పట్ల నిజంగానే సానుభూతి కలిగి ఉన్నాయా? అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. వారి సమస్యలని పరిష్కరింపబడాలనే తపన కంటే తమ రాజకీయ శత్రువయిన అధికార పార్టీలని ఈవిధంగా ఇబ్బంది పెట్టాలనే తాపత్రయమే ఎక్కువ. ఉద్యోగులు సమ్మెకు మద్దతు పలికితే వారు తమ పార్టీల వైపు మొగ్గు చూపవచ్చనే చిన్న ఆశతోనే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉద్యోగులు చేసే ఏ సమ్మెలకయినా మద్దతు పలుకుతుంటాయనేది బహిరంగ రహస్యమే.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రెండు రాష్ట్రాలలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు తెలుపమని తన పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడమే కాకుండా వారి న్యాయబద్దమయిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సూచిస్తూ రెండు ప్రభుత్వాలకి ఒక బహిరంగ లేఖ కూడా వ్రాసారు. రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకి ఇచ్చిన హామీలను పక్కనబెట్టడం వలననే ఈ సమస్య ఏర్పడిందని,కనుక ఇప్పటికయినా వారిరువురూ ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చేరు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ప్రతీకార ధోరణితో వ్యవహరించకుండా వారితో సుహృద్భావ వాతావరణంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.   ఆయన తన లేఖలో కొన్ని నిర్మాణాత్మకమయిన సలహాలు కూడా చేసారు. రెండు రాష్ట్రాలలో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల వలన ఆర్టీసీకి ప్రతీ ఏట సుమారు రూ.1000 కోట్లు నష్టం వస్తోందని ప్రభుత్వమే చెపుతున్నప్పుడు, వాటిని ఎందుకు నియంత్రించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ నుండి డీజిల్ కొనుగోలుపై రూ.541 కోట్లు, విడిభాగాల కొనుగోలుపై మరో రూ.150 కోట్లు వ్యాట్ పన్ను వసూలు చేస్తోందని, ప్రభుత్వం దానిని వదులుకొనేందుకు సిద్దపడితే ఆర్టీసీ తన నష్టాల నుండి తేలికగా బయటపడగలదని ఆయన సూచించారు. మరి జగన్ వ్రాసిన ఈ బహిరంగ లేఖకి రెండు ప్రభుత్వాలు వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాసలు ఏమని సమాధానం చెపుతాయో వేచి చూడాలి.

సల్మాన్ ఖాన్ కేసు క్లోజ్?

  సెషన్స్ కోర్టులో దోషిగా నిరూపించబడి ఐదేళ్ళ జైలు శిక్ష విధింపబడిన బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ముంబై హైకోర్టు ఆ శిక్ష అమలుచేయకుండా నిలిపివేసి బెయిలు కూడా మంజూరు చేసింది. వేసవి శలవుల తరువాత కోర్టు మళ్ళీ పనిచేయడం ఆరంభించినప్పుడు ఆ కేసు విచారణ చేపడుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం గత పదమూడేళ్ళుగా చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం వలననే సల్మాన్ ఖాన్ కి శిక్ష పడింది. కనుక హైకోర్టు ఇప్పుడు అతనికి వేసిన ఆ శిక్షను నిలిపివేసినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలుకి వెళుతుందని అందరూ భావించడం సహజం. కానీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఏమీ లేనట్లు తెలుస్తోంది. అంటే ఇక సల్మాన్ ఖాన్ కేసు క్లోజ్ అయిపోయినట్లే భావించవచ్చునేమో? కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకున్నా ఇతరులు ఎవరో ఒకరు తప్పకుండా సుప్రీం కోర్టుకి వెళితే అతనికి సమస్యలు తప్పక పోవచ్చును.

రాష్ట్ర విభజనపై పుస్తకం వ్రాస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

  కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం పెద్ద పొరపాటే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. ఆయన వలననే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని పార్టీలో చాల మంది బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వారి విమర్శలకు కిరణ్ కుమార్ రెడ్డి చాలా ధీటుగా త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు.   ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి అదృశ్యమయిపోయిన ఆయన ఈ విరామ సమయంలో రాష్ట్ర విభజన గురించి 400 పేజీలతో కూడిన ఒక పుస్తకం వ్రాయడం మొదలుపెట్టారు. అందులో సోనియా, రాహుల్, కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలు తెర వెనుక ఎవరెవరు ఎటువంటి పాత్ర పోషించారో, రాష్ట్ర విభజనకు ముందు పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పరిణామాలు సంభవించాయో వంటి వివరాలన్నిటినీ ఆధారాలతో సహా ఆయన తన పుస్తకం ద్వారా తెలియజేయబోతున్నారు. రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశ వివరాలను కూడా కూడా ఆయన తన పుస్తకంలో తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను ఈ వ్యవహారంలో ఎవరెవరు తప్పు దారి పట్టించారో, ఎందుకు పట్టించారో ఆయన తన పుస్తకంలో సవివరంగా వ్రాసినట్లు తెలుస్తోంది.   అదే విధంగా రాష్ట్ర విభజన వ్యవహారం మొదలయిన తరువాత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, గులాం నబీ ఆజాద్, ఎకె. అంతోనీ, వీరప్ప మోయిలీ తదితరులతో జరిగిన తన సమావేశాల గురించి కూడా ఆయన తన పుస్తకంలో పేర్కొనట్లు సమాచారం. సమైక్య రాష్ట్రంలో తెరాస, తెదేపా, వైకాపా మరియు ఇతర పార్టీలు వాటి అధ్యక్షులు ఈ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారనే విషయాల గురించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.   తను పుస్తకం వ్రాస్తున్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. ఆ పుస్తకం మరొకటి రెండు నెలల్లో విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పుస్తకం ఆయనే వ్రాస్తున్నారు కనుక అందులో తనను తాను సమర్దించుకొంటూ, తనని విమర్శించిన వారందరికీ చురకలు వేయవచ్చును.   ఇక ఆయనకి మళ్ళీ రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యాలున్నట్లయితే, చేరితే ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న బీజేపీలోనే చేరవలసి ఉంటుంది గనుక ఈ వ్యవహారంలోఆ పార్టీపై ఎటువంటి ఘాటు విమర్శలు చేయక పోవచ్చును. ఆయన వ్రాసిన పుస్తకం విడుదలయితే అందరి కంటే ముందుగా రాష్ట్ర విభజన వ్యవహారంలో డబల్ గేమ్ ఆడిన ఆంధ్రా కాంగ్రెస్ నేతల బండారం బయటపడటం తధ్యం. రాష్ట్ర విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురయి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి నేటికీ ప్రజాధారణకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నవారి నెత్తిపై ఇది పిడుగులా పడబోతోంది. దానితో ప్రజలు వారిని మరింత అసహ్యించుకొనే అవకాశం ఉంది కనుక వారు కిరణ్ కుమార్ రెడ్డిపై ముందుగానే ఎదురు దాడి చేయవచ్చును. లేదా వారిలో ఎవరో ఒకరు ఈ వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, పార్టీ అధిష్టానాన్ని, చివరికి తమందరినీ కూడా మభ్యపెడుతూ ఏవిధంగా రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించారో తెలియజేస్తూ పుస్తకం వ్రాసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ వారిలో ఎవరయినా పుస్తకం వ్రాసి పుణ్యం కట్టుకొంటే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలందరి కధలు ప్రజలకి కూడా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.

ప్రమాదాలు... ప్రమాదాలు...

  ఆదివారం తెల్లవారు ఝామునే మూడు ప్రమాదాలు జరిగాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దగ్గర ఆటో అదుపు తప్పి ఎస్సారెస్సీ కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆటోలో వున్న ఒక మహిళ మరణించింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. అలాగే వరంగల్ జిల్లా జనగామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీదికోడలి గ్రామం వద్ద ఒక వ్యాను బోల్తా పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోపాలపురం నుంచి ఎంబరామ్‌కి వెళ్తున్న పెళ్ళివారి వ్యాను మహేంద్రతనయ నది వద్ద బోల్తా పడింది.

తక్షణమే విధుల్లో చేరండి: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఆదేశం

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో గత నాలుగు రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక తక్షణమే వారిని సమ్మె విరమింపజేయవలసిందిగా కోరుతూ టిడిపి నేత పి.ఎల్.వెంకట్రావు, చిత్తూరు జిల్లా వాసి మహ్మద్‌గౌస్‌ హైకోర్టులో వేర్వేరు లంచ్ మోషన్ పిటిషన్స్ వేసారు.   వాటిని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ జేసీ భాను సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు అందరూ తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరమని ఆదేశించారు. వారి సమ్మె చట్ట వ్యతిరేకమని, ఒకవేళ సమ్మె కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును ఈనెల 12కి వాయిదా వేసారు.   కానీ ఆర్టీసీ ఈ.యూ. మరియు టీ.ఎం.యూ. నేతలు తాము హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ కోర్టు తీర్పు కాపీ తమకు అందేవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. అయినా చట్ట ప్రకారం తాము యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్తితులల్లో సమ్మెకు దిగామని మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పు చేతికి వచ్చిన తరువాత సమ్మె విరమించడమా లేక సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడమా అనే విషయం గురించి ఆలోచిస్తామని అంతవరకు తమ సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఈ.యూ. నేత పద్మాకర్‌ చెప్పారు.

స్మార్ట్ విలేజ్ కోసం సపోర్ట్ చేయండి.. నారా లోకేశ్

  టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆంధ్రరాష్ట్రానికి పెట్టుబడుదారుల కోసం అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన శనివారం శాన్ ఫ్రాన్సిన్స్ కోలోని ఎన్నారైలతో సమావేశమయ్యి వారికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ, స్మార్ట్ వార్డుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి చేయాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంలోని గ్రామాలను బాగా అభివృద్ధి చేసిన వారికి చంద్రబాబు చేతుల మీదుగా సత్కారం అందుతుందని తెలిపారు. నీటి సమస్య ఉన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేసి మంచినీటికార్డు ద్వారా వారికి రోజుకు 20 లీటర్ల నీరు అందిస్తున్నామని అన్నారు. 2020 నాటికి తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రథమస్థానంలో ఉంటాయని, 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందని అన్నారు.

హరీష్ రావు కారు దిగిపోతారా?

  ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావు చాకులా పనిచేస్తున్నాడని ఎంత మెచ్చుకొన్నప్పటికీ తెరాస ప్లీనరీ సమావేశాలలో ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో హరీష్ హార్ట్ అయ్యేరని సమాచారం. అదేవిధంగా కేసీఆర్ తన కుమారుడు కె.తారక రామారావుకే పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలతో ఆ పదవి ఆశిస్తున్న హరీష్ రావు మరింత హార్ట్ అయిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల గురించి ఆయన తన అనుచరులతో చర్చిస్తునట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీలో, ప్రజలలో కె.టి.ఆర్ పాపులారిటీ పెంచేందుకే ఆయన అమెరికా యాత్రకి పంపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కె.టి.ఆర్. అమెరికాలో తనకున్న పరిచయాలతో, తెలంగాణా యన్.ఆర్.ఐ.లను, అక్కడి పారిశ్రామిక వేత్తలను మెప్పించి తెలంగాణా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురాగలిగితే ప్రజలు కూడా తప్పకుండా మెచ్చుకొంటారు కనుక అప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెడితే హరీష్ రావుతో సహా పార్టీలో నేతలెవరూ అభ్యంతరం చెప్పారని తెరాస అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆ పదవి ఆశిస్తున్న హరీష్ రావు వెంటనే కారు దిగిపోయి కాంగ్రెస్ చెయ్యి పట్టుకొనే అవకాశాలున్నాయని, ఒకవేళ ఆయన కారు దిగిపోతే ఆయనతో బాటే ఆయన అనుచరులు మరో పది మంది వరకు కారు దిగిపోయి ఆయనను ఫాలో అయిపోయే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెరాసకు పెద్ద దెబ్బే అవుతుంది కనుక పరిస్థితి అంత దూరం పోకుండా కేసీఆర్ ముందే జాగ్రత్తపడవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందు ప్లీనరీ సమావేశాల్లోనే కేటీఆర్ కి ప్రమోషన్ డిక్లేర్ చేస్తారని మీడియా కోడై కూసింది. కానీ అటువంటిదేమీ జరుగలేదు. ఇప్పుడు కేటీఆర్ అమెరికా నుండి తిరిగి రాగానే ఆయనకు పట్టాభిషేకం చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరదయినా నిజమో కాదో చూడాలి.