ప్రత్యేక హోదా రాష్ట్రాభివృద్ధి కోసమా రాజకీయాల కోసమా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో ఎందరు నేతలు మిగులుతారో ఎవరికీ తెలియదు. ఇక కీలకమయిన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార పార్టీని నిలదీయకుండా రెండు నెలలు శలవు తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో నరేంద్ర మోడీని డ్డీ కొంటారో లేక తను శల్యసారధ్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రధం మీద నుంచి ఉత్తర కుమారుడిలా దూకేసి మళ్ళీ విదేశాలకు పారిపోతారో తెలియదు. అసలు రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలో కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించడమే కష్టంగా ఉంది.   కానీ బీజేపీని, దానితో జత కట్టిన తెదేపాని కూడా ఆంద్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం నుండి తరిమి కొట్టేరోజు ఎంతో దూరంలో లేదని జోస్యం చెపుతున్నారు కాంగ్రెస్ యంపీ జేడీ శీలం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రజలను మోసం చేస్తుంటే, తెదేపా దానిపై ఒత్తిడి తేకుండా చేతులు ముడుచుకొని కూర్చోందని శీలం రెండు పార్టీల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు హామీ ఇచ్చినప్పటికీ దానిని రాష్ర్ట పునర్విభజన చట్టంలో చేర్చకపోవడం వలననే ఇవ్వలేకపోతున్నామని వెంకయ్యనాయుడు చెప్పడాన్ని శీలం తప్పుపట్టారు. చట్టంలో చేర్చితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్దమయితే అందుకు తమ పార్టీ కూడా సహకరిస్తుందని అన్నారు.   ప్రత్యేక హోదాపై ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే అది రాష్ట్రానికి లబ్ది చేకూర్చే అంశమా లేకపోతే రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బ తీసుకోవడానికి మాత్రమే పనికి వచ్చే అంశమా? అనే అనుమానం ప్రజలలో కలుగుతోంది. ఇదివరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సున్నితమయిన రాష్ట్ర విభజన అంశాన్ని అడ్డుపెట్టుకొని నాలుగు స్తంభాలాట ఆడాయి. అందులో అతి తెలివి ప్రదర్శించిన పార్టీలన్నీ ఓడిపోయాయి. అయినా మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అనే మరో కొత్త ఆటకు సిద్దమయిపోయాయి. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు వాటిని పట్టుకొని ఈవిధంగా ఆటలాడుకొంటున్నాయి. మరో నాలుగేళ్ల వరకు ఎవరూ అడ్డు చెప్పరు కనుక ఎన్ని ఆటలయినా ఆడుకోవచ్చును. అప్పుడు మళ్ళీ ప్రజలే ఏమి చేయాలో అది చేస్తారు.

తాడిచెట్లతో వైఫై

  ఇప్పుడు తాడిచెట్లనుండి కూడా ఉచిత వైఫై అందిస్తున్నారు. అలాంటి ఇలాంటి తాడిచెట్లు కాదు అవి... స్మార్ట్ తాడిచెట్లు. తాడిచెట్లతో వైఫై... ఎలా.. ఎక్కడ అనుకుంటున్నారు కదా. దుబాయ్ మునిసిపాలిటీ వాళ్లు 'స్మార్ట్ పామ్ సోలార్ టెక్ హబ్' ప్రాజెక్టు ద్వారా ఈ ఉచిత వైఫై సౌకర్యం అందిస్తున్నారు. అంతేకాదు ఈ స్మార్ట్ తాడిచెట్ల నుండి వైఫై సిగ్నల్ మాత్రమే కాదు, ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఒక చెట్టుకు 12 ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. ఈ తాడిచెట్ల వల్ల ఇంకో లాభం కూడా ఉంది అదేంటంటే.. కెమెరా, లౌడ్ స్పీకర్లు అమర్చి ఉండటంతో బీచ్ లో వాతావరణం ఎలా ఉండబోతోందన్న హెచ్చరికులు కూడా బయటకు వినిపిస్తుంటారు. ఈ తాడిచెట్లు ఆరుమీటర్ల ఎత్తుంటాయి. దీనికి కావల్సిన విద్యుత్ కూడా సోలార్ పవర్ ద్వారానే అందుతుంది. ఈ సందర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా మాట్లాడుతూ త్వరలోనే దుబాయ్లో ఉన్న బీచ్లన్నీ కూడా స్మార్ట్ బీచ్ లు అయిపోతాయని అన్నారు.

దెయ్యం ఇల్లు తగలబెట్టింది

  దెయ్యం.. అసలు ఉందో లోదో తెలియదు కానీ ఆమాట వింటేనే భయపడతాం. దెయ్యాలు ప్రతీకారం తీర్చుకుంటాయి అని వింటుంటాం... సినిమాలలో కూడా చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇక్కడ నిజంగానే ప్రతీకారం తీర్చుకుంది అంటున్నారు. ఎక్కడ అనుకుంటున్నారా... ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లో గాజులు తయారుచేసే కుటుంబానికి చెందిన ఓ ఇల్లు హఠాత్తుగా తగలబడిపోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన ఆ ఇంటి కోడలు పింకియే నాశనం చేసిందని అంటున్నారు. అప్పుడప్పుడు పింకీ కలలోకి వస్తుంటుందని, చంపేస్తానని బెదిరిస్తుంటుందని పింకీ అత్తగారు అంటున్నారు. పింకీ చనిపోయిన తరువాత ఆమె భర్త నాగేంద్ర రెండో పెళ్లి చేసుకోగా ఆమెకి కూడా దెయ్యం పట్టి పీడిస్తుందని, తన పిల్లాడిని కూడా చంపేసిందని నాగేంద్ర తెలిపారు.

రాజకీయం చేయెద్దు... వెంకయ్యనాయుడు

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ వ్యవహారంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం అన్న అంశం చాలా కీలకమైనదని కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించినట్టయితే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని, ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలని అడిగే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని... పార్టీలకు లేదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజం చట్టంలో పేర్కొన్న హామీలన్నింటిని అమలు చేస్తామని, ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక లోటు ఎలా భర్తీ చేయాలన్న విషయం పై హోంశాఖతో చర్చిస్తున్నామని అన్నారు. అలాగే హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

శిశుమరణాల రేటు తగ్గించాలి... చంద్రబాబు

  గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పెంటావాలెంట్ టీకాల వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ వాక్సిన్ కోరింతదగ్గు, ధనుర్వాతం, హైపటైటిస్-బి వంటి వ్యాధుల నుండి కాపాడుతుందని అన్నారు. శిశుమరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గర్భిణీలకు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నామని చెప్పారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, పెళ్లి వయసు విభాగాల్లో వెనుకబడి ఉన్నామని అన్నారు.

'తానా' 20వ కాన్ఫరెన్స్ వేడుకలు

  'తానా' సంఘం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) తమ 20వ కాన్ఫరెన్స్ వేడుకలు జరుపుకోబోతుంది. దీనికి గాను పలు రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గేమ్స్, కల్చరల్ యాక్టివీటీస్ లాంటి ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని 'తానా' సంఘం అధ్యక్షుడు మోహన్ నన్నపనేని  తెలిపారు. ఇది కాంపీటీషన్ కాదని, తెలుగువారికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే కార్యక్రమంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకొనే వారి కావలసిన అర్హతలు 1. కార్యక్రమంలో పాల్గొనేవారి పేరు 2. వయసు (10-25) 3. తల్లిదండ్రుల పేర్లు 4. తల్లిదండ్రుల వివరాలు (ఇ-మెయిల్, ఫోన్ నెం) 5. యూట్యూబ్ వీడియో లింక్ 6. ప్రదర్శించే ఆర్ట్  

రామోజీరావును పొగిడిన ప్రధాని

  'ఈనాడు' 'ఈటీవీ' సహా రామోజీ గ్రూపు సంస్థలన్నీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రామోజీరావుకు ఓ లేఖ రాసారు. తాను ఇచ్చిన 'స్వచ్ఛభారత్' అభియాన్ పిలుపునందుకొని, స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ప్రజలలో శుభ్రత గురించి విస్తృత స్థాయిలో స్ఫూర్తి తెచ్చేందుకు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పరిశుభ్రమైన భారత్ ను సాధించాలంటే ఒక్క వ్యక్తి వల్ల అయ్యే పని కాదని, అందరు కలిసి చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకు రామోజీరావు గ్రూపు సంస్థల సభ్యులందరూ, రామోజీరావు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇలాగే తమ ప్రోత్సాహాన్ని కొనసాగించాలని ప్రధాని కోరారు.

డిల్లీలో చలసాని ప్రత్యేక పోరాటం, అరెస్ట్

  టాలివుడ్ నటుడు శివాజీ గుంటూరులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ వేడి ఇంకా తగ్గక మునుపే ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏపీ విద్యార్థుల జేఏసీ, జన జాగృతి సంస్థ ప్రతినిధులు కలిసి డిల్లీ వెళ్లి ఏపీ భవన్ లో బస చేసి ఉన్న రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ లను కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ఆ సందర్భంగా వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నామని మంత్రులిరువురూ స్పష్టం చేసినప్పటికీ విద్యార్ధులు ఆందోళన విరమించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు. అనంతరం వారు పార్లమెంటు వైపు బయలుదేరగా వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.   దేశంలో ఏదయినా ఒక రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి తప్పనిసరిగా ఆమోదం తెలుపవలసి ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, ఓడిశాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే తమ రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోతాయని అందువల్ల ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వరాదని కేంద్రానికి లేఖలు వ్రాసాయి.   దేశంలోని 8 రాష్ట్రాలు అనేక ఏళ్ళుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయి. ఒకవేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఆ తేనె తుట్టెను మళ్ళీ కదిపినట్లే అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొంతున్నప్పటికీ జంకుతోంది. ఈ విషయాలన్నీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారందరికీ తెలుసు. కానీ రాష్ట్ర విభజన సమయంలో ఆ తరువాత ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చినందున ఇప్పుడు దాని కోసం పట్టుబడుతున్నాయి.

జగన్ బాటలో రాహుల్ ఓదార్పు యాత్ర

  జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేసారు. తన తండ్రి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని తనకు, తన పార్టీకి బదలాయించుకొనేందుకే ఆయన ఓదార్పు యాత్రలు చేసారనే సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అదేవిధంగా రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ తెలంగాణాలో ప్రవేశించి తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు.   రెండు నెలల పాటు విదేశాలలో సేద తీరిన రాహుల్ గాంధీ చాలా హుషారుగా పాదయాత్రలు చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఓడిపోయింది. కానీ ఆంధ్రా కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే దాని పరిస్థితి మెరుగుగానే ఉంది. కనుక ముందుగా దానిని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులను పరామర్శించడానికి ఈనెల 11న హైదరాబాదులో దిగుతున్నారు. ఆ మరునాడు ఉదయం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వడ్యాల నుండి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ఆత్మహత్యలు చేసుకొన్నా రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. రాచాపూర్, పొట్లపల్లి, లక్ష్మణ చాందా గ్రామాల మీదుగా ఆయన పాదయాత్ర చేసి సాయంత్రం 4 గంటలకు కొరటికల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆ తంతు ముగియగానే మళ్ళీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని రాత్రికి డిల్లీ వెళ్ళిపోతారు.   అయితే రాహుల్ గాంధీ మొక్కుబడిగా చేసే ఈ ఓదార్పుయాత్రతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలపడిపోతుందనే భ్రమలు ఎవరికీ లేవు. కనుక ఆయన ఇలా ఎండల్లో పడి తనకు ఏమాత్రం అచ్చిరాని పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేయడం కంటే ముందుగా తన కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసుకొని, దానిపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దాసరికి సీబీఐ కోర్టు సమన్లు జారీ

  ప్రముఖ దర్శకుడు మరియు మాజీ బొగ్గు శాఖా మంత్రి అయిన దాసరి నారాయణ రావుకి బొగ్గు కుంభకోణం కేసులో విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టు బుదవారం నోటీసులు జారీ చేసింది. దాసరి నారాయణ రావుతో బాటు మరో 14మందికి, 5 కంపెనీలకి కూడా ఈరోజు నోటీసులు జారీ అయ్యాయి. ఈరోజు నోటీసులు జారీ అయిన వారిలో మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్.సి. గుప్తా, మాజీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఉన్నారు. వారు కాక ఇంకా గ్యాన్ స్వరూప్ ఘార్గ్, సురేష్ సింఘాల్, రాజీవి జైన్, గిరీష్ కుమార్ సునేజ, ఆర్కే సరఫ్ మరియు కె. రామకృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. వీరితో బాటు జే.యస్.పి.యల్., జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, గగన్ ఇన్ఫ్రా ఎనర్జీ లిమిటెడ్, న్యూ డిల్లీ ఎగ్సిం లిమిటెడ్ మరియు సౌభాగ్య మీడియా లిమిటెడ్ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేయబడ్డాయి. వీరందరూ అమర్ కొండ ముర్గాదంగల్ బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతిలో నిందితులని సీబీఐ పేర్కొంది. వారిపై ఐ.పి.సి.సెక్షన్స్: 420,409 మరియు 120-బి క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి. వారినందరినీ ఈనెల 22వ తేదీన సీబీఐ కోర్టులో హాజరు కావలసిందిగా జడ్జి భరత్ పరాశర్ ఆదేశించారు.

వారి ఆందోళనను సమర్ధిస్తున్నా... చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలం నర్సిపురంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లుడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సీమాంధ్రులు చేపట్టే ఆందోళనలు సరైనవేనని, వారు చేపడుతున్న నిరసనలను సమర్ధిస్తున్నానని తెలిపారు. కేంద్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు సహకరిస్తుందని, ఇప్పటికే కొన్ని విషయాలలో చొరవ తీసుకుందని అన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్రం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి వెనుకడుగు వేయలేదని... అలాగని ఇస్తుందో లేదో కూడా తెలియదని వెల్లడించారు. తాము మాత్రం ఎట్టి పరిస్థితిల్లో వెనక్కి తగ్గేది లేదని, ప్రత్యేక హోదా కోసం ప్రయాత్నాలు ఆపమని సుజనా అన్నారు.

చంద్రబాబు ను కలిసిన కడియం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ లు కలిశారు. ఈ సందర్భంగా వారు వరంగల్ జిల్లాలో ఉన్న రేయాన్న్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలను చర్చించారు. గతేడాది నుండి ఫ్యాక్టరి మూసిఉన్నందున అనేక కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, అందువల్ల దానిని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. అయితే సమస్య ఏంటంటే ఫ్యాక్టరీకీ కావలసిన ముడిసరుకు తెలంగాణ నుండి 25 శాతం మాత్రమే అందుతుంది. మిగిలిన ముడిసరుకును తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకోవడానికి అక్కడ ఎగుమతి నిషేదం ఉన్నందున పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి దిగుమతి చేసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీకి కావలసిన ముడిసరుకును ఆంధ్రరాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశంజిల్లానుండి 50 శాతం రాయితీతో సరఫరా చేయాలని చంద్రబాబును కోరారు. అయితే ఇది ఆర్ధిక సమస్యలతో ముడిపడిఉందని, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. 

లోకేశ్ ఎఫర్ట్ ... స్మార్ట్ సిటీకి ఎన్నారైల సపోర్ట్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం యువనేత పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నారై తెలుగుదేశం లోకేశ్ కు ఘన స్వాగతం పలికింది. ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వపరంగా ఏ హోదాలో లేని లోకేశ్ ఒక భాధ్యతాయుతమైన ఆలోచనతో తన వంతుగా ఆంధ్రరాష్ట అభివృద్ధికి కావలసిన సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఎలాగైనా ఆంధ్రరాష్టాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో  అమెరికాలోని అనేక పారిశ్రామిక వేత్తలతో, పెట్టుబడిదారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అనేక ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి విశాకపట్నం అనువైనదిగా ఉంటుందని విశాఖను స్మార్ట్ సిటీగా మార్చాలని లోకేశ్ అన్నారు.   ఇందులో భాగంగానే ఆయన మంగళవారం ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలైన ఇమాజినేషన్ సంస్థ అధినేత యార్లగడ్డ కృష్ణగారిని, అంతేకాక వాణిజ్యవిభాగానికి చెందిన అసిస్టెంట్ సెక్రెటరీ అరుణ్ కుమార్, డైనమిక్ గ్లాస్ తయారీ సంస్థ సీఈఓ మురళీ రావు వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఈ సందర్భంగా వారు విశాఖపట్నంలో కూడా తమ సంస్థలను స్థాపించడానికి, అభివృద్ది చేయడానికి సహకరిస్తామని తెలిపారు. అంతేకాక లోకేశ్ కామర్స్ అసిస్టెంట్ సెక్రెటరీ అరుణ్ కుమార్ ను ఆంధ్రరాష్ట్రాన్ని ఒక తయారీకేంద్రం మార్చడానికి సహకరించాలని కోరామని, ఆంధ్రరాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, పెట్టుబడులు అనువైన స్థలమని చెప్పామని చెప్పారు. యూఎస్ పెట్టుబడుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ను స్మార్ట్ సిటీ గా మలిచే విధానంపై చర్చించామన్నారు.   దీంతో లోకేశ్ 15 గంటలలో ఆరు సమావేశాలు, పలు రకాల పారిశ్రామికవేత్తలతో చర్చలు, జరిపినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దీంతో లోకేశ్ అమెరికా నుండి పెట్టుబడుదారులను తీసుకొస్తాడనే నమ్మకం ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న లోకేశ్ తెలుగుదేశం గర్వపడేలా చేస్తాడనే అందరూ ఆశిస్తున్నారు.

సల్మాన్ తీర్పుతో వారి ఆత్మకు శాంతి

  శాంతి హిట్ రన్ అండ్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ పై నేరం రుజువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ తీర్పుపై సోషల్ మీడియాలో సెలబ్రిటీల దగ్గరనుంచి, అభిమానులు, సామాన్యులు తమ కమెంట్స్ పోస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ లాంటి దయాహృదయుడికి, తన ఛారిటీ ద్వారా ఎంతోమంది పేద విద్యార్ధులకు సహాయం చేసే ఆయనకు శిక్ష పడటం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కొంతమంది మాత్రం ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. అతని నిర్లక్ష్యానికి అభాగ్యులు బలయ్యారని అన్నారు. ఈ తీర్పుతో వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు బాలీవుడ్ నటి హేమమాలిని సల్మాన్ కు తక్కువ శిక్ష పడాలని ప్రార్ధిస్తున్నానంటూ తన సానుభూతిని ప్రకటించారు.

షూస్ పోయాయని కేసు పెట్టాడు

  మనం కేసులు ఎప్పుడు పెడతాం? సాధారణంగా మన వస్తువులు ఏమైనా పోయినప్పుడో, దొంగలు పడినప్పుడో పలు రకాల సందర్భాలలో పెడతాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన చెప్పులు పోయాయని కేసు పెట్టాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఈ విచిత్రమైన ఘటన ఢిల్లీలో జరిగింది. కాన్పూర్ కి చెందిన అన్షల్ అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీలోని ప్రముఖ ఆలయమైన కల్కాజీ దేవాలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయం బయట తన షూ ను కౌంటర్ లో విడిచి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్లాడు. దర్శనం తరువాత తిరిగి వచ్చి చూసేసరికి తన షూ కనిపించలేదు. అంతే అతనికి ఒక్కసారిగా కోపం వచ్చి అసహనానికి గురయ్యి అక్కడ వున్నవారిపై చిర్రుబుర్రులాడాడు. తనవి ఎంతో బ్రాండ్ షూ అని, కొత్తగా కొన్నానని ఆవేదనకు గురై ఆలయ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు.

నేరం చేసింది సల్మాన్ ఖానే

  మధ్యం మత్తులో కారు నడిపిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎప్పటినుంచో విచారణలో ఉన్న ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. కానీ ఈ హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ పై ఉన్న ఆరోపణలు నిజమే అని, ఆరోజు మద్యం తాగి కారు నడిపింది సల్మాన్ ఖాన్ అని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో సల్మాన్ పై ఉన్న నేరం రుజువు కావడంతో ఆయనకు జైలు శిక్ష పడనుంది. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్ పాండే సల్మాన్ శిక్ష కాలాన్ని ప్రకటించనున్నారు. ఈ తీర్పుతో ఒక్కసారిగా సల్మాన్ కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు నిరాశకు గురయ్యారు. మరోవైపు ఈ తీర్పుతో బాలీవుడ్ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ హీరోగా రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉండటంతో వాటి పరిస్థితి ఏంటా అని భయపడుతున్నారు. అయితే ఈ కేసుపై సల్మాన్ హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

ఏపీ రవాణా మంత్రికి చంద్రబాబు ఫోన్

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు తమ వేతన సవరణ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. దీంతో రెండు రాష్ట్రాలలో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై ఏపీ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుతో ఫోన్ లో మాట్లాడారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని శిద్దా తెలిపారు. అవసరమైతే రైల్వేశాఖతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.