కోదండరామ్ అడుగు ఎటు.. ప్రతిపక్షంగానా? అధికారపక్షంగానా?

    జేఏసీ సారధి కోదండరామ్ రెడ్డి ఇక నుండి ఫుల్ ఫ్రీగా ఉండబోతున్నారు. అంటే ఈ నెలాఖరున తాను తన ప్రొఫెసర్ వృత్తి నుండి రిటైర్ అవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు కోదండరామ్ రిటైర్ అయిన తరువాత ఏం చేస్తారు అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన కోదండరామ్.. ఆతరువాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తన ప్రొఫెసర్ వృత్తినే సాగిస్తూ అప్పుడప్పుడు తెలంగాణ ప్రజల సమస్యల గురించి అధికార పార్టీని ప్రశ్నించేవారు. గతంలో కూడా కోదండరామ్ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి వార్తలు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు కోదండరామ్ రిటైర్ అయిన తరువాత తాను ప్రతిపక్షనేతగా ఉంటారా లేక అధికార పక్షానికి దగ్గరవుతారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.    ఇదిలా ఉండగా మరోవైపు ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశమే లేదనే వార్తుల కూడా వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ప్రజా సంఘాలతో సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలకోసం పోరాడుతారని అనుకుంటున్నారు. మరోవైపు కోదండరామ్ కూడా అడుగు ఏటు వేయాలో తెల్చుకోలేకపోతున్నారుట. దీనికి సంబంధించి మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నా ఆయన మాత్రం ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నారట. మరి కోదండరామ్ అడుగు ఎటు పడుతుందో ..ఆయన ప్రతిపక్షంగా ఉంటారా? లేక అధికార పక్షంగా ఉంటారో చూడాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే..

జగన్ కు గాలి కౌంటర్.. యువభేరి కాదు కుర్చీభేరి

    టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విశాఖలో యువభేరి కార్యక్రమంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాలి జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ యువభేరి అంటూ విద్యార్ధులను మోసం చేస్తున్నారని.. అది కేవలం తన కుర్చీ కోసం చేస్తున్న భేరీ అని మండిపడ్డారు. జగన్ మాటలు నమ్మి విద్యార్ధులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని సూచించారు. అంతేకాదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుకు తెలియదు అని మాట్లాడుతున్నారు.. అసలు ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోడీని.. కేంద్రాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబును అనడం సబబుకాదని అన్నారు. ఒకపక్క చంద్రబాబు ఏపీ రాష్ట్ర అభివృద్ధికి... ఏపీలో  పెట్టుబడులు పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతుంటే దానికి సహకరించాల్సింది పోయి ఎప్పుడూ ఏదో విమర్శ చేస్తూ అడ్డుగా నిలుస్తున్నారని ఎద్దేవ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ లోకా?

    వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజక వర్గమైన కడపజిల్లాలోని ఒక ఎమ్మెల్యే షాకివ్వనున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. వైకాపాలోని ఒక ఎమ్మెల్యే  టీడీపీ తీర్ధం పుచ్చుకోబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరనేది మాత్రం పేరు వినిపించడంలేదు. కానీ జిల్లాలో ఆయన కీలక ఎమ్మెల్యే అని.. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైకాపా పార్టీ ఇలాగే మైండ్ ఆడి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోనేందుకు ప్రయత్నాలు చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా మైండ్ గేమ్ ఆడుతుందా.. ఈనేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుందా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి.. నేతలకు కేసీఆర్ సూచనలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షనేతలు అడిగే ప్రశ్నలను ఎలా తిప్పికొట్టాలి అనే విషయంలో ఏ పార్టీ వ్యూహాలు ఆపార్టీకి ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీపై పలు రకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షపార్టీలు ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు.. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు తదితర అంశాలపై టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తుంది. అంతేకాదు గత అసెంబ్లీ సమావేశాల్లా కాకుండా ఈసారి మాత్రం పార్టీలన్నీ ఏకమై టీఆర్ఎస్ పార్టీపై దాడి చేయాలని చూస్తున్నాయి. దీనిలో భాగంగానే టీటీడీపీ కాంగ్రెస్ పార్టీ.. వైకాపా పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.   అయితే వీళ్ల పనిలో వీళ్లు ఉంటే అటు కేసీఆర్ మాత్రం చాలా ధీమాగా ప్రతిపక్షనేతలకు భయపడాల్సిన అవసరం లేదని పార్టీనేతలకు చెప్పారంట. అయితే రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా ప్రతిపక్షాల అనవసరం రాద్దాంతం చేస్తున్నారు కానీ వారి దగ్గర విషయం ఏం లేదు.. ఏదో అసెంబ్లీలో రచ్చ చేయడానికే ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలకు సూచించారట. అంతే కాదు అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పాలని.. అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని.. వారి ఉచ్చులో పడకుండా ఉండాలని చెప్పారంట. మొత్తానికి పార్టీలన్నీ కలిసి ఎవరి ప్లానింగ్లో వాళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఎవరి ఎత్తులను ఎవరు పడగొడతారో.. చిక్కుకుంటారో చూడాలి మరి.

రాజధాని కోసం విజయవాడ వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణం

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచంలో అత్యాధునిక నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. రాజధానిని జీవనది కృష్ణానది ఒడ్డున నిర్మిస్తుండటంతో నగరం ఎంత అభివృద్ధి చెడినా దానికి ఎన్నడూ నీళ్ళు కొరత ఉండదు. అలాగే రాజధాని గొప్ప నగరంగా ఎదగాలంటే దానికి అన్ని మౌలిక వసతులతో బాటు అవసరమయినంత విద్యుత్ సరఫరా కూడా ఉండాలి. కనుక రాజధానికి ఎన్నడూ విద్యుత్ కొరత, కోతలు లేకుండా ఉండేందుకు విజయవాడ వద్దగల నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సమీపంలోనే అమరావతి నగరం కోసమే ప్రత్యేకంగా 800మెగా వాట్స్ సామర్ధ్యం గల ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దాని కోసం కేంద్రప్రభుత్వం నుండి అనుమతులు కూడా సంపాదించింది. రాజధాని అమరావతికి శంఖుస్థాపన జరిగే రోజునే అంటే అక్టోబర్ 22నే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేత శంఖు స్థాపన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొంటున్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి అవసరమయిన 250 ఎకరాల భూసేకరణ కార్యక్రమాన్ని అధికారులు త్వరలో మొదలు పెడతారు.

ఆమాద్మీకి ఎప్పుడూ కష్టాలే

  డిల్లీలో ఆమాద్మీపార్టీ అధికారం చేప్పట్టి 7 నెలలు పూర్తయినప్పటికీ నేటికీ నిత్యం ఏదో ఒక తీవ్రమయిన సమస్య ఎదుర్కొంటూనే ఉంది. సబ్సీడీ ధరలో ఉల్లిపాయల విక్రయంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న ఆమాద్మీ ప్రభుత్వం మళ్ళీ మరో కొత్త సమస్య ఎదుర్కొంది. ఈసారి మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి నుండే సమస్య ఎదురవడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.   సోమనాథ్ భారతి భార్య లిపిక మిత్రా తనను తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు ఆయనపై గృహ హింస కేసు నమోదు చేసారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం ఒక పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు దానిని నిన్న తిరస్కరించింది. ఆ సంగతి తెలిసిన వెంటనే ఆయన పోలీసులకి దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.   దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ “అసలు సోమనాథ్ భారతి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లి పోయారో, జైలుకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళడం వలన పార్టీ, ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఆయన తక్షణం పోలీసులకి లొంగిపోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేసారు.   ముఖ్యమంత్రి మాటను మన్నించి సోమనాథ్ భారతి పోలీసులకి లొంగిపోతారో లేదో చూడాలి. ఒకవేళ లొంగకపోతే ఆమాద్మీ పార్టీకి మరింత అప్రదిష్ట కలుగుతుంది. దానిని నివారించేందుకు పార్టీ ఆయనపై వేటు వేయవలసి వస్తే, పార్టీలో మళ్ళీ అసమ్మతి రాగాలు వినిపించవచ్చును. కనుక ఆయనపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆలోచించుకోకతప్పదు.

చంద్రబాబును లేడీ సెంటిమెంట్ తో కొట్టిన రోజా

ఫైర్ బ్రాండ్ రోజా...మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడింది, ఈసారి లేడీ సెంటిమెంట్ ను ప్రయోగించి సీఎంను కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. మహిళలపై తరుచుగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆమె... చంద్రబాబుకు ఆడపిల్లలు లేనందునే పట్టించుకోవడం లేదని విమర్శించారు, ఆడవాళ్ల విలువ ఏంటో ఆయనకు తెలుసుంటే...నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిపై సరైన చర్యలు తీసుకునేవారని, రిషితేశ్వరి విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటే, ఇప్పుడు విజయవాలో విద్యార్ధిని భానుప్రీతి ఆత్మహత్య చేసుకునేది కాదని రోజా ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి విషయంలోనూ చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారన్న రోజా... చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా విద్యార్ధినుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

టికెట్ రాలేదని ఏడ్చేసిన నాయకుడు

ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు హామీలివ్వడం కామన్.. ఒకవేళ గెలిచారో అంతే తరువాత ఆ హామీల గురించి మళ్లీ ప్రజలు గుర్తు చేసేవరకూ గుర్తుండవు. అధికారం రావడానికి ఎన్ని మాటలైనా మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు చేసిన ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చాల్సిన నాయకుడే తనకు పదవి రాలేదంటూ బోరున విలపించాడు. బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో ఈ ఆర్ ఎస్ ఎల్ పి లీడర్ అశోక్ గుప్తా ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదని బోరున ఏడ్చేశాడు. దీనిలో భాగంగానే తమ అధినేత కుష్వాహా ఎదుట దయచేసి నాకు ఒక టికెట్ ఇవ్వండంటూ.. కాళ్లావేళ్లపడి బతిమాలాడు. టికెట్ కోసం డబ్బులిచ్చానని.. ఆ డబ్బంతా గంగపాలైందని శోకాలు పెట్టారు. అయితే అశోక్ గుప్తా ఒక్కడికే కాదు ఈ ఎన్నికలలో చాలామంది నేతలకు కూడా పార్టీ టికెట్లు దక్కలేదు. కానీ వారెవరూ ఇంత సీన్ క్రీయేట్ చేయలేదు. మొత్తానిక టికెట్ రాలేదని ఏడుస్తున్న రాజకీయ నాయకులు ప్రజలు ఏడ్పును ఏలా తీరుస్తున్నారో..

అసెంబ్లీ, బడ్జెట్‌ అంటే ఎంటో తెలుసా? జగన్ కు పత్తిపాటి ప్రశ్న

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు అని విమర్శించారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను పత్తిపాటి ఖండించారు. ప్రత్యేక హోదా గురించి సీఎం చంద్రబాబు, మంత్రులకు తెలియదని జగన్‌ అంటున్నారని, జగన్‌కు అసెంబ్లీ, బడ్జెట్‌ అంటే ఎంటో తెలుసా? అని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడు జగన్ మాత్రం రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు.. కానీ రాష్ట్రం విడిపోయి ఆర్ధిక లోటు ఉన్నా గాని చంద్రబాబు రుణమాఫీలు చేశారు.. అలాంటిది జగన్ కు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అనేక అవినీతి పనులు చేశారని అన్నారు. అంతేకాదు తెలుగుదేశం, బిజెపి విడిపోవాలని జగన్‌ కోరుకుంటున్నారని, దాంతో కేసుల నుంచి బయటపడాలని ఆయన ఆరాటపడుతున్నారని విమర్శించారు.

గద్దర్ మతలబు ఏంటి?

  నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ కు పోటీగా వరంగల్ ఉపఎన్నికల్లో ఉద్యమపాటకారుడు గద్దర్ పోటీచేస్తారు అనుకున్నారు. కాని తాను ఏ ఎన్నికల్లో పోటీచేయట్లేదని తేల్చిచెప్పారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు గద్దర్ గులాబీ బాస్ ను పొగడంపై పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఏమైందో ఏమో తెలియదు కాని సడన్ గా గద్దర్ గాలి కేసీఆర్ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చక్కని ప్రణాళికను సిద్దం చేసిందని ప్రశంసించారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్య చేసుకోవద్దని.. రాష్ట్రం ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 6 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. వరంగల్ ఎన్ కౌంటర్ లో విషయంలో కూడా కేసీఆర్ ను సమర్ధిస్తూ మాట్లాడారు. దీంతో ఇప్పుడు అందరికి గద్దరు గులాబీ గూటికీ చేరే ఆలోచనలో ఉన్నారేమో అని చర్చించుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఈవిధంగా కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారని అనుకుంటున్నారు.

జాతీయపార్టీగా టీడీపీ తొలి గెలుపు

  తెలుగుదేశం పార్టీ జాతీయపార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో జాతీయపార్టీగా టీడీపీకి తొలి విజయం సాధించినట్టు తెలుస్తోంది. అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటుతోంది. ఈ రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 వార్డుల్లో తెలుగుదేశంపార్టీ 5,6 వార్డుల్లో విజయం సాధించింది. మిగిలిన వార్డుల్లో బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఏఐఏడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు 1 స్థానాన్ని గెలిచాయి.  ఇంకా 12 వార్డుల్లో ఫలితాలు రావాల్సి ఉంది. అయితే టీడీపీ జీజేపీ మిత్రపక్షాలే కాబట్టి ఈ రెండు పార్టీల కూటమికి మెజారిటీ దక్కాలంటే ఇంకా 5 స్థానాల్లో గెలుపొందాల్సిన అవసరం ఉంది.

విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మధ్య అనేక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల సమస్య. తెలంగాణ ప్రభుత్వం స్థానికత ఆధారంగా సుమారు 1200 మంది ఉద్యోగులను రివీల్ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా అక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో వారి పరిస్థితి అయోమయ స్థితిలో పడింది. ఆఖరికి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు అనేక విచారణల అనంతరం ఎట్టకేలకు విద్యుత్ ఉద్యోగులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని.. నాలుగు వారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 58 శాతం, తెలంగాణ రాష్ట్రం 42 శాతం జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు తమ తుది తీర్పు వరకు ఉద్యోగులు తెలంగాణకే చెందుతారని హైకోర్టు చెప్పడంతో  ఉద్యోగులకు ఊరట లభించింది.

బ్రహ్మానందాన్ని టార్గెట్ చేసింది ఎవ‌రు?

ఎంత నెల్లూరి పెద్దారెడ్డిగారి మేనల్లుడైనప్పటికీ...ఆయనికీ కష్టాలు తప్పట్లేదు. ఎవరికి వారు ఇంతకాలం ఆయన్ని కూరలో కరివేపాకులా వాడుకున్నా, ఇప్పుడతడ్ని పూర్తిగా వాడటం మానేశారు. మెగా కాంపౌండ్ నుంచి నంద‌మూరి ఫ్యామిలీ వ‌ర‌కూ ఎవరికీ బ్రహ్మీ అవ‌స‌రం లేదిపుడు. ఒకవేళ అవ‌స‌ర‌మైతే ప్రేక్షకులకు తమ అవ‌స‌రం పోతుందోన‌నే భ‌యం హీరోలకు పట్టుకుందట. ఎందుకంటే బ్రహ్మీ  ఏ సినిమాలో చేస్తే ఆ సినిమాలో హీరో హైలేట్ అవడం లేదట. అందుకే రీసెంట్ హిట్ ఫిల్మ్ శ్రీమంతుడులో ముందుగా బ్రహ్మీని అనుకుని ఆ త‌రువాత తీసేశారు.లేటెస్ట్ గా ‘సినిమా చూపిస్త మావ‌‘ ట్రైల‌ర్లో సార్ ఉన్నారు..కానీ ఆ మూవీ రైట్స్ దిల్ రాజు చేతిలో పడ్డాక సినిమాలో సార్ కనిపించలేదు. అంతేకాదు బాలయ్య బాబు డిక్టేటర్ నుంచి బ్రహ్మీని ఉన్నపళంగా తీసేశారు, ఇద‌నే కాదు రానున్న చాలా చిత్రాల్లో బ్రహ్మానందం కనబడే ఛాన్సే కనిపించడం లేదు, తన ప్రతీ సినిమాలో బ్రహ్మానందాన్ని కచ్చితంగా తీసుకునే శ్రీనువైట్ల కూడా ఇప్పుడు బ్రహ్మీకి పాత్ర ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందట, ఇలా చెపుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే బ్రహ్మీ కారణంగా తమ ఇమేజ్ డామేజ్ అవుతోందని హీరోలు ఫీలవడం, నిర్మాతలు ఖర్చు తగ్గించుకోవడమే దీనంతటికి కారణమట.

ఈసారి అడిగితే మూల్యమే.. టీసర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

  అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుద్ది.. ఏం నిర్ణయాలు తీసుకున్నా సరిపోద్ది అన్న పథాంలో  తెలంగాణ ప్రభుత్వం అంశం ఏదైనా కానీ వారికి ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇప్పుడు వాటివల్ల వచ్చే పరిణామాలను అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాల్లో హైకోర్టు చేత మొట్టికాయలు తింటూనే ఉంది. హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వ స్పీడుకు బ్రేకులు వేస్తునే ఉంది. ఇప్పుడు మరో  వివాదంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులు..  ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు.. కార్పొరేషన్ ఛైర్మన్ లకు ఇచ్చిన క్యాబినెట్ హోదా విషయంపై.. ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఇచ్చేస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్య దాఖలైంది. దీనిపై గతంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. వాదనలు వినిపించాలని కోరింది. అయితే గతంలో దీనిపై మూడుసార్లు విచారణ జరిపినా తెలంగాణ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక మరో వాయిదా కావాలని కోరడం జరిగింది. ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం మరో వాయిదాని అడుగగా హైకోర్టు సీరియస్ అయింది. నాలుగు దఫాలుగా వాయిదాలు అడుగుతూనే ఉన్నారు.. కానీ వాదనలు వినిపించేది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఈసారి కనుక వాయిదా అడిగితే ప్రతి వాయిదాకు 3 వేల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది అని ఆదేశించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా సమాధానం చెపుతుందో లేక మూల్యం చెల్లిస్తుందో చూడాలి.

ఒక్కసారి.. ఒకే ఒక్కసారి అంటున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు.. పరిశ్రమలు పెట్టడానికి గాను పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనువైన ప్రదేశమని.. దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంకు కూడా ఏపీకి రెండో ర్యాంకు ఇచ్చిందని తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలంటూనే అంతకు ముందు ఒక్కసారి ఏపీకి రావాలని.. అక్కడి పరిస్థితులను చూసి.. పరిశీలించి ఆతర్వాత నిర్ణంయ తీసుకోండంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి.. ఏపీలో పెట్టుబడులను ప్రవాహంలా పారించడానికి బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఒక్కసారి ఏపీని విజిట్ చేయండి అని కోరినందుకైనా ఎంతమంది పారిశ్రామిక వేత్తలు ఏపీని విజిట్ చేస్తారో.. పెట్టుబడులు పెడతారో చూడాలి.

ఏపీ క్యాబినేట్ ప్రక్షాళన.. దసరా తరువాత

త్వరలో ఏపీ క్యాబినేట్ లో పలు కీలకమార్పులు జరగబోతానే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నట్టు తెలస్తోంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన తరువాత క్యాబినేట్ ప్రక్షాళన చేయనున్నట్టు రాజకీయ వర్గాల వినికిడి. ముఖ్యంగా కొన్ని శాఖలు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రులు కేఈ, శ్రీనివాస్ కామినేనికి మాత్రం పదవీ గండం తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఈ శాఖా మంత్రుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈరెండు శాఖలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. అయితే గత మూడు నెలల క్రితమే మంత్రుల తొలగింపు విషయం బయటకు వచ్చినా చంద్రబాబు సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చి మంత్రుల మార్పిడిపై దృష్టిసారించి.. అమరావతి శంకుస్థాపన తరువాత సరిగా పనిచేయని మంత్రులను ఇంటికి సాగనంపనున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు.. కేసీఆర్.. ఇంతలోనే ఎంత మార్పు

  రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని మన తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తేనే పరిస్థితి అర్ధమవుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత కేసీఆర్ కు తెలంగాణ మిగులు బడ్టేట్ లో గుజరాత్ తరువాత రెండో స్ఠానంలో ఉన్న రాగా.. చంద్రబాబుకేమో ఏపీ ఆర్ఠిక లోటు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు తెలంగాణలో  కేసీఆర్ తన దూకుడుని ప్రదర్శిస్తూ ఎలాగూ మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి హామీల మీద హామీలు.. వేతానాల్లో ఏపీ పెంచిన దాని కంటే ఒక శాతం ఎక్కువే పెంటడం లాంటి పనులు చేసి తన ఒంటెద్దు పోకడని అనుసరించారు. మరోవైపు చంద్రబాబు.. ఒక రకంగా చెప్పాలంటే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టతరమైన పనే. అలాంటి పనికి తాను పూనుకొని రాజధాని నిర్మాణానికి.. ఏపీ అభివృద్దికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో వారుంటే అప్పుడే ఓటుకు నోటు కేసు బయటకొచ్చింది. ఇంకేముంది.. దీంతో చంద్రబాబు పని అయిపోయింది.. చంద్రబాబు ఈ కేసులోంచి బయటకు రావడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ మాటలు కొన్ని రోజుల వరకే పరిమితమయ్యాయి. పరిస్థితి తారుమారైపోయింది. ఇప్పుడు చంద్రబాబు ఏపీ అభివృద్ధికోసం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటే.. కేసీఆర్ పరిస్థితే అయోమయంలో ఉంది. ప్రపంచ బ్యాంకు ఏపీకి రెండో స్ఠానం ఇవ్వడం.. విద్యుత్ పంపిణీ సరఫరాల నష్టాల తగ్గింపులో ఏపీ ముందుండటం.. వెరసి చంద్రబాబు రాష్ట్రంకోసం పని చేస్తున్న దిశకు నిదర్శనం. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే మిగులు బడ్జెట్ అయిపోయి అప్పుల పాలైంది.. మరోవైపు రైతుల ఆత్మహత్యలు.. అదీకాక ఏదో విషయంలో హైకోర్టు చేతనో.. సుప్రీంకోర్టు చేతనో మొట్టికాయలు వేయించుకోవడమో.. అందులోనూ ప్రపంచ బ్యాంకు 13వ ర్యాంకు ఇవ్వడంతో కేసీఆర్ కు ఎం చేయాలో తెలియని పరిస్థితో ఉన్నారు. అంతేకాక ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలోనూ టీఆర్ఎస్ నేతలకు కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్నట్లు ఇద్దరు సీఎంల విషయంలో ఇంతలోనే ఎంత జరిగింది అన్నట్టు ఉంది వ్యవహారం.

పోల'వరం'తో ప్రజల ముందుకు

ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతాం...ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్, సేమ్ టు సేమ్ అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాడాలనుకుంటున్నారు, పట్టిసీమ సక్సెస్ తో దూకుడు మీదున్న చంద్రబాబు, అదే ఊపులో పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట,పోలవరం పూర్తయితే, ఆ పేరుతో 2019లో ఓట్లు అడగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట, పోలవరం పూర్తయితే ఇటు కృష్ణాడెల్టాకు, అటు ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చని, రాయలసీమకు శ్రీశైలం నీటిని పూర్తిగా కేటాయించి ఆ ప్రాంతాన్ని కూడా సంతృప్తి పర్చాలని ఆలోచన చేస్తున్నారట, చంద్రబాబు అనుకున్నట్లుగా పోలవరం పూర్తయితే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి తిరుగుండదేమో!