తెదేపా ఎమ్మెల్యేపై ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి శాఖ దాడులు

  మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలు, ఆయనకి వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు చేసారు. విశేషమేమిటంటే కర్నాటకలోని బెంగళూరు, గుల్బర్గాల నుండి ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి ఈ దాడులలో పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్ధుల నుండి 1-2 కోట్లు వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక అక్కడి మెడికల్ కాలేజీలపై ఆదాయపన్ను శాఖ అధికారులు చాలా కాలంగా దృష్టి పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. బహుశః అక్కడి కాలేజీలతో రాజేందర్ రెడ్డి మెడికల్ కాలేజీకి కూడా ఏమయినా సంబంధాలు, లావాదేవీలు జరుగుతున్నందునే కర్ణాటకకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడుల్లో సుమారు ముప్పై మందికి పైగా అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

నేటి నుంచి ఐదు రోజులు ఏపి అసెంబ్లీ సమావేశాలు

  ఇవ్వాళ్ళ నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ముందుగా ఉభయసభలలో చర్చించవలసిన అంశాల గురించి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశంలో చర్చించి అజెండా ఖరారు చేస్తారు. అసెంబ్లీ బిఎసి సమావేశానికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి బిఎసి సమావేశానికి డా.ఎ. చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. సమావేశాల అజెండా ఖరారు కాగానే ఉభయ సభలు సమావేశాలు మొదలవుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి శాసనసభకు బయలు దేరారు.   ఈసారి సమావేశాలు కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహించబోతున్నప్పటికీ తెదేపా ప్రభుత్వానికి అవి కత్తి మీద సాముగా మారే అవకాశాలే కన్పిస్తున్నాయి. కల్తీ మద్యం, కాల్ మనీ, సెక్స్ రాకెట్, బాక్సైట్ తవ్వకాలు, విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ శలవు వ్యవహారం మొదలయినవన్నీ ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాకు బలమయియన్ ఆయుధాలుగా అందివచ్చేయి. కనుక ఈసారి వైకాపాను ఎదుర్కోవడానికి అధికార పార్టీ చాలా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.

కాల్ మనీ.. వైసీపీ లీడర్సే ఎక్కువ..

ఏపీలో కాల్ మనీ దందా చేసిన అరాచకాలు తవ్వేకొద్ది బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంతోమంది పార్టీ నేతలు బయటపడుతున్నారు.. ఎంతోమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకూ అరెస్ట్ అయిన వారిని బట్టి చూస్తే అందరికంటే వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు మొత్తం 80 మందిని పైగా అరెస్ట్ చేస్తే అందులో 27 మంది వైసీపీ నేతలు ఉండగా.. ముగ్గురు సీపీఐ నేతలు.. 44 మంది ఏ పార్టీకి చెందని వారు ఉన్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ పై విమర్సలు చేసిన జగన్ పై .. ఆ పార్టీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు వైసీపీ నేతలను విమర్శించారు.. ఇప్పుడు అరెస్ట్ అయిన వారిలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు.. వైసీపీ నేతలకు టీడీపీని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంక వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే వారికంటే ఎక్కువగానే మాట్లాడుతూ సీఎం అంటేనే కాల్ మనీ అంటూ రెచ్చిపోయారు. అంతేకాదు ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం.. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై రచ్చ చేయాలని డిసైడ్ అయ్యారు జగన్. మరి ఇప్పుడు నోరు మొదుపుతారో లేదో చూడాలి. 

మోడీ పీఎంగా అనర్హుడు..నన్ను ప్రధానమంత్రి చేయండి.. ఆజంఖాన్

ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా అనర్హుడని.. తాను రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా ఉండాలంటూ లక్నలో పోస్టర్లు వచ్చిన నేపథ్యంలో.. ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు  ''మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. దానికి అన్నివిధాలా అర్హుడిని.. అందుకే ఉపముఖ్యమంత్రి కావాలంటూ వెలిసిన పోస్టర్లను తీయించేశాను' అని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఎంపీలంతా తనను ఎన్నుకోవాలని.. అది దేశానికి  మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, దేశం ప్రతిరోజూ పురోగతి సాధిస్తుందని చెప్పుకున్నారు. ప్రధాని పదవికి తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరి అజాంఖాన్ వ్యాఖ్యలకు ఎలాంటి దూమారం లేపుతాయో చూడాలి.

ఏపీ క్యాబినెట్.. వైసీపీ సమావేశాలు.. ఒకటే అంశాలు

  ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈసందర్బంగా ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆరు ప్రధాన బిల్లులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాల్ మనీ, కల్తీ మద్యంపై ప్రతిపక్షాలను ఎదుర్కోవడం.. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలుపరచడం.. జనవరి 1 నుండి ప్రారంభంకానున్న జన్మభూమి విధానాలపై చర్చిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా సమావేశమయ్యారు. ఈసందర్బంగా వారు అసెంబ్లీలో ఏ అంశాలపై మాట్లాడాలో చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాల్ మనీ, కల్తీ మందు, బాక్సైట్ తవ్వకాలు గురించి చర్చించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష నేతలను ఎదుర్కోవడానికి అధికార పార్టీ రెండూ కలసి అసెంబ్లీలో రచ్చ చేస్తారని ముందే అర్ధమవుతోంది.

సెలవులు రద్దు చేసుకుంటున్నా.. గౌతమ్ సవాంగ్

విజయవాడలో కాల్ మనీ రగడ సమయంలో సీపీ గౌతమ్ సవాంగ్ సెలవులు కోరడంపై అనేక అనుమానాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమని.. అందుకే తాను సెలవులు తీసుకున్నారని పలువురు విమర్శించారు. దానికి గౌతమ్ సవాంగ్ నెలరోజుల క్రితమే సెలవులు కావాలని కోరారని.. కాల్ మనీ దీనికి సంబంధం లేదని డీజీపీ రాముడు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ కూడా ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కాల్ మనీ కేసు దృష్ట్యా సెలవులు రద్దు చేయాలని డీజీపీని కోరానని..నేను సెలవులు రద్దు చేసుకుంటున్నానని తెలిపారు.ఇంకా కాల్ మనీ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది..రాష్ట్రవ్యాప్తంగా పలు ఫైనాన్స్ కార్యలయాలపై దాడులు చేస్తున్నాం.. పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని గౌతమ్ సవాంగ్ తెలిపారు

కలెక్టర్లకు చంద్రబాబు క్లాస్..కోటు, టై కట్టుకోవడం కాదు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎలాంటి మొహం మాటం లేకుండా వారికి క్లాస్ పీకుతుంటారు. ఇలాంటి సందర్భాలు చాలానే చూశాం. మళ్లీ నిన్న కలెక్టర్లతో సమావేశమయిన చంద్రబాబు వారికి కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సహజ వనరులు ఉన్నాయి.. వాటిని సద్వినియోగం చేయడంపై దృష్టి సారించాలి.. అంతేకాని కలెక్టరంటే కోటు, టై కట్టుకుని బ్రిటీష్‌ తరహాలో ఎసి గదుల్లో కూర్చుని పని చేయడం కాదు, పోటీతత్వంతో పని చేయాలని ఆదేశించారంట. ఈ సందర్భంగా కలెక్టర్లు రాబోయే ఆరు నెలల్లో తాము చేయాల్సిన పనుల నివేదికను సీఎంకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. కలెక్టర్ల పని విధానం మారాలని, జిల్లాల్లో ఏంచేయాలో వారే సూచనలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇంకా అనేక అంశాలపై చంద్రబాబు కలెక్టర్లతో చర్చించినట్టు తెలుస్తోంది. అవి * మలేషియాలో పెమాండూ విధానాన్ని ఇక్కడ అమలు చేయడం * గృహనిర్మాణంలో నూతన పద్ధతులు * ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్‌ భూములకు జియో ట్యాగింగ్‌ చేయాలని.. * రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1.60 వేల కిలోమీటర్ల మేర మ్యాపింగు.. * నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన కంపెనీలతో టైఅప్‌ చేసుకోవాలని * స్వయం సహాయ సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణలు

అమెరికాలో ఇండియన్ మీద కాల్పులు

  అమెరికాలో భారతీయుల మీద కాల్పులు జరగడం సర్వ సాధారణమైపోయింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఇది చాలా భయాన్ని కలిగిస్తోన్న అంశం. ఈ భయం నేపథ్యంలోనే అమెరికాలోని మరో భారతీయుడి మీద కాల్పులు జరిగాయి. బిచిగాన్‌లో ఇంద్రజిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన ఒక స్టోర్‌లో భారత సంతతికి చెందిన ఒక యువకుడు క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఆ స్టోర్‌లోకి ఓ దుండగుడు మాస్క్ ధరించి ప్రవేశించాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అయితే ఆ యువకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దుండగుడు అతని మీద కాల్పులు జరిపి, డబ్బు తీసుకుని పరారయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ బుల్లెట్లు ఆ యువకుడికి ప్రాణాపాయం కలిగించే ప్రాంతాల్లో తగలకపోవడంతో అతను బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.  

ఒకేసారి ఆరు ఉపగ్రహాలు...

  నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆరు ఉపగ్రహాలను విశ్వలోకి పంపనున్నారు. ఆరు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-29ని శాస్త్రవేత్తలు లాంచ్ చేయనున్నారు. ఇది షార్ సెంటర్ నుంచి జరగబోతున్న 50వ ప్రయోగం. ఆరు ఉపగ్రహాలను నింగిలోకి ఒకేసారి పంపించడం ఈ ప్రయోగంలో వున్న ప్రత్యేకత. ఈ వాహక నౌక సింగపూర్‌కి చెందిన 625 కిలోల బరువున్న ఆరు ఉప గ్రహాలను మోసుకుని వెళ్ళనుంది. వీటిలో 400 కిలోల బరువున్న టిలియోన్ ఉపగ్రహం చాలా ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ పరిశీలన కోసం సింగపూర్ అంతరిక్ష పరిశోధన సంస్థ మొట్టమొదటిసారిగా టిలియోన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది.  

సెల్ఫీ చంపేసింది

  ఈమధ్య కాలంలో జనానికి సెల్ఫీల పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి చాలామంది ప్రాణాలు తీస్తున్నా జనంలో మార్పు రావడం లేదు. ఇప్పుడు పాకిస్థాన్‌లో ఓ యువకుడు సెల్ఫీ మీద మోజుతో ప్రాణాలే పోగొట్టుకున్నాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికిచెందిన జంషేద్ ఖాన్ (22) రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న రైల్వే స్టేషన్ దగ్గర కదలబోతున్న ఒక రైలు ముందు నిల్చుని సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే రైలు వేగంగా కదలడంతో అతను రైలు కింద పడిపోయాడు. అతని మీద నుంచి రైలు చక్రం వెళ్ళడంతో అతను అక్కడే రెండు ముక్కలైపోయాడు. శరీరం రెండు ముక్కలైపోయినా జంషేద్ ఖాన్ చేతిలో వున్న సెల్‌ఫోన్ మాత్రం అలాగే వుండిపోయింది. ఆ ఫోన్‌లో సెల్ఫీ వుందో లేదో తెలియదుగానీ... జంషేద్ ఖాన్ ప్రాణాలు మాత్రం పోయాయి.

కేజ్రీవాల్ పై బీజేపీ ఫైర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యలయంలో నిన్న సీబీఐ దాడులు నిర్విహంచిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేజ్రీవాల్ కు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతుంది. మోడీ కావాలనే తన కార్యలయంపై దాడులు చేయించారు.. మోడీ పిరికివాడు.. సైకోపాత్ అంటూ క్రేజీవాల్ మండిపడుతుంటే.. మరోవైపు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రతి దానికి మోడీ అనడం కేజ్రీవాల్ కు సరదా అయిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ కు తృణమూల్, కాంగ్రెస్, జేడీయూ నేతలు మద్దతు పలుకుతున్నారు. దీంతో ఈ వ్యవహారం.. చిన్నగా రాజకీయ రంగు పులుముకుంటున్నట్టు తెలుస్తోంది.

కాల్ మనీ..రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు

కాల్ మనీ దందా  వ్యవహారంలో తవ్విన కొద్ది అక్రమార్కులు బయటపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. వడ్డీ వ్యాపారులు నుండి కీలకమైన పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాదీనం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాల్ మనీ ఆరోపణలపై ప్రకాశం జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించి.. మార్కాపురంలో నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా కాల్ మనీ వ్యవహారంపై వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇంక ఒంగోలులో కూడా ఫైనాన్షియర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బులెట్ ట్రైన్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్: తెదేపా ఎంపి

  అమలాపురం లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా ఎంపి పి. రవీంద్ర బాబు నిన్న కేంద్రప్రభుత్వానికి షాక్ ఇచ్చేరు. నిన్న లోక్ సభలో ఉప పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “ప్రపంచదేశాలతో పోలిస్తే మన దేశ ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలుసు. కనుక కేవలం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు బులెట్ ట్రైన్ వంటి బారీ ప్రాజెక్టులను భుజాలకు ఎత్తుకోవడం సరికాదు. అసలు బులెట్ ట్రైన్ వంటి తలకు మించిన భారం ఎత్తుకోవడం దేనికి? మన దేశంలో 44 కోట్ల మందికి పైగా దారిద్ర్యరేఖకు దిగువనున్నారు. ఆ సొమ్మును వారి సంక్షేమానికి ఖర్చు చేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకొని అడుగు ముందుకు వేయవలసిన అవసరం ఉంది. మనం రక్షణ రంగం మీద ఖర్చు రెండు లక్షల కోట్లు చేస్తున్నాము. ఇరుగుపొరుగు దేశాలతో శాంతి నెలకొల్పుకొనగలిగితే, రక్షణ రంగం మీద ఖర్చు చేస్తున్న ఆ డబ్బు అంతా పేదల సంక్షేమానికి దేశాభివృద్ధికి వినియోగించుకోవచ్చును,” అని అన్నారు.   ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్టు. కనుక దానిని బీజేపీలో, కేంద్రప్రభుత్వంలో, తెదేపాతో సహా ఎన్డీయే కూటమిలో ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయడం లేదు. కానీ తెదేపా ఎంపీ రవీంద్ర బాబు నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పగలగడం విశేషం. అయితే ఆయన ఒక్కరూ అభ్యంతరం చెప్పినంత మాత్రాన్న ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్రం దానిని విరమించుకొంటుందని భావించలేము. కేంద్రప్రభుత్వం అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 98,000 కోట్లతో బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ తో ఒప్పందం కుదుర్చుకొంది. దానిలో 80 శాతం నిధులను జపాన్ సమకూర్చుతుంది. ఈ సందర్భంగా ఎంపీ రవీంద్ర బాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, పోలవరం నిర్మాణం వంటి అంశాల గురించి కూడా కేంద్రప్రభుత్వాన్ని లోక్ సభలో నిలదీశారు.

చంద్రబాబుని డౌట్ అడిగిన కేసీఆర్..అన్నా మీ ఇల్లు మునగదా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆహ్వానం అందించడానికి ప్రత్యేక హెలికాఫ్టర్లో విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలోనే విజయవాడలో తన నివాసానికి వచ్చిన కేసీఆర్ ను చంద్రబాబును సాదరంగా లోపలికి ఆహ్వానించగా..కేసీఆర్ అనంతరం చండీయాగానికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబుని కోరారు.దీంతో చంద్రబాబు కూడా తప్పకుండా వస్తానని కేసీఆర్ కు చెప్పారు.ఇక ఆ తరువాత..ఇద్దరు సీఎంలు కలిసి కాసేపు ఉల్లాసంగా మాటలు కలిపారు.అయితే ఈసందర్భంగా కేసీఆర్ తనకు వచ్చిన ఒక డౌటును నివృతి చేసుకున్నారంట.అదేంటంటే..అన్నా నేను హెలికాఫ్టర్లో వస్తున్నప్పుడు పైనుండి చూశాను..నది నిండుగా ఉంది..మరి అలాంటప్పుడు వర్షాకాలంలో మీ ఇల్లు మునగదా..? రాజధాని ప్రాంతానికి ఇబ్బంది లేదా అని అడిగారంట.దానికి చంద్రబాబు..పైనుండి చూశావు కాబట్టి అలా అనిపిస్తుంది..కానీ అది నిజం కాదు..వీటీపీఎస్ థ‌ర్మల్ విద్యుత్ కేంద్రం అవ‌స‌రాల కోసం న‌దిలో ఆ నీటిమ‌ట్టం నిర్వహిస్తుంటారు..లేక‌పోతే వీటీపీఎస్ ఆగిపోతుంది అని వివరంగా చెప్పారంట.ఇక రాజధాని ప్రాంతానికి అయితే భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తగా ప్రణాళిక సిద్దం చేస్తున్నాం అని చెప్పారంట.మొత్తానికి కేసీఆర్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఓపికగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ కు కోదండరాం ఝలక్..

తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీలోకి ఈమధ్య కాలంలో వలసల పర్వ సాగింది.చాలా మంది నేతలు తమ పార్టీని విడిచి టీఆర్ఎస్ లోకి చేరారు.అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో,కొత్త రాజకీయాలను కోరుకుంటున్నామన్నారు.పార్టీని వదిలి వెళ్లిపోవడం లాంటివి అస్థిరతకు దారి తీస్తాయి..ఏరాజకీయ పార్టీ  ఫిరాయింపులు ప్రోత్సహించినా అది తప్పే అవుతుందని అన్నారు.అంతేకాదు ఆత్మహత్యల నివారణకు పాటలు రాయాలని..సంఘటితంగా ముందుకు వెళ్లాలని..ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.కాగా త్వరలోనే టీ.జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.