కాంగ్రెస్‌లో మంత్రి వ‌ర్గ చిచ్చు

  అస‌లే కాంగ్రెస్ ఆపై మంత్రిప‌ద‌వుల‌కు ఆశావ‌హులు చాలా మందే ఉంటారు. ఆ మాట‌కొస్తే అక్క‌డ ముఖ్యమంత్రి ప‌ద‌వి కోసం కూడా పోటీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అలాంటిది మంత్రి ప‌దవిపై మాత్రం కాంపిటిష‌న్ ఉండ‌దా?  మొద‌టి లొల్లి మైనార్టీ  నాయ‌కుల  నుంచి  మొద‌లైందట‌. అజారుద్దీనే మైనార్టీ నేత  అయితే మ‌రి మేమంతా  ఎవ‌రు? అని నిల‌దీస్తున్నారు ఫిరోజ్  ఖాన్, సీనియ‌ర్ లీడ‌ర్  ష‌బ్బీర్ అలీ.  వీరిద్ద‌రూ ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కులు. అజారుద్దీన్ లా స్పోర్ట్స్ కోటాలో ప‌ద‌వి కొట్టేసిన  బాప‌తు కాదు. దీంతో మాకెందుకివ్వ‌లేదు మంత్రి ప‌ద‌వి? అన్న‌ది వీరి ప్ర‌శ్న‌. అజారుద్దీన్ కన్నా మాకేం  త‌క్కువ‌. అజార్ క‌న్నా తెలుగు రాదు. అదే  మాకు అలాక్కాదు క‌దా.. తెలుగులోనూ మాట్లాడి క‌వ‌ర్ చేస్తాం.. అంటారు వీరు. అజారుద్దీన్ అంటే గ‌తంలో జూబ్లీహిల్స్ రేసు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబ‌ట్టి.. ఆయ‌న్ని మంత్రిని చేస్తే జూబ్లీహిల్స్ లోని మైనార్టీ ఓటు బ్యాంకును విశేషంగా ఆక‌ట్టుకోవ‌చ్చ‌న్న‌ది అధిష్టానం ఆలోచ‌న. అయితే  నేను ఇక్క‌డి నుంచి పోటీ  చేయాల్సింది. నేను త్యాగం  చేయ‌డం వ‌ల్లే న‌వీన్‌కి  వ‌చ్చిందా టికెట్ కాబ‌ట్టి నాకు క‌దా  ప‌ద‌వి ఇవ్వాల్సింద‌ని అంటారు అంజ‌న్ కుమార్ యాద‌వ్. ప‌దేళ్లుగా బీఆర్ఎస్ తో కొట్లాడిన నాకు మంత్రి ప‌దవి ఏదీ? అంటూ నిల‌దీస్తారు జీవ‌న్ రెడ్డి. ఇలా మంత్రి  ప‌ద‌వుల‌పై బీభ‌త్స‌మైన గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో.. ఇక్క‌డ గోపీనాథ్ మ‌ర‌ణించ‌డం. ఆ టికెట్ అజారుద్దీన్ ఆశించ‌డం. అటు పిమ్మ‌ట  దానికి న‌వీన్ యాద‌వ్ పోటీ రావ‌డం. అజారుద్దీన్ని ఎలాగైనా  స‌రే బుజ్జ‌గించాల్సిందే అన్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప‌పుడు మిగిలి ఉంచిన మూడు మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి ఆయ‌న‌కు మైనార్టీ కోటా కింద ఇవ్వ‌డం జ‌రిగింది. అప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న‌రావు స్తానంలో హెచ్. సీ. ఏ అధ్య‌క్ష ప‌ద‌వికి  అజారుద్దీన్ని పంపాల‌నుకున్నారు.  కానీ, అందుకు ఆయ‌న స‌సేమిరా అన‌డంతో.. ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి సిద్ధ ప‌డింది కాంగ్రెస్ అధిష్టానం. అలాగ‌ని ఈ ఎపిసోడ్ ఇక్క‌డితో ముగిసిపోలేదు. ఎమ్మెల్యేల‌కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వ‌డంపైనా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ్. జ‌గ్గారెడ్డి, మ‌ధు  యాష్కి వంటి సీనియ‌ర్లు ఈ విష‌యంలో గుర్రుగా ఉన్నార‌ట‌. త‌మ‌ను అడ‌క్కుండా,  బుజ్జ‌గించ‌కుండా ఇలా ఎలా చేస్తార‌ని వారు అంటున్నారట‌. కొంద‌రైతే వీరెన్ని చేసినా  జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు అంతంత మాత్ర‌మే అని ఓపెన్ కామెంట్లు చేస్తున్నార‌ట‌.

బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు జాగ్రత్త : సీఎం రేవంత్‌

  జూబ్లీహిల్స్‌లో బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి (కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి) అన్నారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కార్నర్‌ మీటింగ్‌‌లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. దివంగత నేత పేదల మనిషి పి.జనార్ధనరెడ్డి అకాల మరణంతో 2008  ఉప ఎన్నిక ఆయన ఫ్యామిలీని ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పీజేఆర్‌ కుటుంబానికి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆనాడు తెలుగు దేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆ ఉప ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు.  ఒక దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ ఆనాడు తెరలేపారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఆస్తిలో వాటా అడుగుతుందని సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి పార్టీ నుంచి తరిమివేసినోడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అలాంటోడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే.. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట’ అనే సామేత గుర్తొస్తుందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.  బోరబండకు పీజేఆర్ పేరు పెడతామని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్‌లో గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు.  ఇక్కడ ఎంతో మంది పేదలకు పి.జనార్ధనరెడ్డి ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. పేదలకు పీజేఆర్ ఇళ్లు కట్టించారని ఆయన అన్నారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరుతో పాటు విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారని కవిత ఆరోపణలు చేస్తున్నది. దమ్ముంటే ముందు ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. బోరుబండ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని అని రేవంత్ తెలిపారు.

రాజీనామాకు సిద్దం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతు కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక నియోజకవర్గంలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని సీఎం చెప్తున్నాడు. నిజంగా నాలుగు వేల కోట్ల అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ఆ క్షణమే నేను సనత్‌నగర్ ఎమ్మెల్యేకి  రాజీనామా చేస్తాని తలసాని సవాల్ విసిరారు.  సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని ఆయనకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.  23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని అన్నారు.  హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ హైదరాబాద్ తిరగలేదని అంటున్నారు.. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉన్నారా..? లేక వేరే దేశంలో ఉన్నారా..? అని తలసాని ప్రశ్నించారు.ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని అని, ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారని తలసాని అన్నారు.  

జూబ్లీ బైపోల్ లో పార్టీల ఎన్టీఆర్ భజన అందుకోసమేనా?

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. అన్ని పార్టీల దృష్టీ తెలుగుదేశం వైపే ఉంటుంది. విభజన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో క్రీయాశీల రాజకీయాలకు ఒకింత దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రధాన కారణం పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం లేకపోవడమే.  తెలంగాణలో తెలుగుదేశం నాయకులంతా వేర్వేరు కారణాలతో తమ దారి తాము చూసుకున్నా.. పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ఎన్నికల సమయంలో అర్రులు చాస్తుంటాయి. ఇసుమంతైనా భేషజానికి పోకుండా తెలుగుదేశం జెండా మోస్తుంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రస్, బీజేపీ సహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం జెండా చేతబట్టి ప్రచారం చేయడాన్ని మనం చూశారు. ఇప్పుడు జూబ్లీహాల్స్ ఉప ఎన్నిక వేళ కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా తెలుగుదేశం అండ కోసం అర్రులు చాస్తున్నాయి.  తెలుగుదేశం ప్రాపకం పొందేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి  మాగంటి సునీత కొన్ని రోజుల కిందట తన ప్రచారంలో ఎన్టీఆర్ ను స్మరించు కున్నారు. తన భర్త, దివంగత మాగంటి గోపీనాథ్ కు ఎన్టీఆర్ పిత్రు సమానులని చెప్పుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా మాగంటిని పుత్ర వాత్సల్యంతో ఆదరించారని చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో హైదరాబాద్ నడిబొడ్డున అంటే మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రస్తావన తెచ్చారు. ఆయన విగ్రహాన్ని మైత్రీవనంలో  ఏర్పాటు చేయించి తానే ఆవిష్కరిస్తానని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం  జూబ్లీ ఉప  ఎన్నికలో తెలుగుదేశం  పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకమే అని పరిశీలకులు అంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినాయత్వం ఎన్డీయేతో పొత్తు నేపథ్యలో బీజేపీకే మద్దతు ఇవ్వాలని క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. తెలంగాణలో పార్టీలన్నీ తెలుగుదేశం భజన చేస్తున్నాయని చెప్పక తప్పదు. 

జూబ్లీ కొండ‌ల్లో రేవంత‌న్న‌ స్టార్ క్యాంపెయినంగా మ‌జాకా!

ఇలా అజారుద్దీన్ ని కేబినెట్ లో చేర్చుకుని..   అలా ఆయ‌న్ను త‌న ప్ర‌చార ర‌థంఎక్కించి.. జూబ్లీ హిల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మ్యాజిక్ చేశారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31)న నిర్వహించిన రోడ్ షో తో ఒక మ్యాజికల్ షో చేశారని చెప్పవచ్చు. ఒక వైపు అజారుద్దీన్ ను పక్కన పెట్టుకుని చేసిన రేవంత్ రెడ్డి రోడ్ షో నియోజకవర్గంలోని మైనారిటీలను ఆకర్షించింది. అదే సమయంలో  మ‌ధ్య మ‌ధ్య‌లో పిజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డిని సైతం త‌న ప్ర‌చారంలో ఒక భాగం చేస్తూ  రేవంత్ రెడ్డి ఓటర్లను ఆకట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్ ను మెప్పించేలా..  ఎన్టీఆర్  విగ్ర‌హ‌ ప్రతిష్ఠాపన ప్ర‌స్తావ‌న చేసి.. దటీజ్ రేవంత్ అనిపించుకున్నారంటున్నారు.    టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్  అజారుద్దీన్ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా చేరారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం ఆయన చేత రాజ్ భవన్ లో గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.  ఆ వెంటనే సాయంత్రం అజారుద్దీన్ ను వెంటపెట్టుకుని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో  రోడ్ షోలో పాల్గొన్నారు    అజారుద్దీన్ ఇక్క‌డ ఒక సారి పోటీ చేసి ఓడిపోతే ఆయ‌న్ను ఎమ్మెల్సీ చేసి అటు పిమ్మ‌ట మంత్రిగానూ ప్ర‌మాణం  చేయించి.. మీ ముందుకు తెచ్చాన‌ని ఈ సందర్భంగా  రేవంత్ ప్రజలకు చెప్పారు. అజార్ కూడా న‌వీన్ యాద‌వ్ గెలుపున‌కు త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. ఇక పీజేఆర్ త‌న‌య‌ విజ‌యారెడ్డి సంగ‌తి స‌రే స‌రి. అప్ప‌ట్లో మాస్ లీడ‌ర్ పీ. జ‌నార్ధ‌న్ రెడ్డి చ‌నిపోయిన‌పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ వైరుధ్యాల‌ను ప‌క్క‌న పెట్టి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవం చేస్తానంటే.. ఇదే కేసీఆర్ పీజేఆర్ భార్యా పిల్ల‌ల్ని మూడు గంట‌ల పాటు నిల‌బెట్టి ఒట్టి  చేతుల‌తో పంపించేశార‌ని గుర్తు చేశారు. అందుకు సాక్ష్యం విజ‌యారెడ్డేన‌ని రేవంత్ ఆమెను పక్కన పెట్టుకుని మరీ చెప్పడం ద్వారా ప్రజల సెంటిమెంట్ ను టచ్ చేశారు.  ఎక్కే ఫ్లైటు దిగే బెంజికార్లే జీవితంగా  ఇన్నాళ్లు బ‌తికిన బిల్లా రంగాలు ప్ర‌స్తుతం ఆటోలో తిరుగుతూ.. మిమ్మ‌ల్ని మాయ చేయ‌డానికి వ‌స్తున్నార‌నీ.. సొంతింటి ఆడ‌బిడ్డ‌నే రోడ్డున  ప‌డేసిన వీరు.. మాగంటి సునీత కార్చే క‌న్నీళ్ల ద్వారా  గెల‌వాల‌ని  చూస్తున్నార‌నీ.. వీరి వేషాల‌ను చూసి మోస‌పోవ‌ద్ద‌ని జూబ్లీ ఓటర్లను రేవంత్ హెచ్చరించారు.   ఇక మైత్రీ వ‌నంలో అంద‌రికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి విగ్ర‌హం  పెట్టించే బాధ్య‌త   న‌వీన్ కి అనిల్ కి అప్ప‌గించాన‌నీ.. తానే స్వ‌యంగా  వ‌చ్చి ఆ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తాన‌ని మాటిస్తూ... ఇటు సెటిల‌ర్లను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  అంటే ఇటు అజారుద్దీన్ ద్వారా మైనార్టీ ఓట్ల‌ను, ఆపై ఈ ప్రాంతంలో   మాస్ లీడ‌ర్ గా ఉన్న పీజేఆర్ అభిమాన‌గ‌ణాన్ని.. ఇక కృష్ణాన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో అధికంగా నివ‌సించే సెటిలర్లను  ఆక‌ట్టుకునేలా రేవంత్ రోడ్ షో సాగింది.  గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా  మీ మొహం చూసిన వారు కాద‌ని.. ఇదే నియోజ‌వ‌క‌ర్గం నుంచి మూడు సార్లు గెలిచిన గోపీనాథ్ ఒక్క‌టంటే ఒక్క సారి కూడా అసెంబ్లీలో ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడింది లేద‌ని.. ఆపై ఆయ‌న ఈ ప‌ద‌హారునెల‌ల్లో ఈ నియోజక‌వ‌ర్గానికిది కావాలి అది కావాల‌ని త‌న ద‌గ్గ‌ర‌కు ఒక కాగితం కూడా తేలేద‌ని అన్నారు సీఎం రేవంత్.   అలాగ‌ని మాగంటి కుటుంబంపై త‌న‌కు ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని.. ఆ ఫ్యామిలీ ప‌ట్ల సానుభూతి అలాగే ఉంద‌ని.. అయితే.. గ‌త మూడు ప‌ర్యాయాల పాటు ఏమీ చేయ‌లేని వారు నాలుగోసారి గెలిపిస్తే మాత్రం ఏం చేయ‌గ‌ల‌ర‌నీ ప్ర‌శ్నించారు. గత రెండు నెల‌లుగా ఈ నియోజ‌క వ‌ర్గానికి తమ ప్ర‌భుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది కాబ‌ట్టి.. ఇక్క‌డ గ‌ల్లీ గ‌ల్లీ తెలిసిన  వ్య‌క్తి.. న‌వీన్ యాద‌వ్ ని గెలిపించి.. నాకు సిటీలో ఒక కుడి భుజాన్ని అందివ్వాల్సిందిగా కోరారు సీఎం రేవంత్. మ‌రి సీఎం రేవంత్ అభ్య‌ర్ధ‌న ఇక్క‌డి ఓట‌ర్లు మ‌న్నిస్తారా.. లేదా?  తెలియాలంటే న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. 

జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : సీఎం రేవంత్

  జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. మూడు సార్లు గెలిచిన బీఆర్‌ఎస్ ఇక్కడ ఏం చేసిందని ప్రశ్నించారు. మనతో ఉండేవాడు నవీన్‌యాదవ్ గెలిపించకుంటే అదొక చరిత్ర తప్పిదం అవుతుందని అన్నారు.  ఆనాడు 2007లో పేదల దేవుడు పీజేఆర్ అకాల మరణం చెందితే… ప్రతి పక్షాలు బీజేపీ, టీడీపీ ఆయనపై గౌరవంతో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే.. పీజేఆర్ పై టీఆర్ఎస్ నుంచి బరిలో పెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా? అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.  కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చార  కానీ ప్రజలు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్ ను గెలిపించారని ఇవాళ 4 వేల కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు.. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్ మంత్రిగా ఉన్నాయన జూబ్లీహిల్స్ కు వచ్చారా.. ఇక్కడి ప్రజల ముఖం చూశారాని ప్రశ్నించారు.  బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం అన్నారు, లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏమైనా నిధులు తెచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు .నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీకి అడ్డుపడుతుండు అన్నారు.  బీఆర్‌ఎస్ వస్తే మీకు సన్నబియ్యం బంద్ అయితాయని తెలిపారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్ అయితాయ్ రేషన్ కార్డులు రద్దు చేస్తామని సీఎం అన్నారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం..యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడని సీఎం రేవంత్ అన్నారు.  

జూబ్లీలో బీఆర్‌ఎస్ గెలుపుతో... కాంగ్రెస్ పతనం స్టార్ట్ : కేటీఆర్

  జూబ్లీహిల్స్‌ లో గెలుపు పక్కా.. కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. జీవో నంబ‌ర్ 58, 59 కింద హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్షా 50 వేల మంది పేద‌ల‌కు మాజీ సీఎం కేసీఆర్ ప‌ట్టాలిచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వ‌చ్చాక కొత్త‌గా ఒక్క ప‌ట్టా ఇవ్వ‌లేదని కేటీఆర్ ఆరోపించారు. అన్ని రంగాల్లో టాప్‌లో ఉండే తెలంగాణ నేడు దిగ‌జారిందని. సంపద సృష్టించండంలో నంబ‌ర్ వ‌న్‌లో ఉన్న తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం నాశ‌నం చేసిండని ఆరోపించాడు. ఆటో అన్న‌లను దెబ్బ‌తీశారు. 162 మంది ఆటో డ్రైవ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లు పారిపోతున్నాయి. ప‌క్క రాస్ట్రాల‌కు త‌ర‌లిపోతున్నాయి. అదే కేసీఆర్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఐటీలో సృష్టించారు. ఇంత అద్భుతంగా కేసీఆర్ ప‌ని చేసి నంబ‌ర్ వ‌న్ చేశారు. రేవంత్ రెడ్డి హ‌యాంలో తెలంగాణ చివ‌రి ర్యాంకులో ఉంది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్‌ రెడ్డి అనుకుంటారు..ఒక్కసారి కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన టైమ్‌ వచ్చిందని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో 2023 ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వ‌లేదు . కేసీఆర్‌కు జై కొట్టి.. మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు జూబ్లీహిల్స్‌లో. మ‌రి దుర‌దృష్టావ‌శాత్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌న మ‌ధ్య‌లో లేకుండా పోయారు గోప‌న్న‌. ఇవాళ మాగంటి సునీత‌ను ఆశీర్వ‌దించి గెలిపిస్తార‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని కేటీఆర్ అన్నారు

బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు...ఎందుకంటే?

  జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కారు గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునీతపై వచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు.  

ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా

  తెలంగాణ క్యాబినేట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా పదవులను సీఎం రేవంత్‌రెడ్డికి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. రామకృష్ణరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (గవర్నమెంట్ అడ్వైజర్)గా నియమించారు.  మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్‌సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమించారు.. గత కొన్ని రోజులుగా ఇద్దరు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వారి అనుభవాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవడంతో పాటు, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పి. సుదర్శన్ రెడ్డికి క్యాబినేట్ హోదా కల్పించారు. ఆయనకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రభుత్వ సలహాదారులు ఉండగా ఎవరికీ కేబినెట్ హోదా లేదని సుదర్శన్ రెడ్డిని ఒప్పించి క్యాబినేట్ హోదాలో సలహాదారుగా నియమించారు  

జ‌గ‌న్ ఒంటెత్తు పాల‌న‌.. కూట‌మి ప్ర‌జాస్వామిక‌ పాల‌న‌.. తేడా తెలిసిందిగా?

జ‌గ‌న్ పాల‌న గ‌త ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోక‌డ‌. ఎక్క‌డా  పార‌ద‌ర్శ‌క‌త  అనేదే ఉండ‌దు. ప్ర‌జాస్వామిక‌త  అస్సలు కనిపించదు.  అంద‌రూ నోటికి తాళం వేసుకుని  ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవ‌రైనా స‌రే వారి వారి  స్వ‌శ‌క్తితో గెలిచిన‌ట్టుగా  జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లో భావించ‌రు. వారిని సంబంధం లేని  ప్రాంతాల‌కు పంపి పోటీ చేయించ‌డం ఇందులో భాగ‌మే. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెట్టినా వారంతా త‌న బొమ్మ మీద గెలుస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోక‌డ.  ఇదంతా ఇలా ఉంటే కూట‌మిలో కేవ‌లం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక స‌మ‌స్య వ‌స్తే స్పందించ‌డానికి ఇక్క‌డ మూడు ర‌కాల ముఖ‌చిత్రాలున్నట్టు క‌నిపిస్తోంది. అందులో ఫ‌స్ట్ అండ్ మెయిన్ ఫేస్  సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న త‌న అనుభ‌వమంతా  రంగ‌రించి.. మ‌రీ రంగంలోకి దిగుతారు. ఇక్క‌డ రెండో ఫేస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌వ‌న్ నేర్చుకోవాల‌న్న త‌న ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా స‌మీక్ష‌లు, స‌మావేశాలు, ప‌రిశీల‌న‌లు చేసి ఆదేశాలు ఇస్తుంటారు. ఇక థ‌ర్డ్ ఫేస్ ఆఫ్ కూట‌మి మంత్రి లోకేష్. నారా లోకేష్ త‌న తండ్రి  ద్వారా నేర్చుకున్న‌దంతా వాడి.. ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ రెండింటినీ క‌లిపి డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ గా చెబుతుంటారు.   అలాగే ఇక్క‌డ ఏపీలో న‌డిచే కూట‌మి ప్ర‌భుత్వం   ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కార్ న‌డుస్తోందా? అంటే అవున‌నే  చెప్పుకోవాలి. అదే.. జ‌గ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ లో అయితే.. కేవ‌లం ఒకే ఒక్క మోనార్క్ జ‌గ‌న్ మాత్ర‌మే న‌డిపిస్తారు. అన్నీ త‌న‌కే తెలుసు అన్న కోణంలో చేసే  రొడ్డ  కొట్టుడు ప‌రిపాల‌న మాత్ర‌మే సాగింది. అదే కూట‌మిలో చంద్ర‌బాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్న‌మైన వైరుధ్యంతో కూడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌డెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయా ప‌నులు చ‌క్క బెట్ట‌డం  తెలిసిందే. ఆయ‌న ఒక డిప్యూటీ  సీఎంగా ఏ విష‌యం లోనైనా త‌న అభిప్రాయాల‌ను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలూ తీసుకుంటూ ఉంటారు.  ఇది క‌దా ప్ర‌జాస్వామిక ప‌రిపాల‌న అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. కూటమి ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడే కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్

తెలంగాణ కేబినెట్ లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజారుద్దీన్ సభ్యుడయ్యారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అజారుద్దీన్ సీఎం రేవంత్ కు కృతజ్ణతలు తెలిపారు.  కాగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు గురువారం (అక్టోబర్ 30) నాడే చేశారు. శుక్రవారం  (అక్టోబర్ 31) ఉదయం సరిగ్గా 12.15 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్దమంటూ బీజేపీ నేతలు పాయల శంకర్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు  గురువారం (అక్టోబర్ 30)  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్‌ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమంటే ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదును సుదర్శన్‌రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు. అయితే  ప్రమాణ స్వీకారానికి ఎన్నికల కోడ్ అడ్డురాదన్న క్లారిటీ రావడంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగిపోయింది. 

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రేపు

తెలంగాణ కేబినెట్ లో అజారుద్దీన్ చేరనున్నారు. రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ చేరికకు ముహూర్తం ఖారారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12గంటల 15 నిముషాలకు అజారుద్దీన్ మంత్రగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాజ్ భవన్ లో ఆయన  చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు తెలిపారు.    ఇలా ఉండగా అజారుద్దీన్‌కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలియవస్తున్నది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేసి ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటున్నారు.  కాగా జూబ్లీ ఉప ఎన్నిక వేళ  అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించింది.  అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మైనారిటీ వర్గాలకు మంత్రిపదవి ఇస్తుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకని డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క అన్నారు. అలాగే  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అయితే అజారుద్దీన్ కు మంత్రిపదవిపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే, బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారన్నారు.   రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని   బీజేపీ గతంలో  మంత్రిని చేసిందని గుర్తు చేశారు.  శ్రీ గంగానగర్ జిల్లా  శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ  అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను ఉప ఎన్నికకు సరిగ్గా 20 రోజుల ముందు మంత్రిని చేసిందనీ, అటువంటి బీజేపీ ఇప్పుడు అజారుద్దీన్ ను మంత్రిని చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతోందని ప్రశ్నించారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయ‌స్సుకోసం కృషి చేస్తార‌న్న న‌మ్మ‌క‌ముందన్నారు.

కావలి ఎమ్మెల్యేపై దాడియత్నం

కావలి  తెలుగుదేశంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.మాలేపాటి సుబ్బారాయుడు, మాలేపాటి భాను చందర్ ల ఉత్తర క్రియల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డిని మాలేపాటి సుబ్బారాయుడు అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ఆయనపై దాడికి కూడా ప్రయత్నించారు.  మాలేపాటి  సుబ్బా నాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డే కారణమంటూ ఆయన కారు అద్వాలను ధ్వంసం చేశారు.  ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నేతలు మాలేపాటి అభిమానులను ఆపడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. మాలేపాటి అనుచరుల నిరసనలతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు.   తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చిన మాలేపాటిని కాదని గత ఎన్నికలలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన కావలి కృష్ణారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా మాలేపాటి సుబ్బారాయుడికి కీలక పదవి ఇస్తానన్న హామీ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పదవి అయితే వచ్చింది కానీ, నియోజకవర్గంలో ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయిందని అప్పటి నుంచీ మాలేపాటి అభిమానులు ఆరోపిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మాలేపాటి ఆస్తులపై దాడులు జరిగాయి.   ఎమ్మెల్యే నుంచి వేధింపులు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితోనే మాలేపాటి తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారని ఆయన అభిమానులు చెబుతారు. ఆ కారణంగానే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మరణించారనీ మాలేపాటి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఉత్తర క్రియలకు హాజరైన కావ్య కృష్ణారెడ్డిపై దాడి యత్నం జరిగిందని అంటున్నారు. 

ఎన్నేళ్లకెన్నేళ్లకు.. కోర్టు మెట్లెక్కనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మిన‌హాయింపు పొందుతూ వచ్చారు. అలా మినహాయింపు పొందడానికి ఆయన చెబుతూ వచ్చిన  కారణం పాలనాపరమైన బాధ్యతలు. అయితే 2024 ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా కాదు. అయినా ఇప్పటి వరకూ ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరైంది లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదంటున్నారు సీబీఐ అధికారులు. ఇక ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ముందు వచ్చే నెల 14న హాజరు కాకతప్పదు. అంటే ఏడేళ్ల తరువాత తొలి సారిగా నవంబర్ 14 జగన్ నాంపల్లి  కోర్టు మెట్లెక్కనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారిస్తున్నసీబీఐ కోర్టు ఎదుట ఆయన హాజరు కానున్నారు.  ఇటీవల జగన్ సకుటుంబ సమేతంగా లండన్ పర్యటించారు. ఆ సమయంలో లండన్ పర్యటనకు కోర్టు అనుమతస్తూ విధించిన షరతును జగన్ ఉల్లంఘించారు. కోర్టు ఆదేశాల మేరకు జగన్ తన కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా జగన్ అందుకు భిన్నంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అయితే దానిపై కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేశారు. అయితే ఇటీవలి విచారణలో కోర్టు ఆయనను తదుపరి విచారణకు తప్పని సరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు నవంరబ్ 14న జరిగే విచారణకు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తీరాలి.  

చంద్రబాబుకు ఎప్పుడూ బెటర్ దేన్ ది బెస్టే కావాలి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నోట తన మంత్రివర్గ సహచరుల గురించి కానీ, పార్టీ కేడర్, అధికారుల గురించి పొగడ్త రావడం అత్యంత అరుదు. ఎంద కష్టపడి పని చేసినా, ఓకే ఇంకా బాగా చేయాలి అన్న మాటలే ఆయన నుంచి తరచూ వింటుంటాం. నిజమే ఆయన ప్రతి విషయంలోనూ కేడా బెటర్ దేన్ ది బెస్ట్ కావాలంటారు. అందుకే బాగా పని చేసిన వారిని ఆయన భేష్ అంటూ భుజం తట్టి అభినందించినా.. మరుక్షణంలోనే ఇంకా బాగా చేయాలన్న మాట కూడా వస్తుంది. అటువంటి చంద్రబాబు తాజాగా అధికార యంత్రాంగాన్నీ, తన మంత్రివర్గ సహచరులను, కూటమి ఎమ్మెల్యేలను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మాండంగా పని చేశారంటూ కితాబులిచ్చేశారు. సందర్భం ఏమిటంటే మొంథా తుపాను సమయంలో నష్టాన్ని కనిష్ఠానికి తగ్గించేందుకు మొత్తం యంత్రాగం, కేబినెట్, పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్రాంతంగా శ్రమించి ఫలితం సాధించారు. దీనిపై ఆయన ఫిదా అయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌చివాల‌య సిబ్బంది ప‌గ‌లు రేయి తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో సేవ‌లు అందించారనీ, ఇళ్లకు కూడా వెళ్ల కుండా కార్యాలయాలలోనే ఉండి నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారనీ చంద్రబాబు ప్రశంసించారు.   అలాగే అలసత్వం వహిస్తున్నారు అంటూ నిన్నమొన్నటి దాకా చంద్రబాబు ఆగ్రహాన్నే చవి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు ప్రశంసలకు పాత్రులయ్యారు.  తుఫాను నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో  పర్యటనలు చేస్తూ ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా దగ్గరుండి మరీ పని చేయడాన్ని ఆయన అభినందించారు.  ఎమ్మెల్యులు, మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలోని ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు చేర్చ‌డమే కాకుండా అక్కడే ఉండి వారితో పాటు అక్కడే భోజనం చేయడం చంద్రబాబు ప్రశంసలకు పాత్రమైంది. దీంతో చంద్రబాబు తన అలవాటుకు ప్రకారం ఇంకా బాగా పని చేయాలంటూ ముక్తాయించకుండా, వారి సేవలను, శ్రమను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు ఎప్పటికీ మననే ఆదరిస్తారంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.  

అజారుద్దీన్ కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా జూబ్లీ బైపోల్ లో ప్రయోజనం పొందుదామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు సొంత పార్టీ నుంచే కాకుండా, బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముందుగా కాంగ్రెస్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా తనకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలంటూ ఊరూవాడా ఏకం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అజారుద్దీన్ కు మంత్రి పదవి వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాను పార్టీ వీడడానికి కూడా వెనుకాడబోనని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. సరే కాంగ్రెస్ లో ఇలాంటి అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులూ సహజమేనని లైట్ తీసుకున్నా.. బీజేపీ ఏకంగా అజారుద్దీన్ కు మంత్రిపదవిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  వాస్తవానికి అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతన్న మాట వాస్తవమే అయినా, ఇందుకు శుక్రవారం (అక్టోబర్ 31) ముహూర్తం అని గట్టిగా వినిపిస్తున్నా... ఇందుకు సంబంధించిన అదికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే బీజేపీ ఆజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకునే కార్యక్రమం వాయిదా పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు  పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి గురువారం (అక్టోబర్ 30) ఉదయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడమంటే.. ఈ ఎన్నికలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని బీజేపీ అంటోంది.  చూడాలి మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందో? 

మంత్రి వ‌ర్గంలోకి అజారుద్దీన్.. అల‌క‌లో రాజ‌గోపాల్ !?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ‌..  అజ‌హరుద్దీన్ కి మంత్రి వ‌ర్గంలోకి చోటు క‌ల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు క‌వ‌ర్ చేస్తూనే.. అటు గ‌తంలో ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. వారిని మ‌రింత ఆక‌ట్టుకునే య‌త్నంలో  కాంగ్రెస్ ఉంది. అయితే.. అజ‌హరుద్దీన్ కి మంత్రి ప‌ద‌వి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు...    ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌న్న‌ప్ప‌టి  రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది.  దానికి తోడు ఇప్ప‌టి వ‌ర‌కూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  అదే స‌మ‌యంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ ద‌గ్గ‌రే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవ‌డంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలో  అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా  స్వామికార్యం-  అంటే న‌వీన్ కార్యం కూడా పూర్తి చేయాల‌న్న‌ది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గ‌తంలో ఆరు మంత్రి ప‌ద‌వులు ఖాళీగా ఉండ‌గా.. వాటిలో మూడింటిని మాత్ర‌మే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ  నటరాజన్ ఆలోచ‌న‌. ఇప్పుడు అవ‌స‌రానికి ఇందులో ఒక మంత్రి ప‌ద‌వి బ‌య‌ట‌కు తీశారు. మిగిలిన రెండింటి ప‌రిస్థితి ఏంట‌ని చూస్తే.. ఇప్ప‌ట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.   దీంతో గ‌త కొన్నాళ్లుగా మంత్రి  ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్న రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు.. అస‌లీ పార్టీలోనే ఉండ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌న్న వ‌దంతి ఒక‌టి గుప్పు మంటోంది. ఇటు అజ‌హరుద్దీన్ కి మంత్రి ప‌ద‌వి ఇస్తారో లేదో  కానీ అటు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపార్టీ వీడేలా  క‌నిపిస్తోంది. రాజ‌గోపాల్ రెడ్డి గ‌తంలో కూడా ఇలాగే పార్టీ వీడి త‌ర్వాత తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కూ ఆయ‌న‌కున్న భావ‌ప్ర‌క‌ట‌నా  స్వేచ్ఛ‌కు కాంగ్రెస్ లో త‌ప్ప మ‌రెక్కడా వీలు కాదు. కాబ‌ట్టి.. ఆయ‌న వెళ్తే వెళ్లాడు-మ‌ళ్లీ వ‌చ్చేస్తాడులెమ్మ‌న్నభావనలో అధిష్టానం ఉన్న‌ట్టుగా స‌మాచారం. మ‌రి చూడాలి ఈ ప‌రిణామ క్ర‌మాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.

ఓట్ల కోసం నరేంద్ర మోదీ కూడా చేస్తారు : రాహుల్ గాంధీ

  బీహార్ ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతు ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏమైన చేస్తారని..డ్యాన్స్ చేయాలని అడిగితే మోదీ వేదికపైనే డ్యాన్స్ చేస్తారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్ పూజ సందర్బంగా ప్రజలు ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజలు చేసుకుంటున్నారు. కానీ ప్రధాని ప్రత్యేకంగా తయారు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారని రాహుల్ విమర్శించారు.  బీహార్‌లో బీజేపీ నేతలు ఓట్ల చోరీలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానలో ఓట్ల దొంగిలించారని బీహార్‌లోనూ అదే ప్రయత్నిస్తారని అగ్రనేత తెలిపారు. బీజేపీ కేవలం సీఎం నీతీశ్ కుమార్‌ను వాడుకుంటోంది.  దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బిహార్‌ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు.   మహాగఠ్‌బంధన్‌ అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్‌  హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్‌ హయాంలోనే నాంది పడిందని విపక్ష నేత తెలిపారు  

బాధ్యత వద్దు..విమర్శలే ముద్దు.. జగన్ పై లోకేష్ ఫైర్

మొంథా తుఫాను.. ప‌లు ప్ర‌భావిత జిల్లాల ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేసింది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అన్న ఆందోళనలో క్షణమొక యుగంగా గడిపారు. కానీ వారిని మించి.. ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బందీ లేకుండా తుపాను గండం గడిచేలా చేయడానికి ముఖ్యమం్తరి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ రెండు రోజులూ కంటిమీద కునుకు సంగతి పక్కన పెడితే రెప్ప కూడా వాల్చకుండా అప్రమత్తంగా ఉన్నారు. నిరంతర సమీక్షలతో, ఆర్టీజీఎస్ నుంచి క్షణం క్షణం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ, వాతావరణ కేంద్రం నుంచి వచ్చే సంకేతాలను, సందేశాలను పరిశీలిస్తూ గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకధాటిగా 12 గంటల పాటు ఆర్టీజీఎస్ లోనే తిష్ఠవేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు.  ఇలా అనుక్షణం ప్రజల క్షేమం కోసం, తుపాను నష్టాన్ని కనిష్ఠస్థాయికి తగ్గించడం కోసం తపనపడ్డారు. తుపాను తీరం దాటిన తరువాత నష్టం అత్యంత తక్కువగా ఉండటంతో ఆయన శ్రమ ఫలించింది. అయినా ఆయన క్షణం తీరిక చేసుకోలేదు. వెంటనే అంటు బుధవారం (అక్టోబర్ 29) తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వేకు బయలుదేరడానికి ముందు ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను స్పీడప్ చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సూచనలు చేశారు.    అయితే.. ప్రజలు కష్టాలలో ఉన్న సమయంలో ఏ నాయకుడైనా సరే.. అధికారంలో ఉన్నా, లేకున్నా బయటకు వచ్చి ప్రజలకు సహాయ హస్తం అందించాలి. ఇది కనీస బాధ్యత. అలా బయటకు వచ్చేందుకు మనస్కరించకుండా నోరు మెదపకుండా.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు, బాధితులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ సైలంట్ గా ఉండాలి. కానీ వైసీపీ ఎకో సిస్టమే వేరు. ఆ పార్టీ తాను చేయదు.. మరొకరు చేస్తుంటే ఓర్వదు. మొంథా తుపానును ఎదుర్కోవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా సర్వశక్తులూ ఒడ్డి ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటుంటే.. వైసీపీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఎత్తి చూపించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన సంక్షోభ సమయంలో కరుణ ఉన్న నాయకుడెవరైనా సరే ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తారనీ, అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటూ.. తన మీడియా నెట్ వర్క్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.  అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తమది ప్రజల ప్రభుత్వమని పేర్కొన్న లోకేష్ మొంథా తుపాను కారణంగా ప్రజలు ఎటువంటి కష్టనష్టాలూ ఎదుర్కోకుండా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. ఆ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.   ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న జగన్.. మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనీసం తాడేపల్లికి కూడా రాకుండా బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటూ అబద్ధాల ప్రచారానికి పాల్పడు తున్నారని విమర్శించారు.  కష్టసమయంలో ప్రజలకు అండగా నిలవడానికి బదులుగా  బెంగళూరులో రెస్ట్ తీసుకోవడాన్నే జగన్ ఎంచుకున్నారని లోకేష్ విమర్శించారు.