ఈ-చలాన్ నిధుల స్వాహా కేసులో ఎపి మాజీ డిజిపి అల్లుడు

ఎపి డిజిపిగా పని చేసిన సాంబశివరావు కుటుంబం ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ-చలాన్ నిధుల స్వాహా కేసులో ఏపీ మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ పై కేసు నమోదైంది. ట్రాఫిక్ ఈ-చలాన్ ఖాతాల పేమెంట్ గేట్ వేలను క్లోనింగ్ చేసి, వాటి ద్వారా చలాన్ సొమ్మును దారి మళ్లించారన్నది అవినాశ్ పై ఉన్న ప్రధాన ఆరోపణ.  ఇందులో మనీలాండరింగ్ కోణం నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు షురూ చేసింది. ఇప్పటికే ఏపీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది. ఈ కేసులో అవినాశ్ తో పాటు ఆయనకు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థను, మరికొందరిని నిందితులుగా పేర్కొంటున్నారు. రూ.36.5 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించినట్టు భావిస్తున్నారు.  అవినాశ్ కు చెందిన డేటా సంస్థలో పనిచేసే కొత్తపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈడీ... డేటా ఎవాల్వ్ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న అవినాశ్, అతని సోదరి అక్షిత, రవికిరణ్ అనే వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు.  సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ-చలాన్ల ద్వారా వచ్చే జరిమానాలను నాలుగు పేమెంట్ గేట్ వేల ద్వారా డీజీపీ అకౌంట్ లో జమ చేస్తారు. 2017లో ఎన్.సాంబశివరావు డీజీపీగా ఉన్నారు. ఆ సమయంలో ఉన్న నాలుగు పేమెంట్ గేట్ వేలలో రేజర్ పే అనే గేట్ వే కూడా ఉంది. రేజర్ పే... సాంబశివరావు అల్లుడు అవినాశ్ కు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థకు చెందినదిగా భావిస్తున్నారు.

సీపీఎం కటీఫ్.. అదే బాటలో సీపీఐ.. కాంగ్రెస్ వామపక్షాల పొత్తు అనుమానమే?

కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీపీఐ, సీపీఎం చెరోదారీ కానున్నాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో అలకబూనిక సీపీఎం కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేసింది. ఆ పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా ఐదు నుంచి ఎనిమిది స్థానాలలో పోటీకి రెడీ అయిపోతోంది. ఈ విషయంపై  బుధవారం (నవంబర్1) జరిగే సీపీఎం కార్యవర్గ సమావేశం తరువాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇలా ఉండగా అదే రోజు సీపీఐ కార్యవర్గ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఆ సమావేశాలలో సీపీఐ కాంగ్రెస్ తో కలిసి వేళ్లే విషయంపై తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీపీఎం తన అసంతృప్తిని ఇప్పటికే బహిర్గతం చేయగా, సీపీఐ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నది. ఆ పార్టీ కోరుతున్న విధంగా ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు సీట్లను కూడా కాంగ్రెస్ కేటాయించే అవకాశాలు కనిపించకపోవడంతో సీపీఎం కూడా తన దారి తాను చూసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.   వామపక్షాలతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ముందు వెనుకలాడటానికి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీలు అధిక స్థానాలు కోరుతుండటమే కారణంగా కనిపిస్తోంది. వామపక్షాలు కోరుతున్న స్థానాలను కాంగ్రెస్ కేటాయించే విషయంలో సందిగ్ధత నెలకొనడానికి ఆయా నియోజకవర్గాలలో పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకతే కారణంగా చెప్పవచ్చు. సీపీఎం తన బలాన్ని మించి స్థానాలు కోరుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ లో బలంగా ఉంది. అందుకే ఆ పార్టీ డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించి.. ఆ పార్టీ కోరుతున్న స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఇక సీపీఐ విషయంలో  కాంగ్రెస్ కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ కోరుతున్నట్లుగా కొత్తగూడెం స్థానాన్ని కేటాయించేందుకు ఒకింత తటపటాయిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ను రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావు కొ త్తగూడెం స్థానాన్ని ఆశిస్తున్నారు. బలమైన నాయకుడు కావడంతో ఆయనను పార్టీ అభ్యర్థిగా కొత్తగూడం నుంచి నిలబెడితే గెలుపు నల్లేరుమీద బండినడకే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో సీపీఐకి సీట్ల కేటాయింపు విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో ఒకింత అసంతృప్తి చెందిన సీపీఐ కూడా కార్యవర్గ సమావేశంలో కాంగ్రెైస్ తో కలిసి వేళ్లాలా? వద్దా అనే విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా వామపక్షాలతో పొత్తు లేకపోయినా తమ విజయానికి ఢోకా ఉండదన్న భావన కూడా కాంగ్రెస్ లో బలంగా వ్యక్తం అవుతుండటంతో.. వామపక్షాలతో పొత్తు అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

బాబు బెయిల్ కు ష్యూరిటీలు ఇచ్చింది ఎవరో తెలుసా? 

ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి 52 రోజుల తర్వాత మంగళవారం మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.  జగన్ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైంది.  కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా కేవలం ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో... విధించిన షరతుల్లో ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ కూడా ఒకటిగా ఉంది. ఈ సమయంలో ఇద్దరు టీడీపీ నేతలు ముందుకొచ్చారు! అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టు తీర్పు రాగానే విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు!ఈ సందర్భంగా... ఇద్దరూ చెరో రూ.లక్ష చెల్లించి, చంద్రబాబు కోసం ష్యూరిటీలను సమర్పించారు. తర్వాత న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు వీరిద్దరినీ ప్రశ్నించారు. అందులో భాగంగా ఇద్దరి పేర్లూ అడిగిన ఆమె.. ఎవరికి ష్యూరిటీ ఇస్తున్నారో తెలుసా..? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... చంద్రబాబుకు అని వారు చెప్పారు. అనంతరం... ష్యూరిటీగా ఎంత మొత్తం చెల్లించారు? అని ప్రశ్నించగా.. రూ.లక్ష చెల్లించామని సమాధానమిచ్చారు. కాగా... మంగళవారం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వార్త రాగానే 3 గంటల సమయంలో లోకేశ్‌, బ్రాహ్మణి, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి చంద్రబాబుతో ములాఖత్‌ కు జైల్లోకి వెళ్లారు. 4 గంటల సమయంలో వారు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు బయట ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులను భుజం తట్టి పలకరించారు. అంతకముందు అచ్చెన్నాయుడిని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు బయటకు రావడంతో సాయంత్రం 4:45 గంటలకు జైలు చంద్రబాబు వాహనశ్రేణికి బయలుదేరింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో... కొన్నిచోట్ల గంటకు పది కి.మీ. వేగంతో కూడా ప్రయాణం సాగలేని పరిష్తితి నెలకొంది. దీంతో సుమారు పదమూడున్నర గంటల ప్రయాణం తర్వాత బుధవారం ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

తెలంగాణ ఎన్నికల తరువాత షర్మిల అడుగులు ఏపీవైపు.. హస్తం ఆహ్వానించేనా?

తెలంగాణ ఎన్నికలు ఇక రోజుల వ్యవధిలోకి  వచ్చేశాయి. ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు చిన్నా చితకా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచార సన్నాహాలూ పూర్తి చేసుకుని ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి. అయితే  దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉంది. వేరే వేరే పార్టీలోని అసమ్మతి వాదులైనా తన పార్టీ  టికెట్ కోసం వస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తోంది. అయితే అటువంటి సంకేతాలేమీ ఎక్కడ నుంచీ కానరావడం  లేదు. వైఎస్సార్టీపీ తరఫున తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగడానికి ఆమె వినా మరెవరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తన తల్లి, భర్త అవసరమైతే పోటీ చేస్తారని గతంలో ప్రకటించిన షర్మిల ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని గమనించి వారిద్దరినీ పోటీలోకి దింపడం సరికాదని షర్మిల స్వయంగా భావించారో.. లేక వారే పోటీకి వెనకడుగు వేశారో కానీ ఇప్పుడు విజయమ్మ, బ్రదర్ అనిల్ ల పోటీ ఊసెక్కడా వినిపించడం లేదు.  సరే అదలా ఉంచితే.. ఏపీలో జగన్ ను అధికారంలోకి తీసుకురావడానికి కాలికి  బలపం కట్టుకుని తిరిగిన షర్మిల.. ఆ తరువాత ఏపీ  రాజకీయాలకు దూరం అయ్యారు. దూరం అయ్యారనే కంటే తాను ఎంతో కష్టపడి అన్న జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి దోహదపడితే..అధికార అందలం అందుకున్న తరువాత జగన్ షర్మిలను కూరలో కరివేపాకులా తీసి పారేసి ఏపీకి దూరం చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. స్వయంగా  షర్మిల కూడా పలు సందర్భాలలో అదే భావన వ్యక్తం చేశారు. సరే 2019 ఎన్నికలకు ముందు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ వ్యాప్తంగా తిరిగిన షర్మిల.. ఆ ఎన్నికల ఫలితాల తరువాత.. జగనన్న వదిలేసిన బాణంలా మిగిలిపోయారు.  ఏపీ నుంచి తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర  అంటూ గమ్యం లేకుండా తెలంగాణ అంతా నడిచేశారు. మధ్యమధ్యలో ఒక రోజు దీక్షలూ చేశారు. ఒకటి  రెండు సార్లు అరెస్టయ్యారు కూడా. అయితే  తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకువస్తామంటూ ఆమె చేసిన రాజకీయం ప్రజలను పెద్దగా మెప్పించలేదు. దీంతో రాజకీయ భవిష్యత్ కోసం ఆమె కాంగ్రెస్ వైపు చూశారు. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకుండా ఏపీకి పరిమితం  కావాలన్న కాంగ్రెస్ షరతును అంగీకరించకపోవడంతో అందినట్లే కనిపించి హస్తం  కూడా దూరం జరిగింది. ఇప్పుడు గురి ఏమిటో కూడా తెలియని బాణంలా షర్మిల మిగిలిపోయారు.  ఇప్పుడు తెలంగాణలో 119 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం మాట అటుంచి.. కనీసం తాను నిలబడే స్థానంలోనైనా విజయం సాధిస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  దీంతో ఆమె తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో కాలుపెట్టే అవకాశాలను తీవ్రంగా పరిశీలుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాలు దూరం అయ్యి..  ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ ఆమెకు ఇచ్చిన ఆఫర్ ను తెలంగాణ ఎన్నికల తరువాత ఆమె అంగీకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే దాని వల్ల షర్మిలకు ఒనగూరే ప్రయోజనం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ లబ్ధి పొందుతుందనీ, అదే సమయంలో జగన్ కు మాత్రం తేరుకోలేని, పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు.  

ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం?!

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు, వైరాలు ఎక్కువయ్యాయి. అందుకు తగ్గట్లే రాజకీయ పార్టీలు కూడా రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా కొన్ని పార్టీలు ప్రణాళికలు రచించుకుంటుంటే.. గెలుపు ఓటములను నిర్ణయించేలా మరొకొన్ని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకుంటే పార్టీని బట్టి ఏపీ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలకు మాత్రమే రాజకీయంగా చోటు ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నా అన్నీ కలిసినా రెండు  శాతానికి మించి ఓట్లు పడే అవకాశం లేదు. కనుక ఏపీ ఎన్నికలలో  తెలుగుదేశం, జనసేన, వైసీపీలే ప్రధానంగా రంగంలో ఉన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. కాగా జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ఏపీలో తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి. అయితే  అసలు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ఎన్నికల సమయానికి ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందన్న చర్చ సహజంగానే వస్తున్నది. అంతేకాదు  తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న చర్చలూ రాజకీయవర్గాలలో సాగుతున్నాయి.  ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో అధికార పార్టీ వైసీపీకి తీరని నష్టం తప్పదన్న చర్చ గట్టిగా జరుగుతోంది. కర్ణాటక ఫలితాలతో  ఫామ్ లోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకుంటే ఏపీ మీద ఫోకస్ పెట్టడం ఖాయం. అదే జరిగితే వైసీపీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం  ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీలో కాంగ్రెస్ నేతలే అధికం. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నాయకులంతా అనివార్య పరిస్థితుల్లో జగన్ గూటికి చేరారు. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ, స్వాతంత్య్రం గుర్తు చేసుకుంటూ అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతున్నారు. తెలుగుదేశంతో ఉన్న సైద్దాంతిక విభేదాలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీలోని కాంగ్రెస్ నేతలు చాలా మంది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బలోపేతం అయిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకుంటే ఏపీలో మళ్ళీ పార్టీని పరుగులు పెట్టించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది ఎలా ఉన్నా.. ఏపీలో కూడా కాంగ్రెస్ బలమైన నేతలను వెనక్కు రప్పించగలదు.. అంతో ఇంతో ఓటు బ్యాంక్ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతుంది. ఈ నాయకులు, ఓటు బ్యాంక్ వైసీపీ నుండి చీలిపోవడం గ్యారంటీ కనుక ఇది వైసీపీకి తీరని నష్టమే అవుతుంది. కారణాలేమైనా  బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీపై వ్యతిరేక భావనతోనే ఉంటుంది. ఎన్నికల సమయంలో కాస్త దగ్గరైనట్లు కనిపించినా బీఆర్ఎస్  చంద్రబాబును ఎప్పడూ ప్రత్యర్థిగానే చూస్తుంది. కాగా  తెలంగాణలోని తెలుగుదేశం సానుభూతి పరులు స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇన్నాళ్లూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. తెలుగుదేశం అభిమానులు బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టులో బీజేపీ హస్తం ఉందనే భావన కూడా ఉంది. దీంతో ఇక్కడ తెలుగుదేశం పోటీలో ఉండి ఉంటే.. వీరంతా తెలుగుదేశం భ్యర్థులకే గ్యారంటీగా ఓటేసేవారు. అలా జరిగి ఉంటే బీఆర్ఎస్ ఏదో మేరకు లబ్ధి పొంది ఉండేది.  కానీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీ  సానుభూతిపరులంతా కాంగ్రెస్ వైపే వెళ్లనున్నారు.   తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వలన జాతీయ స్థాయిలో బలపడి ఏపీ మీద ఫోకస్ చేయడం గ్యారంటీ. అది టీడీపీకి మరింత కలిసి వచ్చే అంశం. అదే సమయంలో వైసీపీకి నష్టం చేకూరడం కూడా ఖాయం.   అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎన్నికల కోడ్  ఉన్న రాష్ట్రాల్లో ఈ నెల 7 నుంచి ఎగ్జిట్ పోల్స్ నిషేధం

ఎగ్జిట్ పోల్స్ ను అడ్డుకట్టవేయడానికి  ఎన్నికల కమిషన్ ఎప్పటి మాదిరిగానే అడుగులు వేసింది.  ఎన్నికల కోడ్ అమలయ్యే ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 7న తొలి దశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మిజోరాంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 25న, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

రాజమండ్రి టు ఉండవల్లి.. 14 గంటల ప్రయాణం.. అడుగడుగునా జన నిరాజనం

నారా చంద్రబాబునాయుడు.. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ  రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజలకు దూరంగా ఎన్నడూ లేరు. అనారోగ్యం, కుటుంబ కార్యక్రమాలు  అంటూ ప్రజలకు కనిపించకుండా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలా లెక్క పెట్టినా కొన్ని వేళ్లు మిగిలిపోతాయి. అంటే కనీసం పది రోజులు కూడా ఆయన ప్రజలకు కనిపించకుండా.. మీడియాతో మాట్లాడకుండా ఎన్నడూ లేరు. అయితే స్కిల్ కేసులో ఆయనను జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి  52 రోజుల పాటు ఆయనను ప్రజలకు దూరం చేయగలిగింది. అయితే ఆయన ప్రజలకు కనిపించలేదు కానీ ప్రజా హృదయాలలో ఆయన ఉన్నారన్న విషయం ఈ 52 రోజులలో సందేహాలకు అతీతంగా తేటతెల్లమైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోటా ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలు జోరుగా సాగాయి. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికీ లేని విధంగా రాజకీయాలకు అతీలంగా, ప్రాంతాలకు సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారన్న విషయం తేటతెల్లమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధిలోనే కాదు.. దేశ ప్రగతిలో కూడా ఆయన అడుగు జాడ చరిత్రలో నిలిచిపోయే విధంగా ముద్రపడిందన్న సంగతి వెల్లడైంది. పాతికేళ్ల కిందట హైటెక్ సిటీతో మొదలైన ఆయన ప్రగతి ప్రస్థానం గురించి గతంలో తెలియని వారికి కూడా తెలిసింది. ఆయన నాటిన ఐటీ విత్తనం..నాడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని వెక్కిరించిన వారిచేతే నేడు ఆయన దార్శనికతకు తలవంచి వందనం  చేసే విధంగా మహా వట వృక్షమైంది. ఎందరికో నిడనిస్తోంది. లక్షల మంది జీవితాలలో స్థిరపడేలా చేసింది. ఐటీ అలంబనగా.. అన్ని  రంగాలూ పురోగమించేందుకు కారణమైంది. వెరసి హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగడానికి చంద్రబాబు నాటిన ఐటీ విత్తే పునాదిగా మారింది.  అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసింది. ఆధారాలు లేకుండా అరెస్టు చేయడమే కాకుండా.. ఎటూ అరెస్టు చేసేశాం కదా.. ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతాం.. అంత వరకూ జైల్లోనే ఉంచుతాం అంటూ.. కోర్టులలో వాదించింది. పెట్టిన సెక్షన్లు, కోరిన వాయిదాలతో జగన్ సర్కార్  చంద్రబాబును 52 రోజులు నిర్బంధంలో ఉంచింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేం  అన్నట్లుగానే అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ఒక మహానేతను ప్రజలకు దూరం చేయడం సాధ్యం కాదని.. ఆయన అరెస్టుకు  నిరసనగా వెల్లువెత్తిన ప్రజా చైతన్యం నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. చంద్రబాబు అక్రమ అరెస్టు లగాయతు..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని ఒక  జైలుగా మార్చేసిన విధంగా జగన్ సర్కార్ రాష్ట్రంలో ఆంక్షలను అమలు చేసింది. చంద్రబాబు అరెస్టును  నిరసిస్తూ విజిల్ వేస్తే.. నేరం, డప్పు కొడితే నేరం, నిరసన తెలిపితే  నేరం అన్నట్లుగా ఎక్కడికక్కడ ఆంక్ష లు విధించింది. రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టు చేసింది. అయినా నిర్బంధాలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో జనం  రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా  నిలబడ్డారు.  చివరికి  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం  (అక్టోబర్ 31) మధ్యంతర బెయిలు మంజూరైంది. అదే రోజు సాయంత్రం ఆయన రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన క్షణం నుంచీ ఏపీలో దిపావళి  సంబరాలు మొదలయ్యాయి. రోడ్డు  మార్గంలో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు. అప్పటి నుంచీ 14 గంటల పాటు ఆయన ప్రయాణం జన నిరాజనాల మధ్య, అభిమాన పూల వానలో సాగింది. రోడ్డు కిరువైపులా పెద్ద సంఖ్యలో జనం నిలబడి ఆయనను ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలవాన కురిపించారు. ఈ ప్రయాణంలో ఆయన కారులోంచి బయటకు వచ్చింది లేదు. కారులో కూర్చునే ప్రజలకు అభివాదం చేశారు. బుధవారం (నవంబర్1) వరకూ ర్యాలీలు నిర్వహించవద్దన్న కోర్టు ఆదేశాలకు కట్టుబడి  ఆయన కారులోంచి బయటకు రాలేదు. కానీ జనం మాత్రం ఆయనకు స్వాగతం పలకడానికీ, సంఘీభావం తెలపడానికీ రోడ్డుకిరువైపులా నిలబడి జేజేధ్వనాలు పలుకుతూనే ఉన్నారు. రాజమహేంద్రవరం  నుంచి ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి సరిహద్దులు దాటడానికే నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందంటే జనం ఆయనకు ఏ విధంగా నీరాజనాలు పలికారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క తూర్పుగోదావరి అని ఏమిటి ఉండివల్లిలోని ఆయన నివాసం వద్దకు చేరుకునే వరకూ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రోడ్లపై జనం జాతర కనిపించింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆయన కోసం వేచి చూడటం కనిపించింది. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మానసికంగా చాలా ధృఢంగా కనిపించారు. అనారోగ్యంతో ఒకింత నీరసంగా  కనిపించినా అది ఎక్కడా బయటపడనీయకుండా ఆయన ప్రజలకు అభివాదం చేశారు. పార్టీ నాయకులను పేరుపేరునా పలకరించారు. తప్పు చేయను, చేయనివ్వను అంటూ ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.  

సైకిలెక్కనున్నబాలినేని, మాగుంట?.. ఉమ్మడి ప్రకాశంలో తెలుగుదేశం క్వీన్ స్వీప్ పక్కా!

సుమారు రెండు నెలల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకి వచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. పూర్తి స్థాయి బెయిల్, క్యాష్ పిటిషన్ పై కోర్టులలో ఇంకా విచారణ జరుగుతుండగా.. వీటిలో కూడా చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పులు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ అక్రమ కేసులు కావడంతోనే కాస్త ఆలస్యమైనా ఈ కేసులు నిలబడవన్నది సీనియర్ న్యాయ నిపుణుల భావన. ప్రస్తుతానికి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, కేసుకు సంబంధించిన వ్యక్తులకు దూరంగా ఉండాలని కోర్టు నిబంధనలను విధించింది. అయితే, చంద్రబాబు జైలు నుండి విడుదల అనే వార్తతోనే టీడీపీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. దీంతో బుధవారం (నవంబర్ 1) నుండి టీడీపీ అసలైన సమరశంఖం పూరించనున్నట్లు కనిపిస్తుంది.  నిజానికి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కాకుండా ఉంటే ఈ పాటికి వైసీపీ నుండి టీడీపీకి భారీగా వలసలు ఉండేవి. చంద్రబాబు అరెస్టుకు ముందు 15 నుండి 20 మంది కీలక వైసీపీ నేతలు టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉండేవారు. ఈ సంగతి రెండు పార్టీలలో కూడా అందరికీ తెలిసిందే. అయితే, చంద్రబాబు అరెస్టుతో అప్పుడు ఈ వలసలకు బ్రేకులు పడ్డాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు బయటకి రావడంతో టీడీపీలో జోష్ పెరగడమే కాదు.. తెలుగుదేశం వైపు చూసే వైసీపీ నేతలు సైకిలెక్కే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. తెలుగుదేశం కూడా వైసీపీ కీలక నాయకులకు చేర్చుకొని గట్టి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి కీలక చేరికలు ఉండనున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలలో, అంతటి కఠిన పరిస్థితులలో కూడా ప్రకాశం జిల్లాలో 4 సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది. ఈసారి ఎలాగైనా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ కీలక నేతలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా వైసీపీలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాలినేనిని మంత్రి పదవి నుండి తొలగించడం, పార్టీలో కూడా అతనికి అధికారాలు లేకుండా చేయడం, అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి పట్టు బిగిస్తుండడంతో ఇక్కడ వైసీపీ రెండు వర్గాలు నిలువునా చీలిపోయింది. సుబ్బారెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని బాలినేని బట్టబయలు చేసి పార్టీలో దుమారం రేపారు. ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలు బాలినేనిని బుజ్జగించగా.. తాజాగా మరోసారి రాయబారం కూడా పంపినట్లు తెలుస్తున్నది. అయితే, బాలినేని మాత్రం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. బాలినేనితో పాటు ఎంపీ మాగుంట కూడా తెలుగుదేశంలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా ఎంపీ మాగుంటకు పార్టీలో పరాభవం జరుగుతుండగా బాలినేని ఆయనకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి వైసీపీని దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే ఈ జిల్లాలో తెలుగుదేశం ఈసారి క్లీన్ స్వీప్ ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ 8 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి 12కి 12 తెలుగుదేశం గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వంపై అసంతృప్తి   తీవ్రంగా వ్యక్తమవుతోంది. దీనికి తోడు వైసీపీలో అంతర్గత విబేధాలు కూడా తోడై కీలక నేతలే పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. జిల్లాల విభజన అంశంలో కూడా ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు సీఎం జగన్ ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేరలేదు. పైగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు జిల్లాలో అక్రమాలు, అరాచకాలకు దిగారని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీంతో ఒంగోలు, కందుకూరు లాంటి వైసీపీ కీలక స్థానాలు చేయిజారిపోనున్నాయని అంటున్నారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలైతే కనీస ప్రజల కంటికి కూడా కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఈసారి ప్రకారం జిల్లాను వైసీపీ మర్చిపోవాల్సిందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ బీజేపీ కుట్రే.. వైఎస్ ఆత్మ సంచలన వ్యాఖ్యలు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్మెంట్ స్కాం పేరుతో అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు నిర్బంధించారు.  ఎట్టకేలకు మంగళవారం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్, క్యాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే.. తొలి నుండి ఇది అక్రమ కేసేనని రిటైర్డ్ న్యాయమూర్తుల నుండి మాజీ ఐపీఎస్ ల వరకూ అందరూ చెప్తూనే వచ్చారు. అక్రమ అరెస్టు, అక్రమ కేసులే అయినా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం.. ఒక ప్రభుత్వం ఇంత యథేచ్ఛగా ఇష్టారీతిగా, విలువలు, నిబంధనలను పట్టించుకోకుండా ఎలా ప్రవర్తించగలుగుతోందన్న అనుమానాలు మొదటి నుంచీ వెలువడుతూనే ఉన్నాయి.   సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మద్దతూ లేకుండా ఇంతటి సాహసానికి దిగారంటే తొలి నుండి  కూడా ఎవరూ నమ్మడం లేదు.  ఏపీలో చీమ కుట్టాలన్నా కేంద్రం అనుమతి కావాల్సిందేనన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక చంద్రబాబు అరెస్టు అంశంలో కూడా బీజేపీ పెద్దల హస్తం తప్పకుండా ఉండి ఉంటుందనే అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.  ఇప్పటికే పలువురు  తెలుగుదేశం నేతలు ఇవే అనుమానాలను  బాహాటంగానే వెల్లడించారు.   ఇతర పార్టీలలో నేతలు, పలువురు అధికారులు కూడా ఈ అక్రమ అరెస్ట్ వెనక బీజేపీ అగ్రనాయకత్వం ఉందన్నదే తన అభిప్రాయమని చెప్పారు.  తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేదని చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతలు సానుభూతి ప్రకటించినా.. ఈ అరెస్టులో కేంద్రం హస్తం, బీజేపీ అగ్రనేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయమే బలంగా వ్యక్తం అయ్యింది.  ఈ క్రమంలోనే ఇప్పుడు మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితుడిగా.. వైఎస్ ఆత్మగా పేరున్న రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రం హస్తం ఉందన్న కేవీపీ.. జగన్ ని అడ్డం పెట్టుకొని కేంద్రం నాటకం ఆడుతుందని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. లోకేష్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని కేవీపీ ఘాటుగా విమర్శించారు. విజ‌య‌వాడ‌లో ఏపీ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ తొలి సమావేశాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేవీపీ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అరెస్టు వెనుక పెద్ద క‌థే న‌డిచింద‌న్నారు.  చంద్రబాబు అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆడుతున్న నాట‌కంగా ఆయ‌న అభివర్ణించారు. సీఎం జ‌గ‌న్‌ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాట‌కంలో చంద్ర‌బాబు పావుగా మారారని కేవీపీ అన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్ద‌ల వ్యూహం ఉంద‌ని, కానీ, దీనిపై మాట్లాడేందుకు కొంద‌రికి ధైర్యం స‌రిపోవ‌డం లేద‌ని కేవీపీ తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ కార్యవర్గ కార్యదర్శి నారా లోకేష్ కు అనేక రోజుల నిరీక్షణ తరవాత హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని.. ఈ అరెస్ట్ వెనక బీజేపీ నేతలు ఉన్నారనే దానికి అదే నిదర్శనమని కేవీపీ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా బీజేపీ పెద్దలు తెలుగుదేశం మీద ఫోకస్ పెంచారు. దేశవ్యాప్తంగా మిత్రులు అందరినీ దూరం చేసుకున్న బీజేపీ మళ్ళీ వారిని దగ్గర చేసుకొనే ప్రయత్నం చేసింది. కానీ  ఎవరూ నమ్మి ఎన్డీఏలో చేరడం లేదు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని బీజేపీకి అనుకూల జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. అది కూడా ఏకంగా చంద్రబాబు బీజేపీకి 40 సీట్లు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇది ఒకరకంగా బీజేపీ పాలిటికల్ గేమ్ ప్లాన్. అయితే  బీజేపీ ప్రచారానికి చంద్రబాబు నుండి స్పందన రాకపోవడంతో జగన్ ను అడ్డం పెట్టుకొని ఇలా తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను బలపరిచే విధంగా  సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేవీపీ లాంటి వాళ్ళు ఈ అరెస్టు బీజేపీ కుట్రేనని వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. 

బిఆర్ఎస్ లో చేరిన నాగం, పిజెఆర్ తనయుడు  

ఎన్నికల్లో టికెట్లు రాని అభ్యర్థులు పక్క పార్టీల వైపు చూడటం సహజం. దీన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ బిఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావ్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని మేము వదిలేసిన వారిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది అని ఆరోపణలు చేశారు.  కానీ మంగళవారం కాంగ్రెస్ వదిలేసిన ఇద్దరు నేతలను బిఆర్ ఎస్ చేర్చుకోవడం ఆశ్చర్యం కలిగించింది.  కాంగ్రెస్ వదిలేసిన ఇద్దరు నేతలను బిఆర్ఎస్ అక్కున చేర్చుకుంది.    మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి  ఇవ్వాళ బీఆర్ఎస్ లో చేరారు. వారికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం, విష్ణువర్ధన్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తన మిత్రుడు నాగం, యువనేత విష్ణువర్ధన్‌లకు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నానన్నారు. నాగం జనార్దన్ రెడ్డి 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని సామాన్య ప్రజల కోసం పోరాడిన నాయకుడు పి. జనార్దన్ రెడ్డి అన్నారు. పీజేఆర్ వ్యక్తిగతంగా తనకు మిత్రుడని చెప్పారు. అలాంటి పీజేఆర్ తనయుడు బీఆర్ఎస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డిల భవిష్యత్తు... బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ దక్కపోవడంతో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు. 

అదే హుషారు.. అదే చైతన్యం.. బాబు వచ్చేశారు!

నారా చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడూ నిలువెత్తు హుషారుగా, ఉత్సాహంగా కనిపించే చంద్రబాబు.. 53రోజుల అక్రమ నిర్బంధం తరువాత కూడా అదే హుషారు, ఉత్సాహంతో కనిపించారు. మనిషి ఒకింత నీరసించినట్లు కనిపించినా..  ఆయనలో ఉత్సాహం ఇసుమంతైనా తగ్గలేదు. అదే దరహాసం, అదే చైతన్యం ఆయనలో నిలువెల్లా కనిపించింది. తనదైన ప్రత్యేక స్టైల్ లో విక్టరీ సింబర్ చూపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చిన ఆయన 53 రోజుల తరువాత చూసిన మనవడు దేవాన్ష్ కే ముద్దు పెట్టుకున్నారు. ఎదురు వచ్చిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఆత్మీయంగా  అలింగనం చేసుకున్నారు. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబుకు అరెస్టైన 52  రోజుల తరువాత ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు మంగళవారం (అక్టోబర్ 31) మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.  ఈ 52  రోజులూ చంద్రబాబు కుటుంబ సభ్యులూ, తెలుగుదేశం నాయకులూ, శ్రేణులే కాదు.. యావత్ తెలుగు జాతీ చంద్రబాబు ఈ రోజు బయటకు వస్తారు, రేపు బయటకు వస్తారు  అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన  క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లు వాయిదాల మీద వాయిదాలు  పడుతూవస్తుండటంతో  ఒకింత అసహనానికి గురయ్యారు. మరింత ఆగ్రహానికిగురయ్యారు. చంద్రబాబు  అక్రమ అరెస్టునకు నిరసనగా గత 52 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సత్యాగ్రహాలు, సహా పలు రకాల కార్యక్రమాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిలుపై బయటకు రావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం  సెంట్రల్ జైలు వద్దకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకుడు, కార్యకర్తలు, సామాన్య జనం వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు.  ఆయనను చూసిన వెంటనే తెలుగుదేశం నాయకులు, శ్రేణులూ భావోద్వేగాలకు గురయ్యారు. పలువురు ఉద్వేగంతో కంటతడి పెట్టుకోవడం కనిపించింది. రాజమహేంద్రవరం జైలు వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనకు సంఘీభావంగా నిలిచన అందరికీ కృతజ్ణతలు తెలిపారు.  అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన బుధవారం (నవంబర్ 1) తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుని అవసరమైన వైద్య చికిత్సలు చేయించుకుంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.  అంతకు ముందు చంద్రబాబుకు బెయిలుపై స్పందించిన ఆయన సతీమణి భువనేశ్వరి.. చంద్రబాబుకు బెయిలు రావడం తనకే కాదు మొత్తం ప్రజలందరికీ అత్యంత సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ సంతోషం మన అందరిదీ అని స్పందించారు. ఇది జనం విజయమని అన్నారు.  చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.

మద్యం కేసులో చంద్రబాబును అరెస్టు చేయం: కోర్టుకు సీఐడీ

మద్యం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ చంద్రబాబు అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిల్ కేసులో ఆరోగ్య కారణాలతో బెయిలు ఇచ్చినందున మద్యం కేసులో చంద్రబాబును ఇప్పటికిప్పుడు అరెస్టు చేయబోమని ప్రభుత్వం తరఫున వాదించిన అడిషనల్ అడడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.  దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణకు హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇలా ఉండగా మరి కొద్ది సేపటిలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో జైలు వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్న తెలుగుదేశం నాయకులు, శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైపు వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ మార్గాలలో ఆర్టీసీ బస్సులు వినా మరో వాహనాన్ని పోలీసులు అనుమతించడం లేదు. జైలు పరిసర ప్రాంతాలలో కఠిన ఆంక్షలు విధించారు. దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వేశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. ఎన్ని ఆంక్షలు విధించినా తగ్గేది లేదనీ, చంద్రబాబు వెంట రావులపాలెం వరకూ వెళ్లితీరుతామని స్పష్టం చేస్తున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో జైలు పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం టు ఉండవల్లి.. బాబుకు అడుగడుగునా జననీరాజనం!

స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్  మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో  తెలుగుదేశం శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు బెయిలు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే   జైలు సిబ్బంది   చంద్రబాబు బ్యాకర్‌కు వెళ్లిఆయనకు ఆ సమాచారం తెలిపినట్లు తెలిసింది. మంగళవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 3 -4 గంటల మధ్య చంద్రబాబు విడుదలయ్యే అవకాశంఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్లాలనీ మార్గ మంతటా ఆయన అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ నీరాజనాలు  పలికేలా తెలుగుదేశం రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ఊరేగింపుతో చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారని తెలుస్తోంది. రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్‌ను ఇప్పటికే రెడీ చేసి, దీనిపై లోకేష్ తో తెలుగుదేశం నేతలు చర్చించారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే బెజవాడ నుంచి చంద్రబాబు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ వెళ్లి ఎల్వీ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా చంద్రబాబు  జైలు నుంచి విడుదల కాగానే  అక్కడ నుంచి భారీ ఊరేగింపుతో లాలా చెరువు ,మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి ), జొన్నాడ సెంటర్, రావులపాలెం, సిద్ధాంతం సెంటర్, పెరవలి, తణుకు , తాడేపల్లిగూడెం, నల్లజర్ల , భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల , దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం, రామవరప్పాడు రింగ్ రోడ్, పెనమలూరు, కనకదుర్గ వారధి గుంటూరు, మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మీదుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.  జైలు నుంచి విడుదల కాగానే ఆరంభమయ్యే యాత్ర  రాత్రి 9.20 గంటలకు ఉండవల్లిలో ముగియనుంది. 

చంద్రబాబు విడుదలైన క్షణం నుంచే జగన్ పతనం ఆరంభం :అచ్చెన్న

స్కిల్  కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుకు  బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో  మాట్లాడిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు  వ్యక్తిగత కక్ష తో ఆధారాలు లేకుండా జగన్ సర్కార్ కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబును రాజకీయ కక్షసాధింపుతోనే అరెస్ట్ చేసి జైలుకు పంపారనే విషయం ప్రజలందరికీ తెలిసిందన్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టి లబ్ధిపొందాలని సీఎం  జగన్ కుట్రలు చేశారని ఆరోపించారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఒక్కతప్పు కూడా చేయలేదని...అంతేకాదు పార్టీలో  మధ్యంతర బెయిల్ పై హైకోర్టు తీర్పు  రిజర్వ్ చేస్తే...రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో వైఎస్ జగన్ అని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని... బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే  జగన్  పతనం ప్రారంభం అవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు.   

ఈ సాయంత్రం చంద్రబాబు విడుదల.. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో బెజవాడకు

టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. అనారోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల పాటు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  దీంతో హైకోర్టు ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఉత్తర్వులు అందిన తర్వాత సాయంత్రం బాబును విడుదల కానున్నారు. ఇప్పటికే చంద్రబాబు కుటుంబసభ్యులు నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ టీడీపీ శ్రేణులందరూ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. రాజమండ్రి  జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోనున్నారు.   విజయవాడలో విశ్రాంతి తీసుకుని బుధవారం (నవంబర్1) తిరుపతి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. కంటి ఆపరేషన్ కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారు. ఇలా ఉండగా చంద్రబాబుకు మధ్యంతర బెయిలు రావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.  

చంద్రబాబు ఎస్కార్ట్ పై నో కాంప్రమైజ్.. కేంద్రం నిబంధనల ప్రకారం ఉండాల్సిందే!

స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి విదితమే. చంద్రబాబు  ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోనికి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఆయనకు నాలుగు వారాలు మథ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు సెక్యూరిటిపై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఇద్దరు డీఎస్పీలను ఉంచాలని కోరారు. అయితే అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించిన హైకోర్టు  జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. కేంద్రం నిబంధనల మేరకు ఆయన భద్రత ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిలుపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. భార్య బ్రాహ్మణితో కలిసి ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు.  

బిఆర్ఎస్ కు బిగ్ షాక్... కాంగ్రెస్ గూటికి జలగం ?

భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడం, కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. . ఈ రోజు సాయంత్రం జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీలో చేరిన జలగం వెంకట్రావు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. అధికార పార్టీలో జలగం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని జలగం నిర్ణయించుకున్నారు. తన అనుచరులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశమై చర్చించి కాంగ్రెస్ నేతలకు ఓకే చెప్పారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఆ టికెట్ ను జలగం వెంకట్రావుకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం నుంచి 2014లో జలగం వెంకటరావు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈసారి టిక్కెట్ జలగం వెంకటరావు కు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రధాన మైన నేతలు బీఆర్ఎస్ ను వీడారు. జలగం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిలు.. స్వాగతించిన పురంధేశ్వరి

స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంత బెయిలు మంజూరు చేసింది. కాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిలును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వాగతించారు. అసలు చంద్రబాబును అరెస్టు చేసిన తీరునే తాము తప్పుపట్టిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, కనీసం విచారించకుండా, చివరాఖరికి ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు అరెస్టు చేసిన విధానమే కరెక్ట్ కాదని ఈ సందర్భంగా పురంధేశ్వరి పేర్కొన్నారు.