చక్రం తిప్పింది కేవీపీయే.. షర్మిల ఎంట్రీతో జగన్ కు శంకరగిరి మాన్యాలే!

కేవీపీ రామచందర్‌ రావు  ను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి  ఆత్మగా చెబుతుంటారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా  ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రాజకీయంగా ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ కు ఏపీలో పూర్వ వైభవం తీసుకురావడానికి తెరవెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారని తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధమౌతోంది.  ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే షర్మిలకు రూట్ క్లియర్ చేస్తూ రాజీనామా చేసిన  గిడుగు రుద్రరాజు  కేవీపి రామచందర్‌ రావుకు సన్నిహితుడు. అసలు గిడుగు రుద్రరాజు రాజకీయాలలోకి వచ్చిందే కేవీపీ రామచంద్రరావు ద్వారా. ఆయన ఆశీస్సులతోనే గిడుగు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ అయ్యారు.  ఇప్పుడు ఏపీ సీఎం   జగన్‌ సోదరి  షర్మిల   కాంగ్రెస్‌లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టారు. షర్మిల ఏపీ సీఎం సోదరి మాత్రమే కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ కూడా. ఆ షర్మిలకు మార్గం సుగమం చేయడానికే  పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ఆదివారం (జనవరి 21) బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శనివారం (జనవరి 20)   షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయ  కు వెళ్లిన ఆమెతో కేవీపి రామచందర్‌ రావు కూడా ఉన్నారు.   అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవసరమైన వ్యూహరచన అంతా కేవీపీదేనని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అన్నీ కేవీపీ చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు.   రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరిపోస్తారా, పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తారా అన్నది పక్కన పెడితే..   పిసిసి అధ్యక్షురాలిగా పార్టీలో ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని కొనసాగిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోవడానికి ముఖ్యకారణం వైఎస్ జగన్. విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోగానే..  పార్టీలోని వైఎస్ అనుచరులు అంతా ఆయన వెంట పార్టీని వీడారు. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఆయన వెనుకనే నడిచేది. కొద్ది మంది ఆయనతో విభేదించినా, వారి గొంతు వినిపించే పరిస్థితి కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉండేది కాదు. పార్టీలోని తన వ్యతిరేకులందరినీ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు క్రియా రహితంగా చేసేశారు. ఆ కారణంగానే వైఎస్ జగన్ వైసీపీ అంటూ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయన వెంట అప్పటి వరకూ కాంగ్రెస్ లో క్రియా శీలంగా ఉన్న నేతలంతా వెళ్లిపోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు మిగిలినా వారు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారిపోయింది. మిగిలిపోయింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గత పదేళ్లుగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఎంత కారణమో, వైఎస్ జగన్ కూడా అంతే కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే జగన్ తన పాలనలో తనను నమ్మి వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అలాగే ప్రజాదరణనూ కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఉనికి మాత్రంగా మారిపోవడానికి కారణమైన జగన్ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ లెగసీనే నమ్ముకుంది. అందుకే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ వ్యూహం ఇంత పక్కాగా, పకడ్బందీగా, సజావుగా అమలు కావడంలో తెరవెనుక చక్రం తిప్పింది వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సరే కేవీపీ వ్యూహం ఫలించి ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. అందుకున్నారు సరే.. సొంత అన్న జగన్ పార్టీని ఆమె ఏ మేరకు దెబ్బ తీస్తారు. వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతలలో ఎంత మంది షర్మిల కారణంగా సొంత గూటికి చేరుకుంటారు. ఆమె ప్రభావం ఏపి రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయతే విశ్లేషకులు మాత్రం షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు దాదాపు మృగ్యం అనే అంటున్నారు.  షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడంతోనే వైఎస్ రాజకీయవారసురాలు షర్మిల మాత్రమేనన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు. ఇక షర్మిల కారణంగా రానున్న ఎన్నికలపై ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల మేరకు వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సాధారణంగా ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉంటే చీలిపోయేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. దాని వల్ల లబ్ధి పొందేది అధికార పార్టీయే. కానీ షర్మిల ఎంట్రీతో ఏపీలో మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటులో భారీ చీలిక వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జగన్ పార్టీని ఓటమికి మరింత చేరువ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం కారణమౌతుందని అంటున్నారు.  

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఆక్రోశం!

తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో కానీ, బయట కానీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క గొంతు వినిపించినా సహించలేదు. ఇచ్చిన వాగ్డానాలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించిన వారిపై తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకం అంటూ ఘనంగా చాటుకున్న కాళేశ్వరం లోపాలను ఎత్తి చూపితే కొత్త ప్రాజెక్టులలో ఇవి సహజం అన్నారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీకైతే ఇప్పుడే ఇలా జరిగిందా అంటూ ఎదురు దాడికి దిగారు. అసలు అధికారంలో  ఉన్నంత కాలం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడానికే ప్రయత్నించిన బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు విపక్షంలోకి రాగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నది.  ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధ్యమైనంత త్వరగా రేవంత్ సర్కార్ కు మంగళం పాడేసి అధికారం అందుకోవాలని తహతహలాడిపోతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో వాగ్దానాల అమలును తెలంగాణ ద్రోహులుగా ముద్రించేందుకు వెనుకాడని కేటీఆర్ ఇప్పడు అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీగా పట్టుమని 10 సంవత్సరాల చరిత్ర కూడా లేని బీఆర్ఎస్ వందేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ వంటి వారిని ఎందరినో చూశానంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని దాదాపు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు వంద రోజుల్లో హామీలు నెరవేర్చమని రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నది.  తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యల గురించి కనీసం పట్టించుకోని కేటీఆర్ ఇప్పడుడు 50 రోజుల పాలనలో  రేవంత్ పాలనలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని ఊరికే అనలేదు మరి.

బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకోవాలి.. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసిన బౌద్ధ వారసత్వానికి కాపాడుకోవాలి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర పురావస్తు శాఖ, సావిత్రీ పులె విశ్వవిద్యాలయం(పుణె) సంయుక్తంగా నిర్వహించిన మహారాష్ట్ర బౌద్ధ వారసత్వం అన్న అంతర్జాతీయ సదస్సులో ఒక విభాగానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మహారాష్ట్రలో  బౌద్ధ గుహలు.. సాంకేతిక అంశాలు అన్న అంశంపై శనివారం (జనవరి 19) ప్రసంగించారు.  క్రిస్తుపూర్వం 2- క్రీస్తు శకం 7 శతాబ్దాల మధ్య పశ్చిమ మహారాష్ట్లో 1200 బౌద్ధగుహలున్నాయనీ, బౌద్ధ భిక్షువులు వారి నివాసం కోసం తొలచి, బౌద్ధ చిహ్నాలు, బుధ్ధ, బోధిసత్వ శిల్పాలు, చిత్రాలు తీర్చిదిద్దారని అన్నారు. కాగా సదస్సు నిర్వాహకులు డాక్టర్ శివనాగిరెడ్డిని సత్కరించారు. 

దేశం గూటికి వైసీపీ ఎమ్మెల్యే? 

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ  ఎమ్మెల్యే ఎలిజా టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ తరపున ఎలిజా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.  వైసీపీలో ఇంఛార్జిల మార్పులు చేర్పులు ఆ పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయి. మార్పుల పేరుతో సీఎం జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. కొందరికి స్థానచలనం చేశారు. మరికొందరిని ఎంపీలుగా బరిలోకి దింపుతున్నారు. ఈ పరిణామాలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టికెట్ రాని నేతలు, ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని వారు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఎమ్మెల్యే అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెత్తందారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. తనకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. తనకు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ లకు మధ్య విభేదాలున్నాయని, దానిని సాకుగా చూపి కొందరు తనపై అధినాయకత్వానికి తప్పుడు సమాచారాన్ని అందించారన్నారు. తనపై పెద్దయెత్తున కుట్ర జరిగిందని అన్నారు. సర్వే నివేదికలను.... సర్వే నివేదికలను కూడా పక్కన పెట్టి తప్పుడు నివేదికలు తయారుచేసి అధినాయకత్వానికి అందించారని ఎలీజా ఆరోపించారు. తాను ఐఆర్ఎస్ అధికారికా పనిచేస్తూ సర్వీసు మూడేళ్లున్నప్పటికీ దానిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అధినాయకత్వం ఈ కుట్రలను గమనించాలని ఎలీజా కోరారు. లేకపోతే పార్టీఇక్కడ ఇబ్బందుల్లో పడుతుందని ఆయన హెచ్చరించారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే టిడిపి ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. చర్చలు ఫలిస్తే టిడిపి తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. 

పాపం కేశినేని నాని.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!

విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్న మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారిన తర్వాత  ఆయన పట్ల అప్పటి వరకూ ఉన్న ఆ భావన అందరిలోనూ మటుమాయం అయ్యింది.  అవధులు లేని అహంభావం, పొగరుబోతుతనం తప్ప ఆయనలో ఆలోచన లేదని వైపీపీలో చేరిన తరువాత ఆయన అత్యంత అప్రాధాన్యంగా ఆ పార్టీలో మెలుగుతున్న తీరుతో అందరికీ అవగతమైంది.  కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించేవారు. సీఎంఓ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడినా, తాను నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానని చెప్పగలిగే స్వేచ్ఛ ఉండేది.  అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను కూడా పెద్దగా ఖాతరు చేసే వారు కాదు. తనకు తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునే వారు.  ఆ కారణంగానే పార్టీలో సీనియర్లు చాలా మంది ఆయనకు దూరంగా మెలిగే వారు.  అయితే అదంతా కేశినేని బిల్డప్ మాత్రమేనని నాని వైసీపీ గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే బట్ట బయలైపోయింది. విజయవాడ ఎంపీగా తనతోపాటు.. మరో ఐదుగురు నేతలకు, అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన వైసీపీ అధినేతకు సిఫార్సు చేశారట. కానీ ఆయన సిఫారసు చేసిన వాటిలో తిరువూరు వినా  మరో సీటు ఇచ్చేందుకు ససేమిరా అన్న సర్దుకు పోయారు. ఇక ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేశినేని నాని హాజరయ్యారు. మామూలుగా అయితే అక్కడ ఆయన పరిస్థితి గుంపులో గోవింద మాదిరిగానే ఉంది.   తెలుగుదేంలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ హోదాలో ఉన్న నానికి సముచిత ప్రాధాన్యత లభించేది. వేదికపై ఎన్టీఆర్ పక్కనే స్థానం కూడా లభించేది. అయితే ఇప్పుడు  నానికి  వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యతా లభించడం లేదు. విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  కేశినేని నానికి కూడా ఆ విషయం ఇప్పటికే స్పష్టంగా అర్ధమై ఉంటుంది. అయితే కోరి కొనుక్కున్న కొరివి కనుక మండినా బయటపడే అవకాశం లేదు. లోలోన మాత్రం ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట పాడుకుంటూ ఉండే ఉంటారు. ఆ అవమానాలే అలా ఉంటే తాజాగా విజయవాడలో గురువారం జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని మరింత ఘోరంగా అవమానించింది. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటూ విషాద గీతాలు పాడుకుంటూ, వైసీపీ రాజ్యాంగానికి అనుగుణంగా అణిగిమణిగి ఒదిగి ఒదిగి ఉండేందుకు కేశినేని నాని మానసికంగా సిద్ధమైపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అరకులో దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్ 

చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారి తప్పింది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు  హాజరయ్యేందుకు  చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైలట్ రూట్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఏటీసీ సూచనలు అర్థం చేసుకోలేకపోవడంతో సమస్య ఏర్పడింది. రాంగ్ రూట్‌లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ కరెక్ట్ రూట్‌లో అరుకులో ల్యాండ్ చేయగలిగారు. దీంతో కాసేపు ఉత్కంఠ ఏర్పడింది. రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి అరకు వెళ్లేందుకు హెలికాఫ్టర్ రెడీ చేసుకున్నారు. సాధారణంగా వాయుమార్గంలో ప్రయాణించాలంటే సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి. వారు రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ ప్రకారం అరకు వెళ్లేందుకు హెికాఫ్టర్ కు కూడా రూట్ ఖరారు చేశారు. అయితే పైలట్ గందరగోళానికి గురి కావడంతో  నిర్దేశిత మార్గం లో కాకుండా వేరే మార్గం లో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణించింది.  విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గం లో రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లిన హెలికాప్టర్ వెళ్లింది. ఈ విషయాన్ని ఏటీసీ వెంటనే గుర్తించింది.  ఏటీసీ హెచ్చరించడం తో అప్రమత్తం అయిన పైలట్ సరైన రూట్‌లో తీసుకెళ్లారు. అరకు తో పాటు మన్యం మొత్తం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడం , చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో  హెలికాఫ్టర్ దారి ప్పిందని తెలియడంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే కాసేపటికే మళ్లీ సరైన దారిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సానియాకు విడాకులు.. షోయెబ్ మాలిక్ రెండో వివాహం

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయెబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పాకిస్థాన్ సినీ నటి సనా జావేద్ తో తన వివాహం జరిగిందంటూ అందుకు సంబంధించిన ఫొటోలను  ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. గత కొన్నేళ్లుగా షోయెబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ వార్తలపై  అటు సానియామీర్జా కానీ, ఇటు షోయెబ్ మాలిక్ కానీ స్పందించలేదు. ఇప్పుడు తన రెండో వివాహం గురించి షోయెబ్ మాలిక్ స్వయంగా వెల్లడించడంతో వారిరువురి విడాకులు వాస్తవమన్న విషయం తేటతెల్లమైంది.  కాగా సానియా మీర్జా కూడా షోయెబ్, తాను విడిపోతున్నామన్న సంకేతం ఇచ్చేలా రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో సానియా వివాహం, విడాకులు రెండూ కఠినమైనవేనని పేర్కొన్నారు. షాయెబ్, సానియా మీర్జా పెళ్లి తరువాత దుబాయ్ లో నివాసం ఉన్నారు. సానియామీర్జా టెన్నిస్ లో భారత్ కు, షోయెబ్ క్రికెట్ లో పాకిస్థాన్ కు ప్రాతినిథ్యం వహించారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కొద్ది రోజుల కిందట సానియా మీర్జా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే షోయెబ్ కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం షోయెబ్ మాలిక్ రెండో పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

షర్మిల పొలిటికల్ కెరీర్ కు పరిక్షా సమయం!

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నది నినాదం. అయితే ఇప్పుడు ఇది వైసీపీలోని క్యాప్టివ్ నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరిగ్గా వర్తిస్తుంది. ఛీ అన్నా, తూ అన్నా జగన్ పార్టీ చూరుపట్టుకు వేళాడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్న పలువురికి ఇప్పుడు కాంగ్రెస్ పర్ ఫెక్ట్ డెస్టినేషన్ లా కనిపిస్తోంది.  జగన్ వ్యూహాత్మకంగా గత నాలుగున్నరేళ్లలోనూ పార్టీలో గుర్తింపు, ప్రాముఖ్యత ఉండాలంటే విపక్షాలను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అగ్ర నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాల్సిందే అన్న పరిస్థితి కల్పించారు. దీంతో జగన్ ప్రాపకం సంపాదించడానికో, పదవుల కోసమో పలువురు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాలపై మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై అనుచితంగా నోరు పారేసుకున్నారు. సభ్య సమాజం అంగీకరించని భాషలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను సైతం లేవనెత్తి దుర్భాషలాడారు.అలాంటి వారిలో అత్యధికులకు ఇప్పుడు జగన్ వచ్చే ఎన్నికలలో పోటీకి పార్టీ టికెట్లు నిరాకరించారు, లేదా నియోజకవర్గం మార్చేశారు. ఇలాంటి వారి సంఖ్య ఇప్పటికే 58 దాటింది. రానున్న రోజులలో ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో జగన్ ను నమ్ముకుని విపక్షాలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. వైసీపీలో ఉండలేక, పార్టీ మరదామంటే చేర్చుకునే వారు లేక రోడ్డున పడ్డట్లుగా మిగిలిపోయారు.  పోనీ పోటీకే దూరంగా ఉందామా అంటే రాజకీయ జీవితానికి  చేజేతులా చరమగీతం లిఖించుకున్నట్లు అవుతుందన్న భయం. అందుకే ఇష్టం లేకపోయినా జగన్ చెప్పినట్లు నియోజకవర్గం మారి ఓటమి తథ్యమని తెలిసీ పోటీకి రెడీ అవుతున్నారు. టికెట్ దక్కని వారు ఇంత కాలం నమ్మి మోసపోయాం, మరో సారి మోసపోదాం అన్నట్లుగా మౌనంగా ఉంటున్నారు. అదే సమయంలో విపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అంశాల వారీ విమర్శలకు మాత్రమే పరిమితమైన వారు మాత్రం జగన్ ఆదేశాలను ధిక్కరించి బయటకు వచ్చేశారు. వచ్చేస్తున్నారు. అలా ఇప్పటికే బయటక వచ్చేసిన వారిని మినహాయిస్తే.. ఉండలేక, బయటకు రాలేక ఊగిసలాడుతున్న వారికి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో కొత్త ఆశలు చిగురించినట్లైంది. ఇప్పుడు వారి చూపు కాంగ్రెస్ వైపు ఉంది. ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక కాంగ్రెస్ అటువంటి వారికి తలుపులు బార్లా తెరుస్తుందా? అన్న సంశయాలు ఎవరి నుంచీ వ్యక్తం కావడం లేదు. ఇందుకు కారణం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గత ఎన్నికలలో ఏపీలో  పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ కూడా నోటాతో పోటీ పడింది. అంతే కాదు వరుసగా రెండు ఎన్నికలలో రాష్ట్రంలో జీరో స్థానాలతో అట్టడుగున నిలిచింది. అంటే ఆ పార్టీకి ఏపీలో ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇంత కంటే పతనమయ్యే చాన్సూ లేదు.  కానీ షర్మిల పరిస్థితి అలా కాదు. కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతపట్టి ఆ పార్టీ పుంజుకునేలా చేయడంపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.   ఇప్పటికే తెలంగాణలో షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘ  పాదయాత్ర చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె అక్కడ పోటీ నుంచి తన పార్టీని దూరంగా ఉంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక వేళ ఆ ఎన్నికలలో షర్మిల పార్టీ పోటీ చేసి విఫలమై ఉంటే.. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో  చేరి ఏపీలో సారథ్య బాధ్యతలు చేపట్టినా ప్రయోజనం ఉండేది కాదు.  తెలంగాణలో పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకున్నారు. ఇక నుంచి ఆమె రాజకీయ పురోగతి అంతా ఏపీలో కాంగ్రెస్ ను ఆమె ఎలా నడిపించారు అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.  కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇలా షర్మిల పార్టీలో చేరగానే అలా ఏపీ సారథ్యం అప్పగించడం ద్వారా అమెపై అపారమైన విశ్వాసాన్ని ఉంచింది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి షర్మిల చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో  ఆమె ఎదుర్కోవలసింది, పోరాడాల్సింది తోడబుట్టిన జగన్ మోహనరెడ్డితో, ఆయన పార్టీ వైసీపీతో.  ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. షర్మిల ముందున్న టాస్క్ఆషామాషీది ఏమీ కాదు. అతి స్వల్ప సమయం అంటే మహాఅయితే రెండు మూడు నెలలలో ఆమె ఏపీలో తన మార్క్ చూపాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోయినా.. కొన్ని స్థానాలలో గెలిపించుకోవలసి ఉంటుంది. ఇందు కోసం ఆమె తీసుకునే ప్రతి నిర్ణయానికీ అధిష్ఠానం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు.   పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలి వంటి అంశాలలో షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ పూర్తి స్వేచ్ఛను ఇస్తుందనడంలో సందేహం లేదు. సో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది పూర్తిగా ఆమె తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథిగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ మేరకు కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నదానిపైనే షర్మిల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికలు షర్మిలకు నిజమైన పరీక్షగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

కమలాపురంలో బాబు సభకు జన ప్రభంజనం

ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. రా కదలిరా అని తాను పిలుపునిస్తే కమలాపురం జనం వెల్లువలా కదిలారని చెప్పారు. ఇక కడపలో అయితే గడపగడపా జగన్పై యుద్ధానికి రెడీ అంటోందని చెప్పారు. రాష్ట్రంలో యువత, యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సహకారంతో పని చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో కడప జిల్లాలలోని అన్ని స్థానాలలోనూ గెలిచిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడపను కడనే ఉంచేసింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. తాగునీరు, సాగునీరు ఊసే లేదు. రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి. జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత సొంత జిల్లాలో జగన్ కు తప్ప మరెవరికీ సంతోషం లేదు. జిల్లాలో బాగుపడిన వారెవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు.   జగన్ రెడ్డి మాటలు కోటలు దాటాయిగానీ, చేతలు గడప  దాటలేదు.  సొంత నియోజకవర్గం పులివెందులలోనే పరదాలు, సెక్యూరిటీ లేకుండా కాలు కదపలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్ గెలిచే పరిస్థితి కూడా లేదు.  తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జనం, రైతులు అల్లాడుతుంటే జగన్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదు సరి కదా కరువు మండలాల ప్రకటన గురించి అధికారులు ప్రస్తావిస్తే నా సొంత జిల్లాలో కరువా అంటూ కసురుకున్నారు.  ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేశామని ఇప్పడు జనం పశ్చాత్తాపపడుతున్నారు.  అంటూ చంద్రబాబు చెప్పిన ప్రతి మాటకూ జనం చ ప్పట్లతో మద్దతు తెలిపారు. చంద్రబాబు తన ప్రసంగంలో హు కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తే జనం నుంచి జగన్ జగన్ అంటూ బదులొచ్చింది.   వివేకా హత్య కేసులో మలుపులు టాలీవుడ్,  బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపించేలా ఉన్నాయి.  వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ  ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.  సరే గత ఎన్నికల ప్రచారంలో  తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ  సానుభూతి సంపాదించి గెలిచిన  జగన్ రెడ్డికి ఇప్పుడు  వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టుకి వెళ్లిందెవరు,  అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నదెవరు జగన్ కదా అని చంద్రబాబు అన్నారు.  అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్ ఆర్దర్ తెచ్చారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి? అని చంద్రబాబు డిమాండ్ చేశారు.   జగన్ హయంలో నిత్యావసర ధరలన్నీ పెరిగాయి. అదే తెలుగుదేశం పాలనలో  సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. తెలుగుదేశం హయాంలో ఉన్న పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ ఇప్పుడు ఏమయ్యాయి. తెలుగుదేశం హయాంలో  రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. ఇప్పుడు ఇస్తున్నారా?  అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే జనం లేదు లేదు అంటూ ఎలుగెత్తారు.  జగన్ రెడ్డిది బటన్ నొక్కుడు కాదు, బటన్ బొక్కుడు అంటూ చంద్రబాబు విమర్శిస్తే జనం తప్పట్లతో ఔనన్నారు.    మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సొంత బొక్కసం నింపుకుంటున్నారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ ఇలా అన్నిటి రేట్లు  పెంచేయడంతో పాటు ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను వేధించుకు తింటున్నారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు కురిపించారు.    సీమకు జగన్ చేసిందేమీ లేదనీ,  కడప స్టీల్ ఫాక్టరీకి రెండు సార్లు రిబ్బన్ కట్ రిబ్బన్ కట్ చేయడం రంగులు వేసుకోవటం తప్ప అని ఎద్దేవా చేశారు.  రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసి ప్రాజెక్టులను పరిగెత్తించాం. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా అని బాబు నిలదీశారు. తెలుగుదేశం హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. దాని వల్ల అన్ని కాలువల్లో నీళ్లొచ్చాయి. కానీ ఇప్పుడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయంటూ చంద్రబాబు జగన్ పాలనను దుయ్యబట్టారు.    

రాహుల్ గాంధీకి థాణే కోర్టు జరిమానా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే... 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగింది. ఆమె హత్యతో ఆరెస్సెస్ కు సంబంధం ఉందని రాహుల్ అన్నారంటూ సంఘ్ కార్యకర్త వివేక్... రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. అయితే, కోర్టుకు తన సంజాయిషీ ను రాహుల్ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో, 881 రోజుల ఆలస్యానికి గాను కోర్టు ఆయనకు రూ. 500 జరిమానా విధించింది. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ కోర్టులో తన వాదనలు వినిపించారు.  తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. ఈ కారణంగానే సంజాయిషీ  ఇవ్వడంలో ఆలస్యమయిందని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు రాహుల్ కు రూ. 500 జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న మరోసారి కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోగా రాతపూర్వక స్టేట్మెంట్ ను ఇవ్వాలని ఆదేశించింది.  సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పరువునష్టం అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తి ముందుగా కోర్టుకు తన సంజాయిషీను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులను ప్రశ్నించడం, క్రాస్ క్వశ్చన్ చేయడం వంటివి ప్రారంభమవుతాయి.

కెసిఆర్ కు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానం 

ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయోధ్య కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అయోధ్య వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కేసీఆర్ ను ఆహ్వానించింది.  అయితే, ఇటీవల కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన చేతికర్రతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన అయోధ్యకు వెళ్లడం దాదాపు అసంభవమనే చెప్పాలి.   కెసిఆర్ అయోధ్యకు వెళ్లే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.   ఇప్పటికే దేశం మొత్తం శ్రీరామ నామస్మరణలో మునిగి తేలుతోంది. ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ ద్వారా లేదా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు 22న సెలవు ప్రకటించాయి. శిల్పి యోగ్ రాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే విగ్రహం ఆలయంలోని గర్భ గుడిలో కొలువుతీరింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అవసరమైన క్రతువులు కొనసాగుతున్నాయి.

జనవరిలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ.. బీజేపీ రాజకీయ లబ్థి కోసమేనా?

బీజేపీ ఈరోజున జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అందులో అనుమానం లేదు. వరసగా రెండు సార్లు అంటే 2014, 2019  సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది.  ఎన్డీయే కూటమికి నేతృత్వం వహిస్తూ, కేంద్రంలో ఆ కూటమి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పటికీ  బీజేపీకి స్వయంగా సంపూర్ణ మెజారిటీ  ఉంది. ఆ రకంగా చెప్పాలంటే దేశంలో  మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను బీజేపీ తిరగరాసింది.  కేంద్రంలోనే కాకుండా దేశంలోని  సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది. ఇవన్నీ వాస్తవాలే.. అయితే ఈ విజయం వెనుక విపక్షాల బలహీనత, అనైక్యత ఎంత కారణమో అంత కంటే ఎక్కువగా అయోధ్య రామమందిరం పేరిట ఆ పార్టీ దేశ ప్రజలలో ఎగదోసిన భావోద్వేగం కారణం అనడానికి సందేహం అవసరం లేదు.   1990వ దశకంలో దేశాన్ని కదిలించిన  రామజన్మ భూమి ఆందోళన..అద్వానీ రథ యాత్ర. దేశంలో బీజేపీ బలోపేతం కావడానికి పునాదులు వేశాయి. అవును నిజం.  1990 లో  అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం  మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ  అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ప్రకటించి ఊరుకోకుండా,  బీజేపీ  అప్పటిఅధ్యక్షుడు ఎల్కే అద్వానీ 1990లో రథ యాత్ర  చేపట్టారు.ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం, (బాబ్రీ మసీదు) కూల్చివేత వరకూ సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే  బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. కారణమైంది.   ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే  రామజన్మభూమి అయోధ్యలో  రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది.  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది.  ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంకుస్థాపన చేశారు.   2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఇదే రామమందిర నిర్మాణం నినాదంతో ఎన్నికలకు వెడుతోంది.  రామమందిర నిర్మాణం పూర్తి చేశామని చెప్పుకుని ప్రచారం చేయడానికి హడావుడి పడుతోంది. ఇందు కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం..  దేశంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రోజులు లేదా వారాల ముందుగా   అంటే సోమవారం (జనవరి 22) రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేసింది. ఏకపక్షంగా ఎన్నికల సమయం చూసుకుని మరీ రాజకీయలబ్ధి కోసం మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ సొంత కార్యక్రమంలో నిర్వహిస్తుండటం కూడా విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ కారణంగానే కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ప్రకటించింది. అంటే బీజేపీ పన్నిన వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకున్నట్లే అయ్యింది. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో తొలి నుంచీ కాంగ్రెస్ అలాగే వామపక్ష పార్టీలూ అడ్డుకుంటూ వస్తున్నాయనీ బీజేపీ అగ్రనాయకత్వం విమర్శలు గుప్పిస్తూ, అసలు రామమందిర నిర్మాణం ఇంత కాలం జాప్యం కావడానికి కాంగ్రెస్, లెఫ్ట్ ఇతన లౌకికవాద పార్టీలే కారణమంటూ నిందిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నది.   అయితే బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వ కార్డ్ ను అడ్డగోలుగా వాడేస్తున్నదనీ, ఇందు కోసం ధర్మశాస్త్రాన్నీ, ఆగమ శాస్త్రాన్నీ కూడా పక్కన పెట్టేసి సొంత రాజకీయ శాస్త్రాన్ని అనుసరిస్తోందనీ దేశంలోని ప్రతిష్ఠాత్మక పీఠాల అధిపతులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.  ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం ఆదిశంకరాచార్యుడు దేశంలోని నాలుగు ప్రాంతాలలో ధర్మం నాలుగు పాదాలా నడవాలన్న ఉద్దేశానికి సంకేతంగా నెలకొల్పిన ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్యపీఠం, గుజరాత్ లోని ద్వారకా పీఠం, ఒడిశాలోని పూరీ పీఠం, కర్నాటకలోని శృంగేరీ పీఠాల ప్రస్తుత అధిపతులు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ముహూర్తాన్ని తప్పు పట్టారు. ఆగమశాస్త్ర విరుద్ధంగా  ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం ధర్మ విరుద్ధమని చాటారు.  అంతే కాకుండా  శుభప్రదమైన నెల కాదని ఈ నెలలో ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సమంజసం కాదనీ, శుభకరం కాదనీ పీఠాధిపతులు అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అన్ని అభ్యంతరాలూ తోసి పుచ్చి సరిగ్గా ఎన్నికల వేళ ముహూర్తాన్ని నిర్ణయించడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలకు బలం చేకూరుతోంది.  

రాజారెడ్డి ఎంగేజ్మెంట్.. జగన్ షర్మిల విభేదాలపై మరో సారి రచ్చరచ్చ!

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా ఎందరో అతిధులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఎంతమంది వచ్చినా.. ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిశ్చతార్ద వేడుకకు హాజరవడం మాత్రం హాట్ టాపిక్ అయింది. అందరిలాగానే జగన్ కూడా సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను ఆలింగనం చేసుకొని జగన్ చిరునవ్వులు చిందించారు. అలాగే ఈ సందర్భంగా కాబోయే జంటకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతా బాగానే ఉంది కాదా మరి రెండు రోజులుగా ఈ వేడుకకు జగన్ వెళ్లడం ఎందుకు ఇంతలా రచ్చ అవుతుందన్నది కూడా అందరికీ తెలిసిందే. సోదరి షర్మిలతో జగన్ విబేధాలు, అగాధాలు అన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే కాగా.. ఈ నిశ్చతార్ధ వేడుకలో జగన్ ప్రతి కదలిక ఆసక్తికరంగానే సాగింది. జగన్ ఒక్కగానొక్క సొంత మేనల్లుడి నిశ్చతార్ద వేడుకలో పట్టుమని మూడు నిముషాలు కూడా ఉండలేకపోయారు. జగన్ కారు దిగి వేదికపైకి వెళ్లడం.. తల్లి, సోదరిని ఆలింగనం చేసుకోవడం, కాబోయే వధూవరులను పలకరించి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం, ఒక ఫోటోకి ఫోజివ్వడం.. కారు ఎక్కేసి అక్కడ నుండి వెళ్లిపోవడం ఇదే జరిగింది. దీంతో జగన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తన పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తమ్ముడి పెళ్లికి ఐదు గంటలు కేటాయించిన జగన్.. సొంత మేనల్లుడు పెళ్లికి ఐదు నిముషాలు కేటాయించలేకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ను మొక్కుబడిగా పలకరించిన షర్మిల, కనీసం ఆ ఆలింగనం ఫోటోలకు కూడా దొరకని విధంగా కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా జగన్ తనకు గుర్తుగా కాబోయే వధూవరులతో కుటుంబం అందరూ కలిసి ఫొటో దిగేందుకు ప్రయత్నించగా షర్మిల అందుకు ఇష్టపడలేదు. జగన్ ఫోటో విషయం చెప్పినా షర్మిల పట్టించుకోనట్లు ఉన్నారు. అయితే, చివరిగా తల్లి విజయమ్మ ప్రయత్నంతో షర్మిల ఫోటోకి ముందుకొచ్చినా.. అయిష్టంగానే జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచున్నారు. ఈ నిశ్చతార్ద వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పుడు వార్ పీక్స్ లో ఉంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగా.. రానున్న ఎన్నికలలో జగన్ ఓటమికి పనిచేయడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. మరి అన్నా చెల్లెమ్మల మధ్య ఇంత వైరం ఉన్నప్పుడు అసలు వైఎస్ షర్మిల జగన్ ను ఆహ్వానించడం ఎందుకు?.. పోనీ షర్మిల ఆహ్వానించినా చుట్టపు చూపుగా జగన్ రావడం ఎందుకు అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఈ వేడుకకు వచ్చేందుకు జగన్ తన షర్ట్ ధరించిన సమయం కూడా ఈ వేడుకలో లేరు. మరి అలాంటపుడు అంత మొహమాటంగా రావడం ఎందుకు జగన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోనీ వచ్చినందుకు కనీసం అర్ధగంట సమయం కేటాయించి బంధువులు, మిత్రులను పలకరించి కాస్త సందడి చేసి ఉంటే అది ఎంతో గౌరవంగా ఉండేది. సోదరుడిపై షర్మిల ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తనను నమ్మించి మోసగించాడని షర్మిల బలంగా నమ్ముతున్నారు. అందుకే అన్నపై సూటిగా బాణం ఎక్కుపెట్టారు. మరి అలాంటపుడు ఇంటికి వెళ్లి మరీ సోదరుడిని నిశ్చతార్ధ వేడుకకు ఆహ్వానించడం ఎందుకు? పోనీ ఆహ్వానించారు.. సోదరుడు కూడా వేడుకకు వచ్చారు. కానీ, తీరా వేదికపై ఎడమొహం పెడమొహం. మరి ఈ తప్పు ఎవరిది? నేచురాలిటీకి దగ్గరగా ఉండే తమిళ సినిమాలో కూడా ఈ వేడుక వేదిక మీద మనుషుల నటన చూసి ఉండరు. ఒకవేళ సినిమాలలోనే కాదు ఇలాంటి వేడుకలలో మనుషుల నటనకి కూడా అవార్డులు వస్తాయంటే.. రాజారెడ్డి-ప్రియాల నిశ్చతార్ద వేడుకలలో వైఎస్ ఫ్యామిలీ సభ్యుల నటనకి ఆస్కారుల పంట పండడం ఖాయం. ఆ స్థాయిలో నటించారు ఒక్కొక్కరు. మొత్తంగా ఈ నిశ్చతార్ద వేడుక వైఎస్ ఫ్యామిలీని మరోసారి సోషల్ మీడియాలో మోత పుట్టించేస్తుంది.

జూనియర్ ఫ్లెక్సీల తొలగింపు.. అసలు కారణం తెలుసా?

నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్లు, కొన్ని యూట్యూబ్ చానెళ్లు, ఓ రెండు మూడు మెయిన్ స్ట్రీమ్ చానెళ్లు కూడా రచ్చ రచ్చ చేస్తున్నాయి. అది కూడా బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని, బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎదగనీయకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారంటూ ఏవేవో పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లయితే ఎవరో దిక్కూ ముక్కూ లేని అనామకులతో విశ్లేషణలు జరిపించి మరీ వారి చేత పిచ్చి కూతలు కూయిస్తున్నారు. ఇన్నాళ్లూ లోలోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైపోయిందని రెండు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానెళ్లు గురువారం మధ్యాహ్నం నుండి పదేపదే ఇదే విషయంపై నానా రచ్చ చేస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల రగడ. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇక్కడ వెలసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తీసేయమని ఆదేశించడం, బాలకృష్ణ అక్కడకి వెళ్ళగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది. దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణ  అక్కడ ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను చూసి వాటిని అక్కడ నుండి తీయించేయమని ఆదేశించారు. అంతే పదే పది నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీయించేశారు. దీంతో వైసీపీ డిజిటల్ మీడియా గురువారం నుండి పండగ చేసుకుంటున్నది. ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతం అయ్యాయని, టీడీపీ అధినేత చంద్రబాబు బాబాయ్ అబ్బాయి మధ్య చిచ్చు పెట్టారని, లోకేష్ కోసం ఎన్టీఆర్ ను ఎదగనీయడం లేదని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నది. ఇంకా చెప్పాలంటే బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశించడం వైసీపీకి   కోతికి కొబ్బరి చిప్పలాగా దొరికింది. నిజానికి బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ  ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటిని బాబాయ్ బాలయ్య తీయించేయడాన్ని స్వాగతిస్తారు.   అయితే  వైసీపీ అనుకూల మీడియా, వైసీసీ సోషల్ మీడియా పేజీలు రచ్చ చేస్తున్నట్లుగా ఇది ఎన్టీఆర్ కుటుంబంలో విబేధాలతో చేసిందో.. లోకేష్ కోసం చేసిందో కానే కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి కోసమే బాలకృష్ణ ఈ పని చేశారు.  అబ్బాయి మంచి కోరే బాబాయ్ బాలయ్య ఎంతో బాధ్యతతో ఈ ఫ్లెక్సీలను తీయించేశారు. అక్కడ జరిగేది శుభకార్యమో, జాతరో కాదు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవ్యం, అభిమాన నాయకుడు నందమూరి తారకరామారావు వర్ధంతి. ఎన్టీఆర్ కుటుంబం అక్కడకి వెళ్ళింది ఆ మహనీయుడికి నివాళులు   ఆ పెద్దాయనను గుర్తు చేసుకొనేందుకు వెళ్లారు. అలాంటి చోట ఘనస్వాగతం అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఎంత మాత్రం సముచితం కాదు. బాధాతప్త హృదయంతో అక్కడకి వచ్చే వారికి స్వాగతాలు చెప్పడం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే బాలయ్య ఆ  ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదానికి కారణమైన ఎన్టీఆర్ అభిమాని గతంలో కూడా ఇలాగే  ఎన్టీఆర్ వర్ధంతికి భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో అప్పుడు కూడా వాటిని తొలగించారు. ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి పనులు వద్దని కూడా చెప్పారు. కానీ మళ్ళీ అదే పని చేశారు. దీంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. దీనినే వైసీపీ గోరంతను చేసి చూపి.. ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు అంటూ రచ్చ చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఎన్టీఆర్ పై బాలయ్యకి ఉన్నది పుత్ర వాత్సల్యం. మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వారికి స్వాగతాలు చెప్పడం శుభకరం కాదు. శుభప్రదం కాదు. అలాగే అలాంటి చోట ఫోటోలతో ఫ్లెక్సీలు అసలు మంగళకరం కానే కాదు. గతంలో చెప్పినా మళ్ళీ అదే పని చేశారంటే అది ఖచ్చితంగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకేనని అనుమానించాల్సి వస్తున్నది. ఈ ఫ్లెక్సీల రచ్చ వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకే తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలయ్య  తన కుమారుడి పేరిట స్వాగతాలు కనిపించడం భావ్యంగా భావించలేదు. తండ్రి హరికృష్ణ తర్వాత బాబాయి బాలకృష్ణ తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించారు. ఎన్టీఆర్ సోదరి సుహాసిని పక్కనే ఉండగానే బాలకృష్ణ ఈ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటే ఇది వివాదం కాదు బాధ్యతని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఏ సాకు దొరుకుతుందా బాలయ్యను, తెలుగుదేశం పార్టీనీ ఇరుకున పెడదామని చూసే వైసీపీకి తప్ప.

తెలుగువన్ పాతికేళ్ల ప్రస్థానం.. కోటి మంది సబ్ స్క్రైబర్లతో అగ్రస్థానం!

తెలుగువారి వారధి, సారధి, నేటి డిజిటల్ యుగానికి నాంది 'తెలుగువన్'. దేశవిదేశీ ప్రజలకు ఇంటర్నెట్ ద్వారా తెలుగు సినిమాను చూపించవచ్చని.. ఖండాంతరాలకు చూపించి చరిత్ర సృష్టించిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ ఫామ్ 'తెలుగువన్'. 24 ఏళ్ళ క్రితం.. డిజిటల్ మీడియా శక్తి గురించి గానీ, అసలు యూట్యూబ్ అనే ఫ్లాట్ ఫామ్ ఉంది అని గానీ ఎవ్వరికీ అవగాహన లేనప్పుడే భారతదేశం నుండి యూట్యూబ్ తో టైఅప్ చేసుకున్న ఏకైక డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'తెలుగువన్'. స్వయంగా సాంకేతికనిపుణులైన కంఠంనేని రవిశంకర్ భవిష్యత్ లో డిజిటల్ మీడియాదే రాజ్యమని ముందుగానే ఊహించగలిగారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేసి, నూటికి నూరుశాతం విజయం సాధించి తెలుగువన్ ని అత్యున్నత శిఖరాన ఉంచగలిగారు. యూట్యూబ్ లో అంచలంచలుగా ఎదుగుతూ మహావృక్షంలా ఎదిగిన 'తెలుగువన్' తాజాగా 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంది. తెలుగువన్ కి 300 కి పైగా అనుబంధ ఛానల్స్ ఉన్నాయి. మొత్తంగా 80 మిలియన్ కి పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. తెలుగువన్ గానీ, అనుబంధ ఛానల్స్ గానీ ఎప్పుడూ తాము గీసుకున్న లక్ష్మణరేఖను దాటలేదు. విలువలు, నీతి, మర్యాదలే అలంకారాలుగా 'తెలుగువన్' సగర్వంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. న్యూస్, కరెంట్ అఫైర్స్, భక్తి, వ్యవసాయం, కిడ్స్ కంటెంట్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, స్టాండప్ కామెడీ, మెడికల్ అండ్ హెల్త్ ఇలా ఎన్నో విభాగాల్లో.. నాణ్యత, ప్రమాణాలతో కూడిన మంచి కంటెంట్ ను అందిస్తోంది. యువ ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు, నటీనటులు, సంగీత దర్శకులు, గాయకులు మరియు గీత రచయితలు.. ఇలా ఎందరికో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సహాయపడిన మొదటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ తెలుగువన్ నెట్‌వర్క్. తెలుగువన్ ని వేదికగా చేసుకొని ఎందరో వర్ధమాన నటీనటులు, రచయితలు, గాయకులు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకొని తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు పొందారు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగొందుతోన్న ఎందరో నటులు, దర్శకులు ఒకప్పుడు తెలుగువన్ నుంచి వచ్చినవారే. నాణ్యమైన, అర్థవంతమైన కంటెంట్ ను అందిస్తున్న తెలుగువన్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. తెలుగువన్ ని ఆదరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా సింగిల్ యూట్యూబ్ ఛానల్ లో 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకొని తెలుగువన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సౌత్ ఇండియాలోనే మొదటి యూట్యూబ్ ఛానల్ గా ప్రయాణం మొదలుపెట్టి, నేటితో కోటి మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్న సందర్భంగా మా విజయంలో భాగమైన వారందరికీ తెలుగువన్ తరపున కృతఙ్ఞతలు.

ప్రజాస్వామ్యం.. నుంచి నియంతృత్వంలోకి.. మోడీ మళ్లీ గెలిస్తే అదేనా?

కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ... దేశంలో ప్రజాస్వామ్యం మటుమాయమైపోతుందన్న భయాలు రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతున్నాయి. చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తరహాలో రాజ్యాంగాన్ని మార్చేసి జీవిత కాల ప్రధానిగా తనను తాను ఆయన ప్రకటించేసుకున్నా ఆశ్చర్యం లేదని విపక్ష నేతలు అంటున్నారు. వ్యవస్థలపై విశ్వాసం, రాజ్యాంగం పై గౌరవం లేదా అన్న విధంగా మోడీ తీరు ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.   2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో  ఉండేలా, రాజ్యంగాని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు ఆయన వెనుకాడరని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది.  దేశంలో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు, నియంతృత్వం కబంధ హస్తాల్లోకి దేశం వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు  విపక్ష పార్టీలు అన్నీఐక్యం కావాలన్నవిషయంలో బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి., 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవాలంటే విభేదాలు విస్మరించి కలిసి నడవాల్సిన అవసారన్ని కూడా విపక్షాలు గుర్తించాయి. అయితే అలాంటి కలయిక ద్వారా ఏర్పడే కూటమికి నేతృత్వం వహించే పార్టీ, కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశం వద్దే ఈ ఐక్యత పీటముడులు పడుతున్నది. ఎవరికి వారు నాయకత్వం ఒక సమస్య కాదని చెబుతున్నప్పటికీ ఆచరణ, కార్యాచరణ విషయానికి వచ్చే సరికి అదే అంశంపై పట్టుబడుతున్న పరిస్థితి.   నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్నిఒక్క బీజేపీయేతర పార్టీలే కాదు, జనం కూడా గుర్తించారు. అంతెందుకు ఇప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు కూడా గుర్తించాయి.  2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించాలంటే.. విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని... కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు తృణమూల్ మొదలు, డీఎంకే వరకూ అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా గుర్తించాయి. అయితే  అయితే కలిసికట్టుగా ముందడుగు వేసే విషయంలో మాత్రం వాటి అడుగులు తడబడుతున్నాయి.   అదలా ఉంటె విపక్షాలను ఐక్యం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు కూడా. అలా బీజేపీయేతర పార్టీల అన్నిటి కృషి ఫలితంగా విపక్షాల ఐక్యత దిశగా ఒక అడుగు పడింది. ఇండియా కూటమి ఆవిర్భవించింది.  అయితే ఆ కూటమి బీజేపీ ప్రత్యామ్నాయంగా దూర దృష్టి కలిగిన, జాతీయవాద కూటమిగా ఎదిగిందా, ఆ దిశగా అడుగులు వేస్తున్నదా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం రావడం లేదు.   అయితే ఇందుకు కారణాలు సుస్పష్టం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఒకింత ప్రజాస్వామ్యయుత పార్టీయే అయినప్పటికీ భాగస్వామ్య పక్షాల పట్ల, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల పట్ల పెద్దన్న పాత్ర పోషిస్తూ వాటి ఎదుగుదలకు అడుగడుగునా అడ్డంకులు పడుతుందన్న భయం కూటమి పార్టీలలో పూర్తిగా తొలగిపోకపోవడమే. ప్రస్తుత పరిస్థితుల్లో పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ బలం కూడా ఒక ప్రాంతీయ పార్టీతో సమానంగా పడిపోయిందనడంలో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రాతీయ పార్టీలు గతంలో ఒక ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక ఇప్పుడు అనివార్యంగా మోడీ అనే పెద్ద గీతను చిన్నది చేయడానికి అవి కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపినప్పటికీ కూటమికి నాయకత్వం విషయంలో వాటిలో ఇంకా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. దాంతో ఇండియా కూటమి అడుగులు తడబడుతున్నాయి. ఒక అడుగు ముందుకు పడింది అనుకునేలోగానే రెండడుగులు వెనుకకు పడుతున్నాయి. తాజాగా కూటమి కన్వీనర్ గా మల్లిఖార్జున్ ఖర్గేను ఎన్నుకోవడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపించినా.. ఆ భేటీకి తృణమూల్, సమాజ్ వాదీ వంటి పార్టీల గైర్హాజరీ కారణంగా అది ఏకాభిప్రాయంతో జరిగిన ఎంపికేనా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.   ఏది ఏమైనా ప్రస్తుతం విపక్ష పార్టీలన్నిటి లక్ష్యం మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకోవడమే కానుక.. నాయకత్వం ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెట్టి ఐక్యంగా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంటుది. 

ఎల్లుండి  విగ్రహప్రతిష్టోత్సవ కార్యక్రమానికి బయలు దేరనున్న చంద్రబాబు 

ప్రస్తుతం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టోత్సవం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు  ఆహ్వానం అందలేదు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కు ఆహ్వానం అందినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించింది. కానీ  ;ఎన్ డి ఎ  భాగస్వామిగా లేని టిడిపికి ఆహ్వానం అందింది. . గతంలో టిడిపి  ఎన్ డి ఏ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే..    రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళుతున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కార్యక్రమానికి రావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఆహ్వానించారు.  జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నిన్ననే గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 8 వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఆహ్వానాలను అందించే ప్రక్రియను నిర్వాహకులు వేగవంతం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు, ప్రత్యెక రైళ్ళు కూడా ఏర్పాటు చేసి భక్తులను అయోధ్యకు చేర్చనున్నారు. అయోధ్యలో రామయ్యకు జరిగే పట్టాభిషేకాన్ని చూడాలని ఆ మహత్కార్యాన్ని కళ్ళారా చూసి తరించాలని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వారందరి కోరిక తీరుతున్న సమయంలో రామయ్య తాను పుట్టిన నేలమీద తిరిగి నడయాడబోతున్నాడు.ఇదే సమయంలో దేశ, విదేశాలలోని ప్రముఖులకు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలను పంపిస్తున్నారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం,  శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఏపీ నేతలకు ఆహ్వానం అందింది. సినీ నటులు చిరంజీవికి, మోహన్ బాబు తదితరులకు కూడా ఆహ్వానాలు అందాయి.  విగ్రహ ప్రతిష్టాపనకు నిన్నటి నుండి సాంప్రదాయబద్ధమైన ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి 150 దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.  అక్కడకు వెళ్ళే అతిధుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ హౌస్ లను నిర్మించి వారికి కావాల్సిన వసతి సౌకర్యం కల్పించే పనిలో ఉన్నారు.

సుప్రీంలో జగన్ కు ఝలక్.. బెయిలు రద్దు పిటిషన్ డిస్మిస్ కు నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత పదేళ్లుగా బెయిలు మీద ఉన్న జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను సుప్రీం పక్కకు పెట్టేసింది. రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిలు రద్దు చేయాలన్న పటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్గి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదనీ, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జగన్ బెయిలు రద్దు పిటిషన్ విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీబీఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణం రాజు తరఫు న్యాయవాది సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం సెటైరికల్ గా వ్యాఖ్యానించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (జనవరి 19) విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే.