చీకటి పడితే చాలు వణికిస్తున్న చలి... పులి

  మొన్నటి వరకు అయితే భానుడి భగభగలు.. లేదంటే వరణుడి ఉరుములతో  తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు నా వంతు అంటూ చలిగాలులు ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ప్రజలను ఈ గాలులు వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జస్ట్ రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు.. 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోయాయి. అయితే ఇది కాదు.. అసలు కథ ముందుంది అంటోంది వాతావరణశాఖ. రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.  వాతావరణశాఖ విడుదల చేసిన లేటెస్ట్‌ లెక్కల ప్రకారం… ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.  రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-20 డిగ్రీల నుంచి 9-13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే, రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతుంది. అవును.. నవంబరు 11-19 తేదీల వరకు అనగా రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 13-17 తేదీల మధ్య మరింత అధికంగా ఉంటుందని, కొన్ని జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌ అంటే పది డిగ్రీల లోపు పడిపోనున్నాయని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, పార్వతీపురం మన్యం, పల్నాడు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. రాబోయే పది రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల వరకే నమోదవుతాయన్నారు.  చలి తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే మంచు వర్షం ప్రారంభమైంది. యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కోల్డ్‌ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు.. ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ సారి రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.  మరోవైపు నవంబర్ 11 నుండి 19 వరకు (ప్రధానంగా 13 నుండి 17 నవంబర్ వరకు) 8-10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతవరణ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C–17°C మధ్య ఉండవచ్చుని.. సాధారణంగా ఇంత దీర్ఘకాలం  చలి తీవ్రత తరచుగా ఉండదు, కానీ ఈ సంవత్సరం 8-10 రోజుల పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండ బోతోందని పేర్కొన్నారు

ప‌వ‌న్ ఏం చేసినా త‌ప్పేనా... ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్?

  మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్...ఇదీ అట‌వీశాఖా మంత్రి, డిప్యూటీ ముఖ్య‌మంత్రి కూడా అయిన ప‌వ‌న్ బిజీ షెడ్యూల్. ప్ర‌త్యేక విమానంలో , చాప‌ర్‌లో ఆయ‌న చ‌క్క‌ర్లు కొడుతున్నారంటూ  పెద్ద ఎత్తున వైసీపీ  సోష‌ల్ మీడియా సైన్యం ఆయ‌న‌పై దుమ్మెత్తి  పోస్తోంది. ఇక ఆయ‌న విరామ స‌మ‌యంలో పుస్త‌కం పుట్టుకుని ఏదైనా సందేశం ఇవ్వ‌ద‌లిచినా కూడా దాన్లోని త‌ప్పొప్పులు వెలికి తీసి నానా యాగీ చేస్తున్నారు. ఫోనుతో లేచి- పొద్దంతా ఫోనే చూసుకుంటూ తిరుగుతూ- ఫోనుతోనే నిద్ర పోయేవారికి.. ఆ ఫోన్ పిచ్చిలో పడొద్దు.. పుస్త‌కాలు చ‌ద‌వండ్రా బాబూ! అంటూ త‌న అభిమాన గ‌ణానికి ఒక చిన్న మెసేజ్ పాస్ చేద్దామ‌ని ప‌వ‌న్ ఫోటోల‌కు పోజులు ఇస్తే.. దాన్ని కూడా రాద్దాంతం  చేస్తున్నారు. బుక్కు తిర‌గేసి  ప‌ట్టుకున్నాడు. మ‌ర‌గేసి  ప‌ట్టుకున్నాడంటూ నానా హంగామా చేస్తున్నారు. ఆ మాట‌కొస్తే ప‌వ‌న్ తిర‌గేసి ప‌ట్టుకున్నా కూడా స్టైలే. అందులోంచి వెళ్లాల్సిన మెసేజ్ ఆయ‌న అభిమాన  గ‌ణానికి వెళ్లి  చేరిపోతుంది. ఇక ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించిన గొడ‌వ విష‌యానికి వ‌స్తే. ప‌వ‌న్ అన్నా అధికారిక వ్య‌వ‌హారాల‌కు చాప‌ర్లు గ‌ట్రా వాడుతున్నారేమోగానీ.. అదే జ‌గ‌న్ త‌న జ‌మానాలో ఏకంగా  లండ‌న్ వెళ్లి  సొంత ప‌నులు చ‌క్క‌బెట్ట‌డానికి కూడా ప్ర‌త్యేక విమానాల‌ను వాడిన గ‌తం ఉంది.  ఇటీవ‌ల బాబు లండ‌న్ వెళ్తే మొత్తం సొంత ఖ‌ర్చుల‌తో ఈ ప‌ర్య‌ట‌న చేసి వ‌చ్చారు. అది ఆయ‌న సొంత విష‌యం కావ‌డంతో.. ఈ దిశ‌గా బాబు అన్నీ ఖ‌ర్చులు తానే భ‌రించారు. అదే జ‌గ‌న్ అలాక్కాదు.. మొత్తం ప్ర‌భుత్వ సొమ్మే ఖ‌ర్చు పెట్టేవారు. ఇటీవ‌ల జ‌గ‌న్ తాను లండ‌న్ వెళ్లిన‌పుడు కూడా ప‌రాయి ఫోన్ నెంబ‌ర్ ఇచ్చి కోర్టుల‌ను తిక మ‌క పెట్టారు. స‌రే విదేశాలు వెళ్లి వ‌చ్చారు.. ఒక్క‌సారైనా కోర్టు ముందు హాజ‌రు క‌మ్మంటే.. లేదు లేదు తానలా హాజ‌రైతే శాంతి  భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా రూపాంత‌రం చెందుతుంద‌ని అన్నారు త‌ప్పించి.. కోర్టు కోరిన ప‌ని చేయ‌లేక పోయారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఇటీవ‌ల జ‌రిగిన జ‌గ‌న్ కాన్వాయ్ ప్ర‌మాదాలు, చాప‌ర్ తో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టారు.  అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలాక్కాదే.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు సాఫీగా సాగ‌డానికే ఈ విధ‌మైన గాలి మోటారు ప్ర‌యాణాలు చేస్తున్నారు. మొన్న‌టికి  మొన్న చూడండీ.. జ‌గ‌న్ కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైందా? అంత‌కు ముందు ఒక ప్రాణ‌మే పోయిందా? ఇలాంటి వాటిని వీలైనంత‌గా త‌గ్గించ‌డానికే ప‌వ‌న్ త‌న పేరుకు త‌గ్గ‌ట్టుగా ప‌వ‌న సుత హ‌నుమాన్ లా గాల్లో ప్ర‌యాణిస్తున్నారు.  ఈ విష‌యం తెలీక ఫ్యాన్ పార్టీ ప్యాన్స్ సోష‌ల్ మీడియాలో అంత ర‌చ్చ ర‌చ్చ చేయాల్సిన అవ‌స‌రం లేదంటారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్.

ఒక వైపు టారిఫ్‌లు.. మరోవైపు తాయిలాలు ట్రాంప్ సుంకాల రాజకీయం

టారిఫ్‌లతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సొంత దేశీయులను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు.  ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతుండగా, అక్కడి అధ్యక్షుడికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కూడా అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోంది, ఇదంతా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అయితే.. సుంకాల వల్ల భారీ ఆదాయం సమకూరుతోందని, డివిడెండ్‌ కింద ఒక్కో అమెరికన్‌కు కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశం. ద్రవ్యోల్బణం దాదాపు లేదు. రికార్డు స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డివిడెండ్‌ కింద ఒక్కో వ్యక్తికి  కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేసేందుకు, లైసెన్స్‌ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఆమోదం ఉంది. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా..? ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదు..? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టుకు ఇది తెలియదా? అసలేం జరుగుతోందని ట్రంప్‌ మండిపడ్డారు. ట్రంప్‌ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా దిగుమతి సుంకాలు మార్చడం, కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్

  ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఘట్ కేసర్ ఎన్ఎఫ్‍సీ నగర్‌లో అందెశ్రీ అంతిమ యాత్ర జరగనున్నాది. రేపు సాయంత్రం ఆయన పార్థివదేహాన్నికి ముఖ్యమంత్రి నివాళి అర్పించనున్న అనంతరం అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. కాగా ఇవాళ ఉదయం  గుండెపోటుతో మరణించిన అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి కె.రామకృష్ణరావును ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు పశువుల కాపరి నుంచి ప్రసిద్ధ కవిగా ఎదిగిన అందెశ్రీ మృతి పట్ల పలవురు ప్రముఖులు, సాహితీ వేత్తలు  సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు ప్రజాకవి, గాయకుడు అందె ఎల్లయ్య అందెశ్రీగా ఖ్యాతి పొందిన ఆ మహామనిషి. గొర్రెల కాపరిగా, తాపీ మేస్త్రీగా కష్టసుఖాలను అనుభవించిన ఆయన, బాధను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయన జీవితానికి మార్గదర్శకంగా మారాయి. ఆ గీతాలే ఆయనను ప్రజల కవి, పోరాట గాయకుడిగా తీర్చిదిద్దాయి. అవే ఆయనకు ప్రశ్నించే ధైర్యం, సమాజం కోసం పలికే స్వరాన్ని ఇచ్చాయి. “పల్లెనీకు వందానాలమ్మో”, “సూడా సక్కని తల్లీ... చుక్కల్లో జాబిల్లీ”, “కొమ్మచెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు”  ఇలా ఆయన గళం నుంచి జాలువారిన ప్రతి పాట తెలంగాణ ఆత్మను తాకింది. చివరికి, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రూపంలో ఆయన సాహిత్య ప్రస్థానం చిరస్మరణీయమైంది. తాపీ మేస్త్రీగా పనిచేసిన అందెశ్రీ చేతులు తెలంగాణ నిర్మాణానికి ఇటుకలు పేర్చినట్లే, ఆయన గళం ఆ ఉద్యమానికి బలమైన పునాది వేసింది. పశువుల కాపరిగా మందను దారి చూపినట్లే, ప్రజాకవిగా ఆయన తరతరాలను మేల్కొలిపారు. దగాపడిన తెలంగాణ కోసం తన మాటతో, తన పాటతో పోరాడిన ఆ గాయకుని గాధ పల్లెపల్లెల్లో నేటికీ మార్మోగుతోంది. అందెశ్రీ శరీరం లేనప్పటికీ, ఆయన గీతాల గర్జన మాత్రం చిరస్థాయిగా మారింది.  

అందెశ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటు : ప్రధాని మోదీ

  ప్రముఖ రచయిత అందెశ్రీ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. అందెశ్రీ మరణం మన సాంస్కతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన ప్రజల పోరాటాలకు ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది అని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ  ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు  విచారం వ్యక్తం చేశారు.  తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు. ఈ మేరకు మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీతో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని గుర్తుచేశారు. తనతో పాటు పోరుయాత్రలో చాలా సభల్లో ఆయన పాల్గొనేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు తమ ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించామని గుర్తుచేశారు. అలాగే అందెశ్రీ తనకు సలహాలు కూడా ఇచ్చేవారని  కిషన్‌రెడ్డి అన్నారు.

కోల్ కతా విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

విమానాలలో ఇటీవలి కాలంలో తరచుగా ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. విమాన ప్రయాణమంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఈ సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరగడం అన్నది పక్కన పెడితే.. విమానాల రాకపోకలలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం లేదా అర్ధంతరంగా విమాన సర్వీసు రద్దు కావడం వంటివి జరుగుతుండటంతో ప్రయాణీలుకు నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాయి. అలాగే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు విమానంలో ఉన్న ప్రయాణీకులు తమ ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న భయాందోళనలతో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు స్పైస్ జెట్ ప్రయాణీకులు. ముంబై నుంచి కోల్ కతా వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సరిగ్గా కొల్ కతాలో ల్యాండింగ్ కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే కోల్ కతా విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి  విమానం గాల్లో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ 670 విమానం ఆదివారం రాత్రి ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్  సమయంలో, విమానంలోని ఒక ఇంజిన్ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. వెంటనే విమానాశ్రయ అధికారులు వెంటనే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక, సహాయక బృందాలను రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:38 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు.  కోల్‌కతాలో ల్యాండింగ్ సమయంలో తమ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని జెట్ ఎయిర్ స్పేస్ సంస్థ ధృవీకరించింది.  ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది.  

తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్!

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కేటీఆర్ సుప్రీం కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని  కేటీఆర్   ఈ పిటిషన్ దాఖలు చేశారు.  కాగా ఫిర్యాయింపు ఎమ్మెల్యేల విచారణకు తమకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.   కాగా  తమ  పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరుతూ..  కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు కోరారు.చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.  తమ కేసు విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ గవాయ్... తాను ఈ నెల 23న పదవీ విరమణ చేస్తున్నాననీ,  ఆ తర్వాత నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు  అని వ్యాఖ్యానించారు. వాదనలు విన్న అనంతరం, ఈ పిటిషన్‌  విచారణను వచ్చే సోమవారం చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరగడం ఖాయమైంది. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

కడపలో విద్యార్థిని ఆత్మహత్య...స్కూల్ వద్ద ఉద్రిక్తత

  కడప జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జస్వంతి హాస్టల్లో ఈ రోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పకుండా రిమ్స్‌కు తరలించారు. దీంతో  జస్వంతి తల్లిదండ్రులు  హాస్పిటల్ కి చేరుకున్నారు. తల్లిదండ్రులకు  పల్స్ లేదని డాక్టర్స్ చెప్పడంతో మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనపడంతో అనుమానస్పదంగా ఉందని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా బాత్రూమ్ లో ఉరి వేసుకుందని చెప్పున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వారే మా పిల్లని హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని  రిమ్స్ మార్చురీకి  తరలించడం జరిగింది .అక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు బంధువులు ఆందోళన దిగారు. ఈరోజు ఉదయం స్కూల్ యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చిందని. అయితే విషయం  దాచిపెట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నామని తెలపారని వారు వెల్లడించారు.  

సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

  భారత్ మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ మంత్రిగా సోమవారం  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదలు తెలిపారు.  ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.

మాయ‌మై పోయిండ‌మ్మా అందెశ్రీ అన్న‌వాడూ!

అందెశ్రీ  ఈ పేరు వింటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది.. ప‌ల్లె పాట‌. జ‌నం మాట‌. జాన‌ప‌దులు పాడుకునే  ఆట పాట‌. ఎలాంటి  చ‌దువు చ‌ద‌వు లేకుండానే..  మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు అంటూ ఆయ‌న రాసిన పాట ఏకంగా ఒక పాఠ్యపుస్త‌కంలో సిల‌బ‌స్ గా మారిన ఘ‌న‌త చ‌రిత సొంతం చేసుకుందంటే ప‌రిస్థితి  ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ఇక జ‌య‌జ‌య‌హే  తెలంగాణ అనే రాష్ట్ర గీతం గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇదిప్పుడు ప్ర‌తి  బ‌డిలో పాడుకునే పాట‌గా ప్ర‌తి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి పాడుకోవ‌ల్సిన బాట‌గా మారింది.  వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం దగ్గ‌ర్లోని రేబ‌ర్తి అనే గ్రామంలో 1961 జూలై 18న  జ‌న్మించారు అందె శ్రీ. ఈయ‌న అస‌లు పేరు అందె ఎల్లయ్య‌. అనాథ‌గా  పెరిగిన ఎల్ల‌య్య తొలినాళ్ల‌లో ప‌శువుల‌ కాప‌రిగా  ప‌ని చేసేవారు. ఆయ‌న ప్ర‌కృతిలోని ఎన్నో అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల‌కు ప్రేర‌ణ చెంది పాట‌లు రాసేవారు. అది కూడా  రాయ‌డం తెలీకుండానే ఆశువుగా చెప్పిన  క‌విత్వం పాట‌మ్మ‌గా మారి  అది ప‌ల్లె ప‌ల్లెనా  ప‌ర‌వ‌ళ్లు తొక్కి.. జ‌నం గుండెల‌ను తాకేది. అలా అలా ఇంటిపేరు అందె కి శ్రీ  క‌లుపుకుని అందెశ్రీగా ప్రాచుర్యం పొందారు ఎల్ల‌య్య‌. ఎక్క‌డ ప‌శువుల‌  కాప‌రి ఉద్యోగం? ఎక్క‌డ  ప్ర‌కృతికి ప‌ర‌వ‌శించి పాడిన పాట? ఆపై అది  పాఠ్య‌పుస్త‌కాల‌కు ఎక్క‌డం ఏమిటీ?  కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం నుంచి డాక్ట‌రేట్ అయితేనేమి ఇంకా ఎన్నో ప్ర‌సిద్ధ పుర‌స్కారాల వ‌ర‌కూ సాగిన ఈ పాటల‌ ప్ర‌యాణం తెలంగాణ సాహిత్యంలోనే ఒక ప్ర‌త్యేక అధ్యాయం.   జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ మాతృగీతం రాయ‌డంతో పాటు అందెశ్రీ.. రాసిన గీతాలేంటో చూస్తే.. పల్లెనీకు వందనములమ్మో,మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జన జాతరలో మన గీతం యెల్లిపోతున్నావా తల్లి, చూడ చక్కని వంటి ఎన్నో పాట‌లు రాశారు.  ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే గంగ‌, బ‌తుక‌మ్మ‌, ఆవారాగాడు అంటూ ప‌లు చిత్రాల‌కు గేయ ర‌చ‌న చేశారు అందెశ్రీ. గంగ చిత్రానికి గానూ నంది అవార్డు అందుకోగా, బ‌తుక‌మ్మ చిత్రానికి సంభాష‌ణ‌లు కూడా అందించారు అందెశ్రీ.  2014లో తెలంగాణ ప్ర‌భుత్వం అందెశ్రీ పేరు ప‌ద్మ‌శ్రీకి ప్ర‌తిపాదించింది. అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదులు దక్కాయి. 2015లో వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం ఇచ్చి స‌త్క‌రించారు. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం సైతం ల‌భించింది.   మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా కీల‌క పాత్ర పోషించారు అందెశ్రీ. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు అందెశ్రీ.ఇక‌ సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారంతో పాటు అందెశ్రీని లోక్ నాయక్ పురస్కారం సైతం వరించింది. ఇటీవ‌ల సీఎం రేవంత్ చేతుల మీదుగా కోటి రూపాయ‌ల న‌గ‌దు పుర‌స్కారం సైతం పొందారు అందెశ్రీ. ఇలా చెప్పుకుంటూ  పోతే  మ‌ట్టిలో పుట్టిన ఈ తేనె తుట్టెలాంటి పాట అంత‌ర్జాతీయంగాను విస్త‌రించి అక్క‌డా గుర్తింపు పొంది ఎన్నో అవార్డులూ రివార్డుల‌ను పొందింది.  అందెశ్రీ 2025 నవంబర్ 10న అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  ఇది ప‌ల్ల‌పాటకు విషాద‌క‌ర‌మైన రోజు. చ‌దువుల‌మ్మ త‌ల్లి చింతించాల్సిన రోజు. తెలంగాణ మ‌ట్టిలో మాణిక్యం దిగ‌ంతాల‌కు ఏగిన రోజు. ఓ పాట కాలం మ‌నిషీ, ఆ పాట మ‌ధురాల‌ను మ‌న‌కు అందించిన‌ మ‌నిషీ.. ఇలా దివికేగ‌డంతో తెలంగాణ సాహిత్యం శోక‌సంద్రంలో మునిగిపోయిన రోజుకూడా  ఇదే.   పాట‌ల్లో ఎన్నో తంగేడు పూల‌ను, పాల‌పిట్ల కేరింత‌ల‌ను పూన్చిన ఓ మ‌నిషీ.. నువ్విలా అర్ధంత‌రంగా వెళ్లిపోయి నీలోని మాన‌వ‌త్వాన్ని మాయం చేశావా! అంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు సాహితీ అభిమానులు.

ఉగ్రకుట్ర భగ్నం.. గుజరాత్ లో ముగ్గురు అరెస్టు

అరెస్టైన వారిలో హైదరాబా డాక్టర్ మరో ఘటనలో హరియానా డాక్టర్ నివాసంలో భారీగా ఆర్డీఎక్స్ స్వాధీనం  భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భగ్రం చేశారు.  ఈ సందర్భంగా  ఐఎస్ఐఎస్  తో సంబంధాలు ఉన్న  ముగ్గురిని అహ్మదాబాద్ లో ఆదివారం (నవంబర్ 9) అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసుల కథనం  అరెస్టు అయిన వారిపై  గత ఏడాదిగా నిఘా పెట్టారు. ఇప్పుడు వారు పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా  అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు మార్పిడి చేసుకోవడానికి గుజరాత్ కు వచ్చారనీ, అలాగే దేశవ్యాప్తంగా  వివిధ ప్రాంతాల్లో ఉగ్రదా డులు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారనీ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఉండటం హైదరాబాద్ లో కలకలం రేపింది. హైదరా బాద్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌  ఫ్రాన్స్‌లోఎంబీబీఎస్  పూర్తి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వైద్యుడైన  తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. సైనైడ్ ను తలదన్నేలాంటి  అత్యంత ప్రమాదకరమైన  రైసిన్  అనే విష రసాయనాన్ని తయారు చేయడం కలకలం రేపుతోంది.  మొహియుద్దీన్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌లను అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్, సలీంఖాన్‌లు దిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధ్వంసం కోసం రెక్కీ నిర్వహించారని, పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సేకరించారని ఏటీఎస్ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా, రైసిన్ ఉపయోగించి దేశంలో పెను విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ పేర్కొంది. వీరిలో హైదరాబాద్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో నివసించే డాక్టర్ మొహియుద్దీన్ తన ఇంట్లోనే ఆముదం గింజల వ్యర్థాల నుంచి రైసిన్ తయారుచేసినట్లు పోలీసులు గుర్తించారు.  గుజరాత్ లో మొహియుద్దీన్ అరెస్ట్‌తో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు   అతడి నివాసంలో తనిఖీలు చేపట్టారు. నగరంలో మొహియుద్దీన్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.  ఇదిలా ఉండగా మరో ఉగ్రకుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి.  ఇంటిలిజెన్స్ బ్యూరో, జమ్ముూకశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 300 కేజీల ఆర్డీఎక్స్,  ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం, జమ్ముకశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా   భద్రతా సంస్థలు ఈ దాడులు నిర్వహించాయి.  నవంబర్ 6న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కి మద్దతుగా పోస్టర్లు అతికించారనే ఆరోపణలతో డాక్టర్ ఆదిల్ రాథర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు అతడి  నివాసంలోనే భారీ ఎత్తున ఆర్డీఎక్స్ అలాగే  ఏకే 47  లభ్యమయ్యాయి. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతాబలగాల సమాచారం.  

యాదాద్రికి పోటెత్తిన్న భక్తులు.. ఒక్క రోజే రూ. కోటికి పైగా ఆదాయం

కార్తీకమాసం సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసంలో  యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఈ క్రమంలో యాదాద్రిలో ఆదివారం (నవబర్ 9) ఒక్క రోజు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దాదాపు రెండు వేల సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ  మొత్తం 1968 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.  వీటిలో యాదగిరి గుట్టలో 1758, పాతగుట్టలో 200 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు వివరించారు. అలాగే ఆదివారం ఒక్కరోజే యాదగిరి గుట్టకు కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా 27లక్షల 43 వేల 220 రూపాయలు, వ్రతాల ద్వారా 19 లక్షల 58 వేల రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 16.96 లక్షల రూపాయలు, కొండపైకి వాహనాల ప్రవేశాల ద్వారా 9 లక్షల 17 వేల రూపాయలు, ఇతరత్రా మరో 8 లక్షల 16వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కాగా కొండపై భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  

తిరుమలలో తిరుమల శాటిలైట్ కిచెన్ కు వంద కోట్ల విరాళం

అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ  తిరుమల అన్న ప్రసాదం ట్రస్ట్ కు వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తిరమలలో నిత్యం దాదాపు రెండు లక్షల మందికి నిత్యం అన్నప్రసాదాలు తయారు చేయడానికి వీలుగా కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణం కోసం ఆయన ఈ విరాళం ప్రకటించారు. ఈ శాటిలైట్ కిచెన్ ను తాను అన్నదానం ట్రస్ట్ కు అంకితం చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ముఖేస్ అంబానీ ఆదివారం (నవంబర్ 9) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనీ విరాళం ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని పేర్కొన్నారు.   ఆ తరువాత ఆయన రాజస్థాన్ లోని నాథ్ ద్వారా ఆలయాన్ని కూడా ఆదివారం (నవంబర్ 9) సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ భక్తుల కోసం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం తొలి విడతగా 15 కోట్ల రూపాయలు అందజేశారు.   అలాగే అదే రోజు ఆయన కేరళలోని గురవాయూర్ కృష్ణ దేవాలయాన్ని సందర్శంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురవాయూర్ లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలటీస్ ఆస్పత్రికి 16 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు ఆయన 15 కోట్ల రూపాయల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.  

తుపాకి పట్టి కాల్పులు జరిపిన పవనకల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తుపాకి చేతపట్టి కాల్పులు జరిపారు. ఔను నిజమే.. పవన్ కల్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. ఫైరింగ్ విధి విధానాలు, ఆయుధాల వినియోగం తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలను అత్యంత ఆసక్తిగా విన్నారు. ఆ తరువాత ఆయన తుపాకి పట్టి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత తుపాకి గ్లాక్ 0.45ను ఉపయోగించారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఫైరింగ్ చేస్తున్న పిక్చర్ ను కూడా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   తాను చెన్నైలో ఉన్న సమయంలో  మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో సభ్యుడినని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పాతరోజులన్నీ గుర్తుకు వచ్చాయంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించడం, ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ కాల్చిన కొన్ని రౌండ్లు 'బుల్స్ ఐ'కి అత్యంత సమీపంలో  తాకాయి. 

జూబ్లీ బైపోల్.. అమలులోకి 144 సెక్షన్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రచారం ఆదివారం (నవంబర్ 9)తో ముగిసిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు అధికారులు పూర్తిగా లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించారు. ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం నుంచీ.. మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం పోలింగ్ ముగిసే సమయం  వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లు మూసి ఉంటాయని తెలిపారు.  ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే  జూబ్లీహిల్స్ నియోజకవర్గంవ నియోజకవర్గ పరిధిలో 144వ సెక్షన్ విధించారు.  దీని ప్రకారం  ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడంపై నిషేధం ఉంటుంది.  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హైచ్చరిక జారీ చేశారు.  ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ క్యాండిడేట్ గా లంకల దీపక్ రెడ్డి పోటీలో  ఉణ్న సంగతి తెలిసిందే.  గ్రేటర్ పరిధిలో  సత్తా చాటాలనీ కాంగ్రెస్, చాటుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకుని, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ, రాష్ట్రంలో మరింత బలోపేతం కావడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 

టారిఫ్ ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ కూ రెండు వేల డాలర్లు!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అస్తవ్యస్థ, హేతురహిత టారిఫ్ వార్ ను సమర్ధించుకున్నారు. తన టారిఫ్ విధానం కారణంగా వస్తున్న ఆదాయం నుంచి త్వరలోనే  ప్రతి అమెరికన్‌కు కనీసం 2వేల డాల‌ర్ల‌ చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటన ఇచ్చారు.  ఈ పంపిణీ పరిధిలోకి అధిక ఆదాయం ఉన్న సంపన్నులు రారని పేర్కొన్నారు.  ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.  తన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. అమెరికా టారిఫ్ లను వ్యతిరేకించే వారిని మూర్ఖులుగా అభివర్ణించారు.  తన హయాంలోనే  అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయమైన దేశంగా మారిందని చెప్పుకుకున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం లేదనీ, స్టాక్ మార్కెట్లలో రికార్డ్ స్థాయి టేడింగ్ జరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు.  తాను అనుసరిస్తున్న టారిఫ్ విధానం కారణంగా దేశానికి ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని పేర్కొన్న ఆయన ఈ నిధులతో  జాతీయ రుణాన్ని తగ్గిండమే కాకుండా, ప్రజలకు డివిడెండ్ రూపంలో నగదు అందిస్తానని పేర్కొన్నారు.  అయితే ఈ డివిడెండ్ ను ప్రజలకు ఎలా, ఎప్పటి నంచి పంపిణీ చేస్తారన్న విషయం మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.   మరోవైపు దాదాపు అన్ని ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతులపై భారీ టారిఫ్‌లను విధించడం ద్వారా ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ న్యాయపరమైన సవాళ్లను ట్రంప్ తోసిపుచ్చారు. టారిఫ్‌లే తన బలమైన ఆర్థిక ఆయుధమని, ఈ విధానం అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా, స్వతంత్రంగా మార్చిందని ఆయన పునరుద్ఘాటించారు.

నేలకూలిన తెలంగాణ సాహితీ శిఖరం

ప్రముఖ  కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ   సోమవారం (నవంబర్ 10) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (నవబర్ 10) తెల్లవారు జామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో  కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన  ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.   జనగాం సమీపంలోని రేబర్తి   గ్రామంలో 1961, జులై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్రగీతగా ప్రకటించింది.  తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్రపోషించిన అందెశ్రీని రేవంత్ సర్కార్ ఈ ఏడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్కరించి రూ. కోటి నగదు పురస్కారాన్ని అందజేసింది.  ఇక ఆయన పలు సినీ గేయాలు కూడా రాశారు. ముఖ్యంగా నారాయణ మూర్తి నటించి, నిర్మించిన పలు సినీమాలకు అందెశ్రీ పాటలు రాశారు.   మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు', 'సుడా సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి', 'పల్లెనీకు వందనములమ్మో', 'జన జాతరలో మన గీతం' వంటి అద్భుత గీతాలు అందెశ్రీ కలం నుంచి జాలువారినవే. అందెశ్రీకి 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరధ్వాజ సాహితీ పురస్కారాలను అందెశ్రీ అందుకున్నారు. ఇక 2022 లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది.   అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచిందన్న ఆయన అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. 

మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ...తల్లి సంచలన వ్యాఖ్యలు

  దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తన కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది జూన్ 6, 8 మిస్టరీగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణవార్త బయటపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. ‘గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా చూడటానికి సమయం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ తమకు కనీసం సమాచరం ఇవ్వలేదని ఆమె అన్నారు.  తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ గోపీనాథ్ తల్లి మాగంటి మహానందకుమారి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తన కుమారుడు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, చివరకు జూన్ 8న మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా తనను చూడనివ్వలేదని మహానంద కుమారి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు మాగంటి సునీత కుమార్తె దిషిర సూచన మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని తెలిపారు.  అయితే,   కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్‌ను కలిశారని, ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ వచ్చి వెళ్లేంత వరకు మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదని, అసలు ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కిడ్నీ మార్పిడి తర్వాత డాక్టర్లు సరైన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్‌లో జాప్యం చేశారని మహానంద కుమారి ఆరోపించారు. అంతేకాకుండా గోపీనాథ్‌కు కేటాయించిన గన్‌మెన్‌లు, భద్రతా సిబ్బంది ఆయన కుప్పకూలినప్పుడు అందుబాటులో లేరని, అత్యవసర చికిత్స (సీపీఆర్) అందించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన కోడలు సునీత, కేటీఆర్ ఇద్దరూ నిజాలు దాస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. గోపీనాథ్‌ 3 సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి తల్లిగా సమయం ఇవ్వలేదన్నారు. ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది.  లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదు. నేను గోపీనాథ్‌తో సునీత వివాహం చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో మా పేరు లేదు. కేటీఆర్‌ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చామని తెలిపారు.