పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలు!?

బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ ఆపూ లేకుండా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో రానున్న రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరు అవకాశం ఉందని స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు ప్రస్తుతమున్న ధర కంటే 77 శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి.  

తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత

తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్వాల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం  రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశాన్ని ఆ వేంకటేశ్వర స్వామి తనను పలుమార్లు కల్పించారన్నారు.  అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం కూడా ఆ స్వామి వారి సంకల్పమేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.   దాదాపు నాలుగు దశాబ్దాల కిందట  ఎన్‌.టి.రామారావు ప్రారంభించిన అన్నప్రసాద వితరణ సత్కార్యం నేడు అనేక రెట్లు విస్తరించి..  ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు. శ్రీవాణి ట్రస్ట్ కు  ఇప్పటివరకు రూ.2,038 కోట్ల విరాళాలు అందాయన్న ఆయన..  అందులో రూ.837 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. దేశలోని 29 రాష్ట్రాల రాజధానులలోనూ   శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని చంద్రబాబు టీటీడీకి సూచించారు.   తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్‌వి ప్రాణదాన ట్రస్టును తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభించామని గుర్తు చేసిన ఆయన ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.709 కోట్లు  విరాళంగా వచ్చాయన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు  వైద్య సహాయంఅందజేస్తున్నట్లు తెలిపారు.  స్వామివారి సేవకుల సేవలను చంద్రబాబు ప్రస్తుతించారు. స్వామివారి సేవకులు  స్వామివారి నిజమైన సంపద అన్నారు. 

కూష్మాండ అవతారంలో భ్రమరాంబికాదేవి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో  శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నాలుగో రోజు అంటే గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారు కూష్మాండ దుర్గ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ కూష్మాండ మాత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా, తేజోమయిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.   ఇక మూడో రోజు బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.  అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు,వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీభ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవార్లను రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, కేరళ చండిమేళం, కొమ్మ కోయ నృత్యం, స్వాగత నృత్యం,రాజ బటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు,చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవంగా కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు.  

తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్.. ప్రారంభించిన చంద్రబాబు

దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు అయ్యింది.  ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ( సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు అయిన ఈ కేంద్రం  శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా  చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది.  వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ద్వారా  భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు అవకాశం ఉంటుంది.   ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో   పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని పాతిక మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.  క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.  

వార్డు సచివాలయాల్లో సమస్యలకు చెక్.. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో  వార్డు సచివాలయాలలో పాలనాపరమైన సమస్యలకు తెరపడినట్లే. ఇప్పటి వరకూ గ్రామ, వార్డు సచివాలయాలలో విద్యాంశాలను డిజిటల్ సెక్రటరీయే చూస్తున్నారు. దీని వల్ల ఇంత కాలం డిజిటల్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతూ వచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీల విధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. దీంతో  ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో మాదిరిగానే వార్డులలోనే విద్యను సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షణలోకి వెడుతుంది. దీంతో పాలనాపరంగా సమస్యలకు తెరపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.  

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు.  గురువారం (సెప్టెంబర్ 25) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతోంది. అదే టైమ్ స్లాట్ భక్తులకు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.   మూడు వందల రూపాయల ప్రత్యేక  ప్రవేశ దర్శనం  టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటగంటన్నర సమయంలో కలుగుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 24) శ్రీవారిని  58,628 మంది దర్శించుకున్నారు. వారిలో 21,551 మంది  తలనీలాలను సమర్పించుకున్నారు.  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్షరూపాయలు వచ్చింది. 

నాగోల్‌లో ప్రియుడి ఇంట్లో మహిళ ఆత్మహత్య

  మానవత్వం తో ఆలోచించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పు...ఆ తప్పే  అతని నిందితుడిగా నిలబెట్టింది...నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.మహబూబాబాద్ జిల్లా రెడ్యాల చెందిన ఓ స్వరూప (38) అనే మహిళ కు భర్త, కుమారుడు (3) ఉన్నాడు. జీవ నోపాధి నిమిత్తం ఈ కుటుంబం హైదరాబాద్ నగరానికి వచ్చి నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు . ఆ మహిళ కుటుంబం నివసించే సమీపంలోనే బానోతు అనిల్ నాయక్(24) అనే యువకుడు నివసిస్తున్నాడు.  ఈనెల 19వ తేదీన కుమారుడిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నారని చెప్పి ఇంట్లో నుండి బయటకు వచ్చిన స్వరూప.... అనిల్ వద్దకు వెళ్ళింది.   ఈనెల 21వ తేదీ వరకు వారిద్దరూ కలిసి ఉన్నారు. 21వ తేదీన అనిల్ కూరగాయలు కొనుగోలు చేయడానికి బయటికి వెళ్లాడు. ఇంతలోనే స్వరూప బాత్రూం వెళ్ళింది. బాత్రూం హ్యాంగర్ కు ఉరివేసుకుంది.. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అనిల్ కు స్వరూప కనిపించ లేదు. దీంతో అతడు బాత్రూం డోర్ ను గట్టిగా కొట్టాడు. అతి కష్టం మీద బాత్రూం డోర్ ను పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ఇప్పటికే ఆ మహిళ తుది శ్వాస విడి చింది. ఆమె మర ణించడంతో అతడు భయపడ్డాడు. దీంతో అతని కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని... కత్తితో చేతిని కోసుకున్నాడు.  ఇంతలోనే స్వరూప కుమారుడు అక్కడికి వచ్చి.. తన తల్లిని పిలుస్తూ గట్టి గట్టిగా ఏడవ సాగాడు. స్వరూప కుమారుడిని చూసి అనిల్ మనసు మార్చుకొని వెంటనే  తన చేతికి రుమాలు కట్టుకొని..  నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం పోలీసులు  అనిల్ నాయక్ తో ఆ మహిళకు ఎటు వంటి సంబంధం ఉంది? ఆసుపత్రికి వెళ్తానని చెప్పి నేరుగా అనిల్ ఇంటికి రావడం ఏమిటి? అనిల్ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి?అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సెన్సేషన్ ఆపరేషన్ చేస్తున్న తెలంగాణ సీఐడీ

  తెలంగాణ సీఐడి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసు కున్న తెలంగాణ సిఐడి విచారణ చేస్తున్నారు.. మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు . ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి విచారణ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడి లక్షల్లో డబ్బులు కోల్పోయి... చివరకు  ఆత్మ హత్య లకు  పాల్పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించా లని నిర్ణయించు కున్నారు.అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు. 6 ప్రత్యేక బృందాలను పంపి 8 మంది నిందిత ఆపరేటర్ల ను అరెస్ట్ చేశారు.ఈ 6 బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ, ప్రజలకు భారీగా నష్టాలు కలిగించి నట్లుగా సిఐడి పోలీసులు గుర్తించారు.సిఐడి చేసిన ఈ దాడుల్లో అనేక హార్డ్వేర్ పరికరాలు, వాటిలోని విస్తృతమైన డేటాను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశమున్నందున, వారి గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.

విజయవాడ ప్రజల ఆతిథ్యం హృదయాన్ని తాకింది : ఉపరాష్ట్రపతి

  విజయవాడ ఉత్సవ్ మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగాలని ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్  ఆకాంక్షించారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025 లో ఉపరాష్ట్రపతి  పాల్గొనన్నారు. తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయిని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.  సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.  నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తుచేశారు. “దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకం. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సంప్రదాయం భారతీయుల అదృష్టం. ఇది సాంప్రదాయానికి, సంస్కృతికి అద్దం పడుతోంది” అని పేర్కొన్నారు. మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయి అని ఉపరాష్ట్రపతి చెప్పారు.విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ ఆయన, “విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్. రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోంది” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై మాట్లాడుతూ, “విద్య, వైద్యం రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోంది. వికసిత భారత్ అనేది ఒక కల కాదు, అది నిజం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోంది” అని అన్నారు. ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన విజయవాడకే రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, “విజయవాడలో అద్భుతమైన గౌరవం లభించింది. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణం. కనకదుర్గ అమ్మ పేరులోనే అనుగ్రహం, ప్రేమ, అమృతం నిక్షిప్తమై ఉంది” అని భావోద్వేగంగా తెలిపారు. మంత్రులు, అధికారులు అందరూ కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాక, ఉత్సవ వేదికపై గాయని గీతా మాధురి పాడిన పాటలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగం, విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్న వేలాది మంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా, నగర అభివృద్ధి పై ఆయన విశ్వాసపూర్వక మాటలు హాజరైన వారందరిలో ఆనందాన్ని కలిగించాయి.  

శ్రీవారికి భారీ బంగారు కానుక

  తిరుమల శ్రీవారికి వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజెస్‌  ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం పాల్గోన్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.  టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ అశోక్‌ సింఘాల్‌ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభంపై ఎగిరే ఈ గరుడ పతాకమే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, ఇతర గణాలను ఆహ్వానించే శుభ సూచికమని అర్చకులు వివరించారు. ధ్వజారోహణం అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.  

9 మంది తమిళనాడు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

  అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మాచిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న తమిళనాడుకు చెందిన  9 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.34.40 లక్షలు విలువ చేసే 344 కేజీల బరువు వున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు  జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.       రాయచోటిలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ  మాచిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా సాగుతోందని సమాచారం అందిందన్నారు. సమాచారం అందుకున్న రాయచోటి రూరల్ సి.ఐ వరప్రసాద్   రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ సి.ఐ మధు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి బుధవారం తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో తొగురుపల్లి క్రాస్ వద్ద కాపు కాశారన్నారు.   ఈ క్రమంలో మాచిరెడ్డిగారిపల్లె వైపు నుండి ఒక కారు వచ్చి ఆగిందన్నారు. అంతలోనే ప్రక్కనే వున్నటువంటి మామిడి తోపు నుండి కొంత మంది  ఎర్రచందనం  దుంగలను తీసుకుని కారులో లోడ్ చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారన్నారు. అందులో కొంత మంది కారులో ఎక్కి పోలీసులను గుద్దే ప్రయత్నం చేస్తూ అక్కడ నుంచి తప్పించుకుని పోయారన్నారు.  వెంటనే అప్రమత్తమైన పలీసులువారందరిని వెంబడించి వారిలో 9 మంది మందిని అరెస్టు చేసి, 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వివరించారు. అరెస్టు చేసిన తమిళ ముద్దాయిలు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరు తప్పిందుకుని పోయినట్లు తెలిసిందని, వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులు, పోలీసు, ఆర్.ఎస్.టి.ఎఫ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.  

పెళ్లి వేడుకలోనూ పార్టీ రంగు పట్ల నిబద్ధత చూపించిన మంత్రి నిమ్మల

  మాములుగా పెళ్లిళ్లలో వధూవరుల బంధువులు, అతిథులు పట్టువస్త్రాలు, ఖరీదైన దుస్తులతో మెరిసిపోతారు. కానీ ఆ రీతిని మించి ప్రత్యేకత చూపించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. తన కుమార్తె వివాహ వేడుకలోనూ ఆయన తన ట్రేడ్‌మార్క్ పసుపు రంగు చొక్కాతోనే హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీపై తనకున్న అచంచల విశ్వాసం, విధేయతను మరోసారి చాటుకున్న ఆయన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం మంత్రి రామానాయుడు కుమార్తె శ్రీజ పెళ్లి సాయి పవన్ కుమార్‌తో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందరూ పట్టువస్త్రాల్లో మెరిసిపోతుండగా, రామానాయుడు మాత్రం పసుపు చొక్కాతోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ కార్యక్రమమా, కుటుంబ వేడుకనా అన్న తేడా లేకుండా ఆయన ఎప్పుడూ పసుపు చొక్కానే ధరిస్తారని అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జరిగిన నిశ్చితార్థ వేడుకలోనూ ఇలాగే కనిపించడంతో నారా లోకేశ్ సరదాగా "పెళ్లికొడుకులా తయారవుతారని అనుకుంటే, మళ్లీ పసుపు చొక్కాతోనే వచ్చేశావేంటి" అని ఆటపట్టించగా, "పసుపు శుభసూచకం సార్" అని ఆయన ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది. పాలకొల్లు నుంచి వరుసగా మూడుసార్లు శాసన సభ్యుడుగా గెలిచి, 2019 వైసీపీ జోరు మధ్యలోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన రామానాయుడు, పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన విశ్వసనీయతను గుర్తించిన చంద్రబాబు, ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. ఇక ఇప్పుడు కుమార్తె పెళ్లిలో కూడా పార్టీ రంగును వీడకపోవడం, ఆయన విధేయతకు నిదర్శనంగా తెలుగు తమ్ముళ్లను ఆకట్టుకుంటోంది.

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

    తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వరస్వామికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.  తిరుమల గాయత్రి నిలయం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.. సీఎం పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 25న ఉదయం 9.10కి వెంకటాద్రి నిలయానికి చేరుకుని ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తదితరాలను ప్రారంభిస్తారు. 9.50 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అనంతరం 10.40కి తిరుగు ప్రయాణమవుతారు.

ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు

  తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కూతురుపై ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు కారులో వచ్చి కూతురిని కిడ్నాప్ చేసి తీసు కువెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని నర్సంపల్లి గ్రామంలో నివాస ముంటున్న శ్వేత అనే యువతి, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువ కుడ్ని ప్రేమించింది. కానీ వీరి ప్రేమను శ్వేత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమ జంట పెద్దల్ని ఎదిరించి గత నాలుగు నెలల క్రితం పెళ్లి  చేసుకున్నారు.  కూతురు తమకు నచ్చని వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు కోపంతో రగిలిపో యారు. ఎలాగైనా సరే తన కూతుర్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు బుధవారం తెల్లవారుజామున శ్వేత తల్లిదండ్రులు వారి బంధువుల సహాయంతో కూతురు అత్తవా రింటికి వెళ్లి ప్రవీణ్ పై దాడి చేయడమే కాకుండా శ్వేత కళ్ళులో కారం చల్లి... కండ్లకు బట్టకట్టి కొట్టు కుంటూ ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసు కెళ్లారు.  అయితే ఈ ఘటనకు సంబం ధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి.. అనంతరం ప్రవీణ్ తన భార్యను కిడ్నాప్ చేశారని కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల మోసం

  హైదరాబాదులో ఫేక్ ఏపీకే యాప్‌ల మోసాలు వెలుగు లోకి వచ్చాయి... సైబర్ చీటర్స్ ఏ చిన్న అవకాశం దొరికినా  కూడా దానిని వాడేసు కుంటున్నారు. నిన్న మొన్నటి వరకు మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్స్ వచ్చా యని.... లేదంటే మనీ ల్యాండరింగ్ జరిగిందని భయ పెడుతూ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్ప డ్డారు. చివరకు పహల్గావ్ టెర్రర్ ఘటనలను కూడా ఈ చీటర్స్ వాడేసుకున్నారు. ఇప్పుడు తాజా గా ఏపీకే యాప్ల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి... ఓటీపీ లను లాగుతూ...  కొత్త నయా దందా కు తెరలేపారు. ఇలా ఫేక్ ఏపీకే యాప్ సృష్టించి... ఫోన్లను హ్యాక్ చేసి అనం తరం ఓటిపి తెలుసుకొని వారి బ్యాంకు గుల్ల చేస్తున్నారు. ఆర్టీవో చలనా ఇలా నకిలీ ఏపీకే యాప్ లతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.హైదరాబాద్ నగరం లోని ముషీరాబాద్, చుడిబజార్, బోలా కపూర్‌ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు వేరువేరు పనుల కోసం ఏపీకే యాప్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో ఈ ముగ్గురు  మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అనంతరం సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి మీ ఫోన్ కి ఓటీపీ నెంబరు వచ్చిందని అది వెంటనే చెప్తే నీ పని అయిపోతుందని నమ్మబలిగారు.. అది నిజమని నమ్మిన ఆ ముగ్గురు వ్యక్తులు ఓటిపి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారి ఫోన్ కి బ్యాంకు నుండి ఓ మెసేజ్ వచ్చింది. అది చూసిన ముగ్గురు ఒక్కసారి గా షాక్ గుర య్యారు. ఈ ముగ్గురి బ్యాంకు ఖాతాల్లో ఉన్న 4.85 లక్షల రూపా యలు మాయమ య్యాయి. బ్యాంకు నుండి వచ్చిన మెసేజ్ ను చూసిన ఈ ముగ్గురు వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించారు. బ్యాంక్ అధికారులు మోసపోయారని పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు.  దీంతో ఆ ముగ్గురు లబోదిబో మంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎప్పుడూ అధికారిక స్టోర్‌ల నుండి మాత్రమే యాప్ డౌన్‌లోడ్ చేయండి..అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి... మోసం జరిగితే వెంటనే 1930 కాల్ చేయండి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు విన్నపం చేశారు.

వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

  తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళ్యాణవేదికలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనశాల మరియు ఫోటో ఎగ్జిబిషన్‌ను చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. పుష్పాలంకరణలు, శిల్పకళా ప్రదర్శనలు దర్శనార్థులకు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ప్రతి విభాగం ఒక ప్రత్యేక కళాఖండంలా అలరించింది. అలాగే తిరుమలలో మీడియా సెంటర్‌ను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీడియా పాత్ర బ్రహ్మోత్సవాల విజయానికి కీలకమని నాయుడు పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలు సహజమని, వాటిని పెద్దవిగా చూపించకుండా, సానుకూల దృక్పథంతో ఉత్సవాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే టీటీడీ యంత్రాంగం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఉత్సవాల విజయానికి మీడియా పూర్తి స్థాయి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతున్నాయి.  

టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వినియోగం

దేశంలోనే  తొలి సారిగా తెలంగాణ ఆర్టీసీ ఏఐ సేవలను వినియోగించుకోనుంది. అత్యాధునిక పరిజ్ణానాన్ని అందిపుచ్చుకుని సేవలను మెరుగుపరుచుకునే దిశగా ఆర్టీసీ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే  ఇప్పటికే  అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని టీజీ ఆర్టీసీ నిర్ణ‌యించింది.  ఉత్పాదకత పెంపు, సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి ప‌ర్య‌వేక్షణ‌, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటుతో పాటు సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏఐ వినియోగం దిశగా అడుగు వేసింది. దీంతో   దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగాన్ని చేపట్టిన ప్ర‌జా ర‌వాణా సంస్థ‌గా టీజీఎస్ ఆర్టీసీరికార్డు సాధించింది.  ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ టీజీఎస్ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తుంది. తెలంగాణ ఆర్టీసీలో ఏఐ వినియోగం కోసం ఒక ప్రత్యేక టీమ్ ను సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసింది. టెక్నాలజీపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారులకు ఆ బృందంలో ప్రాధాన్యతను ఇచ్చింది ఏఐ వినియోగంపై ఆ బృందానికి  హన్స ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ శిక్ష‌ణ ఇస్తోంది.  ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొద‌ట‌గా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఉద్యోగుల‌కు చేసిన వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా ఆరోగ్య ప‌రిస్థితిని ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో దీనిని అమలు చేసి చూశారు. సత్ఫలితాలు రావడంతో ఇప్పుడు దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలోనూ అమలు చేస్తున్నారు.  త్వ‌ర‌లోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌కు టీజీఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అలాగే.. పండుగులు, సెలవు దినాలలో ప్రయాణీకుల రద్దీని ఏఐ స‌హ‌కారంతో  అంచ‌నా వేసి.. ఆ మేర‌కు బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  కాగా టీజీఎస్ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్ట్ అమ‌లుపై  డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాల‌యంలో  ఇటీవ‌ల ర‌వాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ   సజ్జనర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం కోసం 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్  కీలక పాత్ర పోషిస్తున్నదని మంత్రి  ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలిపారు.   ఈ సంస్థర్భంగా తెలంగాణ ఆర్టీసీ పని తీరు మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఏఐని వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రపంచంలో ఏఐ ప్రభావితం చేయని రంగమే లేదన్నారు.  ఏఐ ప్రాజెక్ట్ అమ‌లుకు సమష్టిగా ప‌నిచేసి.. ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. ఏఐ ప్రాజెక్ట్ రూపకల్పనలో విశేషంగా తోడ్పడిన హన్స ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్‌పీకి చెందిన త్రినాధబాబు, సునీల్ రేగుళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.