విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

    ఏపీలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధుల  కోసం సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా, ఎంతమంది విద్యార్ధులకైనా చదువుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. అటు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ నూతన  లోగోను ఆవిష్కరించారు. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది.  తెలంగాణలో సమాచార హక్కు కమిషన్‌లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ సర్కార్ ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు.

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డులు

  2025 సంవత్సరానికి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డులు లభించాయి.  రోగ నిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనకు గాను మేరీ బ్రన్కో (అమెరికా), ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి. మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణాలు, అవయవాలపై దాడి చేయకుండా ఎలా నియంత్రించబడుతుందనే అంశంపై కీలక రహస్యాన్ని వీరు ఛేదించారు. ఈ విప్లవాత్మక ఆవిష్కరణకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నారు. వీరి పరిశోధనలు ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్  అనే విధానంపై దృష్టి సారించాయి. ఈ ప్రక్రియలో, నియంత్రిత టీ కణాలు అని పిలువబడే ప్రత్యేక రోగనిరోధక కణాలు శరీరంలో ఆటోఇమ్యూన్ వ్యాధులను అడ్డుకునే రక్షకులుగా వ్యవహరిస్తాయని వారు నిర్ధారించారు. ఈ కణాలు శరీరానికి వ్యతిరేకంగా దాడి చేసే ఇతర ఇమ్యూన్ కణాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నోబెల్ కమిటీ ప్రకారం, అక్టోబర్ 6 నుంచి 13 వరకు వివిధ విభాగాల విజేతలను ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభాగాలతో ప్రారంభమై, అక్టోబర్ 9న సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి విజేతను స్టాక్‌హోమ్‌లో ప్రకటిస్తారు. అనంతరం అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును వెల్లడించనున్నారు.

అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి నారాయణ భరోసా

  అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్‌ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ  పరిశీలించారు. దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు.            ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్‌లో అగ్నిప్రమాద విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని తెలిపారు. వ్యాపారులకు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పానని... ప్రమాదానికి గురైన షాపులను ఆయన పరిశీలించినట్లు తెలిపారు.  వచ్చే సోమవారంలోపు  రెన్యువేషన్ పనులను పూర్తి చేయాలని మంత్రి  అధికారులను ఆదేశాలు జారీ చేశారు.. బాధితులకు చెప్పిన విధంగా నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామని మంత్రి తెలిపారు. 2014లో సంతపేట మార్కెట్ ను అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అయితే 90 శాతం పనులు కూడా పూర్తి చేసామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రారంభించలేదని మండిపడ్డారు.. మార్కెట్ వ్యాపారస్తులందరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని  భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, రాష్ట్ర వేర్ హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు, నగర మహిళా అధ్యక్షులు కపిర రేవతి, కార్పొరేటర్లు ,డివిజన్  ప్రెసిడెంట్లు ,టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకున్న న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ.. పవన్ కల్యాణ్

జస్టిస్ గోపాల గౌడ్ నేటి తరానికి రూల్ ఆఫ్ లా స్థాపనలో దారి చూపాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అన్నారు. కర్ణాటక చిక్కబళ్లాపూర్‌ జిల్లా చింతామణిలో సోమవారం (అక్టోబర్‌ 6) సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాల  అమృతమహోత్సవ (80వ జన్మదిన) వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన భాష, ప్రాంతాలూ వేరు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్, కర్నాటక మధ్య సాంస్కృతి, సంప్రదాయాల విషయంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు.  కోలార్, చిక్కబళ్లాపుర్‌ ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల మధ్య సహకార గురించి ఉదాహరణలుగా పవన్ కల్యాణ్  ఏపీలో ఏనుగుల దా డిలో పంటపొలాలు నాశనం కాకుండా కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులు ఇచ్చి  కర్ణాటక ప్రభుత్వం సహకరించిందనీ,  శ్రీశైలం దేవస్థానానికి వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాల విషయంలో  ఏపీ సానుకూలంగా ఉందనీ చెప్పారు.  ఇక జస్టిస్ గోపాల్ గౌడ గురించి మాట్లాడుతూ, ఆయన తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకులకు అంకితం చేశారని అన్నారు. 2019 ఎన్నికలలో తాను పరాజయం పాలైన సమయంలో తనకు ధైర్యం చెప్పిన వ్యక్తి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ అని పవన్ కల్యాణ్ చెప్పారు. న్యాయమూర్తిగా ఆన ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చి జస్టిస్‌ గోపాల గౌడ వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేసుకున్నారని పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన ఎన్నో కీలక తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. భూ ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినా అడ్డుకున్నారని అన్నారు.  అలాగే జస్టిస్ గోపాలగౌడ మాట్లాడుతూ..  పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ధృక్పథం తనకు ఇష్టమన్నారు.   

ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

  ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సెబాస్టియన్ నియమించిన కేబినేట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌కు సెబాస్టియన్ రాజీనామా అందించగా దాన్ని ఆమోదించారు. ఫ్రాన్స్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆదివారం నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సెబాస్టియన్‌ కూర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు. అధ్యక్షుడు మెక్రాన్‌ ఆ రాజీనామాను ఆమోదించారు. బడ్జెట్‌ సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా విధానాలతో ఏర్పడ్డ అంతర్జాతీయ గందరగోళం కారణంగా ఫ్రాన్స్‌ ఇప్పటికే కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇవన్నీ కలసి దేశంలో రాజకీయ అనిశ్చితి పెరగడానికి దారి తీశాయి. గడచిన రెండేళ్లలో సెబాస్టియన్‌తో కలిపి ఐదుగురు ప్రధానులు రాజీనామా చేయడం విశేషం.

సీఆర్డీయే ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం 13న

ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (సీఆర్డీయే) ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఇంకా అరకొరగా మిగిలి ఉన్న పనులను అక్టోబర్ 13 ముహూర్తం నాటికి పూర్తిచేయడానికి అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.  తొలుత ఈ కార్యాలయాన్ని స్వాతంత్ర్యదినోత్సవం నాడు అంటే ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే దానిని వాయిదావేసి దసరాకు ప్రారంభించాలని తేదీ ప్రకటించారు. అయితే అప్పట్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, నాణ్యతా పరీక్షలలో జాప్యం  కారణాలతో వాయిదా పడింది.  ఇప్పుడు తాజాగా అక్టోబర్ 13న ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు.   అమరావతి నిర్మాణం, ప్రణాళిక విభాగాలు, మునిసిపల్, హెవోడీ కార్యాలయాలూ అన్ని ఒకే చోటనిర్మాణం, ప్రణాళిక అన్నీ ఈ సీఆర్డీయే కార్యాలయ భవనంలోకి వచ్చేస్తాయి.  3లక్షల చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంవిస్తీర్ణంలో ఉంది. వాస్తవానికి ఈ కార్యాలయ భవనం 2014-2019 మధ్యలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కాలేదు. జగన్ హయాంలో ఈ నిర్మాణ పనులు మూలన పడేసింది. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాతనే సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం జోరందుకుంది. ఈ కార్యాలయం కేంద్రంగానే  కమాండ్ కంట్రోల్ రూమ్ సహా రాజధాని ప్రాంతంలోని అన్ని కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవేక్షణా సాగుతుంది. 

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు

  ఏపీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీసులకు మెయిల్ పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఆ బెదిరింపు ఈమెయిల్ లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. కాలేజి వద్ద హెలిప్యాడ్ పరిసరాల్లో అణువణువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  ఓ ఫ్యామిలీ ప్రోగ్రాం కోసం ముఖ్యమంత్రి కుటుంబం స్వగ్రామం నారావారిపల్లె వస్తున్నారు. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనుండగా... సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి వస్తున్నారు. ఆయన రాక కోసం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.   

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు శుభ పరిణామం : డిప్యూటీ సీఎం భట్టి

  బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంలో విచారణ సందర్బంగా ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి  సుప్రీం కోర్టులో ఉన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి  మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉందని భట్టి తెలిపారు. కొందరు దురుద్దేశంతో కావాలనే బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని  డిప్యూటీ సీఎం దీమా వ్యక్తం చేశారు.  మరోవైపు  పీసీసీ చీప్ మహేష్ గౌడ్ స్పందిస్తూ.. సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని మహేష్ గౌడ్ అన్నారు.  

సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం!

సీజేఐ గవాయ్ పై సుప్రీం కోర్టులోనే దాడిక యత్నం జరిగింది. ఈ దాడికి ప్రయత్నించినది సుప్రీం కోర్టు న్యాయవాదే కావడం విశేషం. సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనంలో సోమవారం (అక్టోబర్ 6() కేసు విచారణ జరుగుతుండగా ఒ లాయర్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై చెప్పు విసిరారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.  లాయర్ విసిరిన చెప్పు జస్టిస్ గావాయికి తగలలేదు. ఈ ఘటన తరువాత జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ఇటువంటి దాడులకు భయపడేది లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నించిన న్యాయవాదిని రాకేష్ కిషోర్ గా అని గుర్తించారు. అయితే ఆయన చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడడానికి కారణమేంటన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇటవల ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ దేవుడిని అడగండి అని వ్యాఖ్యానించారనీ, అలా వ్యాఖ్యానించడం ద్వారా జస్టిస్ గవాయ్ సనాతనాన్ని కించపరచడంగా భావిస్తూ రాకేష్ కిషోర్ ఈ దాడికి ప్రయత్నించి ఉంటారని కొందరు అంటున్నారు. కాగా చీఫ్ జస్టిస్ పై దాడికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్ పై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన అనంతరం సుప్రీం కోర్టు కార్యకలాపాలు యాథావిథిగా కొనసాగాయి. 

సాఫ్ట్ వేర్ రంగంలో సంక్షోభం.. కారణమదేనా?

పాతికేళ్లుగా దేశంలో దినదినప్రవర్ధమానంగా పెరిగిన ఐటీ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది.  దేశంలో నియో మిడిల్ క్లాస్ కు పునాది వేసిన ఐటీ రంగం దేశ ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదం చేసింది. ఈ నియో మిడిల్ క్లాస్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అదెలా అంటే..  ఈ వర్గమే కొనుగోళ్లకు ముందు వెనుకలాలోచించకుండా ముందుకు దూకుతుంది. తద్వారా మార్కెట్లు కళకళలాడుతున్నాయి.  ఐటీ రంగంలో పని చేసే వారికి లక్షల్లో వేతనాలు రావడంతో.. వారు కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. ఇలా ఐటీ రంగం విస్తృతితో సమాజంలో కొత్తగా ఆవిర్భవించిన ఈ నియో మిడిల్ క్లాస్.. ఇప్పుడు ఐటీ రంగం సంక్షోభంలో పడటంతో నియో పూర్ గా మారే అవకాశం ఉంది. అంటే సొంత ఇల్లు, లావిష్ ఫర్నిచర్, కార్లు అన్ని ఉండి కూడా కనీస అవసరాలు తీర్చుకునేందుకు సొమ్ములు లేని వర్గం అన్నమాట.   ఇప్పుడీ సంక్షోభానికి కారణమేంటని ఆలోచిస్తే.. ఐటీ ఉద్యోగాలలో మంచి వేతనాలు, జీవనస్థాయి పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో  ఇంజినీరింగ్ విద్యపై మక్కువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు పుంఖాను పుంఖాలుగా వెలిశాయి. ప్రతిభా, సామర్ధ్యం, జ్ణానం వంటి వాటితో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ పట్టభద్రులయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో అత్యధికులు సాఫ్ట వేర్ ఇంజినీరింగ్ కోర్సుల పట్లే మక్కువ చూపి చేరడంతో    గత కొన్నేళ్లుగా ఈ రంగంలో మాంద్యం ఏర్పడింది. కొత్త ఉద్యోగాల కల్పన మందగించింది.  పలు ఐటీ కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం అటుంచి.. ఉన్నవారిని తొలగించే చర్యలు ప్రారంభించాయి. ఉదాహరణకు  టీసీఎస్ గత రెండేళ్లుగా వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.  ఆ ఉద్వాసనల పర్వం ఈ ఏడు కూడా కొనసాగుతుందని ప్రకటించింది కూడా. ఉద్వాసన పలికే ఉద్యోగికి రమారమి రెండేళ్ల వేతనం ఇచ్చి సాగనంపుతోంది. అలాగే మైక్రోసాఫ్ట్ లో కూడా ఉద్వాసనల పర్వం మొదలైంది. ఆ కంపెనీ ఇంచుమించు 15 వేల మందిని సాగనంపింది. ఇంకా అమెజాన్, ఇన్ఫోసిస్, డెలాయిట్ ఐబీఎం వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు లేఫ్స్ ప్రకటిస్తున్నాయి.   వాస్తవానికి ఐటీ కంపెనీలలో ఉద్వాసనకు గురౌతున్న వారంతా టెక్నికల్ గా అప్ డేట్ కానివారేనని అంటున్నా.. అది పూర్తిగా వాస్తవం కాదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ కు మించి అభ్యర్థులు అందుబాటులో ఉండటంతో.. నైపుణ్యం ఉన్నా హై సాలరీడ్ ఉద్యోగులకు ఇంటి దారి చూపడానికే ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని చెబుతున్నారు.  అన్నిటికీ మించి ఏఐ, క్యాంటమ్ కంప్యూటింగ్ కూడా  ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటివల్ల భవిష్యత్లో ఐటీ ఉద్యోగాలలో మరిన్ని భారీ కోతలు అనివార్యమని అంటున్నారు.   

సా...గుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణం.. బెజవాడను వీడని ట్రాఫిక్ కష్టాలు

కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో  నిర్మిస్తున్న జాతీయ రహదారి,  విజయవాడ వెస్ట్ బైపాస్  కొన సా,,,గుతూనే ఉంది. గత వైసీపీ హయాంలో ఈ బైపాస్ నిర్మాణం 80 శాతం పూర్తయ్యిందని చెప్పుకుని తమ భుజాలను తామే చరిచేసుకున్న కాంట్రాక్టర్లు.. ఇప్పుడు మిగిలిన 20 శాతం పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి 80శాతం పూర్తయ్యిందంటూ గతంలో వారు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమనీ, బిల్లులు వసూలు చేసుకుని పనులను పక్కన పెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి.   సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇతర ప్రాంతాలలో కనెక్టివిటీ కి ఈ బైపాస్ నిర్మాణం నత్తనడకను గుర్తు చేస్తుండటంతో... అవరోధాలు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా  బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తొలగడం లేదు.  ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో.. బెజవాడ నగరం నడిబొడ్డు నుంచే భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో బెజవాడ నగరం   నిత్యం ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. కృష్ణాజిల్లా చిన్న అవుట్ పల్లి నుండి, గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు.. దాదాపు  47.8 కిలోమీటర్ల  మేర విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం  2021 లో ప్రారంభమైంది.  ఇది పూర్తయితే..  కోల్ కతా,  ఒరిస్సా విశాఖ ల నుండి  వచ్చే భారీ వాహనాలు, హైదరాబాద్ చెన్నై వంటి నగరాలకు బెజవాడలోకి రావలసిన పని ఉండది.  చెన్నై, కోల్ కతాలకు వెళ్లే, వచ్చే భారీ వాహనాలు  ఇటు గన్నవరం సమీపంలోని చిన్న ఔట్ పల్లి, అటు మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ చేరుకుంటాయి. దీంతో  బెజవాడకు ట్రాఫిక్ భారం తొలగిపోతుంది. ఇక హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి జంక్షన్ వద్ద   డైవర్ట్ అవుతాయి.  వెస్ట్ బైపాస్ జాతీయ రహదారిపై అమరావతి గుండా ప్రయాణం చేసి , మూడు కిలోమీటర్ల పైగా నిర్మించిన కృష్ణ వారధిని దాటుకుంటూ వాహనాలు  చెన్నై హైదరాబాద్ కోల్ కతా వంటి నగరాలకు చేరుకునేందుకు జాతీయ రహదారిపైకి నేరుగా చేరుకుంటాయి.  అంతే కాదు ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే.. గుంటూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణంలో దాదాపు గంట సమయం ఆదా అవుతుంది.  ఈ బైపాస్ పూర్తై.. బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తీరే రోజెప్పుడొస్తుందా? అని జనం ఎదురు చూస్తున్నారు.  

మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ.. 50 మంది అరెస్టు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని పెద్దమంగళం  లో ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు ఆదివారం (అక్టోబర్ 5) రాత్రి పోలీసులు దాడి చేసి దాదాపు 50 మంది యువతీయువకులను అదుపు చేసుకుంటున్నారు. ఆ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఓఎస్టీ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టైన వారిలో పన్నెండు మంది అమ్మాయిలు, 38 మంది అబ్యాయిలు ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లే కావడం విశేషం.   ఆ ఫామ్ హౌస్ యజమాని ఒక్కొక్కరి నుంచి 13 వందల రూపాయలు ఎంట్రీఫీజుగా వసూలు చేసి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడిలో  పెద్ద ఎత్తున మద్యం, గంజాయి పట్టుబడినట్లు చెబుతున్నారు. అలాగే యువత గంజాయి సేవించినట్లు టెస్టుల్లో తేలింది.  అరెస్టు చేసిన యువతీ యువకులను మొయినాబాద్ పీఎస్ కు తరలించారు.  అలాగే పామ్ హౌస్ యజమానికి కూడా అదుపులోనికి తీసుకున్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది.  వారాంతాలలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతుంటారు. సోమవారం (అక్టోబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 83 వేల 412 మంది దర్శించుకున్నారు. వారిలో  33 వేల 68 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 9 లక్షల రూపాయలు వచ్చింది. 

శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి : సీఎం చంద్రబాబు

  శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలోనే అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  శ్రీశైల క్షేత్రంలో వసతుల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసిన దివ్యక్షేత్రంగా శ్రీశైలం గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆలయ సమగ్రాభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణపై చర్చించారు. ఏటా లక్షలాది భక్తులు శ్రీశైలాన్ని సందర్శిస్తున్నందున, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. తిరుమల నమూనాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ దృక్కోణాల్లో శ్రీశైలం ప్రాంత అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. దేవాలయ విస్తరణ కోసం సుమారు 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా, శ్రీశైలాన్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య సంవత్సరానికొకసారి పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ సమగ్రాభివృద్ధికి వేగవంతమైన చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యాల విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. శబరిమల వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, వాటి తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కోల్డ్రీఫ్ దగ్గు సిరప్ బ్యాన్

  కోల్డ్రీఫ్ దగ్గు మందు సిరప్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరప్‌ను తెలంగాణలో బ్యాన్ చేస్తూ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దగ్గు మందులో 42% విష రసాయనం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. మరోవైపు ఈ దగ్గు సిరప్‌ ను సూచించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.  ఆదివారం తెల్లవారుజామున డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధిత చిన్నారులకు ఇచ్చిన దగ్గు మందును ఈయనే సూచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం అతడిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు.ఇదే సమయంలో, ఆ మందును తయారు చేసిన తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీసన్‌ ఫార్మా కంపెనీపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్‌ పరీక్షల్లో ఆ కంపెనీ తయారు చేసిన సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత విషపూరితమైన రసాయనమని, మానవ శరీరానికి హానికరమని అధికారులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో, ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  

రావ‌ణుడ్ని కాల్చ‌వద్దంటూ...రోడ్డెక్కిన బ్రాహ్మ‌ణులు!

  దేవుడా ఈ స‌మాజాన్నినువ్వే కాపాడాలి? అయినా ఎటు పోతోందీ స‌మాజం? ఏంటీ వైప‌రీత్యం.. నువ్వే మాకు ర‌క్ష అంటూ ప్రార్ధించాల్సి వ‌స్తోంది చూస్తోంటే.. తాజాగా కొంద‌రు బ్రాహ్మ‌ణులు.. ఒక కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు.. అదేంటంటే  రావ‌ణుడు బ్రాహ్మ‌ణుడు ఆయ‌న్ను ద‌స‌రా సంద‌ర్భంగా కాల్చ‌వ‌ద్దంటూ డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ద‌ళితులు రావ‌ణుడు, న‌ర‌కాస‌రుడు మా వాళ్లు. వాళ్ల‌ను అవ‌మానించ‌వ‌ద్ద‌న్ని వీరి వాద‌న‌గా ఉంటూ వ‌చ్చింది ఇన్నాళ్లు. ఇప్పుడీ వాద‌న కాస్తా బ్రాహ్మ‌ణులు అందుకున్నారు. దీంతో రావ‌ణుడు ఎవ‌ర‌న్న చ‌ర్చ‌కు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. బేసిగ్గానే రావ‌ణుడ్ని పిలవ‌డ‌మే రావ‌ణ బ్ర‌హ్మ అంటారు. అలాంటి రావ‌ణ బ్ర‌హ్మ బ్రాహ్మ‌ణుడ‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి పురాణాలు తిర‌గ‌వేయ‌క్క‌ర్లేదు. ఇక న‌ర‌కాస‌రుడు కూడా రాక్ష‌సుడేం కాదు.. మ‌హా విష్ణువు వ‌రాహ అవ‌తారంలో భూమిని కాపాడిన‌పుడు జ‌రిగిన సంయోగం ద్వారా పుట్టిన వాడు. అత‌డి పుట్టుక‌కు బీజం వేసిన వేళా విశేషం.. రాక్ష‌స ల‌క్ష‌ణాలు అల‌వ‌డ్డాయి. దీంతో.. అత‌డు జ‌న‌పీడితుడ‌య్యాడు. ఈ విష‌యం గుర్తించిన భూదేవి మ‌హా విష్ణువును ఒక వ‌రం అడిగింది. త‌నే స్వ‌యంగా త‌న పుత్రుడ్ని క‌డ‌తేర్చుతాన‌ని కోరారామె. అందులో భాగంగానే ద్వాప‌ర యుగంలో స‌త్య‌భామ‌గా న‌ర‌కాసుర వ‌ధ చేశారు. అదే మ‌న‌కు దీపావ‌ళి అయ్యింది. ఈ ఇరువురు రాక్ష‌సుల‌కు ద‌ళితుల‌కు సంబంధమే లేదు. బ్ర‌హ్మ రాక్ష‌సుడు అన్న ప‌దంలో శూచించే బ్ర‌హ్మ శ‌బ్ధం కూడా ఇదే. పాండిత్య శోధ‌న‌లో.. ఒక్కోసారి త‌ప్పులు దొర్లి వారికంటూ ఆ జ‌న్మ శాపంగా ల‌భిస్తుంది. దీంతో వారు బ్ర‌హ్మ రాక్ష‌సులై జ‌న‌కంట‌కుల‌వుతారు. అయితే ఇక్క‌డ రావ‌ణాసురుడి విష‌యంలో బ్రాహ్మ‌ణులు తెలుసుకోవ‌ల్సినదేంటంటే అస‌లు దేవ‌త‌ల్లో కూడా బ్రాహ్మ‌ణులు ఎవ‌రూ ఉండ‌రు. శివుడు ఏకంగా జంగ‌మ‌య్య‌, స్మ‌శాన  వాసి. ఆపై ద‌శావ‌తారాల్లో ప‌రుశురామ‌, వామ‌న అవ‌తారాలు త‌ప్ప మిగిలినవ‌న్నీ బ్రాహ్మ‌ణేత‌ర అవ‌తారాలే. బ్రాహ్మ‌ణ అవ‌తారాలైన ప‌రుశురామ‌, వ‌రాహ మూర్తుల‌కు అస‌లు పూజ‌లు, అర్చ‌న‌లే పెద్ద‌గా ఉండ‌వు. బ్రాహ్మ‌ణుల వైదీక‌మంతా న‌డిచేది క్ష‌త్రియ రామ‌, యాద‌వ కృష్ణ‌, ఆపై అర్ధ‌న‌రులైన న‌ర‌సింహ వంటి అవ‌తారాల‌కే. ఇందులోని అర్ధ‌మేంటంటే.. స‌త్య‌భామ‌లా మ‌న‌మూ వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌ద‌ని. త‌ప్పు చేసిన వాడు ఎవ‌రైనా స‌రే స‌మ‌న్యాయం పాటించాలి.  కుల‌మ‌త వ‌ర్గ వైష‌మ్యాల‌కు, రాగ ద్వేషాల‌కు తావు లేద‌న్న ధ‌ర్మం పాటించ‌డంలో భాగంగా.. బ్రాహ్మ‌ణుడైనా.. రావ‌ణుడు త‌ప్పే అన్న‌ది ఎప్ప‌టి నుంచో ఈ బ్రాహ్మ‌ణీకం ఆచ‌రిస్తూ వ‌చ్చిన ఆచారం. ఆపై న‌ర‌కాసురుడి విష‌యంలోనూ ఇదే నియమం. వారు ఆది నుంచీ పాటిస్తూ వ‌స్తున్నారు. ధ‌ర్మ నిబ‌ద్ధులు, బ్ర‌హ్మ జ్ఞానులైతే త‌ప్ప‌క ఆద‌రించాల‌న్న‌ ఆలోచ‌న‌ల్లోంచి పుట్టుకొచ్చిందే రామ‌కృష్ణ‌నార‌సింహ వంటి బ్రాహ్మ‌ణేత‌ర దేవుళ్ల ఆరాధ‌న‌. కాబ‌ట్టి ఈ విష‌యం తెలుసుకోకుండా ఇలా రోడ్లు ఎక్క‌డం స‌రికాదంటారు చాగంటి, గ‌రిక‌పాటి వంటి  పండితోత్త‌ములు!  

వైభవంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు

  ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం వద్ద జెండా ఊపి ఈ ఉత్సవాల శోభాయాత్రను మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.  అనంతరం గిరిజన మహిళలతో కలిసి హొం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దింసా నృత్యం చేశారు. మరోవైపు కళాకారుల పులివేషాలు, నృత్యలు ఆకట్టుకున్నాయి. సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పోటైత్తారు. స్థానిక సంగీత కళాశాలలో కార్యక్రమాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతి పెద్ద జాతరలలో ఒకటి. ప్రతి సంవత్సరం తోలేళ్ల ఉత్సవంతో ప్రారంభమై, ఉయ్యాల కంబాల జాతరతో ముగిసే ఈ సిరిమాను సంబరాలకు ఏర్పాట్లు రెండు నెలల ముందుగానే మొదలవుతాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొనే ఈ వేడుకలు ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.  

నటుడు రాహుల్ రామ‌కృష్ణ వెన‌కున్న శ‌క్తులేవి?

  ద‌స‌రాకు క‌క్కా ముక్క లేద‌ని ఫీలైన వారికి పెద్ద ఎత్తున కిక్కునందించారు అర్జున్ రెడ్డి, జాతిర‌త్నాలు ఫేమ్ రామ‌కృష్ణ‌. సైన్మా అనే త‌రుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింతో లైమ్ లైట్లోకి వ‌చ్చిన రాహుల్ క్ర‌మేపీ వెండితెర‌మీద ఒక చిన్న పాటి న‌టుడిగా  ఎస్టాబ్లిష్ అయిపోయాడు. దానికి తోడు బిగ్గెస్ట్ హిట్స్ లో పార్టిసిపేష‌న్ ఉండ‌టంతో.. రీసెంట్ టైమ్స్- పాపుల‌ర్ ఆర్టిస్టుల్లో త‌ను కూడా ఒక‌రిగా పేరు సాధించారు. తాజాగా ఈయ‌న చేసిన ట్వీట్ ఇటు సోష‌ల్ మీడియా వ‌ర్గాల‌తో పాటు, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఒక క‌ల‌క‌లం చెల‌రేగేలా చేసింది. ఇప్ప‌టికే సారే రావాలంటున్న‌రు.. తెలంగాణ ప‌ల్లెల్లోన అనే పాట‌లు, దేఖ్ లేంగే వంటి డ్యాన్సుల‌తో బీఆర్ఎస్ ఒక టైప్ ఆఫ్ ప్రో అట్మాస్ఫియ‌ర్ క్రియేట్ చేసుకుంటోంది. కార‌ణం ఏంటంటే తాము ఓడిందే  సోష‌ల్ మీడియా ప్ర‌భావం వ‌ల్ల‌. కాబ‌ట్టి ఈ దిశ‌గా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన కేటీఆర్, ఇది వ‌ర‌కే కొంద‌రు సోష‌ల్ మీడియా కూలీల‌ను హైర్ చేస్కున్నారు కూడా.. అందులో భాగంగా ఇటీవ‌ల కొంద‌రు సీఎం రేవంత్ కి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున ట్రోలింగ్ కి పాల్ప‌డ్డ‌ కార‌ణంగా అరెస్టు కావ‌డం తెలిసిందే.  దీంతో ప్లాన్ నెంబ‌ర్ వ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని భావించిన కేటీఆర్ నెక్స్ట్ లెవ‌ల్ లోకి వెళ్లార‌న్న‌ది ఒక టాక్. ఆయ‌న గ‌తంలోనే అన్నారు.. తాను యూట్యూబ్ చానెళ్లు పెట్టుకోకుండా అన‌వ‌స‌రంగా అభివృద్ధి ప‌నులు చేశాన‌ని. దీన్నిబ‌ట్టీ చూస్తే సోష‌ల్ మీడియాను త‌మ‌కు అనుకూలంగా యాక్టివేట్ చేస్కుంటే అది వ‌చ్చే రోజుల్లో మ‌న‌కు పాజిటివ్ వైబ్  క్రియేట్ చేయ‌డం ఖాయం అన్న కోణంలో స్టెప్ బై స్టెప్ కేటీఆర్ ముందుకు వెళ్తున్న‌ట్టుగా తెలుస్తోంది.  బేసిగ్గా కేటీఆర్ కి ట్విట్ట‌ర్ కింగ్ అన్న పేరుంది కాంగ్రెస్ వ‌ర్గాల్లో. అంటే సోష‌ల్ మీడియా వేదిక‌పై యాక్టివ్ గా ఉండే కొంద‌రంటే కొంద‌రు పొలిటీషియ‌న్ల‌లో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఈ విష‌యంలో మ‌రో అడుగు ముందుకేసిన కేటీఆర్.. త‌న గురించి తాను మాత్ర‌మే చెప్పుకుంటే కిక్కేముందీ? అదే మ‌న గురించి ఇత‌రులు చెబితే ఆ లెవ‌లే వేరుగా ఉంటుంద‌ని భావించారో ఏమో.. ఇదిగో.. రాహుల్  రామ‌కృష్ణ వంటి వారిని గిల్లి వ‌దిలిన‌ట్టున్నారని అంటారు కొంద‌రు. ఇటు రాహుల్ కూడా ద‌స‌రా సంద‌ర్భంగా క‌క్కా ముక్కా లేని వైరాగ్యంలో కేసీఆర్ రావాల‌ని జ‌నం కోరుకుంటున్నార‌న్న యాంగిల్లో కామెంట్ల కాక రేపారు. ఇది క్ష‌ణాల్లో వైర‌ల్ కావ‌డంతో త‌న ఖాతా నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది కూడా. ఇంత‌కీ ఏంటీ రాహుల్ రామ‌కృష్ణ ఇంత‌టి వైరాగ్యానికి గ‌ల కార‌ణ‌మ‌ని చూస్తే ఆయ‌న ఐదేళ్ల క్రితం ఒక ట్వీట్ చేశారు. బాల్యంలో తాను అత్యాచారానికి గుర‌య్యానంటూ అప్ప‌ట్లో ఆయ‌న చేసిన ట్వీట్ ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ, కొంద‌రు విశ్లేష‌కులు అంటున్న మాట‌లేంటంటే.. మ‌న‌కు పైకి క‌నిపించేంత జ‌న‌ర‌ల్ కండీష‌న్లో రాహుల్ రామ‌కృష్ణ లేడ‌ని తెలుస్తోంది. ఇక్క‌డ రాహుల్ రామ‌కృష్ణ‌లోని మ‌రో యాంగిల్ ఏంటంటే, గాంధీ కి వ్య‌తిరేకంగానూ కొన్ని కామెంట్లు గుప్పించారాయ‌న‌. ఇది బీజేపీకి వ‌ర్గాల వారికి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అయితే బీఆర్ఎస్, లేదా బీజేపీకి ప్రో కామెంట్లు చేస్తే ఆయ‌న రాజ‌కీయ విధానం ఏంటో స్ప‌ష్టంగా తెలుస్తుంది.  కానీ ఇదేంటీ ఈ రెండూ మిక్స్ చేసి కొట్ట‌డ‌మేంట‌న్న‌ది ఎవ‌రీకీ అర్ధం కావ‌డం లేదు. కొంప‌దీసి ఇదిగానీ బీఆర్ఎస్- బీజేపీలో విలీనం అవుతుంద‌నడానికి సంకేత‌మా? ఏంట‌న్న‌ది కూడా ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. ఎనీహౌ రాహుల్ రామ‌కృష్ణ ఆయ‌న‌కు ఆయ‌న ఏదైనా స్వ‌యంగానే ఈ కామెంట్లు చేశారా? లేక కేటీఆర్ ఇన్ ఫ్లూయెన్స్ తో ఇలాంటి వ్యాఖ్య నిర్మాణం వెలుగులోకి వ‌చ్చిందా? తేలాలంటే మ‌రికొన్నాళ్ల పాటు మ‌నం వేచి చూడాల్సిందే.